Post your question

 

    Asked By: లోకేష్‌

    Ans:

    హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే తొందరలో చాలామంది బోగస్‌ కన్సల్టెన్సీల్లో డబ్బు కట్టి మోసపోతున్నారు. మీరు కన్సల్టెన్సీని సంప్రదించే ముందు కొంత హోమ్‌ వర్క్‌ చేసుకోండి. ముఖ్యంగా ఆ కన్సల్టెన్సీ విశ్వసనీయత పూర్తిగా తెలుసుకోండి. ఒక్కదానిమీదే ఆధారపడకుండా రెండు మూడు కన్సల్టెన్సీలను సంప్రదించి వాటి సమాచారాన్ని తెలుసుకోండి. మీ కళాశాల సీనియర్లు ఎవరైనా దుబాయ్‌లో పనిచేస్తుంటే, వారి ద్వారా అక్కడి ఉద్యోగ మార్కెట్‌ సమాచారాన్ని సేకరించండి. వారు దుబాయ్‌లో ఎలా ఉద్యోగం పొందారో కూడా కనుక్కోండి. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, సరైన కన్సల్టెన్సీని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఇంటర్‌నెట్‌లో కూడా కన్సల్టెన్సీల గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. వీలైనంత వరకు కన్సల్టెన్సీతో సంబంధం లేకుండా అక్కడ ఉద్యోగం పొందే అవకాశాల గురించీ ఆలోచించండి. కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్ళడంపై పూర్తి నమ్మకం లేకపోతే, మనదేశంలో ఉన్న అంతర్జాతీయ హోటల్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి, బదిలీ ద్వారా దుబాయ్‌ వెళ్లే మార్గం ఉంది. అక్కడ కొంతకాలం పనిచేసి, ఆ తరువాత దుబాయ్‌లో మరో ఉద్యోగం పొందే ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కృష్ణ కోటి

    Ans:

    మీరు తొమ్మిది సంవత్సరాల క్రితం బీటెక్‌ పూర్తి చేశారంటే మీ వయసు 31 ఏళ్లు ఉండొచ్చు. చాలా కేంద్రప్రభుత్వ, బ్యాంకు, పోలీసు ఉద్యోగాలకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల వయః పరిమితి 18-32 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరికొన్ని సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు అయితే జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 42/44 సంవత్సరాల వయసు వరకు పోటీపడవచ్చు. బీటెక్‌లో మీది ఏ బ్రాంచో చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు కూడా వయః పరిమితి 42/44 సంవత్సరాల వరకు ఉంది. కానీ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్ని వందల ఉద్యోగాలకు లక్షలమంది పోటీ పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల విడుదల వరకు చాలా సమయం పడుతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉంటే కనీసం రెండేళ్లు గట్టిగా కృషి చేస్తే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది.  ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేసి సఫలం కాలేదని చెప్పారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో సాఫ్ట్‌ వేర్‌ కోర్సులు నేర్చుకొని ఆ రంగంలో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మీరు ఆరేళ్లు మార్కెటింగ్‌ రంగంలో పనిచేశారు కాబట్టి డిజిటల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. క్యాట్‌ లాంటి ప్రవేశ పరీక్ష రాసి, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఎంబీఏ చదివే ప్రయత్నం చేయొచ్చు. చివరిగా.. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నమా, సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేయడమా అనేది మీ వ్యక్తిగత ఆర్థిక స్థితి, పట్టుదల, పోటీపడే తత్వం, ఓపిక లాంటి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోండి. ఏ రంగంలో అయినా ఉద్యోగాలకు పోటీ ఎక్కువే. మీలో విషయ పరిజ్ఞానం, ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయి

    Ans:

    ఎంసెట్, నీట్‌ పరీక్షలు రాయడానికి వయః పరిమితి ఏమీ లేదు. మీకు ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ప్రవేశ పరీక్షలు రాయవచ్చు. కానీ మీకంటే కనీసం ఎనిమిది సంవత్సరాల వయసు తక్కువగా ఉన్న అభ్యర్థులతో పోటీ పడాలి. పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చినా మీకంటే చిన్న వయసువారితో కొన్ని సంవత్సరాలపాటు కలిసి చదవాలి. అందుకు మానసికంగా సిద్ధపడి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్, మెడిసిన్‌ లాంటి కోర్సులు చదివినంత మాత్రాన మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసా లేదు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఉంటేనే మేటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

    Asked By: మంజు

    Ans:

    మీరు డిగ్రీలో బయోకెమిస్ట్రీ చదివారు కాబట్టి పీజీ కూడా ఇదే సబ్జెక్టులో చేయటం వల్ల మేలుంటుంది. ఐదేళ్లపాటు బయోకెమిస్ట్రీ చదవడం వల్ల అవగాహన, విషయ పరిజ్ఞానం పెరిగి బయోకెమిస్ట్రీ రంగంలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఎక్కువ. పీజీలో బయోకెమిస్ట్రీ చదివినవారు బయో కెమిస్ట్, అనలిటికల్‌ కెమిస్ట్, బయోమెడికల్‌ సైంటిస్ట్, ఫోరెన్సిక్‌ సైంటిస్ట్, ఫార్మకాలజిస్ట్,  టాక్సికాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, సైంటిఫిక్‌ ల్యాబొరెటరీ టెక్నీషియన్, బయో టెక్నాలజిస్ట్, సైంటిఫిక్‌ రైటర్‌.. ఇలా వివిధ హోదాల్లో  ఉద్యోగావకాశాలకు ఆస్కారం ఉంటుంది. 
    ఒకవేళ మీరు పీజీలో బయోకెమిస్ట్రీ కాకుండా వేరే సబ్జెక్టులు చదవాలనుకుంటే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యుటేషనల్‌ బయాలజీ, సిస్టమ్స్‌ బయాలజీ, బయో మెడికల్‌ సైన్స్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, బిహేవియరల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, సెల్‌ అండ్‌ సిస్టమ్స్‌ బయాలజీ, బయో ఆంత్రప్రెన్యూర్‌షిప్, పబ్లిక్‌ హెల్త్, ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) లాంటి సబ్జెక్టులతో పీజీ చేయొచ్చు. లైఫ్‌ సైన్సెస్‌కు సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ చేస్తే అధ్యాపక ఉద్యోగాలు, పరిశ్రమ సంబంధిత అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) చదివితే హాస్పిటల్, హెల్త్‌కేర్‌ రంగల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పీజీ తరువాత పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగం పొందడం కోసమే కాకుండా మీకు ఆసక్తి ఉన్న కోర్సు చదివితేనే ఆ రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: సంతోష్‌

    Ans:

    ప్రస్తుత ఉద్యోగమార్కెట్‌లో డిగ్రీల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. నైపుణ్యాలు లేకుండా ఎన్ని డిగ్రీలు చదివినా ఉపయోగం లేదు. అదే సమయంలో నైపుణ్యాలు ఉండి, డిగ్రీ లేకపోయినా ఇబ్బందే! ప్రస్తుతం ఎంసీఏ ప్రోగ్రామ్‌ను నాలుగు సెమిస్టర్లతో రెండు సంవత్సరాల వ్యవధిలో అందిస్తున్నారు. గతంలో ఈ ప్రోగ్రాం ఆరు సెమిస్టర్లతో మూడు సంవత్సరాలు ఉండేది. గతంతో పోలిస్తే, ఇప్పటి ఎంసీఏ సిలబస్‌ కొంత తక్కువ. ఎంసీఏ చదివినవారు బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లు చదివినవారితో ఉద్యోగాలకోసం పోటీ పడాలి. దీన్ని తట్టుకొని ఉద్యోగం పొందాలంటే ఎంసీఏ డిగ్రీతో పాటు మరేదైనా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరి. నిత్యం జరుగుతూ ఉన్న సైబర్‌ మోసాలను ముందే పసిగట్టడానికీ, మోసం జరిగాక నేరపరిశోధనకూ హ్యాకింగ్‌లో నైపుణ్యాలున్నవారు చాలా అవసరం. భవిష్యత్తులో కూడా హ్యాకింగ్‌లో నైపుణ్యాలు ఉన్నవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హ్యాకింగ్‌ కూడా కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన విభాగమే కాబట్టి అది మీ ఎంసీఏ కోర్సుపై ఎలాంటి ప్రభావమూ చూపదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ బిజినెస్‌ లాంటి కోర్సుల్లో మీకు నచ్చినవాటిని కూడా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో అందరికీ రోజుకు 24 గంటల సమయమే ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం సమయాన్ని విభజించి నిరభ్యంతరంగా హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసీఏ ప్రోగ్రామ్‌ను అశ్రద్ధ చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  
     

    Asked By: కె. సూర్య

    Ans:

    మీ విద్యార్హతలతో సివిల్‌ ఇంజనీర్‌/ హెచ్‌ఆర్‌ మేనేజర్‌/ ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలా కాకుండా, బీటెక్, ఎంబీఏ రెండు డిగ్రీలను ఉపయోగించుకొని ఏవైనా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో కానీ, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో కానీ కొలువు పొందవచ్చు. 
    సాధారణంగా సివిల్‌ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే ఉద్యోగానుభవం అవసరం. ఒకవేళ మీకు గత ఉద్యోగానుభవం లేకపోతే మొదటి ఉద్యోగాన్ని తక్కువ వేతనంతో అయినా ప్రారంభించి మెలకువలు తెలుసుకోండి. కొంత అనుభవం గడించాక మెరుగైన కొలువుకు మారే ప్రయత్నం చేయవచ్చు. 
    మీరు ఎంబీఏలో పీహెచ్‌డీ చేయాలని ఎందుకనుకొంటున్నారు? బోధన రంగంపై ఆసక్తి ఉందా? లేదా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసి, ఇండస్ట్రీలోకి వెళ్లే ఉద్దేశం ఉందా? భవిష్యత్తులో ఎలా స్థిరపడాలనుకొంటున్నారన్న విషయంపై స్పష్టత అవసరం. 
    ఒకవేళ మీరు పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉపాధి పొందాలనుకుంటే- ఐఐఎం, ఐఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి కానీ, ప్రముఖ విదేశీ యూనివర్సిటీల నుంచి కానీ పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. పరిశోధనపై ఆసక్తితో కనీసం నాలుగేళ్ల పాటు ఎలాంటి విసుగూ లేకుండా పట్టుదలతో, ఓపిగ్గా నాణ్యమైన కృషి చేయాలి. ఆపై అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించి, బోధన, పరిశోధన రంగాల్లో మెలకువలు నేర్చుకొంటేనే మీ పీహెచ్‌డీకి విలువ ఉంటుంది. ఈ డిగ్రీని ఆభరణంలా కాకుండా, తపస్సులాగా చేసినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: సోమశేఖర్‌

    Ans:

    మీరు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ని సంప్రదాయ యూనివర్సిటీలో చదివినా, ఓపెన్‌ యూనివర్సిటీలో చదివినా, నిర్థారిత మార్కుల శాతం పొందినట్లైతే నిరభ్యంతరంగా నెట్‌/ సెట్‌ రాయవచ్చు. నెట్‌ రాయడానికి వయసుపరంగా గరిష్ఠ పరిమితి కూడా లేదు. నెట్‌లో ఉత్తీర్ణత పొందేవరకు ఎన్నిసార్లు అయినా రాస్తూనే ఉండొచ్చు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ చేయాలంటే కచ్చితంగా నెట్‌లో మెరుగైన మార్కులు పొందాలి. సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేసేవారు దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా పీజీ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలాంటి ఉద్యోగం చేయకుండా పీజీ చేయాలనుకుంటే రెగ్యులర్‌ విధానంలో చేయండి. రెగ్యులర్‌ విధానంలో పీజీ చదివితే నెట్, సెట్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే విషయ పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది. రెగ్యులర్‌ డిగ్రీలకూ.. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీలకూ యూజీసీ పరంగా గుర్తింపులో ఎలాంటి తేడా లేదు. అయినప్పటికీ కొన్ని ప్రముఖ యూనివర్శిటీలు పీహెచ్‌డీ ప్రవేశాల్లో, అధ్యాపక నియామకాల్లో రెగ్యులర్‌ పీజీ చేసినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా రెగ్యులర్‌ విధానంలో పీజీ చేయడం శ్రేయస్కరం. ఒకవేళ రెగ్యులర్‌ విధానంలో పీజీ చేసే అవకాశం లేకపోతే ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పీజీ చేసి, రెగ్యులర్‌ విధానంలో చదివినవారితో పోటీ పడగలిగే విధంగా విషయ పరిజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: అమూల్య

    Ans:

    స్టేట్‌ బోర్డుతో పోల్చినప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌.. రెండూ విభిన్నమైనవే. సాధారణంగా స్టేట్‌ బోర్డు పరిధిలో ఉన్న చాలా పాఠశాలల్లో మార్కులపై, పరీక్షా ఫలితాల శాతంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికీ పొంతన ఉండట్లేదు. పది, ఇంటర్‌లలో 90 శాతం కంటే పైన మార్కులు పొందుతున్న చాలామంది జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు సాధించలేక పోతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపగలుగుతున్నారు. ఈ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి.
    విషయ పరిజ్ఞానం పెంచుకొంటూ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే విద్య కావాలనుకుంటే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదివితే మెరుగైన ఫలితాలు లభించవచ్చు. రెండు బోర్డుల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌ కొంతమేరకు సైన్స్, మ్యాథ్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జేెఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుంది. ఐసీఎస్‌ఈలో.. సైన్స్, మ్యాథ్స్‌లతో పాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఇతర బోర్డులతో పోల్చినప్పుడు ఫీజు ఎక్కువ. స్టేట్‌ బోర్డుతో సహా అన్నిరకాల బోర్డుల సిలబస్‌లు విద్యార్థి విజ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ పెంచే విధంగానే తయారు చేశారు. వాటిని ఆచరించే పాఠశాలను బట్టి విద్యా నాణ్యత ఉంటుంది. కాబట్టి బోర్డుతో పాటు మంచి పాఠశాలను కూడా ఎంచుకొంటేనే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: అమూల్య

