• facebook
  • whatsapp
  • telegram

జైనమతం 

1. అజీవక శాఖకు నాయకుడు ఎవరు?
జ: గోసాల మస్కరిపుత్ర

 

2. జైనుల 22 వ తీర్థంకరుడు ఎవరు?
జ: అరిష్టనేమి

 

3. జైన తీర్థంకరులందరూ ఏ వంశానికి చెందిన వారు?
జ: క్షత్రియ

 

4. వర్థమానుడు ఎక్కడ జన్మించాడు?
జ: కుంద గ్రామం

 

5. మహావీరుడు చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలని కోరిన జైనమత గురువు ఎవరు?
జ: భద్రబాహు

 

6. మొదటి జైనమత కౌన్సిల్ ఎక్కడ జరిగింది?
జ: పాటలీపుత్రం

 

7. రెండో జైన కౌన్సిల్‌కు అధ్యక్షుడు ఎవరు?
జ: దేవర్ది క్సమశ్రమణ

 

8. దక్షిణ భారతదేశంలో జైనుల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: శ్రావణ బెళగొల

 

9. కిందివాటిలో దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని పోషించని రాజవంశం ఏది?
ఎ) కదంబులు       బి) చాళుక్యులు      సి) రాష్ట్రకూటులు       డి) పల్లవులు
జ: డి (పల్లవులు)

 

10. 'త్రిషష్టి సలక పురుష చరిత' అనే గ్రంథాన్ని రచించిన జైన పండితుడు ఎవరు?
జ: హేమచంద్రుడు

రచయిత: భాస్కర్ వేడియం
 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధమతం

          క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో ఆవిర్భవించిన మతాల్లో ప్రధానమైంది బౌద్ధమతం. దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. భారతదేశ సాహిత్యం, వాస్తు, కళా రంగాలకు బౌద్ధమతం ఎనలేని సేవలను అందించింది. ఈ మతం క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
 

గౌతమ బుద్ధుడు

          గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు కపిలవస్తు రాజ్యానికి చెందిన శాక్య వంశీయుడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి (మహామాయ). సిద్ధార్థుడు క్రీ.పూ.563లో ప్రస్తుత నేపాల్‌లోని లుంబినీ వనంలో జన్మించాడు. తల్లి మరణంతో సవతి తల్లి ప్రజాపతి గౌతమి వద్ద పెరిగాడు. చిన్నతనంలోనే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నాడు. 19వ ఏట యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, మృతదేహం, సన్యాసుడిని చూశాడు. ఈ నాలుగు దృశ్యాలు అతడి ఆలోచనలో మార్పు తీసుకువచ్చాయి. మొదటి మూడు దృశ్యాల వల్ల జీవితం దుఃఖమయమని గ్రహించాడు. సన్యాసి తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో సంతోషంగా ఉండటాన్ని గమనించాడు. ‘దుఃఖం లేని జీవితాన్ని సాధించడం ఎలా?’ అని తెలుసుకోవడానికి 29వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లిన వారిని పరివ్రాజకుడు అంటారు.
 

మహాభినిష్క్రమణం: సిద్ధార్థుడు తన 29వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని మహాభినిష్క్రమణం అంటారు. రథసారథి చెన్నడు సాయంతో అడవికి వెళ్లి తన రాజదుస్తులు, ఆభరణాలను తండ్రికి పంపించాడు. సిద్ధార్థుడి గుర్రం కంఠక ఆ దృశ్యాన్ని చూసి మరణించింది. అనంతరం ఇతడు వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక మంది గురువుల వద్ద శిష్యరికం చేశాడు. ఈయన గురువుల్లో ప్రధానమైనవారు అలారక, ఉద్దరక. 35వ ఏట ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఒక రావిచెట్టు కింద 40 రోజుల ధ్యానం తర్వాత జ్ఞానాన్ని పొందాడు.
 

సంబోధి: బుద్ధుడు గయలో రావిచెట్టు కింద 40 రోజుల తపస్సు అనంతరం జ్ఞానాన్ని పొందడాన్నే ‘సంబోధి’ అంటారు. ఈయన తపస్సుకు భంగం కలిగించడానికి మార అనే దుష్టశక్తి ప్రయత్నించినట్లు, ఆ సమయంలో భూదేవి దాన్ని అంతమొందించినట్లు బౌద్ధసాహిత్యం పేర్కొంది. బౌద్ధమతంలో దీన్నే భూస్పర్శ ముద్రగా పేర్కొంటారు. సంబోధి చెందిన అనంతరం సిద్ధార్థుడిని బుద్ధుడిగా, గయను బుద్ధగయగా, రావిచెట్టును బోధివృక్షంగా పిలుస్తున్నారు.
 

ధర్మచక్ర పరివర్తన: గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జింకలతోటలో తన పూర్వ సహచరులైన అయిదుగురికి తొలి ఉపదేశాన్ని ఇచ్చాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు. అందుకే అశోకుడు వారణాసి సమీపంలోని సారనాథ్‌లో స్తంభశాసనం, స్తూపాన్ని వేయించాడు. ఈ సారనాథ్‌ రాతిస్తంభ శాసనం నుంచే మన జాతీయ ముద్ర (సింహతలాటం) ను తీసుకున్నారు.
 

అష్టాంగమార్గం

      దుఃఖనివారణకు, మోక్షసాధనకు బుద్ధుడు చెప్పిన ఎనిమిది సూత్రాలను అష్టాంగమార్గం అంటారు. దుఃఖం, కోరికలు నశించాలంటే వీటిని పాటించాలి.
 

సూత్రాలు

1) సరైన దృష్టి                                       2) సరైన లక్ష్యం
3) సరైన వాక్కు                                     4) సరైన జీవనం
5) సరైన క్రియ                                       6) సరైన ఆలోచన
7) సరైన శ్రమ                                        8) సరైన ధ్యానం

 

 బోధనలు
            బుద్ధుడి బోధనలు లేదా బౌద్ధమత సిద్ధాంతాలను ఆర్యసత్యాలు అంటారు. గౌతమబుద్ధుడు నాలుగు ప్రధాన సిద్ధాంతాలను ప్రబోధించాడు.
1) ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం (దుఃఖ)
2) దుఃఖానికి కారణం కోరికలు (సముదయ)
3) దుఃఖం పోవాలంటే కోరికలు నశించాలి (నిరోధ)
4) కోరికలు నశించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి (మార్గ)

 

     వేదాలు ప్రామాణికం కాదని, యజ్ఞయాగాల వల్ల మోక్షం రాదని, కులమత భేదాలు పాటించరాదని, జీవహింసచేయకూడదని, అసత్యం మాట్లాడవద్దని, అవినీతికి పాల్పడరాదని, ఇతరుల ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదని బుద్ధుడు బోధించాడు. కాశీ, మగధ, కపిలవస్తు, వైశాలి లాంటి రాజ్యాలను సందర్శిస్తూ తన ధర్మాన్ని ప్రచారం చేసి, అనుచరులను బౌద్ధ సంఘంగా ఏర్పరిచాడు. క్రీ.పూ.483లో 80వ ఏట ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కుశినగరంలో మహాపరి నిర్యాణం చెందాడు.
 

