పాలకులు భూస్వాములుగా.. రైతులు కూలీలుగా!
నిజాంల పాలనలో భాగస్వాములైన దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, పైగాలు, పటేల్, పట్వారీ తదితరుల అధీనంలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లిపోయాయి. పన్నులు కట్టలేక, అధిక వడ్డీలు భరించలేక రైతులు అనేకమంది కౌలుదార్లుగా, కూలీలుగా మారిపోయారు. ఒక దేశ్ముఖ్ ఇకపై భూములను పట్టా చేసుకోకూడదని నిజాం స్వయంగా ఫర్మానా విధించాల్సి వచ్చిదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే కాలంలో హైదరాబాద్ రాజ్యం అవసరాల మేరకు జలాశయాల నిర్మాణాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాట్లు జరిగాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వెలిశాయి. అయినప్పటికీ ఆశించినంత ఆర్థిక ప్రగతి సామాన్య ప్రజల జీవితాల్లో కనిపించలేదు.
భారతదేశం మధ్యలో, వింధ్య పర్వతాలకు దక్షిణాన, సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో దక్కన్ పీఠభూమిలో హైదరాబాదు సంస్థానం ఉండేది. దేశంలోని సంస్థానాలన్నింటిలో హైదరాబాదే పెద్దది. 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణంతో పంచకోణ ఆకృతిలో ఉండేది. అది ఈనాటి గ్రేట్ బ్రిటన్ వైశాల్యంతో దాదాపు సమానం. సంస్థానం మొత్తం వైశాల్యంలో 50 శాతం తెలుగు మాట్లాడే తెలంగాణ, 28 శాతం మరాఠీ, 11 శాతం కన్నడ మాట్లాడే ప్రాంతాలుండేవి. మతపరంగా చూస్తే హిందువులు 88 శాతం, మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు. మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాస్యులు కేవలం 4.8%.
హైదరాబాదు సంస్థానంలోని భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది. రాజ్యంలో వ్యవసాయానికి అనుకూలమైన మొత్తం భూమి 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. ఇందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అనేవారు. దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలు జాగీర్దారీ విధానం కింద ఉండేది.
సర్పేఖాస్: దాదాపు 10 శాతం భూమి నిజాం సొంత కమతంగా ఉండేది. ఈ భూమినే సర్పేఖాస్గా వ్యవహరించేవారు. ఇది 18 తాలూకాల్లో 8,100 చదరపు మైళ్లు విస్తరించి ఉండేది. హైదరాబాదు రాజ్యంలో తెలంగాణ ప్రాంత వైశాల్యం 49,502 చదరపు మైళ్లు. గ్రామాల సంఖ్య 10,095.
జాగీరు ప్రాంతాలు: ఇవి మొత్తం సంస్థానంలో 1/30వ వంతు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారీకులు అనే పేర్లతో వివిధ రకాల భూస్వామ్య వర్గాలు ఉండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేయడానికి సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఇవి సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి.
పైగాలు: నిజాం రాజ బంధువులకు పైగాలు అనే భూములను ఇచ్చేవారు. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయాల్లో నిజాం రాజుకు సరఫరా చేసేవారు. రాజ్యంలో జాగీర్లు, సంస్థానాలు, మక్తాలు, బంజర్లు, అగ్రహారాలు, ఈనాములను వివిధ సేవలకు గుర్తింపుగా ఇచ్చేవారు.
దేశ్ముఖ్లు, దేశ్పాండేలు: వీరు గతంలో ప్రభుత్వానికి పన్నులు వసూలుచేసి పెట్టేవారు. సాలార్జంగ్ దివాన్ (ప్రధాని) అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుంచి పన్నులు వసూలు చేసేది. దీంతో ప్రభుత్వం గతంలో వీరు చేసిన సేవకు వతన్ లేదా మాష్ (ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే భృతి) ఇచ్చింది. దేశ్ముఖ్లు, దేశ్పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో వేలాది ఎకరాల అతిసారవంతమైన భూములను ఆక్రమించి రైతులను కౌలుదార్లు, కూలీల స్థాయికి నెట్టేశారు. భూస్వాములు రైతులకు అధిక వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. వాటిని తీర్చలేని రైతుల భూములను ఆక్రమించేవారు.
పటేల్, పట్వారీ, మాలీ పటేల్: తెలంగాణలో వంశపారపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ లాంటి గ్రామాధికారులు ఉండేవారు. ప్రతి ఒక్కరు అయిదు నుంచి పది గ్రామాలు వతన్గా పొందేవారు. ఈ వతన్ గ్రామాలపై భూస్వాములు తమ అధికారాన్ని గుమాస్తాలు, ఏజెంట్ల (సేరిదార్ల) ద్వారా చెలాయించేవారు. వీరికి ప్రభుత్వ అధికార్లకు ఉండే అన్ని అధికారాలు ఉండేవి. వీరు రైతుల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. భూస్వామికి తెలియకుండా గ్రామస్థుల మధ్య వివాదాలు కూడా పరిష్కరించేవారు కాదు. జాగిర్దార్లు, దేశ్ముఖ్లకు రైఫిళ్లు, తుపాకీలు కలిగి ఉండటానికి లైసెన్స్లు ఉండేవి. వారికి సాయుధ, అశ్విక బలగాలు ఉండేవి.
