క్రీ.శ.18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనతో భారతదేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ.1453లో తురుష్కులు కాన్స్టాంట్నోపుల్ను ఆక్రమించుకున్నారు. ఫలితంగా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోయింది. నూతన మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నించిన తొలి ఐరోపా దేశం పోర్చుగల్.
* పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా సముద్రంపై ప్రయాణించి, సముద్ర మార్గాన్ని భౌగోళిక పటంగా (పోర్టోలనీ) రూపొందించాడు. స్వయంగా నావికా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు. కాబట్టి హెన్రీని 'ది నావిగేటర్' బిరుదుతో పిలుస్తారు.
* హెన్రీ ఆర్థిక సహాయంతో బార్తోలోమ్యూ డియాస్ (Bartolomeu Dias) తుపానుల అగ్రం/ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ను కనుక్కున్నాడు.
* తర్వాత హెన్రీ కుమారుడు రెండో జాన్ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ వరకూ వెళ్లి, దానికి కేప్ ఆఫ్ గుడ్హోప్ అనే పేరు పెట్టాడు.
పోర్చుగీసువారు
* 1498, మే 17న వాస్కోడిగామా భారతదేశానికి వచ్చి, కాలికట్ పాలకుడు జామెరిన్ను కలిసి వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు.
* వాస్కోడిగామాకు అబ్దుల్ వాజిద్ (అబ్దుల్ అజీజ్) అనే గుజరాత్ నావికుడు సహాయపడ్డాడు.
* ఆధునిక యుగంలో భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశంగా పోర్చుగల్ను పేర్కొంటారు.
* కాలికట్లో పోర్చుగీసువారు తమ తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* వాస్కోడిగామా రెండోసారి 1502లో భారతదేశానికి వచ్చాడు.
* పోర్చుగల్ దేశ ప్రతినిధిగా/అధికారిగా వచ్చిన కాబ్రల్ కొచ్చిన్, క్రాంగనూర్ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
* 1505 - 09 మధ్య గవర్నర్గా పనిచేసిన డీ ఆల్మడా నౌకా వ్యాపార అభివృద్ధి కోసం నీలి నీటి విధానాన్ని (Blue water policy) ప్రవేశ పెట్టాడు. కన్ననూర్ వద్ద ఒక కోటను నిర్మించాడు.
* ఆల్బూకర్క్ అనే పోర్చుగీసు గవర్నర్ సొకొట్ర, ఆర్ముజ్, డయ్యూ, మలక్కా, గోవా, మాకోలు రేవులను ఆక్రమించి ''భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత''గా పేరుగాంచాడు.
* 1510లో ఆల్బూకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని బీజపూర్ పాలకుడిని ఓడించి, గోవాను ఆక్రమించాడు.
* భారతదేశంలో పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరం గోవా.
పోర్చుగీసువారు ఆక్రమించిన వివిధ ప్రాంతాలు
సంవత్సరం ప్రాంతం పేరు
1511 మలక్కా
1515 ఆర్ముజ్
1518 కొలంబో
1534 డయ్యూ
1538 డామన్, నాగపట్నం
* చిట్టగాంగ్, హుగ్లీ, శాంథోమ్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్తక స్థావరాలను స్థాపించారు.
* గోవాకు వెళ్లిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు సర్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు వాడే.
* భారతదేశంలో 1556లో తొలి అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టింది కూడా పోర్చుగీసువారే.
* పొగాకు, మిరప, మొక్కజొన్న లాంటి పంటలను భారతీయులకు పరిచయం చేసింది పోర్చుగీసువారే.
* 1534లో గుజరాత్ పాలకుడు బహదూర్షా నుంచి బొంబాయిని పొందిన పోర్చుగీసువారు 1661లో దాన్ని ఆంగ్లేయులకు అద్దెకు ఇచ్చారు. (ఏడాదికి 10 పౌండ్లు).
* పోర్చుగీసు వారి సహాయంతోనే విజయనగర రాజులు అశ్విక దళాన్ని, గుజరాత్ పాలకులు ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నారు.
