• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌కు దీటుగా..గ్రూప్ - 1

మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు సమర్థులైన ఉన్నతాధికారులను అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోంది. అందులో భాగంగా గ్రూప్-1 సర్వీసులకు నిర్వహించే పరీక్షలకు కొత్త సిలబస్ (ముసాయిదా)ను వెబ్‌సైట్‌లో ఉంచింది. సివిల్స్‌కు సరితూగేలా మార్పులు చేశారు. ఇందులో పేర్కొన్న పాఠ్యాంశాలు, సిలబస్ రూపకల్పన స్ఫూర్తిని అర్థం చేసుకోవటం ఉద్యోగార్థుల కర్తవ్యం. అప్పుడే సన్నద్ధత సులభతరమవుతుంది!

గ్రూప్-1 పోస్టుల ఎంపికకు మూడంచెల విధానాన్ని కొనసాగిస్తూ ప్రిలిమినరీలో రెండు పేపర్లు ప్రవేశపెట్టారు. గతంలో ప్రిలిమినరీ దశలో ఒకే పేపర్ జనరల్‌స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్‌గా ఉండేది. ప్రస్తుతం పేపర్-1 జనరల్‌స్టడీస్, పేపర్-2 జనరల్ మెంటల్ ఎబిలిటీ, పాలనా సామర్థ్యాలు, మానసిక సామర్థ్యాలను ప్రవేశపెట్టారు. గతంలో ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసేవారు. మారిన నిబంధనల ప్రకారం 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తున్నందున మెయిన్స్‌కు తక్కువమంది అభ్యర్థులు వెళతారు. అలా మెయిన్స్ రాసేవారి విభిన్న సామర్థ్యాలను ప్రిలిమినరీ స్థాయిలోనే పరీక్షించి పంపాలన్నదే ఈ మార్పు ఉద్దేశం.
వర్తమానంతో అనుసంధానం చేయటం, ప్రస్తుత పాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకోవటం... ఈ రెండిటి సమ్మేళనంగా సిలబస్ రూపొందించినట్లు భావించవచ్చు. ప్రిలిమినరీలో గతంలో పేర్కొన్న సిలబస్ అంశాలను పూర్తిస్థాయిలో స్పష్టంగా ఇవ్వటం వల్ల సిలబస్ సైజు బాగా పెరిగింది. వాస్తవానికి గత సిలబస్ కంటే ఇరవై శాతం మాత్రమే అదనపు పెరుగుదల కనిపిస్తుంది.

 

మొదటి పేపర్: (4 విభాగాలు)
మొదటిది 'చరిత్ర - సంస్కృతి. ఒక ఆప్షనల్ స్థాయిలో సిలబస్ ఉందనే అభిప్రాయం ఏర్పడింది.
ఏం చేయాలి?: ప్రధాన రాజవంశాలు చదువుతూ సాంస్కృతిక విషయాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఆధునిక భారతదేశ చరిత్ర మీద పట్టు సాధించాలి.

రెండో విభాగం 'రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు. గతం నుంచి ఉన్న రాజ్యాంగ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.అదనంగా దేశంలో ప్రవేశించిన లిబరలైజేషన్, ప్రైవేెటైజేషన్, గ్లోబలైజేషన్‌లు పాలనను ఎలా ప్రభావితం చేశాయి అనే కోణంలో 3 చాప్టర్లను ఇచ్చారు.
ఏం చేయాలి?: కాన్సెప్ట్ ఆధారిత అధ్యయనం చేసినప్పుడే స్కోరు సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై పట్టు పెంచుకోవాలి. వచ్చే ప్రశ్నల సంఖ్య నాలుగైదుకు మించక పోవచ్చు కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనేదీ గమనించాలి.

మూడో విభాగం 'భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఎకనామిక్స్ సబ్జెక్టులో గతంలో ఇచ్చిన సైద్ధాంతిక అంశాల ప్రాధాన్యం పూర్తిగా తగ్గించేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కింద విభజన సమస్యలన్నీ పేర్కొన్నారు.
ఏం చేయాలి?: ఎకానమీ అనగానే బడ్జెట్‌ను, ఆర్థిక సర్వేను, గణాంకాలను ముందు వేసుకుని బట్టీ పట్టినట్లయితే ఫలితం ఉండదు. పర్యావరణ క్షీణత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే కోణంలో అధ్యయనం చేయాలి.

