రెండో మహేంద్రవర్మ
* ఇతడు క్రీ.శ. 668 - 670 వరకు రాజ్యపాలన చేశాడు.
* ఇతడు చాళుక్య వంశానికి చెందిన మొదటి విక్రమాదిత్యుడి చేతిలో ఓడిపోయాడు. రేనాటి తెలుగు చోళులు, బాణవంశ రాజులను తిరస్కరించి చాళుక్య ఆధిపత్యాన్ని అంగీకరించాడు.
పరమేశ్వరవర్మ
* ఇతడు క్రీ.శ. 670 - 685 వరకు రాజ్యపాలన చేశాడు.
* ఇతడి కాలంలోనే బాదామి చాళుక్య రాజైన విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని జయించాడు.
* పరమేశ్వరవర్మ పెరవళ్లనూర్ (తిరుచ్చి జిల్లా) యుద్ధంలో విక్రమాదిత్యుడ్ని, అతడికి సాయంగా వచ్చిన పాండ్య రాజును ఓడించాడు. అంతకు ముందు పరమేశ్వరవర్మ సత్వాలి, శంకరమంగై యుద్ధాల్లో పాండ్యరాజును ఓడించాడు.
రెండో నరసింహవర్మ
* ఇతడు క్రీ.శ. 685 730 వరకు రాజ్యపాలన చేశాడు.
* ఇతడి కాలంలో ఎలాంటి యుద్ధాలు జరగలేదు.
* నరసింహవర్మ గుహలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతిని కొనసాగిస్తూ పెద్దరాళ్లతో దేవాలయాలను నిర్మించే పద్ధతిని ప్రారంభించాడు.
* మహాబలిపురంలోని తీర దేవాలయం, కాంచీపురంలోని కైలాసనాథాలయాలను ఇతడే కట్టించాడు.
* చైనాకు దౌత్య వర్గాలను పంపి, వర్తక వాణిజ్యాలు పెంపొందించాడు.
* ‘దశకుమార చరిత్ర’ రచించిన దండి కవి ఇతడి ఆస్థానంలోని వారే.
* రెండో నరసింహవర్మకు ‘ఆగమప్రియ’, ‘రాజసింహ’, ‘శంకరభక్త’ అనే బిరుదులు ఉన్నాయి.
రెండో పరమేశ్వరవర్మ
* ఇతడు క్రీ.శ. 730 నుంచి 733 వరకు రాజ్యపాలన చేశాడు.
* చాళుక్య రాజైన రెండో విక్రమాదిత్యుడు ఇతడి కాలంలోనే కాంచీపురానికి వచ్చి, అక్కడి కైలాసనాథాలయంలో తన విజయ శాసనాన్ని వేయించాడు.
* పరమేశ్వరవర్మను ఓడించి, అతడి నుంచి కప్పం వసూలు చేశాడు. చాళుక్య విక్రమాదిత్యుడికి పశ్చిమగాంగులు సహాయం చేశారు.
* క్రీ.శ. 731లో పశ్చిమగాంగులను శిక్షించేందుకు పరమేశ్వరవర్మ వారిపై దండెత్తాడు. దీనికి ‘మిళిందై’ యుద్ధం అని పేరు. ఇందులో పరమేశ్వరవర్మ మరణించాడు.
నందివర్మ
* ఇతడు క్రీ.శ. 733 నుంచి క్రీ.శ. 794 వరకు రాజ్యపాలన చేశాడు.
* రెండో పరమేశ్వరవర్మ మరణించాక సింహవిష్ణువు వంశం అంతరించింది. ఇతడికి వారసులు లేరు. దీంతో పల్లవ రాజవంశాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. చివరికి సామంతులు, విద్వాంసులు ‘కాంచీపుర ఘటిక’లో సమావేశమై పల్లవవంశ శాఖకు చెందిన నందివర్మను రాజుగా ప్రకటించారు.
* నందివర్మ చాళుక్య, రాష్ట్రకూట, పాండ్య, గాంగ వంశస్థులతో పాటు తన వంశానికే చెందిన ‘చిత్రమాయ’ లాంటి వారితో యుద్ధాలు చేశాడు.
* చిత్రమాయ పాండ్యరాజు మొదటి రాజసింహుడి సాయంతో నందివర్మపై దండెత్తి, అతడ్ని కుంభకోణం సమీపంలో ‘నందిపురం’ కోటలో బంధించాడు. ఆ సమయంలో పల్లవుల సేనాని ఉదయచంద్ర నందివర్మను కాపాడాడు.
* నందివర్మ కాలంలో చాళుక్య రెండో విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తి, కంచిని ఆక్రమించాడు. కైలాసనాథ దేవాలయంలో ఒక శాసనాన్ని వేయించాడు. నిపుణులైన శిల్పులను తన రాజ్యానికి తీసుకెళ్లాడు.