* 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై వాణిజ్య ఆధిపత్యాన్ని పొందిన పోర్చుగీసువారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి, క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.
* షాజహాన్ 'హుగ్లీ' స్థావరాన్ని, ఔరంగజేబ్ 'చిట్టగాంగ్' స్థావరాన్ని పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
* 1961లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ విజయ్' పేరుతో సైనిక చర్య జరిపి, పోర్చుగీసు వారి నుంచి గోవాను ఆక్రమించుకుంది.
* భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశీయులుగా, భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపా దేశీయులుగా పోర్చుగీసువారు గుర్తింపు పొందారు.
డచ్వారు (నెదర్లాండ్స్/ హాలెండ్)
* డచ్వారు 1602లో 'యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్'ను స్థాపించారు.
* 1605లో డచ్వారు మచిలీపట్నం వచ్చి, నాటి గోల్కొండ పాలకుడు మహ్మద్ కులీకుతుబ్షా సహాయంతో భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
* వీరు పులికాట్ (1610), సూరత్ (1616), భీమునిపట్నం (1641), చిన్సురా (1653); కాశింబజార్, నాగపట్నం, కొచ్చిన్లలో వర్తక స్థావరాలను స్థాపించారు.
* భారతదేశంలో డచ్వారి తొలి ప్రధాన వర్తక కేంద్రం పులికాట్. కానీ 1690లో వారు తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని నాగపట్నానికి మార్చుకున్నారు. (నోట్: భారతదేశంలో డచ్వారి ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నం అని గుర్తించాలి.)
* 1658లో డచ్వారు పోర్చుగీసు వారిని ఓడించి, సింహళాన్ని (శ్రీలంక) ఆక్రమించారు.
* 1623 నాటి అంబోయినా వధ ఆంగ్లేయులకు, డచ్చివారికి మధ్య వైరాన్ని పెంచింది.
* అంబోయినా వధ కాలంలో డచ్ గవర్నర్ హెర్మన్ వాన్స్పెల్ట్ (Herman van Speult).
* డచ్వారు వాన్లిచ్చ్టన్ అనే అన్వేషకుడి రాతలు/రచనల వల్ల ప్రభావితమై భారతదేశానికి వచ్చారు.
* చివరికి డచ్వారు ఇండోనేషియాను తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు.
* సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి వస్త్ర వ్యాపారం దిశగా దృష్టి మరల్చిన తొలి ఐరోపా దేశం డచ్ నెదర్లాండ్స్.
డేన్లు (డెన్మార్క్)
* డెన్మార్క్వారు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని తమిళనాడులోని ట్రాంక్వీబార్లో ఏర్పాటు చేసుకున్నారు.
* భారతదేశంలో డేన్ల ప్రధాన వర్తక స్థావరం బెంగాల్లోని సేరాంపూర్.
* క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేసిన ప్రధాన ఐరోపా దేశం డెన్మార్క్ (డేన్స్).
* డేన్లు 1845లో భారతదేశంలోని తమ వర్తక స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు అమ్మేసి తమ దేశం వెళ్లిపోయారు.
* ఆంగ్లేయులు 1626లో గోవాలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.
* 1615 - 16 మధ్య సర్ థామస్ రో అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానానికి వచ్చి, వ్యాపార అనుమతి పొందాడు. ఫలితంగా ఆంగ్లేయులు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని సూరత్లో ప్రారంభించారు.
* ఫాదర్ స్టీఫెన్స్ అనే క్రైస్తవ మతాచార్యుడు ఎలిజబెత్ రాణి కాలంలో తొలిసారిగా భారతదేశానికి వచ్చాడు (1579).
* ఆంగ్లేయులు 1600లో 'ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లండ్'ను స్థాపించుకున్నారు.
* ఎలిజబెత్ రాణి రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని మంజూరు చేసింది.
* అక్బర్ కాలంలో జాన్న్యూబెరి, విలియం రీడ్స్ అనే నగల వ్యాపారులు; జేమ్స్స్టోరీ అనే చిత్రకారుడు, రాల్ఫ్పిఛ్ అనే రాయబారి భారతదేశాన్ని సందర్శించారు.