నాలుగో విభాగం 'భౌగోళిక అంశాలు. సౌర వ్యవస్థతోపాటు వివిధ భౌతిక, భౌగోళిక అంశాలకు అధిక ప్రాధాన్యం లభించింది.
ఏం చేయాలి?: ప్రపంచ వాతావరణం, సముద్రాలు, వాతావరణ అంశాలు మొదలైనవి సిలబస్‌లో పేర్కొన్న పరిస్థితిలో ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. గతంలో భారతదేశ జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభాకి మాత్రమే పరిమితమైన వివిధ గణాంకాలను ప్రపంచస్థాయి జనాభా అధ్యయనాలకు విస్తృతీకరించుకోవాలి.

రెండో పేపర్: (3 విభాగాలు)
ఈ పేపర్లో మొదటి విభాగం 'సాధారణ మానసిక, పరిపాలన మానసిక సామర్థ్యాలు. మొత్తం 22 చాప్టర్లను ఈ విభాగంలో పేర్కొన్నారు. దీంతో సిలబస్‌ని భారీగా పెంచేశారనే అభిప్రాయం ఏర్పడింది. కీలక పోస్టుల్లో నియామకాలు జరిపేటప్పుడు నిర్వహించే సైకలాజికల్ టెస్టులను కొత్త సిలబస్ అంశాలుగా చేర్చారు.
ఏం చేయాలి?: కచ్చితమైన మార్కులు సాధించే స్కోరింగ్ భాగంగా చెప్పవచ్చు. చాప్టర్ల సంఖ్య చూసి భయపడాల్సిన అవసరం లేదు. అదనంగా చేర్చిన ఈ సిలబస్ అంశాలపై స్థూల అవగాహన ఏర్పరచుకుంటే సులభంగా గట్టెక్కవచ్చు.

రెండో విభాగం 'శాస్త్ర సాంకేతికత. జనరల్ సైన్స్‌లో ఉండే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం మొదలైన సబ్జెక్టులను ఈసారి జనరల్ సైన్స్ నుంచి తొలగించారు. ప్రశ్నలన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనువర్తన విషయాల నుంచి వచ్చే అవకాశముంది.
ఏం చేయాలి?: సిలబస్‌లో పేర్కొన్న వివిధ అంశాలను పరిపాలన కోణంలో అర్థం చేసుకుంటేనే ఈ విభాగంలో తేలికగా మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనుసంధానిత శాస్త్ర సాంకేతిక ప్రశ్నలకు ఎక్కువ అవకాశం ఇవ్వవచ్చు.

మూడో విభాగం 'జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ వర్తమానాంశాలు. ఎక్కువ అంశాలు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా అడిగే అవకాశం ఉంది.
ఏం చేయాలి?: చాలామంది జనరల్ నాలెడ్జ్‌ని కరెంట్ అఫైర్స్ అనుకుని చదువుతూ ఉంటారు. ఇది చదివేటప్పుడు జనరల్ నాలెడ్జ్‌కీ, కరెంట్ అఫైర్స్‌కూ మధ్య భేదాలను గమనిస్తే పట్టు సాధించడం తేలికవుతుంది.

 

మెయిన్స్: సామర్థ్యాలకు సవాల్
గతంలో అర్హత మార్కులకు ఉద్దేశించి ఒక ఇంగ్లిష్ పేపర్, మిగిలినవి అయిదు పేపర్లుండేవి. ఇప్పుడు ఇంగ్లిష్‌తోపాటు తెలుగు భాషా సామర్థ్యం పేపర్‌నూ ప్రవేశపెట్టారు. రెండు పేపర్లలో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ప్రధానంగా ఇచ్చిన అయిదు పేపర్లలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలో అయిదు పేపర్లకు ఒక్కోదానికి 150 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంటర్వ్యూకు 75 మార్కులు. వెరసి మొత్తం 825 మార్కులకుగానూ అత్యధికంగా ప్రతిభ చూపినవారిని గ్రూప్-1 సర్వీస్‌కు ఎంపిక చేస్తారు.
ఒక గ్రూప్-1 అధికారి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపే సందర్భంలో లేదా తనకంటే కిందిస్థాయి ఉద్యోగులు, పైస్థాయి ఉన్నతాధికారులతో ముఖాముఖి సమావేశ, సంభాషణ సమయాల్లో సందర్భానుగుణంగా ప్రభావితం చేసే సామర్థ్యాలను సిలబస్‌లో పొందుపరిచారు. దీని ద్వారా ఉద్యోగార్థికి విషయజ్ఞానంతోపాటు వ్యక్తిత్వ సామర్థ్యం తగుపాళ్లలో ఉంటేనే విధులను నిర్వర్తించగలడన్న వాస్తవిక దృక్పథం సిలబస్‌లో ప్రతిబింబించింది.
ఈ సామర్థ్యాలనే మెయిన్స్ అర్హత పేపర్లు ఆంగ్ల, తెలుగు భాషా సామర్థ్య పేపర్లలో పరీక్షిస్తున్నారు. గతంలో భాషా సామర్థ్య పేపర్లలో వ్యాకరణం, పదసంపదపై పట్టు, కాంప్రహెన్షన్ కోణాల్లో ప్రశ్నలుండేవి.

