• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

* ముడి పదార్థాలను ఉపయోగించి, వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు.

* ఆధునిక యుగంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధి పరిశ్రమలపై ఆధారపడి ఉంటాయి.

పరిశ్రమల స్థాపనకు దోహదపడే అంశాలు:

* ఖనిజాల లభ్యత 

* అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు

* మార్కెట్‌ సౌకర్యాలు    

* పెట్టుబడుల లభ్యత    

* తగిన మోతాదులో మంచినీటి లభ్యత    

* తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు    

* నిరంతరాయంగా లభించే విద్యుత్‌ సౌకర్యాలు

* భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దంలో ప్రారంభమైంది.


పరిశ్రమలు - రకాలు

ముడి పదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు

2) అటవీ ఆధారిత పరిశ్రమలు

3) ఖనిజ ఆధారిత పరిశ్రమలు


వ్యవసాయాధారిత పరిశ్రమలు

వస్త్ర/ జౌళి పరిశ్రమ


 జౌళి అనేది విస్తృతమైన పదం. ఇందులో వస్త్ర పరిశ్రమ; జనపనార పరిశ్రమ; ఉన్ని, పట్టు, సింథటిక్‌ వస్త్ర పరిశ్రమలు భాగంగా ఉంటాయి.

* వస్త్ర పరిశ్రమను మనదేశంలో మొదటిసారి 1818లో కలకత్తా సమీపంలోని ఫోర్ట్‌ గ్లాస్టర్‌ వద్ద ఏర్పాటు చేయగా, అది విజయవంతం కాలేదు.

* భారతదేశంలో ఆధునిక వస్త్రపరిశ్రమను 1854లో పార్సీ వ్యాపారవేత్తల ఆర్థిక సహకారంతో బొంబాయిలో ఏర్పాటు చేశారు.

* భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమది ప్రత్యేకస్థానం.

* పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%, విదేశీమారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతంగా ఉంది.

* వ్యవసాయరంగం తర్వాత వస్త్రపరిశ్రమ నుంచే ప్రజలకు అత్యధిక ఉపాధి లభిస్తుంది.

* 1947 నాటికి మనదేశంలో 423 నూలుమిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో స్వావలంబన (self reliant) సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ.

* ఆఫీస్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం, వస్త్ర పరిశ్రమలు తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేశంలోనే మొట్టమొదటి వస్త్రపరిశ్రమల ప్రత్యేక ఆర్థికమండలిని తిరువూరులో ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ చర్యలు: పారిశ్రామిక విప్లవం మొట్టమొదట వస్త్రరంగంలో ప్రారంభమైంది. ప్రపంచ వస్త్రపరిశ్రమ ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ నగరంలో అభివృద్ధి చెందింది. ఈ నగరాన్ని ‘కాటన్‌ పొలీస్‌’ అంటారు. అంటే వస్త్ర పరిశ్రమ పుట్టిన ప్రాంతం అని అర్థం.

* వస్త్రాలు, దుస్తుల తయారీలో భారత్‌ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది.

* 1963లో బొంబాయిలో టెక్స్‌టైల్‌ కమిటీని ఏర్పాటుచేశారు. యంత్రాలు, వస్త్రాల నాణ్యతను పెంపొందించడం దీని లక్ష్యం.

* 2010లో కలకత్తాలో నేషనల్‌ జూట్‌ బోర్డ్‌ను స్థాపించారు. జనపనార ఉత్పత్తులను పెంపొందించడం దీని లక్ష్యం.

* 1948లో ది సెంట్రల్‌ సిల్క్‌ బోర్డును బెంగళూరు కేంద్రంగా నెలకొల్పారు.

* 1987లో సెంట్రల్‌ ఊల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ను జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు.

* 2002లో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ను కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేశారు.

* భారతదేశంలో వస్త్రపరిశ్రమలు ఎక్కువగా ముంబయి-బొంబాయి, అహ్మదాబాద్‌ నగరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి.


ప్రభుత్వ పథకాలు

స్కీమ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్స్‌: దేశంలోని వస్త్ర పరిశ్రమలకు ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చడానికి భారత ప్రభుత్వం 2005లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 

* దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 40% ప్రభుత్వం గ్రాంట్‌గా ఇస్తుంది.

PM MITRA SCHEME: Farm to fiber, fiber to factory, factory to fashion, fashion to foreign స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ పథకాన్ని మొదటిసారి 2020-21 బడ్జెట్లో ప్రకటించింది.


