• facebook
  • whatsapp
  • telegram

మహాజనపదాలు - మగధ సామ్రాజ్యం

* ఇతిహాసయుగం (రామాయణ, మహాభారతం)లో మగధను పాలించిన తొలి పాలకుడు ‘బృహద్రధుడు’. ఈ వంశానికి చెందిన రాజుల్లో ‘జరాసంధుడు’ గొప్పవాడు. ఇతడి రాజధాని ‘గిరివ్రజం’. ఇతడి వంశం క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి అంతమైంది. ఈ వంశంలో చివరి పాలకుడు ‘రిపుంజయుడు’.   


* పురాణాల ప్రకారం, రిపుంజయుడ్ని చంపిన అతడి మంత్రి పులికుడు ‘ప్రద్యోత’ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశస్థులు సుమారు 138 సంవత్సరాలు పాలించారు. తర్వాత శిశునాగుల వంశ పాలన ప్రారంభమైంది. ఈ వంశంలోని 5వ పాలకుడు బింబిసారుడని పురాణాల్లో ఉంది. 


* వివిధ సాహిత్య గ్రంథాల్లో వేర్వేరు సమాచారం ఉండటం వల్ల వంశ కాలనిర్ణయంలో తేడాలున్నాయి. బౌద్ధ గ్రంథాల ప్రకారం, రిపుంజయుడ్ని వధించిన బింబిసారుడు హర్యాంక వంశాన్ని స్థాపించినట్లు ఉంది.

హర్యాంక వంశం


బింబిసారుడు (క్రీ.పూ.544-493): 


* ఇతడు హర్యాంక వంశ స్థాపకుడు. బుద్ధుడి సమకాలికుడు. గిరివ్రజాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 


 * వివాహ సంబంధాల ద్వారా రాజ్యవిస్తరణ చేశాడు. కోసల, వజ్జి, ముద్ర, విదేహ రాజ్యాలకు చెందిన రాజ కుటుంబీకులను వివాహం చేసుకున్నాడు. మహావగ్గ అనే బౌద్ధ గ్రంథం బింబిసారుడికి 500 మంది భార్యలు ఉన్నట్లు పేర్కొంటోంది.


* మొదటి భార్య కోసల మహాదేవి. ఈమె కోసల రాజైన ప్రసేనజిత్తు సోదరి. ఈమెను వివాహం చేసుకోవడం ద్వారా లక్ష నాణేల ఆదాయం వచ్చే ‘కాశీ’ రాజ్యాన్ని వరకట్నంగా తీసుకున్నాడు.


*  రెండో భార్య చెల్లన. ఈమె వజ్జి రాజు చేటకుడి కుమార్తె. మూడో భార్య విదేహ రాకుమార్తె ‘వాసవి’; నాలుగో భార్య ముద్రరాజు కుమార్తె ‘ఖీమ’.


బింబిసారుడు అంగ రాజ్యాన్ని జయించి, దానికి తన కుమారుడైన అజాతశత్రువును రాజప్రతినిధిగా నియమించాడు. 


*  బింబిసారుడు అవంతి, గాంధార రాజ్యాలతో దౌత్య సంబంధాల ద్వారా మైత్రి చేసుకున్నాడు. ఈ విధంగా 80 వేల గ్రామాలతో ‘గిరివ్రజం’ (రాజ్‌గిర్‌) సామ్రాజ్యాన్ని పటిష్ఠం చేశాడు. గిరివ్రజం చుట్టూ అయిదు కొండలు ఉన్నాయి. వాటి మధ్య ఉన్న దారులను రాతిగోడలతో మూయించాడు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 


* క్రీ.పూ.493లో బింబిసారుడ్ని బంధించిన అతడి కుమారుడు అజాతశత్రువు సింహాసనాన్ని దక్కించుకున్నాడు.


అజాతశత్రువు (క్రీ.పూ.492-460): ఇతడు కూడా వివాహ సంబంధాలు, యుద్ధాల ద్వారా రాజ్యవిస్తరణ చేశాడు. సింధు, అవంతి, వత్స, సైవీర రాకుమార్తెలను వివాహం చేసుకుని వైశాలి, కాశీ, కోసల రాజ్యాలను ఆక్రమించాడు.


గంగా-సోన్‌ నదుల మధ్య ‘పాటలీపుత్రం’ అనే నగరాన్ని నిర్మించాడు.


* ఇతడు తూర్పు ప్రాంతంలోని 36 గణ రాజ్యాల కూటమిని (9 మల్ల గణాలు, 9 లిచ్ఛవి గణాలు, 18 కాశీ, కోసల గణాలు) జయించినట్లు జైనగ్రంథాల ద్వారా తెలుస్తోంది. 


