పాలనపై శాసన నియంత్రణ పద్ధతులు
శాసనాలు రూపొందించడం:
* పార్లమెంట్ రాజ్యాంగ నియమాలకు లోబడి దేశానికి అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది.
* ఈ శాసన నియమాల ఆధారంగానే మంత్రులు, ఉద్యోగులు పరిపాలనను నిర్వహిస్తారు.
* శాసన నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
ప్రశ్నోత్తరాలు:
* వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల పాలనా వ్యవహారాలపై ‘ప్రశ్నోత్తరాల’ ద్వారా శాసన వ్యవస్థ పాలన నియంత్రణ కలిగి ఉంటుంది.
* పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి గంట సమయాన్ని ప్రశ్నలు అడగడానికి నిర్దేశిస్తారు. అందుకే దీన్ని ‘ప్రశ్నోత్తరాల సమయం’ (Question Hour) గా పేర్కొంటారు.
* ఇది సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
* పార్లమెంట్ సభ్యులు సంబంధిత మంత్రులను వారు నిర్వర్తించిన విధులకు సంబంధించి ప్రశ్నలు అడిగితే మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
* ప్రశ్నోత్తరాల సమయంలో 3 రకాల ప్రశ్నలు అడిగేందుకు వీలుంది. అవి:
1. నక్షత్రం గుర్తున్న ప్రశ్నలు
* పార్లమెంట్ సభ్యులు అడిగే ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ‘మౌఖిక సమాధానాలు’ ఇస్తారు.
* మంత్రులు ఇచ్చే సమాధానాలకు సంతృప్తి చెందని సభ్యులు అనుబంధ ప్రశ్నలనూ అడగవచ్చు.
* ప్రశ్న అనేది నక్షత్రపు గుర్తు ఉన్నదా? నక్షత్రపు గుర్తు లేనిదా? అని ధృవీకరించేది సభాధ్యక్షులు.
* రోజుకు గరిష్ఠంగా 20 వరకు నక్షత్రపు గుర్తులున్న ప్రశ్నలను సభలో అనుమతిస్తారు.
2. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలు
* పార్లమెంట్ సభ్యులు అడిగే ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ‘లిఖిత సమాధానాలు’ (Written Answers) ఇస్తారు.
* ఈ ప్రశ్నలపై అనుబంధ ప్రశ్నలు అడగడానికి వీలులేదు.
* గరిష్ఠంగా రోజుకు 230 వరకు అనుమతిస్తారు.
3. స్వల్ప కాలవ్యవధి ప్రశ్నలు
* అత్యవసర ప్రజా ప్రాధాన్యత అంశాలపై మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు పార్లమెంట్లో ‘స్వల్ప కాలవ్యవధి ప్రశ్నల’కు అవకాశం కల్పించారు.
* అత్యవసరమైన అంశమని సభాధ్యక్షులు గుర్తించిన తర్వాత తక్కువ సమయంలో సమాధానం ఇచ్చేందుకు సంబంధిత మంత్రి సిద్ధంగా ఉన్నారా? లేదా? అని స్పీకర్ మంత్రిని అడిగి ధృవీకరించుకుంటారు.
* మంత్రి సమాధానాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తే మంత్రి సూచించిన రోజున ఆ ప్రశ్న అడగటానికి అవకాశం కల్పిస్తారు.
* ఒకవేళ మంత్రి సిద్ధంగా లేకపోతే స్పీకర్/ ఛైర్మన్ సదరు ప్రశ్నను నక్షత్రం గుర్తు ప్రశ్నగా మార్చి మౌఖిక సమాధానం ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తారు.
అర్ధగంట చర్చ
* సభలో అంతకుముందు అంటే ఒక మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన సమాధానం సరిపడలేదు అని భావిస్తే అదనపు సమాచారం కోరుతూ అర్ధగంట చర్చకు అవకాశం కల్పిస్తారు.
