Post your question

 

    Asked By: prasanth

    Ans:

    మీరు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, బీఈడీ చేశాక ‘డీ…ఎస్సీకి అర్హత లేదు’ అని ఎందుకు అన్నారో కారణం తెలుసుకొని ఉండాల్సింది. అప్పుడే మీరు ఉన్నతాధికారులనో, న్యాయస్థానాన్నో ఆశ్రయించివుంటే, మీ సమస్యకు పరిష్కారం లభించివుండేది. మీరు ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివిన విద్యాసంస్థను సంప్రదించి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు విడివిడిగా ఇస్తారేమో కనుక్కోండి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ఎగ్జిట్‌ క్లాజ్‌ ప్రవేశపెట్టి యూజీ, పీజీ రెండు డిగ్రీలూ ఇస్తున్నాయి. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే- మీరు బీఈడీ చేసిన తరువాత డిగ్రీ చదివినా, డీఎస్సీకి అర్హులవుతారు. మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బీఈడీ తరువాత డిగ్రీ చేశారు కాబట్టి ఆ విషయాన్ని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే పై అధికారుల్ని కలవండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక, ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు నిరభ్యంతరంగా డీఎస్సీకి సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    బీబీఏ చేసి సప్లై చెయిన్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సబ్జెక్టులో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ను అందించే విద్యాసంస్థలు ఎక్కువ. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా విదేశాల్లోనే అధికం. కాకపోతే, విదేశాల్లో విద్యాభ్యాసానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ కాబట్టి విదేశీ విద్య విషయంలో కొంతకాలం వేచివుండటం మంచిది. ఇక మనదేశంలో ఐఐఎం కోజికొడ్, ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం ఉదయ్‌పుర్, ఐఐటీ రూర్కి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, మణిపాల్‌ యూనివర్సిటీ, నిక్‌మార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌/ డెసిషన్‌ మేకింగ్‌/ టైం మేనేజ్‌మెంట్‌/ కమ్యూనికేషన్‌ మెలకువలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి స్పీచ్‌ థెరపీ కోర్సులను నేర్చుకోవాలన్న మీ కోరిక అభినందనీయం. సాధారణంగా ఇలాంటి కోర్సులను ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. మీకు రెగ్యులర్‌ కోర్సులు చదవడానికి వీలు అవ్వకపోతే- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, దిల్లీ స్టేట్‌ గవర్నమెంట్‌ పారామెడికల్‌ కౌన్సిల్, యుడెమిల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌ కూడా స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం- ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌/ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ పూర్తి అయి ఉండాలి. అదనంగా టెట్‌/ సీ టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల అభ్యర్థనల మేరకు కొన్ని సందర్భాల్లో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీఈడీ../ బీఈడీ చివరి సెమిస్టర్‌/ సంవత్సరం చదువుతున్నవారికి కూడా డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కానీ, డీ.. ఎస్సీ ఫలితాలు విడుదలై, సర్టిఫికెట్ల పరిశీలన నాటికి డీఈడీ/ బీఈడీ ఫలితాలు వచ్చి ఉండాలి.
    మీ విషయానికొస్తే.. ప్రస్తుతం బీఈడీ మూడో సెమిస్టర్‌లో ఉన్నారు. బీఈడీ పూర్తి అయి ఫలితాలు వచ్చేవరకు మరో సంవత్సరం పట్టొచ్చు. టెట్‌ రాయాలంటే మీరు బీఈడీ రెండో సంవత్సరంలో ఉండాలి. టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక దానికి దరఖాస్తు చేసి అందులో ఉత్తీర్ణత సాధిస్తే, తర్వాత వచ్చే డీ.. ఎస్సీ నోటిఫికేషన్‌లో బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి అవకాశం కల్పిస్తే, మీరు ఆ డీఎస్సీకి అర్హులవుతారు. బీఈడీ చదువుతూ ఒకే సంవత్సరంలో టెట్, డీఎస్సీ లాంటి రెండు పోటీ పరీక్షలకు సన్నద్ధత సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో మీరు ప్రస్తుతం చదువుతున్న బీఈడీ శిక్షణపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుగా మీరు బీఈడీ కోర్సును శ్రద్ధగా చదువుతుండండి. టెట్‌/ సీటెట్‌కు దరఖాస్తు చేసి, అందులో ఉత్తీర్ణత సాధిస్తే, వచ్చే సంవత్సరం వెలువడే డీఎస్సీ నోటిఫికేషన్‌కు మీరు అర్హులవుతారు.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: prasanth

