Asked By: prasanth
Ans:
ఇంటర్మీడియట్లోనే సివిల్స్ గురించి ఆలోచించడం అభినందనీయం. సివిల్ సర్వెంట్ అవ్వాలంటే, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాలి. సివిల్స్ లాంటి పరీక్షకు డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సన్నద్ధం అయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ముందుగా యూపీఎస్సీ వెబ్సైట్ని సందర్శించి సివిల్ సర్వీసెస్కు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించండి, ఈ పరీక్షపై ఒక అవగాహన ఏర్పర్చుకోండి. సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకోండి. క్రమం తప్పకుండా వార్తా పత్రికలను చదవండి. సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలను తప్పకుండా అనుసరించండి. ఇప్పటికే ఈ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారి సలహాలూ, సూచనలను స్వీకరించండి.
దినపత్రికలు ప్రచురించే, సామాజిక మధ్యమాలు అందించే సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందండి. కమ్యూనికేషన్ నైపుణ్యాలను, విషయ విశ్లేషణ సామర్ధ్యాలను పెంపొందించుకోవటం అవసరం. సీశాట్ కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కండి. మెయిన్స్ పరీక్షకు రాయబోయే ఆప్షనల్ సబ్జెక్టును ముందే ఎంచుకోవటం మంచిది. రోజుకి ఎన్ని గంటలు చదవాలనుకొంటున్నారో, అందుకు అనుగుణంగా షెడ్యూల్ను సిద్ధం చేసుకోండి. చదివిన విషయాల్ని వీలున్నప్పుడల్లా పునశ్చరణ చేస్తూ ఉండాలి. వీలున్నన్ని మాక్ టెస్ట్లు రాయటమూ మేలు చేస్తుంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు పెంచుకుంటేనే ఈ ప్రశ్నలకు సులువుగా, మెరుగ్గా సమాధానాలు రాయగలరు. ముఖ్యంగా మెయిన్స్ పరీక్షలో రాయవలసిన దీర్ఘ వ్యాసాలపై అవగాహన పెంచుకొని, అవి రాయడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఈ విషయాలన్నింటినీ పాటిస్తూ సివిల్ సర్వీసెస్కు తయారుకండి. జాతీయ విద్యావిధానం- 2020 అమలు చేస్తున్న యూనివర్సిటీ/ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ కలిపి చదివే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన బకెట్ సిస్టం ద్వారా డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్ కలిపి చదివే అవకాశం ఉంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు పెంచుకుంటేనే ఈ ప్రశ్నలకు సులువుగా, మెరుగ్గా సమాధానాలు రాయగలరు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సుధీర్
Ans:
ఇంటర్ తర్వాత ఏ డిగ్రీ చదవాలి అన్న నిర్ణయానికి ముందు, మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలపై స్పష్టత అవసరం. మీరు ఇష్టపడుతున్నది ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు కొలువా? మీకు బోధన రంగంపై ఆసక్తి ఉందా? పరిశోధన అభిరుచి ఉందా? కెమికల్/ ఫార్మా పరిశ్రమల్లో పనిచేయడమా? విదేశాల్లో స్థిరపడటమా? మనదేశంలోనే ఉండటమా? అనే విషయాలకు సమాధానం తెలుసుకోండి. కెమిస్ట్రీ ప్రధానంగా డిగ్రీ చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లేవు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, పీహెచ్డీ కెమిస్ట్రీ చదివితే జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, విశ్వవిద్యాలయాలూ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కెమికల్ ఇంజినీర్గా, పెట్రోలియం ఇంజినీర్గా, అనలిటికల్ కెమిస్ట్గా, క్వాలిటీ ఇంజినీర్గా ఉద్యోగావకాశాలుంటాయి. కెమికల్ ఇంజినీరింగ్లో పీజీ, పీహెచ్డీ చేసి జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమిస్ట్రీలో, కెమికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేసినవారికి మనదేశంలో కంటే, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. కానీ విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ పెరిగిపోయింది. ఏదేశంలో అయినా మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవటం అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్.నర్సింగ్
