Asked By: ఎన్.రమేష్కుమార్
Ans:
మీరు ఎంఏ పూర్తి చేశారంటే, మీ వయసు కనీసం 23 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేస్తే, మరో రెండేళ్లు చదవాలి. అంతేకాకుండా, మీకంటే పది సంవత్సరాలు తక్కువ వయసున్నవారితో కలిసి విద్య అభ్యసించాలి. ఐటీఐ చేశాక కూడా ఉద్యోగం రావడం కష్టమయితే, అప్పుడు ఏం చేస్తారు? మీకు ఐటీఐ కోర్సు అంటే ఇష్టమా, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనా? ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికీ చాలా పోటీ ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు వేలల్లో ఉంటే, వాటికి అర్హులయిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే- అందుబాటులో ఉన్న తక్కువ కొలువుల కోసం పోటీ పడి, మెరుగైన ప్రతిభతో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయాలి.
చాలామంది ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే భావనతో ఉంటున్నారు. ముందుగా దీన్నుంచి బయటకు వచ్చి నచ్చిన పని చేస్తూ సంబంధిత రంగంలో ఎదిగే ప్రయత్నం చేయటం ఉత్తమం. ఒకవేళ మీరు ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందినా, మీ పీజీ చదువుకు తగిన ఉద్యోగం పొందలేక పోయానని బాధ పడవచ్చు. అలా కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీతో కానీ, మీ డిగ్రీ విద్యార్హతతో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. బీఈడీ చేసి బోధనరంగంలో ప్రయత్నాలు చేయవచ్చు. బీఈడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ డీ… ఎస్సీ కోసం మాత్రమే ఎదురుచూడకుండా నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఆసక్తి/ అవకాశం ఉంటే జర్నలిజం, లైబ్రరీ సైన్స్, మేనేజ్మెంట్, ఎల్ఎల్బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల గురించి కూడా ఆలోచించండి. ఇంగ్లిష్ భాషపై కొంత పట్టుంటే ఎంఏ ఇంగ్లిష్ చదివి బోధన రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. మీ పీజీ విద్యార్హతతో స్వచ్ఛంద సేవాసంస్థల్లో, ప్రభుత్వేతర సంస్థల్లో, రిటైలింగ్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవన్నీ వీలుకాకపోతే మీరు అనుకున్నట్లుగా, ఐటీఐ చేసి మీరనుకుంటున్న కోర్సులూ.. కొలువుల ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వినయ్ చెవ్వ
Ans:
చాలా కాలంగా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పద్ధతిని అవలంబిస్తూ పీహెచ్డీ ప్రవేశాలు చేపడుతున్నాయి. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపర్చినవారికి ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధన సంస్థలు యూజీసీ/ సీఎస్ఐఆర్ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందిన విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. నెట్ (నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్)లో ఉత్తీర్ణత పొందినవారికి కూడా చాలా యూనివర్సిటీలు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఎంఫిల్ పూర్తి చేసినవారికి కూడా రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాగే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో మంచి పర్సంటైల్ పొందినా, రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో పైన చెప్పినవాటికి అదనంగా స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (సెట్)లో అర్హత పొందినవారు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్డీలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం ఉంది. నెట్/ సెట్లో ఉత్తీర్ణత పొందలేకపోతే, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఆర్సెట్ (రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)లో మెరుగైన ర్యాంకు పొంది, ఇంటర్వ్యూ ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశం పొందవచ్చు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత నెలలో యూజీసీ పీహెచ్డీ ప్రవేశాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాలకు నెట్ పరీక్షను ప్రాతిపదికగా తీసుకొమ్మని సూచించింది. ఇక నుంచి యూజీసీ/ సీఎస్ఐఆర్ నెట్లో ఉత్తీర్ణత పొందినవారిని పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మూడు విభాగాలు చేస్తారు. మొదటిది - నెట్ - జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్. రెండోది- అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్. మూడోది- ప్రత్యేకంగా పీహెచ్డీ ప్రవేశాల కోసం మాత్రమే నిర్దేశించారు. ఈ మూడు విభాగాల్లో దేనిలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ ద్వారా నేరుగా పీహెచ్డీలో ప్రవేశం పొందవచ్చు. ఈ సూచన పూర్తిస్థాయిలో అమలవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మీరు జేఆర్ఎఫ్/ నెట్/ సెట్/ ఆర్సెట్లలో ఉత్తీర్ణత సాధించి స్టేట్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశానికి ప్రయత్నించవచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే భవిష్యత్తులో పీహెచ్డీ ప్రవేశం కష్టం కావచ్చు. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే ఏదైనా స్టేట్ యూనివర్సిటీలో ఆర్సెట్ ద్వారా పీహెచ్డీ ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి. పీహెచ్డీ ప్రవేశం పొందలేకపోతే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పోటీ పరీక్షల్లో, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. జూనియర్ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు పీహెచ్డీ/ నెట్/ సెట్ అవసరం లేదు కాబట్టి వాటికి పోటీపడొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీహరి
Ans:
డిగ్రీ, పీజీలను దూరవిద్య/ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివినా, రెగ్యులర్గా చదివినా వాటి విలువల్లో ఎలాంటి మార్పూ ఉండదు. అన్ని రకాల డిగ్రీలను వివిధ యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు లోబడే జారీ చేస్తాయి. డిగ్రీని దూరవిద్య/ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివిన చాలామంది సివిల్ సర్వీసెస్, అధ్యాపక ఉద్యోగ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లలో డిగ్రీ/ పీజీ నిర్ధారిత శాతం మార్కులుండాలని మాత్రమే పేర్కొంటారు. డిగ్రీ/ పీజీ రెగ్యులర్గానే చదివి ఉండాలని ఉండదు. స్వల్పంగా కొన్ని బోధన/ పరిశోధన ఇంటర్వ్యూల్లో మాత్రం రెగ్యులర్ డిగ్రీలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ నిబంధనల ప్రకారం రెగ్యులర్/ దూరవిద్య/ ఆన్లైన్ ద్వారా చదివిన కోర్సుల మధ్య తేడా ఏమీ లేదు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమలైనపుడు అన్ని రకాల డిగ్రీలనూ ఒకే విధంగా పరిగణించే అవకాశం ఉంది. బీఈడీ, డీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను రెగ్యులర్గా మాత్రమే చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు చెబుతున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. అదేవిధంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఎల్ఎల్బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను కూడా దూరవిద్యా విధానంలో చేసే అవకాశం లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి.వెంకట దుర్గ
Ans:
సాధారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పరీక్షలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఒక సంవత్సరంపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే ఉద్యోగం పొందడం కష్టం కాదు. ఏదైనా పోటీ పరీక్ష రాయాలనుకున్నప్పుడు ముందుగా ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలు సేకరించి అందులో ఉన్న వివిధ విభాగాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించి, మీ ప్రస్తుత సామర్థ్యంతో ఎన్ని మార్కులు తెచ్చుకోగలరు? ఉద్యోగం పొందాలంటే ఎన్ని మార్కులు అవసరం? అన్న విషయాలను ఆధారం చేసుకొని, సన్నద్ధత ఏ స్థాయిలో