* 1599 - 1605 మధ్య జాన్మిండెన్ హాల్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో ఉన్నాడు.
* 1608లో విలియం హాకిన్స్ అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు.
* 1611లో 'గ్లోబ్' నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో ఆంగ్లేయులు మచిలీపట్నం వచ్చి మహ్మద్ కులీకుతుబ్షా అనుమతి పొందారు (స్థావరం ఏర్పాటు చేయలేదు).
* 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ప్రతినిధి 2 గ్రామాలను దామెర్ల సోదరుల నుంచి కొనుగోలు చేసి, సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. ఆ ప్రాంతమే చెన్నపట్నంగా ప్రసిద్ధి చెందింది.
* 1633లో ఆంగ్లేయులు రాల్ఫాకార్ట్రైట్ కృషి వల్ల ఒరిస్సాలోని హరిహరపురంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు.
* బ్రాడ్మన్ అనే ఆంగ్లేయుడి కృషి ఫలితంగా 1651లో హుగ్లీలో ఆంగ్లేయుల వర్తక స్థావరం ఏర్పాటైంది.
* గాబ్రియల్ బౌటన్ అనే ఆంగ్ల వైద్యుడు షాజహాన్ నుంచి పొందిన ప్రాంతంలో జాబ్ చార్నక్ 'పోర్టు విలియం కోట'ను నిర్మించాడు (1699).
* ఆంగ్లేయులు మొగలుల నుంచి సుతనుతి, కాశీఘట్టం, గోవింద్పూర్ గ్రామాలను పొంది, వాటిని కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు.
* కడలూరు (తమిళనాడు)లో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు.
* ఆంగ్లేయులు 1682లో విశాఖపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* 1717లో విలియం హామిల్టన్ అనే ఆంగ్ల వైద్యుడు మొగల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియర్ వ్యాధిని నయంచేసి, గోల్డెన్ ఫర్మానా ద్వారా అనేక రాయితీలు పొందాడు.
* జెరాల్డ్ ఆంగియర్ అనే ఆంగ్లేయుడు బొంబాయిని గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు.
* భారతదేశంలో ఆంగ్లేయులు మద్రాస్లోని సెయింట్ జార్జికోటను తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు.
ఫ్రెంచివారు (ఫ్రాన్స్)
* 1656లో బెర్నియార్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఔరంగజేబ్ రాజ్యాన్ని, ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు.
* ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో 14వ లూయీ అనుమతితో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు.
* 1668లో ఫ్రాంకోయిస్ కరోన్ అనే వ్యక్తి ఔరంగజేబ్ అనుమతితో సూరత్లో తొలి వర్తక స్థావరాన్ని స్థాపించాడు.
* 1669లో ఫ్రెంచివారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అధికారి వాలి కొండాపురం ప్రాంతాన్ని పొంది అక్కడ పుదుచ్చేరి/పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు.
* భారతదేశంలో ఫ్రెంచివారి ప్రధాన వర్తక స్థావరం పుదుచ్చేరి/పాండిచ్చేరి.
* ఫ్రెంచివారు షయిస్తాఖాన్ నుంచి పొందిన బాలాసోర్, కాశింబజార్, చంద్రనగర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను నిర్మించారు.
* భారతదేశంలో ఫ్రెంచి ప్రతినిధులుగా లె నోయిర్, డ్యూమాస్, డూప్లే లాంటి వ్యక్తులు పనిచేశారు.
* లె నోయిర్ మాహె, యానాం (1729) ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
* డ్యూమాస్ మొగల్ చక్రవర్తి నుంచి 'నవాబ్' అనే బిరుదును పొందాడు.
* డూప్లే భారతదేశంలో ఫ్రెంచి వలస రాజ్య నిర్మాతగా పేరుపొందాడు.
* కానీ ఆంగ్లేయులు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచివారిని ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారు.
