నీట్లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు. ఆ లిస్ట్ ఆధారంగా అభ్యర్థికి రెండు రకాల ర్యాంకులు ఇస్తారు. ఇందులో జాతీయ స్థాయి ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకు కూడా ఉంటుంది. మొదటి ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి సీట్లు భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు ఆధారంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న 85 శాతం ప్రాంతీయ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ర్యాంకులతోపాటు రిజర్వేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు కేటగిరీ ర్యాంకులు కూడా ఇస్తారు. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా అర్హత పరీక్షలో తగిన మార్కులు కలిగి ఉండాలి. నీట్ను దేశవ్యాప్తంగా ఒక్కరోజే నిర్వహిస్తున్నందున అభ్యర్థులు అందరూ ఒకే ప్రశ్నపత్రాన్ని ఆన్సర్ చేస్తారు.
నెగిటివ్ సంగతి మరవొద్దు
‣ నీట్లో నెగిటివ్ మార్కులు ఉన్నాయని మర్చిపోవద్దు. దానికి అనుగుణంగా సన్నద్ధత వ్యూహం, పరీక్ష రాసేటప్పుడు మానసిక స్థితిని మార్చుకోవాలి.
‣ ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోతే లాటరీ విధానంలో ఆన్సర్ గుర్తించకూడదు. తప్పయితే...రుణాత్మక మార్కుల వల్ల మార్కులు పోగొట్టుకోవాల్సివస్తుంది.
‣ మార్కుల పరంగా విభజనను గమనించి తుది పరీక్షల్లో సమయాన్ని అదేరకంగా విభజిస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బయాలజీ తేలికైన సబ్జెక్టు కాబట్టి తుది పరీక్షల్లో సగం సమయాన్ని కాకుండా, వీలైనంతవరకు అంతకంటే తక్కువ సమయాన్ని వినియోగించుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అనుకూలం. ఈ రెండు సబ్జెక్టుల్లో లెక్కలుంటాయి కాబట్టి కొంత అధిక సమయం అవసరం.
‣ సబ్జెక్టును ఎంచుకునే క్రమం ఎలా ఉన్నా తుది పరీక్షలో బయాలజీతో ఆరంభిస్తే మేలు. సబ్జెక్టులవారీగా ప్రశ్నలు సాధించి, సమాధానాలు గుర్తించడం మంచిదే అయినా ‘డ్రాప్ అండ్ డ్రాగ్’ పద్ధతి ఉత్తమం. ఈ పద్ధతిలో బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, కష్టమైనవి, అననుకూలంగా ఉన్నవి, ఎక్కువ సమయం అవసరమైనవి...వీటిని రెండో రౌండ్లో ఆన్సర్ చేయడం మంచిది. లేదంటే సమయం సరిపోదు.
‣ ప్రశ్నకు ఇచ్చిన 4 ఆప్షన్లూ జాగ్రత్తగా చదివిన తర్వాతే సరైన సమాధానాన్ని గుర్తించాలి.
పరీక్ష రోజు... ముందు రోజు
‣ పరీక్ష ముందురోజు రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం మంచిది. మరుసటి రోజు పరీక్ష బాగా రాయాలని ఊహించుకుంటూ నిద్రపోవటం మంచిది.
‣ విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డులో ఉన్న కొవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్ టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అతికించి, సంతకంతోపాటు బొటనవేలి ముద్ర కూడా వేయాలి.
‣ గత 14 రోజులుగా తనకు జ్వరం, గొంతు సమస్యలు, దగ్గు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవని ఆ డిక్లరేషన్లో పేర్కొనాలి. కొవిడ్ పాజిటివ్ కేసులతో కాంటాక్ట్లో ఉన్నారా? లేదా?.. వివరాలు నమోదుచేయాలి.
‣ నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యమైతే అనుమతించరు. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి.
‣ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకు ధరించిన మాస్క్ తీసేసి, కొత్తది వేసుకోవాలి.
‣ శరీర ఉష్ణోగ్రతలను థర్మో గన్స్తో పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి ముందే మీ సీటింగ్ ఏరియాను శుభ్రపరుస్తారు.
‣ పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పేవరకూ సీటు నుంచి లేవకూడదు.
‣ అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి.
‣ ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా, వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
‣ రఫ్వర్క్ కోసం ప్రతి సీటు వద్దా ఎ4 సైజు తెల్ల కాగితాలు అందుబాటులో ఉంటాయి. ఇంకా అదనంగా కావాలన్నా ఇస్తారు.
‣ ఈ పరీక్ష మీ కెరియర్కు ఎంతో ముఖ్యం. పరీక్షకు నిర్దేశించిన మూడు గంటల సమయాన్నీ పూర్తిగా, చక్కగా ఉపయోగించుకోండి.
‣ అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్ వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లే ముందు నిర్ణీత డ్రాప్ బాక్సులో వాటిని వేయాలి.
‣ సరిగా నింపిన అడ్మిట్ కార్డుని కూడా డ్రాప్ బాక్సులో వేయాలి.
‣ ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.