యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
*¤ 1793లో లార్డ్ కారన్ వాలీస్ మన దేశంలో పబ్లిక్ సర్వీసులను పునర్ వ్యవస్థీకరించారు.
*¤ 1853లో సర్వీసు నియామకాల్లో నామినేషన్ విధానాన్ని తొలగించి, మెరిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
¤* లార్డ్ మెకాలే నివేదిక ఆధారంగా మొదటిసారిగా భారతదేశంలో అఖిల భారత సర్వీసుల్లో భాగంగా ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) ను ప్రవేశపెట్టారు.
¤* ఉద్యోగస్వామ్యానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లను బ్రిటన్ నుంచి గ్రహించారు.
¤* పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగుల ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం చైనా.
¤* 1772లో వారన్ హేస్టింగ్స్ భారత్లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
¤* మన దేశంలో మేధోసంపత్తికి సంరక్షకులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను పేర్కొంటారు.
¤* 1919 నాటికి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫార్సుల మేరకు 1923లో ఏర్పడిన లీ కమిషన్ తన సిఫార్సులను 1924లో సమర్పించింది. అప్పటికే మన దేశంలో ఉన్న 9 అఖిల భారత సర్వీసుల్లో నాలుగింటిని వెంటనే రద్దు చేయాలని పేర్కొంది. లీ కమిషన్ సిఫార్సుల మేరకు 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు.
¤* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ¤ ఈ చట్టం ద్వారానే ఐసీఎస్, ఐపీఎస్, ఐఎంఎస్ లాంటి అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
¤ స్వాతంత్య్రానంతరం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పాటు చేశారు.
*¤ యూపీఎస్సీ తొలి ఛైర్మన్ హెచ్.కె. కృపలానీ.
*¤ మన దేశంలో అఖిల భారత సర్వీసుల పితామహుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పేర్కొంటారు.
*¤ 1947లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లు; 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అఖిల భారత సర్వీసులుగా ఏర్పడ్డాయి. ఐఏఎస్లను ఉద్యోగ బృంద మంత్రిత్వ శాఖ, ఐపీఎస్లను హోం మంత్రిత్వ శాఖ, ఐఎఫ్ఎస్లను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. ¤ 1947, ఏప్రిల్ 21న న్యూదిల్లీలోని మెట్కాఫ్ హౌస్లో భారత తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి సివిల్ సర్వీసుల ప్రొబేషనరీ బ్యాచ్ను ఉద్దేశించి ప్రసంగించారు.
¤ 2006 నుంచి ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
*¤ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబరు 31ని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినం - నేషనల్ యూనిటీ డే) గా నిర్వహిస్తున్నారు.
*¤ అఖిల భారత సర్వీస్ ప్రొబేషనర్లకు, ఇతర సర్వీసు ప్రొబేషనర్లకు శిక్షణ ఇవ్వడానికి 1959లో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా ముస్సోరిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తున్నారు. ఐపీఎస్ ప్రొబేషనర్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ని నెలకొల్పారు.
*¤ భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో 308 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్లో అఖిల భారత సర్వీసులు; యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి వివరించారు.
ఆర్టికల్ 315: యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
ఆర్టికల్ 315(1): కేంద్ర ప్రభుత్వానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి.
ఆర్టికల్ 315(2): రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలని ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే దానికి అనుగుణంగా పార్లమెంటు ఒక శాసనం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు.
ఆర్టికల్ 315(3): పార్లమెంటు శాసనం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ శాసనంలోనే దానికి సంబంధించిన అనుబంధ అంశాలను కూడా పొందుపరచాలి.
ఆర్టికల్ 315 (4): ఏదైనా ఒక రాష్ట్ర గవర్నర్ కోరితే రాష్ట్రపతి అనుమతితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రాష్ట్రానికి సంబంధిత సేవలను అందించవచ్చు.
ఆర్టికల్ 315(5): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావనలు వచ్చినా అవి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు వర్తిస్తాయి.
ఆర్టికల్ 316: సభ్యుల నియామకం, పదవీ కాలం
ఆర్టికల్ 316 (1): యూనియన్ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను; జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
*¤ ప్రస్తుతం యూపీఎస్సీలో ఒక ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు.
ఆర్టికల్ 316 (2): యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. దీనిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
*¤ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు. దీనిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
ఆర్టికల్ 316 (3): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఒకసారి పనిచేసినవారు తిరిగి అదే పదవిలో నియమితులయ్యే అవకాశం లేదు.