* ఫ్రెంచివారి అధీనంలో ఉన్న యానాం, పాండిచ్చేరి ప్రాంతాలను భారత ప్రభుత్వం 1956లో ఆక్రమించుకుంది.
ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టాల్లో ఐరోపావారి రాక ఒకటి. పోర్చుగీసువారు, డచ్చివారు, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు... ఈ నలుగురి రాకతో భారతదేశంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తురుష్కులు క్రీ.శ. 1453లో కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో పాశ్చాత్యులు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని అన్వేషించాల్సి వచ్చింది. పోర్చుగల్కు చెందిన ప్రిన్స్ హెన్రీ నూతన సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అదే దేశానికి చెందిన బార్తులో మ్యుడియాజ్ 1487లో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఆఫ్రికాలోని గుడ్హోప్ ఆగ్రం చేరుకున్నాడు.
వాస్కోడిగామా 1498, మే 21న మలబార్ తీరంలోని కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు. ఈ సంఘటన భారతదేశంలో ఐరోపావారికి వర్తక కార్యకలాపాలు విస్తరించడానికి మాత్రమే కాకుండా ఇంగ్లండ్ అధిపత్యానికి కూడా దారితీసింది.
కాలికట్కు చెందిన హిందూ రాజు జమోరిన్ వాస్కోడిగామాను సాదరంగా ఆహ్వానించాడు. కాలికట్ ఆ రోజుల్లో సుసంపన్న రాజ్యంగా ఉండేది. జమోరిన్ అన్ని తరగతుల వర్తకుల పట్ల దయ కలిగి ఉండేవాడు. అందరిపట్ల సహనం చూపిస్తూ వ్యాపార విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మలబార్ తీరంలోని ఓడరేవులు అన్నింటిలో కొచ్చిన్ ఉత్తమమైంది. ఈ ఓడరేవు మిరియాలను ఉత్పత్తి చేసే జిల్లాలతో అనుసంధానమై ఉండేది. కాలికట్ పాలకుడు జమోరిన్కు సామంతుడిగా ఉండేవాడు. వాస్కోడిగామా తూర్పు ఆఫ్రికాకు చెందిన అరబ్బు వర్తకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. వాస్కోడిగామా 1499లో పోర్చుగల్కు తిరిగి వెళ్లాడు. వాస్కోడిగామా తర్వాత క్రీ.శ.1500లో అల్యరెజ్ కాబ్రల్ భారతదేశానికి వచ్చాడు. ఇతడు అరబ్బులకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుని జమోరిన్కు బహుమతిగా ఇచ్చాడు.
కాబ్రల్ కాలంలో అరబ్బులు పోర్చుగీసు వర్తక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఇతడికి కన్ననూరు, కొచ్చిన్ పాలకుల మద్దతు లభించింది. 1502లో వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి వచ్చాడు. వాస్కోడిగామా ముస్లింలందరినీ కాలికట్ నుంచి తరిమేయాలని జమోరిన్ను డిమాండు చేశాడు. కొచ్చిన్ పోర్చుగీసు వారి మొదటి రాజధాని.
1505లో ఫ్రాన్సిస్కో డి అల్మైడాను భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నరుగా నియమించారు. పోర్చుగీసు వారు దక్షిణభారత దేశంలోని ఓడరేవులపై తమ ఆధిపత్యాన్ని ఉత్తర భారతదేశ ఓడరేవులపైకి విస్తరిస్తారని బీజాపూర్, గోల్కొండ సుల్తానులు భయపడ్డారు. దీంతో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పోర్చుగీసువారికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అల్మైడా 1508లో జరిగిన చౌల్ యుద్ధంలో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పాలకుల కూటమి చేతిలో ఓడిపోయాడు. ఈ యుద్ధంలో అల్మైడా కుమారుడు కూడా మరణించాడు. అల్మైడా 1509 లో ఈ కూటమిని డయ్యూ యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు.
