Post your question

 

    Asked By: prasanth

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తరువాత యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవ్వాలని ఉందన్నారు. మీ దృష్టిలో యూపీఎస్సీ పరీక్ష అంటే సివిల్సా, ఇంజినీరింగ్‌ సర్వీసా అనేది చెప్పలేదు. పీయూసీ చదివేప్పుడే భవిష్యత్తు కెరియర్‌ గురించి ఆలోచించడం, యూపీఎస్సీ పరీక్ష లాంటి అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకోవడం అభినందనీయం! అయితే, మీరు ఇప్పుడు చదువుతున్న పీయూసీపై శ్రద్ధ పెట్టి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని, ఇంజినీరింగ్‌ కోర్సును ఉత్తమ విద్యా సంస్థ నుంచి చదివే ప్రయత్నం చేయండి. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధత మొదలు పెట్టండి.
    యూపీఎస్సీ పరీక్షలకూ, బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్నల్ని నేరుగా ఇస్తే, యూపీఎస్సీలో అప్లికేషన్‌పై ఎక్కువగా అడుగుతారు. యూపీఎస్సీ సిలబస్‌లో జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్‌లు కూడా భాగం. కాబట్టి, ఇంజినీరింగ్‌ పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను చదవడం మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోండి. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, సృజనాత్మకంగా, సమస్య- పరిష్కార పద్ధతుల్లో ఉంటాయి. మీరు పరీక్షలకు చదివేప్పుడు బట్టీ పట్టి చదవడం కాకుండా, అర్థం చేసుకొని, సొంతంగా నోట్సు రాసుకుంటూ చదవాలి. అప్పుడే విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షలో రాణించాలన్న బలమైన ఆశయం ఉండి, ప్రణాళికయుతంగా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తే, మీ కలను నెరవేర్చుకోవడం అసాధ్యం కాదు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, సాఫ్ట్‌వేర్‌లో ఏ ఉద్యోగం చేశారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇంజినీరింగ్‌కు సంబంధించినదా? గ్రూప్స్‌ లాంటిదా? ఏ ప్రభుత్వ కొలువుకు అయినా చాలా పోటీ ఉంటుంది కాబట్టి, ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో సమయపాలనను పాటిస్తూ సన్నద్ధం అవ్వాలి. అప్పుడు సర్కారీ ఉద్యోగం పొందడం కష్టం కాదు. మీ విద్యార్హతతో ఏయే ఉద్యోగాలకు అర్హులు అవుతారో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత ఆ ఉద్యోగ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్నపత్రాలను సేకరించండి. ఆ పరీక్షకు నిర్థÄరించిన సిలబస్‌ని చూసి ఎంత సన్నద్ధత అవసరమో అంచనా వేయండి. సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలూ, రిఫరెన్స్‌ పుస్తకాలూ కొనుగోలు చేయండి. ప్రతిరోజూ వార్తా పత్రికల్ని చదువుతూ, అందులోని సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాల్లోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌పై కూడా దృష్టి పెట్టండి. సిలబస్‌కి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకొంటూ, అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం చేస్తున్నవారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోండి. అదే విధంగా, ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారితో చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు నేర్చుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, పోటీ పరీక్ష రాయడంలో మీ వేగాన్ని పెంచుకోండి. చివరిగా, ఆర్థిక వెసులుబాటు ఉంటే, విశ్వసనీయత ఉన్న శిక్షణ సంస్థలో కోచింగ్‌ పొందే విషయాన్ని కూడా పరిగణించండి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం పొందినవారి ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందుతూ, ప్రభుత్వ కొలువు పొందాలన్న మీ ఆశయం నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా? అనే సందేహం చాలా సంవత్సరాలుగా చాలామందిని వేధిస్తూనే ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏక కాలంలో రెండు డిగ్రీలు చదవడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను యూజీసీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని నియామక సంస్థలు రెండు డిగ్రీలు ఏక కాలంలో చదివినప్పటికీ, అవి ఒకటి రెగ్యులర్, మరొకటి దూరవిద్య ద్వారా అయితే ఆ రెండు డిగ్రీలనూ పరిగణనలోకి తీసుకొనేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవి. కొన్ని సందర్భాల్లో మాత్రం దరఖాస్తు నింపేటప్పుడు రెండు డిగ్రీలు చదివిన కాలాన్ని ఒకే సంవత్సరంలో పేర్కొంటే, కంప్యూటర్‌ పోర్టల్‌లో ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యూజీసీ అధికారికంగా అనుమతి ఇచ్చినందున భవిష్యత్తులో ఈ  సమస్య కూడా పరిష్కారం కావొచ్చు. మీరు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ ఉద్యోగాలకు అర్హురాలిని అన్న నమ్మకంతో ఉద్యోగ సన్నద్ధత మొదలు పెట్టండి. ఒకవేళ ఒకే సమయంలో చదివిన రెండు డిగ్రీలూ చెల్లుబాటు కావేమో అన్న సందేహం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూవుంటే.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో పీజీని దూరవిద్య ద్వారా పూర్తిచేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: prasanth