*  అజాతశత్రువు తన మంత్రయిన ‘వత్సకార’ సాయంతో వీటిని జయించాడు. 


ఇతడు యుద్ధాల్లో మహాశీల కంటక (బరువైన రాళ్లను విసిరే యంత్రం), రథముసలం (రథానికి అమర్చిన బలమైన ఇనుప ఇరుసుకు, చుట్టూ కత్తులు ఉంటాయి) లాంటి ఆయుధాలు ఉపయోగించాడు. బాహుబలి సినిమాలో ఉపయోగించినవి ఈ తరహా పనిముట్లే.

రాజగృహంలో ‘ధాతుచైత్య’మనే స్తూపాన్ని నిర్మించాడు. మొదటి బౌద్ధ సంగీతి ఇతడి కాలంలోనే రాజగృహంలో జరిగింది. 

ఇతడి తర్వాత ఉదయనుడు రాజయ్యాడు.

చివరి రాజులు:


*  ఉదయనుడు క్రీ.పూ.460444 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. ఉదయనుడు బౌద్ధ మతాభిమాని.

*  ఉదయనుడి తర్వాత వరుసగా అనిరుద్ధుడు, ముండరాజు, నాగదాసకుడు మగధను పాలించారు.

* హర్యాంక వంశ చివరి రాజు ‘నాగదాసకుడు’. ఇతడు సక్రమంగా రాజ్యపాలన చేయలేకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 


ఏర్పడింది. ఈ సమయంలోనే ఇతడి మంత్రయిన ‘శిశునాగుడు’ తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. 

నందవంశం (క్రీ.పూ. 362-322) 


* ఈ వంశాన్ని మహాపద్మనందుడు స్థాపించాడు. ఇతడు శూద్రుడని గ్రీకు రచయితలు పేర్కొనగా, అజ్ఞాత కులస్థుడని పురాణాల్లో ఉంది.


* బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల నుంచి రాజ్యాధికారం మొదటిసారిగా శూద్రులకు దక్కింది.


* ఇతడికి ‘సర్వక్షత్రియాంతక’, ‘అభినవ పరశురాముడు’, ‘ఏక్‌రాట్‌’ అనే బిరుదులు ఉన్నాయి.


* ఇక్ష్వాక, పాంచాల, కాశీ, కళింగ, అస్మక, కురు, మైథిలి, శూరసేన రాజ్యాలను ఆక్రమించి, గొప్పవిజేతగా పేరొందాడు.


* ఖారవేలుడు వేయించిన హాతిగుంఫా శాసనంలో ఇతడి విజయాలు, పాలనా విధానాల గురించి ఉంది.


ఇతడి తర్వాత పాలించిన రాజుల గురించి సరైన ఆధారాలు లేవు. గ్రీకు రచనల్లో ‘అగ్రమెస్‌’ చివరి నందరాజు అని ఉంది.


* ఇతడికి ధనంపై అమితమైన ఆశ ఉండేది. అందుకే ధననందుడిగా పేరొందాడు. అతిలోభం, ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేయడం మొదలైన కారణాల వల్ల ప్రజాభిమానం కోల్పోయాడు.


* చంద్రగుప్తుడు కౌటిల్యుడి సాయంతో ధననందుడ్ని ఓడించి, మగధ రాజ్యాన్ని ఆక్రమించి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

శిశునాగ వంశం (క్రీ.పూ. 444-362)


*  ఈ వంశ స్థాపకుడు ‘శిశునాగుడు’. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి గిరివ్రజానికి మార్చాడు.


* అవంతి, వత్స రాజ్యాలను జయించాడు. ఇతడి కుమారుడు కాలాశోకుడు. పురాణాల్లో ఇతడ్ని ‘కాకవర్ణుడి’గా పేర్కొన్నారు.


కాలాశోకుడి కాలంలోనే రెండో బౌద్ధసంగీతి ‘వైశాలి’లో జరిగింది.


* ఇతడికి పదిమంది కుమారులున్నారు. ‘మహాపద్మనందుడు’ వీరందరినీ చంపి నందవంశాన్ని స్థాపించాడు.

షోడశ మహాజనపదాలు - లక్షణాలు


* షోడశ మహాజనపదాల్లో రాజరిక రాజ్యాల్లో నిరంకుశ రాచరికం అమల్లో ఉండేది.


* గణరాజ్యాల్లో కుటుంబ పెద్దలతో కూడిన గణసభ రాజును ఎన్నుకునేది. కొన్ని రాజ్యాల్లో వారసత్వం కూడా అమల్లో ఉండేది. 


* గణరాజ్యాలు తరచూ సమావేశమై సమస్యలను పరిష్కరించుకునేవారు. 