త్రిరత్నాలు: జైనమతంలో ప్రస్తావించినట్లు బౌద్ధమతంలో కూడా త్రిరత్నాల గురించి ప్రస్తావించారు. బుద్ధుడు, ధర్మం, సంఘం అనేవి బౌద్ధ త్రిరత్నాలు. వీటినే బౌద్ధ సంప్రదాయంలో.....
1) బుద్ధం శరణం గచ్ఛామి
2) ధర్మం శరణం గచ్ఛామి
3) సంఘం శరణం గచ్ఛామి అని పేర్కొంటారు.
ప్రతి బౌద్ధ మతస్తుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి.

 

మధ్యేమార్గం: బౌద్ధమతం మోక్షసాధనకు చూపిన మార్గాన్ని మధ్యేమార్గం అంటారు. జైనమతం మోక్షసాధనకు అహింసతో కూడిన సల్లేఖన వ్రతాన్ని సూచించగా, బుద్ధుడు అష్టాంగమార్గాన్ని తెలియజేశాడు. బౌద్ధమతాన్నే ప్రతీయ - సముత్పాదన సిద్ధాంతంగా పేర్కొంటారు.
 

సాహిత్యం: బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. అవి వినయ పీటకం, సుత్త పీటకం, అభిదమ్మ పీటకం. వీటిని ప్రాకృత భాషలో రచించారు. హీనయానులు ప్రాకృత భాషను ఉపయోగించగా, మహాయానులు సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో సుహృల్లేఖ, రత్నావళి రాజపరికథ, ఆరోగ్యమంజరి, రససిద్ధాంతం లాంటి గ్రంథాలను రచించాడు. వీటితో పాటు సింహళ గ్రంథాలైన మహావంశ, దీపవంశ విలువైన సాహిత్యంగా పేరొందాయి.
 

శాఖలు
            బౌద్ధమతం కాలానుగుణంగా కొన్ని శాఖలుగా చీలిపోయింది. ముఖ్యంగా రెండో బౌద్ధ సంగీతిలో సంప్రదాయవాదులు థేరవాదులుగా, సంప్రదాయేతరవాదులు మహాసాంఘికులుగా చీలిపోయారు. నాలుగో బౌద్ధ సంగీతిలో తిరిగి బౌద్ధం హీనయాన, మహాయాన శాఖలుగా చీలిపోయింది. హీనయానులు బుద్ధుడిని సాధారణ మానవుడిగా భావించగా, మహాయానులు దేవుడిగా విశ్వసించి పూజించారు.
 

 సాహిత్యం, వాస్తుకళారంగం
           భారతదేశానికి బౌద్ధమతం సాహిత్యం, వాస్తు, కళారంగాల్లో ఎనలేని సేవలను అందించింది. ప్రపంచ వ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందింది. అశోకుడు, కనిష్కుడు లాంటి పాలకుల వల్ల బౌద్ధమతం శ్రీలంక, బర్మా, జపాన్, చైనా, టిబెట్‌ దేశాలకు వ్యాపించింది. భారత వాస్తుకళకు పేరొందిన సాంచి, సారనాథ్, బార్హూత్, అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు. స్తూప, చైత్య, విహారాలు దేశమంతా విస్తరించాయి. బౌద్ధ ఆరామాలైన నలంద, నాగార్జునకొండ, వల్లభి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలుగా పేరొందాయి. ముఖ్యంగా బౌద్ధమత ప్రేరణతో గాంధార, అమరావతి శిల్పకళలు అభివృద్ధి చెందాయి. ప్రాకృత, సంస్కృత భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా బౌద్ధ సాహిత్యం వెలువడింది. నాసిక్, కార్లే, కన్హేరి, అజంతా గుహాలయాల్లో చిత్రలేఖనాలు అభివృద్ధి చెందాయి. బౌద్ధ విహారాలు ఎక్కువగా ఉన్నందున బిహార్‌ను విహార దేశంగా పిలిచేవారు.
 

బౌద్ధ సంగీతులు
        బుద్ధుడి మరణానంతరం బౌద్ధమత అభివృద్ధికి జరిగిన సమావేశాలనే బౌద్ధ సంగీతులుగా పేర్కొన్నారు. మొత్తం నాలుగు బౌద్ధసంగీతులు జరిగాయి.
 

మొదటి సంగీతి: ఇది క్రీ.పూ.483లో రాజగృహంలో అజాతశత్రువు కాలంలో జరిగింది. మొదటి బౌద్ధ సంగీతికి మహాకశ్యపుడు అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే మొదటి రెండు పీటకాలను (వినయ, సుత్త) సంకలనం చేశారు.
 

రెండో సంగీతి: ఇది క్రీ.పూ.383లో వైశాలి నగరంలో కాలాశోకుడి కాలంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు సబకామి.
 

మూడో సంగీతి: ఇది క్రీ.పూ.250లో పాటలీపుత్రంలో అశోకుడి కాలంలో జరిగింది. ఈ సమావేశానికి మొగలిపుతతిస్స అధ్యక్షత వహించాడు. ఈ సంగీతిలోనే అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు.
 

నాలుగో సంగీతి: ఇది క్రీ.శ.100లో కశ్మీర్‌ (కుందనవనం)లో కనిష్కుడి కాలంలో జరిగింది. దీనికి వసుమిత్రుడు అధ్యక్షుడు, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు.
 

బుద్ధుడి జీవితంలో ముఖ్యమైన వారు

           తండ్రి           శుద్ధోధనుడు
 తల్లి  మహామాయ
 భార్య   యశోధర
 పుత్రుడు  రాహులుడు
 బౌద్ధమతంలో చేరిన వేశ్య  ఆమ్రపాలి
 బౌద్ధమతంలో చేరిన దొంగ  అంగుళీమాలుడు
 బుద్ధుడికి గంజి ఇచ్చిన బాలిక (తపస్సుకు ముందు)  సుజాత
 గురువులు   అలారక లామా, ఉద్దారక
 ప్రియశిష్యుడు  ఆనందుడు
 బౌద్ధ సంఘంలో చేరిన తొలి మహిళ  ప్రజాపతి గౌతమి (తొలి బౌద్ధ సన్యాసిని)

 

పంచకల్యాణాలు: బుద్ధుడి జీవితంలో చోటుచేసుకున్న అయిదు ప్రధాన సంఘటనలను బౌద్ధసాహిత్యంలో పంచకల్యాణాలుగా పేర్కొంటారు.

 సంఘటనలు  గుర్తు
 బుద్ధుడి జననం  తామర పువ్వు
 మహాభినిష్క్రమణం  గుర్రం
 సంబోధి  బోధివృక్షం
 ధర్మచక్ర పరివర్తన   చక్రం
 మహాపరి నిర్యాణం  స్తూపం


 

 రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.


* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
    1. స్తూపం
    2. చైత్యం
    3. విహారం

* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
* మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
* ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
* తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
* ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
* 'నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
* శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
* 'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు

           రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది.

           భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.
 

పరిపాలనా విధానం
           రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.
 

సామాజిక వ్యవస్థ
           రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.
 

మత పరిస్థితులు
           రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.
 

ఆర్థిక పరిస్థితులు
           రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.
 

రచయిత - బొత్స నాగరాజు
 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైన మతం

                   క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. నాటి దేశ ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ రంగాల్లో ఉన్న పరిస్థితులే నూతన మతాల ఆవిర్భవానికి దోహదం చేశాయి. ప్రపంచంలో అనేక మంది నూతన మతాలను స్థాపించి కొత్త సిద్ధాంతాలను అందించారు. చైనాలో కన్ఫ్యూషియస్, లౌత్సలు; పర్షియా (ఇరాన్‌)లో జొరాస్టర్‌ లాంటి తత్త్వవేత్తలు నూతన మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు.
 

 నూతన మతాల ఆవిర్భవానికి కారణాలు

         భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉన్న ఆధ్యాత్మిక అశాంతి, బ్రాహ్మణ ఆధిక్యత, యజ్ఞ యాగాల నిర్వహణ లాంటి మత కారణాలతోపాటు షోడశ మహాజనపథాలు ఆవిర్భవించడం; రాచరిక, గణ రాజ్యాల పాలనలోని వ్యత్యాసాలు నూతన మతాల ఏర్పాటుకు దోహదం చేశాయి. నగరాలు, పట్టణాలు ఆవిర్భవించడం; చేతివృత్తుల వారు వివిధ శ్రేణులుగా ఏర్పడటం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం, నాణేలు చలామణిలోకి రావడం, వ్యవసాయ రంగంలో ఇనుము వాడకం ద్వారా అధిక వృద్ధిని సాధించడం వంటి ఆర్థిక పరిణామాలు కూడా ఈ నూతన మతాల పుట్టుకకు కారణమయ్యాయి. ముఖ్యంగా నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ/కుల వ్యవస్థ విస్తరించడం, వివిధ నూతన వర్గాల ఆవిర్భావం లాంటి సామాజిక పరిణామాలు కూడా దోహదపడ్డాయి. వైదిక మతాచారాలకు (అధిక వ్యయంతో కూడుకున్న యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ, బ్రాహ్మణ ఆధిక్యత, జంతుబలి లాంటి మతాచారాలు), నూతనంగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచనా విధానానికి మధ్య ఉండే తేడా వల్ల ఘర్షణలు మొదలై జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.
ప్రధానంగా అన్ని రంగాల్లోనూ రాజుల కంటే బ్రాహ్మణులకే ఆధిక్యత ఉండటం వల్ల వజ్జి, మల్ల గణ రాజ్యాల్లో యువరాజులుగా ఉన్న వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించారు. ఈ కాలంలో అజీవకులు, చార్వాకులు అనే నూతన మతాలు వచ్చినప్పటికీ ప్రజలు మహావీరుడు, గౌతమబుద్ధుడి వ్యక్తిత్వం వల్ల జైన, బౌద్ధ మతాలనే ఆదరించారు.

 

        జైనమత స్థాపన విషయంలో చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చారిత్రకంగా జైనమత స్థాపకులు రుషభనాథుడు, పార్శ్వనాథుడని; వాస్తవంగా స్థాపించింది మాత్రం వర్ధమాన మహావీరుడని అనేకమంది చరిత్రకారులు సిద్ధాంతీకరించారు.
 

 శాఖలు

జైనమతంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వస్త్రాలు ధరించని వారిని దిగంబరులు అంటారు. వీరికి నాయకుడు భద్రబాహుడు. తెల్లని వస్త్రాలు ధరించే జైనులను శ్వేతాంబరులు అంటారు. వీరికి నాయకుడు స్థూలబాహుడు/స్థూలభద్రుడు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలు చీలికకు కారణమయ్యాయి.
 

 పంచవ్రతాలు

జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
1. అసత్యం: అబద్ధం ఆడకూడదు/సత్యమునే పలకాలి
2. అహింస: జీవహింస చేయరాదు/అహింసను పాటించాలి.
3. అస్తేయ: దొంగతనం చేయకూడదు. 
4. అపరిగ్రాహ:  ఆస్తిని కలిగి ఉండరాదు.
5. బ్రహ్మచర్యం: ప్రతి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

 

        జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశాంగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను త్రిరత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. త్రిరత్నాలను జైన, బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు. బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే వాటిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు.
 

 తీర్థంకరులు

            జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే ‘జీవన స్రవంతిని దాటడానికి వారధి’ లాంటివాడని అర్థం. జైనమత సాహిత్యం, సంప్రదాయంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇందులో మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 21వ తీర్థంకరుడు నేమినాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.
 

తీర్థంకరులు                     గుర్తు
రుషభనాథుడు                ఎద్దు
నేమినాథుడు                   నీలి గులాబి
 అరిష్టనేమి                      శంఖం
 పార్శ్వనాథుడు               పాము
 వర్ధమాన మహావీరుడు     సింహం

 

     జినుడు (వర్ధమానుడు) పేరు మీదుగా జైనమతం అనే పేరు వచ్చింది కాబట్టి జైన మత స్థాపకుడు వర్ధమన మహావీరుడు అని చెబుతారు. కానీ జైనమత తొలి తీర్థంకరుడు రుషభనాథుడు అని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు. జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. 
 

        దీనిలో మొదటి నాలుగు వ్రతాలైన అహింస, అస్థేయ, అసత్య, అపరిగ్రాహలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తెలియజేశాడు కాబట్టి అతడే జైనమతాన్ని స్థాపించాడని మరికొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. అయిదో వ్రతం బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు తెలియజేశాడు.
 

 పరిషత్తులు

     జైనమత అభివృద్ధికి రెండు ముఖ్యమైన సమావేశాలు (పరిషత్తులు) నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే జైనమత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను ప్రవేశపెట్టారు.
 

    రెండో జైన పరిషత్తును వల్లభిలో క్షమశ్రవణుడు/దేవార్థి క్షమపణ నిర్వహించాడు. ఈ సమావేశంలో 12 ఉపాంగాలను సంకలనం చేశారు.
 

