• facebook
  • whatsapp
  • telegram

గెలిచేలా రాయండి!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి మెల‌కువలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్, యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు అతి త్వరలో జరగనున్నాయి. మరో పక్క టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులను ఆశిస్తున్న అభ్యర్థులు కూడా మెయిన్స్‌ పరీక్షకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్షల్లో బాగా రాణించాలంటే డిస్క్రిప్టివ్‌ రైటింగ్‌ స్కిల్స్‌ (వివరణాత్మక రాత నైపుణ్యాలు) బాగా ఉండాలి. వీటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం!
 

పోటీ పరీక్షల అభ్యర్థుల్లో చాలామంది చదవటానికి ఎక్కువ సమయం వెచ్చించి, రాతను సాధన చేసే అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో ఇబ్బంది ఉండదు. ఉన్న నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది. కానీ డిస్క్రిప్టివ్‌ పరీక్షల తీరు వేరు. అభ్యర్థి తన పరిజ్ఞానాన్ని సరైన రీతిలో రాత ద్వారా వ్యక్తీకరించటం ఇక్కడ చాలా ముఖ్యం. అలా చేసినప్పుడే అత్యధిక మార్కులు పొందే అవకాశాలుంటాయి. ఈ కి¨ంది మెలకువలు పాటించడం ద్వారా బలమైన భావవ్యక్తీకరణ, తద్వారా మంచి మార్కులు పొందవచ్చు.
 

పట్టు ఉన్న భాష ఎంపిక  
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రధానంగా రెండు భాషలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఇంగ్లిష్‌; రెండోది తెలుగు. యూపీఎస్‌సీ మెయిన్స్‌ సహా రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు ఈ రెండు భాషల్లో జవాబులు రాయటానికి అంగీకరిస్తున్నాయి. చక్కని పదాలతో తమ భావాలను స్వేచ్ఛగా, సులభంగా వ్యక్తం చేయగలిగే భాషను ఎంపిక చేసుకోవటం మేలైన నిర్ణయం. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ల పరీక్షల్లో ఆంగ్ల భాష ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి పొరపాటు అభిప్రాయాలతోనే  మెయిన్స్‌లో చాలామంది..తమకు ఆంగ్లభాషపై తగినంత పట్టు లేకపోయినా తమ పరిజ్ఞానాన్నీ, భావాలనూ ఇంగ్లిష్‌లో రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చాలా సందర్భాల్లో బెడిసికొడుతోంది. దీనికి ఎన్నో సాక్ష్యాలూ ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలూ, కళాశాలలూ ఎక్కువైన నేపథ్యంలో సాంకేతిక పదజాల భావవ్యక్తీకరణకు సంబంధించి ఇంగ్లిష్‌లో సఫలమవుతున్నారు. కానీ సాధారణ అంశాల భావవ్యక్తీకరణలో మాత్రం సరైన పట్టు కనిపించడం లేదు. ఫలితంగా రెండింటికీ చెడిన మాదిరిగా వీరు డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో విఫలమవుతున్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఏ భాషలో భావవ్యక్తీకరణ చేయాలో నిర్ణయించుకోవటం చాలా కీలకం.
 

చిన్న చిన్న వాక్యాలు
కారణాలు ఏవైనప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒక్కొక్క వాక్యాన్ని 5 లేదా 6 లైన్లలో రాసేస్తూ ఉంటారు. అనేక పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే- స్పష్టమైన భావవ్యక్తీకరణ చిన్నచిన్న పూర్తి వాక్యాల వల్లనే ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో సమయపు పరిమితి మూలంగా అభ్యర్థులు అయిదారు చిన్న వాక్యాల్ని కామాల ద్వారా అనుసంధానం చేస్తూ  ఒకే పెద్ద వాక్యాన్ని రాస్తుంటారు. కానీ దీనివల్ల అస్పష్టత పెరిగి, మూల్యాంకనం చేసే వ్యక్తుల్లో సందిగ్ధత ఏర్పడుతుంది. ఫలితంగా తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఉంది. చిన్న వాక్యాలు రాయడం వల్ల ఎక్కువ సమయం పట్టే ఇబ్బంది అయితే ఉంది. కానీ స్పష్టమైన భావ వ్యక్తీకరణ సాధ్యమై.. అంతిమంగా మంచి మార్కులతో రాణించవచ్చు.
 

