• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే నిర్ణీత ప్రణాళికల రూపకల్పన తప్పనిసరి. దేశంలో నెలకొన్న పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, అవసరాలు తదితర అంశాల ప్రాతిపదికన రూపొందించే ఈ ప్రణాళికలు ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయి.

* ప్రపంచంలోనే ప్రణాళికలను మొదటిసారి రూపొందించిన దేశం - యూఎస్ఎస్ఆర్ (లెనిన్ కాలంలో 1917 - 1920 మధ్యలో రూపొందించారు)
* 1929లో ప్రపంచంలో మొదటిసారిగా అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో ఆర్థికమాంద్యం సంభవించి, ప్రపంచ దేశాలకు విస్తరించింది. అయితే రష్యా (యూఎస్ఎస్ఆర్) మాత్రం ప్రణాళికల అమలు చేసి ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడంతో ప్రపంచ దేశాలన్నీ ప్రణాళికలపై మొగ్గు చూపాయి.
* భారతదేశం రష్యా నుంచి ప్రణాళికలను స్వీకరించి రాజ్యాంగేతర ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పింది.
* ఆర్థికమాంద్యం సంభవించని ఒకే ఒక దేశం రష్యా.

ప్రణాళికా నిర్వచనాలు:
* ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు.
''ప్రభుత్వం ఆలోచనాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా, సుదీర్ఘ ఆలోచనలతో కొన్ని ఆర్థిక ప్రాధాన్యాలను ఎంపిక చేసుకుని వాటిని సాధించడానికి రూపొందించినవే ప్రణాళికలు'' - బార్బానా వూటన్
''లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం సమర్థంగా, ఉద్దేశపూర్వకంగా, స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి, రూపొందించిన ప్రక్రియే ప్రణాళిక'' - ప్రణాళిక సంఘం

ప్రొఫెసర్ డికిన్‌సన్ నిర్వచనం:
* ఎంత వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయాలి? ఏ విధంగా ఉత్పత్తి చేయాలి? ఉత్పత్తి చేసిన వస్తువులను ఏవిధంగా కేటాయించాలి? .... లాంటి ముఖ్యాంశాలను ఆర్థిక వ్యవస్థ పరిశీలించాక నిర్దేశించే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో కేంద్ర అధికార సంస్థ ఉద్దేశపూర్వకంగా నిర్ణయించే విధానాన్నే ప్రణాళికగా చెప్పవచ్చు.

స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో ప్రణాళికా విధానం
* భారతదేశంలో ప్రణాళిక పితామహుడు - మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
* ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలను తెలుపుతూ ఇతడు 1934లో Planned Economy for India అనే గ్రంథం రాశారు.
* భారతదేశంలో ప్రణాళికలకు మార్గదర్శి - జవహర్‌లాల్ నెహ్రూ.
* మనదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు - సుభాష్ చంద్రబోస్.

బాంబే ప్రణాళిక (Bombay Plan) (1943 - 44)
* బొంబాయికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు A Plan of Economy Development for India అనే పేరుతో Bombay Plan ను రూపొందించారు.
* బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారీ లక్షణాలు ఉన్నాయి.
* బాంబే ప్లాన్‌ను 'టాటా బిర్లా - ప్లాన్', 'పారిశ్రామిక ప్రణాళిక' అని కూడా అంటారు. ఇది భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యాన్నిచ్చింది.
* ఈ ప్రణాళిక పెట్టుబడి రూ.10,000 కోట్లు. కాలవ్యవధి 15 సంవత్సరాలు. దీని లక్ష్యం - తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం.
* ఈ ప్రణాళిక ద్వారా జాతీయ ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు.

తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కావాల్సిన మార్గాలు:
1. వ్యవసాయ రంగాన్ని 130% పెంచాలి.
2. పారిశ్రామిక రంగాన్ని 500% పెంచాలి.
3. సేవా రంగాన్ని 200% పెంచాలి.

గాంధీ ప్రణాళిక: (1944)
* 1944లో గాంధీజీ సిద్ధాంతాలను (సామ్యవాద భావాలు) దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణ అగర్వాల్ రూ.3,500 కోట్ల వ్యయంతో 'గాంధీ ప్రణాళిక' ను రూపొందించారు.
* ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్తకళలకు ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రజా ప్రణాళిక: (1945) (పీపుల్స్ ప్లాన్)
* 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్‌కు చెందిన ఎం.ఎన్.రాయ్ ఈ ప్రణాళికను రూపొందించారు.
* 10 సంవత్సరాల కాలానికి రూ.15,000 కోట్ల వ్యయంతో వ్యవసాయ, వినియోగ వస్తువుల పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది.
* పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలను జాతీయీకరణం చేయాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఎం.ఎన్. రాయ్ పేర్కొన్నారు.