ఆర్టికల్ 317: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల తొలగింపు, సస్పెన్షన్
ఆర్టికల్ 317 (1): యూపీఎస్సీ, జేపీఎస్సీ, ఎస్పీఎస్సీల ఛైర్మన్, సభ్యుల దుష్ప్రవర్తన కారణంగా వారిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు.
ఆర్టికల్ 317(2): సుప్రీంకోర్టు నివేదిక అందే లోపు యూపీఎస్సీ, జేపీఎస్సీల ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను గవర్నర్ సస్పెండ్ చేయవచ్చు.
ఆర్టికల్ 317(3): యూపీఎస్సీ, జేపీఎస్సీ, ఎస్పీఎస్సీల ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తొలగించవచ్చు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను గవర్నర్ సస్పెండ్ చేయగలరు. రాష్ట్రపతి మాత్రమే వారిని తొలగించగలరు.
ఆర్టికల్ 318: యూపీఎస్సీ, జేపీఎస్సీల సభ్యుల సంఖ్యను, వారి ఉద్యోగ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్యను, వారి ఉద్యోగ నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారు.
ఆర్టికల్ 319: యూపీఎస్సీ ఛైర్మన్ పదవీ విరమణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టకూడదు.
*¤ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ ఛైర్మన్గా లేదా యూపీఎస్సీ సభ్యుడిగా లేదా వేరొక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఛైర్మన్గా నియమించవచ్చు. ఇతర ప్రభుత్వ ఉద్యోగం చేపట్టకూడదు.
*¤ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మినహా ఇతర సభ్యులు పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ, ఎస్పీఎస్సీల ఛైర్మన్గా నియమించవచ్చు. కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేపట్టకూడదు.
ఆర్టికల్ 320 (1): కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల కోసం పరీక్షలను నిర్వహించడం యూపీఎస్సీ బాధ్యత. అందుకే యూపీఎస్సీని దేశంలో మెరిట్ను పరిరక్షించే కాపలాదారుడిగా పేర్కొంటారు.
*¤ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల ఉద్యోగ నియామకాల కోసం పరీక్షలను నిర్వహించడం ఎస్పీఎస్సీల బాధ్యత.
ఆర్టికల్ 320 (2): ఏవైనా ఉమ్మడి సర్వీసులకు ప్రత్యేక అర్హతలున్న అభ్యర్థుల నియామకం అవసరమని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు భావించినట్లయితే వాటి అభ్యర్థన మేరకు ఉమ్మడి నియామకాలకు అవసరమైన నిబంధనలను యూపీఎస్సీ రూపొందిస్తుంది.
ఆర్టికల్ 320 (3): అఖిల భారత సర్వీసులు లేదా రాష్ట్ర సర్వీసుల ఉద్యోగుల ఇంక్రిమెంట్ లేదా పదోన్నతిని నిలిపివేయడం, ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి పంపివేయడం, పదవీ విరమణకు ఆదేశించడం, ఉద్యోగం నుంచి తొలగించడం లాంటి క్రమశిక్షణ చర్యలపై సూచనలు, సలహాల కోసం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎస్సీని సంప్రదించాలి.
ఆర్టికల్ 320 (4): ఆర్టికల్ 16(4)లో పేర్కొన్న రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఆర్టికల్ 335లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్సీ, ఎస్పీఎస్సీలను సంప్రదించాల్సిన అవసరం లేదు.
ఆర్టికల్ 320(5): రాష్ట్రపతి యూపీఎస్సీకి సంబంధించి, గవర్నర్ ఎస్పీఎస్సీకి సంబంధించి జారీ చేసే ఏవైనా ఉత్తర్వులు 14 రోజుల్లో పార్లమెంటు లేదా సంబంధిత రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టి అదే సమావేశాల్లో ఆమోదించాలి.
ఆర్టికల్ 321: యూపీఎస్సీ లేదా ఎస్పీఎస్సీ విధులను విస్తరింపచేస్తూ పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు శాసనాలను రూపొందించవచ్చు.
ఆర్టికల్ 322: యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల, ఇతర ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు మొదలైన చెల్లింపులన్నీ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల, ఇతర ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు మొదలైన చెల్లింపులన్నీ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
ఆర్టికల్ 323 (1): ఒక వార్షిక సంవత్సరంలో కమిషన్ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలతో కూడిన ఒక వార్షిక నివేదికను ప్రతి సంవత్సరం యూపీఎస్సీ రాష్ట్రపతికి పంపుతుంది.
