మొగలుల కాలంలో ఆస్థాన చరిత్రలతోపాటు అనువాదానికి కూడా ప్రాధాన్యం లభించింది. అక్బర్ మక్తబ్ ఖానా పేరుతో అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో హిందీ సాహిత్యం కూడా వికసించింది. తులసీదాస్ రచించిన రామ్ చరిత్ మానస్ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథమైంది. షాజహాన్ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహ్మదీయ మతాల సారాన్ని మజ్ మాఉల్బహ్రెయిన్ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషం.
ఫుతూహత్-ఎ-ఆలంగీరి: దీన్ని రాసింది ఈసర్ దాస్ నాగర్. ఇతడు ఔరంగజేబ్ ప్రతినిధిగా జోధ్పూర్లో పనిచేశాడు. ఔరంగజేబ్ మొదటి 34 ఏళ్ల పాలనా కాలపు విశేషాలు ఉన్న ఈ పుస్తకం ఆ కాలపు మొగల్, రాజపుత్రుల సంబంధాల గురించి ప్రధానంగా సాగింది.
నుష్కా-ఎ-దిల్కుషా: ఇది కూడా ఔరంగజేబ్ చరిత్రను తెలిపే రచనే. భీమ్సేన్ దీని రచయిత. ఇతడు మొగల్ మన్సబ్దారు దల్పత్ రావ్ బుందేలా దగ్గర పేష్కారుగా పనిచేశాడు. క్రీ.శ.1700 నుంచి ఔరంగజేబ్ సేనలు మహారాష్ట్రలో చేసిన పోరాటాల కథనం ఇందులో ప్రధానం. సమకాలీన అధికారుల అవినీతి, మొగల్ సేనల దాడుల వల్ల మరాఠా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘నుష్కాఎదిల్ కుషా’లో వెల్లడించాడు. అయితే ఇది కూడా సత్యాన్ని పాక్షికంగానే తెలుపుతుంది.
మాసీర్-ఎ-ఆలంగీరి: ఔరంగజేబ్ 40 ఏళ్ల పాలనను సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకాన్ని రాసింది మహమ్మద్ సాకి ముస్తాయిద్ ఖాన్. ఔరంగజేబ్ దండయాత్రలు, అధికారుల నియామకం, బదిలీల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. దీన్ని సర్ జదునాథ్ సర్కార్ ‘‘మొగలుల రాజపత్రం’’గా పేర్కొన్నారు. ఔరంగజేబ్ గురించి వివరించే మరో గ్రంథం సుజన్ రావ్ ఖత్రీ రాసిన ‘ఖులాసత్ఉత్తవారిఖ్’.
అనువాదాలు
రజ్మ్ నామా: అంటే యుద్ధాల పుస్తకం అని అర్థం. ఇది మహాభారతానికి పర్షియా అనువాదం (తర్జుమాఎమహాభారత్). అనువాద బృందానికి అబ్దుల్ ఖాదర్ బదాయూనీ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాడు. అనువాదం పూర్తయ్యాక అక్బర్ దీనికి చిత్రాలు కూడా గీయించాడు.
* రామాయణాన్ని అబ్దుల్ ఖాదర్ బదాయూని, అధర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సర్హిందీ, లీలావతిని (గణితశాస్త్ర పుస్తకం) పైజీ, తుజుక్ఎబాబరీని అబ్దుల్ రహీం ఖాన్ఎఖానన్ పర్షియా భాషలోకి అనువదించారు. ఇవే కాకుండా రాజాస్థానంలో గజళ్లు, ఖసీదాలు తదితర కవితా ప్రక్రియలు వికసించాయి.
* అక్బర్ కాలంలో హిందీ సాహిత్యం కూడా ఆదరణ పొందింది. అబ్దుల్ రహీం ఖాన్ఎఖానన్ దోహాలనే ద్విపదలను రచించాడు. నరహరి అనే పండితుడికి అక్బర్ ‘మహాపాత్ర్’ అనే బిరుదునిచ్చాడు. ప్రసిద్ధ హిందీ కవులకు ‘కవిరాయ్’ అనే బిరుదును ఇచ్చి గౌరవించేవారు.