    Ans:

    స్టేట్‌ బోర్డుతో పోల్చినప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌.. రెండూ విభిన్నమైనవే. సాధారణంగా స్టేట్‌ బోర్డు పరిధిలో ఉన్న చాలా పాఠశాలల్లో మార్కులపై, పరీక్షా ఫలితాల శాతంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికీ పొంతన ఉండట్లేదు. పది, ఇంటర్‌లలో 90 శాతం కంటే పైన మార్కులు పొందుతున్న చాలామంది జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు సాధించలేక పోతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపగలుగుతున్నారు. ఈ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి.
    విషయ పరిజ్ఞానం పెంచుకొంటూ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే విద్య కావాలనుకుంటే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదివితే మెరుగైన ఫలితాలు లభించవచ్చు. రెండు బోర్డుల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌ కొంతమేరకు సైన్స్, మ్యాథ్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జేెఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుంది. ఐసీఎస్‌ఈలో.. సైన్స్, మ్యాథ్స్‌లతో పాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఇతర బోర్డులతో పోల్చినప్పుడు ఫీజు ఎక్కువ. స్టేట్‌ బోర్డుతో సహా అన్నిరకాల బోర్డుల సిలబస్‌లు విద్యార్థి విజ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ పెంచే విధంగానే తయారు చేశారు. వాటిని ఆచరించే పాఠశాలను బట్టి విద్యా నాణ్యత ఉంటుంది. కాబట్టి బోర్డుతో పాటు మంచి పాఠశాలను కూడా ఎంచుకొంటేనే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: వి.హర్ష

    Ans:

    బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులో మరో డిగ్రీ చదివితే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు ఇంజినీరింగ్‌తో పాటు రెండో డిగ్రీని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ డిగ్రీ మీ కెరియర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొన్ని సందర్భాల్లో రెండు విభిన్న సబ్జెక్టుల్లో డిగ్రీలు చేస్తే ప్రాంగణ నియామకాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఒకవేళ మీకు తెలుగు/ తమిళ భాషపై ఆసక్తి ఉండి దానిపై అధ్యయనం చేయాలనుకుంటే నిరభ్యంతరంగా బీఏ తెలుగు/ తమిళం చదవొచ్చు. కానీ బీఏలో తెలుగు, తమిళ సబ్జెక్టులు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీల్లో మాత్రమేఉన్నాయి. మీరు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో రెండో డిగ్రీ చేయాలనుకుంటే ఐఐటీ మద్రాస్‌ నుంచి ఆన్‌లైన్‌ బీఎస్సీ డేటా సైన్స్‌ చదివే ప్రయత్నం చేయండి. లేదా ఎలాగూ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకుంటే బీబీఏ చేయొచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరులో ఆన్‌లైన్‌ బీబీఏ (డిజిటల్‌ బిజినెస్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌) కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్‌తో పాటు, ఐఐఎం బెంగళూరు లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ నుంచి బీబీఏ చేయడం వల్ల మీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
    బీటెక్‌ చేస్తూ మరో డిగ్రీ చదివితే ఎలాంటి ఇబ్బందీ లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం కూడా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కాకపోతే- ఒకటి రెగ్యులర్‌గానూ, మరొకటి ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌ పద్ధ్దతిలోనూ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదయం, మధ్యాహ్నం/ సాయంత్రం షిఫ్ట్‌లో రెండు కళాశాలల నిర్వహిస్తూ ఉంటే ఒకే సమయంలో రెండు రెగ్యులర్‌ కోర్సులు చదివే అవకాశం కూడా ఉంది. మూడేళ్లపాటు రెండు కోర్సులను సమర్థంగా చదవడానికి ప్రేరణ, నిబద్ధత, పట్టుదల చాలా అవసరం. చివరిగా ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవాలంటే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు కూడా ముఖ్యం.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