• facebook
  • whatsapp
  • telegram

మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా?

ఎనిమిది సూత్రాలు

712 ఖాళీల భ‌ర్తీకి యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

జూన్ 27న మొద‌టి ద‌శ ప‌రీక్ష‌

సివిల్ సర్వీసెస్.. చాలామంది కల.. ఆశ.. లక్ష్యం. ఎలా నెరవేర్చుకోవాలి? చాలా కష్టం అనేది అపోహా.. నిజమా? ప్రణాళికాబద్ధంగా కష్టపడితే సివిల్స్ సాధన కష్టం అనేది అపోహే. ప్రిపరేషన్లో కావాల్సినంత కష్టపడకపోతే సర్వీస్ సంపాదించడం కష్టం అనేది నిజమే. మొత్తానికి కాస్త శ్రమిస్తే సులభం అనిపిస్తుంది. తేలిగ్గా తీసుకుంటే లక్ష్యం అందనంత దూరంగా కనిపిస్తుంది. కానీ ఎనిమిది అంశాలను గుర్తించి తగిన విధంగా స‌న్న‌ద్ధ‌మ‌యితే మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ సాధించడం అంత కష్టమేమి కాదని నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం 712 ఖాళీలతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది.  ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత‌ప‌రీక్ష‌ల‌తో పాటు ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. జూన్ 27, 2021న ప్రిలిమ్స్ ప‌రీక్ష జ‌రుగ‌నుంది.

సివిల్స్ ప‌రీక్ష‌లో ప్రిలిమ్స్ ద‌శ చాలా కీల‌కం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా వారి స‌న్న‌ద్ధ‌త స్థాయిని అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఈ ద‌శ‌లో ఏమరపాటు అభ్య‌ర్థి స‌న్న‌ద్ధ‌త వ్యూహాన్ని దెబ్బ‌తీస్తుంది. ఈ ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో ల‌క్ష‌లాది మంది పోటీదారుల మ‌ధ్య నెగ్గాలంటే ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో కొన్ని వ్యూహాల‌ను అనుస‌రించాలి. గత కొన్ని సంవత్సరాల అనుభవం ఆధారంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. 

1. మొత్తం సిలబస్‌పై ప‌ట్టు

మొత్తం సిల‌బ‌స్‌లో ఇచ్చిన విభాగాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సిలబస్‌ను సమగ్రంగా ప‌రిశీలించాలి. ఏ భాగాన్నీ వద‌ల‌కూడ‌దు. యూపీఎస్సీలో చాలా సిలబస్ ఉన్న‌ప్ప‌టికీ ఏదైనా ఒక‌భాగానికి చెందిన ప్ర‌శ్న‌లు ఒక్కోసారి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అది అభ్య‌ర్థుల‌కు ఉప‌యోగ‌కరం కావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 2020లో జ‌రిగిన ‌ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో ఎక్కువ ప్ర‌శ్న‌లు ప్రాచీన భార‌త‌దేశం నుంచి వ‌చ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విభాగాన్ని వ‌ద‌ల‌కుండా ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే ఏ భాగం నుంచి ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌చ్చినా అందులో ఎక్కువ స్కోర్ చేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. 

