‣ సైన్స్ విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్పులు
‣ ఆప్టిట్యూడ్ పరీక్షలో నెగ్గితే ప్రతినెలా ఆర్థిక ఆసరా
సైన్స్పై పట్టు, పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) అర్హులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తోంది. సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కిశోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి డిగ్రీలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు ప్రతి నెలా రూ.5000 చెల్లిస్తారు. అలాగే పీజీలో రూ.7000 చొప్పున అందిస్తారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!
జాతీయ స్థాయిలో జరిగే ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపినవారిని ఈ ఫెలోషిప్పులకు ఎంపిక చేస్తారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటర్వ్యూను రద్దు చేశారు. అలాగే పదో తరగతి, ఇంటర్లో కనీస మార్కుల నిబంధనను తొలగించారు. అభ్యర్థి ప్రస్తుత విద్యార్హత ప్రకారం పరీక్ష ఉంటుంది. ఇందులో 3 స్ట్రీములు ఉన్నాయి.
1. ఎస్ఏ: ప్రస్తుత అకడమిక్ సంవత్సరం (2021-22)లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) జూనియర్ ఇంటర్లో చేరిన విద్యార్థులు ఎస్ఏ విభాగంలోకి వస్తారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పురస్కారానికి ఎంపికైనవారు 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) మార్కులతో ఇంటర్ పూర్తి చేయడం తప్పనిసరి. దీంతోపాటు 2023-24 విద్యా సంవత్సరంలో బేసిక్ సైన్సెస్ (బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్) కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. వీళ్లు సీనియర్ ఇంటర్లో ఉన్న సమయాన్ని ఇంటెరిమ్ పీరియడ్గా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో ప్రాంతీయ, జాతీయ స్థాయి సైన్స్ క్యాంపులకు ఆహ్వానిస్తారు. ఇందుకయ్యే ప్రయాణ, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.
2. ఎస్ఎక్స్: 2021-22లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) సీనియర్ ఇంటర్ చదువుతున్నవారు ఎస్ఎక్స్ స్ట్రీమ్ కిందికి వస్తారు. వీరు పురస్కారం పొందడానికి కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్ పూర్తిచేయాలి. దీంతోపాటు 2022-23 విద్యా సంవత్సరంలో బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్ కోర్సుల్లో చేరితేనే స్కాలర్షిప్పు వర్తిస్తుంది.
3. ఎస్బీ: 2021-22లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్/బీస్టాట్/బీమ్యాథ్స్/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్ కోర్సులు చదువుతున్నవారు ఎస్బీ స్ట్రీమ్ కిందికి వస్తారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటర్ మార్కుల నిబంధన లేదు. అయితే తాజాగా ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు. గతంలో పూర్తిచేసుకున్నవారికి అవకాశం లేదు. అలాగే వీరు డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే స్కాలర్షిప్పు అమలవుతుంది.
ప్రోత్సాహకాలు
బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ ఎంఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 చొప్పున చెల్లిస్తారు. ఏటా రూ.20,000 కాంటింజెన్సీ గ్రాంట్ అందుతుంది. ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ చివరి రెండేళ్లు ప్రతి నెలా రూ.7000 అందుతాయి. కాంటింజెన్సీ ఏడాదికి రూ.28,000 ఉంటుంది. వీటికి ఎంపికైనవారు జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయం, ప్రయోగ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.
కొనసాగాలంటే..
ఏటా మెరుగైన అకడమిక్ ప్రతిభ చూపితేనే ఫెలోషిప్ తర్వాతి విద్యా సంవత్సరంలో కొనసాగుతుంది. అంటే ప్రతి విద్యా సంవత్సరంలోనూ సైన్స్ సబ్జెక్టుల్లో తొలి ప్రయత్నంలోనే కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) సాధించాలి. దీంతోపాటు సమ్మర్ క్యాంప్, సమ్మర్ ప్రాజెక్టుల్లో సంతృప్తికరమైన పనితీరు కనబరచడం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఇతర ప్రోత్సాహకాలు పొందినవారు కేవీపీవైకు అనర్హులు.
ఈ కోర్సుల్లో చేరితేనే...
బీఎస్సీ/ బీఎస్/బీస్టాట్/ బీమ్యాథ్స్/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ ఎంఎస్ - ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, ఎకాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజియోలజీ, బయోటెక్నాలజీ, న్యూరో సైన్సెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, మెరైన్ బయాలజీ, జియాలజీ, హ్యూమన్ బయాలజీ, జెనెటిక్స్, బయో మెడికల్ సైన్సెస్, అప్లయిడ్ ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్- వీటిలో ఏదైనా సబ్జెక్టులో చేరినవారికి స్కాలర్షిప్పు అందుతుంది.
