* బౌద్ధసాహిత్యం ప్రకారం, మౌర్యుల జన్మస్థానంలో ‘నెమళ్లు’ అధికంగా ఉండటం వల్ల ‘మౌర్య’ అనే పేరు వచ్చింది.
* ముద్రారాక్షసం, విష్ణుపురాణం ప్రకారం చంద్రగుప్తుడి తల్లి ‘ముర’. ఆమె పేరు మీదే ఈ వంశానికి మౌర్య అనే పేరు వచ్చింది.
* గ్రీకు చరిత్రకారుడు జస్టిన్ ప్రకారం చంద్రగుప్తుడు సామాన్య కుటుంబానికి చెందినవాడు. ముద్రారాక్షసంలో ఇతడ్ని కులహీనుడిగా, వృషలుడి (శుద్రుడు)గా అభివర్ణించారు.
* బౌద్ధగ్రంథాల ప్రకారం ‘మెరియ’ నుంచి ‘మౌర్య’ వచ్చింది.
*మహావంశం (బౌద్ధగ్రంథం), పరిశిష్టపర్వం (జైనగ్రంథం) గ్రంథాల్లో మౌర్యులను క్షత్రియులుగా పేర్కొన్నారు.
చంద్రగుప్త మౌర్యుడు
* ఈయన క్రీ.పూ. 322 నుంచి క్రీ.పూ. 298 వరకు రాజ్యపాలన చేశాడు.
* జైన సాహిత్యంలో చంద్రగుప్తుడు ఒక గ్రామాధికారి కుమారుడని ఉంది; ఇతడు నందరాజుకు, శూద్ర స్త్రీకి పుట్టాడని కొంతమంది చరిత్రకారుల భావన.
* చంద్రగుప్తుడి తండ్రి చిన్నతనంలో మరణించాడు.
* చంద్రగుప్తుడిలోని ప్రతిభను గుర్తించిన కౌటిల్యుడు, ముర సమ్మతితో అతడ్ని తక్షశిలకు తీసుకెళ్లి అక్కడ అనేక విద్యలు నేర్పించాడు.
* కౌటిల్యుడు తనను అవమానించిన నందరాజును ఓడించాలని గురుదక్షిణగా కోరతాడు.
* నందరాజును ఓడించేందుకు చంద్రగుప్తుడు పంజాబ్లో ఉన్న అలెగ్జాండర్ సాయం కోరాడు. దీనికి అతడు నిరాకరించి చంద్రగుప్తుడ్ని బంధించాలని ప్రయత్నించాడు. గ్రీకు రచయిత ప్లూటార్క్(Plutarch) రాసిన ‘లైఫ్ ఆఫ్ అలెగ్జాండర్’ గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.
*క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించాక, పంజాబ్లో అలజడి చెలరేగింది. కాందహార్లో తిరుగుబాటురాగా, పంజాబ్ గవర్నర్ ‘ఫిలిప్సన్’ను హత్య చేశారు.
*సింధులో గ్రీకుల అధికారం నామమాత్రం అయ్యింది.
* ఈ పరిస్థితులను చంద్రగుప్తుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు.
* స్థానిక తెగలతో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, పర్వతరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
* వాయవ్య భారతదేశంపై దండెత్తి ‘పంజాబ్’ను ఆక్రమించాడు.
* క్రీ.పూ. 322లో చాణక్యుడి ఆదేశం మేరకు పాటలీపుత్రాన్ని ఆక్రమించి, చివరి నందరాజైన ధననందుడ్ని వధించి తనను మౌర్య చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
* అలెగ్జాండర్ భారత్లో ఆక్రమించిన భూభాగాన్ని, అతడి మరణం తర్వాత అలెగ్జాండర్ సేనానులు పంచుకున్నారు.
* తూర్పు భాగాలైన పంజాబ్, సింధును ఆక్రమించడానికి కీ.పూ. 305లో సెల్యుకస్ నికేటర్ (అలెగ్జాండర్ సర్వసేనాని, బాక్ట్రియా పాలకుడు) భారతదేశంపైకి దండెత్తి వచ్చాడు. అతడు చంద్రగుప్తుడి చేతిలో ఓడి, సంధి కుదుర్చుకున్నాడు.
* దీని ప్రకారం సెల్యుకస్ తన కుమార్తె ‘హెలెనా’ని చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాక హీరట్, కాబూల్, కాందహార్, బెలూచిస్థాన్ రాష్ట్రాలను; 500 ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు.
* సెల్యుకస్ తన రాయబారిగా ‘మెగస్తనీస్’ని చంద్రగుప్తుడి ఆస్థానానికి పంపాడు.
* జస్టిన్ అనే గ్రీకు రచయిత ప్రకారం, చంద్రగుప్తుడు అవంతి, సౌరాష్ట్రలతోపాటు మొత్తం భారతదేశాన్ని జయించాడు.