భాషల మిశ్రమం
ఆంగ్ల మాధ్యమంలో రాసేవారు తెలుగు పదాలు రాయరు కానీ తెలుగు మాధ్యమంలో సమాధానాలు రాసేవారు చాలా సందర్భాల్లో ఆంగ్ల లిపిలో అనేక పదాలు రాస్తున్నారు. వ్యవహారంలో ఆంగ్లం, తెలుగు మిశ్రమం చెందటం దీనికి కారణం. రాత పరీక్షల్లో మాత్రం ఈ విధమైన మిశ్రమం సమంజసం కాదు. ఒకవేళ ఆంగ్ల పదాలు రాయాల్సి వస్తే తెలుగు లిపిలో రాయటం మేలైన నిర్ణయం. కొన్ని వాక్యాలు ఇంగ్లిషులో, కొన్ని తెలుగులో రాయడం సరికాదు. ఇది మార్కులు తగ్గించేందుకు కారణమవుతుంది. సాంకేతిక పదాలను పూర్తిగా తెలుగులో తర్జుమా చేస్తే పేపర్‌ దిద్దేవారికి అర్థం కాకపోయే ప్రమాదం ఉంది. అందుకే సాంకేతిక పదజాలాన్ని వీలైనంత వరకే తెలుగులో రాయటం మేలు. ఒక ప్రశ్నకు జవాబు పూర్తిగా తెలుగులో రాసి, మరో ప్రశ్న జవాబును  ఇంగ్లిషులో రాసే అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి అలవాటు పేపర్‌ దిద్దేవారిని చిరాకుపెట్టిస్తుంది.
 

పటాలూ.. పట్టికలూ  
సందర్భాన్ని బట్టి పటాలు గీయటం ద్వారా భావవ్యక్తీకరణ బలంగా జరుగుతుంది. చరిత్ర పేపర్లో కూడా ఈ మెలకువలను అనుసరించవచ్చు. యుద్ధం జరిగిన ప్రదేశం కావచ్చు; రాజ్య భూభాగం కావచ్చు- పటాల రూపంలో ప్రదర్శించవచ్చు. రాజులను తులనాత్మకంగా పరిశీలించే సందర్భంలో పట్టికలు కూడా వేయవచ్చు. చరిత్రలోనే ఇంత అవకాశం ఉన్నప్పుడు మిగతా సబ్జెక్టుల్లో పుష్కలమైన అవకాశం కనిపిస్తుంది. అందువల్ల పోటీ పరీక్షకు సిద్ధమయ్యే సందర్భంలోనే ‘ఈ తరహా ప్రశ్నలకు ఇలా సమాధానం రాయవచ్చు’ అని ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే పరీక్ష హాల్లో విజయవంతంగా దాన్ని అమలు చేయవచ్చు. ఫ్లో డయాగ్రమ్స్, వెన్‌ చిత్రాలు మొదలైనవాటిని ఎకానమీ, సైౖన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి సబ్జెక్టుల్లో ఉపయోగించవచ్చు. అయితే ప్రతి ప్రశ్నకూ ఇలా చిత్రాలు, పటాలు, పట్టికల జోలికి వెళ్లకుండా కొన్ని సందర్భాల్లోనే వినియోగించడం మంచిది.
 

సంభాషిస్తున్నట్లు సమాధానం
సమాధానంలో జీవం అనేది మార్కులు ఇవ్వటానికి బాగా తోడ్పడుతుంది. అలాంటి జీవాన్ని సమాధానంలో జోడించే ప్రయత్నం చేయాలి. ఇందుకు పేపర్‌ దిద్దే వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా సమాధానం ఉండాలి. ముఖ్యంగా వ్యాసరచన పేపర్‌లో ఈ నైపుణ్యం బాగా రాణిస్తుంది. జనరల్‌ స్టడీస్‌ పేపర్లో కూడా కొన్ని ప్రశ్నలకు ఈ తరహా విధానాన్ని రాయాల్సి ఉంటుంది. వివిధ పేరాగ్రాఫ్‌లు రాసేటప్పుడు పేరాల మధ్య అనుసంధానపు పేరా ఉందా లేదా అని జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఇలాంటి సంభాషణ తరహా రాత నైపుణ్యం అలవడుతుంది.ఈ రాత నైపుణ్యం ప్రతిబింబించాలంటే పేపర్‌ దిద్దే వ్యక్తికి మీ సమాధానంలో ధార (ఫ్లో), క్రమం (సీక్వెన్స్‌) కనిపించాలి. సందర్భానుసారం వాడుక మాటలూ, సామెతలూ, నానుడులూ వినియోగించడం తెలివైన నిర్ణయమవుతుంది. అయితే కొన్ని ప్రాంతాలవారికే అర్థమయ్యే మాండలిక పదాలను వినియోగించవద్దు.
 

ట్యాగ్‌లైన్‌లే నిర్దేశకాలు 
వివరించండి, విశ్లేషించండి, సమర్థించండి, వ్యాఖ్యానించండి, వ్యతిరేకించండి, మూల్యాంకనం చేయండి, చర్చించండి, నేపథ్యాన్ని రాయండి- మొదలైన ట్యాగ్‌లైన్‌లను ప్రశ్నలో భాగంగా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అలాంటివేమీ లేకుండా వ్యాఖ్యానాలు గానీ, ఒక వాక్యం గానీ ఇవ్వవచ్చు. భావవ్యక్తీకరణ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ప్రశ్నతో అడిగిన ట్యాగ్‌ లైన్‌ని నిర్దేశకంగా గుర్తించాలి. అందుకనుగుణంగా సమాధానం ఉన్నప్పుడే మార్కులు పొందుతారని గుర్తించాలి.
 

దస్తూరీ బాగోకపోతే..?
శారీరక పరమైన సమస్యల వల్లనో, చిన్నతనంలో రాత నేర్పిన వ్యక్తుల వల్లనో కొంతమంది దస్తూరీ (హ్యాండ్‌ రైటింగ్‌) కుదురుగా ఉండకపోవచ్చు. పోటీపరీక్షల్లో భావ వ్యక్తీకరణకు ఇదో అవరోధంగా మారుతుంది. కొంతమంది రాతలో పదాలు కిందకీ పైకీ వెళ్ళిపోయి ఒక లైన్లో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో కచ్చితంగా మార్కులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రాత ఇతరులకు సులభంగా బోధపడని దస్తూరీ ఉన్నవారు గొలుసుకట్టుగా రాయటం మానెయ్యాలి. పెద్ద అక్షరాలు రాయాలి. పదానికీ పదానికీ మధ్యా, వాక్యానికీ వాక్యానికీ మధ్యా ఖాళీ ఇవ్వాలి. వాక్యాలను ఒకే లైన్లో కుదురుగా రాయలేనివారు స్కేలు ద్వారా కొంతకాలం అభ్యాసం చేస్తే పరీక్షల్లో పొందికగా రాసే అవకాశం ఏర్పడుతుంది.
 

విశ్వసనీయత ముఖ్యం
డిస్క్రిప్టివ్‌గా రాసే ఏ సమాధానం అయినా విశ్వసనీయంగా ఉంటేనే దిద్దేవారు ఎక్కువ మార్కులు వేస్తారు. ఇలాంటి విశ్వసనీయత పొందేందుకు... అందరికీ తెలిసిన సమాచారం రాయటం ఒక మెలకువ. విశ్వసనీయతను సమాధానాల్లో జోడించేందుకు అధికారిక గణాంకాలు, నివేదికలపై ఆధారపడాలి. ఈ క్రమంలో అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారా? అనే నిర్లక్ష్యపు ధోరణితో ఇష్టమొచ్చినట్లు అంకెలూ, శాతాలూ జోడిస్తే దొరికిపోవటం ఖాయం. ఎందుకంటే.. ఈరోజుల్లో అందరికీ గూగుల్‌ సమాచారం మొబైల్‌ ద్వారా లభిస్తోంది. అందువల్ల  పేపర్‌ దిద్దేవారికి మీరిచ్చిన గణాంకాలు గానీ, ఇతర విషయాలు గానీ ఎంతవరకు వాస్తవమో నిర్ధారించుకోవటం ఎంతో సులువు. అందుకే బాధ్యతగా వాస్తవికమైన గణాంకాలను జోడించటం ముఖ్యం. 
 

వ్యాస రచన:
జనరల్‌ స్టడీస్‌ పేపర్లో సమాధానం రాసేటప్పుడు కొంతవరకు స్వేచ్ఛ అభ్యర్థులకు ఉంటుంది. పాయింట్లుగా రాయవచ్చు, సైడ్‌ హెడ్డింగ్‌ పెట్టవచ్చు, పేరాగ్రాఫ్‌లు రాయవచ్చు. నిర్దిష్ట వరుసక్రమం లేకుండా సమాధానాన్ని ఇవ్వచ్చు. కానీ వ్యాస రచనలో సమాధానం మొత్తం  క్రమబద్ధమైన పేరాల రూపంలో ఉండాలి. పాయింట్లుగా సమాధానం రాయకూడదు. కొన్ని అంశాలను ఎగ్జామినర్‌ దృష్టికి తీసుకువచ్చేలా పెద్ద అక్షరాలు రాయడం గానీ, అండర్‌లైన్‌ గానీ చేయకూడదు. భాషా పటుత్వం ప్రధానంగా వ్యాసరచనలో గమనిస్తారు.


 

Posted Date : 27-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