    Ans:

    మీరు ఇంటర్మీడియెట్‌ 2014లో అంటే, దాదాపు పదేళ్ల క్రితం పూర్తిచేశారు. పదో తరగతిని బట్టి మీ వయసు అటు ఇటుగా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా అనే విషయంపై స్పష్టత అవసరం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుతో ఐటీఐ చేశారు కాబట్టి కంప్యూటర్‌ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ముందుగా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా కానీ, దూరవిద్య ద్వారా కానీ కంప్యూటర్‌ కు సంబంధించిన సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయండి. ఈలోగా కొన్ని కంప్యూటర్‌ కోడింగ్, ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకోండి. డిగ్రీ చదువుతూనే కొంత అనుభవం గడించండి. డిగ్రీ పూర్తయ్యాక ఈ అనుభవంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాబట్టి డిగ్రీని పూర్తిచేయడం చాలా అవసరం. ఇలాచేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పలు పరీక్షలకు అర్హులవుతారు. అలా కాకుండా మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ, న్యాయవాది అవ్వాలనుకొంటే ఎల్‌ఎల్‌బీ, జర్నలిస్ట్‌ కావాలంటే జర్నలిజం, లెక్చరర్‌ అవ్వాలనుకొంటే మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    నటన అంటే చాలా ఇష్టం అన్నారు. కానీ  ఇప్పటివరకు మీరు నటన ఎక్కడైనా నేర్చుకొన్నారా, ఏమైనా సాధన చేశారా? పాఠశాల, కళాశాలల్లో నటించిన అనుభవం ఉందా? కొన్ని శిక్షణ సంస్థలు నటనకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి నటనలో పూర్వానుభవం కూడా ఉండాలని ఆశిస్తాయి. నటనలో ప్రాథమిక కోర్సులు చేయాలనుకుంటే- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ స్టూడియోల నుంచి కూడా నటనకు సంబంధించిన అనేక స్వల్పకాలిక వర్క్‌షాపులు ఉన్నాయి. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్, మధు ఫిలిం ఇన్‌స్ట్టిట్యూట్, మయూఖ మొదలైన సంస్థల్లో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా నట శిక్షణ సంస్థలో చేరేముందు, ఆ సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి. మీకు ఇప్పటికే థియేటర్‌ యాక్టింగ్‌లో కొంత శిక్షణ, అనుభవం ఉంటే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, బెంగళూరులో ఒక సంవత్సరం యాక్టింగ్‌ కోర్సు చేయొచ్చు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా దిల్లీలో మూడేళ్ల ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణేలో రెండేళ్ల యాక్టింగ్‌ కోర్సు ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలు థియేటర్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. నటనలో రాణించాలంటే.. నైపుణ్యాలతో పాటు అనుభవం, సామర్థ్యం, పరిజ్ఞానం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదివితేనే వృత్తి నైపుణ్యాలు మెరుగవుతాయి. ఒకవేళ, మీరు ప్రస్తుతం అదే రంగంలో పనిచేస్తూ, విద్యార్హతలు పెంచుకోవాలనుకొంటే కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. సాధారణంగా టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ కోర్సులను ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు బీఆర్క్‌ చదివినవారికి మాత్రమే రెగ్యులర్‌ పద్దతిలో అందిస్తున్నాయి. అతికొద్ది విద్యాసంస్థలు మాత్రమే టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పీజీ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని  అందిస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, దిల్లీ.. సిటీ అండ్‌ మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌నూ, ఐఐటీ ఖరగ్‌పూర్‌.. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌లో, ఐఐటీ రూర్కీ.. ఇంట్రడక్షన్‌ టు సర్వీసెస్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు/ విదేశీ యూనివర్సిటీలు కూడా టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకొని ప్రవేశం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ది గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం దూరవిద్య ద్వారా అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను 88.85 శాతంతో పూర్తిచేసి బీటెక్‌ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు బీటెక్‌ని కూడా కనీసం 70 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌ లాంటి పరీక్షల్లో కూడా మంచి స్కోరు పొందండి. అప్పుడు మీ మొత్తం విద్యార్హతల్లో ఒక్క పదో తరగతిలోనే తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి, మీ ఎంఎస్‌ అడ్మిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మంచి విదేశీ యూనివర్సిటీ నుంచి మంచి పర్సెంటే జ్‌తో ఎంఎస్‌ పూర్తి చేసి, ఆ కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పొందినట్లయితే, మీ ఉద్యోగాన్వేషణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
    గతంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ, వర్తమానంలో చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోకండి. విదేశీ యూనివర్సిటీలు, విదేశీ ఉద్యోగ సంస్థలు ఒక అభ్యర్థికి విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించేప్పుడు మార్కుల కంటే ఎక్కువగా వ్యక్తిత్వం, ప్రేరణ, భవిష్యత్‌ ప్రణాళికలు, పోటీ పరీక్షలో వచ్చిన స్కోర్లు, రిఫరెన్స్‌ లెటర్స్, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇవన్నీ మూల్యాంకనం చేసి అడ్మిషన్‌/ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మీకు తక్కువ మార్కులు వచ్చాయన్నది పక్కన పెట్టి, ఇప్పుడు చదువుతున్న కోర్సుపై శ్రద్ధ పెట్టండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    మీరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్‌ ఏ సంవత్సరంలో తీసుకున్నారో చెప్పలేదు. డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో 2017 నుంచి సీబీసీఎస్‌ (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం)ను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో డిగ్రీ పూర్తయ్యాక, అదనపు కోర్సును చదివే వెసులుబాటు లేదు. 2017కి ముందు అడ్మిషన్‌ తీసుకొన్నవారికి ఈ వెసులుబాటు ఉండేది. సీబీసీఎస్‌ పథకం మొదలై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి, ప్రస్తుతం అదనపు సబ్జెక్టు చదివే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీని  సంప్రదించి ఇలాంటి వెసులుబాటు ఇస్తారేమో కనుక్కోండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, కల్పించే వెసులుబాట్లు పాత విద్యార్థులకు వర్తింపచేస్తారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేము. మరింత సమాచారం కోసం డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో స్టూడెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ను సంప్రదించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాం లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది. చాలా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా బీసీఏ చదివే అవకాశం ఉంది. ఇటీవల చాలా ప్రైవేటు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బీసీఏ ప్రోగ్రాంలో కూడా ఇంటర్‌ ఏ సబ్జెక్టుతో చదివినా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ లాంటి ప్రోగ్రాంలు మాత్రమే ఏఐసీటీఈ పరిధిలో ఉండేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీబీఏ, బీసీఏ ప్రోగ్రాంలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనుంచి ఏఐసీటీఈ వారు నిర్థ్ధరించిన విద్యార్హతలతోనే  బీసీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.
    జాతీయ విద్యావిధానం- 2020 ప్రకారం ఏఐసీటీఈ చాలా విద్యార్హతలను సమీక్షిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా 29 ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్స్‌లో 10 ప్రోగ్రామ్స్‌కి ఇంటర్‌లో మ్యాథ్స్‌ కోర్సును చదివి ఉండాలన్న నిబంధనను మినహాయించారు. ఈ  మినహాయింపు ఇచ్చినవాటిలో కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ ఏమీ లేవు. మీరు బీసీఏ ప్రోగ్రాంకు అర్హులా? కాదా అనే విషయం తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. చివరిగా ఇంజనీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ కోర్సులు చదవాలంటే మ్యాథమెటిక్స్‌ ప్రావీణ్యం చాలా అవసరం. అవకాశం ఉంటే, గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి నైపుణ్యాలు పెంచుకోండి.
    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాంలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