ఆర్టికల్ 323 (2): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్ర గవర్నర్కు సమర్పిస్తుంది.
సివిల్ సర్వీసుల సంస్కరణలు - వివిధ కమిటీల సిఫారసులు
దేశంలో సివిల్ సర్వీసుల నియామకానికి సంబంధించి 1854లో మొదటిసారిగా లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ బహిరంగ పోటీ పరీక్ష, స్కోలాస్టిక్ స్వభావ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించింది.
కొఠారి కమిటీ
1974లో సివిల్ సర్వీసెస్ నియామకానికి సంబంధించి అధ్యయనం చేయడానికి యూపీఎస్సీ డి.ఎస్. కొఠారి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1976లో తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సులు 1979 నుంచి అమల్లోకి వచ్చాయి.
ముఖ్య సిఫార్సులు:
*¤ ఆలిండియా, సెంట్రల్ సర్వీసులకు ఒకే పరీక్ష ఉండాలి.
*¤ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలి.
*¤ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్షలకు అనుమతించాలి.
1988లో సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం సతీష్ చంద్ర అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1989లో సమర్పించింది. ఈ సిఫార్సులు 1993 నుంచి అమల్లోకి వచ్చాయి.
ముఖ్య సిఫార్సులు:
*¤ ఇంటర్య్వూ మార్కులను 250 నుంచి 300 మార్కులకు పెంచాలి.
*¤ సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో వ్యాస సంబంధ (ఎస్సే) పేపర్ను 200 మార్కులకు ప్రవేశపెట్టాలి.
సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో వై.కె. అలఘ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 2001లో సమర్పించింది.
ముఖ్యమైన సిఫార్సు: సివిల్ సర్వీసుల్లో సమర్థతను పెంచడానికి పరీక్షల నిర్వహణలో సమూలమైన మార్పులను చేపట్టాలి.
పి.సి. హోతా కమిటీ
సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం 2004లో పి.సి. హోతా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ, సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని తగ్గించడానికి కీలకమైన సిఫార్సులను చేసింది.
ముఖ్యమైన సిఫార్సులు
*¤ సివిల్ సర్వీసెస్కు ఎంపిక చేసే అభ్యర్థుల వయోపరిమితిని 21 - 30 నుంచి 21 - 24 సంవత్సరాలకు తగ్గించాలి.
*¤ సివిల్ సర్వెంట్గా పని చేయలేడనుకున్న ట్రైయినీని తొలగించే అధికారం ట్రైనింగ్ అకాడమీల డైరెక్టర్లకు ఉండాలి.
*¤ సివిల్ సర్వెంట్స్ పనితీరును ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి, నిర్ణీత ప్రమాణాల మేరకు పని చేయనివారిని రిటైర్మెంట్ బెనిఫిట్లతో ఇంటికి పంపాలి.
*¤ రిటైర్ అయిన తర్వాత సివిల్ సర్వెంట్లు కనీసం 2 సంవత్సరాల పాటు రాజకీయాల్లో చేరకుండా ఉండేలా చట్టం చేయాలి.
నిగవేకర్ కమిటీ
సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం 2012లో యూజీసీ మాజీ ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ అరుణ్ నిగవేకర్ అధ్యక్షతన ఒక కమిటీని యూపీఎస్సీ నియమించింది.
ముఖ్యాంశాలు
*¤ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా విధానాన్ని సంస్కరించాలని 2012, ఆగస్టు 30న తన నివేదికను యూపీఎస్సీకి సమర్పించింది.
*¤ ఈ కమిటీ నివేదిక ఆధారంగా 2013 నుంచి మెయిన్స్ పరీక్షా విధానంలో సంస్కరణలను అమలుచేయాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అరవింద్ వర్మ కమిటీ
సివిల్ సర్వీసుల ప్రిలిమ్స్ పరీక్ష 'సీ - శాట్' గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి కఠినంగా మారిందని, అందులోని అంశాలు సంక్లిష్టంగా ఉంటున్నాయని వివిధ వర్గాల అభ్యర్థులు ఆందోళన చేశారు. వారి విజ్ఞప్తుల పరిశీలనకు భారత ప్రభుత్వం 2014లో అరవింద్ వర్మ కమిటీ ని ఏర్పాటు చేసింది.