* శకరుద్రదాముడు వేయించిన ‘జునాగఢ్ శాసనం’ ప్రకారం, సౌరాష్ట్ర చంద్రగుప్తుడి రాజ్యంలో భాగం.
*చంద్రగుప్త మౌర్యుడి గురించి తెలిపే మొట్టమొదటి ఆధారం ‘జునాగఢ్ శాసనం’.
* చంద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాక రాజ్య విస్తరణపై దృష్టి సారించాడు.
*అతడు పశ్చిమాన ఆక్మాస్ నది నుంచి తూర్పున బెంగాల్ వరకు; ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కర్ణాటకలోని ‘సిద్ధపురం’ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
* చోళ, చేర, పాండ్య, సత్యపుత్ర, కేరళ రాజ్యాలు మినహా యావత్ భారతదేశం మౌర్య సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది.
* ఇండికా గ్రంథం ప్రకారం, చంద్రగుప్తుడి సైన్యంలో ఆరు లక్షల పదాతిదళం, ముప్పై వేల అశ్వదళం, తొమ్మిది వేల గజదళం, ఎనిమిది వేల రథబలం ఉంది.
*గ్రీకులు చంద్రగుప్త మౌర్యుడ్ని ‘శాండ్రకొట్టాస్’, ‘ఫాలిబ్రోతస్’ అని పిలిచేవారు.
ఇతర అంశాలు:
* జునాగఢ్ శాసనం ప్రకారం చంద్రగుప్తుడి రాష్ట్రపాలకుడు ‘పుష్యగుప్తుడు’. వ్యవసాయాభివృద్ధికి ఇతడు జునాగఢ్లో సుదర్శన సరోవరాన్ని (తటాకాన్ని) నిర్మించాడు.
* చంద్రగుప్తుడు పరిపాలనలో పటిష్ఠ పాలనా యంత్రాంగాన్ని రూపొందించి, తనదైన ముద్ర వేశాడు.
* ‘పరిశిష్ట పర్వం’ అనే జైన గ్రంథం ప్రకారం మగధలో 12 సంవత్సరాలు క్షామం (కరవు) సంభవించింది. ఆ సమయంలో చంద్రగుప్తుడు తన కుమారుడైన ‘బిందుసారుడికి’ రాజ్యాధికారాన్ని అప్పగించాడు.
* జైన గురువు ‘భద్రబాహు’ బోధనలకు ప్రభావితుడైన చంద్రగుప్తుడు అతడితోపాటు కర్ణాటకలోని ‘శ్రావణబెలగొళ’కి వెళ్లి, అక్కడే జైనమతాన్ని స్వీకరించాడు. ‘సల్లేఖనవ్రతం’ (ఉపవాసం ఉండి, శరీరాన్ని కృశింపజేసుకోవడం) పాటించి నిర్యాణం పొందాడు.
*శ్రావణబెలగొళలో నేటికీ ఒక కొండను ‘చంద్రగిరి’ అని, జైన దేవాలయాన్ని ‘చంద్రగుప్తబసది’ అని పిలుస్తున్నారు.
* భారతదేశంలో మొట్టమొదటిసారి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సుస్థిర పాలన అందించి, విదేశీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించిన ఏకైక తొలి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు.
* ‘‘చరిత్రకు తెలిసిన ఘనులైన రాజుల్లో ఒకడిగా చంద్రగుప్తుడి కీర్తిని చాటిచెప్పొచ్చు’’ అని వి.ఎ.స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
బిందుసారుడు
* ఇతడు క్రీ.పూ.298 నుంచి క్రీ.పూ. 273 వరకు రాజ్యపాలన చేశాడు.
* ఇతడు చంద్రగుప్తుడి కుమారుడు. మౌర్య సామ్రాజ్యానికి రెండో చక్రవర్తి.
* బిందుసారుడు తన తండ్రి విస్తరించిన సామ్రాజ్యాన్ని సంరక్షించి, తూర్పు-పశ్చిమ సముద్రాల మధ్య ఉన్న 16 నగరాలను జయించాడని టిబెట్ చరిత్రకారుడు ‘తారానాథ్’ పేర్కొన్నాడు.
* ఇతనికి ‘అమిత్రఘాత’ (శత్రు సంహారి), ‘సింహసేనుడు’ (జైనగ్రంథం రాజవళికథ ప్రకారం) అనే బిరుదులు ఉన్నాయి.
* గ్రీకులు ఇతడ్ని ‘అమిత్రఖేట్స్’ అని పిలిచేవారు.
* కౌటిల్యుడు, ఖల్లాటకుడు, రాధాగుప్తుడు ఇతడి ప్రధానులుగా పనిచేశారు.
* బిందుసారుడు తక్షశిలకు సుశీనుడ్ని, ఉజ్జయినికి అశోకుడ్ని రాష్ట్రపాలకులుగా నియమించాడు.
