టీఎస్ పాలీసెట్: పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 150. మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ పదో తరగతి సిలబస్ నుంచే వస్తాయి. పీజేటీఎస్ఏయూ పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కావాలనుకునేవారు బయాలజీతోపాటు మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల ప్రశ్నలనూ రాయాలి. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులవారికి బయాలజీ ఆప్షనల్. ప్రతి విద్యార్థికీ ప్రవేశం కోసం రెండు వేర్వేరు ర్యాంకులు (పాలిటెక్నిక్, అగ్రికల్చర్ డిప్లొమా) ఇస్తారు.
ఏపీ పాలీసెట్: వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
ప్రత్యేకత ఏమిటి?
‣ పాలిటెక్నిక్లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.
‣ విద్యాపరమైన పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణ, ప్రసంగ నైపుణ్యాలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, ప్రెజెంటేషన్లపై పట్టు ఏర్పడుతుంది.
‣ ప్రయోగపూర్వక బోధన కారణంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది. దీంతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగానికి సంసిద్ధులవుతారు.
ఎలా సన్నద్ధమవ్వాలి?
ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి. ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు చెందినవే. పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉంటారు. కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్ను సేకరించి పెట్టుకోవాలి. దాని ఆధారంగా సన్నద్ధత ప్రారంభించాలి.
అకడమిక్ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా మెటీరియల్పైనే ఆధారపడకూడదు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది. కాబట్టి, సిలబస్లోని ప్రతి టాపిక్లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి. ఆపై మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి. ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది. గత ప్రశ్నపత్రాలు పాలీసెట్ అధికారిక వెబ్సైట్లలో ఉంటాయి.
ఇవీ ప్రయోజనాలు!
తక్కువ వ్యవధి: వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేసి త్వరగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి ఇవి అనుకూలం. ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను కొనసాగించవచ్చు. లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.
ప్రాక్టికల్ పరిజ్ఞానం: పాలిటెక్నిక్ కోర్సుల్లో థియరీ కంటే ప్రాక్టికల్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఎక్కువ. ఇంటర్మీడియట్ విద్యార్థితో పోలిస్తే పాలిటెక్నిక్ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ.
ఫీజు తక్కువ: బీటెక్, బీఈ, ఇతర డిగ్రీ కోర్సుల కంటే ఈ కోర్సుల ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది.
విభాగం మార్చుకునే వీలు: పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉన్న లాభదాయకమైన అంశమిది. కోర్సు పూర్తయ్యాక భవిష్యత్తులో చదువు కొనసాగించాలనుకుంటే రంగాన్ని మార్చుకునే వీలుంది. కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన, ప్రాక్టికల్ పరిజ్ఞానం పరంగా ఇతరుల కంటే ముందుంటారు.
ఉద్యోగం/ వ్యాపారం: మూడేళ్ల డిప్లొమాను పూర్తిచేయడం ద్వారా సంబంధిత ఉద్యోగాలను అందుకోవచ్చు. పీఎస్యూలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో డిప్లొమా హోల్డర్లకు అవకాశాలుంటాయి. వీరిని జూనియర్ స్థాయి, టెక్నీషియన్ హోదాల్లోకి తీసుకుంటారు. రైల్వే, గెయిల్, ఓఎన్జీసీ, డీఆర్డీఓ, బెల్, ఎన్టీపీసీ మొదలైనవి వీరిని నియమించుకుంటున్నవాటిలో ప్రధానమైనవి. ప్రైవేటు ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్స్ సంస్థలూ వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులన్నీ ప్రాక్టికల్/ అప్లికేషన్ ఓరియెంటెడ్గా ఉంటాయి. కాబట్టి తమ రంగంలో సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.