* దీన్ని సభాధ్యక్షులు అనుమతించాలి. సభాసమావేశాలు జరుగుతున్న కాలంలో సాధారణంగా లోక్సభలో వారంలో 3 రోజులు (సోమ, బుధ, శుక్ర) చివరి అర్ధగంటను చర్చకు కేటాయిస్తారు.
* రాజ్యసభలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య దీనికి అనుమతిస్తారు.
సావధాన తీర్మానం
* ఏదైనా ఒక అత్యవసర ప్రజాప్రాధాన్యత కలిగిన అంశంపైకి ప్రభుత్వ దృష్టిని మళ్లించి దాని పరిష్కారానికి అధికారిక విధానాన్ని ప్రకటించాలని కోరుతూ సభలో సభ్యులు ప్రవేశపెట్టే అంశాన్ని ‘సావధాన తీర్మానం’ అంటారు.
* సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత దీన్ని అనుమతిస్తారు.
* ప్రభుత్వం నుంచి అధికారపూర్వకమైన సమాధానాన్ని రాబట్టేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
* ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఉండవు.
* పాలన శాసన నియంత్రణలో ఇది కీలకమైంది.
అభిశంసన తీర్మానం: (Censure Motion)
* ప్రభుత్వ పాలనలో వైఫల్యాన్ని గుర్తించి, నియంత్రించేందుకు సభలో ప్రవేశపెడతారు.
* దీన్ని ఒక మంత్రిపైగానీ, కొందరు మంత్రులపైగానీ, మొత్తం ప్రభుత్వంపైగానీ ప్రవేశపెడతారు.
* ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కారణం చూపాలి. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని నియంత్రించడం.
* ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ఈ తీర్మానం నెగ్గినప్పటికీ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
వాయిదా తీర్మానం
* ప్రజాప్రాముఖ్యమైన, అత్యవసరమైన అంశంపై చర్చించేందుకు ఎజెండాలోని కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని వాయిదా తీర్మానం అంటారు.
* దీన్ని ప్రవేశపెట్టేందుకు సభలోని 50 మంది సభ్యులు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి.
* ఈ తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది సభాధ్యక్షులు నిర్ణయిస్తారు.
కోత తీర్మానాలు
* బడ్జెట్లోని పలు పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించేందుకు చేసే ప్రతిపాదనను కోత తీర్మానం అంటారు.
* వీటిని లోక్సభలో స్పీకర్ అనుమతితో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెడతాయి.
* ఈ తీర్మానాలపై చర్చ అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఇవి నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ఈ తీర్మానాలు 3 రకాలు. అవి
1. విధాన కోత తీర్మానం 2. ఆర్థిక కోత తీర్మానం 3. నామమాత్ర కోత తీర్మానం
అవిశ్వాస తీర్మానం (No Confidence Motion)
* ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.
* స్పీకర్ అనుమతితోనే దీన్ని ప్రవేశపెట్టాలి. తీర్మాన నోటీసుపై కనీసం 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి.
* ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణాలు తెలియజేయాల్సిన అవసరం లేదు.
* ‘‘రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్-1950’’ చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.
* ఈ తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఇందులో నెగ్గితే ప్రభుత్వం పతనమవుతుంది.
* ఒక అవిశ్వాస తీర్మానానికి, మరొక అవిశ్వాస తీర్మానానికి మధ్య 6 నెలలు విరామం ఉండాలి.
* కార్యనిర్వాహక వర్గంపై శాసన వ్యవస్థ జరిపే నియంత్రణ సాధనాల్లో ఇది అతి శక్తిమంతమైన తీర్మానం.
ధన్యవాద తీర్మానం
* రాష్ట్రపతి పార్లమెంట్లో ప్రభుత్వ పాలనా విధానాలను తెలియజేస్తూ ప్రభుత్వం సాధించిన, సాధించాల్సిన అంశాలను వివరిస్తారు.
* రాష్ట్రపతి చేసే ఈ ప్రసంగాన్ని ప్రధాని నేతృ త్వంలోని కేంద్ర కేబినెట్ రూపొందిస్తుంది.
