బ్యాంకు పీవో పరీక్షల్లో ప్రిలిమినరీ, మెయిన్స్ రెండింటిలో ఒకే సబ్జెక్టులున్నాయి. కాబట్టి అభ్యర్థులు రెండింటికీ కలిపే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ప్రిలిమ్స్ తరువాత మెయిన్స్ పరీక్షకు 20-25 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెయిన్స్ పరీక్షకు కూడా ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. మెయిన్స్కు చదివితే సహజంగానే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పూర్తవుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఆలోగా ప్రిలిమ్స్ విభాగాలతోపాటు మెయిన్స్ విభాగాలు కూడా పూర్తయ్యేవిధంగా చూసుకోవాలి. కొత్తగా బ్యాంక్ పరీక్షలు రాసే అభ్యర్థులు రీజనింగ్, అరిథ్మెటిక్ టాపిక్స్ అన్నీ నేర్చుకొని వీలైనన్ని వివిధ రకాల ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. పూర్తిస్థాయి మోడల్పేపర్లు సమయాన్ని నిర్దేశించుకుని రోజుకు ఒకటైనా తప్పనిసరిగా రాయాలి. గతంలో జరిగిన ఎస్బీఐ పీఓ పరీక్ష ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నలు ఏ తరహా, ఏ స్థాయిలో ఉంటున్నాయో గమనించాలి. తమ ప్రిపరేషన్ ఆ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఒక ప్రణాళికతో, నిబద్ధతగా సన్నద్ధమయితే అత్యధికులు కోరుకునే ఎస్బీఐ పీఓ ఉద్యోగం తప్పకుండా సంపాదించవచ్చు.
అవకాశాలు మరో రెండు...
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 158 క్రెడిట్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ, ఎమ్ఎస్సీ, ఎమ్కాం, ఎమ్ఏ (ఎకనామిక్స్), సీఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హతలు గల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వెల్త్ మేనేజ్మెంట్/ఫైనాన్షియల్ సర్వీసెస్లో కనీసం 3 సంవత్సరాల ఉద్యోగానుభవం గల గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 424 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇతర పోస్టుల కోసం ప్రకటన విడుదలయింది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.