• facebook
  • whatsapp
  • telegram

Civil Service Results: సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

* తెలుగు రాష్ట్రాల్లో 20వ ర్యాంకుతో టాపర్‌గా వరంగల్‌ అమ్మాయి శ్రీజ

* ఏపీ నుంచి అన్నదమ్ములు జగత్‌సాయి, వసంత్‌కుమార్‌ ఎంపిక

* తెలంగాణ, ఏపీ నుంచే 40 మంది

ఈనాడు, దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలుగు అభ్యర్థులు  సత్తా చాటారు. వందలోపు ర్యాంకుల్లో ఎనిమిది మంది నిలిచారు. అందులో అయిదుగురు అమ్మాయిలు కావడం విశేషం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  నుంచి కనీసం 40 మంది ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం.  
హైదరాబాద్‌లో స్థిరపడిన వరంగల్‌కు చెందిన శ్రీజ 20వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ 170వ ర్యాంకు సాధించడం విశేషం. సివిల్స్‌ శిక్షణా నిపుణుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు 40 మంది ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. దేశవ్యాప్తంగా 761 మంది జయకేతనం ఎగురవేశారు. మొత్తం 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ మేరకు సివిల్‌ సర్వీసెస్‌ - 2020 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సెప్టెంబ‌రు 24న‌ వెల్లడించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ, బి ఉద్యోగాలకు కలిపి 761 మంది ఎంపికైనట్లు తెలిపింది. 15 రోజుల్లో మార్కులను వెల్లడించనున్నట్లు ప్రకటించింది. బిహార్‌కు చెందిన శుభంకుమార్‌ (24) తొలి ర్యాంకుతో సత్తా చాటారు. ఆయన బాంబే ఐఐటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలో 290వ ర్యాంకు సాధించిన శుభం మూడో సారి మొదటి స్థానంలో నిలిచారు.  భోపాల్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చదివిన జాగ్రతి అవస్థి రెండో ర్యాంకు సాధించారు. అంకితా జైన్‌ మూడో స్థానంలో నిలిచారు. సివిల్‌ సర్వీసెస్‌కు అర్హత సాధించిన వారిలో 263 మంది జనరల్‌, 86 మంది ఈడబ్ల్యూఎస్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీ కేటగిరీకి చెందినవారున్నారు. మరో 150 మందిని రిజర్వ్‌లిస్ట్‌లో ఉంచారు. 761 మందిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. వీరితో మెరిట్‌ ప్రాతిపదికన ప్రస్తుతం ఖాళీగా ఉన్న 180 ఐఏఎస్‌, 200 ఐపీఎస్‌, 36 ఐఎఫ్‌ఎస్‌, 302 సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ, 118 గ్రూప్‌-బి పోస్టులను భర్తీచేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఫలితాలు దిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్స్‌ 5153/2020, 7351/2020లో వచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని యూపీఎస్సీ ప్రకటించింది.
 

మొదటి ప్రయత్నంలోనే

మాది వరంగల్‌. నా చిన్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో స్థిరపడ్డాం. నాన్న శ్రీనివాస్‌ హబ్సిగూడలో హోండా షోరూంలో సూపర్‌వైజర్‌ . అమ్మ లత జనగామ జిల్లా రఘునాథపల్లి పీహెచ్‌సీలో ఒప్పంద ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. పరిపాలనా పరమైన విభాగంలో ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్న ఉద్దేశంతో సివిల్స్‌ - 2020 రాశా. మొదటి నుంచి ప్రిలిమ్స్‌ కోసం కాకుండా మెయిన్స్‌ లక్ష్యంగా ప్రిపేర్‌ అయ్యా. రోజుకు ఐదారు గంటలు చదివాను. ఆప్షనల్‌ సబ్జెక్టుగా మెడికల్‌ సైన్స్‌ ఎంచుకున్నా. ఆన్‌లైన్‌ వనరులను వినియోగించుకున్నా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. డాక్టర్‌ చదివినా.. నాన్న కోరిక మేరకు సివిల్స్‌ రాశా.- పి.శ్రీజ (20వ ర్యాంకు)
 