1509లో అల్బూకర్క్ను గవర్నర్గా నియమించారు. పర్షియన్ సింధుశాఖ ఎర్రసముద్రంపై నియంత్రణ కలిగి ఉండటం, పోర్చుగీసు వారి ప్రధాన స్థావరాన్ని పశ్చిమ తీరం మధ్య భాగంలో ఏర్పాటు చేయడం, మలయ ద్వీపకల్పంలో అరబ్బుల వర్తకాన్ని ధ్వంసం చేయడం అల్బూకర్క్ తన లక్ష్యంగా చేసుకున్నాడు. అల్బూకర్క్ బీజపూర్ సుల్తాన్ అదిల్ షా నుంచి 1510లో గోవాను ఆక్రమించాడు. గోవా మలబార్ తీరంలోని ఓడరేవులకు, గుజరాత్కు మధ్యలో ఉంది. కాంబే సింధుశాఖ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఓడరేవుల్లో గోవా ప్రముఖ ఓడరేవుగా ఉంది. అల్బూకర్క్ అల్మైడా లక్ష్యాలను సాధించడంలో కృతకృత్యుడయ్యాడు. ఇతడు భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసువారు భారతీయ స్త్రీలను వివాహమాడేలా ప్రోత్సహించాడు. తన కాలంలో విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు.
1529లో గవర్నర్గా నియమితుడైన నునోడ కన్హాగుజరాత్ సుల్తాన్ బహదూర్షా నుంచి డయ్యూను ఆక్రమించాడు. ఇతడి కాలంలో చెన్నై దగ్గర శాన్థోమ్, బెంగాల్లోని హుగ్లీ వద్ద వర్తక స్థావరాలను ఏర్పాటుచేశారు.
భారతదేశంలో చివరి గొప్ప పోర్చుగీసు గవర్నరు డికాస్ట్రో. ఇతడి కాలంలో పోర్చుగీసువారి రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మారింది. ప్రసిద్ధి చెందిన క్రైస్తవమత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో గోవాకు వచ్చాడు.
పోర్చుగీసు వారి పతనం: క్రీ.శ.16వ శతాబ్దం చివరి నాటికి పోర్చుగీసు వారి పతనం ప్రారంభమైంది. వారు భారతదేశంలో వర్తక స్థావరాలను క్రమంగా కోల్పోయారు. క్రీ.శ.1631లో హుగ్లీ మొగలుల వశమైంది. క్రీ.శ.1661లో పోర్చుగల్ రాజు తన సోదరిని వివాహం చేసుకున్న ఇంగ్లండ్ రాజు రెండో చార్లెస్కు కట్నం కింద బొంబాయిని ఇచ్చాడు. 1739లో మరాఠాలు సాల్శెట్టి, బుస్సైన్లను ఆక్రమించారు. చివరికి పోర్చుగీసు వారికి భారతదేశంలో గోవా, డయ్యూ, డామన్ మాత్రమే మిగిలాయి.
పోర్చుగీసువారి పతనానికి కారణాలు:
* 1580లో పోర్చుగల్ స్పెయిన్ వశమైంది. స్పెయిన్ రాజు రెండో ఫిలిప్ భారతదేశంలో పోర్చుగీసు భూభాగాలపై శ్రద్ధ వహించలేదు.
* స్పెయిన్ రాజు పోర్చుగల్ను ఖరీదైన ఐరోపా యుద్ధాల్లో భాగస్వామిని చేశాడు.
* పోర్చుగల్ చిన్న దేశం కాబట్టి సుదూర వలసలను నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చలేకపోయింది. పోర్చుగీసువారు పటిష్టమైన పరిపాలన విధానాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు.
* హుగ్లీలోని పోర్చుగీసు వారి స్థావరాన్ని మొగలులు ధ్వంసం చేశారు.
* చిట్టగాంగ్ను మొగలులు ఆక్రమించడంతో బెంగాలులో పోర్చుగీసు వారి ప్రాబల్యం అంతమైంది.
* పోర్చుగీసు వారి పరమత ద్వేషం, వారి పరిపాలనలో అవినీతి.
* ఇంగ్లిష్, ఫ్రెంచి, డచ్చి వర్తక కంపెనీల విజృంభణ.