* ఈ తీర్మానం లోక్సభలో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
శూన్యకాలం (Zero Hour)
* ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభాకార్యకలాపాలకు (Agenda) వస్తుంది. ఈ ఖాళీ సమయాన్ని శూన్యకాలం అంటారు.
* ఇది సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. దీనికి ఎలాంటి కాలపరిమితి లేదు.
* పార్లమెంట్ సభ్యులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఏ అంశం గురించైనా మంత్రులను ప్రశ్నించవచ్చు. శూన్య కాలం అనేది భారత పార్లమెంట్ సృష్టించిన నూతన ఒరవడి. ఇది 1962 నుంచి కొనసాగుతోంది.
పార్లమెంటరీ కమిటీలు - పాలనపై శాసన నియంత్రణ
పార్లమెంట్ మూడు రకాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాలనను నియంత్రిస్తుంది. అవి:
I. ఆర్థిక కమిటీలు
* ఇవి ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై నియంత్రణను కలిగి ఉంటాయి. ఇవి మూడు రకాలు - అవి:
ఎ. ప్రభుత్వ ఖాతాల సంఘం: ఇది అతిపురాతనమైన పార్లమెంటరీ కమిటీ.
* ఈ కమిటీకి 1967 నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిని ఛైర్మన్గా నియమించే సంప్రదాయం కొనసాగుతోంది.
* ఇది CAG (Comptroller and Auditor General)సమర్పించిన నివేదికపై కూలంకషంగా చర్చించి, ప్రభుత్వ వ్యయం నిర్దేశించిన పద్దులకు అనుగుణంగా జరిగిందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తుంది.
* ప్రభుత్వ వ్యయం పార్లమెంట్ ఆమోదించిన ఉప కల్పన బిల్లుకు అనుగుణంగా ఉందా? లేదా? అనే అంశాన్ని నిశితంగా చూస్తుంది. అయితే ఈ కమిటీ చేసే పరిశీలన శవ పరీక్ష లాంటిదని విమర్శకుల అభిప్రాయం.
బి. అంచనాల సంఘం: ఈ కమిటీ పొదుపు పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తుంది.
* ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో పొదుపును ప్రోత్సహించడం ఈ కమిటీ ప్రధాన విధి.
సి. ప్రభుత్వరంగ సంస్థల సంఘం: ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా నివారిస్తుంది.
II. సాధారణ పాలనా కమిటీలు
* ఈ కమిటీలు రెండు రకాలు. అవి.
ఎ. దత్త శాసనాల కమిటీ: పార్లమెంట్ ప్రభుత్వానికి అప్పగించిన శాసన నిర్మాణ బాధ్యతలను శాసన దత్తత అంటారు.
* దీనిలో భాగంగా రూపొందించిన నియమ నిబంధనలు పార్లమెంట్ నిర్దేశించిన చట్టానికి లోబడి ఉన్నాయో లేవో అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
* ఈ కమిటీని నియోజిత శాసనాల కమిటీ అని కూడా అంటారు.
బి. ప్రభుత్వ వాగ్దానాల కమిటీ: మంత్రులు సభా వేదికలపై చేసిన పలు వాగ్దానాలు ఎంతమేరకు అమలవుతున్నాయో ఈ కమిటీ పరిశీలిస్తుంది.
III. డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలు
* వివిధ పాలనా శాఖల రోజువారీ పరిపాలనపై, బడ్జెట్ ప్రతిపాదనలపై నియంత్రణ కోసం 1993లో మొదటిసారిగా 17 డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
* 2004లో మరో 7 డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం మొత్తం కమిటీల సంఖ్య: 24. ఒక్కొక్క కమిటీ 5 లేదా 6 పాలనా శాఖలపై నియంత్రణ కలిగి ఉంటుంది.
* ఈ 24 కమిటీల్లో లోక్సభ నియంత్రణలో పనిచేసే కమిటీలు: 16.
* రాజ్యసభ నియంత్రణలో పనిచేసే కమిటీలు: 8.