* కైలాసనాథ దేవాలయానికి విక్రమాదిత్యుడు విరాళాలు ఇచ్చాడు.
* నందివర్మ అశ్వమేధ యాగం చేసి ‘పల్లవమల్ల’ అనే బిరుదు పొందాడు.
* క్రీ.శ. 733లో విక్రమాదిత్యుడు రెండోసారి కంచిపై దండెత్తి దోచుకున్నాడు. తర్వాతి కాలంలో రాష్ట్రకూటులు చాళుక్యులను అంతం చేయడంతో చాళుక్యుల బెడద పల్లవులకు లేకుండా పోయింది.
* రాష్ట్రకూటరాజు దంతిదుర్గుడు పల్లవ రాజ్యంపై దండెత్తి నందివర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత వీరి మధ్య సంధి కుదిరింది. దంతిదుర్గుడు తన కుమార్తె రేవాదేవిని నందివర్మకు ఇచ్చి వివాహం చేశాడు.
* నందివర్మ గొప్ప విష్ణు భక్తుడు. కంచిలో ముక్తేశ్వరాలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయాలపై అందమైన శిల్పాలు చెక్కించాడు.
దంతివర్మ
* ఇతడు నందివర్మ కుమారుడు. క్రీ.శ. 795 నుంచి క్రీ.శ. 845 మధ్య రాజ్యాన్ని పాలించాడు.
* ఇతడి కాలంలో రాష్ట్రకూటరాజు మూడో గోవిందుడు కాంచీపురంపై దండెత్తి దోచుకున్నాడు.
మూడో నందివర్మ
* క్రీ.శ. 845 నుంచి క్రీ.శ. 866 మధ్య రాజ్యాన్ని పాలించాడు. ఇతడు మంచి పాలకుడు, యోధుడిగా గుర్తింపు పొందాడు.
* సామంతుల సాయంతో పాండ్యులను ‘తల్లార్’ యుద్ధంలో ఓడించాడు.
* తెలుగు చోళులను ఓడించి తన రాజ్యాన్ని వాగై నది వరకు విస్తరింపజేశాడు.
* పాండ్యరాజు శ్రీమారవల్లభ మూడో నందివర్మను కుంభకోణ యుద్ధంలో ఓడించాడు.
నృపతుంగవర్మ
* క్రీ.శ. 866 నుంచి క్రీ.శ. 880 మధ్య రాజ్యాన్ని పాలించాడు. పాండ్యరాజు శ్రీమార వల్లభను ఓడించాడు.
అపరాజితవర్మ
* ఇతడు క్రీ.శ. 880లో శ్రీపురంబీయం యుద్ధంలో పాండ్యులను ఓడించాడు. ఆ సమయంలో ఇతడికి చోళులు సాయం చేశారు.
* ఆదిత్యచోళుడు క్రీ.శ. 897లో అపరాజితవర్మను వధించాడు. దీంతో పల్లవ రాజ్యం చోళుల హస్తగతం అయ్యింది.
సాంఘిక పరిస్థితులు
* పల్లవులు వైదికమతాన్ని పాటించారు. సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
* సంఘంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరికి భూములు దానంగా ఇచ్చేవారు.
* ఆనాటి సమాజంలో తుడియం, వణం, పరియన్, కడంగన్ అనే 4 వర్ణాలు ఉండేవి.
* పల్లవులు బ్రాహ్మణులు. అయితే చాలా కాలం నుంచి వీరు క్షత్రియ ధర్మాలను పాటించడం వల్ల క్షత్రియులయ్యారు.
* బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు, శుభకార్యాలతో పాటు, విద్యాబోధన చేసేవారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం ఉండేది. వీరు చతురాశ్రమ ధర్మాలు పాటించారు. అగ్రహారాల్లో నివసించారు.
* ఎక్కువ శాతం ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతులు ముఖ్యంగా వరి, బార్లీ పండించేవారు.
* సమాజంలో వివిధ రకాల వృత్తులు ఉండేవి. కుల, వృత్తి సంఘాలు ఉండేవి. గ్రామాలకు స్వయం నిర్ణయాధికారం ఉండేది.
* స్త్రీ, పురుషులు అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ రకాల ఆభరణాలు ధరించేవారు. ధనికులు పట్టు వస్త్రాలు వేసుకునేవారు.
* ఆర్థిక అసమానతలు, దేవదాసీ వ్యవస్థ ఉండేది.
* ఆ కాలంలో ప్రధాన వినోదాలు నాటకాలు, సంగీతం, నృత్యం.
ఆర్థిక పరిస్థితులు
* ఆనాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పల్లవులు నీటిపారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. బంజరు భూములకు సైతం నీరు పారించి, సాగులోకి తెచ్చారు. పండ్లు, ధాన్యాలు, కూరగాయలు పండించేవారు. గ్రామాలకు పొలిమేరలు ఉండేవి. పంటపొలాలకు గట్లు వేసేవారు.
