• facebook
  • whatsapp
  • telegram

కర్ణాటక యుద్ధాలు

భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లాఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగలు సుభాగా, హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో సంభవించిన అంతర్యుద్ధంలో బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌వారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిష్‌వారు ఫ్రెంచ్‌వారిపై ఆధిపత్యం సాధించారు.

మొదటి కర్ణాటక యుద్ధం (1745-48)

ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో ఆంగ్లేయులకు, ఫ్రెంచ్‌వారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచ్ పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం మద్రాసును ఆక్రమించింది.  ఆంగ్లేయులు తమను ఫ్రెంచ్‌వారి నుంచి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచ్‌వారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచ్‌వారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతోపాటు భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.

రెండో కర్ణాటక యుద్ధం (1749-54)

వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్‌లో నాజర్ జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్ తర్వాత అతడి కుమారుడు మహ్మద్ అలీకి మద్దతిచ్చారు.

* 1749 లో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహ్మద్ అలీ వశమైంది.

మూడో కర్ణాటక యుద్ధం (1758-63)

ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760 లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు.

* ఫ్రెంచ్‌వారి స్థానంలో బ్రిటిష్‌వారు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763 లో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య సంధి కుదిరింది.

ప్లాసీ యుద్ధం - 1757 (బెంగాల్ ఆక్రమణ)

కారణాలు:

* కంపెనీ అధికారులు దస్తక్/ ఉచిత పాసులను దుర్వినియోగం చేయడం.

*  యువ నవాబు సిరాజుద్దౌలా తన పూర్వీకుల్లా తాను కూడా ఆంగ్లేయులపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

*  బ్రిటిష్‌వారు నవాబు ఆజ్ఞలకు విరుద్ధంగా కలకత్తాలో కోటలు నిర్మించడం.

*  ప్లాసీ (పలాసీ) అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ 1757 జూన్ 23 న బ్రిటిష్ సైన్యానికి, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజుద్దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్‌మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు - మీర్ జాఫర్, యార్ లుతుఫ్ ఖాన్, రాయ్ దుర్లబ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రేక్షకపాత్ర వహించారు.

* ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి భారతదేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది.

బక్సర్ యుద్ధం (1764)

కారణాలు:

* సార్వభౌమాధికారం కోసం ఆంగ్లేయులు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం మధ్య తలెత్తిన పోరు.

* 1717 లో మొగలులు జారీచేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.

* నవాబు అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.

నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదకరంగా ప్రవర్తించడం.

బక్సర్ అనే ప్రదేశం పట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ 1764 అక్టోబరు 22 న మేజర్ హెక్టార్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు, మీర్ ఖాసిం, అవధ్ నవాబు షూజా ఉద్దౌలా, రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య యుద్ధం జరిగింది.

* ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిష్‌వారి విజయానికి ప్రధాన కారణం.

ఫలితాలు:

* బెంగాల్, బిహార్, ఒడిశాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన.

* అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారడం.

* మొగల్ చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు.

* కంపెనీ ఔన్నత్యం పెరిగింది.

మైసూరు యుద్ధాలు

* మొదటి మైసూరు యుద్ధం (1766-69): మైసూరు పాలకుడు హైదర్ ఆలీ బ్రిటిష్‌వారిని కర్ణాటక ప్రాంతం నుంచి, చివరకు భారతదేశం నుంచి తరిమివేయాలని భావించాడు. హైదర్ ఆలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిష్‌వారు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిష్‌వారిపై విజయం సాధించిన హైదర్ ఆలీ మద్రాసుకు 5 కి.మీ దూరం వరకు దండయాత్ర కొనసాగించాడు. 1769 లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

రెండో మైసూరు యుద్ధం (1780 - 84):

మరాఠాలు 1771 లో హైదర్ ఆలీపై దాడి చేసినప్పుడు బ్రిటిష్‌వారు హైదర్ ఆలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.

* అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదరాలీ మిత్రదేశమైన ఫ్రాన్స్‌కు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ ఆలీ ఆధీనంలోని ఫ్రెంచ్ భూభాగమైన మహేను బ్రిటిష్‌వారు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు.

* ఈ యుద్ధంలో 1780 లో కల్నల్ బైలీని హైదర్ ఆలీ ఓడించాడు. 1781 లో పోర్టో నోవో యుద్ధంలో ఐర్‌కూట్ చేతిలో హైదర్ ఆలీ పరాజయం పొందాడు.

* 1782 లో హైదర్ ఆలీ కల్నల్ బ్రైత్‌వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం 1784 లో జరిగిన మంగళూరు సంధితో ముగిసింది.

మూడో మైసూరు యుద్ధం (1790 - 92):

అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం, టర్కీ, ఫ్రాన్స్‌లకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం, బ్రిటిష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను టిప్పుసుల్తాన్ ఆక్రమించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు.

* ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు.

1792 లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో మూడో మైసూరు యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పుసుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాలను బ్రిటిష్‌వారికి ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి, రూ.1.6 కోట్లు వెంటనే చెల్లించాడు

నాలుగో మైసూరు యుద్ధం (1799):

తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టిప్పు సుల్తాన్ భావించడం, కొత్త బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలని భావించడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు.

ఈ యుద్ధం సందర్భంగా 1799 మేలో శ్రీరంగ పట్టణంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నర్ జనరల్ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815 లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి వడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి, మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