• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ

సాధారణంగా ఎత్తయిన ప్రదేశాల్లో పుట్టి, మైదానాల ద్వారా పయనిస్తూ చివరకు సరస్సులు లేదా సముద్రాల్లో కలిసే మంచినీటి ప్రవాహాలను నదులు అంటారు.

ప్రధాన నది తన ప్రవాహ మార్గంలో చిన్న చిన్న సెలయేర్లు, వాగులు, వంకలు, గెడ్డలు, ఉపనదులను కలుపుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మొత్తం పరివాహక  వ్యవస్థను నదీ వ్యవస్థ(River System) అంటారు.   

నది పుట్టిన ప్రదేశాన్ని నది ముఖద్వారం (River Mouth) అని, ప్రవహించే మార్గాన్ని నది ప్రవాహ మార్గం (River Course) అని పిలుస్తారు.

నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పొటమాలజీ’ అంటారు.

ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని, సెప్టెంబరు 28న ప్రపంచ నదీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోని తొలి నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి.

 ఏ దేశంలోనైనా సారవంతమైన డెల్టాలు ఏర్పడటానికి, వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక, రవాణా, విద్యుదుత్పత్తికి పరిపుష్టమైన నదీ వ్యవస్థ అవసరం.

ప్రపంచంలోని ప్రధాన నదులన్నీ ముఖ్యంగా హిమాలయాలు (ఆసియా), రాఖీ (ఉత్తర అమెరికా), ఆండీస్‌ (దక్షిణ అమెరికా), ఆల్ఫ్స్‌ (యూరప్‌) పర్వత ప్రాంతాల్లో పుట్టి ప్రవహిస్తున్నాయి.  

మనదేశంలో నదుల పరిమాణం లేదా నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. ప్రధాన నదులు (Major rivers)

2. మధ్యతరహా నదులు(Medium rivers)

3. చిన్నతరహా నదులు (Small rivers) 

ప్రధాన నదులు 

20,000 చ.కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ పరివాహక లేదా జలగ్రహణ ప్రాంతాన్ని (Catchment area) కలిగి ఉన్న నదులను ప్రధాన నదులు అంటారు.

ఇలాంటి ప్రధాన నదులు మనదేశంలో 14 వరకు ఉన్నాయి. అవి: గంగ, సింధు, బ్రహ్మపుత్ర, నర్మద, తపతి, మహి, సబర్మతి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, సువర్ణరేఖ, బ్రాహ్మణి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు దాదాపు 85% నీటిని కలిగి ఉన్నాయి.

 

మధ్యతరహా నదులు 


20,000 నుంచి 2000 చ.కి.మీ. పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులను మధ్యతరహా నదులు అంటారు. ఈ తరహా నదులు మనదేశంలో 49 ఉన్నాయి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు దాదాపు 7% నీటిని కలిగి ఉన్నాయి.

 

చిన్నతరహా నదులు 

2000 చ.కి.మీ. కంటే తక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులను చిన్నతరహా నదులు అంటారు. ఇవి దేశంలో 196  ఉన్నాయి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు సుమారు 8% నీటిని కలిగి ఉన్నాయి.

 

సముద్రంలో కలిసే మార్గం ఆధారంగా వర్గీకరణ


నదులు సముద్రంలో కలిసే మార్గాన్ని ఆధారంగా చేసుకుని దేశంలో నదులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. బంగాళాఖాతంలో కలిసే నదీ వ్యవస్థ 

2. అరేబియా సముద్రంలో కలిసే నదీ వ్యవస్థ

సముద్రంలో కలిసే నదీజలాల్లో దాదాపు 90% బంగాళాఖాతంలో, 10% అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.

ఉద్భవ రీత్యా వర్గీకరణ 

పుట్టిన ప్రదేశం ఆధారంగా నదులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. హిమాలయ నదీ వ్యవస్థ

2. ద్వీపకల్ప నదీ వ్యవస్థ

3. అంతర్‌ భూభాగ నదీ వ్యవస్థ

4. పరస్థానీయ/ ఎక్సోటిక్‌ నదీ వ్యవస్థ

 

హిమాలయ నదీ వ్యవస్థ - లక్షణాలు


ఈ నదులు సంవత్సరం మొత్తం నీటిని కలిగి ఉంటాయి. వీటిని జీవనదులు అంటారు.

