జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు
ప్రభుత్వంలో జవాబుదారీతనం, పారదర్శకతలో పరిపూర్ణ మార్పులను తీసుకురావడానికి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో నూతన ప్రభుత్వం జ్యుడీషిల్ ప్రివ్యూ కమిషన్ను ఏర్పాటుచేస్తుంది. కమిషన్ ఆమోదించిన తర్వాతే ప్రాజెక్టుల కాంట్రాక్టులు, టెండర్ల అమలుకు అనుమతిస్తారు. ఈ కమిషన్ ప్రస్తుతం ఉన్న టెండరింగ్ ప్రక్రియను సమీక్షించి, అవినీతిని నిర్మూలించేందుకు పారదర్శకతతో కూడిన సంస్కరణలను సిఫార్సు చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయసమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం - 2019ను తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దీనికి అధికారిక గెజిట్ విడుదల కావాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వేలంపాట (బిడ్డింగ్) ప్రక్రియలో పారదర్శకతను తీసుకువస్తుంది. తద్వారా ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చట్టం 2019
రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత లక్ష్యంగా పారదర్శకతతో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమాన అవకాశాలు, వ్యయం, నాణ్యతా సూత్రాలను పాటిస్తూ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని దృఢ నిశ్చయంతో ఉంది. 2001లో చేసిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పించే చట్టం-2001 ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టులకు (పీపీపీ) మాత్రమే పరిమితమైంది. అన్ని రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం హైకోర్టు న్యాయమూర్తిని న్యాయపరమైన ముందస్తు సమీక్ష కింద నియమిస్తారు. వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూపొందుతున్న అవసరాలు, ఆవశ్యకతలతో తగిన యంత్రాంగాలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు.
ఈ చట్టం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తితో న్యాయపరమైన ముందస్తు సమీక్ష (జ్యుడీషియల్)ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. అవసరమైతే న్యాయమూర్తికి సహాయం చేయడానికి సాంకేతిక, ఇతర కమిటీలను ఏర్పాటుచేస్తుంది. దీనిలో భాగంగా న్యాయపరమైన ముందస్తు సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం-2019ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం న్యాయపరమైన ముందస్తు సమీక్షకు పంపిన టెండరు పత్రాలను న్యాయమూర్తి వారం రోజుల పాటు ప్రజల ముందు ఉంచి వారి సలహాలను ఆహ్వానించాలి. ఆ ప్రకటన వచ్చిన 8 రోజుల్లోగా టెండరు పత్రాల న్యాయపరమైన ముందస్తు సమీక్ష జరగాలి. న్యాయమూర్తి ఏవైనా మార్పులు అవసరమని భావిస్తే ప్రభుత్వం వాటికి సిద్ధంగా ఉండాలి.