జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను మార్కులపై కాకుండా వాటి పర్సంటైల్పై ఇచ్చారు. దీంతో ఈ పరీక్ష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
ఎలా ఉన్నాయ్?
జేఈఈ మెయిన్-2019 మొదటి విడత జనవరి 8 నుంచి 12 తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. అందులో జనవరి 8న పేపర్-2 (బీఆర్క్)ను నిర్వహించగా, జనవరి 9-12 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో నాలుగు రోజుల్లో 8 ఆన్లైన్ పేపర్ల ద్వారా జేఈఈ మెయిన్-19 పేపర్-1ను నిర్వహించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో 8 విభిన్న ప్రశ్నపత్రాల్లో ఆన్లైన్ విధానంలో విద్యార్థులు పరీక్ష రాశారు.
8 పేపర్లూ వేటికవే ప్రత్యేకంగా సబ్జెక్టులు, ప్రశ్నలు, వాటి ఆప్షన్లన్నీ జంబ్లింగ్ విధానంలో ఉన్నాయి. అయితే విభిన్న ప్రమాణాల్లో ఈ ప్రశ్నపత్రాలున్నాయి. వీటి వల్ల విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండటానికి మార్కులపై పర్సంటైల్ విధానంలో ఫలితాలను ప్రకటించారు.
పర్సంటైల్ ఇలా లెక్కిస్తారు
విద్యార్థి మార్కులపై పర్సంటైల్ =
A = పరీక్షకు హాజరైన విద్యార్థులు (పేపర్-1కు 8,74,469 మంది, పేపర్-2కు 1,45,386 మంది)
B = ఆ పరీక్షలో అతని మార్కులు లేదా అంతకన్నా తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య దీనిని జేఈఈ మెయిన్లో ఆ విద్యార్థి సాధించిన మొత్తం మార్కులపై, అతని మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులపై కూడా విడివిడిగా లెక్కించి వాటి ఆధారంగా అఖిల భారత స్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు.
ఆలిండియా ర్యాంకు లెక్కించాలంటే?
ఒక విద్యార్థి సాధించిన పర్సంటైల్ స్కోరు నుంచి అతని అఖిల భారత ర్యాంకును లెక్కించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు.
విద్యార్థి ఆలిండియా ర్యాంకు =
A = పరీక్షకు హాజరైన విద్యార్థులు (పేపర్-1: 8,74,469; పేపర్-2: 1,45,386)
B = విద్యార్థి సాధించిన పర్సంటైల్
జేఈఈ - 2019 మొదటి విడత దరఖాస్తు చేసిన వారు 9,29,198.
పేపర్-1కి హాజరైనవారు 8,74,469.
పేపర్-2 (బీఆర్క్)కి హాజరైనవారు 1,45,386.
ఏ స్థాయిలో ఉన్నాయి?
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ .. అన్ని పేపర్లలోనూ తేలిక, మధ్యమ స్థాయి ప్రశ్నలకే పెద్దపీట వేశారు. చాలావరకూ రెండేళ్ల ఇంటర్మీడియట్ సిలబస్ను క్షుణ్ణంగా చదివిన ప్రతి విద్యార్థికీ జేఈఈ మెయిన్లో మంచి మార్కులు తద్వారా మంచి పర్సంటైల్ సాధించే దిశగానే పేపర్ల స్థాయి ఉంది. ఎక్కువ శాతం ప్రశ్నలన్నీ సిలబస్కు లోబడి, అందులోని మౌలిక (బేసిక్) అంశాలపై, వాటి సమీకరణాలు, అప్లికేషన్స్పై విద్యార్థుల గ్రహణ, సృజనాత్మక శక్తులను వెలికితీసేలా ఇచ్చారు. జనవరిలో నిర్వహించిన మొదటి విడత పరీక్ష ఎనిమిది ప్రశ్నపత్రాల ఆధారంగా అదే తరహా ప్రశ్నలను విద్యార్థులు సాధన చేయడం మంచిది.
ఇవి గుర్తుంచుకోండి!
ప్రశ్నపత్రాల సారూప్యత: పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో 8 ప్రశ్నపత్రాల్లో సారూప్యతను గమనించొచ్చు. ఒక తేదీలో ఒక స్లాట్లో ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నల మాదిరిగానే మిగిలిన ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు పోలి ఉన్నాయి. అంటే రేపు ఏప్రిల్లో నిర్వహించే జేఈఈ మెయిన్ రెండో దఫా పరీక్షను ఎదుర్కొనే విద్యార్థులు జనవరిలో నిర్వహించిన మొదటి దఫా ఎనిమిది ప్రశ్నపత్రాలను దగ్గర ఉంచుకుని అదే తరహా ప్రశ్నలను ప్రతి సబ్జెక్టులో సాధన చేయడం మేలు.