పేపర్ ప్లాన్:
* స్వాతంత్య్రానికి ముందు రూపొందించిన ప్రణాళికలను పేపర్ ప్లాన్ (Paper Plan) అంటారు. వీటిని ప్రభుత్వం అమలు పరచలేదు.
* 1938లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ (National Planning Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1948లో తన నివేదికను ఇచ్చింది.
* 1944లో బ్రిటిష్ ప్రభుత్వం దలాల్ అధ్వర్యంలో స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేసింది.

స్వాతంత్య్రం తర్వాత:
ప్రణాళిక సంఘం:

* 1950, ఫిబ్రవరి 15న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్.కె. షణ్ముగం షెట్టి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
* 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ప్రణాళిక సంఘం కార్యాలయం పేరు - యోజన భవన్
* ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ, చట్టబద్ధమైంది కూడా కాదు. కేవలం సలహా సంఘం (Advisory Board) మాత్రమే.
* నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళిక సంఘం ఏర్పడింది.
అధ్యక్షుడు: ప్రధానమంత్రి
కార్యనిర్వహణాధికారి: ప్రధానమంత్రి
* ప్రణాళిక సంఘంలో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. వారు:
    1. ప్రధానమంత్రి
    2. ఆర్థికమంత్రి
    3. ప్రణాళిక మంత్రి
* హోదా వల్ల ఛైర్మన్‌గా ఉంటే ఎక్స్ - అఫీషియో అని పిలుస్తారు.

వాస్తవ కార్యనిర్వహణాధికారి: ఉపాధ్యక్షుడు
* ప్రణాళికా సంఘానికి అధికారరీత్యా/ పదవి రీత్యా అధ్యక్షులు - ప్రధానమంత్రి
* సాధారణంగా ప్రధానమంత్రి ప్రణాళిక శాఖను ఎవరికీ కేటాయించరు కానీ సహాయ మంత్రిని నియమిస్తారు.
* ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక కేబినేట్ అంటారు. దీని ప్రధాన విధి - ప్రణాళికలను తయారు చేయడం.
* మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు - జవహర్‌లాల్ నెహ్రూ
* ఉపాధ్యక్షుడు - గుల్జారీలాల్ నందా
* ప్రణాళికా సంఘానికి చివరి అధ్యక్షుడు - నరేంద్ర మోదీ.
* ప్రణాళికా సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు - మాంటెక్ సింగ్ అహ్లువాలియా (మొదటిసారిగా వరుసగా రెండుసార్లు నియమితులై, అధిక కాలం డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగారు.)
* ప్రణాళిక సంఘానికి 14వ ఉపాధ్యక్షుడు - మన్మోహన్ సింగ్
* ప్రణాళిక సంఘానికి 23వ ఉపాధ్యక్షుడు - కె.సి. పంత్

జాతీయాభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ.
* దీనికి కూడా ప్రధానమంత్రే ఎక్స్ - అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* కేంద్ర కార్యనిర్వాహక వర్గం (Cabinet) సిఫారసు మేరకు ఏర్పాటు దీన్ని చేశారు.
* దీని ముఖ్య విధి ప్రణాళికల పరిశీలన, ప్రణాళికలు ఆమోదించడం.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారం పెంపొందిస్తుంది.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు.
* 1967లో చేసిన పాలనా సంస్కరణల సంఘం సిఫారసు మేరకు కేంద్రపాలిత ప్రాంతాల (Union Territories) లెఫ్టినెంట్ గవర్నర్‌లు, కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా దీనిలో సభ్యులే.
* ప్రణాళికా సంఘం కంటే ఎన్‌డీసీకి ఎక్కువ అధికారాలున్నాయి.
* ఎన్‌డీసీని సూపర్ కేబినెట్‌గా కె. సంతానం వర్ణించారు.
* ఎన్‌డీసీకి ప్రణాళికా ముసాయిదాను మార్పులు చేసే అధికారం ఉంటుంది.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే నిర్ణీత ప్రణాళికల రూపకల్పన తప్పనిసరి. దేశంలో నెలకొన్న పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, అవసరాలు తదితర అంశాల ప్రాతిపదికన రూపొందించే ఈ ప్రణాళికలు ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి సమర్థ ప్రణాళికలను రూపొందిస్తోంది.  మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా భారతదేశంలో ప్రణాళిక ప్రగతి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టడంతో ప్రారంభమైంది. ఇంతవరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమలవుతోంది. భారతదేశంలో ప్రణాళికల రూపకల్పన, లక్ష్యాలు.. తదితర అంశాలను తెలుసుకునే ముందు.. వివిధ రకాల ప్రణాళికల గురించిన అవగాహన అవసరం. అవి..