డచ్చివారు
క్రీ.శ.1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ ఏర్పాటైంది. ఈ కంపెనీకి భారత్లో వ్యాపారం చేయడానికి, యుద్ధాలు చేయడానికి, భూభాగాలు ఆక్రమించడానికి, సంధి కుదుర్చుకోవడానికి, కోటలు నిర్మించడానికి అనుమతి లభించింది.
డచ్చివారు మొదటి శాశ్వత వర్తక స్థావరాన్ని 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొంది 1610లో పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1617 నుంచి పులికాట్ డచ్చివారి ప్రధాన కేంద్రమైంది. తర్వాత బొంబాయి, అహ్మదాబాద్, బుర్హాన్పూర్, బ్రోచ్లలో స్థావరాలను ఏర్పాటు చేశారు. బెంగాల్లో మొదటి డచ్చి స్థావరాన్ని పిప్లిలో స్థాపించారు.
పోర్చుగీసువారిని భారతదేశ సముద్ర వ్యాపారం నుంచి తప్పించిన ఘనత డచ్చివారికే దక్కింది. భారతీయ వస్త్రాల ఎగుమతిని పెంపొందించడంలో డచ్చివారు ప్రముఖ పాత్ర వహించారు. దేవానాంపట్నంలోని డచ్చివారి స్థావరం ఆంగ్లేయుల కాలంలో సెయింట్ డేవిడ్ కోటగా ప్రసిద్ధి చెందింది.
పతనానికి కారణాలు
* డచ్చివారికి వ్యతిరేకంగా ఆంగ్లేయుల నౌకాబలం అభివృద్ధి.
* డచ్చివారి కేంద్రీకృత అధికార విధానం.
* డచ్చివారికి భారతదేశంలో ప్రధాన కేంద్రం లేకపోవడం.
* కంపెనీ అధికారుల్లో అవినీతి పెరగడం.
* 1623లో అంబోయినా వద్ద ఆంగ్లేయులపై దురాగతం.
స్వాతంత్య్రోద్యమం ప్రత్యేకాంశంగా ఆధునిక భారతదేశ చరిత్ర!
ఆంగ్లేయులు
మొదటి ఎలిజబెత్ పాలన చివరి నాటికి భారతదేశంలో వర్తకం చేసుకునేందుకు కంపెనీకి ఎలిజబెత్ 15 ఏళ్లపాటు అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన చార్టరును 1600 సంవత్సరం డిసెంబరు 31న జారీ చేశారు. ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సుగంధద్రవ్యాలు, మిరియాల వ్యాపారంపై దృష్టిపెట్టింది. మొదటి జేమ్స్ కాలంలో విలియం హాకిన్స్ జహంగీర్ ఆస్థానానికి వచ్చి 1608 నుంచి 1611 వరకు అక్కడే ఉన్నాడు. మిడిల్టన్ సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి 1611లో మొదటిసారిగా అనుమతి పొందాడు. సర్ జేమ్స్ థామస్ రో గుజరాత్లో కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి 1611లో జహంగీర్ నుంచి అనుమతి పొందడంలో సఫలీకృతుడయ్యాడు.
మొగలులతో విరోధం: 1688లో ఎర్రసముద్రంలో మొగలులకు చెందిన కొన్ని నౌకలను సముద్రపు దొంగలు ఆక్రమించారు. దీంతో సూరత్లోని మొగల్ గవర్నరు కంపెనీ అధికారి సర్ జాన్ చైల్డ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఆంగ్లేయులను విరోధులుగా గుర్తించాలని ప్రకటన జారీ చేశాడు. అనేకమంది ఆంగ్లేయులను నిర్బంధించి అవమానించాడు. దీంతో సర్ జాన్ చైల్డ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. ఈ సంధి ప్రకారం ఆంగ్లేయులు మొగలులకు చెల్లించాల్సిన బకాయిలను, మొగలులకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించాలి. సంధి షరతుల్లో భాగంగా జాన్ చైల్డ్ భారతదేశం వదలి వెళ్లాలి.