జనపనార పరిశ్రమ 

* దేశంలో జనపనార పరిశ్రమను 1855లో కలకత్తాలోని ‘రిష్రా’ వద్ద ఏర్పాటు చేశారు.

* జనపనార, దాని ఉత్పత్తుల్లో భారత్‌ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది.

* జనపనార వస్తువుల ఎగుమతుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, మొదటి ర్యాంక్‌లో బంగ్లాదేశ్‌ ఉంది.

* మనదేశంలో సుమారు 70 జనపనార మిల్లులు ఉన్నాయి. 

* పశ్చిమ్‌ బంగాలోని హుగ్లీ నదీ తీరంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వీటికి రాణీగంజ్‌ నుంచి బొగ్గు, దామోదర్‌ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ సౌకర్యాలు ఉండటమే.


రకాలు - ఇతర ముఖ్యాంశాలు:

* బుర్లాప్‌ - అత్యంత నాణ్యమైన జనపనార రకం

* కెనాఫ్‌ - అత్యంత వేగంగా పెరిగే జనపనార రకం. దీన్ని సాధారణ పరిభాషలో ‘మెస్బా’ అంటారు.

* రాటింగ్‌ - జనుము పంటను కోసి నీటిలో నానబెట్టే ప్రక్రియ.

* 1971లో కలకత్తాలో జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను నెలకొల్పారు.

* జనుము రైతులు, కార్మికులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుతం 2005లో జాతీయ జనపనార విధానాన్ని (National Jute Policy) ప్రకటించింది.


పట్టు పరిశ్రమ 

* నాలుగు వేల సంవత్సరాల క్రితం చైనీయులు పట్టు వస్త్రాలను తయారు చేసే విధానాన్ని కనుక్కున్నారు.

* చైనా, యూరప్‌ మధ్య జరిగే వర్తక మార్గాన్ని పట్టు మార్గం (Silk Route)గా పిలిచేవారు.

* భారతదేశంలో ఆధునిక పట్టు వస్త్ర పరిశ్రమను 1832లో పశ్చిమ్‌ బంగాలోని హౌరా వద్ద స్థాపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.

* ఈ పరిశ్రమను వస్త్ర పరిశ్రమల రాణి (Queen of Textiles) గా పేర్కొంటారు.

* పట్టు ఉత్పత్తిలో చైనా, భారత్‌లు వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, వినియోగంలో భారత్‌ ప్రథమస్థానంలో ఉంది. 

* మనదేశంలో పట్టు ఎక్కువగా కర్ణాటక నుంచే ఉత్పత్తి అవుతోంది.

* పట్టు పురుగులు తయారు చేసే ‘కొకూన్‌’ నుంచి పట్టు దారం లభిస్తుంది.

* మనదేశంలో మాత్రమే 4 రకాల పట్టు ఉత్పత్తి జరుగుతుంది. అవి: 

1. మల్బరీ  2. టస్సర్‌  3. ఇరి  4. ముగ

* టస్సర్, ఇరి, ముగాలను వన్య పట్టు (Wild Silk) అంటారు. రేయాన్‌ను కృత్రిమ పట్టు (Artificial Silk) అంటారు.


వివిధ పట్టు రకాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు

 మల్బరీ    -   కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

 ఇరి      -   బిహార్, పశ్చిమ్‌ బంగా

 టస్సర్‌    -   ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌

 ముగ    -   అసోం

దేశంలో నూలు పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు

మహారాష్ట్ర - ముంబయి, ఔరంగాబాద్, నాగ్‌పుర్, పుణె, నాసిక్‌

గుజరాత్‌ - అహ్మదాబాద్, బరోడా, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌

తమిళనాడు - కోయంబత్తూర్, తంజావూరు, మధురై, సేలం, తిరునల్వేలి, ఈరోడ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌ - కాన్పూర్, ఆగ్రా, రాంపూర్, ఇటావ, హత్రాస్, షహరాన్‌పూర్‌

పంజాబ్‌ - అమృత్‌సర్‌

కర్ణాటక - బెంగళూరు, బళ్లారి, మైసూర్, హుబ్లీ, ధావనగెరె

ఆంధ్రప్రదేశ్‌ - ధర్మవరం, వెంకటగిరి, అనంతపురం, గుంటూరు

తెలంగాణ - హైదరాబాద్, వరంగల్‌

వస్త్ర పరిశ్రమ - పట్టణాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. మనదేశంలో (ముంబయి) తర్వాత వస్త్ర పరిశ్రమ ఈ ప్రాంతంలోనే ప్రారంభమైంది.

