• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు పీఓ.. భలే అవకాశం

ఎస్‌బీఐ నుంచి 2000 పోస్టుల భర్తీకి ప్రకటన

దేశంలోనే అగ్రశ్రేణి బ్యాంకు.. ప్రపంచంలోని 50 అత్యున్నత బ్యాంకుల్లో ఒకటి! అదే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. దీన్నుంచి ఉద్యోగార్థులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్‌ విడుదలయింది. డిగ్రీ విద్యార్హత ఉన్నవారికి ఇది సదవకాశం. ఎస్‌బీఐ నుంచి ఇటీవల విడుదలైన సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ల (సీబీవో) నోటిఫికేషన్‌ నేపథ్యంలో 2020లో పీఓ ప్రకటన విడుదలపై సందేహాలు ఏర్పడ్డాయి. వాటిని నివృత్తి చేస్తూ తాజాగా విడుదలైన ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌లో 2000 పీఓ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. సాధించాలంటే ఏ  ప్రణాళికను పాటించాలో తెలుసుకుందాం!
ఎస్‌బీఐలో పీవోగా ఎంపికైతే రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే స్కేల్‌-I ఆఫీసర్‌ కేడర్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమితులవుతారు. ఈ బ్యాంకు అమలు చేసే అద్భుతమైన ప్రమోషన్‌ పాలసీ కారణంగా.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారు అంచెలంచెలుగా డిఫ్యూటీ మేనేజర్‌ (స్కేల్‌-II), మేనేజర్‌ (స్కేల్‌-III), చీఫ్‌ మేనేజర్‌ (స్కేల్‌-IV), ఏజీఎం (స్కేల్‌-V), డీజీఎం (స్కేల్‌-VI), జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-VII), చీఫ్‌ జనరల్‌ మేనేజర్, డిఫ్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, మేనేజింగ్‌ డైరెక్టర్, చివరకు ఛైర్మన్‌ హోదా వరకూ చేరుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐకు విదేశాల్లోనూ శాఖలు ఉన్నందున సత్తా ఉన్నవారికి ఇతర దేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. 

చివరి సంవత్సరం అభ్యర్థులకు అవకాశం
కొవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో చివరి సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు పూర్తవ్వని/ఫలితాలు వెలువడనందున ఐబీపీఎస్‌ నిర్వహించిన బ్యాంకు పరీక్షలు రాయలేకపోయినవారికి ఈ నోటిఫికేషన్‌లో అవకాశం లభించనుంది. డిసెంబర్‌ 31 వరకు ఫైనల్‌ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

నియామక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక మూడు దశల నియామక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో ఆబ్జెక్టివ్‌ తరహాలోని మెయిన్స్‌ పరీక్ష, డిస్క్రిప్రివ్‌ టెస్ట్,  మూడో దశలో గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ లేదా కేవలం ఇంటర్వ్యూ ఉంటాయి. మొదటి దశ నుంచి పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మంది రెండో దశకు ఎంపికవుతారు. అలాగే రెండో దశ నుంచి పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది  మూడో దశకు ఎంపికవుతారు. ఈ సంఖ్యకు తగిన విధంగా అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులే తదుపరి దశలకు ఎంపికవుతారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో అన్నీ సెక్షన్‌లలో కలిపి ఎగ్రిగేట్‌ మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. వీటికి సెక్షన్‌ల వారీగా కటాఫ్‌ మార్కులు లేవు. ఇది అభ్యర్థులకు ఊరట కలిగించే విషయం.