వీటి పరిధి దాటి...
పాలనలో నిత్యావసరాలైన లేఖా రచన, ఒక అంశంపై పత్రికా ప్రకటన రూపొందించడం..ఉదాహరణకు- వరద ప్రమాదం ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి తాత్కాలికంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలనీ, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న సూచనలతో పత్రికా ప్రకటన తయారు చేయడం... ఒక విషయాన్ని పరిశీలించిన తరువాత దానిపై నివేదిక రూపకల్పన.. ఉదాహరణకు క్షేత్రస్థాయికి వెళ్లిన ఒక అధికారి తన పరిశీలనపై ఒక నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపడం అధికారిక ప్రసంగం.. ఒక సమావేశంలో ప్రారంభోపన్యాసం చేయడం,
ఇంగ్లిష్ నుంచి తెలుగుకూ, తెలుగు నుంచి ఇంగ్లిష్‌కూ అనువాదం చేయడం... భాషా సామర్థ్య పేపర్లలో ఉన్నాయి.
వీటికి తెలుగు, ఇంగ్లిష్ వ్యాకరణం చదవడంతోనే అర్హత మార్కు సాధించవచ్చనే అపోహను అభ్యర్థులు వదలాలి. మొత్తం 150 మార్కుల పేపర్‌లో వ్యాకరణానికి కేయించింది 20 మాత్రమే. మిగతా అంశాలన్నీ వ్యాకరణం సాయంతో రూపొందించాల్సినవి. ఈ అంశాలన్నింటికీ పద పరిమితిని సిలబస్‌లో పేర్కొన్నందున వివిధ సందర్భాలను ఊహించుకుని నివేదిక, లేఖ, సంక్షిప్త ప్రసంగం రాసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇందుకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లోని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలు, నివేదికలను సునిశితంగా గమనించాలి. వాటికి తిరిగి పదపరిమితిని నిర్దేశించుకుని రాయడం వల్ల ఈ నైపుణ్యం అలవడుతుంది. ఆపై స్వయంగా సందర్భాలు, సంఘటనలను సృష్టించుకుని రాయడం మొదలుపెడితే క్రమేపీ సామర్థ్యం పెరుగుతుంది.