ముంబయి: మహారాష్ట్రలోని ఈ నగరాన్ని ‘కాటన్‌ పొలీస్‌ ఆఫ్‌ ఇండియా’, ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అంటారు.

కాన్పూర్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా’ అని పిలుస్తారు. అధిక జనాభా వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.

కోయంబత్తూర్‌: తమిళనాడులోని ఈ నగరంలో స్వాతంత్య్రం తర్వాత వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. కోయంబత్తూర్‌ను ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ అని అంటారు.

* నూలు, ఉన్ని, పట్టు పరిశ్రమలను ‘భార నష్టం లేని పరిశ్రమలు’  (Nonweight loss industries) అంటారు. అంటే 100 కేజీల ముడిపదార్థాలను ఉపయోగిస్తే 100 కేజీల వస్త్రం ఉత్పత్తి అవుతుంది.

* పంచదార పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమలను భారనష్టం ఉన్న పరిశ్రమలు (Weight loss Industries) అంటారు. వీటి ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థాలను కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది.


దేశంలో జనుము వస్త్ర పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌:  చిట్టివలస, నెల్లిమర్ల, ఏలూరు, గుంటూరు, ఒంగోలు

ఉత్తర్‌ ప్రదేశ్‌:  కాన్పూర్, గోరఖ్‌పూర్‌

బిహార్‌: కటిహార్, ముక్తాపూర్‌

మధ్యప్రదేశ్‌:  రాయ్‌గఢ్‌


ఉన్ని పరిశ్రమ 

*  ఆధునికమైన ఉన్ని వస్త్ర పరిశ్రమను 1876లో స్థాపించారు. 

* ఉన్ని వస్త్ర పరిశ్రమకు చల్లటి, శుష్క శీతోష్ణ పరిస్థితులు అవసరం. 

* భారతదేశంలో జమ్మూకశ్మీర్‌లోని బేకర్‌వాల్స్‌ పాశ్మీనా జాతి మేకల నుంచి; రాజస్థాన్‌లోని గుజ్జర్స్‌; హిమాచల్‌ప్రదేశ్‌లోని గద్దీస్‌ తెగకు చెందిన ప్రజలు అంగోరా జాతి గొర్రెల నుంచి శ్రేష్ఠమైన ఉన్నిని సేకరిస్తారు.

* ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

* ఉన్నిలో మెరీనా రకం నాణ్యమైంది, ప్రత్యేకమైంది.


దేశంలో ఉన్ని వస్త్రాలను ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రాలు

పంజాబ్‌:  ధరియవాల్, అమృత్‌సర్, లూథియానా, ఖారార్‌

మహారాష్ట్ర:  ముంబయి

ఉత్తర్‌ ప్రదేశ్‌:  కాన్పూర్, మీర్జాపూర్, ఆగ్రా, వారణాసి

గుజరాత్‌: జామ్‌నగర్, బరోడా, అహ్మదాబాద్‌

రాజస్థాన్‌: బికనీర్, జోధ్‌పూర్, ఆల్వార్, జైపూర్‌

* సెంట్రల్‌ ఊల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. దీన్ని 1987, జులైలో ఏర్పాటు చేశారు.

అటవీ ఆధారిత పరిశ్రమలు

కాగితం పరిశ్రమ


* పేపర్‌ అనే ఆంగ్ల పదం పాపిరస్‌ అనే ఈజిప్ట్‌ పదం నుంచి ఆవిర్భవించింది.

* ప్రాచీన ఈజిప్షియన్లు పాపిరస్‌ చెట్ల బెరడును కాగితంగా ఉపయోగించారు.

* ఆధునిక కాలంలో పేపర్‌ తయారీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా.

* 15వ శతాబ్దంలో జోహన్నెస్‌ గూటెన్‌బర్గ్‌ ముద్రణా యంత్రాన్ని కనుక్కున్నాక ప్రపంచవ్యాప్తంగా పేపర్‌కు డిమాండ్‌ పెరిగింది. 

* భారత్‌లో మొట్టమొదటి కాగితం పరిశ్రమను 1832లో కలకత్తా సమీపంలోని షేరంపూర్‌ వద్ద స్థాపించారు. ఈ సమయంలో కాగితానికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోవడంతో ఇది త్వరగా మూతపడింది.

