Post your question

 

    Asked By: నరసింహారావు

    Ans:

    మీ అమ్మాయిని టెన్త్‌ క్లాస్‌ తరువాత ఇంటర్మీడియట్‌ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ చదివించండి. ఆ తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌కు సంబంధించిన కళాశాల/ శిక్షణ సంస్థలో చేర్పించండి. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలంటే ఓర్పు, ఆత్మవిశ్వాసం, దృఢమైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, బృందంలో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాకుండా కనీసం ఓ భారతీయ భాషలో ప్రావీణ్యం అవసరం. ఏదైనా విదేశీ భాష తెలిసి ఉంటే అదనపు అర్హత అవుతుంది.
    ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసుతో పాటు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, ఏవియేషన్‌ కస్టమర్‌ సర్వీస్, ఎయిర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్, ఎయిర్‌లైన్స్‌ హాస్పిటాలిటీ, క్యాబిన్‌ క్రూ, ఫ్లైట్‌ అటెండెంట్‌ లాంటి ఏదో ఒక కోర్సులో ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ పొందాలి. ఒకవేళ డిగ్రీ చదివి ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలనుకొంటే బీఎస్సీ (ఎయిర్‌ హోస్టెస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బీఎస్సీ ఏవియేషన్, బీబీఏ టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ సంస్థలు/ కాలేజీల విషయానికొస్తే- హైదరాబాద్, విశాఖపట్టణాల్లో చాలా ప్రైవేటు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సంస్థ/ కాలేజీలో చేరేముందు దాని నాణ్యత, విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.అశోక్, గోధుర్‌ (జగిత్యాల జిల్లా)

    Ans:

    ఏడో తరగతి చదువుతున్న మీ మనవడిని ఇప్పటినుంచే అంత పెద్ద లక్ష్యానికి సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్ని ఐఐటీ పేరుతోనో, నీట్, సివిల్స్‌ అనో వయసుకి మించిన బరువులు పెట్టడం వల్ల వాళ్ళు జీవితంలో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పదో తరగతి పూర్తి అయ్యేవరకు ఇలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా వారు తరగతి పుస్తకాలను పూర్తిగా అర్థం చేసుకొని, ఇష్టంగా చదివేలా ప్రోత్సహించండి. చదువుతో పాటు మానసిక, శారీరక అభివృద్ధికి కావాల్సిన వాతావరణం ఉండేలా చూడండి. ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలన్నా, శాస్త్రవేత్త అవ్వాలన్నా, మరే ఉద్యోగం పొందాలన్నా హైస్కూల్లో చదివే సబ్జెక్టులపై గట్టి పట్టు ఉండాలి. భవిష్యత్తులో వారి చదువులకూ, రాయబోయే పోటీ పరీక్షలకూ హైస్కూల్‌ విద్య పునాది లాంటిది. సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, శాస్త్రీయ విశ్లేషణ, సృజనాత్మకత, భావప్రకటన సామర్థ్యం, సమాజంపై అవగాహన, సరైన నిర్ణయాలు తీసుకునే నేర్పు, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఇవన్నీ పాఠశాల విద్యలోనే నేర్చుకొనే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ వార్తా పత్రికలను చదువుతూ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై క్రమంగా అవగాహన పొందటం ముఖ్యం. ప్రస్తుతం తన చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.ఆశారాణి

    Ans:

    చదువుకు వయసుతో పనిలేదు. ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కాకపోతే, మీరు ఎందుకోసం చదవాలనుకుంటున్నారో తెలుసుకోండి. విజ్ఞానం కోసం, సమాజాన్ని తెలుసుకోవడానికి, పిల్లల్ని బాగా చదివించడానికి, వ్యాపారం కోసం, సమాజంలో హోదా, సమాజ సేవ, చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోడం.. ఇలాంటివి ఏమైనా కావొచ్చు. ఏ కారణంతో అయినా సరే, ఈ వయసులో చదువు కొనసాగించాలన్న మీ ఆశయం అభినందనీయం. ముందుగా మీరు పదో తరగతిని ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి పూర్తి చేయండి. ఇంటర్‌ని కూడా ప్రైవేటుగా కానీ, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా గాని పూర్తి చేయండి. ఇంకా ఆసక్తి ఉంటే, ఓపెన్‌ యూనివర్సిటీ లేదా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయండి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే ఇంటర్‌ తరువాత డీఈడీ.. కానీ, డిగ్రీ తరువాత బీఈడీ.. కానీ చేయవచ్చు. అలా కాకుంటే పదో తరగతి/ ఇంటర్‌ తరువాత నచ్చిన ఒకేషనల్‌ కోర్సు చదవండి. ఇంటర్‌/ డిగ్రీ తరువాత ఉద్యోగం త్వరగా లభించే కంప్యూటర్, టూరిజం, కుకింగ్, ఎంబ్రాయిడరీ, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ /డిప్లొమా కోర్సులు చేయండి. అవకాశం ఉంటే పీజీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్.కె.నాగుర్బాషా