Ans:
కామర్స్, ఆర్ట్స్లో ఏది మెరుగు అంటే, చెప్పడం చాలా కష్టం. ఏ కోర్సుకు అదే మెరుగు. ప్రతి డిగ్రీకీ మెరుగైన ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉపాధి అవకాశాలు కోర్సును బట్టి కాకుండా, ఆ డిగ్రీ చదివే వ్యక్తిపై, ఆ డిగ్రీ అందిస్తున్న విద్యాసంస్థపై కూడా ఆధారపడి ఉంటాయి. మీ అమ్మాయిని ఇంటర్లో కామర్స్లో చేర్చినప్పుడు ఏ ఉద్దేశంతో చేర్చారు? అది ఆమె నిర్ణయమా? మీ నిర్ణయమా? మీ అమ్మాయి ఇంటర్లో కామర్స్ని ఎలా చదివింది? ఇప్పుడు ఆర్ట్స్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? కామర్స్ మీద ఆసక్తి లేకా? ఆర్ట్స్పై ఆసక్తి ఉండా? మెరుగైన ఉపాధి అవకాశాల కోసమా? ఈ విషయాలపై స్పష్టత ఉంటే కానీ, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. మీ అమ్మాయి స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలు, ఆసక్తి, అభిరుచి, పట్టుదల, కష్టపడే తత్వం, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, కుటుంబ ఆర్థిక స్తోమత, కుటుంబ సహకారం లాంటి చాలా అంశాలు కెరియర్ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. బీకాం చదివినా, బీఏ చదివినా, డిగ్రీతో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ ఉద్యోగాలకూ సమాన అర్హత ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ లాంటి కొన్ని ఉద్యోగాలకు మాత్రం కామర్స్ చదివినవారు మాత్రమే అర్హులవుతారు. బీఏ, బీకాం డిగ్రీలతో బీఈడీ, పీజీలు చేయవచ్చు. ప్రైవేటు రంగంలో ఆర్ట్స్ చదివినవారి కంటే కామర్స్ చదివినవారికి కొన్ని ఉద్యోగావకాశాలు అదనంగా ఉంటున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వి.సురేష్, వరంగల్
Ans:
మీరు ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పలేదు. రిటైల్ మార్కెటింగ్లో డిప్లొమా ఎందుకు చేయాలనుకుంటున్నారు? డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాంలు.. ఆ రంగంలో అప్పటికే ఉద్యోగం చేస్తున్నవారి పదోన్నతికి ఉపయోగపడతాయి కానీ, కొత్తగా ఉద్యోగం పొందటానికి కాదు. మీ ప్రస్తుత వయసును బట్టి కూడా నిర్ణయించుకోవాలి. మీకు రిటైలింగ్ రంగంపై నిజమైన ఆసక్తి ఉందా? ఆ రంగంలో ఉద్యోగాలు ఎక్కువని ఆ వైపు వెళ్లాలనుకొంటున్నారా? మీకు రిటైలింగ్పై ఆసక్తి ఉంటే, ముందుగా ఆన్లైన్లో సంబంధిత కోర్సులు కొన్ని చేసి ఆ రంగంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పర్చుకోండి. ఆ తరువాత ఏదైనా ప్రముఖ రిటైలింగ్ సంస్థలో ఓ చిన్న ఉద్యోగంలో చేరి కొంత అనుభవం, నైపుణ్యాలు గడించండి. మీకు ఆ రంగంలో ఉద్యోగం నచ్చితే రిటైలింగ్లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్ విధానంలో, అత్యుత్తమ విద్యా సంస్థల నుంచి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
మీరు 2013లో బీటెక్ డిస్కంటిన్యూ చేశారంటే, మీ వయసు దాదాపుగా 30 ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఆ రంగంలో స్థిరపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీటెక్లో ఏ బ్రాంచిలో చేరారు అన్న విషయాన్ని చెప్పలేదు. మీరు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఎంబీఏ చదవడానికి అర్హత లేదు. బీఏ/బీకాం/బీబీఏల్లో మీకు నచ్చిన డిగ్రీని ఆన్లైన్/ దూరవిద్య ద్వారా పూర్తి చేయండి. ఆ తరువాత ఎంబీఏ- మార్కెటింగ్ కానీ, ఎంబీఏ- రియల్ ఎస్టేట్ కానీ చదివే ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నా కనీసం డిగ్రీ విద్యార్హత అవసరం. మీ రియల్ ఎస్టేట్ ఉద్యోగానుభవం, సాఫ్ట్వేర్ రంగంతో సంబంధం లేకపోవడం, ఇంటర్కూ, పూర్తి చేయబోయే డిగ్రీకీ మధ్య అధిక వ్యవధి.. ఈ కారణాలతో సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం పొందడం కొంత కష్టమే. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొనసాగిస్తూనే డిగ్రీ/ఎంబీఏ పూర్తిచేసి, రియల్ ఎస్టేట్ రంగంలోనే మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