* రాజుకు పాలనలో సహాయం చేసేందుకు పురోహితుడు, మంత్రి, సేనాధిపతితో పాటు ‘మంత్రిమండలి’ ఉండేది. 


* భాగదుగ, గ్రామభోజక అనే ఉద్యోగులు పన్నులు వసూలు చేసేవారు. 


* భోజకుడు గ్రామంలో శాంతిభద్రతలు 


కాపాడుతూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేవాడు.


* వ్యవసాయం, పరిశ్రమలు, వివిధ కుల


వృత్తులు ఉండేవి. 


* కౌశాంబి, శ్రావస్తి, మధుర అప్పటి ప్రముఖ వాణిజ్య కేంద్రాలు. భరుకచ్చ, సోపార ముఖ్య రేవు పట్టణాలు. 


* వర్ణవ్యవస్థ అమల్లో ఉండేది. 


* తక్షశిల, కాశీ విద్యాకేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. 


* బలమైన సైన్యాన్ని పోషించేవారు. 


* భూమిశిస్తు ప్రధాన ఆదాయమార్గం. 


రైతులు పండిన పంటలో 1/6 వంతు పన్ను చెల్లించేవారు.

మాదిరి ప్రశ్నలు


1. పాటలీపుత్ర నగరాన్ని నిర్మించింది?


1)  డేరియస్‌    2) బింబిసార  3) ఖారవేలుడు    4)అజాతశత్రువు


2. పాటలీపుత్రం ఏ నదుల మధ్య ఉంది?

1)  గంగా - సోన్‌   2)  గంగా - యమునా 3)  గంగా - బ్రహ్మపుత్ర     4) గోదావరి - కృష్ణ


3. కిందివారిలో బుద్ధుడి సమకాలికులు ఎవరు? 

ఎ) అజాతశత్రువు    బి) బింబిసార సి) ఉదయనుడు    డి) చంద్రప్రద్యోత

1) ఎ, బి, డి    2)  డి, సి 3) ఎ, బి, సి    4) పైవారంతా

4. బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు ఏ ప్రాంతానికి చెందినవాడు?

1) కాశీ        2)  కోసల     3) మగధ     4)అంగ


5. హర్యాంక వంశంలో చివరి రాజు ఎవరు?

1)  కాలాశోకుడు    2) అజాతశత్రువు  3)  నాగదాసుడు    4) బింబిసారుడు


6. బింబిసారుడు ‘కోసల దేవిని’ వివాహం చేసుకుని కట్నంగా పొందిన పట్టణం/ గ్రామం?

1)  అయోధ్య  2)  కాశీ3) అవంతి    4)  వైశాలి


7. అజాతశత్రువు ఏ యుద్ధంలో కోసల రాజు ప్రసేనజిత్తును ఓడించి, కాశీని ఆక్రమించాడు?

1) ఆమ్రపాలి యుద్ధం  2) మంగలి యుద్ధం3)  అవంతి యుద్ధం   4) రాజపుర యుద్ధం 


8. మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చిన రాజు ఎవరు? 

1) బింబిసార    2)  ప్రసేనజిత్తు3) నాగదాసక    4) ఉదయనుడు


9. అజాతశత్రువు ప్రధాన మంత్రి ఎవరు? 

1)  వత్సకార    2) భీమకార  3) రధకార    4) పుక్కుసతి 


10. కిందివాటిలో మగధ రాజధాని ఏది?

1) గిరివ్రజం   2) రాజగృహం 3) పాటలీపుత్రం    4)  పైవన్న


11. ఆధునిక కాలంలో పాటలీపుత్రాన్ని ఏమని పిలుస్తున్నారు?

1) వారణాసి  2) పట్నా  3) లఖ్‌నవూ    4)  మీరట్‌


12. రెండో బౌద్ధ సంగీతి ఏ రాజవంశ కాలంలో జరిగింది? 

1) నంద వంశం     2) శిశునాగ వంశం  3) హర్యాంక వంశం    4) మహాపద్మనంద


13. పురాణాల్లో కింది ఎవరిని కాకవర్ణుడిగా పేర్కొన్నారు?

1) ధననంద    2) బింబిసార   3) కాలాశోక    4) మహాపద్మనంద


14. నందవంశ స్థాపకుడు ఎవరు? 

1) మహపద్మనంద    2)  వీరనంద  3) ఉదయనందన    4) అశోకనందన


15. ‘హాతిగుంఫా శాసనాన్ని’ వేయించింది ఎవరు?

1)  అలెగ్జాండర్‌    2) ఖారవేలుడు  3) అశోక    4) కాలాశోక

సమాధానాలు

1-4  2-1  3-1  4-2  5-3  6-2  7-1  8-4  9-1  10-4  11-2  12-2  13-3  14-1  15-2  

రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