వాతావరణం
ఒక ప్రాంతంలో నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు. ఇది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.
శీతోష్ణస్థితి
ఒక విశాల ప్రాంతంలో దీర్ఘకాలం పాటు ఒక క్రమాన్ని చూపే వాతావరణ స్థితులను శీతోష్ణస్థితి అంటారు.
* సాధారణంగా ఒక ప్రాంత 30 ఏళ్ల వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, దాని శీతోష్ణస్థితిని కనుక్కుంటారు.
* భారతదేశ శీతోష్ణస్థితిని ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొంటారు.
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు
1. అక్షాంశం 2. ఉనికి
3. భౌగోళిక స్వరూపం
4. భూమికి - నీటికి ఉన్న సంబంధం
5. ఉపరితల గాలి ప్రసరణ
అక్షాంశం:
* కర్కటరేఖ భారతదేశం మధ్యగా వెళ్తోంది.
* కర్కటరేఖ దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉన్నాయి.
* భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ఉష్ణ ప్రాంతాలు
- భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేవి.
ధ్రువ ప్రాంతాలు
- ధ్రువాలకు దగ్గరగా ఉండేవి.
సమశీతోష్ణ ప్రాంతాలు
- ఉష్ణ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలకు మధ్య ఉన్న ప్రాంతం.
* భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలోని సూర్యపుటంపై ఆధారపడి ఉంటుంది.
భూమికి - నీటికి ఉన్న సంబంధం:
భూభాగంతో పోలిస్తే సముద్రాలు నిదానంగా వేడెక్కి, నెమ్మదిగా చల్లారతాయి.
సమశీతోష్ణస్థితి:
వేసవి, శీతాకాల సమయాల్లో పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడా కనిపించని స్థితిని ‘సమశీతోష్ణస్థితి’ అంటారు.
* సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో దీన్ని గమనించొచ్చు.
ఎత్తు:
సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు 6.4°C లేదా ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 1°C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది.
* మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాలపై ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఉపరితల గాలి ప్రసరణ: వీటినే ‘జెట్ ప్రవాహాలు’ అని కూడా అంటారు.
* నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో ప్రవహించే గాలులను జెట్ ప్రవాహాలు అంటారు.
* వీటి వేగం గంటకి వేసవిలో 110 కి.మీ., శీతాకాలంలో గంటకు 184 కి.మీ. ఉంటుంది.
* తూర్పు జెట్ ప్రవాహం 25° ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడుతుంది.
ట్రేడ్ విండ్స్ (వ్యాపార పవనాలు):
* ఇవి శాశ్వత పవనాలు.
* ఉత్తరార్ధ గోళంలో ఉపఆయన రేఖ వద్ద ఏర్పడే అధిక పీడనం వల్ల ఈ పవనాలు ఏర్పడతాయి.
* జర్మనీ భాషలో ట్రేడ్ అంటే ‘ట్రాక్’ అని అర్థం.
* ‘ట్రాక్’ అంటే ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు.
* భారతదేశం శుష్క ఈశాన్య రుతుపవనాల రేఖల్లో ఉంది.
భారతదేశం - కాలాలు
మనదేశ భూభాగ శీతోష్ణస్థితి వైవిధ్యం ఆధారంగా భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఏడాదిని నాలుగు శీతోష్ణస్థితులుగా విభజించింది. అవి:
1. శీతాకాలం (డిసెంబరు - ఫిబ్రవరి)
2. వేసవి కాలం (మార్చి - మే)
3. నైరుతి రుతుపవన కాలం (జూన్ - సెప్టెంబరు)
4. ఈశాన్య రుతుపవన కాలం (అక్టోబరు - నవంబరు)
శీతాకాలం
* నిర్మల ఆకాశం, గాలిలో తక్కువ తేమ, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
* భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల జనవరి.
* ఉత్తర భారత భూభాగం నుంచి దక్షిణంగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.
శీతాకాలంలో వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు:
* హిమాలయాలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలు:10°C
* కర్కట రేఖ వెళ్లే రాష్ట్రాలు: 20°C
* కోస్తా ప్రాంతాలు: : 25°C
* నీలగిరి కొండలు: 20°C
పశ్చిమ విక్షోభాలు: మధ్యదరా సముద్రం నుంచి భారతదేశం వైపు వచ్చే వాయుగుండాలు.
* పశ్చిమ విక్షోభాల కారణంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో 10 -12 సెం.మీ. వర్షం కురుస్తుంది.
* శీతాకాలంలో కురిసే ఈ వర్షం రబీ కాలంలో పండే గోధుమ, బార్లీ పంటలకు చాలా అనుకూలం.
* రబీ పంట కాలాన్ని శీతాకాల పంట కాలం అని, గోధుమను శీతాకాల పంట అని అంటారు.
* దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం కార్గిల్ సమీపంలోని డ్రాస్(−40°C)
* ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత విశాఖ జిల్లాలోని లంబసింగి వద్ద నమోదవుతుంది.
వేసవికాలం
* ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు కర్కటరేఖ వైపు ప్రయాణిస్తాడు. దీంతో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత భూభాగం వైపు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.
* భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల మే.
* ఈ కాలంలో ఉత్తర భారతదేశ మైదానాల్లో గరిష్ఠంగా 37°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* వేసవిలో నమోదయ్యే కనిష్ఠ ఉష్ణోగ్రత: 20°C..