    Ans:

    సాధారణంగా బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారికి అగ్రోనమిస్ట్, బయోకెమిస్ట్, బయో ఫిజిసిస్ట్, ఎపిడమాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, హార్టికల్చరిస్ట్, ఇమ్యునాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌.. ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు పీజీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏవైనా సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్, ఈఎన్‌టీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ సేఫ్టీ, మెడికల్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్, ఆఫ్తల్మాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ మెకానిక్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, పల్మనరీ టెక్నీషియన్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కూడా పనిచేసే అవకాశాలుంటాయి. కోడింగ్‌పై ఆసక్తి ఉంటే మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ తీసుకొని మెడికల్‌ కోడర్‌గానూ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవే కాకుండా- సీక్వెన్సింగ్, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌ల్లో కూడా సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్‌గా స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    మీరు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, బీఈడీ చేశాక ‘డీ…ఎస్సీకి అర్హత లేదు’ అని ఎందుకు అన్నారో కారణం తెలుసుకొని ఉండాల్సింది. అప్పుడే మీరు ఉన్నతాధికారులనో, న్యాయస్థానాన్నో ఆశ్రయించివుంటే, మీ సమస్యకు పరిష్కారం లభించివుండేది. మీరు ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివిన విద్యాసంస్థను సంప్రదించి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు విడివిడిగా ఇస్తారేమో కనుక్కోండి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ఎగ్జిట్‌ క్లాజ్‌ ప్రవేశపెట్టి యూజీ, పీజీ రెండు డిగ్రీలూ ఇస్తున్నాయి. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే- మీరు బీఈడీ చేసిన తరువాత డిగ్రీ చదివినా, డీఎస్సీకి అర్హులవుతారు. మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బీఈడీ తరువాత డిగ్రీ చేశారు కాబట్టి ఆ విషయాన్ని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే పై అధికారుల్ని కలవండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక, ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు నిరభ్యంతరంగా డీఎస్సీకి సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    బీబీఏ చేసి సప్లై చెయిన్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సబ్జెక్టులో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ను అందించే విద్యాసంస్థలు ఎక్కువ. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా విదేశాల్లోనే అధికం. కాకపోతే, విదేశాల్లో విద్యాభ్యాసానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ కాబట్టి విదేశీ విద్య విషయంలో కొంతకాలం వేచివుండటం మంచిది. ఇక మనదేశంలో ఐఐఎం కోజికొడ్, ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం ఉదయ్‌పుర్, ఐఐటీ రూర్కి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, మణిపాల్‌ యూనివర్సిటీ, నిక్‌మార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌/ డెసిషన్‌ మేకింగ్‌/ టైం మేనేజ్‌మెంట్‌/ కమ్యూనికేషన్‌ మెలకువలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి స్పీచ్‌ థెరపీ కోర్సులను నేర్చుకోవాలన్న మీ కోరిక అభినందనీయం. సాధారణంగా ఇలాంటి కోర్సులను ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. మీకు రెగ్యులర్‌ కోర్సులు చదవడానికి వీలు అవ్వకపోతే- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, దిల్లీ స్టేట్‌ గవర్నమెంట్‌ పారామెడికల్‌ కౌన్సిల్, యుడెమిల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌ కూడా స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం- ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌/ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ పూర్తి అయి ఉండాలి. అదనంగా టెట్‌/ సీ టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల అభ్యర్థనల మేరకు కొన్ని సందర్భాల్లో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీఈడీ../ బీఈడీ చివరి సెమిస్టర్‌/ సంవత్సరం చదువుతున్నవారికి కూడా డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కానీ, డీ.. ఎస్సీ ఫలితాలు విడుదలై, సర్టిఫికెట్ల పరిశీలన నాటికి డీఈడీ/ బీఈడీ ఫలితాలు వచ్చి ఉండాలి.
    మీ విషయానికొస్తే.. ప్రస్తుతం బీఈడీ మూడో సెమిస్టర్‌లో ఉన్నారు. బీఈడీ పూర్తి అయి ఫలితాలు వచ్చేవరకు మరో సంవత్సరం పట్టొచ్చు. టెట్‌ రాయాలంటే మీరు బీఈడీ రెండో సంవత్సరంలో ఉండాలి. టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక దానికి దరఖాస్తు చేసి అందులో ఉత్తీర్ణత సాధిస్తే, తర్వాత వచ్చే డీ.. ఎస్సీ నోటిఫికేషన్‌లో బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి అవకాశం కల్పిస్తే, మీరు ఆ డీఎస్సీకి అర్హులవుతారు. బీఈడీ చదువుతూ ఒకే సంవత్సరంలో టెట్, డీఎస్సీ లాంటి రెండు పోటీ పరీక్షలకు సన్నద్ధత సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో మీరు ప్రస్తుతం చదువుతున్న బీఈడీ శిక్షణపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుగా మీరు బీఈడీ కోర్సును శ్రద్ధగా చదువుతుండండి. టెట్‌/ సీటెట్‌కు దరఖాస్తు చేసి, అందులో ఉత్తీర్ణత సాధిస్తే, వచ్చే సంవత్సరం వెలువడే డీఎస్సీ నోటిఫికేషన్‌కు మీరు అర్హులవుతారు.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: prasanth