వర్తక స్థావరాల ఏర్పాటు
పశ్చిమ తీరం: ఆంగ్లేయులు 1619 నాటికి ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బొంబాయిల్లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఇవి సూరత్ నియంత్రణలో ఉండేవి. 1668లో రెండో చార్లెస్ నుంచి బొంబాయిని కంపెనీ లీజుకు తీసుకుంది. గెరాల్డ్ ఆంగియర్ 1669 నుంచి 1677 వరకు మొదటి గవర్నర్గా పనిచేశాడు. 1687లో పశ్చిమ తీర ప్రధాన కేంద్రాన్ని సూరత్ నుంచి బొంబాయికి మార్చారు.
ఆగ్నేయ తీరం: మచిలీపట్నంలో పులికాట్ దగ్గర ఆర్మగాంవ్లో స్థావరాలను నెలకొల్పారు. 1639లో ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుంచి మద్రాసును కొనుగోలు చేశాక అక్కడ సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. దీని తర్వాత తూర్పు తీర ప్రధాన కేంద్రాన్ని మచిలీపట్నం నుంచి మద్రాసుకు మార్చారు. 1658లో తూర్పు తీరంలోని అన్ని స్థావరాలను (బెంగాల్, బీహార్, ఒరిస్సా) సెయింట్ జార్జ్ కోట ఆధీనంలో ఉంచారు.
తూర్పు ఇండియా: బెంగాల్, ఒరిస్సాలోని హరిహరపూర్, బాలాసోర్, హుగ్లీ, పాట్నా, ఢాకా, ఖాసింబజార్లలో స్థావరాలను స్థాపించారు. 1690లో జాబ్ చార్నాక్ సుతనుతి వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 1689లో సుతనుతి, కాలికట, గోవిందపూర్ గ్రామాల జమిందారీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. తర్వాత ఈ మూడు గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు. సుతనుతి వద్ద విలియం కోటను నిర్మించారు. 1700లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని స్థావరాలను విలియం కోట ఆధీనంలోకి తీసుకువచ్చారు.
ఫ్రెంచివారు
ఫ్రెంచి చక్రవర్తి పద్నాలుగో లూయీ తన మంత్రి కోల్బర్ట్ ప్రోత్సాహంతో 1664లో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. ఇంగ్లిష్ కంపెనీ ప్రైవేటుది కాగా ఫ్రెంచి కంపెనీ ప్రభుత్వానికి చెందింది. 1667లో సూరత్లోని ఫ్రాంకోయిస్ కారన్ మొదటి ఫ్రెంచి వర్తక స్థావరాన్ని స్థాపించాడు. వలికొండాపురం గవర్నరైన షేర్ఖాన్ లోడి నుంచి ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరిని పొందాడు. 1690లో బెంగాల్లోని చంద్రనగర్ను మొగల్ గవర్నరు నుంచి పొందాడు.
ఫ్రాంకోయిస్ మార్టిన్ భారతదేశంలో మొదటి ఫ్రెంచి డైరెక్టర్ జనరల్గా నియమితుడయ్యాడు. పాండిచ్చేరిలో లూయిస్ కోటను నిర్మించాడు. క్రీ.శ.1706-1720 మధ్య భారత్లో ఫ్రెంచివారి అధికారం క్షీణించింది. దీంతో 1720లో ఫ్రెంచి కంపెనీని పునర్వ్యవస్థీకరించారు. లెనాయిడ్, డ్యూమాస్ క్రీ.శ.1720-1742 మధ్య తిరిగి ఫ్రెంచివారి అధికారాన్ని పునరుద్ధరించారు. వీరు మలబారు తీరంలోని మహే, కోరమాండల్ తీరంలోని యానాం, తమిళనాడులో కరైకాల్ను ఆక్రమించారు.
1742లో ఫ్రెంచి గవర్నర్గా డూప్లేను నియమించడంతో ప్రారంభమైన ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాలు ఫ్రెంచివారి ఓటమితో ముగిశాయి.
రచయిత: బొత్స నాగరాజు