2. మాక్ టెస్ట్‌లకు ప్రాధాన్యం 

సిలబస్‌లో గ‌ణ‌నీయ‌ భాగాన్ని పూర్తి చేసిన తరువాత, తగిన సంఖ్యలో మాక్ (నమూనా) పరీక్షలు రాసేందుకు ప్రయత్నించాలి. అందులో వ‌చ్చిన మార్కులు సహేతుకంగా ఉంటే  అభ్యర్థి ప్రిప‌రేష‌న్ సంతృప్తిక‌రంగా ఉంద‌ని భావించ‌వ‌చ్చు. ఇలాంటి చాలా పరీక్షలు  ప్ర‌తిభ‌ను వెలికి తీస్తాయి. ఫైన‌ల్ ప‌రీక్షలాంటి వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకొని ఈ మాక్ టెస్ట్‌ల‌ను ప్రాక్టీస్ చేయాలి. ఒకే ప్రామాణిక టెస్ట్ సిరీస్‌ల‌ను ఎంచుకోవ‌డం తెలివైన ఆలోచన. ప‌రీక్ష రాసిన త‌ర్వాత దాని విశ్లేషణ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కువ మార్కులు వస్తే ఉత్సాహపడిపోవడం, తక్కువ మార్కులు వస్తే నీరసించిపోవడం వంటివి లేకుండా జాగ్రత్త వహించాలి. నిరంతరం మెరుగుపరుచుకోవ‌డానికి ఈ ప‌ద్ధ‌తి ఒక మంచి మార్గం. ప్రిలిమ్స్ ప‌రీక్ష తేదికి నెల‌ముందు గ్రాండ్ టెస్ట్లు  రాయాలి. అందులో లోపాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో చూసుకుని అవి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆ ప్రకారం ప్రిపరేషన్ ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి. 

3. సరైన పున‌శ్చ‌ర‌ణ‌

ప్రిలిమ్స్ సిలబస్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అంతా కవర్ చేసేయాలనే ఆలోచనకంటే, మొత్తం విషయాన్ని ఏకీకృతం చేయడం ముఖ్యమని గమనించాలి.  పునశ్చర‌ణ‌(రివిజన్) ప్రాధాన్యాన్ని కచ్చితంగా గుర్తించాలి. నిర్ణీత సమయాల్లో తప్పనిసరిగా చేయాలి. సిలబస్ మొత్తాన్ని చదివేయడం కంటే, చదివినంత వరకు పూర్తి పట్టు సాధించడం చాలా అవసరం. అందుకోసం ముందుగా సిల‌బ‌స్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రాధాన్య క్రమాన్ని నిపుణులు, సీనియర్ల సాయంతో గుర్తించాలి. ఆ తర్వాత ఆ ఎంచుకున్న క్రమంలో అధ్యయనం సాగించాలి. గణాంకాలకు సంబంధించి అవసరమైన సవరణలు చేస్తుండాలి. పరీక్ష ముందు వరకు ఈ సవరణలు చేయాల్సి ఉంటుంది. వాటిని సరిగా గుర్తుంచుకోడానికి చివర్లో రివిజన్ చేయడం మంచిది. రివిజ‌న్‌ను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకొందరు చివర్లో ఎప్పుడో మొదలు పెడతారు. దాంతో మళ్లీ ప్రిపర్ అయినంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. దాని వల్ల అభ్యర్థి ఒత్తిడికి గురవుతాడు. అందుకే ఒక క్రమంలో రివిజన్ చేస్తే చివర్లో తేలిగా ఉంటుంది. విశ్వాసం పెరుగుతుంది. 

4. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి

సరైన సొంత నోట్స్ ప్రిపేర్‌ చేసుకోకుండా యూపీఎస్సీ సిలబస్ పూర్తి చేయ‌డం క‌ష్ట‌త‌రం. ప్రిప‌రేష‌న్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి నోట్స్‌ను సరైన విధానంలో తయారు చేసుకోవ‌డం చాలా ముఖ్యం. తద్వారా చదివింది ఒక క్రమంలో అభ్యర్థులు గుర్తుంచుకోవ‌డం, పునశ్చ‌ర‌ణ చేయడం సులభం అవుతుంది.  సొంత నోట్స్ అంటే విషయం అంతా అదే పనిగా రాసేయకూడదు. తక్కువ పదాల్లో ఎక్కువ కవర్ అయ్యే విధంగా రాసుకోవాలి. కొన్నిచోట్ల కోడ్ గుర్తులతో ప్రిపేర్ చేసుకుంటే, అవి మెదడులో ముద్రపడిపోయి బాగా గుర్తుంటాయి. ఇదంతా క్ర‌మ ప‌ద్ద‌తిలో, సిల‌బ‌స్ ప్ర‌కారం ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ప‌రీక్ష‌లో విజ‌యం సాధించే వ‌ర‌కు ఈ నోట్స్ అభ్య‌ర్థుల‌కు నిఘంటువులా ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ ఒక అంశాన్ని తీసుకుని స్నేహితులు, నిపుణుల‌తో చ‌ర్చించేందుకు స‌మ‌యం కేటాయించుకోవాలి.