 వర్ధమాన మహావీరుడు

    జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన క్రీ.పూ.540లో ప్రస్తుత బిహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/అనోజ్ఞ. ఇతడు వైశాలి రాజ్యానికి చెందిన (వజ్జి గణ రాజ్యం) జ్ఞాత్రిక క్షత్రియ వంశస్థుడు. వర్ధమానుడు తన 30వ ఏట ఇల్లు విడిచి 12 ఏళ్లపాటు రిజుపాలిక నదీతీరంలోని జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తపస్సు చేసి 42వ ఏట ‘జినుడు’ అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను/ఇంద్రియాలను జయించినవాడని అర్థం. వర్ధమానుడు మహావీరుడు, కేవలి, నిర్గంగ్రథుడు లాంటి బిరుదులను పొందాడు. తన అనుచరులను జైనమతంగా ఏర్పరిచి, మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ క్రీ.పూ.468లో బిహార్‌లోని పావాపురి ప్రాంతంలో నిర్యాణం చెందాడు.
 

 బోధనలు

      పంచవ్రతాల్లో చివరిదైన బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమానుడే. ఇతడు ద్వైత సిద్ధాంతాన్ని లేదా సాద్వాదాన్ని విశ్వసించాడు. దీని ప్రకారం సృష్టిలో ఆత్మ, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయని తెలిపాడు. పదార్థం నశించిపోతుంది కానీ కోరికల వల్ల ఆత్మ అనేది జన్మ, పునర్జన్మ చట్రంలో ఇరుక్కుపోయి స్వేచ్ఛను కోల్పోతుందని పేర్కొన్నాడు. ఈ చక్రబంధనం నుంచి విముక్తి పొందడం ఎలా అనే దానికి సమాధానం కనుక్కోవడానికే అతడు పరివ్రాజకుడయ్యాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లడాన్ని పరివ్రాజకుడు అంటారు. వర్ధమానుడు 30వ ఏట, గౌతమ బుద్ధుడు 29వ ఏట పరివ్రాజకులయ్యారు. వేదాలు ప్రామాణికంకాదని, యజ్ఞ యాగాల వల్ల మోక్షం రాదని, జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. ముఖ్యంగా వర్ధమానుడు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని సల్లేఖన వ్రతం అంటారు. అంటే వ్యక్తి అన్న పానాదులు మాని శరీరం శుష్కించేవరకు కఠోరమైన తపస్సు చేస్తే మోక్షం వస్తుందని బోధించాడు
 

  మహావీరుడికి గణధారులు (పీఠాధిపతులు) అనే 11 మంది సన్నిహితులైన శిష్యులు/ధర్మదూతలు ఉండేవారు. వారిలో ఆర్య సుధర్ముడు వర్ధమానుడి అనంతరం జైనమతానికి ప్రధాన గురువు (థేరా) కాగా ఈయన తర్వాత జంబు మతగురువు అయ్యాడు. ముఖ్యంగా ధననందుడి పాలనాకాలంలో వర్ధమానుడి తర్వాత సంభూత విజయ గొప్ప జైన మతాచార్యుడిగా పేరొందాడు. ఒక వ్యక్తి కేవలం జ్ఞానాన్ని పొందడానికి 14 ఆధ్యాత్మిక దశలు (పూర్వాలు) దాటాలని పేర్కొన్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరో మతగురువు (థేరా)గా పేరొందిన వ్యక్తి భద్రబాహుడు. ఇతడు కల్పసూత్రాలు అనే గ్రంథాన్ని రాశాడు.
 

 వాస్తుకళాభివృద్ధి

   జైనమతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళా రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు; కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైనమతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్యాభివృద్ధికి కృషిచేశారు. కర్ణాటకలోని శ్రావణబెల్గోళ (గోమఠేశ్వర మఠం), ఒడిశాలోని ఉదయగిరి గుహాలయాలు, రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ పర్వతంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలు జైనమతం వల్ల అభివృద్ధి చెందాయి.
 

     జైనమత ప్రేరణతోనే మధుర శిల్పకళ ఆవిర్భవించింది. ప్రాకృత, సంస్కృత, ప్రాంతీయ భాషల్లో అనేక మంది పండితులు జైన సాహిత్యాన్ని అందించారు. జైనమత గ్రంథాలైన ద్వాదశాంగాలను ప్రాకృత భాషలో రచించారు. భద్రబాహుడి కల్పసూత్రాలు, అమోఘవర్షుడి కవి రాజ మార్గం లాంటి గ్రంథాలు ఈ మతానికి సంబంధించినవే.
 

     ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కొనగండ్ల, తెలంగాణలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక గొప్ప జైన ఆశ్రమాలుగా పేరొందాయి.
 

 రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమ చరిత్ర

మాదిరి ప్రశ్నలు


1. ఇంగ్లండ్‌ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

2. ‘ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌’ గ్రంథ రచయిత
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

3. 1905లో సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

4. ‘1892 చట్టం భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించినవారు?
జ: ఫిరోజ్‌షా మెహతా

 

5. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యురాలైన తొలి మహిళా పట్టభద్రురాలు
జ: కాదంబిని గంగూలీ

 

6. భారతదేశంలో ఆంగ్ల వ్యయం తగ్గింపు అంశంపై నియమించిన కమిషన్‌?
జ: వెల్సీ

 

7. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘ప్రజారాశిలో ఒక నలుసు’ అని ఎవరు విమర్శించారు?
జ: లార్డ్‌ డప్రిన్‌

 

8. భారత జాతీయ కాంగ్రెస్‌కు కార్యదర్శిగా పనిచేసిన తొలి వ్యక్తి?
జ: ఎ.ఒ. హ్యూమ్‌

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమ చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే భారత జాతీయోద్యమ చరిత్రగా పేర్కొంటారు. 1885 నుంచి 1947 మధ్య మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులతో పాటు విప్లవవాదులు దేశ స్వాతంత్య్రం కోసం చేసిన కృషి, ఆంగ్లేయులు ఆంగ్లేయులు భార‌తీయ ఉద్య‌మాల‌ను అణ‌చివేసిన‌ తీరు, ఆంధ్రదేశంలో జరిగిన ఉద్యమాల గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
చరిత్రకారులు భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు ముఖ్యమైన యుగాలు(దశలు)గా వర్గీకరించారు.

 

అవి: 1) మితవాదయుగం (1885 - 1905)
       2) అతివాదయుగం (1905 - 1920) 
       3) గాంధీయుగం (1920 - 1947) 

 

మితవాదులు ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన విధానాల ద్వారా సుమారు ఇరవై ఏళ్లు భారత జాతీయోద్యమాన్ని నడిపారు. అతివాదులు ఆంగ్లేయుల పరుష విధానాలనే పాటిస్తూ ‘స్వరాజ్యం మా జన్మహక్కు’, దాన్ని సాధించి తీరుతామంటూ వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించారు. గాంధీజీ శాంతి, సత్యం, అహింస, పద్ధతులను అనుసరించి సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించారు.
 