యూపీఎస్సీ ద్వారా జరిపే నియామకాలు
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
3. ఇండియన్ పోలీస్ సర్వీస్
4. ఇండియన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ ఎ
5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్ ఎ
7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్ ఎ
9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, గ్రూప్ ఎ
10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ ఎ
11. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
12. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్ ఎ
13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, గ్రూప్ ఎ
15. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గ్రూప్ ఎ
16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్ ఎ
18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ ఎ, గ్రేడ్ 3
19. ఇండియర్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ ఎ
20. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ బి
21. దిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్ గ్రూప్ బి
22. దిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్, గ్రూప్ బి
23. పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్, గ్రూప్ బి
24. పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్, గ్రూప్ బి
*¤ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ప్రత్యేకంగా నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది.
*¤ ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. 1947లో దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్గా మార్చారు.
*¤ ఎస్.కె. ఖన్నా కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ అనుమతితో యూపీఎస్సీ 2011లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షా విధానాన్ని మార్పు చేసింది.
*¤ అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం, అత్యుత్తమ విధానాలను పంచుకోవడం కోసం యూపీఎస్సీ 2010లో సార్క్ దేశాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్ల సమావేశాన్ని నిర్వహించింది.
*¤ భారత ప్రభుత్వం 2007, మే 1న యూపీఎస్సీ ఛైర్మన్ స్థాయిని ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయికి సమానంగా, యూపీఎస్సీ సభ్యుల స్థాయిని ఎన్నికల కమిషనర్ స్థాయికి సమానంగా పెంచింది. దీనికి అనుగుణంగా అధికార హోదాల క్రమంలో మార్పులు చేశారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 148 నుంచి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురించి తెలియజేస్తున్నాయి. కాగ్ పదవిని మనం బ్రిటన్ నుంచి గ్రహించాం.
ఆర్టికల్ 148: సాధారణంగా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (ఐఏఏఎస్)లో 10 సంవత్సరాలకు పైబడిన అనుభవం ఉన్న, ప్రభుత్వ కార్యకలాపాల్లో నిష్ణాతుడైన వ్యక్తిని కాగ్గా నియమిస్తారు.
ఆర్టికల్ 148(1): కాగ్ను స్వయంగా సంతకం చేసిన అధికార ముద్ర గల అధిపత్రం ద్వారా రాష్ట్రపతి నియమిస్తారు.¤ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే కాగ్ను తొలగించాలి.
ఆర్టికల్ 148(2): కాగ్గా నియమితులైన వ్యక్తి రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన అధికారి ఎదుట 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 'భావ రాగ ద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహిస్తామన్న వాక్యాలతో పాటు రాజ్యాంగాన్ని, చట్టాలను నిలబెడతానని' కాగ్ ప్రమాణం చేస్తారు. రాజ్యాంగాన్ని నిలబెట్టే కీలక బాధ్యతను రాజ్యాంగంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు; కాగ్పై మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు ఉంచారు. రాజ్యాంగబద్ధ సంస్థల అధికారుల్లో ఈ విధంగా ప్రమాణం చేసే అధికారి కాగ్ మాత్రమే.
ఆర్టికల్ 148(3): కాగ్ సర్వీసు నిబంధనలను, జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా జీతం చెల్లిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతాన్నే కాగ్ పొందుతారు. ప్రస్తుతం కాగ్ జీతం రూ.90,000. పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు.
ఆర్టికల్ 148(4): కాగ్గా పని చేసిన వ్యక్తి పదవీ విరమణ అనంతరం కేంద్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో మరే ఇతర పదవిని చేపట్టకూడదు.
ఆర్టికల్ 148(5): రాష్ట్రపతి కాగ్ను సంప్రదించిన అనంతరం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగుల నియామక నిబంధనలను, కాగ్ పాలనాపరమైన నియమాలను రూపొందిస్తారు.
ఆర్టికల్ 148(6): కాగ్కు సంబంధించిన నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలు, పెన్షన్ లాంటివన్నీ భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
ఆర్టికల్ 149: పార్లమెంటు నిర్ణయించిన అధికార విధులను కాగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన చట్టాన్ని భారత పార్లమెంటు 1971లో రూపొందించింది.
*¤ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఆడిటర్ జనరల్ పదవిని మాత్రమే పేర్కొన్నారు. టి.టి.కృష్ణమాచారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అనుసరించి కంప్ట్రోలర్ అనే పదాన్ని చేర్చారు.
*¤ 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా మొదటిసారిగా మన దేశంలో అకౌంటెంట్ జనరల్ పేరుతో ఈ అధికారిక స్థానాన్ని ఏర్పాటు చేశారు.
