• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్య ఉచితం..  ప్రభుత్వ ఉద్యోగం ఖాయం

యూపీఎస్సీ ఎన్ డీఏ అండ్ ఎన్ ఏ (1) - 2021  నోటిఫికేషన్ విడుదల

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్

రక్షణ రంగంలో విధులు నిర్వహించే ప్రతి సైనికుడు ఒక హీరోలాగా అనిపిస్తాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనగానే ఎవరికైనా ఛాతీ ఆటోమేటిగ్గా అరంగుళం పెరిగిపోతుంది. గౌరవం, ఆరాధన నిండిన కళ్లతో సమాజం ఒక సోల్జర్ ను చూస్తుంది. అంతటి ఉదాత్తమైన ఉద్యోగాలు కాబట్టే  డిఫెన్స్ రంగానికి యువతలో ఎప్పటికీ తరగని ఆకర్షణ ఉంటోంది.  దేశానికి సేవ చేయడంతోపాటు మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇలాంటి ఉద్యోగాలు చక్కటి అవకాశాలు. ఈ ఖాళీల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2021 సంవత్సరానికి మొదటి విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 2 జనవరి 2022 నుంచి ప్రారంభమయ్యే 147వ కోర్సులో, 109వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు. 

అత్యుత్తమ శిక్షణ అనంతరం దేశ రక్షణ బాధ్యతలను ఉద్యోగంగా చేపట్టే ఈ అవకాశాన్ని అందుకోవాలంటే పరీక్ష విధానంపై సరైన అవగాహన పెంపొందించుకోవాలి. తగిన ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకోవాలి. 

400 ఖాళీలు

మొత్తం 400 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ  పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏర్ ఫోర్స్ 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు.  నేవల్ అకాడమీ (10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ) ఖాళీలు 30 ఉన్నాయి. 

ఎవరు అర్హులు?

ఈ కోర్సులకు కేవలం బాలురు మాత్రమే అర్హులు. వారూ అవివాహితులై ఉండాలి. ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే. 

దరఖాస్తు ఎలా?

దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాలి. అప్లై చేసిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు ఉపసంహరించుకోవానుకుంటే చేసుకోవచ్చు. ఇటీవల ఆ సౌకర్యాన్నీ యూపీఎస్సీ కల్పించింది.  అభ్యర్థులు 2 జులై, 2002కి ముందు, 1 జులై, 2005కి తర్వాత పుట్టి ఉండకూడదు. నిర్ణీత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. 

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 

1) రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ తరహా)

2) ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). దీంట్లో ఇంగ్లిష్కు 200, జనరల్ నాలెడ్జ్కు 400 మార్కుల చొప్పున కేటాయించారు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ నుంచి 100, కెమిస్ట్రీ నుంచి 60, జనరల్ సైన్స్ నుంచి 40, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు తదితరా నుంచి 80, భూగోళ శాస్త్రం నుంచి 80, వర్తమానాంశాల నుంచి 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు.  రుణాత్మక మార్కులుంటాయి. వర్తమాన వ్యవహారాలు మినహా మిగతా ప్రశ్నలు దాదాపు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే వస్తాయి. 

రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ ఎస్ బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా తొలిరోజు ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ర్యాటింగ్ (ఓఐఆర్), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్ష‌న్‌ టెస్ట్ (పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మిగిలిన 4 రోజులు ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్ డోర్ గ్రూప్ టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్ ఎస్ బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి. 

సన్నద్ధతకు సూచనలు

సీబీఎస్ఈ 11,12 తరగతుల పుస్తకాలను క్షుణ్ణంగా చదవడంతోపాటు 8,9,10 తరగతుల పాఠ్యాంశాలనూ చదవాలి. ప్రాథమికాంశాలతో అధ్యయం ప్రారంభించాలి. వీటిపై పట్టు సాధిస్తే ప్రశ్న ఏ విధంగా అడిగినా సులభంగా జవాబు గుర్తించవచ్చు.  పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన ఏర్పడుతుంది. రోజుకొకటి మాక్ పరీక్ష రాస్తే జవాబులు గుర్తించడంలో వేగం, కచ్చితత్వం అలవడుతుంది. ఏయే విభాగంలో వెనుకబడుతున్నామో తెలుసుకొని మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి జవాబులు తెలియని ప్రశ్నలను వదిలేయడమే ఉత్తమం.

గణితం; మ్యాథ్స్ ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. సాధనతోనే ఆ సమయాన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించే విధానం తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి చివర్లో సమయం ఉంటేనే వాటి జోలికి వెళ్లాలి. గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో మ్యాట్రిసెస్ అండ్ డిటెర్మినేంట్స్ నుంచి 30, ట్రిగనోమెట్రీ 30, కాల్క్యులస్ 20, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 20, ప్రాబబిలిటీ 10, కాంప్లెక్స్ నంబర్స్ 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఆయా చాప్టర్ల నుంచి వస్తోన్న ప్రశ్నల ప్రకారం సన్నద్ధం కావాలి. 

