• facebook
  • whatsapp
  • telegram

టాప్‌టెన్ ర్యాంకులు అబ్బాయిల‌కే..

* ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో..
* మొదటి ఐదుగురి లక్ష్యం ఐఐటీనే

ఈనాడు, ఈనాడు డిజిటల్‌-అమరావతి: ఏపీఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో అబ్బాయిల హవా కొనసాగింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో మొదటి పది ర్యాంకులు వారే కైవసం చేసుకున్నారు. వ్యవసాయ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలున్నారు. ఇంజినీరింగ్‌లో తొలి 10 ర్యాంకుల్లో ఐదుగురు, వ్యవసాయ విభాగంలో టాప్‌టెన్‌లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఏపీ ఎంసెట్‌-2020 ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఎంసెట్‌లో వైద్య విద్య లేనందున వచ్చే ఏడాదికి ఎంసెట్‌ పేరును మార్పు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, వ్యవసాయంలో 91.77 శాతం మంది అర్హత సాధించారు. గత మూడేళ్లతో పోల్చితే అర్హత సాధించిన వారి సంఖ్య పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్సుడ్‌లో ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మొదటి 10 ర్యాంకుల్లో నిలిచారు. జేఈఈ అడ్వాన్సుడ్‌లో 173వ ర్యాంకర్‌ వావిలపల్లి సాయినాథ్‌ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు. అడ్వాన్సుడ్‌లో 2, 14 ర్యాంకర్లు గంగుల భువన్‌రెడ్డి, లండ జితేంద్ర ఎంసెట్‌లో  3, 10 ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన కుమార్‌సత్యం జేఈఈ అడ్వాన్సుడ్‌లో 22వ ర్యాంకు సాధించగా ఎంసెట్‌లో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరూ ఐఐటీల ప్రవేశాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ విభాగంలోని మొదటి ఐదుగురు నీట్‌లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌లో చేరతామని వెల్లడించారు.

వెయిటేజి ఇలా..
ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ విద్యార్థులు, 40 శాతం మార్కులు  తెచ్చుకున్న రిజర్వేషన్‌ కేటగిరీల విద్యార్థులకే ఎంసెట్‌లో ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. అడ్వాన్సుడ్‌ సఫ్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం ర్యాంకులు కేటాయించలేదు. వీరికి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంసెట్‌ ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కృష్ణా, గుంటూరు నుంచే అత్యధికం.. 

ఏపీ ఎంసెట్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌లో కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా 18,457 మంది పరీక్షకు హాజరవగా.. 15,785 మంది అర్హత సాధించారు. గుంటూరు జిల్లా నుంచి 18,491 మందికిగానూ.. 15,433 మంది ఉత్తీర్ణులయ్యారు. వ్యవసాయ విభాగంలో గుంటూరు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 8,129 మంది పరీక్ష రాయగా 7,489 మంది అర్హులయ్యారు. కృష్ణా నుంచి 7,798 మంది రాయగా 7,447 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయం రెండు విభాగాల్లోనూ విజయనగరం జిల్లా నుంచి అత్యల్ప ఉత్తీర్ణత నమోదైంది.

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