సమయం సరిపోతుందా?
అభ్యర్థులందరూ ఆందోళనపడుతున్న విషయం- ప్రిలిమినరీకి ఉన్న వ్యవధి సన్నద్ధతకు సరిపోతుందో లేదో అనే! ఎస్‌బీఐ విడుదల చేసే పీవో నోటిఫికేషన్లు అన్నింటిలోనూ ప్రిలిమినరీకి సాధారణంగా రెండు నెలల సమయం ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపు 45 రోజుల వ్యవధే ఉంది. అందుచేత మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు చాలా శ్రమించాల్సిన అవసరం ఉంది. 
ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలో ఉండే ఐదు సబ్జెక్టుల్లో మూడు ప్రిలిమ్స్‌లోనూ ఉంటాయి. వీటికి మెయిన్స్‌ స్థాయిలోనే సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌ సమయం తక్కువున్న కారణంగా ముందుగా వీటిని పూర్తి చేసుకోవాలి. ఆపై మెయిన్స్‌లో ఉన్న ఇతర సబ్జెక్టులకు తయారైతే మంచిది. 
ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్‌ పరీక్షలో ఉన్న జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టులకు సిద్ధమవ్వొచ్చు. సమయం ఉన్న అభ్యర్థులు అన్నింటికీ ఇప్పటినుంచే ప్రిపేర్‌ అవ్వొచ్చు. ఇంతకుముందు నుంచే బ్యాంక్‌ పరీక్షలు రాస్తున్నవారు ఎస్‌బీఐ పీవో పరీక్షకు తగిన విధంగా ఆ స్థాయిలో సన్నద్ధత ఉండేలా చూసుకోవాలి. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్ష ఐబీపీఎస్‌ పీఓ, క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్షల మాదిరే ఉంటుంది. కానీ ప్రశ్నలు కొద్దిగా హెచ్చుస్థాయిలో ఉంటాయి.
అభ్యర్థులు ప్రారంభం నుంచే ప్రతిరోజూ ప్రిలిమినరీ పరీక్ష మోడల్‌పేపర్‌ను నిర్దేశిత సమయం పాటిస్తూ రాస్తూ తమ ప్రతిభ విశ్లేషించుకోవాలి. మెరుగుపడాల్సిన విభాగాలు/అంశాలను గమనిస్తూ తదనుగుణంగా సిద్ధమవ్వాలి. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ ఏయే విభాగాల్లో ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. ముందుగా వాటిని పూర్తిచేసుకోవాలి. తర్వాత తక్కువ సంఖ్యలో ప్రశ్నలు వచ్చే అంశాలకు సిద్ధమవ్వాలి.
ఈ విధంగా వీటన్నింటికీ సిద్ధమవ్వడానికి ప్రతి రోజూ ఎంత సమయం కేటాయించాలో అభ్యర్థులే నిర్ణయించుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవడానికి తక్కువ సమయం ఉన్న ఈ ఎస్‌బీఐ పీవో పరీక్షకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని బాగా శ్రమ పడితేనే దీనిలో విజయం దక్కుతుంది! 
ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో సెక్షన్‌ల వారీగా కటాఫ్‌ మార్కులు లేవు. ఇది అభ్యర్థులకు ఊరట కలిగించే విషయం.

ఒకటే సన్నద్ధత
ఐబీపీఎస్‌ సప్లిమెంటరీ నోటిఫికేషన్లలో పీఓ, ఆర్‌ఆర్‌బీ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాల్సింది- ప్రిలిమ్స్‌ పరీక్షలన్నీ ఆర్‌ఆర్‌బీ మినహా ఒకే తరహాలో ఉండటం. అందుకని ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌ఓ, ఆర్‌ఆర్‌బీ పీఓ, క్లర్క్‌.. ప్రిలిమినరీ పరీక్షలన్నిటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది. ఆర్‌ఆర్‌బీ నుంచి ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్‌ వరకూ ప్రశ్నల స్థాయి పెరుగుతుంది కానీ సిలబస్‌లో పెద్దగా మార్పుండదు.  పరీక్షలన్నీ దాదాపు ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఐబీపీఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్‌ ఎస్‌బీఐ పీఓ పరీక్షక్కూడా కొనసాగించాలి. అయితే ఈ పరీక్షల పూర్వ ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నల స్థాయిలోని తేడా గమనించాలి. హెచ్చు స్థాయిలో ఉండే ఎస్‌బీఐ పీఓ పరీక్షకు తయారైతే ఇతర పరీక్షలకూ సిద్ధమైనట్టే! ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్‌ పరీక్షలు ఒకేలా ఉన్నందున వాటికి కూడా ఒకటే సన్నద్ధత సరిపోతుంది.  

మెయిన్స్‌కు తయారైతే ..

ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాతపరీక్షల్లో ఉన్న 7 విభాగాలను పరిశీలిస్తే ప్రిలిమినరీలో ఉన్న 3 విభాగాలు మెయిన్స్‌లోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో ఉన్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌; మెయిన్స్‌లో ఉన్న డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ ఒకే విభాగానికి చెందినవి. అందుచేత మెయిన్స్‌కు తయారైతే ప్రిలిమ్స్‌ సన్నద్ధత కూడా పూర్తవుతుంది. 
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీలో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్‌ వాల్యూస్, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, పర్ముటేషన్‌-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ ఉంటాయి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌లతో పాటు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఉన్నందున ఇది ముఖ్యమైన విభాగం. అభ్యర్థులు వ్యాకరణంపై పట్టు పెంచుకోవాలి. పాసేజీని వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కోసం లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లను సాధన చేయాలి. 
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: వర్తమాన అంశాలు, బ్యాంకింగ్‌ పదజాలం, స్టాండర్డ్‌ జీకేల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గత ఐదారు నెలల తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి.  
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: మెయిన్స్‌లోని ఈ విభాగం కోసం అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకోవాలి.టేబుల్స్, లైన్‌ గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పై చార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. సాధన బాగా అవసరం. 
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌.. రెండిట్లోనూ రీజనింగ్‌ ఉంది. ఎస్‌బీఐ పీఓ రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవిగా భ్రమింపజేసేలా ఉంటాయి. కంప్యూటర్‌ నుంచి 5-10 ప్రశ్నలు రావొచ్చు.

పీఓ పోస్టుల సంఖ్య: 2000 
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 21-30 సంవత్సరాలు
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 4
ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 31, జనవరి 2, 4, 5
మెయిన్స్‌ పరీక్ష: జనవరి 29, 2021.
వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/web/careers
 

ఇవీ చదవండి..

వెళ‌దామా... వాయుసేన‌లోకి!

మెయిన్స్‌లో మెరిసేదెలా? 

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