మితవాదయుగం (1885 - 1905)
భారత జాతీయోద్యమంలోని 1885 నుంచి 1905 వరకు గల తొలిదశను మితవాదయుగంగా పేర్కొంటారు. మితవాదుల నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు విజ్ఞప్తి - ప్రార్థన - నిరసన అనే పద్ధతులను పాటించారు. భారతీయుల సమస్యలపై విజ్ఞాపనలు ఇవ్వడం, వాటిని పరిష్కరించమని ఆంగ్లేయులను ప్రార్థించడం, అమలు చేయకపోతే నిరసన తెలియజేయడం లాంటి సాధారణ పద్ధతులను అనుసరించారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారిగా, న్యాయం తెలిసినవారిగా, మిత్రులుగా భావించి, వారు మాత్రమే తమ సమస్యలను పరిష్కరిస్తారనే విశ్వాసంతో ఉండేవారు. ఈ మితవాద విధానాల వల్ల వారేమీ సాధించలేకపోయారనేది అతివాదుల విమర్శ. మితవాదయుగంలో ఎ.ఒ. హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, పి.ఆనందాచార్యులు, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా లాంటి నాయకులు ప్రధానపాత్ర పోషించారు.

 

మితవాదుల ఆశయాలు 

* దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య మిత్రభావాన్ని, ఐక్యతను పెంచడం, వారంతా దేశ సౌభాగ్యానికి పాటుపడేలా కృషి చేయడం.
* భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులు, విద్యావంతులు చర్చించి పరిష్కారానికి కృషి చేయడం.
* ప్రజల్లో దేశ సమైక్యతను, జాతీయతాభావాన్ని పెంపొందించడం.
* భారతీయులకు ప్రభుత్వోద్యోగాలు కల్పించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ఆంగ్లేయులను ఒప్పించడం.
* ఆంగ్లేయులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం, బ్రిటిష్‌ సామ్రాజ్యాధినేతల పట్ల కాంగ్రెస్‌ పూర్తి విశ్వాసంతో వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించడం.

మితవాదుల కోర్కెలు
* భారత శాసన సభల విస్తరణ, భారత రాజ్య కార్యదర్శి సలహామండలిని రద్దుచేయడం, భూమి శిస్తును తగ్గించడం, ప్రజాప్రతినిధి సంస్థలను నెలకొల్పడం.
* భారతీయులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం, జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడం, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన.
* విదేశాల్లో ఉన్న భారతీయులకు తగిన రక్షణ కల్పించడం, రైతులకు రుణ సౌకర్యాలను మెరుగుపరిచి వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడం.

మితవాదుల విజయాలు
1885 నుంచి 1905 మధ్య మితవాదులు భారత జాతీయోద్యమాన్ని బలపరిచారు. శాంతియుత, మితవాద పద్ధతులను అనుసరించినప్పటికీ, భారతీయుల సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. 1885లో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశంలో 72 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. 1886లో జరిగిన రెండో  సమావేశానికి సుమారు 436 మంది, 1889 నాటి మూడో సమావేశానికి 1889 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంటే మితవాదుల కృషి వల్లనే భారత జాతీయ కాంగ్రెస్‌ విస్తరించి జాతీయోద్యమం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. 1890 నాటి కాంగ్రెస్‌ సమావేశంలో కాదంబిని గంగూలీ ప్రసంగించారు (ఈమె కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌). మితవాదుల కృషి ఫలితంగానే అనేక రాజ్యాంగ, ఆర్థిక, పాలనాపరమైన సంస్కరణలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు.

 

మితవాదులు సాధించిన విజయాల్లో ముఖ్యమైనవి:
* 1886లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పబ్లిక్‌ సర్వీసు కమిషన్లను ఏర్పాటుచేసింది.
* 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
* ఇంగ్లండ్‌తో పాటు భారత్‌లో కూడా ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షలు నిర్వహించడానికి కామన్స్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు (1893). కానీ ఇది 1923 నుంచి అమల్లోకి వచ్చింది.
* మితవాదుల కృషి ఫలితంగానే భారతదేశంలో ఆంగ్ల వ్యయం తగ్గింపు విషయంపై 1897లో వెల్సీ కమిషన్‌ ఏర్పాటైంది.
* మితవాదులు తమ రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా జాతీయతా భావాన్ని పెంపొందించారు. 
కానీ అతివాదులు మిత‌వాద విధానాల‌ను వ్య‌తిరేకించేవారు. ‘సుమారు 20 ఏళ్ల పాటు ఆంగ్లేయులతో రొట్టె కోసం పోరాడి, చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని అతివాద నాయ‌కుడు లాలాలజపతి రాయ్‌ మితవాదులను విమర్శించారు.

మితవాద నాయకులు

ఎ.ఒ. హ్యూమ్‌ (1829 - 1912)
ఆంగ్లేయుడైన అలెన్‌ ఆక్టేవియన్‌ హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై సివిల్‌ అధికారిగా భారతదేశానికి వచ్చాడు. 1882లో పదవీ విరమణ చేశారు. అనంతరం 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1884లో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని స్థాపించి రిప్పన్‌ వీడ్కోలు సభలను విజయవంతంగా నిర్వహించాడు. 1884లో ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌గా మారింది. ఈ ఏడాదిలోనే భారత తంతి సమాచార సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు.  1885, డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశాన్ని బొంబాయిలో డబ్ల్యు.సి. బెనర్జీ అధ్యక్షతన నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడిగా, తొలి కార్యదర్శిగా పేరొందాడు. వాస్తవానికి ఆంగ్లేయుడైన హ్యూమ్‌ ‘రక్షణ కవాట సిద్ధాంతం’ అనుసరించి, కాంగ్రెస్‌ను స్థాపించాడని ఆధునిక భారతీయ చరిత్రకారుల అభిప్రాయం.

 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
ఈయన భారతదేశ కురువృద్ధుడి (గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా)గా పేరొందాడు. బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1853లో బాంబే అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1865లో ఇంగ్లండ్‌లో తూర్పు ఇండియా సంఘాన్ని స్థాపించి, 1866లో దాన్ని లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా మార్చాడు. కలకత్తా (1886), లాహోర్‌ (1893), కలకత్తా (1906) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1906 నాటి కలకత్తా సమావేశంలో తొలిసారిగా స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. నౌరోజీ 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌లోని కామన్స్‌ సభకు ఎన్నికైన తొలి భారతీయుడు. 1892 - 95 మధ్య బ్రిటిష్‌ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని రచించి అందులో సంపద తరలింపు సిద్ధాంతాన్ని (డ్రైన్‌ సిద్ధాంతం) తెలియజేశాడు. హోంఛార్జీల రూపంలో భారతదేశ సంపద ఇంగ్లండ్‌కు ఏ విధంగా తరలిపోతుందో వివరించాడు. ఆంగ్ల పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా అభివర్ణించాడు.