ఈ నదుల్లో కొన్ని పూర్వవర్తిత రకానికి చెందినవి. అంటే ఇవి హిమాలయాల కంటే ముందే ఆ ప్రాంతంలో ఆవిర్భవించాయి.
ఉదా: సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర

మరికొన్ని అంతర్‌వర్తిత రకానికి చెందినవి. అంటే హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించాయి. ఉదా: గంగ, రామ్‌గంగ, యమున మొదలైనవి.

వీటికి వయసు తక్కువ.

ప్రవాహ మార్గంలో నదీ వక్రతలను కలిగి ఉంటాయి.

ఇవి శాఖీయుత రూపాన్ని కలిగిఉంటాయి. అంటే వివిధ శాఖలు, ఉపశాఖలుగా కనిపిస్తాయి


రకాలు


హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. అవి:

1. సింధూ నదీ వ్యవస్థ 

2. గంగా నదీ వ్యవస్థ

3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

 

సింధూ నదీ వ్యవస్థ


సింధూ నది, దాని ఉపనదులు, వాటి మొత్తం పరివాహక వ్యవస్థను సింధూ నదీ వ్యవస్థగా పేర్కొంటారు.


 సింధూ నది టిబెట్‌లోని కైలాష్‌ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద ఉన్న ‘గర్తాంగ్‌ చూ’ హిమనీ నదం వద్ద జన్మించింది.


అక్కడి నుంచి టిబెట్‌ మీదుగా జమ్మూ-కశ్మీర్‌లోని ‘థాంచోక్‌’ వద్ద భారతదేశంలోకి ప్రవేశించి, సింధూ తర్బల మైదానం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తుంది. చివరకు పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది.


సింధూ నది మొత్తం పొడవు 2,880 కి.మీ. ఇది భారతదేశంలో 1,114 కి.మీ. పొడవున జస్కార్‌ (లద్దాఖ్‌) పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తోంది.


దీని మొత్తం పరివాహక ప్రాంతం దాదాపు 3,21,000 చ.కి.మీ.


సింధూ నది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్దది, పొడవైంది.


ఇది చైనా, భారత్, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహిస్తోంది.


సింధూ నదిని పర్షియా భాషలో హిందూ అని, గ్రీకు భాషలో సింధోస్‌ అని, లాటిన్‌ భాషలో ఇండస్‌ అని పిలుస్తారు.


సింధూ నది పేరు మీదే మనదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.


దీని ప్రధాన ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్‌.


సింధూ జలాల ఒప్పందం


1960 సెప్టెంబరు 19న సింధూ, దాని ఉపనదుల జలాల పంపకం కోసం భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం(Indus Water Treaty) జరిగింది. దీనికి ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వం వహించింది.


దీని ప్రకారం సింధూ నది వ్యవస్థ మొత్తం నీటిలో భారత్‌ 20%, పాకిస్థాన్‌ 80% వాడుకోవడానికి అంగీకారం కుదిరింది.


ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు.


సింధూ నది ఉపనదులు


జీలం నది


దీన్ని పూర్వ కాలంలో వితస్థ, హైడాస్పస్‌ అని పిలిచేవారు.

 జమ్మూ - కశ్మీర్‌లోని వెరినాగ్‌ వద్ద ఉద్భవించింది. ఇది ఈ ప్రాంత ప్రధాన నది.

దీని మొత్తం పొడవు 724 కి.మీ.

దీని వల్లే శ్రీనగర్‌లో అహన్సర్‌ (ఆక్స్‌ బో), ఊలార్‌ సరస్సులు ఏర్పడ్డాయి.

ఇది చివరకు చినాబ్‌ నదిలో కలుస్తుంది.


చినాబ్‌ నది: ఇది చంద్ర, భాగ అనే రెండు  నదుల కలయికతో ఏర్పడింది. దీన్ని చంద్రభాగ నది, అసికిని నది అని కూడా అంటారు.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని బారాలాప్చాలా కనుమ వద్ద జన్మించింది.

దీని మొత్తం పొడవు 1,180 కి.మీ.