1. భౌతిక, విత్త ప్రణాళికలు
ఆర్థిక ప్రణాళికలు భౌతిక లేదా విత్త ప్రణాళికలుగా ఉండవచ్చు. ప్రణాళిక ముసాయిదాలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వాస్తవిక భౌతిక వనరులైన ముడి పదార్థాలు, మానవ శక్తి లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే ప్రణాళిక భౌతిక ప్రణాళిక. ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ద్రవ్య వనరులు ఎంత కావాలో అంచనా వేసి కేటాయించడం విత్త ప్రణాళిక. అయితే ప్రణాళిక వ్యవస్థలో ఈ రెండూ పరస్పరం పూరకాలుగా ఉంటాయి.

2. కాలవ్యవధి ప్రణాళికలు
ప్రణాళికలకు నిర్దేశించిన కాలవ్యవధిని బట్టి ప్రణాళికలు మూడు రకాలు. అవి..
* ఒక సంవత్సర కాలవ్యవధిలో రూపొందించే ప్రణాళికలు స్వల్పకాలిక ప్రణాళికలు.
* 3-5 సంవత్సరాల వ్యవధిలో రూపొందించే ప్రణాళికలు మధ్యకాలిక ప్రణాళికలు. భారత పంచవర్ష ప్రణాళికలను మధ్యకాలిక ప్రణాళికలుగా చెప్పవచ్చు.
* 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ప్రణాళికలు దీర్ఘకాలిక ప్రణాళికలు. భారత ప్రణాళికల్లో 3వ, 7వ ప్రణాళికలు దీర్ఘదర్శి దృష్టితో రూపొందించినవి.

3. నిర్దేశాత్మక ప్రణాళికలు
ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు, నిర్మాణం, వనరుల వినియోగం అన్నీ ప్రభుత్వ దిశానిర్దేశాలకు లోబడి అమలవుతుంటే దాన్ని నిర్దేశాత్మక ప్రణాళిక లేదా ఆదేశాత్మక ప్రణాళిక అంటారు. ఇలాంటి ప్రణాళిక విధానం సాధారణంగా రష్యా లాంటి సోషలిస్టు దేశాల్లో కనిపిస్తుంది.

4. ప్రజాస్వామ్య ప్రణాళికలు
ప్రజాస్వామ్య ప్రణాళికలో ప్రభుత్వం ఉత్పత్తి సాధానాలన్నింటినీ నియంత్రించదు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అధిక శాతం ప్రజలకు మేలుచేసే విధంగా ప్రణాళిక లక్ష్యాలు నిర్దేశించి ఉంటాయి.

5. సూచనాత్మక ప్రణాళికలు
ఈ రకమైన ప్రణాళికా విధానంలో ప్రభుత్వం స్థూల అంశాలను నిర్ణయించి వాటిని సాధించడానికి ప్రైవేటు రంగానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు. అంటే ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని నిర్దేశించకుండా సూచనలు మాత్రమే చేస్తుంది. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు సరిపోతుంది.
* దీన్ని తొలిసారిగా 1947-50 కాలంలో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* 8వ ప్రణాళిక కాలం నుంచి భారతదేశం కేంద్రీకృత ప్రణాళికల స్థానంలో సూచనాత్మక ప్రణాళికా (మార్కెట్ ప్రణాళిక) విధానాన్ని అవలంబిస్తోంది.

6. కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలు
కేంద్రీకృత ప్రణాళిక సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అమలు చేసే ప్రణాళిక. ఈ పద్ధతిలో ఒక కేంద్ర అధికార సంస్థ ప్రణాళిక రచన, అమలును చేపడుతుంది.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో వికేంద్రీకృత ప్రణాళిక అమల్లో ఉంటుంది. ఈ రకమైన విధానంలో ప్రధాన నిర్ణయాలు ప్రణాళిక వ్యవస్థ తీసుకుని వివిధ యూనిట్లకు అమలు చేయడంలో స్వేచ్ఛను కల్పిస్తుంది. 6వ ప్రణాళిక కాలం నుంచి మన దేశంలో వికేంద్రీకృత ప్రణాళికల అమలుకు ప్రయత్నం జరుగుతోంది.

7. నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్)
దీనికి ఒక నిర్ణీత కాలవ్యవధి ఉండదు. లక్ష్యాన్ని చేరుకునే వరకూ అమలవుతూనే ఉంటుంది. ఈ రకమైన ప్రణాళికలో గతించిన సంవత్సరాన్ని వదిలేసి నూతన సంవత్సరాన్ని కలుపుతూ ఉంటారు. నిరంతర ప్రణాళిక అనే భావనను రూపొందించింది గున్నార్ మిర్దాల్. భారతదేశంలో జనతా ప్రభుత్వం 1978-80 మధ్య కాలంలో నిరంతర ప్రణాళికను అమలు పరిచింది.

8. వార్షిక ప్రణాళికలు
ఒక సంవత్సర కాలవ్యవధిలో స్వల్పకాలిక లక్ష్యాలతో రూపొందించిన ప్రణాళిక వార్షిక ప్రణాళిక. మన దేశంలో 1966-69, 1990-92 కాలాన్ని వార్షిక ప్రణాళికల కాలంగా చెప్పవచ్చు.

9. ప్రాంతీయ ప్రణాళికలు
వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధి కోసం అమలు పరిచే వికేంద్రీకృత ప్రణాళికను ప్రాంతీయ ప్రణాళిక అంటారు. ఇది జాతీయ ప్రణాళికలో అంతర్భాగంగా అమలవుతుంది.
* మన దేశంలో 1970లో తెలంగాణ, రాయలసీమల్లోని వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించారు.

ద్రవ్య వనరులు
ఒక ప్రణాళిక విజయవంతం కావాలంటే ఆ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు, ప్రణాళిక అమలు పరచడానికి కావలసిన ద్రవ్య వనరుల లభ్యతకు మధ్య అధికస్థాయి సంబంధం ఉంటుంది. ప్రభుత్వానికి అందుబాటులో ఉండే ప్రణాళికా వనరులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. దేశీయ బడ్జెట్ వనరులు
2. విదేశీ సహాయం
3. లోటు ద్రవ్య విధానం

దేశీయ బడ్జెట్ వనరులు
ప్రభుత్వం దేశంలో సమీకరించిన నిధులు దేశీయ బడ్జెట్ వనరులు. వీటిలో కింది అంశాలుంటాయి.
* కరెంట్ రెవెన్యూలో మిగిలిన బ్యాలెన్స్
* ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆర్జించే లాభాలు
* దేశ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించే వివిధ రకాల రుణాలు
* అదనపు పన్నులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే అదనపు ఆదాయం
* దేశీయ బడ్జెట్ వనరుల ద్వారా ప్రభుత్వం ప్రణాళికలకు అవసరమయ్యే ద్రవ్యాన్ని ఎంత ఎక్కువ పొందగలిగితే అంత మంచిది. ప్రస్తుతం భారత పంచవర్ష ప్రణాళికలకు అవసరమయ్యే వనరులను అధిక శాతం దేశీయ బడ్జెట్ వనరుల ద్వారానే సమకూరుస్తున్నారు.

విదేశీ సహాయం
ప్రణాళికా వనరులను సమకూర్చుకోవడానికి రెండో మార్గం విదేశీ సహాయం. ఇందులో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఐడీఏ తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకునే రుణాలు.. విదేశాల నుంచి లభించే రుణాలు, గ్రాంట్లు ఉంటాయి. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడితే కొత్తగా తీసుకునే రుణాలు, పాత రుణాలపై వడ్డీ చెల్లించడానికే సరిపోయి దేశం విదేశీ రుణాల ఊబిలో కూరుకుపోతుంది. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లవచ్చు.

లోటు ద్రవ్య విధానం
పైన చెప్పిన రెండు మార్గాలైన దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయం ద్వారా ప్రణాళిక వ్యయానికి సరిపడిన మొత్తాన్ని సమకూర్చుకోలేనప్పుడు ఆ తేడాను లోటు ద్రవ్య విధానం ద్వారా పూరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆదనపు వ్యయానికి అవసరమైన ద్రవ్యాన్ని రిజర్వు బ్యాంకు సమకూరుస్తుంది. అయితే ఈ విధానం అనుసరించడం వల్ల సాధారణంగా ద్రవ్య సప్లయి పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవచ్చు.