5. కొత్త పాఠాలు లేదా అంశాల‌ను అన్వేషించడం ఆపాలి

ఇది చాలామంది చేసే పొరపాటు.  ప్రిలిమ్స్ ప‌రీక్ష ముందు చివరి నెల వరకు అందుబాటులో ఉన్న అన్ని కొత్త విషయాలను కవర్ చేయడానికి ప్ర‌య‌త్నిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అప్డేట్ అవడం అవసరమే కానీ అదేపనిగా కొత్తవే చదువుతూ ఉంటే పాతవి మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. పైగా సమయం వృథా కూడా. చివరి పునశ్చరణకు క‌నీసం ఒక నెల కేటాయించుకోవాలి. ఆ సమయంలో అవసరమైనవి తప్ప, కొత్త అంశాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం. ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కు స‌న్న‌ద్ధం కావాలి. కానీ, దానికంటూ ఒక ప్రత్యేక స‌మ‌యం పెట్టుకోవడం అవసరం. 

‌6. సీశాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ప్రిలిమ్స్‌లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ పేప‌ర్‌1 అయితే, సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పేప‌ర్‌2గా ఉంది. ఇందులో కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజిక‌ల్ రీజ‌నింగ్ అండ్ అన‌లిటికల్  ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జ‌న‌ర‌ల్ మెంట‌ల్ ఎబిలిటీ, ప‌దోత‌ర‌గ‌తి స్థాయిలో బేసిక్ న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. అందుకే పేపర్-2ను తేలిగ్గా తీసుకోకూడదు. తగినంత శ్రద్ధ పెట్టి, అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవాలి. ఇబ్బంది అనిపిస్తే జనరల్ స్ట‌డీస్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. కానీ పోటీలో ముందుండాలంటే సీశాట్‌ను జనరల్ స్ట‌డీస్‌తో సమానంగా ప్రిపేర్ కావాలి. పాత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. 

7. గ‌త ప్రశ్నపత్రాల ప్రాక్టీస్

ఇది చాలా ముఖ్యం. గత రెండు, మూడు సంవత్సరాల ‌పేపర్ల‌ను ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా ఏ విభాగాల నుంచి ఎటువంటి ప్ర‌శ్న‌లు ఇస్తున్నారనే విష‌యాన్ని గమనించవచ్చు. అప్పటికి అభ్యర్థి ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. తగిన మార్పులు చేసుకొని ముందుకెళ్లవచ్చు. విజయానికి సంబంధింని ధీమా ఈ దశలోనే ఏర్పడుతుంది. ప్రాక్టీస్ వల్ల అభ్య‌ర్థి జ్ఞానం పెరగడమే కాకుండా,  సరైన మానసిక దృక్పథం అలవడుతుంది.  ఆలోచించి స‌మాధానం గుర్తించే ధోర‌ణి పెరుగుతుంది. ప్రధానంగా ప్రశ్నల సరళి తెలుస్తుంది. 

8. వ‌ర్త‌మాన వ్యవహారాలు కీల‌కం

ప్రిప‌రేష‌న్‌లోని పలు అంశాలకు వర్తమాన వ్యవహారాలను జోడించకపోతే ప్రయోజనం దెబ్బతింటుంది.  అందుకే కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకమని అభ్యర్థులు గ్రహించాలి. వార్తల కోసం ఒక ప్రామాణిక దినపత్రిక, ఒక నెలవారీ పత్రిక, ఇండియన్ ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పీఐబీ, యోజ‌న‌వంటి వాటిని వర్తమాన వ్యవహారాల కోసం అధ్యయనం చేయాలి. ప్రతి రోజూ దీని కోసం తప్పకుండా సమయం కేటాయించాలి. కరెంట్ అఫైర్స్ పేరుతో గంటలు గంటలు సమయం వృథా చేయకూడదు. హద్దులు గుర్తించాలి. అన్నీ పేపర్లు, పత్రికలు అదేపనిగా చదివేస్తూ ఉండకూడదు. అవసరమైనంత మేరకు వేగంగా అధ్యయనం సాగించడం, కావాల్సిన నోట్స్ రాసుకోవడం వరకే చేయాలి. లేదంటే చివర్లో అనవసరమైన గందరగోళం, ఒత్తిడి, ఆందోళన తలెత్తే అవకాశం ఉంటుంది. 

