• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తి

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తిలో భాగంగా- కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ, బక్సార్ యుద్ధాలు, ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంగ్ల-మైసూర్ యుద్ధాలు - కారణాలు - ఫలితాలు - పోరాటాలలో విజయసాధనకు బ్రిటిష్‌వారి కుట్రలు - అవినీతి పాత్ర తదితర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
 

ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు
*    క్రీ.శ. 1769 నుంచి మూడు దశాబ్దాలపాటు ఆంగ్లేయులకు, మైసూర్ పాలకులకు మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు అంటారు.
*    ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు మొత్తం నాలుగు జరిగాయి.
*    దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్న రాజ్యాలలో మైసూర్ ప్రముఖమైంది.
*    మైసూర్ తరఫున హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ పోరాటపటిమ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం.
*    'ఔరంగజేబు మరణానంతరం 150 సంవత్సరాల భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరే భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఏ సందర్భంగా కూడా విదేశీయుల సహాయాన్ని అర్థించనివారు' అని ఆంగ్లేయులే పేర్కొన్నారు.

మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1766-1769)
కారణాలు :
*    భారతదేశం నుంచి ఆంగ్లేయులను పారదోలాలనే హైదర్ఆలీ ఆశయం.
*    హైదర్ఆలీ ద్వారా తమకు ప్రమాదం ఎదురవుతుందని ఆంగ్లేయులు గ్రహించారు.
*    హైదర్ఆలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.
*    హైదర్ఆలీ త్రైపాక్షిక ఒప్పందాన్ని విఫలంచేసి, ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు.

యుద్ధ విశేషాలు :
*    బ్రిటిష్‌వారి స్థావరమైన మద్రాసు సమీపం వరకు హైదర్ఆలీ పలు ప్రాంతాలు ఆక్రమించాడు. మద్రాసును ఆక్రమించుకునే సమయంలో ఆంగ్లేయులు నిస్సహాయులై హైదర్ఆలీతో సంధికి అంగీకరించారు.
*    బ్రిటిష్‌వారు సంధికి అంగీకరించకుంటే హైదర్ఆలీ మద్రాస్‌ను ఆక్రమించేవాడు. ఒకవేళ మద్రాస్‌ను ఆక్రమించి ఉంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో ప్రశ్నార్థకం.
*    భారతీయ సంప్రదాయాలను అనుసరించి, ఆంగ్లేయులు సంధికి వచ్చినప్పుడు అదే న్యాయమని హైదర్ఆలీ భావించాడు. అదే మద్రాస్ సంధి.

మద్రాస్ సంధి (1769)
ముఖ్యాంశాలు :
*   యుద్ధానికి పూర్వం ఉన్న స్థితిని అంగీకరించాలి. అంటే యుద్ధకాలంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఎవరికి వారు ఇచ్చేయాలి.
*    యుద్ధానికి అయిన ఖర్చులకు నష్టపరిహారాన్ని ఆంగ్లేయులు హైదర్ఆలీకి ఇవ్వాలి.
*    ఈ రెండు పక్షాలలో ఎవరినైనా మూడోవారు ఎదిరిస్తే, ఇరుపక్షాలు పరస్పరం సహాయపడాలి.

ఫలితాలు :
*    ఆంగ్లేయులను ఆజ్ఞాపించదగిన స్థానాన్ని హైదర్ఆలీ పొందాడు.
*    ఇరుపక్షాలు ఆర్థికంగా నష్టపోయాయి.

రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1780-1784)
కారణాలు :
*    బ్రిటిష్‌వారు మద్రాస్ సంధిని కేవలం తిరిగి యుద్ధం చేయడానికి వ్యవధి అవసరమని కుదుర్చుకున్నారు.
*    హైదర్ఆలీ కూడా ఆంగ్లేయుల ఉద్దేశం, నడవడిక గ్రహించాడు. పరస్పరం అపనమ్మకం పెంచుకున్నారు.
*    మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్‌వారు ఉల్లంఘించారు. ఉదా: హైదర్ఆలీపై మరాఠాలు దాడిచేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదర్ఆలీకి ఆంగ్లేయులు సహకరించాలి. కానీ ఆంగ్లేయులు తటస్థ వైఖరిని అవలంబించారు.
*    ఆంగ్లేయులు - ఫ్రెంచివారి మధ్య యూరప్‌లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన 'మాహే'ను బ్రిటిష్‌వారు ఆక్రమించారు.
*    ఇంగ్లిష్‌వారికి వ్యతిరేకంగా హైదర్ఆలీ నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో పరిణామం.