    Ans:

    మీరు ఇంటర్మీడియెట్‌ 2014లో అంటే, దాదాపు పదేళ్ల క్రితం పూర్తిచేశారు. పదో తరగతిని బట్టి మీ వయసు అటు ఇటుగా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా అనే విషయంపై స్పష్టత అవసరం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుతో ఐటీఐ చేశారు కాబట్టి కంప్యూటర్‌ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ముందుగా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా కానీ, దూరవిద్య ద్వారా కానీ కంప్యూటర్‌ కు సంబంధించిన సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయండి. ఈలోగా కొన్ని కంప్యూటర్‌ కోడింగ్, ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకోండి. డిగ్రీ చదువుతూనే కొంత అనుభవం గడించండి. డిగ్రీ పూర్తయ్యాక ఈ అనుభవంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాబట్టి డిగ్రీని పూర్తిచేయడం చాలా అవసరం. ఇలాచేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పలు పరీక్షలకు అర్హులవుతారు. అలా కాకుండా మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ, న్యాయవాది అవ్వాలనుకొంటే ఎల్‌ఎల్‌బీ, జర్నలిస్ట్‌ కావాలంటే జర్నలిజం, లెక్చరర్‌ అవ్వాలనుకొంటే మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    నటన అంటే చాలా ఇష్టం అన్నారు. కానీ  ఇప్పటివరకు మీరు నటన ఎక్కడైనా నేర్చుకొన్నారా, ఏమైనా సాధన చేశారా? పాఠశాల, కళాశాలల్లో నటించిన అనుభవం ఉందా? కొన్ని శిక్షణ సంస్థలు నటనకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి నటనలో పూర్వానుభవం కూడా ఉండాలని ఆశిస్తాయి. నటనలో ప్రాథమిక కోర్సులు చేయాలనుకుంటే- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ స్టూడియోల నుంచి కూడా నటనకు సంబంధించిన అనేక స్వల్పకాలిక వర్క్‌షాపులు ఉన్నాయి. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్, మధు ఫిలిం ఇన్‌స్ట్టిట్యూట్, మయూఖ మొదలైన సంస్థల్లో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా నట శిక్షణ సంస్థలో చేరేముందు, ఆ సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి. మీకు ఇప్పటికే థియేటర్‌ యాక్టింగ్‌లో కొంత శిక్షణ, అనుభవం ఉంటే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, బెంగళూరులో ఒక సంవత్సరం యాక్టింగ్‌ కోర్సు చేయొచ్చు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా దిల్లీలో మూడేళ్ల ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణేలో రెండేళ్ల యాక్టింగ్‌ కోర్సు ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలు థియేటర్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. నటనలో రాణించాలంటే.. నైపుణ్యాలతో పాటు అనుభవం, సామర్థ్యం, పరిజ్ఞానం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