50 శాతం మించి స్కోరు సాధ్యం కాదని గుర్తించాలి

మొద‌టిసారి ప్రాథ‌మిక ‌ప‌రీక్ష రాయ‌బోయే అభ్య‌ర్థులు సివిల్స్‌లో 50 శాతం మించి స్కోరు చేయ‌డం ఎవ‌రికీ సాధ్యం కాద‌నే విష‌యాన్ని గుర్తించాలి. అన‌వ‌స‌రంగా ఆ స్కోర్‌కు మించి మార్కులు సాధించించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ ఒత్తిడికి గురికాకూడదు. మొద‌ట ఎన్‌సీఈఆర్‌టీ పుస్త‌కాలు చ‌ద‌వాలి. త‌ర్వాత సంబంధిత ‌ప్ర‌శ్నాప‌త్రాలు ప్రాక్టీస్ చేసి అందులో ఎంత స్కోర్ చేయ‌గ‌లుగుతున్నారో చూసుకోవాలి. ఏ విభాగం నుంచి ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయ‌నే విష‌యంపై అవ‌గాహ‌న తెచ్చుకోవాలి. వ‌రుస‌గా ఎకాన‌మీ, హిస్ట‌రీ, పాలిటీ నుంచి ప్రాధాన్య‌ క్ర‌మంలో ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి కాబట్టి ముందుగా వీటిపై దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి సంవ‌త్స‌రం క్రితం వ‌ర్త‌మాన అంశాలపై వేరుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని కోర్ సబ్జెక్టుల‌కు అనుసంధానం చేసుకొని చ‌ద‌వాలి. వీటిపై ఎటువంటి ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉందో ‌అభ్య‌ర్థులు విశ్లేషించుకోవాలి. ప‌రీక్ష‌లో ఎక్కువ మంది ప్ర‌భావితమ‌య్యే అంశాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి అలాంటి వాటిని గుర్తించి సన్నద్ధత సాగించాలి.

ప్రిలిమ్స్ ప‌రీక్ష తేదీకి రెండు లేదా రెండున్న‌ర‌నెల‌ల ముందు నుంచి ఎక్కువ స‌మ‌యం కేటాయించాలి. మొత్తం సిలబ‌స్ పూర్తి చేశామ‌నుకుంటే రివిజ‌న్ మొద‌లుపెట్టాలి. ప్ర‌ముఖ ‌ఇన్‌స్టిట్యూట్‌లు అందించే అన్ని క్వ‌శ్చ‌న్ బ్యాంక్‌లను ప్రాక్టీస్ చేయాలి. అందులో ఎన్ని ప్ర‌శ్న‌లు చేయ‌గ‌లుగుతున్నామో బేరీజు వేసుకొని ఆ లోపాల‌ను స‌రి చేసుకోవాలి. త‌ర్వాతే ఎక్కువ‌ స్కోర్ చేయడం ఎలా అని ఆలోచించాలి. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యవంత‌మ‌య్యేందుకు కృషి చేయాలి. అది ఒక్కోసారి అంద‌ర‌కీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. దానికి చ‌దువు, అనుభవం అవ‌స‌రం. మోడ‌ల్ పేప‌ర్లు త‌రచూ ప్రాక్టీస్ చేయ‌డ‌మే ప‌రిష్కార మార్గం. నిపుణుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవాలి. ఏటా పేప‌ర్‌2 కొద్ది కొద్దిగా కఠినంగా ఇస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రిపరేషన్లో జాగ్రత్త వహించాలి. ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ కంటే మ్యాథ‌మెటిక‌ల్ స‌బ్జెక్టు మీద దృష్టి పెడితే ఎక్కువ స్కోర్ చేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. రెండు, మూడుసార్లు ప్ర‌య‌త్నించాలంటే చాలా ఓపిక ఉండాలి. ఈసారి తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి 80 వేల నుంచి 90 వేల మంది దరఖాస్తు చేసుకునే వీలుందని భావిస్తున్నారు. అందులో సుమారు 30 వేల మంది ప‌రీక్షకు హాజ‌రవుతార‌ని అంచనా.