 

యుద్ధ విశేషాలు :
*    హైదర్ఆలీ యుద్ధం మొదట్లో ఘనవిజయాలు సాధించాడు. అయితే, అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ తన రాజకీయ చతురతతో నిజాం, మరాఠాలను తనవైపు తీసుకున్నాడు.
*    1781లో పోర్ట్‌నోవా వద్ద బ్రిటిష్‌సేనాని సర్ఐర్‌క్యూట్ హైదర్ఆలీని ఓడించాడు. 1782లో హైదర్ఆలీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. దీనితో హైదర్ఆలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ధనిర్వహణ బాధ్యతలను స్వీకరించాడు.
*    1784నాటికి ఎవరూ గెలిచే స్థితిలో లేకపోవడంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే మంగుళూరు ఒప్పందం.

మంగుళూరు ఒప్పందం (1784)
ముఖ్యాంశాలు :

*    ఇరుపక్షాలు తాము గెలుచుకొన్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.
*   ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఎవరైనా దాడిచేస్తే ఒకరికొకరు సహకరించుకోవాలి.
*    ఆంగ్లేయుల దగ్గర నుంచి హైదర్ఆలీ గెలుచుకున్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.
మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-1792)

కారణాలు :
*
   టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా ఆంగ్లేయులు హైదరాబాద్ నిజాం రాజులతోనూ మరాఠాలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం.
*    టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం.
*    బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్‌కోర్ రాజుపై టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణ.
*    ఈ కారణాలతో గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్‌పై యుద్ధం ప్రకటించాడు.

యుద్ధ విశేషాలు :
*    కారన్‌వాలీస్ స్వయంగా యుద్ధానికి నాయకత్వం వహించాడు.
*    మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి, ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు.
*    టిప్పు సుల్తాన్‌తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో ఆంగ్లేయులు సంధి కుదుర్చుకున్నారు. అదే శ్రీరంగపట్నం సంధి.

శ్రీరంగపట్నం ఒప్పందం (1792)
ముఖ్యాంశాలు :

*    టిప్పు సుల్తాన్ తన భూభాగాలలో దాదాపు సగభాగం ఆంగ్లేయులు వారి మిత్రులకు ఇవ్వాలి.
*    యుద్ధ నష్టపరిహారంగా మూడు కోట్ల మొత్తాన్ని టిప్పుసుల్తాన్ ఆంగ్లేయులకు చెల్లించాలి. ఆ పైకం చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి.

నాలుగో ఆంగ్లో- మైసూర్ యుద్ధం (1799)
కారణాలు :

*    ఆంగ్లేయుల చేతిలో తమకు వాటిల్లిన అవమానకరమైన పరాజయానికి, ఆంగ్లేయులు తమపై విధించిన షరతులకు ప్రతీకారం తీర్చుకోవాలనే టిప్పుసుల్తాన్ బలమైన కోరిక.
*    విప్లవాత్మక ఫ్రాన్స్, ముస్లిం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం టిప్పుసుల్తాన్ రాయబారులను పంపడం.
*   టిప్పుసుల్తాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ నిర్ణయం.
*    వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందానికి టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం.

యుద్ధ విశేషాలు :
*    టిప్పుతో పనిచేస్తున్న సైనికాధికారులు, ముఖ్య ఉద్యోగులు అతడికి సహాయం చేయకుండా తమవైపు చేరితేగాని విజయం సాధించలేమని వెల్లస్లీ భావించాడు. లంచమిచ్చి, అవినీతి మార్గాల ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు అయిదుగురితో కమిషన్ ఏర్పాటు చేశాడు.
*    బ్రిటిష్‌వారి దగ్గర లంచం తీసుకున్న సైన్యాధికారులు, టిప్పుసుల్తాన్‌కు వెన్నుపోటు పొడిచారు.
*    పూర్ణయ్య, కమరుద్దీన్ అనే సైన్యాధికారులను పూర్తిగా నమ్మి బాధ్యతలు అప్పగించగా వారు టిప్పుసుల్తాన్‌ను మోసగించారు. వారు ఆంగ్లేయుల సైన్యం సంఖ్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు.
*    ఆంగ్లేయ సైన్యం దాడిచేసే మార్గంపై తప్పుడు సమాచారం ఇచ్చారు.
*    శ్రీరంగపట్నం రక్షణ బాధ్యతను కమరుద్దీన్‌కు అప్పగించగా ఆంగ్లేయులకు అమ్ముడుపోయిన కమరుద్దీన్ మైసూర్ సైన్యంలో కల్లోలం సృష్టించాడు.
*    ఈ విధంగా అవినీతికి పాల్పడి సొంతవారే మోసంచేయడంతో టిప్పుసుల్తాన్ ఓటమి పాలయ్యాడు. వీరమరణం పొందాడు.