ఫిజిక్స్; ఫిజిక్స్ లో ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఆయా సూత్రాల అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ ను ఒక క్రమంలో సిద్ధం చేసుకొని అధ్యయనం సాగించాలి. తరచూ పునశ్చరణ చాలా ముఖ్యం. 
రసాయన శాస్త్రం; రసాయన శాస్త్రంలో మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలు తదితర అధ్యాయాలపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పదజాలాన్ని అర్థం చేసుకోవడంతోపాటు మరచిపోకుండా ఉండాలంటే స్వయంగా కొన్ని సంకేతాలను ఏర్పరచుకొని చదవాలి. రివిజన్ చేయడం మరచిపోకూడదు. 

ఇంగ్లిష్; ఆంగ్ల వ్యాకరణం, పదసంపద కొన్ని రోజుల్లోనే నేర్చుకోవడం సాధ్యం కాదు. వీటి కోసం ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలి. కొత్త పదాలను తెలుసుకోవాలి. ఇంగ్లిష్ లో సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌, సెలెక్టింగ్ వర్డ్స్ లో పదేసి చొప్పున ప్రశ్నలు రావచ్చు. అలాగే వాక్యంలోని పదాలను ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుని గుర్తించడం, కాంప్రహెన్షన్ పైనా దృష్టి పెట్టాలి.

కరెంట్ అఫైర్స్; కరెంట్ అఫైర్స్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. వీటి కోసం నిత్యం దినపత్రికలు చదవాలి. అభ్యర్థులు స్పోర్ట్స్, ఆర్ట్స్, లిటరేచర్ వార్తలపై కూడా దృష్టి పెట్టాలి. 

మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీలకు పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి. ఎంసెట్, జేఈఈ పాత ప్రశ్నపత్రాలనూ ప్రాక్టీస్ చేయవచ్చు. 

చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్ సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఆయా సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్టీ 8, 9, 10 తరగతులతోపాటు ప్లస్ వన్, ప్లస్ టు పుస్తకాలను అధ్యయనం చేయవచ్చు. 

ఇంటర్వ్యూలో ఒక అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఏమేరకు ఉన్నాయో గమనిస్తారు. ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పాలి. భారత రక్షణ రంగంలోని విభాగాలు, అధికారులు, విధులు, ప్రత్యేక సంస్థలు  తదితరాలపై అవగాహన పెంచుకోవడం మంచిది. 

కోర్సుల‌కు ఎంపికైతే..

నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. అలా ఎంపికైన‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో  తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌ద‌వ‌చ్చు. అకడమిక్ కోర్సు, ఫిజికల్ శిక్షణలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి న్యూదిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యం డిగ్రీల‌ను ప్ర‌దానం చేస్తుంది. 

శిక్ష‌ణ ఎక్క‌డ? ఎలా? 

తుది అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, పుణెలో చ‌దువు, శిక్ష‌ణ పొందుతారు. అనంత‌రం ఆర్మీ క్యాడెట్ల‌ను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీకి; నేవ‌ల్‌‌ క్యాడెట్ల‌ను ఎజిమ‌ల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ల‌ను హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీకి సంబంధిత ట్రేడ్ శిక్ష‌ణ కోసం పంపుతారు. అభ్య‌ర్థి ఎంపికైన విభాగాన్ని బ‌ట్టి ఈ శిక్ష‌ణ ఏడాది నుంచి 18 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. ఈ స‌మ‌యంలో అభ్య‌ర్థులకు నెల‌కు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. కోర్సు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అప్పుడు వేతనం నెలకు రూ.ల‌క్ష పైనే ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు, అలవెన్సులు అందుతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది. రెండేళ్లు, ఆరేళ్లు, పదమూడేళ్ల సర్వీస్ తో ప్రమోషన్లు పొంద‌వచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి చీఫ్ అయ్యే అవకాశాలూ ఉంటాయి. 

దరఖాస్తు కు చివరి తేదీ: 19 జనవరి, 2021. దరఖాస్తులను 27 జనవరి, 2021 నుంచి 2 ఫిబ్రవరి, 2021 లోపు ఉపసంహరించుకోవచ్చు.

ఆన్ లైన్ రాత పరీక్ష: 18 ఏప్రిల్, 2021న జరుగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు కోర్సులు 2 జనవరి, 2022 నుంచి ప్రారంభమవుతాయి. 

వెబ్ సైట్: https://upsconline.nic.in/

రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ తేదీలు, కేటాయించిన ఎస్ ఎస్ బీ సెంటర్ల వివరాల కోసం ఈ కింది వెబ్ సైట్లను పరిశీలించాలి.

www.joinindianarmy.nic.in

www.joinindiannavy.gov.in

www.careerindianairforce.cdac.in
 

Posted Date : 27-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