‣ రివైజ్డ్ ‘కీ’ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
‣ 25 ప్రశ్నల్లో కొన్ని తొలగింపు
‣ మరికొన్నింటిలో జవాబుల మార్పు
గ్రూపు-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు దొర్లాయి. మొత్తంగా 25 ప్రశ్నల్లో తొలగింపులు, మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అభ్యర్థుల తలరాతలు మారబోతున్నాయి. ఆదిలోనే కొందరు అభ్యర్థులు ప్రధాన పరీక్షకు ఎంపిక కాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత మే నెలలో నిర్వహించిన గ్రూపు-1 ప్రిలిమ్స్కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాథమిక ‘కీ’ను విడుదల చేసింది. దీనికి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిని కమిషన్ నిపుణుల కమిటీకి పంపించింది. నిపుణుల కమిటీ సభ్యులు ఖరారు చేసిన రివైజ్డ్ ‘కీ’ని ఏపీపీఎస్సీ సెప్టెంబరు 6న రాత్రి విడుదల చేసింది.
సవరణలు
‣ పేపరు-1లో 14 ప్రశ్నలకు జవాబులు మారాయి. ఐదు (10, 45, 59, 73, 81) ప్రశ్నలు పూర్తిగా తొలగించారు.
‣ పేపరు-2లో రెండు ప్రశ్నలకు జవాబులు మారాయి. నాలుగు (1, 17, 63, 106) ప్రశ్నలు తొలగించారు.
‣ పేపరు-1లో 37 (హెబియస్ కార్పస్), 38 (రాష్ట్ర పాలసీకి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్) ప్రశ్నల కింద పేర్కొన్న జవాబులన్నీ కచ్చితమైనవేనని పేర్కొనడం గమనార్హం.
‣ పేపరు-2లో 116వ ప్రశ్న (2018కి యునైటెడ్ నేషన్స్)కు ఐచ్ఛికాల్లో మూడు సరైన జవాబులిచ్చారు. వీటిలో దేన్ని గుర్తించినా మార్కు ఇస్తామని కమిషన్ ప్రకటించింది.
‣ 44వ ప్రశ్నకు తొలి కీలో ఇచ్చిన జవాబును ఇప్పుడు మార్చారు.
పరీక్షలో ప్రతి ప్రశ్న, ప్రతి నిమిషం కీలకమైన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యానికి, ప్రశ్నపత్రాల రూపకర్తల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పోటీపరీక్షల రంగ నిపుణులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా 25 ప్రశ్నల్లో కొన్నింటిని తొలగించడం, మరికొన్ని ప్రశ్నలకు జవాబులు మార్చడం పరీక్షలు రాసిన అభ్యర్థులకు శరాఘాతంగా మారనుందని చెబుతున్నారు. కొత్త విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష ఆధారంగా ఒక్కో పోస్టుకు 12 నుంచి 15 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేస్తోంది. ఈ తరుణంలో దొర్లిన తప్పుల వల్ల కొందరు అభ్యర్థులు ప్రధాన పరీక్షకు ఎంపికవని పరిస్థితులు నెలకొన్నాయని పోటీ పరీక్షల రంగ నిపుణులు జేవీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.