ప‌రీక్ష స్వ‌రూపం

యూపీఎస్సీ నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష మూడు అంచె‌ల్లో ఉంటుంది. మొద‌టి ద‌శ ప్రిలిమ్స్. ఇది మొత్తం 400 మార్కుల‌కు బ‌హుళ ఐచ్చిక ప్ర‌శ్న‌ల రూపంలో ఉంటుంది. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. ఒక్కో పేప‌ర్‌లో 200 ప్ర‌శ్న‌లను రెండు గంట‌ల స‌మ‌యంలో పూర్తి చేయాలి. ఒక ప్ర‌శ్న‌కు ఒక మార్కు. త‌ప్పు స‌మాధానికి రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. పేప‌ర్‌1లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు, పేప‌ర్‌2లో ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టుపై ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీన్ని సీశాట్ పేప‌ర్‌‌ అంటారు. ఇది అర్హ‌త ప‌రీక్ష మాత్ర‌మే. రెండో ద‌శ‌లో మెయిన్స్ నిర్వ‌హిస్తారు. ఇది వ్యాస‌రూప ప‌రీక్ష‌. ఇందులో క్వాలిఫైయింగ్ పేప‌ర్ ఏ, బి కాకుండా ఏడు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్ ఏ,బి 300 మార్కుల చొప్పున 600 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. పేప‌ర్-ఏ లో రాజ్యాంగం గుర్తించిన ఏదైనా భాష‌ను ఎంచుకుని ప‌రీక్ష రాయ‌వ‌చ్చు. పేప‌ర్-బి ఇంగ్లిష్ స‌బ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఈ రెండు పేప‌ర్ల‌లోని మార్కుల‌ను తుది ఎంపికలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. మిగతా ఏడు పేప‌ర్లు క‌లిపి 1750 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. ఒక్కో పేప‌ర్ 250 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూ 275 మార్కుల‌తో క‌లిపి మొత్తం ప‌రీక్ష 2025 మార్కుల‌కు ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

అభ్య‌ర్థులు చివ‌రి తేదీ వ‌ర‌కు వేచి చూడ‌కుండా ఎంత వీలైతే అంత తొంద‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే మంచిది. తెలుగు రాష్ట్రాల్లోని ప‌రీక్షా కేంద్రాల సామ‌ర్థ్యం ప‌రిమిత సంఖ్య‌లో ఉంది. కాబట్టి ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి మొద‌టి ఆప్ష‌న్ ఇచ్చిన‌ న‌గ‌రంలోనే ప‌రీక్ష రాసే అవ‌కాశం రావ‌చ్చు.‌

ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు నిబంధ‌న‌ల ప్ర‌కారం సంబంధిత ధ్రువ‌ప‌త్రాల చివ‌రి తేదీలను చూసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. గ‌డువు ముగిసిన ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

అప్లికేష‌న్ ఫారం నింపే స‌మ‌యంలో త‌ప్పులు దొర్ల‌కుండా చూసుకోవాలి. ఒక‌వేళ త‌ప్పులు దొర్లిన‌ట్ల‌యితే మ‌ళ్లీ కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్ ఫారం పూర్తి చేసి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే దానిని ప‌రీక్ష అటెంప్ట్ కింద భావించ‌రు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు హాజ‌రైతేనే దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

పూర్తి నోటిఫికేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి

యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/‌

 

 

 

 

 

 

- వి. గోపాల‌కృష్ణ‌,

వ్యవస్థాపక డైరెక్టర్,

బ్రెయిన్‌-ట్రీ సివిల్ స‌ర్వీసెస్ కోచింగ్ సెంట‌ర్‌,

హైద‌రాబాద్‌.

Posted Date : 08-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