 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 ఈయన మితవాదుల నాయకుడు, గాంధీ రాజకీయ గురువు, మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరొందాడు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. గోఖలే వాస్తవంగా ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితుడయ్యాడు. 1905 నాటి బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ (భారత సేవా సంఘం)’ని స్థాపించాడు. 1912లో గాంధీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి వివక్షతా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ గోఖలేను పవిత్రమైన గంగానది లాంటి వాడని పేర్కొనగా, తిలక్‌ భారతదేశపు వజ్రంగా వ్యాఖ్యానించాడు.
* మహారాష్ట్ర మాకియవెల్లిగా నానా ఫడ్నవీస్, బెంగాల్‌ సోక్రటీస్‌గా హెన్రీ డెరోజియో పేరుగాంచారు.

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
మకుటం లేని బొంబాయి మహారాజుగా పేరొందిన మితవాది ఫిరోజ్‌షా మెహతా. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించాడు. వందేమాతర ఉద్యమకాలంలో లాల్‌ - బాల్‌ - పాల్‌ విధానాలను వ్యతిరేకించాడు. 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు నాయకత్వం వహించాడు.

 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
ఇండియన్‌ బర్క్, సిల్వర్‌ టంగ్‌ ఆరేటర్‌గా పేరొందిన మితవాది సురేంద్రనాథ్‌ బెనర్జీ. 1876 జులై 26న ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను (కలకత్తా) స్థాపించాడు. డబ్ల్యు.సి. బెనర్జీ స్థాపించిన ‘బెంగాలీ’ పత్రికను నడిపాడు. హ్యూమ్‌ కంటే ముందే ఒక జాతీయ సంస్థ స్థాపనకు కృషిచేశాడు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశాలను నిర్వహించాడు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమం చేసి జైలుకు వెళ్లాడు. పూనా (1895), అహ్మదాబాద్‌ (1902) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమకాలంలో అతివాదులతో కలిసి పనిచేశాడు. సురేంద్రనాథ్‌ బెనర్జీ సేవలను హెన్రీ కాటన్, విలియం వెడ్డర్‌ బర్న్‌ లాంటి ఆంగ్లేయులు సైతం కొనియాడారు.  ఈయన ‘ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

     గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసింది. 1922 మార్చిలో గాంధీజీ అరెస్ట్ తర్వాత జాతీయ నాయకుల్లో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఈ సంధికాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల విషయమై కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలు చివరకు కాంగ్రెస్ చీలిపోవడానికి దారితీశాయి.
 

  చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, హకీం అజ్మల్‌ఖాన్, అలీ సోదరులు తదితరుల నాయకత్వంలోని ఒక వర్గం శాసన మండళ్ల బహిష్కరణకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంది. తద్వారా జాతీయవాదులు మండళ్లలోకి ప్రవేశించి వాటిలో ప్రభుత్వ బలహీనతలను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని భావించాడు. ఈ వర్గాన్ని 'స్వరాజ్యవాదులు', 'మార్పు కోరుకునే వర్గం'గా పేర్కొంటారు.
 

* వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి. రాజగోపాలాచారి, ఎం.ఎ. అన్సారీ నాయకత్వంలోని మరో వర్గాన్ని 'మార్పు కోరని వర్గం'గా పేర్కొంటారు. వీరు శాసన మండళ్లలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు. ఈ వర్గం నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాలను కొనసాగించాలని భావించింది.
 

* అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ, జమ్నాలాల్ బజాజ్, సి. రాజగోపాలాచారిలతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. దేశంలో పర్యటించి శాసనోల్లంఘన ఉద్యమంపై ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం ఈ ఉపసంఘ కర్తవ్యం. ఈ ఉపసంఘం సిఫారసులు గాంధీజీ విధేయులకు, గాంధీజీ వ్యతిరేకవర్గానికి మధ్య భేదాభిప్రాయాలకు దారితీశాయి.

* 1922 డిసెంబరులో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యవాదులు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. 1923 జనవరి 1 న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఈ పార్టీకి చిత్తరంజన్‌దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా వ్యవహరించారు. స్వరాజ్యవాదులు శాసన మండళ్లలో తమ బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో ఉత్సాహం నింపడానికి ఎన్నికలే ప్రధాన సాధనమని వీరు భావించారు.

* 1923 ఫిబ్రవరిలోనే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఈ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలను తగ్గించడానికి యత్నించారు. చివరకు 1923 మేలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'స్వరాజ్య పార్టీ' ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలిపింది.

* 1925 నాటికి గాంధీజీ కూడా ఈ విషయంలో మెతక వైఖరి ప్రదర్శించి, స్వరాజ్య పార్టీని కాంగ్రెస్ రాజకీయ విభాగంగా అంగీకరించారు.

కార్యక్రమాలు

      1923 నవంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ మితవాదులను, ఉదారవాదులను ఓడించింది. కేంద్ర శాసనసభలో 101 సీట్లకు 42 గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సెంట్రల్ ప్రావిన్స్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించి, బెంగాల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాంలలో తగిన సీట్లు గెలుచుకుంది.
 

ప్రధాన డిమాండ్లు: రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పౌర, సైనిక సర్వీసుల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వ్యతిరేకించింది.
 

విజయాలు: 1924 లో కేంద్ర శాసనసభలో ఆర్థిక బిల్లును వ్యతిరేకించింది. స్వరాజ్యపార్టీ నాయకులను శాంత పరిచేందుకు 1924 లో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సంస్కరణల విచార సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్. దీన్నే ముద్దిమాన్ సంఘం అనే పేరుతో కూడా పిలుస్తారు.
 

* 1919 మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారతీయులకు  నష్టం  కలిగించేలా  ప్రభుత్వం 1928 లో ప్రవేశపెట్టిన   ప్రజా రక్షణ బిల్లు  చట్టం  కాకుండా చూడటం స్వరాజ్యపార్టీ సాధించిన మరో విజయం.

* ఉప్పు మీద పన్ను తగ్గించడం, కార్మికుల పరిస్థితులు మెరుగయ్యేలా చర్యలు చేపట్టడం, బెంగాల్‌లో కొన్ని చట్టాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, సెంట్రల్ ప్రావిన్స్‌లో మంత్రులు రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చి ద్వంద్వ ప్రభుత్వం పనిచేయకుండా చూడటం, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉండటం, ప్రభుత్వ విధానాలను బాహాటంగా విమర్శించడం స్వరాజ్యవాదుల ఇతర విజయాలు.

* 1925 లో చిత్తరంజన్‌దాస్ మరణం తర్వాత స్వరాజ్యపార్టీ బలహీనపడింది. లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవీయ, ఎన్.సి. కేల్కర్ హిందువులకు మేలు చేకూరాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి, పదవులు స్వీకరించాలని భావించారు. ఈ వర్గం మోతీలాల్ నెహ్రూపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసింది.

* 1926 లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో 40 సీట్లు, మద్రాసు రాష్ట్ర శాసన మండలిలో సగం సీట్లు సాధించినా, మిగతా రాష్ట్రాల్లో పరాజయాన్ని చవి చూసింది.

* 1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా స్వరాజ్యపార్టీ శాసనసభలను బహిష్కరించి, చివరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైంది.