భారత పంచవర్ష ప్రణాళికలు (తొలి 5 ప్రణాళికల వివరాలు)


 

మొదటి పంచవర్ష ప్రణాళిక
మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం - 1951, ఏప్రిల్ 1 నుంచి 1956, మార్చి 31 వరకు. దీని తుది ముసాయిదాను 1952 డిసెంబరులో పార్లమెంటుకు సమర్పించారు. అంటే ప్రణాళిక ఆరంభమైన 20 నెలలకు ప్రణాళిక ముసాయిదాను ఆమోదించారు. ఈ ప్రణాళిక హెరడ్-డోమర్ నమూనా ఆధారంగా రూపొందించారు.

లక్ష్యాలు: రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం.. జాతీయ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం.. ఆహార పదార్థాల కొరతను తీర్చడం.. ఉద్యోగిత స్థాయిని పెంచడం.. ఆర్థిక అసమానతలను తగ్గించడం..
* ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.2,069 కోట్లు ఖర్చు చేయాలని మొదట నిర్ణయించారు. చివరికి రూ.1,960 కోట్లు మాత్రమే ఖర్చయింది.
* మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం ప్రణాళిక వ్యయంలో వ్యవసాయం, నీటి పారుదలపై చేసిన వ్యయం 31 శాతం. అందుకే దీన్ని 'వ్యవసాయ ప్రణాళిక' అంటారు.

ప్రగతి: మొదటి ప్రణాళిక లక్ష్యాలను అధిగమించి వృద్ధిని సాధించింది. వార్షిక వృద్ధిరేటు లక్ష్యాన్ని స్థూల దేశీయోత్పత్తిలో 2.1 శాతంగా నిర్ణయిస్తే వాస్తవంగా సాధించిన వృద్ధిరేటు 3.6 శాతం కావడం విశేషం. అలాగే తలసరి ఆదాయ వృద్ధిరేటు 1.8 శాతంగా ఉంది. ఈ కాలంలో ధరలు 13 శాతం తగ్గాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో 50 మిలియన్ టన్నులుండగా 1955-56 నాటికి 65 మిలియన్ టన్నులకు పెరిగింది. దామోదర్, హీరాకుడ్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం ఈ కాలంలోనే చేపట్టారు.

రెండో పంచవర్ష ప్రణాళిక
మొదటి ప్రణాళిక విజయవంతం కావడంతో ఆశాజనక పరిస్థితుల్లో ప్రారంభమైన రెండో పంచవర్ష ప్రణాళిక కాలం - 1956, ఏప్రిల్ 1 నుంచి 1961, మార్చి 31 వరకు. ఆచార్య పి.సి.మహలనోబిస్ నాలుగు రంగాల నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను రూపొం దించారు. ఈ ప్రణాళిక సత్వ ర పారిశ్రామికాభివృద్దితోపాటు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది.

లక్ష్యాలు: ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి జాతీయ ఆదాయాన్ని వార్షికంగా 4.5 శాతం చొప్పున పెంచడం.. మౌలిక, భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం.. ఉపాధి అవకాశాలను పెంచడం.. ఆదాయ, సంపదల్లో ఉన్న అసమానతలు తగ్గించడం.. ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం..
* ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినా చివరికి రూ.4,600 కోట్లు ఖర్చయింది. మొత్తం ప్రణాళికా వ్యయంలో అత్యధికంగా 28 శాతం రవాణా, కమ్యూనికేషన్లపై ఖర్చు చేశారు. అందుకే దీనిని 'పరిశ్రమలు, రవాణా ప్రణాళిక'గా పిలుస్తారు. ఈ ప్రణాళికలో దీర్ఘ ఫలన కాలం ఉన్న భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల దీన్ని 'ధైర్యంతో కూడిన ప్రణాళిక' (Bold Plan) అని కూడా అంటారు.

