Asked By: బుజ్జి
Ans:
మీరు ఏ సంవత్సరంలో డిగ్రీలో చేరారు? ఎన్నేళ్లు చదివారు? ఏ ఏడాది మానేశారు? డిగ్రీలో ఏ సబ్జెక్టులుు? మీ ప్రస్తుత వయసు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు... ఇవేమీ చెప్పలేదు. మొదటిగా మీరు డిగ్రీ చదివిన కళాశాలకు వెళ్లి ఇప్పుడు డిగ్రీని పూర్తి చేయడానికి అవకాశం ఉందో లేదో కనుక్కోండి. చాలా యూనివర్సిటీల్లో మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా 5 లేదా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం డిగ్రీని పూర్తిచేయవచ్చంటే ఆ డిగ్రీని కొనసాగించండి. అలా వీలు కాకపోతే మళ్లీ డిగ్రీలో చేరి రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి చదువుకోండి. డీఈడీ విద్యార్హతతో ఏదైనా పాఠశాలలో టీచర్గా చేరి, దూరవిద్య/ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసే ప్రయత్నం చేయండి. చివరిగా, ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీ లేదా ఓపెన్ యూనివర్శిటీ, లేదా రాష్ట్ర యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రాన్ని సంప్రదించి, గతంలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల క్రెడిట్స్ని బదిలీ చేసి, ఆ సబ్జెక్టులు మినహా మిగతావి చదివి డిగ్రీ పూర్తిచేసే అవకాశం ఉందేమో తెలుసుకోండి. ఇవేవీ కుదరకపోతే, ఉద్యోగం చేస్తూనే డిగ్రీని ఆన్లైన్ పద్ధతిలో చదివే ప్రయత్నం కూడా చేయొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.శ్యామ్
Ans:
బ్యాక్ లాగ్స్ ఉన్నాయన్నారు కానీ, ఎన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారో చెప్పలేదు. మీరు ఇంజినీరింగ్ చదువుతున్న కళాశాల ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది? ఒక్కో వర్శిటీలో ప్రమోషన్ నియమాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో మూడో సంవత్సరం చదవాలంటే మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నాలుగో సంవత్సరం చదవాలంటే రెండో సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైవుండాలి. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రం ప్రతి సెమిస్టర్లో కనీసం 50 శాతం సబ్జెక్టుల్లో పాసైతేనే తరువాతి సెమిస్టర్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బ్యాక్లాగ్స్పై గరిష్ఠ పరిమితి కూడా ఉంటుంది. మీరు చదువుతున్న కళాశాలకు సంబంధించిన విశ్వవిద్యాలయ నిబంధనలకు లోబడి మీరు ఏడో సెమిస్టర్ చదవడానికి అర్హత ఉంటుంది. కానీ బ్యాక్లాగ్స్ రాయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
బ్యాక్ లాగ్స్ రాసి, ఉత్తీర్ణత పొందితే ఉద్యోగాలు రావనుకోవడం అపోహ మాత్రమే. ఇటీవల ఇంజినీరింగ్ డిగ్రీ పొందుతున్నవారిలో దాదాపు సగం మంది విద్యార్థులు కనీసం ఒక సెమిస్టర్లో అయినా సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత సాధించినవారే! కాకపోతే వారిలో చాలామంది బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ ఇంజినీరింగ్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నారు. మీరు కూడా బ్యాక్లాగ్స్ అన్నింటినీ నాలుగేళ్ల లోపే పూర్తిచేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. అతి కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే ఇంజినీరింగ్ డిగ్రీని బ్యాక్లాగ్స్ లేకుండా నాలుగు సంవత్సరాల వ్యవధిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్న నియమాన్ని పెడుతున్నాయి. చాలా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకూ, ప్రభుత్వ ఉద్యోగాలకూ ఇలాంటి నిబంధన ఏమీ లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే బీటెక్ తరువాత ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ మంచి విద్యాసంస్థలో, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే బీటెక్లో బ్యాక్లాగ్స్ వల్ల జరిగిన నష్టాన్ని కొంతమేరకు నివారించవచ్చు. గతంలో జరిగిన తప్పిదాల గురించి బాధపడకుండా గుణపాఠాలు నేర్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: విజయ్కుమార్