సాధారణంగా జర్నలిజం చదివినవారికి, ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పబ్లిక్ రిలేషన్స్/ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లుగా చేరవచ్చు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. జర్నలిజం చదివినవారికి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, దానికి సమానమైన రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్లో వివిధ విభాగాలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్, న్యూ మీడియా వింగ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పబ్లికేషన్స్ డివిజన్, రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాల్లో ఉపాధి ప్రయత్నాలు చేయవచ్చు. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే- జర్నలిజం కళాశాలల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. జర్నలిజంలో శిక్షణ పొందినవారికి ప్రైవేటు రంగంలో విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకొని కొంత ఉద్యోగానుభవం గడిస్తే వేతనం, హోదా కూడా పెరుగుతాయి. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి పెన్షన్ సదుపాయం లేదు. అందుకని ఉద్యోగ భద్రత మినహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రైవేటు రంగంలో సర్వీసు, వయసుతో పనిలేకుండా ప్రతిభ ఆధారంగా పదోన్నతులూ, అధిక వేతనాలకు ఆస్కారం ఉంటుంది. జర్నలిజం రంగంలో ప్రైవేటు ఉద్యోగాల్లో సృజనాత్మకతకు అవకాశం అధికం. ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగం వస్తే నిరుత్సాహపడకుండా చేరి నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం.నాగరాజు
Ans:
సాధారణంగా ఐఐఎంల్లో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాం చేయాలంటే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. బిట్స్ పిలానీలో 10 లక్షల నుంచి 12 లక్షల వరకు, ఎండీఐ - గుడ్గావ్, నార్సిమొంజి - ముంబయి, సింబయాసిస్ - పుణె, ఐఎంటీ- ఘజియాబాద్ల్లో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పైన చెప్పిన అన్ని బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ చదవడానికి విద్యా రుణం వచ్చే అవకాశం ఉంది. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఐదు లక్షల రూపాయల లోపే ఫీజు ఉంటుంది. దీనికి కూడా విద్యారుణం వెసులుబాటు ఉంది. ఐఐఎం/ ఐఐటీ, ఎండిఐ, ఐఎంటీల్లో ప్రవేశానికి క్యాట్, నర్సీమోంజిలో ప్రవేశానికి ఎన్ మ్యాట్, సింబయాసిస్లో ప్రవేశానికి స్నాప్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రవేశానికి సీయూఈటీ (పీజీ) పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపరచాలి. తర్వాత రిటన్ ఎబిలిటీ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూల్లో కూడా ప్రతిభ చూపితే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్.రమేష్కుమార్
Ans:
మీరు ఎంఏ పూర్తి చేశారంటే, మీ వయసు కనీసం 23 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేస్తే, మరో రెండేళ్లు చదవాలి. అంతేకాకుండా, మీకంటే పది సంవత్సరాలు తక్కువ వయసున్నవారితో కలిసి విద్య అభ్యసించాలి. ఐటీఐ చేశాక కూడా ఉద్యోగం రావడం కష్టమయితే, అప్పుడు ఏం చేస్తారు? మీకు ఐటీఐ కోర్సు అంటే ఇష్టమా, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనా? ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికీ చాలా పోటీ ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు వేలల్లో ఉంటే, వాటికి అర్హులయిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే- అందుబాటులో ఉన్న తక్కువ కొలువుల కోసం పోటీ పడి, మెరుగైన ప్రతిభతో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయాలి.