ప్రాధాన్యం

      బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఉంటూ నిరాశ, నిస్పృహలో ఉన్న సాధారణ ప్రజానీకంలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని మొదట ప్రతిపాదించింది స్వరాజ్యపార్టీనే. సైమన్ కమిషన్ నియామకం దీని కృషి ఫలితమే. శాసన మండళ్లలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిర్గతం చేయడంలో విజయం సాధించింది. వీరి ప్రయత్నాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం చివరకు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి, రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరించింది.
 

సైమన్ కమిషన్ 

బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరు 8 న సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారతీయులకు స్థానం లేకపోవడంతో ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు.
 

* మద్రాసులో 1927 డిసెంబరులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సైమన్ కమిషన్‌ను అన్ని దశలు, అన్ని రూపాల్లో బహిష్కరించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ మొదలైన రాజకీయ పార్టీలు కూడా సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని తీర్మానించాయి.

* అయితే ముస్లింలలో ఒక వర్గం, ఐరోపావారు, ఆంగ్లో-ఇండియన్లు, అణగారిన వర్గాలు ఈ కమిషన్‌ను స్వాగతించాయి. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 న బొంబాయిలో అడుగుపెట్టింది. ఆ రోజున దేశవ్యాప్త హర్తాళ్ పాటించారు. కమిషన్ కలకత్తా, లక్నో, పూనా, విజయవాడ, లాహోర్‌లలో పర్యటించింది. నల్లజెండాల ప్రదర్శన, 'సైమన్ వెనక్కి వెళ్లు' (సైమన్ గో బ్యాక్) నినాదాలతో నిరసన తెలిపారు.

* లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి. పంత్‌లపై లాఠీఛార్జ్ జరిగింది. 1928 అక్టోబరులో లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ని పోలీసులు తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన ఆయన చివరకు అదే ఏడాది నవంబరు 17 న మరణించారు. దీనికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని భగత్‌సింగ్ కాల్చి చంపాడు.

* సైమన్ కమిషన్ 1930, మేలో నివేదిక సమర్పించింది. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ రద్దు, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమైన ప్రతిపాదనలు. సైమన్ కమిషన్ నివేదికపై లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించారు. ఈ చర్చల ఆధారంగా 1935 చట్టాన్ని రూపొందించారు. అయితే ముస్లిం లీగ్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలు సైమన్ నివేదికను వ్యతిరేకించాయి. భారతీయులను సంతృప్తిపరచడానికి అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబరు 31 న (దీపావళి) భవిష్యత్తులో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీన్నే దీపావళి ప్రకటనగా పేర్కొంటారు. 

బట్లర్ కమిటీ

      సైమన్ కమిషన్‌తోపాటు బ్రిటిష్ ప్రభుత్వం 1927 లో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు హార్‌కోర్ట్ బట్లర్, హోల్డ్స్ వర్త్, ఎస్.సి. పీల్. స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను సూచించడమే దీని ప్రధాన బాధ్యత. ఈ సంఘానికి అధికారికంగా పెట్టిన పేరు - భారత రాజ్యాల సంఘం. ఈ సంఘం 16 స్వదేశీ సంస్థానాలను సందర్శించి, 1929 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
 

నెహ్రూ నివేదిక (1928): నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించగలరా అని భారతీయులకు సవాలు విసిరారు. దీనికి జవాబుగా 1928 ఫిబ్రవరిలో దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
 

* 1928 లో బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందు నెహ్రూ నివేదికను ఉంచారు. దీనిపై మహ్మద్ అలీ జిన్నా, ఎం.ఆర్. జయకర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

జిన్నా 14 సూత్రాలు (1929): దిల్లీలో 1929 మార్చిలో జరిగిన ముస్లింలీగ్ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. నెహ్రూ నివేదికను తోసిపుచ్చారు. పద్నాలుగు సూత్రాలను అమలు చేయకుండా భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏ ప్రణాళికా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

ఆంగ్ల సామ్రాజ్య విస్తరణ విధానాలు, వారు సాధించిన రాజకీయ ఐక్యత, ఆంగ్ల పాలన, ఆంగ్ల విద్య, ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన, ఆంగ్లేయులు అనుసరించిన జాతి, వర్ణ వివక్షా విధానాలు, ఆర్థిక దోపిడీ విధానాలతోపాటు సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు, వార్తాపత్రికలు, సాహిత్య రచనలు, ఇల్బర్ట్‌ బిల్లు వివాదం లాంటి సంఘటనలు భారతీయుల్లో జాతీయోద్యమ భావాలను పెంపొందించాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా దేశాన్ని ఆక్రమించడానికి అనేక సామ్రాజ్యవాద విధానాలను అనుసరించారు.  రాజ్యాలను కోల్పోయిన భారతీయ పాలకులు, ఆయా రాజ్యాల్లో ఉపాధి పోగొట్టుకున్న ఉద్యోగులు ఆంగ్లేయుల పట్ల ద్వేష భావాన్ని పెంచుకున్నారు. అనేక భూభాగాలు, రాజ్యాలుగా విడిపోయి ఉన్న భారతదేశాన్ని ఆంగ్లేయులు ఒకే పాలన కిందికి తెచ్చి, ఐక్యతా భావాన్ని పెంచడానికి తోడ్పడ్డారు. ఆంగ్లేయులు కల్పించిన ఆధునిక రవాణా సౌకర్యాలు కూడా దేశంలోని ప్రజల మధ్య పరస్పర అవగాహనకు ఉపకరించాయి. 

1835లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య భారతీయుల్లో జాతీయ చైతన్యం మరింత పెరగడానికి దోహదం చేసింది. ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయులు మిగిలిన భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం లాంటి అంశాలను తెలియజేశారు.
 

19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తిని, జాతీయవాద స్ఫూర్తిని పెంచాయి. భారతదేశం భారతీయులకే అని స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు ఆధునిక జాతీయతకు పితామహుడిగా పేరుగాంచారు. వార్తాపత్రికలు ఆంగ్లేయుల జాతి వివక్ష విధానాలను, ఆర్థిక దోపిడీ విధానాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేసి జాతీయ చైతన్యాన్ని పెంచాయి. ముఖ్యంగా లార్డ్‌ రిప్పన్‌ కాలంలో ప్రవేశపెట్టిన ఇల్బర్ట్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేసిన ఉద్యమం భారతీయుల్లో జాతీయ భావాలను మరింత పెంచి, 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు దారితీసింది. భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రగా పేర్కొంటారు.
 