Ans:
1980ల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో డిగ్రీ/ పీజీ చదివినవారు తక్కువమంది. అందుకని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఇతర ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు పీహెచ్డీలో కంప్యూటర్ సైన్స్ సంబంధిత అంశంపై పరిశోధన చేసి సీఎస్ విభాగంలో బోధన ఉద్యోగాలు పొందేవారు. 1990ల్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినవారికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ విభాగంలో బోధించే అవకాశం కల్పించారు. 2000 సంవత్సరం తరువాత బీటెక్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినవారు, కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేసినవారు ఎక్కువమంది ఉండటం వల్ల కంప్యూటర్ సైన్స్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసినవారికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ అధ్యాపక ఉద్యోగాలు పొందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఈ ఇబ్బంది లేదు. కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యుత్తమ పరిశోధన పత్రాలు ప్రచురించి ఉంటే, గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా సీఎస్ విభాగంలో బోధించే అవకాశం ఇస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్య అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలో ఉంది కాబట్టి, వారి నిబంధనల ప్రకారమే ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన నియామకాలు చేపడతారు. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు బీటెక్లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఎంటెక్ డిగ్రీని బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కానీ సంబంధిత అనుబంధ యూనివర్సిటీ, వారి సర్వీసును ర్యాటిఫై చేయడం లేదు. కొన్ని యూనివర్శిటీలు మాత్రం గ్రాడ్యుయేషన్ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ చదవకుండా ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివినవారు ఎన్పీటెల్లో నాలుగు కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివి సర్టిఫికెట్ పొందితే కంప్యూటర్ సైన్స్ విభాగంలో బోధించడానికి అనుమతిస్తున్నాయి.
జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, వివిధ సబ్జెక్టుల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి, అధ్యాపక నియామకాల్లో చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇటీవల యూజీసీ జారీచేసిన జేఆర్ఎఫ్- నెట్ నోటిఫికేషన్లో 75 శాతంతో నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసినవారు నచ్చిన సబ్జెక్టులో నెట్ రాసి పీహెచ్డీ చేయవచ్చని పేర్కొన్నారు. కాబట్టి, భవిష్యత్తులో మీరు కంప్యూటర్ సైన్స్ విభాగంలో బోధించడానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీకు బోధన రంగంలో ఆసక్తి ఉంటే ముందుగా ఏదైనా ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా బోధన కెరియర్ను ప్రారంభించవచ్చు. అదే సమయంలో కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/డేటా సైన్స్లో పీహెచ్డీ చేసి, భవిష్యత్తులో ఈ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: హరీష్
Ans:
ఇంజనీరింగ్ డిప్లొమా తర్వాత బీఏ డిగ్రీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. చాలా సందర్భాల్లో, ఇంజనీరింగ్ డిప్లొమాను ఇంటర్మీడియట్కు సమానంగానే పరిగణిస్తారు. మీరు డిగ్రీ అర్హత ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు అవుతారు. అటవీ శాఖలో కూడా డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్ని దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ ఈవెనింగ్ కాలేజీ ద్వారా కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ పద్ధతిలో చదివే వెసులుబాటు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు సంవత్సరాల బీఈ ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాంను ఆరు సెమిస్టర్లలో అందిస్తారు. ఒక్కో సెమిస్టర్కు ట్యూషన్ ఫీజు 50 వేల రూపాయలు. దీనిలో ప్రవేశం పొందాలంటే, మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 45 శాతం మార్కులు పొందివుండాలి. కనీసం ఒక సంవత్సరం ఉద్యోగానుభవం ఉండి, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఈ అవకాశం సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏఐ అండ్ ఎంఎల్ ప్రోగ్రాంలో ప్రవేశానికి కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చదివినవారు మాత్రమే అర్హులు. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చదివినవారు తగినంతమంది లేకపోతే, ఇతర డిప్లొమాల వారినీ పరిగణిస్తారు. భవిష్యత్తులో ఇతర బ్రాంచీల్లో కూడా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి రావచ్చు. బిట్స్ పిలానీలో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ పద్ధతిలో బీటెక్ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. దీన్ని యూజీసీ అనుమతించింది. కానీ ఈ నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రాం ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ టెక్నాలజీ, ప్రాసెస్ ఇంజినీరింగ్ల్లో మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: డి.రాజేష్
Ans:
ప్రస్తుతం మీరు డిగ్రీ చదువుతున్నారు అంటే మీ వయసు 21 సంవత్సరాల లోపే ఉండొచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి జనరల్ కేటగిరీకి చెందినవారికి గరిష్ఠ పరిమితి 32 సంవత్సరాలు. ఓబీసీలకు 35 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 37 సంవత్సరాలు. గరిష్ఠ వయసులోగా.. జనరల్ కేటగిరీవారు 6 సార్లు, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. మీ సామాజిక నేపథ్యాన్ని బట్టి మీ గరిష్ఠ వయః పరిమితి, గరిష్ఠ అవకాశాలను నిర్థరించుకోండి. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేవారు ఐదు రకాలుగా ఉంటారు.
1) డిగ్రీ పూర్తి చేయగానే సివిల్స్ కోచింగ్ తీసుకొని మూడు, నాలుగు ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాల్లో విఫలమైతే అప్పుడు పీజీలో చేరేవారు.
2) డిగ్రీ తర్వాత నేరుగా పీజీ పూర్తిచేసి అనంతరం సివిల్స్ ప్రయత్నాలు చేసేవారు.
3) డిగ్రీ తర్వాత పీజీ చేస్తూ సివిల్స్ రాసేవారు.
4) డిగ్రీ, పీజీల తర్వాత పీహెచ్డీ చేస్తూ సివిల్స్ రాసేవారు.
5) డిగ్రీ అయ్యాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొంది కొంతకాలం కొనసాగి, సెలవు పెట్టి సివిల్స్ రాసేవారు.
అభ్యర్థి తన ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సహకారం, సివిల్స్పై ఉన్న ఇష్టం, డిగ్రీలో చదివిన సబ్జెక్టులు, సివిల్స్ కోసం ఎంచుకునే ఆప్షనల్ సబ్జెక్ట్ లాంటివి పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి రావాలి. ఈ ఐదు రకాల అభ్యర్థుల్లో ప్రతి రకానికీ కొన్ని సానుకూలతలూ, ప్రతికూలతలూ ఉంటాయి.
మీ విషయానికి వస్తే - ప్రస్తుతం డిగ్రీలో చదువుతున్న సబ్జెక్టులు, ఇప్పటివరకు మీ సివిల్స్ సన్నద్ధత, తీసుకోబోయే ఆప్షనల్ సబ్జెక్ట్, కుటుంబ ఆర్థిక స్తోమత లాంటి విభిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. చివరిగా.. సివిల్ సర్వీసెస్ పరీక్షను పీజీ/ పీహెచ్డీతో కలిపి కాకుండా కనీసం రెండేళ్ల సన్నద్ధతమీదే పూర్తి దృష్టి పెట్టి, ఆ తర్వాత మొదటి ప్రయత్నం చేస్తే మెరుగైన ఫలితాలకు ఆస్కారముంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రమేష్
Ans:
