• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం - పంటకాలాలు

 మన దేశంలో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉండటంతో పంటలు, పంట కాలాలూ వేర్వేరుగా ఉంటాయి. దీంతో ప్రాంతాల వారీగా విభిన్న వ్యవసాయపద్ధతులు అమలవుతున్నాయి. జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటిపై అవగాహన పెంచుకోవాలి.
 

వర్షపాతం, శీతోష్ణస్థితిని బట్టి పంట కాలాలు మూడు రకాలు.
 

ఖరీఫ్‌ కాలం: ఇది జూన్‌ నుంచి అక్టోబరు వరకు ఉంటుంది. కాలవ్యవధి 5 నెలలు. పూర్తిగా వర్షాధారమైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో సార్వా, తెలంగాణలో పునాస పంట అని అంటారు. ఈ కాలంలో వరి, జొన్న, సజ్జ, జనుము, చెరకు, పత్తి లాంటి పంటలు పండిస్తారు.
 

రబీ కాలం: ఇది నవంబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. కాలవ్యవధి 4 నెలలు. ఈ కాలం వర్షం, తేమపై ఆధారపడుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో దాళ్వా, తెలంగాణలో యాసంగి పంట అని పిలుస్తారు. ఈ కాలంలో గోధుమ, బార్లీ, బఠానీ, పొగాకు, ఆవాలు, ధనియాలు లాంటివి పండిస్తారు.
 

జైద్‌/జయద్‌ కాలం: దీన్ని రబీ, ఖరీఫ్‌ల మధ్య స్వల్పకాలిక పంట అంటారు. ఇది మార్చి నుంచి జూన్‌ మధ్యలో 3 నెలల పాటు ఉంటుంది. ఈ కాలంలో నీటివసతులు ఉన్న ప్రాంతాల్లో పంటలు పండిస్తారు. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో అనుకూలమైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో వేసవి కాలం పంట, తెలంగాణలో కార్తీక పంట అంటారు. ఈ కాలంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, పుచ్చకాయలు, కర్బూజ, పశువుల మేత పండిస్తారు.
సాగు పద్ధతులు
 

జూమ్‌ పద్ధతి: ఈ రకమైన వ్యవసాయ సాగు పర్వత పాదాల వద్ద చేస్తారు. ఇది ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉంది.
 

టెర్రస్‌ పద్ధతి: పర్వత సానువులు, పంక్తులు లేదా పర్వతాలపై సాగుచేసే పద్ధతి. ఇది ఎక్కువగా హిమాలయ పర్వత పైభాగంలో అమల్లో ఉంది.
 

బేవార్‌/బేర్‌ పద్ధతి: ఇది కొండ ప్రాంతాలు, పీఠభూమి పైన సాగుచేసే విధానం. దీన్ని ఎక్కువగా ద్వీపకల్ప ఉన్నత ప్రాంతంలో చేస్తారు.
 

పంట మార్పిడి: ఒక సంవత్సరంలో పండించిన పంటను మరుసటి సంవత్సరంలో మార్పు చేస్తూ కొనసాగించే విధానాన్నే పంట మార్పిడి అంటారు. ఇందులో ప్రధానంగా పప్పు ధాన్యాలు ఉంటాయి.
 

మిశ్రమ పద్ధతి: ఒక సంవత్సర కాలంలో రెండు అంతకంటే ఎక్కువ రకాల పంటలు పండించే విధానం. ఇందులో ఎక్కువగా వేరుశనగ, కంది, జనుము, గోగు పంటలు పండిస్తారు.
 

సాగు రకాలు

విస్తాపన వ్యవసాయం: ఇది చిన్న కమతాల్లో ప్రత్యేకంగా గిరిజనులు పురాతన పనిముట్లతో అడవులను నరికివేస్తూ కాల్చివేత విధానం ద్వారా సాగు చేసే వ్యవసాయం. ఇది రుతుపవనాలు, పోషక పదార్థాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
 

విస్తృత వ్యవసాయం: ఈ రకమైన వ్యవసాయాన్ని తక్కువ జనాభా, ఎక్కువ భూభాగం ఉన్న ప్రాంతంలో చేస్తారు. యంత్రపరికరాలను వినియోగిస్తారు. ఎక్కువగా రష్యా, ఆస్ట్రేలియా, మధ్య భారత్‌లో ఉంది.


 

సాంద్ర వ్యవసాయం: అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ శ్రామికులను, జీవ రసాయనిక ఎరువులు, నీటిపారుదలను ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతి. ఇది ఉత్తర, దక్షిణ భారత్‌ల్లో అమల్లో ఉంది.
 

వాణిజ్య వ్యవసాయం: అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఇందులో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులు ఉపయోగిస్తారు. ఈ విధానం విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది.
 

మిశ్రమ వ్యవసాయం: ఇది మన దేశంలో పురాతన వ్యవసాయ పద్ధతి. ఈ రకమైన సాగులో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పంటలు, పశుగణాభివృద్ధి, మత్స్య సంపద, కలప లాంటి వాటిని సాగు చేస్తారు.
 

ఉదా: ఈ రకమైన సాగు విధానంలో పంటలతోపాటు కూరగాయలు, పండ్లు, బావుల్లో చేపల పెంపకం, పశువులు, గొర్రెలు, బీడు భూముల్లో కలప చెట్లను పెంచుతారు.

Posted Date : 09-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