ఆవిర్భావం ఇలా...: సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనల ప్రోత్సాహానికీ, కెరియర్గా సైన్స్ను మలచుకునేలా ప్రోత్సహించడానికీ కేవీపీవైను భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (డీఎస్టీ) 1999లో ప్రారంభించింది. సైన్స్ సబ్జెక్టుల్లో ఆసక్తి, ప్రావీణ్యం ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం కేవీపీవై లక్ష్యం. బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో ఉంటుండగానే మొదలయ్యే ఈ ఫెలోషిప్పు పీజీ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. అలాగే ఎంపికైనవారికి దేశంలోని ప్రముఖ సైన్స్ పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు వీటిని పర్యవేక్షిస్తోంది.
సమ్మర్ ప్రోగ్రాం
సైన్స్లో పరిశోధనాసక్తి మరింత పెంపొందించే లక్ష్యంతో సమ్మర్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారం లేదా రెండు వారాల వరకు ఈ ప్రోగ్రాంలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా వివిధ సైన్స్ అంశాల్లో నిపుణులు ఉపన్యాసాలిస్తారు. శాస్త్రవేత్తలతోనూ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు. సైన్స్లో పరిశోధనలు కొనసాగిస్తున్న విద్యార్థులతోనూ భేటీ కావొచ్చు.
ఏ అంశంపైనైనా ప్రత్యేక ఆసక్తి ఉంటే అందులో ఇప్పటికే పరిశోధన కొనసాగిస్తున్న నిపుణులతో సందేహాలు నివృత్తి చేసుకోవడమే కాకుండా ప్రయోగాలు కూడా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఆ అంశానికి సంబంధించిన కెరియర్ అవకాశాలనూ తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ సమ్మర్ క్యాంప్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పరిశోధనా సంస్థలు, సైన్స్ విద్యాలయాల్లో ఉంటాయి. నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలకూ తీసుకెళ్తారు. కేవీపీవైకు ఎంపికైన ప్రతి విద్యార్థికీ గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. దీనిద్వారా జాతీయ ప్రయోగ శాలలు/యూనివర్సిటీల్లో లైబ్రరీ, ల్యాబొరేటరీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.
ఆప్టిట్యూడ్ పరీక్ష ఇలా..
ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రత్యేకమైన సిలబస్ అంటూ నిర్దేశించలేదు. విద్యార్థికి సైన్స్ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు. అయితే ప్రశ్నలు సాధారణంగా వాళ్లు రాసే స్ట్రీమ్ బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ / ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరంలోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచే ఉంటాయి.
‣ ఎస్ఏ స్ట్రీమ్ ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో రెండు భాగాలు. పార్ట్ ఎలో 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. పార్ట్ బిలో 20 ప్రశ్నలకు 40 మార్కులు.
‣ ఎస్బీ, ఎస్ఎక్స్ స్ట్రీమ్ల్లోనూ రెండు భాగాలుంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రానికి 160 మార్కులు కేటాయించారు. మొదటి భాగంలో 80 ప్రశ్నలకు 80 మార్కులు. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ఒక్కో సబ్జెక్టు నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఈ నాలుగింటిలో నుంచి ఏవైనా మూడు సబ్జెక్టుల్లో జవాబులు గుర్తిస్తే సరిపోతుంది. రెండో భాగంలో 40 ప్రశ్నలకు 80 మార్కులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ఒక్కో విభాగం నుంచి పది చొప్పున ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టు మినహాయించుకోవచ్చు.
అన్ని స్ట్రీముల పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులున్నాయి. పార్ట్ ఎలో ప్రశ్నలకు తప్పు సమాధానం గుర్తిస్తే పావు మార్కు, అదే పార్ట్ బిలో అయితే అర మార్కు చొప్పున తగ్గిస్తారు.
కేవీపీవై-2020 ఆప్టిట్యూడ్ పరీక్షలో జనరల్ కేటగిరీలో ఎస్ఏలో 52, ఎస్ఎక్స్లో 52, ఎస్బీలో 47 శాతం మార్కులు సాధించినవారు మెరిట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు.
2009 నుంచి ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలూ, జవాబులూ కేవీపీవై వెబ్సైట్లో లభిస్తాయి. వీటిద్వారా ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. పరీక్షకు కొద్ది రోజుల ముందు ఆన్లైన్ మాక్ టెస్టు కేవీపీవై వెబ్సై ట్లో ఉంచుతారు. దాన్ని అభ్యాసం చేసి ఆన్లైన్ పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు. పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం అర్హులకు స్కాలర్షిప్పులు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్కాలర్షిప్పులు కేటాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు: 25.08.2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625. మిగిలిన అందరికీ రూ.1250.
పరీక్ష తేది: 07.11.2021
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
వెబ్సైట్: http://kvpy.iisc.ac.in/main/index.htm