యుద్ధ ఫలితాలు :
*    యుద్ధంలో సహాయం చేసిన మైసూర్ ఉద్యోగులు ఆంగ్లేయుల నుంచి బహుమతులు పొందారు.
*    టిప్పుసుల్తాన్‌కు చెందిన పుస్తక భాండాగారాన్ని ఇంగ్లాండుకు తరలించారు.
*    మైసూర్ పాలకుడిగా ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ - 3ని నియమించారు. కృష్ణరాజ - 3 బ్రిటిష్‌వారితో సైన్య సహకార ఒప్పందంపై సంతకంచేశాడు.
*    దుష్పరిపాలన కారణంగా 1831లో విలియం బెంటింక్ మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
*   1882లో లార్డ్‌రిప్పన్ వైస్రాయ్ కాలంలో వడయార్ రాజవంశీయులకు బ్రిటిష్‌వారు మైసూర్ రాజ్యాన్ని అప్పగించారు.

హైదర్ఆలీ (1761 - 1782)
*    ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూర్ రాజ్యానికి విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాలకుడు హైదర్ఆలీ.
*    విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత 'వడయార్ల' వంశపాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న మైసూర్ రాజ్యంలో హైదర్ఆలీ సైనికుడిగా జీవితం ప్రారంభించాడు
*    తక్కువ కాలంలోనే తన ప్రతిభతో 'దిండిగల్' ప్రాంతానికి ఫౌజుదార్ అయ్యాడు. ఫౌజ్‌దార్ అంటే శాంతిభద్రతలు చూసే అధికారి.
*    ఫ్రెంచివారి సహాయంతో 'దిండిగల్‌' లో ఆయుధ కర్మాగారం స్థాపించాడు.
*    క్రీ.శ. 1761లో కృష్ణరాజ వడయార్‌ను రాజ్యం నుంచి తొలగించి మైసూర్ స్వతంత్ర పాలకుడయ్యాడు. శ్రీరంగపట్నంను రాజధానిగా చేశాడు.
*    ఆంగ్లో-మైసూర్ మొదటి, రెండో యుద్ధాల్లో పాల్గొన్నాడు.
*    హైదర్ఆలీ నిరక్షరాస్యుడు. అయినా అతడి జ్ఞాపకశక్తి అమోఘం. దేశీయులతోపాటు విదేశీయులు కూడా గొప్పగా మెచ్చుకునేవారు.
*    పరమత సహనంగలవాడు. అవసరమైనప్పుడు శృంగేరి శంకరాచార్యుల సలహాలు తీసుకునేవాడు.
*    సామాన్య ప్రజలకు, సైనికులకు ఆరాధ్యదైవంగా వెలిగాడు.
*    ''రాజుకు, ప్రజలకు మధ్య సంబంధాన్ని తెంచివేయడానికి ప్రయత్నించడం అన్ని పాపాలకన్నా హీనమైంది. బలవంతులు బలహీనులను రక్షించాలి. దేవుడు రాజులను సృష్టించింది బలహీనులను కాపాడటానికే. తప్పుచేసినవారిని శిక్షించకపోయినా, ప్రజలను హింసించినవారిని రాజు వదలిపెట్టినా ప్రజలకు రాజుమీద నమ్మకం, ఆశలు నశిస్తాయి'' అని హైదర్ఆలీ చెప్పేవాడు.
*    అవసరమైతే రాత్రనక, పగలనక రోజుల తరబడి వానలో కూడా గుర్రం మీద ఎక్కడా నిలవకుండా స్వారీ చేసేవాడు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు హైదర్ఆలీ.
*    1782లో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
*    భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ మరువరాని వ్యక్తిగా మిగిలిపోయాడు.

టిప్పు సుల్తాన్ (1782 - 1799)
*    2, 3, 4 ఆంగ్లో- మైసూర్ యుద్ధాలు చేశాడు.
*    విదేశీ వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, పెరూ దేశాలకు రాయబారులను పంపాడు.
*    ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమయ్యాడు. ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తిగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షాన్ని నాటించాడు.
*    ఫ్రెంచి విప్లవంలోని అతివాదుల సంఘం అయిన 'జాకోబియన్ క్లబ్‌' లో సభ్యుడిగా చేరాడు.
*    మైసూర్ రాజ్యమంతా ఒకే విధమైన ద్రవ్యవిధానం, తూనికలు, కొలతలు ప్రవేశపెట్టాడు.
*    శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయానికి భూదానాలు చేసి పరమత సహనం పాటించాడు. శంకరాచార్యులను జగత్ గురువుగా భావించాడు.
*    యూరప్‌వారిని ఆదర్శంగా తీసుకుని ఆధునిక నౌకాదళాన్ని నిర్మించాడు.
*    'టైగర్ ఆఫ్ మైసూర్' గా కీర్తిపొందాడు.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