 సింధూ నది ఉపనదుల్లోకెల్లా ఇది అత్యధిక నీటిని తీసుకుపోతుంది. చినాబ్‌ నది చివరకు సట్లెజ్‌ నదిలో కలుస్తుంది.

 

రావి నది


దీన్ని పూర్వం పరూష్ని అని పిలిచేవారు. దీనికే ఐరావతి, లాహోర్‌ నది అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు కొండల్లో ఉన్న రోహ్‌తంగ్‌ కనుమ వద్ద జన్మించింది.

దీని మొత్తం పొడవు దాదాపు 722 కి.మీ.

ఇది చినాబ్‌ నదిలో కలుస్తుంది.

 

బియాస్‌ నది


ఇది పూర్తిగా భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.

దీని ప్రాచీన నామం విపాస. దీన్నే అర్గికియా అని కూడా అంటారు.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న రోహ్‌తంగ్‌ కుండ్‌ దగ్గర్లోని బియాస్‌కుండ్‌ వద్ద పుట్టింది. 

దీని మొత్తం పొడవు దాదాపు 460 కి.మీ. ఇది పంజాబ్‌లోని హరికె వద్ద సట్లెజ్‌ నదిలో కలుస్తుంది.


సట్లెజ్‌ నది


దీని ప్రాచీన నామం శతుద్రి. ఇది టిబెట్‌లోని మానససరోవర్‌ సమీపంలో ఉన్న రాకాస్‌ సరోవర్‌ వద్ద జన్మించింది.

• ఇది ‘షిప్కి లా’ కనుమ మీదుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవహించి, చివరకు పాకిస్థాన్‌లోని సింధూనదిలో కలుస్తుంది.

ఇది సింధూ ఉప నదుల్లోకెల్లా అత్యంత పొడవైంది. దీని మొత్తం పొడవు దాదాపు 1050 కి.మీ.

చైనా, భారత్, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఏకైక సింధూ ఉపనది సట్లెజ్‌.

మనదేశంలో నదులు ఉద్భవించిన తీరు ఆధారంగా భారతదేశ నదీ వ్యవస్థను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. హిమాలయ నదీ వ్యవస్థ

2. ద్వీపకల్ప నదీ వ్యవస్థ

3. అంతర్భూభాగ వ్యవస్థ

4. పరస్థనీయ/ ఎక్సోటిక్‌ నదీ వ్యవస్థ

హిమాలయ నదీ వ్యవస్థ

ఇందులో ప్రధానంగా 3 ముఖ్య నదీ వ్యవస్థలు ఉన్నాయి. అవి:

1. సింధూ నదీ వ్యవస్థ

2. గంగా నదీ వ్యవస్థ

3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

గంగా నదీ వ్యవస్థ

భారతదేశంలో ప్రవహించే నదులన్నింటిలో అతి పొడవైంది గంగా నది. ఇది దేశ వైశాల్యంలో దాదాపు నాలుగో వంతు భాగాన్ని ఆక్రమించి, అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నదిని హిందువులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు.

* హిమాలయ నదుల్లో గంగా అతితరుణ (తక్కువ వయసు కలిగిన) నది.

* అలక్‌నంద, భాగీరథి అనే రెండు ప్రధాన సెలయేర్లు దేవప్రయాగ్‌ వద్ద కలవడం ద్వారా గంగానది ఏర్పడుతుంది.

* అలక్‌నంద ఉత్తరాఖండ్‌లోని కుమయూన్‌ హిమాలయాల్లో ఉన్న సథప్‌నాథ్‌ హిమనీనదం వద్ద జన్మిస్తుంది.

* ఇది దేవప్రయాగ్‌ను చేరే ముందు మందాకిని, పిండార్, జోషిమాత లాంటి చిన్న నదులను తనలో కలుపుకుంటుంది.

* మందాకిని - అలక్‌నంద సంగమ ప్రాంతాన్ని రుద్రప్రయాగ్‌ అని; పిండార్‌-అలక్‌నంద కలిసే చోటును కరణ్‌ప్రయాగ్‌ అని; జోషిమాత - అలక్‌నంద కలిసే ప్రాంతాన్ని విష్ణుప్రయాగ్‌ అని పిలుస్తారు.