చాలామంది ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే భావనతో ఉంటున్నారు. ముందుగా దీన్నుంచి బయటకు వచ్చి నచ్చిన పని చేస్తూ సంబంధిత రంగంలో ఎదిగే ప్రయత్నం చేయటం ఉత్తమం. ఒకవేళ మీరు ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందినా, మీ పీజీ చదువుకు తగిన ఉద్యోగం పొందలేక పోయానని బాధ పడవచ్చు. అలా కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీతో కానీ, మీ డిగ్రీ విద్యార్హతతో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. బీఈడీ చేసి బోధనరంగంలో ప్రయత్నాలు చేయవచ్చు. బీఈడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ డీ… ఎస్సీ కోసం మాత్రమే ఎదురుచూడకుండా నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఆసక్తి/ అవకాశం ఉంటే జర్నలిజం, లైబ్రరీ సైన్స్, మేనేజ్మెంట్, ఎల్ఎల్బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల గురించి కూడా ఆలోచించండి. ఇంగ్లిష్ భాషపై కొంత పట్టుంటే ఎంఏ ఇంగ్లిష్ చదివి బోధన రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. మీ పీజీ విద్యార్హతతో స్వచ్ఛంద సేవాసంస్థల్లో, ప్రభుత్వేతర సంస్థల్లో, రిటైలింగ్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవన్నీ వీలుకాకపోతే మీరు అనుకున్నట్లుగా, ఐటీఐ చేసి మీరనుకుంటున్న కోర్సులూ.. కొలువుల ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వినయ్ చెవ్వ
Ans:
చాలా కాలంగా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పద్ధతిని అవలంబిస్తూ పీహెచ్డీ ప్రవేశాలు చేపడుతున్నాయి. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపర్చినవారికి ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధన సంస్థలు యూజీసీ/ సీఎస్ఐఆర్ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందిన విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. నెట్ (నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్)లో ఉత్తీర్ణత పొందినవారికి కూడా చాలా యూనివర్సిటీలు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఎంఫిల్ పూర్తి చేసినవారికి కూడా రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాగే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో మంచి పర్సంటైల్ పొందినా, రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో పైన చెప్పినవాటికి అదనంగా స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (సెట్)లో అర్హత పొందినవారు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్డీలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం ఉంది. నెట్/ సెట్లో ఉత్తీర్ణత పొందలేకపోతే, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఆర్సెట్ (రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)లో మెరుగైన ర్యాంకు పొంది, ఇంటర్వ్యూ ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశం పొందవచ్చు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత నెలలో యూజీసీ పీహెచ్డీ ప్రవేశాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాలకు నెట్ పరీక్షను ప్రాతిపదికగా తీసుకొమ్మని సూచించింది. ఇక నుంచి యూజీసీ/ సీఎస్ఐఆర్ నెట్లో ఉత్తీర్ణత పొందినవారిని పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మూడు విభాగాలు చేస్తారు. మొదటిది - నెట్ - జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్. రెండోది- అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్. మూడోది- ప్రత్యేకంగా పీహెచ్డీ ప్రవేశాల కోసం మాత్రమే నిర్దేశించారు. ఈ మూడు విభాగాల్లో దేనిలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ ద్వారా నేరుగా పీహెచ్డీలో ప్రవేశం పొందవచ్చు. ఈ సూచన పూర్తిస్థాయిలో అమలవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మీరు జేఆర్ఎఫ్/ నెట్/ సెట్/ ఆర్సెట్లలో ఉత్తీర్ణత సాధించి స్టేట్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశానికి ప్రయత్నించవచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే భవిష్యత్తులో పీహెచ్డీ ప్రవేశం కష్టం కావచ్చు. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే ఏదైనా స్టేట్ యూనివర్సిటీలో ఆర్సెట్ ద్వారా పీహెచ్డీ ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి. పీహెచ్డీ ప్రవేశం పొందలేకపోతే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పోటీ పరీక్షల్లో, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. జూనియర్ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు పీహెచ్డీ/ నెట్/ సెట్ అవసరం లేదు కాబట్టి వాటికి పోటీపడొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీహరి
Ans:
డిగ్రీ, పీజీలను దూరవిద్య/ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివినా, రెగ్యులర్గా చదివినా వాటి విలువల్లో ఎలాంటి మార్పూ ఉండదు. అన్ని రకాల డిగ్రీలను వివిధ యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు లోబడే జారీ చేస్తాయి. డిగ్రీని దూరవిద్య/ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివిన చాలామంది సివిల్ సర్వీసెస్, అధ్యాపక ఉద్యోగ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లలో డిగ్రీ/ పీజీ నిర్ధారిత శాతం మార్కులుండాలని మాత్రమే పేర్కొంటారు. డిగ్రీ/ పీజీ రెగ్యులర్గానే చదివి ఉండాలని ఉండదు. స్వల్పంగా కొన్ని బోధన/ పరిశోధన ఇంటర్వ్యూల్లో మాత్రం రెగ్యులర్ డిగ్రీలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ నిబంధనల ప్రకారం రెగ్యులర్/ దూరవిద్య/ ఆన్లైన్ ద్వారా చదివిన కోర్సుల మధ్య తేడా ఏమీ లేదు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమలైనపుడు అన్ని రకాల డిగ్రీలనూ ఒకే విధంగా పరిగణించే అవకాశం ఉంది. బీఈడీ, డీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను రెగ్యులర్గా మాత్రమే చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు చెబుతున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. అదేవిధంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఎల్ఎల్బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను కూడా దూరవిద్యా విధానంలో చేసే అవకాశం లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్