పరాయి భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిర్బంధం లేకుండా అనువాదాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగానికి ప్రాముఖ్యం పెరుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యంతో మెషిన్ లెర్నింగ్ పద్ధతులతో యంత్ర అనువాద వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, పరిశోధకులు, విలేఖరులు, అధికారులు, సమాచార కేంద్రాలు, వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు, సినిమా, బుల్లితెర వ్యవస్థల రంగాల్లో అనువాద వ్యవస్థలను వాడటం సాధారణం అవుతోంది. పైన చెప్పిన అన్ని రంగాల్లో అనువాదకుల అవసరం ఉంటుంది. జాతీయ విద్యావిధానం - 2020 నిబంధనల ప్రకారం ఉన్నత విద్యను కూడా మాతృభాషలో చదివే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో ఉన్న పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి చాలామంది అనువాదకులు అవసరం అవుతారు. ఈ రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తే హిందీ, ప్రాంతీయ, విదేశీ భాషానువాదకులుగా, ప్రూఫ్ రీడర్లుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, రాయబార కార్యాలయాల్లో, డిఫెన్స్ పరిశోధన సంస్థల్లో, వాణిజ్య ప్రకటనల సంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బహుళ జాతి సంస్థల్లో, మొబైల్ ఫోన్ కంపెనీల్లో అనువాదకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఉపేందర్
Ans:
కెరియర్లో విరామం రావడంతో పాటు వయసు కూడా ఎక్కువ కావడం వల్ల ఉద్యోగావకాశాలు రావడం లేదు అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివినవారు ఎక్కువమంది అందుబాటులో ఉన్నందున బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు కొంతమేరకు తగ్గాయి. మీకు ప్రోగ్రామింగ్ మీద పట్టులేదంటున్నారు కాబట్టి కొత్త కోర్సులు నేర్చుకోవడమూ కొంత కష్టం కావొచ్చు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కంప్యూటర్ కోర్సులు కాకుండా మీకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని దానిలో స్థిరపడే కోర్సులు చదివే ప్రయత్నం చేయండి.
మేనేజ్మెంట్ రంగంలో ఆసక్తి అంటే ఎంబీఏ, జర్నలిజం ఇష్టమైతే ఎంఏ జర్నలిజం, బోధన రంగంలో అభిరుచి ఉంటే బీఈడీ, కౌన్సెలింగ్పై అభిలాష ఉంటే సైకాలజీ పీజీ, ఇంగ్లిష్పై ఆసక్తి ఉంటే ఎంఏ ఇంగ్లిష్, సోషల్ సైన్స్ ఇష్టమైతే పీజీలో ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రపాలజీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ‡, రూరల్ డెవలప్మెంట్, జాగ్రఫీ లాంటివి చదవొచ్చు. నిజమైన ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. బీసీఏని కంప్యూటర్ కోర్సుగా కాకుండా ఒక డిగ్రీ కోర్సుగా భావించి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించండి.
స్వయం ఉపాధి మార్గాల విషయానికి వస్తే- బీసీఏ చదివారు కాబట్టి, కంప్యూటర్ యాక్సెసరీ స్టోర్, కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్, మొబైల్ సర్వీసింగ్ సెంటర్, కంప్యూటర్ నెట్వర్క్స్లాంటి వాటి గురించి ఆలోచించండి. ఒకవేళ కంప్యూటర్స్కు సంబంధం లేని వ్యాపారం చేయాలనుకుంటే చిన్న కిరాణా దుకాణం మొదలు, మిల్క్ సెంటర్, హార్డ్వేర్ స్టోర్స్, స్టేషనరీ స్టోర్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ స్టోర్స్ లాంటివీ ఆలోచించవచ్చు. చదివిన చదువుకు తగ్గ ఉపాధి దొరక్కపోతే, మనసుకి నచ్చిన పని చేయాలి. అదికూడా కుదరకపోతే, ఆదాయం ఎక్కువగా వచ్చే ఉపాధిని వెతుక్కోవాలి. మారుతున్న పరిస్థితుల్లో కోర్సుతో సంబంధం లేకుండా నిజాయతీగా ఎలాంటి పని చేయడానికైనా ఇబ్బంది పడకపోతే, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వంశీకృష్ణ
Ans:
మీరు డిగ్రీలో ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో ఇప్పటికే ఉత్తీర్ణత సాధించారు కాబట్టి నిరభ్యంతరంగా సీపీజీఈటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్షను గత కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. సీపీజీఈటీ రాయడానికి ఇప్పటికే డిగ్రీ పూర్తయినవారు, అడ్మిషన్ అయ్యేనాటికి డిగ్రీ పూర్తి చేయగలిగేవారు అర్హులు. డిగ్రీలో 40 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా కనీస ఉత్తీర్ణత సరిపోతుంది. కంపార్ట్మెంట్లో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా నిర్థారిత మార్కుల శాతం పొందితే, సీపీజీఈటీ రాయడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి వయః పరిమితి లేదు. నోటిఫికేషన్ ప్రకారం - సోషల్ సైన్స్, హ్యుమానిటీస్కు సంబంధించిన చాలా సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశపరీక్ష రాయడానికి డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినా అర్హత ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 17 జూన్, 2024 చివరి తేదీ. 