* కుమయూన్‌ హిమాలయాల్లోని గంగోత్రి హిమనీ నదం వద్ద భాగీరథి జన్మిస్తుంది.

* గంగా నది దేవప్రయాగ్‌ నుంచి ప్రవహిస్తూ  హరిద్వార్‌ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. 

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ/ అలహాబాద్‌ వద్ద యమునా నదిని, అంతర్వాహినిగా సరస్వతి నదిని తనలో కలుపుకుంటుంది. ఈ ప్రాంతాన్నే త్రివేణి సంగమంగా పేర్కొంటారు. (వేదాలు, పురాణాల్లో మాత్రమే సరస్వతి నది ప్రస్తావన ఉంది.)

* ఇది ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బంగా మీదుగా ప్రవహించి ఫరక్కా (పశ్చిమ్‌ బెంగా) దగ్గర రెండు పాయలుగా చీలుతుంది. ఇందులో ఒక దాన్ని హుగ్లీగా పిలుస్తారు. ఇది పశ్చిమ్‌ బంగా మీదుగా ప్రవహిస్తుంది. రెండో పాయ పేరు ‘పద్మ’. ఇది ఫరక్కా నుంచి ఆగ్నేయంగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.

* పద్మా నది తనలో బ్రహ్మపుత్ర నదిని కలుపుకుని, బంగ్లాదేశ్‌లోని చాందీపూర్‌ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

* గంగా నది మొత్తం పొడవు 2,525 కి.మీ. ఇది భారతదేశంలో దాదాపు 2,510 కి.మీ. ప్రవహిస్తుంది.

* దీని ప్రవాహ దూరం ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా, ఝార్ఖండ్‌లో అత్యల్పంగా ఉంది.

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

* హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత పురాతనమైంది బ్రహ్మపుత్ర నది.

* ఇది టిబెట్‌లోని కైలాస కొండల్లో ఉన్న మానస సరోవరంలోని షమయంగ్‌డమ్‌ హిమనీనదం వద్ద జన్మిస్తుంది.

* ఇది సింధూ నదికి వ్యతిరేక దిశలో టిబెట్‌ నుంచి తూర్పుగా ప్రవహిస్తుంది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అసోంల మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్‌లోకి వెళ్లి పద్మా నదిలో కలిసి, చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.

* టిబెట్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించి నామ్చా బర్వ పర్వతం వద్ద ‘యు’ ఆకారంలోకి తిరిగి అసోంలోని సాదియా వద్ద మైదానంలోకి ప్రవహిస్తుంది.

* అసోంలో ఎర్రనేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్రనది అని కూడా అంటారు.

* దీన్ని అసోం దుఃఖదాయనిగా పేర్కొంటారు.

* దీని ప్రధాన ఉపనదులు లోహిత్, తీస్తా.

* భారతదేశంలో ఉన్న ఏకైక నదీ ఆధారిత దీవి ‘మజూలీ’ బ్రహ్మపుత్ర వల్లే ఏర్పడింది.

* లోహిత్‌ నదిపై డోలా - సాదియా వారధిని నిర్మించారు. దీన్నే భూపేన్‌ హజారికా వారధి అని కూడా అంటారు. ఇది అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాలను కలుపుతుంది. రెండు ప్రాంతాల మధ్య రవాణా, మిలటరీ అవసరాలకు ఇది సహాయపడుతుంది.

* తీస్తా నది 1887 వరకు గంగానది ఉపనదిగా ఉండేది. కానీ అప్పట్లో సంభవించిన భూకంపం కారణంగా ఇది ప్రవాహ దిశను మార్చుకుని, బ్రహ్మపుత్రకి ఉపనదిగా మారింది.

* బ్రహ్మపుత్రనది ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు దిబ్రూగర్, గువాహటి.

గంగా నది - ఉప నదులు

గంగా నది ఉప నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవి: 

హిమాలయాల్లో పుట్టి ఎడమ నుంచి కలిసేవి: రామ్‌గంగా, శారద, గండక్, కోసి, ఘాగ్ర.

హిమాలయాల్లో జన్మించి కుడి నుంచి కలిసేవి: యమున.

ద్వీపకల్పంలో జన్మించి కుడి నుంచి కలిసేవి: సోన్, దామోదర్‌ నదులు; యమునా నది ఉపనదులైన చంబల్, బెట్వా, కెన్‌.