ప్రజలకు సేవచేయడమే లక్ష్యం

మాది కర్నూలు జిల్లా బండిఆత్మకూరు నారాయణపురం.నాన్న చంద్రశేఖరరావు పవర్‌గ్రిడ్‌లో జనరల్‌ మేనేజర్‌. పంజాజ్‌లో పనిచేస్తున్నారు. అమ్మ అరుణ. ప్రస్తుతం ఐపీఎస్‌గా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఏఎస్‌ లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాశా. వారణాసిలో ఐఐటీబీహెచ్‌యూ పూర్తి చేశాను. బెంగళూరులోని శ్యామ్‌సంగ్‌ రీసెర్చ్‌లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశా. ఎలాగైనా సివిల్స్‌ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగం వదిలి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ప్రజలకు సేవచేయాలన్న కోరికతోనే ఉద్యోగం వదిలి పట్టుదలతో సివిల్స్‌కు ప్రయత్నించా.- మేఘ స్వరూప్‌, 31వ ర్యాంకర్‌
 

ఐఎఫ్‌ఎస్‌ కల సాకారమైంది

మాది చిత్తూరు జిల్లా మదనపల్లె. నాన్న కొత్తపల్లె ఉపసర్పంచి నందకుమార్‌. అమ్మ భరణిదేవి. మొదట సివిల్స్‌ పరీక్ష  గురించి తెలుసుకునేందుకు రాశా. తర్వాత ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ప్రిపేరవుతూ 2020లో రాసి ర్యాంకు సాధించా. మొదటి ఆప్షన్‌గా ఇండియన్‌ ఫారిస్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌), రెండో ఆప్షన్‌గా ఏఐఎస్‌ను ఎంచుకున్నా. ఇప్పుడు 48వ ర్యాంకు రావడంతో నేను కోరుకున్న ఐఎఫ్‌ఎస్‌లో చేరే అవకాశం వచ్చింది. గతంలో ఫారిన్‌కు వెళ్లి ఎంఎస్‌ చేయాలనుకున్నా. మన దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆ ఆలోచనను విరమించుకొని కష్టపడి సివిల్స్‌ రాశా. రిషివ్యాలీలో ఉన్న క్రమశిక్షణ, అక్కడి విద్యాభ్యాసం, ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న మెలకువలు ర్యాంకు సాధనకు దోహదపడ్డాయి. - సాయిమానస, 48వ ర్యాంకు
 

తొలిసారి ప్రిలిమినరీ కూడా నెగ్గలేకపోయా

నేను 2019లో మొదటిసారి ప్రయత్నించా. ప్రిలిమినరీ కూడా దాటలేకపోయా. 12వ తరగతి వరకు ఖైరతాబాద్‌ నాసర్‌ పాఠశాలలో చదివా. తర్వాత దిల్లీ లేడీ శ్రీరామ్‌ కళాశాలలో బీకాం ఆనర్స్‌ పూర్తి చేశాను. అనంతరం నాలుగేళ్లపాటు డెలాయిట్‌లో ఉద్యోగం చేశాను. 2019లో సరైన మార్గదర్శకం లేక ప్రయత్నించి విఫలమయ్యా. రెండో సారి 66వ ర్యాంకు సాధించాను. కామర్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నా. బ్రెయిన్‌ ట్రీ గోపాలకృష్ణ మార్గదర్శకం కూడా లాభించింది. ఐపీఎస్‌ మహేశ్‌భగవత్‌ వద్ద మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యా.- అనీషా శ్రీవాత్సవ, 66వ ర్యాంకు
 

లక్ష్యం సాధించా

మాది కడప జిల్లా. పాత కడప మోడమీదపల్లి గ్రామం. నాన్న మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆల్విన్‌ కంపెనీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి హేమలత గృహిణి. తాతయ్య బి.ఈశ్వర్‌రెడ్డి  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్జిగా పనిచేశారు. కాన్పూర్‌లో ఐఐటీ పూర్తి చేశా. ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా దిల్లీకి వెళ్లి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నా. మూడేళ్ల కిందట రాసిన పరీక్షలో 465వ ర్యాంకు సాధించి కేరళ రాష్ట్రం కన్నూర్‌ జిల్లాలో మిలటరీ కంటోన్మెంట్‌లో సీఈవోగా పనిచేస్తున్నా. ఇటీవల 75వ ర్యాంకు సాధించి నా లక్ష్యం నెరవేర్చుకున్నా.

- దేవగుడి మౌనిక, 75వ ర్యాంకు

 

ఉద్యోగం మానేసి ప్రిపేర్‌ అయ్యా

2016లో ఎన్‌ఐటీ వరంగల్‌ నుంచి బీటెక్‌ పూర్తయ్యింది. లఖ్‌నవూ ఐఐఎంలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత ఏడాదిపాటు ఐటీసీ మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేశా. 2019లో ఉద్యోగం మానేసి ప్రిపరేషన్‌ ప్రారంభించా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించా. ఆప్షనల్‌ సబ్జెక్టుగా సోషియాలజీ ఎంచుకున్నా. మాది వికారాబాద్‌ జిల్లా తాండూరు. నాన్న రాములు విద్యుత్తు శాఖలో సంచాలకుడి(వాణిజ్యం)గా పనిచేస్తుండగా అమ్మ సుజాత ఎస్‌బీఐలో చీఫ్‌ మేనేజర్‌. తొలుత ఏడాదిపాటు దిల్లీలో ఉండి ప్రిపేరయ్యా. కరోనా తర్వాత ఇంటి వద్దనే ఉండి చదివాను. సాధారణ సమయంలో 8 గంటలు.. మెయిన్స్‌ సమయంలో రోజుకు 10 గంటలు కేటాయించా.