అధీనంలో లక్షల ఎకరాలు
జన్నారెడ్డి ప్రతాపరెడ్డి: ఈయన ఎర్రపాడు దేశ్ముఖ్. ప్రతాపరెడ్డికి 20 గ్రామాల్లో లక్షా యాభై వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట తాలూకాలోని ఎర్రపాడు గ్రామం నుంచి వరంగల్ జిల్లా కుమ్మరికుంట్ల వరకు అనేక గ్రామాలు ఈయన అధీనంలో ఉండేవి. ఈయన ఇకపై భూములను పట్టా చేసుకోకూడదని నిజాం అప్పట్లో ఫర్మానా జారీ చేశాడు.
* కల్లూరు దేశ్ముఖ్కు (మధిర తాలూకా, ఖమ్మం జిల్లా) లక్ష ఎకరాల భూమి ఉండేది. విసునూర్ దేశ్ముఖ్కు (జనగాం తాలూకా, నల్గొండ జిల్లా) 60 గ్రామాల్లో నలభై వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట దేశ్ముఖ్కు (నల్గొండ జిల్లా) ఇరవై వేల ఎకరాల భూమి ఉండేది.
గడీలు: గడీ అనే పదం మరాఠీ పదమైన ‘ఘడ్’ నుంచి ఉద్భవించింది. గడీ అంటే కోట అని అర్థం. ఈ గడీలు నిజాం రాజ్యంలో పన్ను వసూలుచేసే, శాంతి భద్రతలను రక్షించే, పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. ఇవి పెద్ద రాళ్లతో నిర్మితమై కోటల మాదిరి ఉండేవి. వీటిలో నివసిస్తూ దొరలు నిజాం ప్రభువుకు ఏజెంట్లుగా ఉండేవారు. నిజాం మద్దతుతో పరిపాలన సాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. హైదరాబాద్ రాజ్యంలో మొత్తం 200 నుంచి 250 వరకు గడీలు ఉండేవి.
నీటిపారుదల సౌకర్యాలు
తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసేవి. ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ రెండూ ఉండేవి. నేల ఇసుకమయమై తడి నిలిచేదికాదు. వేసవి కాలంలో నదులు ఎండిపోయేవి. దీంతో జలాశయాలు నిర్మించడం తప్పనిసరైంది. హైదరాబాదులో మీర్ఆలం ట్యాంక్ను 1810లో నాటి ప్రధానమంత్రి నిర్మించారు. ఘన్పూర్ ఆనకట్టను 1905లో మొదక్ జిల్లా ఘనపూర్ దగ్గర మంజీరా నదిపై కట్టారు. ఇది 21,625 ఎకరాలకు సాగు నీరు అందించేది. అసఫనహర్ ప్రాజెక్టును 1905లో నల్గొండ జిల్లాలోని నెమలికాల్వ గ్రామంలో మూసీ నదిపై నిర్మించారు. ఇది 15,245 ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పించేది. నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలో బెలాల్ ప్రాజెక్టు, ఆలేరు ఉపనదిపై పోచారం రిజర్వాయర్ (1922) నిర్మించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును 1931లో నిజామాబాద్ జిల్లా అచ్చంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిపై కట్టారు. దీన్ని నవాజ్ జంగ్ అనే ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయంతో డిజైన్ చేశారు. ఇది 2,75,000 ఎకరాలకు సాగు నీరు అందించేది.అప్పట్లో చెరకు పంటకు నీరు అందించడంతో నిజాం చక్కెర పరిశ్రమను ఇక్కడ నెలకొల్పారు. రాయంపల్లి రిజర్వాయర్ను 1924లో మెదక్ జిల్లా రాయంపల్లిలో నిర్మించారు. డిండి ప్రాజెక్టును నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకాలో కృష్ణానది ఉపనది అయిన డిండి నదిపై 1943లో నిర్మించారు. మానేరు రిజర్వాయర్ను కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల తాలూకాలో 1945 - 1949 మధ్య కాలంలో కట్టారు. నందికొండ - నాగార్జునసాగర్ ప్రాజెక్టును మొదట కృష్ణానదిపై నందికొండ గ్రామం (నల్గొండ జిల్లా) వద్ద నిర్మించాలని ఏడో నిజాం తన ప్రముఖ ఇంజినీర్ జాఫర్ అలీతో ప్రయత్నాలు సాగించాడు. దీంతో తెలంగాణకు అధిక నీరు వచ్చేలా ప్రయత్నాలు జరిగాయి. తర్వాతి కాలంలో కె.ఎల్.రావు అనే ఇంజినీర్ ఆధ్వర్యంలో నందికొండ ప్రాజెక్టును కొంత దిగువకు నిర్మించడంతో ఎక్కువ నీరు ఆంధ్ర ప్రాంతానికి మళ్లే విధంగా డిజైన్ మారింది. తెలంగాణలో రాజధాని సమీప ప్రాంతాలకు మాత్రమే ఈ నీటిపారుదల సౌకర్యాలు కల్పించి మిగిలిన ప్రాంతాలను విస్మరించారు. దీనివల్ల కరవు కాటకాలు ఏర్పడి దొంగతనాలు, దోపిడీలు నిత్యకృత్యాలుగా మారాయి.