    Ans:

    - సాధారణంగా పదో తరగతి తరువాత చదివే మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను ఇంటర్‌తో సమానంగానే పరిగణిస్తారు. ఈ మేరకు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను కూడా జారీ చేశాయి. డిప్లొమా పూర్తయిన తరువాత మీరు నిరభ్యంతరంగా డిగ్రీ లో చేరవచ్చు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. కొన్ని ప్రత్యేక విద్యా/ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాత్రమే ఇంటర్‌ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నారు. మరికొన్ని ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్లలో ఇంటర్‌ రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన కూడా ఉంటుంది. అలాంటి అతికొద్ది ఉద్యోగాలకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివే ఇంటర్మీడియట్‌ను రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణిస్తారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల్లో ఏకకాలంలో రెండు డిగ్రీలు చేయవచ్చని మాత్రమే ప్రస్తావించారు. ఇంటర్, డిప్లొమాలు ఒకేసారి చదవడం గురించి ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిప్లొమా చదువుతూనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో ఇంటర్‌ చదివితే, రెండు సర్టిఫికెట్‌లను ఒకేసారి ఉపయోగించుకోలేరు. మూడు సంవత్సరాల తరువాత ఇంటర్‌ విద్యార్హతతో రాయబోయే పోటీ పరీక్షలకంటే ముందు, ప్రస్తుతం చదువుతున్న డిప్లొమా కోర్సుపై శ్రధ్ధ పెట్టండి. విషయపరిజ్ఞానం పెంపొందించుకొని, మెరుగైన ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.

    Asked By: ఇ. తరుణి

    Ans:

    ఇంటర్‌ (ఎంపీసీ) పాసై సీఏలో చేరాను అన్నారు. ఆ ఆలోచన మార్చుకొని మళ్ళీ ఇంజినీరింగ్‌ వైపునకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో కనీసం మూడు కారణాలు రాసుకోండి. ఆ కారణాలను మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకొని, అవి సహేతుకమైనవో కావో నిర్ధారించుకోండి. ఆపైనే నిర్ణయం తీసుకోండి. సీఏ కోర్సు, ఇంజినీరింగ్‌ కంటే తక్కువేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇంజినీర్లు లక్షల్లో మార్కెట్‌లోకి వస్తూ ఉంటే, సీ‡ఏలు మాత్రం కొన్ని వేలమంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఇంజినీరింగ్‌ చదివినవారిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కానీ, సీఏ కోర్సు చేసినవారికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒకవేళ సీఏ చదవడం కష్టమనిపిస్తే, మీ సీనియర్‌ల సలహాలు తీసుకొని ముందుకెళ్లండి. ముందుగా మీ జీవితం, భవిష్యత్తుపై మీకో స్పష్టత అవసరం. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, జీవితంలో ఎలా స్థిరపడాలనుకొంటున్నారు అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్‌ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్‌ గ్రూప్‌ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్‌ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్‌ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్‌ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Pasupulati Leela Ramesh

    Ans:

    Dear Reader..
    You can refer the Preparation Plans for English (Senior Inter) in "How to get good score" in homepage (Intermediate) in our site.
    We have uploaded important questions  and answers useful for final and periodic examinations.

    Asked By: SANTOSH KUMAR MELLACHERUVU

    Ans:

    In AP and Telangana very few colleges  offer BSc/ BA Psychology. Telangana Degree colleges admissions are based on DOST. Refer DOST website for more details.
    https://dost.cgg.gov.in/
    Few deemed universities are also offering these courses. You can directly contact to those institutes for admission

    https://dost.cgg.gov.in/