రామ్‌గంగా: ఇది ఉత్తరాఖండ్‌లోని దుఢతోలి కొండల్లో జన్మిస్తుంది.

* జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ మీదుగా ప్రవహిస్తూ, కనోజ్‌ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

శారద: నేపాల్‌లోని హిమాలయాల్లో జన్మించి, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్న ఘాగ్రా నదిలో కలుస్తుంది.

గండక్‌: నేపాల్, టిబెట్‌ సరిహద్దుల్లో దాదాపు 6,268 మీ. ఎత్తున జన్మించి, బిహార్‌లోని గంగా నదిలో కలుస్తుంది.

* అత్యంత ఎత్తైన ప్రాంతంలో పుట్టి, భారత్‌లో ప్రవహిస్తున్న నదిగా దీన్ని పేర్కొంటారు.

* దీన్ని నేపాల్‌లో సాలిగ్రామి అని, బిహార్‌లో నారాయణి అని పిలుస్తారు.

కోసి: దీన్ని సంస్కృతంలో కౌసికి నది అని పిలుస్తారు. 

* ఇది నేపాల్, టిబెట్‌ సరిహద్దుల్లో జన్మించి, కాంచనగంగ పర్వతాన్ని తాకుతూ భారతదేశంలోకి ప్రవేశిస్తుంది.

* ఇది ఏడు ఉపనదులను తనలో కలుపుకుని సప్తకోసిగా మారి బిహార్‌ను తరచుగా వరదల్లో ముంచెత్తుతూ గంగా నదిలో కలుస్తుంది. అందుకే దీన్ని బిహార్‌ దుఃఖదాయినిగా పిలుస్తారు.

ఘాగ్ర: ఇది టిబెట్‌ ప్రాంతంలో జన్మించి, బిహార్‌లోని గంగా నదిలో కలుస్తుంది.

* దీన్నే కర్ణాలి నది అని కూడా అంటారు.

యమున: ఇది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమనీనదం వద్ద జన్మించి, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ మీదుగా ప్రవహిస్తూ అలహాబాద్‌ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

* దీని మొత్తం పొడవు 1376 కి.మీ. 

ఇది గంగానది ఉపనదుల్లోకెల్లా, భారతదేశంలో ప్రవహించే అన్ని ఉపనదుల్లోకెల్లా అత్యంత పొడవైంది.

* చంబల్, బెట్వా, కెన్‌ నదులు ద్వీపకల్పంలో పుట్టి ఉత్తరంగా ప్రవహించి, యమునా నదిలో కలుస్తాయి.

చంబల్‌: మధ్యప్రదేశ్‌లోని మౌ (Mhow) అనే ప్రాంతంలో జన్మిస్తుంది.

* మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్‌ల మీదుగా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది.

* ఇది యమునా నది ఉపనదుల్లోకెల్లా పెద్దది.

బెట్వా: మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల్లో జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ మీదుగా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది.

* దీన్నే మధ్యప్రదేశ్‌ గంగా నది అంటారు.

కెన్‌: దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.

* మధ్యప్రదేశ్‌లోని కైమూర్‌ కొండల్లో జన్మించి, బుందేల్‌ఖండ్‌ పీఠభూమి మీదుగా ప్రవహించి ఉత్తర్‌ ప్రదేశ్‌లో యమునా నదిలో కలుస్తుంది.

సోన్‌: దీన్ని గోల్డ్‌ రివర్‌ అని పిలుస్తారు

* మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌ పీఠభూమిలో జన్మిస్తుంది.

* మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్‌ మీదుగా ప్రవహిస్తూ పట్నాకు సమీపంలో గంగా నదిలో కలుస్తుంది.

దామోదర్‌: ఝార్ఖండ్‌లోని ఛోటానాగ్‌పుర్‌ పీఠభూమిలో జన్మించి, పగులు లోయ మీదుగా ప్రవహిస్తూ కోల్‌కత్తాకు దిగువన 48 కి.మీ. దూరంలో హుగ్లీ నదిలో కలుస్తుంది.

* దీన్ని బెంగాల్‌ దుఃఖదాయినిగా పిలుస్తారు.

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