పదో తరగతి తర్వాత ఉన్న దారుల్లో పాలిటెక్నిక్ కోర్సులు చెప్పుకోదగ్గవి. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత చదువులు... అన్నింటికీ సరిపోయేలా వీటిని రూపొందించారు. సాధారణ డిప్లొమాలతోపాటు వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో కోర్సులను ప్రత్యేక పాలిటెక్నిక్లు అందిస్తున్నాయి. ఇవే కాకుండా జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక విభాగాల్లో డిప్లొమాలు నిర్వహిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం...
ఇవీ బ్రాంచీలు...
సివిల్, ఆర్కిటెక్చురల్ అసిస్టెంట్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎల్రక్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎంబడెడ్ సిస్టమ్స్, ఫుట్వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఎంచుకోవచ్చు. వీటిని మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.
సాంకేతిక అంశాలపై మక్కువ ఉండి, చిన్న వయసులోనే కెరీర్లో స్థిరపడాలనుకునేవాళ్లు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. విద్యార్థి చేరిన విభాగాన్ని బట్టి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. లేదంటే ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్)తో డిప్లొమా కోర్సుల్లో చేరే అవకాశం కల్పిస్తున్నాయి. వీటిద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. పరీక్షలో పదో తరగతి సిలబస్లోని మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కొన్ని సంస్థలు పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్ కోర్సు అందిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిలోనూ చేరవచ్చు.
అవకాశాలెన్నో...
మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో వీరికి ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయి. రైల్వేల్లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులను డిప్లొమా విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. కేంద్రానికి చెందిన వివిధ విభాగాల్లో జేఈ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువరిస్తోంది. ఎంపికైనవారికి లెవెల్-6 ప్రకారం రూ.35,400 మూలవేతనం అందుతుంది. అంటే విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని ఆలవెన్సులూ కలుపుకుని రూ.యాభై వేలకుపైగా వేతనం అందుకోవచ్చు. రాష్ట్ర స్థాయుల్లో రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల...తదితర శాఖల్లో డిప్లొమాతో కొలువులెన్నో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా అవకాశాలు అందుతున్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్లు, ఇంజినీరింగ్ ఫర్మ్ల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. గత కొన్నేళ్లగా ప్రభుత్వ పాలిటెక్నిక్ల్లోనూ క్యాంపస్ నియామకాలు జోరందుకుంటున్నాయి. పలు విభాగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో డిప్లొమా విద్యార్థులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. రైల్వోలో పెద్ద ఎత్తున భర్తీచేసే లోకో పైలట్ ఉద్యోగాలను సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు సొంతం చేసుకోవచ్చు. సివిల్, ఎల్రక్టికల్, మెకానికల్ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎల్రక్టికల్ విభాగం వారికి అవకాశాలు లభిస్తాయి. సివిల్ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. ఎయిర్ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్ పోస్టులకు డిప్లొమా విద్యార్థులు అర్హులు. ఈ ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడుతున్నాయి.
ఉన్నత విద్య
డిప్లొమా అనంతరం ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని భావించినవాళ్లు ఈసెట్తో నేరుగా బీటెక్ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. ఎంసెట్, ఐఐటీ-జేఈఈ సైతం రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్ అందించే బీటెక్తో సమానమైన అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం ఎంటెక్ దిశగానూ అడుగులేయవచ్చు.
ప్లాస్టిక్ డిప్లొమా
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) హైదరాబాద్, విజయవాడ క్యాంపస్ల్లో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ) కోర్సులు అందిస్తోంది. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో వీటిలో ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తిచేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ స్పెషలైజేషన్తో బీటెక్ చదువుకోవచ్చు.
ఉద్యాన డిప్లొమాలు
ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న వాటిలో ఉద్యానవనాలు ముందుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పుత్తులు పెరగడంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. పదో తరగతి గ్రేడ్ పాయింట్ల మెరిట్ ప్రకారం ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. వీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. డిప్లొమా అనంతరరం బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఆయా రాష్ట్రా (ఏపీ/ తెలంగాణ) ల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు నడుస్తోంది.
హ్యాండ్లూమ్ టెక్నాలజీ..
తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉంది. ఈ సంస్థ ‘డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ’ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో 60 సీట్లకు గానూ తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 కేటాయించారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత టెక్స్టైల్స్ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్థాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో ఏట రూ. 1,200 ఉపకార వేతనంగా అందిస్తారు. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు ఉన్నాయి.
వ్యవసాయ డిప్లొమా
గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అగ్రికల్చర్ కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లు అందిస్తున్నాయి. వీటిని రెండేళ్లు, మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (ఆర్గానిక్ ఫార్మింగ్), డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సీడ్ టెక్నాలజీ) కోర్సులను రెండేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎరువులు, క్రిమిసంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లోనూ చేరవచ్చు. వీరికోసం 20 శాతం సీట్లు అగ్రిసెట్ ద్వారా సూపర్ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం వీరు బీటెక్ అగ్రి ఇంజినీరింగ్ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పదో తరగతి గ్రేడ్ పాయింట్లతో లభిస్తుంది. రెండేళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదువుకున్నవారికి అవకాశం కల్పిస్తారు. ఏపీలో... ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణలో.. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు అగ్రి పాలిటెక్నిక్లు నడుస్తున్నాయి.
యానిమల్ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ
గ్రామాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించే లక్ష్యంతో వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్ నెలకొల్పి స్వయం ఉపాధి పొందవచ్చు. యానిమల్ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీఎఫ్ఎస్సీల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు అర్హులు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ల మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో.. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు చోట్ల రెండేళ్ల వ్యవధితో యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్ కోర్సులు అందిస్తున్నారు.