ఉండాలో అవగాహన ఏర్పర్చుకోండి. గతంలో ఈ పరీక్షలో విజయం సాధించిన వారితో మాట్లాడి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోండి. వీలుంటే, ఈ పోటీ పరీక్షకు శిక్షణ ఇచ్చే వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ పరీక్షకు అవసరమైన పుస్తకాల విషయానికొస్తే.. ఆర్ ఎస్ అగర్వాల్ చాంద్ పబ్లికేషన్స్.. ఏ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బర్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లతో పాటు మలయాళ మనోరమ- మనోరమ ఇయర్ బుక్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ పబ్లికేషన్ డివిజన్- ఇండియా ఇయర్ బుక్, ఎస్కే భక్షి- అబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్, లూసెంట్ పబ్లికేషన్స్- జనరల్ నాలెడ్జ్, అరుణ్ శర్మ- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ క్యాట్, ఎంకే పాండే- అనలిటికల్ రీజనింగ్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు దిశ పబ్లిషర్స్ లేదా కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్ ఎస్ఎస్సీ పూర్వ ప్రశ్నాపత్రాల పుస్తకాలను కూడా చదవండి. ఎస్ఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సరైన సమాధానాన్ని తక్కువ సమయంలో గుర్తించే నైపుణ్యం అవసరం. పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను కూడా చదువుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకొని, వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, మీ ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: లావణ్య
Ans:
సాధారణంగా స్టాటిస్టిక్స్ కోర్సును డిగ్రీలో మ్యాథమెటిక్స్తో కలిపి చదివే అవకాశం ఉంది. బీఎస్సీలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ కాంబినేషన్లో కానీ చదవొచ్చు. బీఏలో మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ కాంబినేషన్ ఉంది. మీరు ఇంటర్లో మ్యాథ్స్ చదవలేదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో పైన చెప్పిన కాంబినేషన్లతో డిగ్రీ చేసే వీలు లేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరైనా ఏ కోర్సులైనా చదివే వెసులుబాటు ఉంటుంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇప్పటికే నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం మొదలు పెట్టాయి. కాబట్టి, ఇంటర్లో మ్యాథ్స్ లేకుండా, డిగ్రీలో స్టాటిస్టిక్స్ కాంబినేషన్ ఉన్న డిగ్రీ ప్రోగ్రాంలో చేరే ప్రయత్నం చేయండి. డిగ్రీ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది.
మీకు స్టాటిస్టిక్స్ చదవాలన్న కోరిక బలంగా ఉంటే, ఇంటర్ రెండు సంవత్సరాల మ్యాథ్స్ సబ్జెక్టులను ఇప్పుడు పూర్తి చేసి, డిగ్రీలో స్టాటిస్టిక్స్ కోర్సును మ్యాథ్స్ కాంబినేషన్లో చదవండి. అలా వీలు కాకపోతే బీకాంలోనే స్టాటిస్టిక్స్ను ఒక సబ్జెక్టుగా చదివే ప్రయత్నం చేయండి. మీకు కంప్యూటర్ రంగంపై ఆసక్తి ఉందనుకోండి- బీకాం కంప్యూటర్స్ కోర్సు చదివితే, కంప్యూటర్స్తో పాటు స్టాటిస్టిక్స్ కోర్సును ఒక సబ్జెక్ట్గా చదవొచ్చు. స్టాటిస్టిక్స్ అప్లికేషన్స్పై ఆసక్తి ఉంటే, బీకాం/ బీబీఏలో బిజినెస్ అనలిటిక్స్/ డేటా సైన్స్ చదివే వీలుంటుంది. స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, అనలిటిక్స్ కోర్సుల్లో రాణించాలంటే- మ్యాథ్స్పై గట్టి పట్టు ఉండాలి. మీరు డిగ్రీ చదువుతూనే స్వయం, ఎన్పీటెల్, కోర్స్ ఎరా, ఎడెక్స్, యుడెమి లాంటి ఆన్లైన్ వేదికల్లో స్టాటిస్టిక్స్ కోర్సులు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: అక్రం షేక్
Ans:
సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రోగ్రాం పూర్తి చేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ యూనివర్సిటీల నిబంధనల ప్రకారం నిర్దేశించి ఉంటాయి. ఉదాహరణకు.. బీఏ/ బీఎస్సీ/ బీకాం డిగ్రీ కోర్సును కనిష్ఠంగా మూడు ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి. గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే, ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు డిగ్రీకి గరిష్ఠ పరిమితిని 5 సంవత్సరాలుగా, కొన్ని మాత్రం 6 సంవత్సరాలుగా నిర్ణయించాయి. కాకతీయ యూనివర్సిటీలో మూడేళ్ల డిగ్రీని ఆరేళ్లలో పూర్తిచేయాలి. మీరు 2014లో బీకాంలో చేరారు కాబట్టి, 2020 లోగా పూర్తి చేయాల్సింది. మీరు డిగ్రీ చదివినప్పుడు సంవత్సరాంత పరీక్షలు ఉన్నాయి. 2015/ 2016 తరువాత దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలూ సెమిస్టర్ విధానంలోకి మారిపోయాయి. అందుకని మీరిప్పుడు బీకాం డిగ్రీని కొనసాగించలేరు. ఒకవేళ కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్తులో ఎప్పుడైనా డిగ్రీ పూర్తి చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చినా, మీకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి, ఒకేసారి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత కష్టం అవుతుంది. ఓపెన్ యూనివర్సిటీలో మరో డిగ్రీ చదవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కాకతీయ యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వేదప్రకాశ్
Ans:
కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం పెంపొందించుకోవాలనుకుంటే బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, బీకాం (కంప్యూటర్స్) కానీ చదవొచ్చు. బీఎస్సీలో కంప్యూటర్ కోర్సును మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ స్టాటిస్టిక్స్ లాంటి మరో రెండు సబ్జెక్టులతో కలిపి చదువుతారు. బీకాంలో కామర్స్ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్స్ కూడా చదువుతారు. బీసీఏలో అయితే మూడు సంవత్సరాల పాటు కంప్యూటర్స్ సంబంధిత కోర్సులు మాత్రమే చదువుతారు. కాబట్టి బీసీఏ చదివినవారికి కంప్యూటర్స్/ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రోగ్రాంల భవిష్యత్తు విషయానికొస్తే బీఎస్సీ (కంప్యూటర్స్) డిగ్రీతో వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఆ తరువాత ఎంసీఏ కానీ, ఎమ్మెస్సీ (కంప్యూటర్స్/ డేటా సైన్స్) కానీ చేయాలి. బీసీఏ చదివితే మీ నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం ఆధారంగా వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి.
బీఎస్సీ చదివినా, బీసీఏ చదివినా, ఎంసీఏ, ఎంబీఏ - జనరల్, ఎంబీఏ - బిజినెస్ అనలిటిక్స్ లాంటి కోర్సుల్లో చేరవచ్చు. మీ దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. బీటెక్ - కంప్యూటర్ సైన్స్ చదివేవారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బీసీఏ ప్రోగ్రాంకు కొంత ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చుకొంటే సాఫ్ట్వేర్ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. చివరిగా ప్రతి డిగ్రీకీ ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. కానీ ఉద్యోగం రావడం అనేది అభ్యర్థి ప్రతిభ, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార సామర్థ్యం, భావప్రకటన లాంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ప్రవీణ్ కుమార్
Ans:
మీరు 13 నుంచి ఈ పది సంవత్సరాల్లో ఏం చేశారో, ఇంజినీరింగ్లో ఎన్ని సబ్జెక్టులు మిగిలాయో చెప్పలేదు. కళాశాల వారు మిమ్మల్ని మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసుకోవడానికి అనుమతించారంటే.. ఆ కళాశాల అనుబంధ యూనివర్సిటీ నిబంధనలకు లోబడే చెప్పివుండాలి. ఆ విషయాన్ని మీ అనుబంధ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి నుంచి ధ్రువీకరించుకోండి. కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీలు సబ్జెక్టులు మిగిలిపోయి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి ఒక్క చివరి అవకాశంగా ప్రత్యేక వెసులుబాటును కల్పించి, పరీక్షలు రాసే అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. బహుశా, మీ యూనివర్సిటీ కూడా అలా చేసి ఉండొచ్చు.
మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంజినీరింగ్ పూర్తిచేసే ప్రయత్నం చేయండి. చివరిగా - ఏదైనా యూనివర్సిటీ, యూజీసీ నిబంధనలకు లోబడి ఇచ్చిన డిగ్రీ చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగావకాశాలు చదివిన డిగ్రీతో మాత్రమే కాకుండా.. మీ విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలపై కూడా ఆధారపడి ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: మెహరాజ్ షేక్
Ans:
అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో సాంకేతికత వేగంగా పెరుగుతున్న ఈ తరుణంలో అకౌంటింగ్ నుంచి ఐటీ రంగానికి మారడం పెద్ద కష్టం కాదు. మైక్రోసాఫ్ట్ పవర్ బీఐ, ట్యాబ్లూ వంటి సాప్ట్వేర్లను నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలనూ, తద్వారా ఉద్యోగ అవకాశాలనూ మెరుగుపర్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ బీఐ, ట్యాబ్లూల్లో సర్టిఫికెట్ పొందితే, ఐటీ రంగంలో మొదటి ఉద్యోగాన్ని పొందడం సులువు. వీటితో పాటు మైక్రోసాప్ట్ ఎక్సెల్, ఆర్ ప్రోగ్రామింగ్, పైతాన్ ప్రోగ్రామింగ్లపై కూడా మంచి పట్టు సాధించాలి. ఒకవేళ పీజీ కోర్సు చేయాలనుకుంటే ఎంకాం (కంప్యూటర్స్) గురించి ఆలోచించవచ్చు. మేనేజ్మెంట్, డేటా సైన్స్ రంగాలపై ఆసక్తి ఉంటే, ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్) చదివితే ఉపయోగకరం. ఈ పీజీతో ఫైనాన్షియల్ అనలిటిక్స్ రంగంలోకి కూడా వెళ్ళవచ్చు. ఇటీవలి కాలంలో కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా కాకుండా మీ క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఉద్యోగానుభవాన్ని ఉపయోగించి మంచి ఉద్యోగం పొందాలంటే బ్లాక్ చెయిన్/ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్/ డిప్లొమా చదివే ప్రయత్నం చేస్తే మేలు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్.రవిశంకర్
Ans:
మీరు ఇంజినీరింగ్ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటున్నాం. బీబీఏను రెగ్యులర్గా చదువుతున్నారా? దూరవిద్యలోనా? ఆపరేషన్స్ ఇంజినీర్గా ఏ సంస్థలో, ఏ విభాగంలో పనిచేశారో/ పని చేస్తున్నారో చెప్పలేదు. యూనివర్సిటీలు ఇచ్చే ఎంబీఏ డిగ్రీకీ, ఏఐసీటీఈ అనుమతి ఉన్న రెండేళ్ల పీజీడీఎంకూ మధ్య తేడా లేదు. ఎంబీఏ డిగ్రీని ప్రభుత్వ/ ప్రైవేటు / డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు ఇస్తే, పీజీడీఎం సర్టిఫికెట్ను మీరు చదివిన విద్యాసంస్థ ఇస్తుంది. కొంతకాలం క్రితం వరకు ఐఐఎంలు కూడా పీ‡జీడీఎం సర్టిఫికెట్ను మాత్రమే ఇచ్చేవి. ఇప్పటికీ ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న చాలా బిజినెస్ స్కూల్స్ పీజీడీఎం సర్టిఫికెట్ని ఇస్తున్నాయి. అందుకని మీరు ఎంబీఏ చేసినా, రెండేళ్ల పీ‡జీడీఎంను రెగ్యులర్గా చేసినా మీ ఉద్యోగావకాశాలకు ఇబ్బంది లేదు.
ఎంబీఏ డిగ్రీని దూరవిద్యా విధానంలో కూడా చదవొచ్చు. ఎంబీఏ కానీ, పీజీడీఎం కానీ అత్యుత్తమ విద్యాసంస్థ నుంచి చేస్తేనే క్యాంపస్ రిక్రూట్మెంట్ అవకాశాలు ఎక్కువ. చాలా ప్రైవేటు విద్యాసంస్థలు ఒక సంవత్సరం పీజీడీఎం సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాయి. కానీ అలాంటి డిప్లొమాలు ఎంబీఏకు సమానం కాదు. పీజీడీఎం చదివి, భవిష్యత్తులో పీహెచ్డీ చేయాలనుకుంటే కొన్ని యూనివర్సిటీలు మీ పీజీడీఎం ప్రోగ్రాం, ఎంబీఏ ప్రోగ్రాంకు సమానం అని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) ఇచ్చిన ధ్రువపత్రాన్ని అడుగుతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు ఈ ధ్రువపత్రం అవసరం లేదు. మీకు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఎంబీఏ/ పీజీడీఎం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మేనేజ్మెంట్, ఇంజినీరింగ్లకు సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్ విధానంలో చదివితే, నైపుణ్యాలు పెరగడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్