ప్రగతి: ఈ ప్రణాళిక కాలంలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 4.5 శాతం కాగా, సాధించింది 4.3 శాతం. తలసరి ఆదాయ వృద్ధిరేటు సంవత్సరానికి 1.9 శాతంగా ఉంది. ఒక్కొక్కొటి 10 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న 3 ఇనుము, ఉక్కు కర్మాగారాలు రూర్కెలా, దుర్గాపూర్, భిలాయ్‌లలో నెలకొల్పారు. ఈ ప్రణాళికా కాలంలో 10 మిలియన్ల, ఉద్యోగావకాశాలను కల్పించడం విశేషం.
* ఈ ప్రణాళిక కాలం మధ్య (1957-58, 1959-60)లో రెండు సంవత్సరాలు అనావృష్టి పరిస్థితులు ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది. ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి రావడంతో విదేశీ చెల్లింపుల లోటు ఏర్పడింది. వస్తువుల కొరత వల్ల ధరలు ఈ కాలంలో 30 శాతం పెరిగాయి.

మూడో పంచవర్ష ప్రణాళిక

ఈ ప్రణాళిక కాలం - 1961, ఏప్రిల్ 1 నుంచి 1966, మార్చి 31 వరకు.. ఈ ప్రణాళికను 15 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రూపొందించారు. అశోక్ మెహతా నమూనా దీనికి ఆధారం. వ్యవసాయ, పరిశ్రమల అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దీన్ని సంతులిత ప్రణాళికగా రూపొందించారు.

లక్ష్యాలు: స్వయంసమృద్ధితో కూడిన వృద్ధిని సాధించడాన్ని మూడో ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
* ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా చివరకు రూ.8,580 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం ప్రణాళిక వ్యయంలో అత్యధికంగా రవాణా, సమాచార రంగంపైనే 25 శాతం ఖర్చు చేశారు.

ఫలితాలు: 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, సకాలంలో అందని విదేశీ సహాయం, ప్రణాళిక చివరి సంవత్సరంలో దేశంలో నెలకొన్న తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఈ ప్రణాళికను దెబ్బతీశాయి.
స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతంగా నిర్ణయించినప్పటికీ వాస్తవంగా సాధించింది 2.84 శాతం మాత్రమే. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 0.2 శాతమే. ధరలు 36.4 శాతం పెరిగాయి.

మూడు వార్షిక ప్రణాళికలు (1966-69)
1965లో పాకిస్థాన్‌తో యుద్ధం.. రెండు సంవత్సరాల వరుస కరవులు, ధరల పెరుగుదల.. తదితర కారణాల వల్ల నాలుగో పంచవర్ష ప్రణాళికను కొంత కాలం వాయిదా వేశారు. 1966-67, 1967-68, 1968-69 సంవత్సరాలకు సంబంధించి మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. సాధారణ ప్రణాళికలు అమలు కాకపోవడం వల్ల కొందరు ఆర్థికవేత్తలు ఈ కాలాన్ని 'ప్రణాళిక విరామం' లేదా 'ప్రణాళిక సెలవు'గా పిలిచారు.
* మూడు వార్షిక ప్రణాళికల్లో ఆర్థికాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలపై ప్రభుత్వ రంగంలో రూ.6,625 కోట్లు ఖర్చు చేశారు.
* ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అసమతౌల్య పరిస్థితులను సరిచేసి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడమే ఈ ప్రణాళికల లక్ష్యం.

నాలుగో పంచవర్ష ప్రణాళిక
నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలం - 1969 నుంచి 1974 వరకు.. ఈ ప్రణాళికా ముసాయిదాను రూపొందించింది డి.ఆర్.గాడ్గిల్. ఈ ప్రణాళిక కాలంలోనే ఇందిరాగాంధీ 'గరీభీ హఠావో' నినాదం ఇచ్చారు.

లక్ష్యాలు: స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వావలంబన దిశగా పురోగతి సాధించడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. ఆర్థిక అనిశ్చితిని తొలగించడం.. ఆహార ధాన్యాల దిగుమతిని తగ్గించడం.. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.. ఇతర లక్ష్యాలు.
* ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో రూ.15,900 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

ఫలితాలు: 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్య, ప్రణాళిక చివరి మూడు సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, విద్యుత్తు కొరత, పారిశ్రామిక అశాంతి తదితర కారణాల వల్ల ఈ ప్రణాళికలో జాతీయ ఆదాయంలో 3.3 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. (నిర్దేశించిన వృద్ధిరేటు 5.7 శాతం). ధరల పెరుగుదల ఈ కాలంలో 61 శాతానికి చేరింది. ఈ ప్రణాళిక కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం (1969 జులై) చేశారు.