2000 రూపాయిల అపరాధ రుసుముతో 30 జూన్, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీపీజీఈటీని 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో, 90 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: అభిలాష్
Ans:
చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్హత సరిపోతుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ చాలా కేంద్ర/ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. బోధన, పరిశోధన, అడ్మినిస్ట్రేషన్ లాంటి ప్రత్యేక ఉద్యోగాలకు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ లాంటి ఉన్నత విద్య అవసరం. ఇంటర్లో మ్యాథ్స్ చదవడం వల్ల పోటీపరీక్షల్లో కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. చాలా ఉద్యోగ పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్ లాంటి అంశాలు ఉంటాయి. మ్యాథ్స్లో శిక్షణ పొందినవారికి, ఇతర సబ్జెక్టులు చదివినవారితో పోలిస్తే, ఈ సెక్షన్లలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ చదివిననవారికి జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వీలుంటుంది.
కానీ ఇటీవలి పోటీ పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తే- మ్యాథ్స్, ఇంజినీరింగ్ చదివినవారు కూడా జనరల్ స్టడీస్లో మెరుగైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే సమస్యా పరిష్కారంలో మెలకువలు పెరుగుతాయి. లాజికల్ రీజనింగ్కు సంబంధించిన అంశాలు కూడా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంటర్లో మ్యాథ్స్ చదవడం వల్ల కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ లాంటి సబ్జెక్టులు చదవడానికి అర్హత ఉంటుంది. గణితంపై పట్టు ఉంటే పోటీ పరీక్షలతో పాటు, విదేశాల్లో విద్య అభ్యసించడానికి అవసరమైన జీఆర్ఈ, జీమ్యాట్ లాంటి పరీక్షల్లో కూడా రాణించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎ.పవన్ కుమార్
Ans:
సాధారణంగా ఎంబీఏ చదివినవారికి విభిన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంబీఏ స్పెషలైజేషన్తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో చదివిన కోర్సులు, గత ఉద్యోగానుభావం లాంటి అంశాలు మరో ఉద్యోగంలోకి మారడానికీ, పదోన్నతికీ దోహదపడతాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్ ్లో ఎంబీఏ చేస్తే, మీ ఉద్యోగావకాశాలు ఆయిల్, గ్యాస్ రంగాలకే పరిమితం అవుతాయి. ఇప్పటికే ఆయిల్, గ్యాస్ రంగంలో పనిచేసేవారు ఈ కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం. విదేశాల్లో ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం అవసరం. ఎంబీఏలో ఆపరేషన్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి స్పెషలైజేషన్తో చదివితే గ్యాస్, ఆయిల్ రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను అతి తక్కువ యూనివర్శిటీలు మాత్రమే అందిస్తున్నాయి. మన దేశంలో దీన్ని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, దేహ్రాదూన్ అందిస్తోంది. ఈ ప్రోగ్రాం యూకే, ఆస్ట్రే లియా, యూఎస్ యూనివర్సిటీల్లో ఎంబీఏలో కాకుండా.. ఎంఎస్లో భాగంగా అందుబాటులో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్, యూనివర్సిటీ ఆఫ్ డూండీ, బ్రూనెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గ్లాస్గో కలేడోనియన్ యూనివర్సిటీ, కొవెంట్రీ యూనివర్సిటీ, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీల్లో పీజీలో ఈ స్పెషలైజేషన్ ఉంది. ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లకు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్