* కుమ్మరి, కమ్మరి, సాలె, భజంత్రీలు, గ్రామసేవకులు, దేవదాసీలకు మాన్యాలను దానంగా ఇచ్చేవారు. కుటీర పరిశ్రమలు ఉండేవి. వర్తకులు ‘శ్రేణులు’గా (వర్తక సంఘాలు) ఏర్పడి చైనా, ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం చేసేవారు. నానాదేశి, మణిగ్రాం అనే వర్తక సంఘాలు ఉండేవి. మామల్లపురం, నాగపట్నం రేవుల ద్వారా నౌకాయానం జరిగేది.
* యాలకులు, మిరియాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు ప్రధాన ఎగుమతులు. గుర్రాలు, విలువైన వస్తువులు దిగుమతులు.
* బ్రాహ్మణులకు బ్రహ్మదేవ్, దేవాదాన అనే పేరుతో భూములను దానాలుగా ఇచ్చేవారు.
* రాజ్యానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయమార్గం. పంటలో 1/10 లేదా 1/6 వంతు పన్నులుగా వసూలు చేసేవారు.
* పల్లవులు 18 రకాల పన్నులను ప్రజల నుంచి వసూలు చేసేవారు. వృత్తిపన్ను, వివాహపన్ను, ఉప్పు, చక్కెరపై పన్నులు ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగులకు పాలు, పెరుగు, కూరగాయలు, కలప, వంటచెరకు, పశుగ్రాసం మొదలైనవాటిని ప్రభుత్వమే ఇచ్చేది.
* దేశ పర్యటనలో రాజుకు అయ్యే ఖర్చును గ్రామ ప్రజలు భరించేవారు. రాజసింహుడు చైనాకు రాయబారులను పంపాడు. ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించడం వల్ల భారతీయ సంస్కృతి ఇతర దేశాలకు వ్యాపించింది.
పల్లవుల పరిపాలన
* పల్లవుల పరిపాలనా విధానం శాతవాహనుల పాలనను పోలి ఉంటుంది.
* పల్లవ రాజులు నిరంకుశంగా రాజ్యపాలన చేసినప్పటికీ ప్రజా శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
* వీరు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పాలన సాగించారు.
* వీరికి ‘రాజాధిరాజ’, ‘ధర్మమహారాజాధిరాజ’, ‘పంచమలోక పాలక’ లాంటి బిరుదులు ఉన్నాయి.
* పాలనలో రాజే సర్వాధికారి. రాజరికం వంశపారంపర్యంగా ఉండేది.
* రాజుకు సలహాలు ఇచ్చేందుకు ‘మంత్రిపరిషత్’ ఉండేది.
* పల్లవ రాజ్యం అధిక భాగం సామంతుల అధీనంలో ఉండేది. పల్లవ, చాళుక్య యుద్ధాల్లో వీరే కీలకపాత్ర పోషించారు.
* ప్రజాపరిషత్లో అమాత్య, యువరాజు, రహస్యాధీకృత, కోశాధ్యక్షుడు సభ్యులుగా ఉండేవారు.
* పల్లవ రాజులు దూతికలు (messengers) సంజరంతకులను (spies) నియమించి రాజ్యంలో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు.
* పరిపాలనా సౌలభ్యం కోసం పల్లవులు రాజ్యాన్ని మండలాలు, నాడులు, గ్రామాలుగా విభజించారు.
* మండలాధిపతిగా యువరాజు లేదా రాజు వర్గానికి చెందినవారిని నియమించేవారు.
* పరిపాలనలో చివరిభాగం గ్రామం. ప్రతి గ్రామానికి గ్రామాధికారి ఉండేవాడు. గ్రామ పాలనకు సభ, ఉర్, నగర అనే గ్రామసభలు ఉండేవి.
* గ్రామాధికారి గ్రామానికి చెందిన దేవాలయాలు, తోటలు, నీటిపారుదల, జనాభా లెక్కలు చూసేవాడు. గ్రామ సరిహద్దులు గుర్తించడం, ఆదాయవ్యయాల గణన ఇతడి ప్రధాన విధి.
* గ్రామసభకు న్యాయాధికారం ఉండేది. ఇందులో బ్రాహ్మణులు సభ్యులుగా ‘సభ’, భూస్వాములు సభ్యులుగా ‘ఉర్’, వర్తకులు సభ్యులుగా ‘నగర’ ఉండేవి.
* గ్రామాల్లో ‘ధర్మాసనాలు’ అనే న్యాయస్థానాలు ఉండేవి. ఇక్కడ నేరస్తులకు శిక్షలు అమలు చేసేవారు.
* భోగాలు, విషయాల్లో కూడా ఇలాంటి విధానమే ఉండేది.