* మనదేశంలో మొదటి ఆధునిక కాగిత పరిశ్రమ ‘రాయల్‌ బెంగాల్‌ పేపర్‌ మిల్లు’. దీన్ని 1870లో కలకత్తా సమీపంలోని బాలిగంజ్‌ వద్ద నెలకొల్పారు.


రాగ్స్‌:

* వేస్ట్‌ పేపర్‌ లేదా కాటన్‌ వేస్ట్‌తో తయారు చేసిన పేపర్‌ను ‘రాగ్స్‌’ అంటారు. ఇది చేతితో చేసిన (హ్యండ్‌ మేడ్‌) పేపర్‌. దీన్ని యూనివర్సిటీ సర్టిఫికెట్స్, వివాహ ఆహ్వాన పత్రికలు, మ్యూజియాల్లో ఉపయోగిస్తారు. 

* పుదుచ్చేరిలోని ‘శ్రీ అరబిందో హ్యాండ్‌మేడ్‌ పేపర్‌’ ఆసియాలోనే అతిపెద్ద హ్యాండ్‌ మేడ్‌ పేపర్‌ ఇండస్ట్రీ.

ముడి పదార్థాలు: కలప, కాస్టిక్‌సోడా, సోడియం సల్ఫేట్, వెదురు మొదలైనవి.

* కాగితం తయారీకి మెత్తటి కలపనిచ్చే శృంగాకారపు అడవులు అనువైనవి.

* కర్ణాటకలోని శ్రావణబెళగొళలో ఉన్న కాగిత పరిశ్రమలో చెరకు పిప్పిని (లెగసె) ఉపయోగించి పేపర్‌ను తయారు చేస్తారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పేపర్‌ తయారీకి వెదురు, సబాయ్‌ గడ్డిని ఉపయోగిస్తారు.


దేశంలో పేపర్‌ తయారీ కేంద్రాలు

మహారాష్ట్ర: బల్లార్‌పూర్, కల్యాణి, సాంగ్లి, కోసోలి, ప్రవరనగర్, రోహ, బివండి, పుణె.

ఆంధ్రప్రదేశ్‌: రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, కాకినాడ, శ్రీకాకుళం.

పశ్చిమ్‌ బంగా: టిటాఘర్, కలకత్తా, రాణిగంజ్, బెన్స్‌బేరియా, నైహతి, బర్నాగర్‌.

గుజరాత్‌: రాజ్‌కోట్, సూరత్, వడోదర, నవ్‌సరి.

తెలంగాణ: సిర్పూర్, పటాన్‌చెరు, భద్రాచలం, మాతంగి.

మధ్యప్రదేశ్‌: ఇండోర్, భోపాల్, అంప్లి, రేవ, విదిశ, శాండోల్‌.

కర్ణాటక: షిమోగ, శ్రావణబెళగొళ.

* దేశంలో పేపర్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు: మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌.


ఆంధ్రప్రదేశ్‌లో కాగితం పరిశ్రమ

* ఏపీలో మొదటి కాగితం మిల్లును 1921లో రాజమండ్రిలో స్థాపించారు.

* 1924లో తూర్పు గోదావరిలో ‘ఆంధ్రా పేపర్‌ మిల్లు’ను నెలకొల్పారు.

* 1979లో రాయలసీమ పేపర్‌ మిల్లును కర్నూలులోని ఆదోని వద్ద ఏర్పాటు చేశారు.

* పెన్నార్‌ పేపర్‌ మిల్లు కడపలో ఉంది.


తెలంగాణ పేపర్‌ పరిశ్రమ 

* 1938లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లును స్థాపించారు. ఇది తెలంగాణలో మొదటి పేపర్‌ పరిశ్రమ. ఇక్కడ 1942లో పేపర్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.

* 1982లో భద్రాచలం పేపర్‌ బోర్డును ఏర్పాటు చేశారు.


ఆట వస్తువుల పరిశ్రమ 


* మొట్టమొదటి ఆటవస్తువుల పరిశ్రమను పంజాబ్‌లోని సియాల్‌ కోట్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లో ఉంది.

* దేశంలో రెండో ఆటవస్తువుల పరిశ్రమను మీరట్‌ (యూపీ)లో నెలకొల్పారు.

* క్రీడా వస్తువుల తయారీకి పంజాబ్‌లోని జలంధర్‌ ప్రసిద్ధి.