అయిదో పంచవర్ష ప్రణాళిక
ఈ ప్రణాళిక కాలం - 1974 నుంచి 1979/78 వరకు.. అయిదో ప్రణాళికను తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య రూపొం దించారు. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఈ ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగానే నిలిపివేసి (1978) నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళిక ముసాయిదాను రూపొందించినది డి.పి.ధర్.

లక్ష్యాలు: పేదరికానికి దిగువన ఉన్న ప్రజల వినియోగస్థాయిని పెంచడం.. స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన అనేవి ప్రధాన లక్ష్యాలు. జాతీయాదాయంలో సాలుసరి 4.4 శాతం వృద్ధిరేటు సాధిచడం.. ప్రజల కనీస అవసరాలు మెరుగుపరచడం..ఉద్యోగావకాశాలు పెంచడం.. ప్రభుత్వ పంపిణీ విధానాన్ని అభివృద్ధి పరచడం.. ఎగుమతులను పెంచడం లాంటివి ఈ ప్రణాళిక ఇతర లక్ష్యాలు.
* పై లక్ష్యాల సాధనకు ఈ ప్రణాళికలో రూ.39,430 కోట్లు ఖర్చు చేశారు. ప్రణాళికా మొత్తం వ్యయంలో 26 శాతం పరిశ్రమలపైనా, 22 శాతం వ్యవసాయం, నీటిపారుదలపైనా, 19 శాతం ఇంధనం కోసం ఖర్చు చేశారు.

ప్రగతి: 5వ ప్రణాళిక కాలంలో సాలుసరి 4.4 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 4.8 శాతం సాధించడం విశేషం. ఇదే కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 2.7 శాతంగా ఉంది. ఈ ప్రణాళికలో జాతీయ కనీస అవసరాల కార్యక్రమం (1974-75), 20 సూత్రాల కార్యక్రమం (1975), పనికి ఆహార పథకం (1977-78) లాంటి పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రయత్నాలు జరిగాయి. మొత్తం మీద ఈ ప్రణాళికలో సాధించిన కొన్ని లక్ష్యాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పేదరికం, నిరుద్యోగ నిర్మూలన విషయాల్లో ఈ ప్రణాళిక విజయవంతం కాలేదని చెప్పవచ్చు.

భారత ప్రణాళికలు - లక్ష్యాలు
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణలోని స్ఫూర్తికి అనుగుణంగా ప్రణాళిక సంఘం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కింది దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక లక్ష్యాలను ఏర్పరిచింది. అవి..
1. జాతీయ, తలసరి ఆదాయాలను పెంచడం ద్వారా జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం
2. పారిశ్రామికీకరణ వేగవంతం చేయడం
3. ముడి సరుకులు, ఆహార పదార్థాలు, పారిశ్రామిక ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధిని సాధించడం
4. పేదరిక నిర్మూలన
5. ఉపాధి అవకాశాలను పెంపొందించడం
6. ఆదాయ, సంపదల్లో అసమానతలను తగ్గించడం ద్వారా ఆర్థికశక్తి కేంద్రీకరణను తగ్గించడం
7. ప్రాంతీయ అసమానతలను తొలగించడం
8. సమానత్వం, సాంఘిక న్యాయాన్ని సాధించడం
9. ఆధునికీకరణ సాధించడం
10. సమ్మిళిత, సుస్థిర వృద్ధిని సాధించడం
భారత పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం సామాజిక న్యాయంతో కూడిన శీఘ్రవృద్ధిని సాధించడం

ప్రణాళికా రచన - స్వభావం
* భారతదేశ ప్రణాళికా రచన సమగ్రమైంది. అంటే ఆర్థిక వ్యవస్థ అంతటికీ ప్రణాళికలు రూపొందించడం.
* భారత ప్రణాళికలు ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు. అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రానిదే.
* భారత పంచవర్ష ప్రణాళికలు భౌతిక, విత్త స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
ప్రణాళికల్లో కొన్ని దీర్ఘకాలిక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
* భారత ప్రణాళికా రచన ఆదేశిక సూత్రాల్లోని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
* 8వ ప్రణాళిక నుంచి సూచనాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
* సంస్కరణలకు ముందు ప్రభుత్వరంగం పాత్ర అధికంగా ఉండేది. సంస్కరణల తర్వాత ప్రైవేటు రంగం ప్రాధాన్యం పెరిగింది.


 

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