సిద్ధాంత, సమీకరణ మిళిత అంశాలు: జనవరిలో నిర్వహించిన పరీక్షలో ఎనిమిది పేపర్లలో ముఖ్యంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ల్లో ఎక్కువ ప్రశ్నలు సిద్ధాంతపరమైన, డైరెక్ట్ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల అంశాలపై అడిగారు. ఫిజికల్ కెమిస్ట్రీలో సుమారు 7 నుంచి 8 ఫార్ములా ఆధారిత ప్రశ్నలు, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సుమారు 6-8 ప్రశ్నలు నేరుగా థియరీ ఆధారితమైనవీ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్లో సుమారు 15 ప్రశ్నలకుపైగా డైరెక్ట్ ఫార్ములా, కనీసం 5 సిద్ధాంతపరమైనవి ఉన్నాయి. కాబట్టి, ఆ దిశగా సన్నద్ధమవ్వాలి. మ్యాథ్స్లో ఎక్కువ శాతం తేలిక, మధ్యమ స్థాయి ప్రశ్నలున్నాయి. అందులోనూ ఎక్కువ శాతం ఒకే టెక్నిక్, ఒకే కాన్సెప్ట్ సంబంధిత ప్రశ్నలు ఉన్నాయి.
* ఇంటర్ ద్వితీయ సంవత్సర సిలబస్కు ప్రాధాన్యమివ్వాలి.
* కనీసం రోజుకు ఒక ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని సాధన చేయాలి.
* పాత జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాలు, జనవరిలో నిర్వహించిన వాటినీ సాధన చేస్తే కచ్చితంగా రెండో దఫా మెయిన్ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.
- ఎం. ఉమాశంకర్, శ్రీచైతన్య విద్యాసంస్థలు
ఎక్కువ ప్రశ్నలు వేటిలో?
నాలుగురోజుల్లోనూ జరిగిన అన్ని పరీక్షలనూ పరిశీలించి మూడు సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం ప్రశ్నలు ఏ విభాగాల్లో వచ్చాయో గమనించాలి. ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచే అధిక ప్రశ్నలు వచ్చాయి.
మ్యాథ్స్
బైనామియల్ థీరమ్, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, స్ట్రయిట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రయిట్ లైన్స్, సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, లిమిట్స్, మొనాటానసిటీ అండ్ మ్యాక్సిమా మినిమా, మీన్ వాల్యూ థీరమ్స్, డెఫినిట్ ఇంటిగ్రేషన్, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ వంటి చాప్టర్ల నుంచి కనీసం రెండు ప్రశ్నలు వచ్చాయి. ఇవి కాకుండా మిగిలిన చాప్టర్లలో ఒక్కో ప్రశ్న వచ్చింది. కాబట్టి, కచ్చితంగా రెండు ప్రశ్నలు వచ్చే అంశాలపై ఎక్కువ దృష్టిసారిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఎక్కువశాతం ప్రశ్నలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంటర్ ద్వితీయ సంవత్సర సిలబస్ నుంచే ఉన్నాయి.
ఫిజిక్స్
యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, సిపుల్ హార్మోనిక్ మోషన్, జామెట్రికల్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రో మాగ్నటిక్ ఇండక్షన్, ఏసీ వంటి చాప్టర్ల నుంచి కనీసం రెండు ప్రశ్నలు అడిగారు. మిగిలిన అధ్యాయాల నుంచి కనీసం ఒక ప్రశ్న వచ్చింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర సిలబస్లోని అంశాలపైనే ఎక్కువ శాతం ప్రశ్నలు అడిగారు. కాబట్టి, ద్వితీయ సంవత్సర సిలబస్పై కచ్చితమైన పట్టు ఉంటే ఫిజిక్స్లో మంచి మార్కులతోపాటు మంచి పర్సంటైల్నూ సాధించవచ్చు.
కెమిస్ట్రీ
ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అటామిక్ స్ట్రక్చర్, స్టాయికియోమెట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, సాలిడ్ స్టేట్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ చాప్టర్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. మిగిలిన అధ్యాయాల నుంచి ఒక ప్రశ్నను మాత్రమే అడిగారు.
ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎస్, పి బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెటలర్జీ, హైడ్రోజన్స్ అండ్ కాంపౌండ్స్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలను అడిగారు. అది కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి సిద్ధాంతపరమైన ప్రశ్నలను అడిగారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆల్కైల్ హాలైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్, నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల నుంచి కనీసం రెండు నుంచి మూడు ప్రశ్నలవరకు ఎక్కువగా సిద్ధాంతపరమైనవి, మెకానిజమ్స్పై ప్రశ్నలను ఇచ్చారు. పై మూడు విభాగాల నుంచి కూడా ఎక్కువశాతం ప్రశ్నలు ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచే ఉన్నాయి.