అగ్గిపెట్టెల పరిశ్రమ

* కలకత్తాలో స్థిరపడిన జపాన్‌ ప్రజలు 1910లో సులభమైన పద్ధతిలో అగ్గిపెట్టెలను తయారు చేశారు.

* దేశంలో ఆధునిక అగ్గిపెట్టెల పరిశ్రమను 1921లో అహ్మదాబాద్‌లో స్థాపించారు.

ఉపయోగించే కలప: మర్కట్, సిల్వర్‌ఫర్, ధూప్, సలాయ్, సెమాల్‌ చెట్లు (Indian Cotton Wood), సుందరి కలప.

* అగ్గిపెట్టెకు కావాల్సిన ఎర్రఫాస్ఫరస్, పుల్ల చివర ఉండే రసాయనాలైన పొటాషియం క్లోరేట్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.

అగ్గిపెట్టె పరిశ్రమ కేంద్రాలు

తమిళనాడు: రామనాథపురం, చెన్నై, చెంగల్పట్టు, తిరునల్వేలి, శివకాశి.

పశ్చిమ్‌ బంగా: కలకత్తా, 24 పరగణాలు.

మహారాష్ట్ర: థానే, పుణె, చంద్రాపూర్, ముంబయి.

కేరళ: త్రిసూరు.

తెలంగాణ: వరంగల్, హైదరాబాద్‌.

* అగ్గిపెట్టెల ఉత్పత్తిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.


రబ్బరు పరిశ్రమ 

దేశంలో మొదటిసారి 1902లో కేరళలోని తట్టెక్కాడ్‌ వద్ద వాణిజ్యపరంగా రబ్బరు తోటల సాగు ప్రారంభమైంది. ఈ విధంగా ఉత్పత్తి అయిన సహజ రబ్బరును ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసేవారు.

* భారత్‌లో మొదటి రబ్బరు ఉత్పత్తుల తయారీ పరిశ్రమ Dixie Aye Rubber Factory. దీన్ని 1921లº కలకత్తాలో ప్రారంభించారు.

* 1964లో మద్రాస్‌ రబ్బరు ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్‌)ని స్థాపించారు. ప్రారంభంలో బెలూన్లను తయారు చేసిన ఈ కంపెనీ 1960 నుంచి టైర్లను తయారు చేయడం ప్రారంభించింది.

* దేశంలో మొదటి సింథటిక్‌ రబ్బరు ప్లాంట్‌ను పానిపట్‌ (హరియాణా)లో ఏర్పాటు చేశారు.

* దేశంలో రబ్బరు ఉత్పత్తిలో కేరళ మొదటి స్థానంలో ఉంది.


ఇతర అటవీ ఆధారిత పరిశ్రమలు

* తునికి/ తెండు పరిశ్రమలు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి.

* తునికి లేదా తెండు ఆకును బీడీల తయారీకి ఉపయోగిస్తారు.

* మేఘాలయలో చీపురుకట్టల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందింది.


వ్యవసాయాధారిత పరిశ్రమలు

పంచదార పరిశ్రమ 

* ఇది దేశంలో అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమ.

* ప్రపంచవ్యాప్తంగా పంచదార ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, బెల్లం, ఖండసారి చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.  

* మనదేశంలో ఆధునిక పంచదార పరిశ్రమను 1904లో బిహార్‌లోని సరాన్‌ వద్ద స్థాపించారు.

* భారత్‌లో సుమారు 460 పంచదార మిల్లులు ఉండగా, వీటిలో 60% ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నాయి.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఈ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని (Sugar bowl of India) గా పిలుస్తారు.

* ఈ పరిశ్రమ సంవత్సరంలో కొన్ని నెలలపాటు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇది సహకార రంగానికి అనువైంది.


దేశంలో పంచదార పరిశ్రమల విస్తరణ: 

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గంగా - యమునా అంతర్వేది ప్రాంతంలో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.

* మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లి, సతారా, పుణె, అహ్మద్‌నగర్, షోలాపూర్‌లోనూ వీటి విస్తరణ అధికంగా ఉంది.

* కొయానా ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రలో చెరకు సాగు పెరిగి, పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందింది.

* కృష్ణరాజసాగర్‌ను నిర్మించాక కర్ణాటకలో చెరకు సాగు అధికమైంది. ఇక్కడి మాండ్య, మైసూర్, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్‌లో పంచదార పరిశ్రమలు ఉన్నాయి.

* తమిళనాడులోని కోయంబత్తూర్, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుచునాపల్లిలో పంచదార పరిశ్రమలు ఉన్నాయి.

* తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, కరీంనగర్‌; ఏపీలోని ఉభయగోదావరి, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పంచదార పరిశ్రమలను నెలకొల్పారు.


తోళ్ల పరిశ్రమ (Leather Industry)

* భారతదేశంలో మొట్టమొదటి తోలు పరిశ్రమను 1960లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కాన్పూర్‌ వద్ద ఏర్పాటు చేశారు.

* టానింగ్‌ పరిశ్రమ లెదర్‌ పరిశ్రమలో అంతర్భాగం. టానింగ్‌ ప్రక్రియలో చర్మాలను తుది వినియోగం కోసం శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో టానిక్‌ ఆమ్లాన్ని ఉపయోగించి చర్మాలను తోళ్లుగా మారుస్తారు.

* కేంద్ర తోళ్ల పరిశధన కేంద్రం (Center Leather Research Institute) చెన్నైలో ఉంది.


కలకత్తా లెదర్‌ కాంప్లెక్స్‌ 

* ఇది దేశంలోనే అతిపెద్ద తోలు పరిశ్రమ సమూహం (కాంప్లెక్స్‌). దీన్ని తూర్పు కలకత్తా సమీపంలోని బంటాల వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 500 కి పైగా తోలు శుద్ధి కేంద్రాలు ఉన్నాయి.


తోళ్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు:

తమిళనాడు: చెన్నై, అంబూర్, రాణిపేట, త్రిచి, దిండిగల్, వెల్లూరు.

పంజాబ్‌: జలంధర్‌.

ఉత్తర్‌ ప్రదేశ్‌: షహరాన్‌పూర్, నోయిడా, కాన్పూర్, ఆగ్రా.

రాజస్థాన్‌: జైపూర్‌.

* మొత్తం తోళ్ల పరిశ్రమ ఉత్పత్తిలో 70% వాటా తమిళనాడుదే.

* ప్రపంచ పాదరక్షల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది.

* మనదేశ తోలు ఉత్పత్తులు అత్యధికంగా అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లకు ఎగుమతి అవుతున్నాయి.

* లెదర్‌ గార్మెంట్స్‌ ఎగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.


లక్క పరిశ్రమ 

* లక్క ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

* ‘లాక్సీఫెరాలక్క’ అనే కీటకం చెట్లపై స్రవించే ద్రవాల ఆధారంగా లక్కను ఉత్పత్తి చేస్తారు.

* భారతదేశంలో లక్క ఉత్పత్తిలో ఝార్ఖండ్‌ మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో ఉంది.


రెసిన్‌ పరిశ్రమ 

* దీన్ని ఖైర్‌ అనే చెట్టు నుంచి తీస్తారు.

* రెసిన్‌ ఉత్పత్తిలో ప్రథమస్థానం: అరుణాచల్‌ప్రదేశ్‌.

* ఈ పరిశ్రమ అరుణాచల్‌ప్రదేశ్‌లో కుటీర పరిశ్రమగా ఉంది.


మాదిరి ప్రశ్నలు


1. భారతదేశంలో ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు?

1) 1818      2) 1842     3) 1854    4) 1852


2. కింది అంశాలను జతపరచండి.

   జాబితా - I                               జాబితా - II

a) మాంచెస్టర్‌ ఆఫ్‌  ఇండియా         i) కాన్పూర్‌

b) మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా    ii) ముంబయి

c) మాంచెస్టర్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా   iii) అహ్మదాబాద్‌

d) కాటన్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా      iv) కోయంబత్తూర్‌

1) a-i, b-iii, c-iv, d-ii        2) a-iii, b-iv, c-i, d-ii
3) a-iii, b-iv, c-ii, d-i     4) a-iv, b-iii, c-i, d-ii


3. కేంద్ర తోళ్ల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) చెన్నై         2) పంజాబ్‌      3) కలకత్తా        4) కశ్మీర్‌


4. లెదర్‌ గార్మెంట్స్‌ ఎగుమతిలో భారత్‌ స్థానం?

1) మొదటి       2) రెండు       3) నాలుగు     4) ఆరు


5. దేశంలో పేపర్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు వరుసగా ....

1) గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర      2) కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌

3) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌      4) కేరళ, కర్ణాటక, గుజరాత్‌


సమాధానాలు: 1 - 3;  2 - 2;  3 - 1;  4 - 2;  5 - 3 

Posted Date : 23-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