*¤ 1919 నాటి మాంటేగ్ - చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కాగ్కు చట్టబద్ధతను కల్పించారు.
*¤ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కాగ్ పదవి సంపూర్ణతను సంతరించుకుంది.
కాగ్ అధికారాలు - విధులు
*¤ కేంద్ర, రాష్ట్రాలు సంఘటిత నిధుల నుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం.
*¤ కంటింజెన్సీ ఫండ్ నుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం.
*¤ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యాపారం, ఉత్పత్తి, లాభ, నష్టాల లెక్కలను తనిఖీ చేయడం.
*¤ కేంద్రం లేదా రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయడం.
*¤ తాను ఆడిట్ చేసిన ప్రతి అంశానికి సంబంధించిన లావాదేవీలను నివేదిక రూపంలో సిద్ధం చేయడం.
*¤ కాగ్ భారత అకౌంట్స్ అండ్ ఆడిట్ శాఖ తరఫున విధులను నిర్వర్తిస్తారు.
*¤ 1981 నాటి అకౌంటెంట్ జనరల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కాగ్ను రాజ్యాంగ అత్యున్నత అధికారిగా పేర్కొంది.
*¤ 1949 మే 30న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్లో ప్రసంగిస్తూ కాగ్ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
'పార్లమెంటు ఆమోదించే వ్యయాలు పరిధి దాటుతున్నాయా, మార్పుచేర్పులేమైనా చోటుచేసుకుంటున్నాయా అనే విషయాన్ని పరిశీలించే కాగ్ భారత రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైన అధికారి. ఆ అధికారి నిర్వహించే విధులు న్యాయాధికారి విధుల కంటే ముఖ్యమైనవి'.
ఆర్టికల్ 150: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జమా ఖర్చులు కాగ్ సలహాపై రాష్ట్రపతి నిర్ణయించిన నమూనాలో ఉండాలి.
ఆర్టికల్ 151: ఆడిట్ రిపోర్టుల గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 151(1): కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్రపతికి అందజేయాలి. రాష్ట్రపతి వాటిని పార్లమెంటులో ప్రవేశపెడతారు లేదా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తారు.
ఆర్టికల్ 151(2): రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన కాగ్ నివేదికలను గవర్నర్కు అందజేయాలి. వాటిని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెట్టే ఏర్పాటు చేయాలి.
¤ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రారంభంలో కంప్ట్రోలర్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ జనరల్ (CAAG)గా ఉండగా 1976లో అకౌంట్స్ విభాగాన్ని వేరుచేయడంతో CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గా కొనసాగుతోంది.
ఇతర ముఖ్యాంశాలు
* CAG భారత ప్రజల విత్తానికి ప్రధాన కాపలాదారుగా వ్యవహరిస్తారు.
*¤ ప్రభుత్వాల ఖర్చులను నియంత్రించే అధికారం కాగ్కు లేనందున ఈ పదవి వాస్తవానికి ఆడిటర్ జనరల్గా మాత్రమే వ్యవహరిస్తోంది అని పాల్ ఆపిల్ బీ పేర్కొన్నారు.
*¤ కాగ్ పొదుపునకు సంబంధించిన సలహాలను మాత్రమే సూచించగలదు. ప్రభుత్వ ఖర్చుల్లోని అవకతవకలను ఎత్తి చూపుతుంది.
¤* కాగ్ నివేదికను కొందరు శవ పంచనామా (Post-mortem Report)గా పేర్కొంటారు.
¤* మన దేశంలోని 1400 కార్పొరేషన్ల ఖాతాలను కాగ్ తనిఖీ చేస్తుంది.
*¤ ఇటీవల కాగ్గా పదవీ విరమణ చేసిన వినోద్రాయ్ భారతదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలను కూడా కాగ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
*¤ కాగ్గా పనిచేసిన వినోద్రాయ్ యూఎన్వో ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానల్కు ఛైర్మన్గా వ్యవహరించారు.
*¤ కాగ్ ను బహుళ సభ్య సంఘంగా మార్చాలని షుంగ్లూ కమిటీ సిఫార్సు చేసింది.
*¤ కాగ్ సమర్పించిన నివేదికలను ప్రజాపద్దుల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలు సమీక్షిస్తాయి.
*¤ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్ను తత్వవేత్తగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారు.