- కావలి మేఘన, 83వ ర్యాంకు
 

ఎలాంటి శిక్షణ లేకుండా చదివాను

మాది కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మండలం కలగొట్లపల్లి గ్రామం. తండ్రి చల్లపల్లి పుల్లారెడ్డి రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. నేను రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. 2019లో ప్రయత్నించా.. ప్రిలిమ్స్‌ కాలేదు. 2016లో జేఎన్‌టీయూ కాకినాడ నుంచి బీటెక్‌ పూర్తి చేశాను. 2018లో గ్రూప్‌-1(ఏపీ) మూడో ర్యాంకు సాధించా. ప్రస్తుతం కర్నూలులో రాష్ట్ర పన్నుల విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నా. ఎలాంటి కోచింగ్‌ లేకుండా చదివాను. ఎక్కువగా ఇంటర్నెట్‌పై ఆధారపడ్డా. గతంలో ర్యాంకులు సాధించిన విజేతల నోట్స్‌, కోచింగ్‌ సంస్థలకు సంబంధించి మెటీరియల్‌ చదివాను. మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యా.    - సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, 93వ ర్యాంకు
 

ఔరా.. అన్న‘దమ్ము’లు!

సివిల్స్‌ తుది ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అన్నయ్య రాళ్లపల్లి జగత్‌సాయి 32, తమ్ముడు వసంత్‌ కుమార్‌ 170వ ర్యాంకులతో మెరిశారు. 

ప్రయత్నంలో ఓడిపోలేదు

రాళ్లపల్లి జగత్‌సాయి రాయవేలూరు విట్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో విప్రోలో ఉద్యోగం వచ్చింది. ఏడాది పాటు పుణే, చెన్నైలో ఉద్యోగం చేసినా సంతృప్తి అనిపించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సివిల్స్‌ సాధనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ విజయానికి ముందు నాలుగుసార్లు  వైఫల్యాలు వెక్కిరించినా వెన్నుచూపలేదు. హైదరాబాద్‌, దిల్లీల్లో శిక్షణ పొందారు. రోజుకు 10 - 12 గంటల చదివారు. చదివిన అంశాలను తమ్ముడు వసంత్‌కుమార్‌తో చర్చించేవారు. చిన్నతనం నుంచి అన్నయ్యకు తల్లిదండ్రులు కలిగించే ప్రేరణతోనే వసంత్‌కుమార్‌ స్ఫూర్తిపొందారు. విశాఖ గాయత్రి విద్యాపరిషత్తులో ఇంజనీరింగ్‌ చేశారు. అది పూర్తికాగానే అన్నయ్య దిల్లీలో శిక్షణ తీసుకుంటున్న చోటే చేరారు. స్వతహాగా సివిల్స్‌పైన ఉన్న మక్కువ, కష్టపడేతత్వం, అన్నయ్య అనుభవం ఇలా అన్ని వసంత్‌కు కలిసొచ్చాయి. దీంతో రెండో ప్రయత్నంలోనే 170వ ర్యాంకుతో విజేత నిలిచారు. 

                                      - రాళ్లపల్లి జగత్‌సాయి

నమ్మకమే గెలిపిస్తుంది

సివిల్స్‌ సన్నద్ధత సమయంలో ఎక్కువ సార్లు వైఫల్యాలు వచ్చినప్పుడు నిరాశ కలిగేది. కానీ సాధించగలం అన్న నమ్మకం మాత్రం ఎప్పుడు సన్నగిల్లలేదు. అమ్మానాన్నలే మాకు పెద్ద ప్రేరణ. ప్రజలకు సేవ చేయడానికి ఇంతకు మించిన అవకాశం లేదని అమ్మ చెప్పిన మాటలే మమ్మల్ని నడిపించాయి.

                               - రాళ్లపల్లి వసంతకుమార్‌

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

మెయిన్స్‌లో మెరిసేదెలా? 

ప్రిలిమ్స్‌ వ్యూహం!

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌

Posted Date : 25-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