* వేసవిలో వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు 41°C ఉంటే, మధ్య భారతదేశంలో 42°C నమోదవుతాయి.
* ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో వీచే వేడి స్థానిక పవనాలను ‘లూ’ (Loo) అంటారు.
* మే నెలలో సగటు పగటి ఉష్ణోగ్రత దిల్లీలో 42°C ఉంటే, చెన్నైలో 38.5°C గా నమోదవుతుంది.
తొలకరి జల్లులు:
* వేసవి కాలం ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో కురిసే చిరుజల్లులను తొలకరి జల్లులు అంటారు.
* భారత ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఇవి ఉపయోగపడతాయి.
తొలకరి జల్లులు - స్థానిక పేర్లు:
ఆంధ్రప్రదేశ్, కేరళ - మామిడి జల్లులు
తెలంగాణ - తొలకరి జల్లులు
కర్ణాటక - చెర్రీ బ్లాసమ్
పశ్చిమ్ బంగా - కాల్బైసాఖి
అసోం - బోర్దామచిల్లా
ఉత్తర్ ప్రదేశ్ - అంధీలు
రుతుపవనాలు
* రుతుపవనాన్ని ఆంగ్లంలో ‘మాన్సూన్’ అంటారు.
* మాన్సూన్ పదం ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది.
* మౌసమ్ అంటే రుతువు అని అర్థం.
* రుతుపవనాలు కాలాన్ని బట్టి వీచే గాలులు.
* వర్షాన్ని ఇచ్చే మేఘాలను రవాణా చేసే పవనాలే రుతుపవనాలు.
నైరుతి రుతుపవన కాలం
* ఉష్ణ ప్రాంతంలో సుమారు 20° ఉత్తర -20° దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి.
* జూన్ 21న సూర్యుడు కర్కటరేఖపై ఉంటాడు. దీంతో గంగా-సింధు మైదాన ప్రాంతంలో అంతర ఆయనరేఖ అభిసరణ మండలం (ITCZ) ఏర్పడుతుంది.
* ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొరియాలిస్ ప్రభావం వల్ల భారత భూభాగంలోకి వస్తాయి. ఇవి నైరుతి దిశ నుంచి ప్రవేశిస్తాయి. అందుకే వీటిని నైరుతి రుతుపవనాలు అంటారు.
* ఈ పవనాలు కన్యాకుమారి ప్రాంతం వద్దకు రాగానే రెండు శాఖలుగా విడిపోతాయి. అవి:
1. అరేబియా సముద్ర శాఖ
2. బంగాళాఖాతం శాఖ
* అరేబియా శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది.
అరేబియా శాఖ ప్రయాణం:
జూన్ 1 - కేరళ తీరం, ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లా.
జూన్ 5 - కర్ణాటక, ఏపీలోని కృష్ణా, గోదావరి డెల్టా.
జూన్ 10 - ముంబయి, ఒడిశా, చోటానాగ్పుర్ పీఠభూమి, బిహార్.
జూన్ 15 - గుజరాత్, మాల్వా పీఠభూమి, గంగా మైదానం.
జూలై 1 - దిల్లీ, పంజాబ్.
జూల్ 15 - థార్ ఎడారి.
జూలై 15 నాటికి ఆరేబియా నైరుతి రుతుపవన శాఖ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది.
బంగాళాఖాత నైరుతి శాఖ:
ఈ శాఖ మే 20 నాటికి అండమాన్ నికోబార్ దీవులను చేరుతుంది.
* దేశంలో సంభవించే మొత్తం వర్షపాతంలో 80% నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తుంది.
* తమిళనాడు, లద్దాఖ్ మినహా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షం కురుస్తుంది.
ఈశాన్య రుతుపవన కాలం
* అక్టోబరు నెలలో సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు కదులుతాడు. దీంతో హిందూ మహాసముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది.
* సెప్టెంబరు మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాలు దేశ భూభాగం నుంచి క్రమంగా వెనక్కి మళ్లుతాయి. ఇవే ఈశాన్య రుతుపవనాలుగా మారతాయి.
* ఈశాన్య రుతుపవనాలను తిరోగమన రుతుపవనాలు అని కూడా అంటారు.
* ఈ కాలంలో ఎక్కువగా తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
* ఈశాన్య రుతుపనవాల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అధిక వర్షాలు కురుస్తాయి.
దేశంలో వర్షపాత విస్తరణ
* మనదేశ వార్షిక సగటు వర్షపాతం 125 సెం.మీ.
* మేఘాలయలోని మాసిన్రామ్ ప్రాంతంలో దేశంలో అత్యధిక, ప్రపంచంలో రెండో అధిక వర్షపాతం నమోదైంది (1141 సెం.మీ.).
* దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతం చిరపుంజి (1087 సెం.మీ.).
* దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం జైసల్మీర్ (12 సెం.మీ.).
అక్టోబర్ హీట్
తిరోగమన రుతుపవన కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీని కారణంగా బెంగాల్ మైదాన ప్రాంతంలోని వాతావరణంలో ఆర్థ్రత పరిమాణం ఎక్కువై, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ స్థితిని ‘అక్టోబర్ వేడిమి’ అంటారు.