వ్యాసరచన ఇతివృత్తాలతో..
సాధారణ వ్యాసరచన పేపర్‌లో పేర్కొన్న అంశాలను చూస్తే.. రాబోయే గ్రూప్-1లో మెయిన్స్‌లో అన్ని పేపర్లు ఏయే విషయాల చుట్టూ తిరుగుతాయో అర్థమవుతుంది. సమకాలీన విషయాలు, సామాజిక రాజకీయ అంశాలు, సామాజిక ఆర్థికాంశాలు, సామాజిక, పర్యావరణ అంశాలు, సాంస్కృతిక, చారిత్రక అంశాలు, పౌర అవగాహన సంబంధితాంశాలు, ఆలోచనాత్మక అంశాలున్నాయి.
ఈ అంశాలపై వచ్చే ప్రశ్నలకు రాసే జవాబుల ద్వారా అభ్యర్థి విశ్లేషణ, విషయాన్ని వ్యక్తీకరిచగల సామర్థ్యాలు, ఇచ్చిన విషయంపై ఏమేరకు అవగాహన ఉందో పరిశీలిస్తామని సాధారణ వ్యాసరచన పేపర్‌లో పేర్కొన్నారు. ఇంకా రాసే వ్యాసానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలను పాటిస్తున్నారా? వ్యక్తీకరించే ఆలోచనలు, అభిప్రాయాల్లో వాస్తవికత, భాష, వ్యాకరణ మదింపు సమయంలో పరిశీలిస్తారు. వివాదాస్పద అంశాలను తటస్థ లేదా హేతుబద్ధంగా అభ్యర్థి తీసుకున్న వైఖరి ఆధారంగా ఎలా రాయాలో గ్రహించాలి.
మెయిన్స్‌లోని ఇతర పేపర్లలో కొత్తగా చేర్చిన విభాగాలు కూడా అభ్యర్థి ఏయే విషయాలపై లోతైన అవగాహన, స్పష్టత ఉండాలనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. భారత రాజ్యాంగం పేపర్‌లో పేర్కొన్న ప్రభుత్వ పాలన- గవర్నెన్స్, ప్రభుత్వ సేవల్లో నైతికత, న్యాయవ్యవస్థ కంపెనీ, కార్మిక, పౌర చట్టాలు చేర్చడం వెనక గల అంతరార్థం ఇదే!

కొత్త అంశాలను చేర్చి చూస్తే..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో నూతనంగా ప్రవేశపెట్టిన పాలన, మానసిక సామర్థ్యాలు ప్రధాన పరీక్షలోని తెలుగు, ఆంగ్లభాషా సామర్థ్య పేపర్లు, జనరల్ ఎస్సే పేపర్లలో పొందుపరిచిన విభిన్న అంశాలను ఒకచోటకు తీసుకొచ్చి పరిశీలిస్తే.. గ్రూప్-1 స్థాయి అధికారుల ఎంపికకు ఏ నైపుణ్యాలు, సామర్థ్యాలను కమిషన్ ఆశిస్తోందో స్పష్టమవుతుంది. తద్వారా మొత్తం సిలబస్‌లోని అంశాల సన్నద్ధతకు మార్గం సుగమమవుతుంది.
పాలన, మానసిక సామర్థ్యాలను ఓసారి చూస్తే.. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎంపతీ (సహానుభూతి), ఒత్తిడిని అధిగమించడం, నిర్ణయ సామర్థ్యం, సమస్యా పరిష్కారం, సామాజిక ప్రజ్ఞ, కలివిడి సామర్థ్యం, తార్కిక, సృజనాత్మక ఆలోచనా సామర్థ్యం అంశాల ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని మదింపు చేసే ప్రయత్నం కనిపిస్తోంది.
సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పాలన వ్యవస్థలో పాల్గొనగలిగే సామర్థ్యం, ప్రభుత్వ సర్వీసుల్లో రాణించగలిగే వ్యక్తిగత ఉద్వేగాల ప్రజ్ఞను ప్రశ్నపత్రం ద్వారా పరిశీలించి సమర్థతగల అభ్యర్థులను అందించాలన్నది కమిషన్ ఆంతర్యంగా భావించవచ్చు. దీన్ని గుర్తించి ఆ దిశగా సన్నద్ధమైతే ఆశించిన ఫలితం దక్కుతుంది.

అభ్యర్థులూ... గమనించండి!
1. సిలబస్ పరిధి విస్తృతంగా ఉంది. కాబట్టి మొదట అభ్యర్థులు విహంగవీక్షణం మాదిరిగా ప్రతి విభాగంలో, ప్రతి చాప్టర్‌లో ఏయే అంశాలున్నాయో గమనించాలి. ప్రతి అంశంలో మౌలిక భావనలు అర్థం చేసుకుని తర్వాత స్థూల అవగాహన పెంచుకోవాలి.
2. పరిధి విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యాలను బట్టి కొన్ని చాప్టర్‌లపై అధికంగా ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చాప్టర్లను గుర్తించి ఎక్కువ అభ్యాసం చేయాలి.
3. గణాంక ఆధారిత ప్రశ్నలకు తక్కువ ప్రాధాన్యం, అవగాహన ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకనుగుణంగా సన్నద్ధతను మార్చుకోవాలి.
4. సిలబస్ అంశాలను ఆచరణాత్మకమైన, వర్తమాన సంబంధమైన విషయాలకు అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