గనులు, ఖనిజాలు
తెలంగాణలో అనేక ఖనిజాలు లభించేవి. సింగరేణి, కొత్తగూడెంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనులు గోదావరి, ప్రాణహిత నదుల మాగాణుల వరకు విస్తరించి ఉన్నాయి. గోదావరి లోయ, కృష్ణా, తుంగభద్ర నదుల అంతర్వేది ప్రాంతం, ఆదిలాబాద్ జిల్లాలో ఇనుప గనులు ఉండేవి. జగిత్యాల, నిర్మల్, వరంగల్, యెలగర్పు ఉక్కు పరికరాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి.
పట్టణం | ప్రసిద్ధి |
ఖమ్మం మెట్టు | అభ్రకం |
పాల్వంచ | కురువిందం, కెంపురాయి |
హసనాబాద్ | నల్లసేపం |
వరంగల్ | తివాచీలు, పత్రంజీలు |
కరీంనగర్ | వెండి, బంగారు తీగ |
అలంపురం | జంపఖానాలు |
పెంబర్తి | ఇత్తడి పాత్రలు |
సిద్దిపేట | పట్టు వస్త్రాలు |
జనగాం | నక్షత్ర కనుమలు |
పోచంపల్లి | చిట్టి రుమాళ్లు |
ఆర్మూర్, నారాయణపేట | సిల్క్ చీరలు |
రఘునాథపురం, కార్వాన్ | అరబ్బు లుంగీలు |
ఈ ఉత్పత్తులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఇండొనేషియా, నాటి బర్మా దేశాలకు ఎగుమతయ్యేవి.
పారిశ్రామికీకరణ
ఆసఫ్జాహీ పాలకులైన మహబూబ్ అలీఖాన్, ఉస్మాన్ అలీఖాన్ల కాలంలో కుటీర పరిశ్రమలు, యంత్ర పరిశ్రమలను స్థాపించారు. సిర్పూర్లో కాగిత పరిశ్రమ (కాగజ్నగర్), బోధన్లో చక్కెర కర్మాగారం, హైదరాబాద్లో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్స్; వరంగల్లో ఆజంజాహీ మిల్లులు స్థాపించారు. 1899లో హైదరాబాద్, మన్మాడ్లను కలుపుతూ గోదావరి వ్యాలీ రైల్వేలైన్ ఏర్పాటుచేశారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఏర్పడింది. 1877లో హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్, వీవింగ్ మిల్స్ లిమిటెడ్ను; 1884లో మహబూబ్ శాయి గుల్బర్గా మిల్స్, 1883లో ఔరంగాబాద్ మిల్స్లను స్థాపించారు. నిజాం ప్రభుత్వం 1917లో ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ ఏర్పాటుచేసి పరిశోధనలు చేపట్టింది. 1930లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలను ఏటా హైదరాబాద్లో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ సంస్థ చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ముల్కీ ఇండస్ట్రీస్ అనే పేరుతో పత్రిక నడిపేది. దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లును 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్బండ్లో స్థాపించారు. ఇది వస్త్రాల పరిశ్రమ. హైదరాబాద్లో అల్విన్ మెటల్ వర్క్స్ కంపెనీని 1920లో హకీం మహ్మద్ మెహినుద్దీన్ ఫారూకి స్థాపించాడు. ఈ పరిశ్రమలో ప్రజలు బాగా ఉపయోగించే జిందా తిలిస్మాత్, ఫారూకి పళ్లపొడి, జిందాబామ్ వంటివి ఉత్పత్తి చేసేవారు. యంత్రాల పనిముట్ల తయారీకి 1943లో కవాడిగూడలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. 1963లో దీన్ని ప్రాగాటూల్స్ లిమిటెడ్గా మార్చి రక్షణ మంత్రిత్వశాఖకు అప్పగించారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ను 1946, జూన్ 17న స్థాపించారు. దీనిలో రేకులు, షీట్లను ఉత్పత్తి చేసేవారు.
సికింద్రాబాద్లో 1862లో మహబూబ్ కాలేజీని స్థాపించారు. హైదరాబాద్లో 1880లో చాదర్ఘాట్ కాలేజీని, 1921లో సిటీ కాలేజీని, నాంపల్లిలో జనానా ఇంటర్మీడియట్ బాలికల కళాశాల ఏర్పాటుచేశారు. 1908లో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని అమీర్పేట్లో స్థాపించారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మొదట్లో నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో నడిచేది. 1961లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కట్టించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1938లో అఫ్జల్గంజ్లో నిజామియా జనరల్ హాస్పిటల్ నిర్మించాడు. దీన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిగా వ్యవహరిస్తున్నారు. నిజామియా యునానీ ఆస్పత్రిని కూడా ఈయనే నిర్మించాడు.
రచయిత: డాక్టర్ ఎం.జితేందర్ రెడ్డి