* బీర్బల్కు (అసలు పేరు మహేశ్ దాస్) అక్బర్ కవి ప్రియ అనే బిరుదు ఇచ్చాడు. రస్ఖాన్ ‘ప్రేమ్ వార్తికా’ అనే హిందీ కావ్యం రచించాడు. ఇది కృష్ణభక్తికి సంబంధించింది. తులసీదాస్ విరచిత ‘రామ్ చరిత్ మానస్’ ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘‘వంద మిలియన్ల హిందూస్థాన్ ప్రజల పాలిటి బైబిల్’’ అని జార్జి గ్రియర్సన్ ప్రశంసించాడు.
అమీర్ ఖుస్రూ
కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడైన అమీర్ ఖుస్రూ ఉత్తర్ ప్రదేశ్లోని పటియాలిలో క్రీ.శ.1252లో జన్మించాడు. బాల్బన్ మొదలు ఘియాజుద్దీన్ తుగ్లక్ వరకు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్, హిందీ, ఉర్దూ భాషల్లో ఖుస్రూ రచనలు సాగాయి. ఈయన ఢిల్లీలోని ప్రసిద్ధ చిష్తీ సాధువు నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. అమీర్ ఖుస్రూ బిరుదు ‘‘తూతీఎహింద్’’ (భారతదేశపు చిలుక). అమీర్ ఖుస్రూ రచనా శైలిని ‘సబాక్ ఎ హింద్’ అంటారు.
* అమీర్ఖుస్రూ మొదటి చరిత్ర రచన కిరాన్ఉస్సాదిన్. ఇది మామెలుక్ సుల్తాన్ కైకుబాద్ కాలపు రచన. ఇక ఖజైన్ఉల్ఫుతూహ్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్, చిత్తోడ్గఢ్, మాల్వా, దక్కన్, వరంగల్ దండయాత్రలు, భారతదేశం మీదికి జరిగిన మంగోల్ దాడుల గురించి వివరించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రణథంబోర్ను ముట్టడించినప్పుడు, అక్కడి రాజపుత్ర స్త్రీల ‘‘జౌహార్’’(మూకుమ్మడిగా చితి పేర్చుకుని మరణించడం) గురించి తెలిపాడు. ఘియాజుద్దీన్ తుగ్లక్ చరిత్రను వివరిస్తూ ‘‘తుగ్లక్ నామా’’ రచించాడు. అమీర్ ఖుస్రూ ఇతర రచనలు నూహ్ సిపార్, మిఫ్తా ఉల్ ఫుతూహ్, దేవలరాణి ఖిజిర్ఖానీ.
* సంగీతం విషయానికి వస్తే, అమీర్ ఖుస్రూ ఖవ్వాలీ ప్రక్రియను అభివృద్ధి చేశాడు. సితార్, తబలాను ఈయనే మొదటగా తయారు చేశాడని అంటారు. క్రీ.శ.1325లో మరణించిన అమీర్ ఖుస్రూను నిజాముద్దీన్ ఔలియా దర్గా ప్రాంగణంలోనే ఖననం చేశారు.
పద్మావత్: మాలిక్ మహమ్మద్ జాయసీ ప్రసిద్ధ రచన. జాయసీ ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్బరేలీలోని జాయస్లో జన్మించాడు. మాలిక్ మహమ్మద్ జాయసీ షేర్షా కాలపు కవి. అవధీ మాండలికంలో (హిందీ) ఉన్న ఈ రచన ప్రధానంగా సూఫీ ప్రేమతత్వానికి చెందింది. ఇందులో సుప్రసిద్ధ పద్మావతి (పద్మిని) కథ ఉంది. పద్మావతి చిత్తోడ్ రాణా రతన్ సింగ్ భార్య. ఈమె అందం గురించి తెలుసుకున్న అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ను ముట్టడించాడని చెబుతారు. అయితే చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించారు. చిత్తోడ్ గుజరాత్ వెళ్లే మార్గం మీద ఉండటంతో ఖిల్జీ దండయాత్ర చేశాడనేది చరిత్రకారుల వాదన.
దారాషికో: మొగల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కొడుకు. సూఫీ మార్మికవాది. ఇతడు హిందూ, ఇస్లాం మతాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. రెండు మతాల సారాన్ని క్రోడీకరిస్తూ ‘‘మజ్ మాఉల్బహ్రెయిన్’’ (రెండు సముద్రాల సంగమం) పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించి, వాటిని ‘‘సిర్ఎఅక్బర్’’ పేరుతో సంకలనం చేశాడు. మొగల్ సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో క్రీ.శ.1659లో ఔరంగజేబ్ చేతిలో దారాషికో మరణించాడు.