* తక్షశిలలో పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగ్గా అశోకుడు అక్కడికి వెళ్లి దాన్ని అణచివేశాడు. దీంతో బిందుసారుడు తక్షశిలకు ప్రతినిధిగా అశోకుడ్ని నియమించాడు. అశోకవదనం, దివ్యవదనం గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయి.
* సిరియా రాజైన ఆంటియోకస్ సోతర్ తన రాయబారిగా ‘డమేఖస్’ను, ఈజిప్ట్ రాజు రెండో టాలమీ ఫిలడెల్పస్ తన రాయబారిగా ‘డయోనిసియస్’ను బిందుసారుడి ఆస్థానానికి పంపారు.
* బిందుసారుడు గ్రీకు, ఈజిప్ట్ దేశాలతో దౌత్య సంబంధాలు నెలకొల్పాడు.
* ఇతడి ఆస్థానంలో ‘పింగళివత్స’ అనే అజీవక సన్యాసి ప్రముఖ స్థానం పొందాడని ‘దివ్యవదనం’ గ్రంథంలో ఉంది.
* క్రీ.పూ.272లో బిందుసారుడు మరణించాక, నాలుగేళ్లపాటు సింహాసనం కోసం వారసుల మధ్య యుద్ధాలు జరిగాయి. చివరికి అశోకుడు విజయం సాధించి క్రీ.పూ.268లో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు.
చారిత్రక ఆధారాలు
అర్థశాస్త్రం:
* కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లో మౌర్యుల చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.
* ఇది మౌర్యుల కాలంనాటి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుపుతుంది.
* కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి. ఈయన్ను ‘ఇండియన్ మాఖియవెల్లి’ అంటారు.
* అర్థశాస్త్రంలో 6000 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని 15 భాగాలు, 18 ఉపభాగాలు, 150 ప్రకరణలుగా విభజించారు.
* శ్యామశాస్త్రి మొదటిసారి దీన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు.
* ఆర్థశాస్త్రంలో రాజనీతి, సంక్షేమపాలన, రాజుకు ఉండాల్సిన లక్షణాలు, ఇంకా మరెన్నో విషయాలను పొందుపరిచారు.
* కౌటిల్యుడికి ఉన్న ఇతర పేర్లు - ‘విష్ణుగుప్తుడు’, చాణక్యుడు’.
ఇండికా:
* గ్రీకు రచయిత మెగస్తనీస్ రచించిన ‘ఇండికా’ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి పాలన, నగర పాలనను వివరించారు.
* ఆనాటి సమాజంలో ఏడు వర్గాలు ఉన్నట్లు ఆ గ్రంథంలో ఉంది.
*ఇండికా గ్రంథం పూర్తి స్థాయిలో చరిత్రకారులకు లభించలేదు. అందులోని కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటి వరకు లభించాయి.
*మెగస్తనీస్, సెల్యుకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్తుడి ఆస్థానంలోకి వచ్చి, తాను స్వయంగా చూసిన విషయాలను గ్రంథ రూపంలో పొందుపరిచాడు.
ఇతర ఆధారాలు:
* అశోకుడి శిలా శాసనాల్లో మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వీటిని శిలా, స్తంభ, గుహ శాసనాలుగా వర్గీకరించారు. ఈ రకమైనవి దేశవ్యాప్తంగా 14 శిలాశాసనాలు లభించాయి. వీటిని బ్రహ్మీ, కరోష్ఠి లిపిలో రాశారు. ఇవి అశోకుడి దమ్మ విధానం, బౌద్ధమత సేవ, మౌర్యుల చరిత్రను తెలియజేస్తున్నాయి.
* విశాఖదత్తుడు రచించిన ‘ముద్రా రాక్షస గ్రంథం’లో మౌర్యుల ప్రస్తావన ఉంది. దీన్ని గుప్తుల కాలంలో రాశారు. చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్టించాడో ఇందులో ఉంది. అంతేకాక మౌర్యుల కాలం నాటి సమకాలీన పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి.
* సింహళదేశ (శ్రీలంక) బౌద్ధ గ్రంథాలైన దీపవంశం, మహావంశం; మహావంశంపై వ్యాఖ్యాన గ్రంథం వసంత ప్రకాశిని; టిబెట్కి చెందిన ‘లాయా-తారానాథ్’ రచనలు; కల్హణుడి ‘రాజతరంగిణి’; సోమదేవుడి ‘కథా సరిత్సాగరం’ మొదలైనవి మౌర్యుల చరిత్రను తెలియజేస్తున్నాయి.
* విదేశీ రచయితలైన స్ట్రాబో, డయోనిసియస్, ఫాహియాన్, హుయాన్ త్సాంగ్ తమ రచనల్లో మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించారు.
* బుద్ధుడి జాతక కథలు, హేమచంద్రుడి పరిశిష్టపర్వన్, పురాతన కట్టడాలు, నిర్మాణాలు, తవ్వకాల్లో లభించిన నాణేలు, శాసనాలు మొదలైనవి మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.