*¤ ఏ అంశంపైన అయినా కాగ్ ఆడిట్ మూడు దశల్లో జరుగుతుంది. ముగ్గురు సభ్యులున్న బృందం ఈ ఆడిట్లో పాల్గొంటుంది.
కాగ్ వెలికితీసిన కుంభకోణాలు
*¤ భోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం
*¤ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం (రూ.1.76 లక్షల కోట్లు)
*¤ ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అవకతవకలు
*¤ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలు
*¤ కామన్వెల్త్ క్రీడల్లో అక్రమాలు
*¤ ముంబయిలో ఆదర్శ్ కుంభకోణం
*¤ బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు
*¤ యాంత్రిక్స్ - దేవాస్ ఒప్పందంపై జరిగిన అక్రమాలు
*¤ ఓఎన్జీసీ ఎలాంటి బిడ్డింగ్ లేకుండా రిలయన్స్ నుంచి డ్రిల్లింగ్ రిగ్ను అద్దెకు తీసుకోవడం
*¤ అన్ని రకాల ప్రణాళికల వ్యయాన్ని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని రంగరాజన్ కమిటీ సిఫార్సు చేసింది.
కాగ్ పదవిపై వ్యాఖ్యానాలు
¤ భారత రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో కాగ్ను ప్రధానమైన, శక్తిమంతమైన అధికారిగా పేర్కొనవచ్చు. - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
¤ కాగ్ ప్రభుత్వానికి బాధ్యురాలు కాదు. తన నివేదికల్లో ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కాగ్కు ఉంది. - జవహర్లాల్ నెహ్రూ
¤ కాగ్కు తన ఆఫీసు సిబ్బందిపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణ ఉండదు. అందుకే కాగ్ను "very much alone wolf"గా పేర్కొనవచ్చు. - సర్ ఫ్రాండ్ ట్రైబ్
అటార్నీ జనరల్
¤ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. ¤ భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయాధికారిగా అటార్నీ జనరల్ వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలున్న వారిని అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. అటార్నీ జనరల్ వేతనాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే వేతనం అటార్నీ జనరల్ పొందుతారు. ఈ వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. సాధారణంగా అటార్నీ జనరల్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. కానీ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి ఎప్పుడైనా అటార్నీ జనరల్ను తొలగించగలరు.
అధికారాలు - విధులు
*¤ పార్లమెంటు సమావేశాలు, చర్చల్లో పాల్గొనే అధికారం ఉంది. కానీ ఓటు వేసే అధికారం లేదు.
*¤ దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా ప్రభుత్వం తరఫున వాదించే అధికారం ఉంది.
*¤ భారత రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందగలరు.
*¤ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు, న్యాయవాది.
*¤ అటార్నీ జనరల్కు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఒక సొలిసిటర్ జనరల్ను, ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్ను నియమిస్తుంది.
¤
అడ్వకేట్ జనరల్
*¤ భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 165 'అడ్వకేట్ జనరల్' గురించి తెలియజేస్తుంది.
*¤ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయాధికారిగా అడ్వకేట్ జనరల్ వ్యవహరిస్తారు.
*¤ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలున్న వారిని 'అడ్వకేట్ జనరల్'గా గవర్నర్ నియమిస్తారు.
*¤ ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు గవర్నర్ 'అడ్వకేట్ జనరల్'ను తొలగిస్తారు. అంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంత మేరకే 'అడ్వకేట్ జనరల్' పదవిలో కొనసాగుతారు.
*¤ హైకోర్టు న్యాయమూర్తి పొందే వేతనాన్ని పొందుతారు. దీన్ని గవర్నర్ నిర్ణయిస్తారు.
బల్వంత్సింగ్ చౌఫల్ వర్సెస్ ఉత్తరాఖండ్ కేసు
¤ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 62 సంవత్సరాల వయసు నిండిన వారిని కూడా 'అడ్వకేట్ జనరల్'గా నియమించవచ్చని పేర్కొంది.
అడ్వకేట్ జనరల్ అధికారాలు - విధులు
*¤ రాష్ట్ర శాసనసభ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ ఓటు వేసే అధికారం లేదు.
*¤ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని ఏ న్యాయస్థానంలోనైనా హజరై తన వాదనను వినిపించవచ్చు.*¤ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయసలహాదారు, న్యాయవాది.
*¤ అడ్వకేట్ జనరల్కు సహాయ సహకారాలు అందించడానికి అదనపు అడ్వకేట్ జనరల్ను నియమిస్తారు.
*¤ ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ డి.నరసరాజు.