తొలి రాజకీయ సంస్థలు

ఆధునిక భారతదేశ చరిత్రలో రాజకీయ సంస్థల ఏర్పాటుకు కారకులు కూడా ఆంగ్లేయులే. బెంగాల్‌ రాష్ట్రంలో 1828లో హెన్రీ డిరోజియో నాయకత్వంలో 'అకడమిక్‌ అసోసియేషన్‌' అనే సంస్థ ఏర్పడింది. డిరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా అభివర్ణిస్తారు.  1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘం ఏర్పాటైంది. భారతదేశ చరిత్రలో దీన్ని తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. అనంతరం 1843లో బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. 1851లో బెంగాల్‌ భూస్వాముల సంఘం, బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘం కలిసి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి. దీని తొలి అధ్యక్షుడిగా రాధాకాంత్‌దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ పని చేశారు. 1852 లో దాదాభాయ్‌ నౌరోజీ, పర్థూన్‌జీ జగన్నాథ్‌ లాంటి వారు బాంబే అసోసియేషన్‌ను స్థాపించారు. 1853లో గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
 

దాదాభాయ్‌ నౌరోజీ 1865లో లండన్‌ కేంద్రంగా 'లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌'ను ప్రారంభించారు. ఇదే తర్వాతి కాలంలో ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌గా మారింది. 1870లో జి.వి. జోషి, చిప్లూంకర్‌ పూనా సార్వజనిక సభను స్థాపించారు. దీని తొలి సమావేశం 1871లో ఎం.జి. రనడే అధ్యక్షతన జరిగింది. (పూనా సార్వజనిక సభ స్థాపకుడిగా ఈయన్ను పేర్కొంటారు). 1875లో శిశిర్‌ కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో ఇండియన్‌ లీగ్‌ (బెంగాల్‌) ఏర్పడింది. 1876 జులై 26న సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలసి ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచారి, పి. ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి వల్ల 1884లో మద్రాస్‌ మహాజనసభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, కె.టి. తెలాంగ్‌ లాంటి వారు బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. అయితే ఈ తొలి తరం రాజకీయ సంస్థలన్నీ ఆయా ప్రాంతాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి.
 

 భారతదేశంలో జాతీయోద్యమ భావాలు, ఆందోళనలు రాజా రామ్మోహన్‌రాయ్‌తో ప్రారంభమయ్యాయని ఆధునిక చరిత్రకారులు పేర్కొంటారు. స్వామి వివేకానంద బోధనలు యువకుల్లో దేశభక్తిని పెంపొందించాయి. సురేంద్రనాథ్‌ బెనర్జీ తొలిసారిగా ఒక అఖిల భారత రాజకీయ సంస్థను స్థాపించడానికి కృషి చేశారు. ఇల్బర్ట్‌ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మరచిపోరని థాంప్సన్, గారట్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 1867లోనే డబ్ల్యూసీ బెనర్జీ తన ఇంగ్లండ్‌ ఉపన్యాసంలో ప్రాతినిధ్య ప్రభుత్వ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. క్రిస్టోదాస్‌ పాల్‌ తన హిందూ పేట్రియాట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో ‘‘ఆంగ్లేయులు ఆఫ్రికా, ఆసియా వలసల్లో రాజ్యాంగబద్ధ స్వపరిపాలన ప్రవేశపెట్టి, భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు’’ అని ప్రశ్నించారు.
 

లిట్టన్‌ ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు పంపిన తీర్మానాన్ని గ్లాడ్‌స్టన్‌ (నాటి ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత) కామన్స్‌ సభలో ప్రవేశపెట్టాడు. భారతీయులకు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల అర్హత వయసును తగ్గించడంపై లాల్‌ మోహన్‌ ఘోష్‌ కామన్స్‌ సభలో మాట్లాడాడు. ఇల్బర్ట్‌ బిల్లు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నాటి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేసినందుకు సురేంద్రనాథ్‌ బెనర్జీకి జైలుశిక్ష విధించారు. ఈ విధంగా తొలితరం నాయకులు జాతీయోద్యమ భావాలను ప్రచారం చేయడం ద్వారా భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని పెంపొందింపజేశారు. 1883లో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తొలి మహాసభను కలకత్తాలో నిర్వహించారు. 
 

భారత జాతీయ కాంగ్రెస్‌

1885 డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ అనే ఆంగ్లేయుడి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటైంది. దీని తొలి సమావేశం బొంబాయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పూనాలో జరపాలని భావించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో బొంబాయిలో నిర్వహించారు. విద్యావంతులైన భారతీయులతోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వచ్చే ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో హ్యూమ్ రక్షణ కవాటా సిద్ధాంతాన్ని అనుసరించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన నాటి వైస్రాయ్‌ లార్డ్‌ డఫ్రిన్‌ ఈ‌ చర్యను కొనియాడాడు. కానీ తర్వాతి కాలంలో కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాలవారి సంస్థ (మైక్రోస్కోపిక్‌ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్‌) అంటూ విమర్శించాడు. భారతదేశంపై రష్యా దండెత్తుతుందనే  భయంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని ఛటర్జీ లాంటి పండితులు పేర్కొన్నారు. ‘భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం’ అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నారు.
 

1886లో ఐఎన్‌సీ రెండో సమావేశం కలకత్తాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సుమారు 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1887లో మద్రాస్‌లో బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగిన మూడో సమావేశానికి సుమారు 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్‌ త్యాబ్జీ. నాలుగో సమావేశం 1888లో జార్జియూలె అధ్యక్షతన అలహాబాద్‌లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడు జార్జియూలె. 5వ సమావేశం 1889లో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. ప్రముఖ ఆంగ్లేయ ప్రతినిధి చార్లెస్‌బ్రాడ్‌లా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇతడిని ఇంగ్లండ్‌లో ‘భారత ప్రతినిధి’ సభ్యుడిగా పేర్కొంటారు. కాంగ్రెస్‌ కోరికలను నెరవేర్చడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లేనని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. విలియం వెడ్డర్‌బ‌ర్న్‌ అధ్యక్షతన ఇంగ్లండ్‌లో ఏర్పడిన ‘బ్రిటిష్‌ కమిటీ’కి విలియం డిగ్బీని కార్యదర్శిగా నియమించారు. దాదాభాయ్‌ నౌరోజీని ఇంగ్లండ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచారకర్తగా నియమించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వదేశంలో, ఇంగ్లండ్‌లో భారత జాతీయోద్యమ అభివృద్ధికి కృషి చేసింది. నౌరోజీ ఉద్యమ ప్రచారానికి ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు. కానీ తర్వాతి కాలంలో ఆంగ్లేయులు కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా లార్డ్‌ కర్జన్‌ ‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే నా ప్రధాన ఆశయం’ అని పేర్కొన్నాడు.     
 

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి.ఆనందాచార్యులు. 1891 నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంట్‌. ఈమె 1917 కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు.  
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. గాంధీజీ తన జీవితకాలంలో ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం సమావేశం గాంధీ అధ్యక్షతన జరిగింది. 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జె.బి.కృపలానీ.

 

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి: 
 

   

   1) మితవాద యుగం (1885 - 1905) 
     

   2) అతివాద యుగం (1905 - 1920) 
     

  3) గాంధీ యుగం (1920 - 1947)
 

మితవాద యుగం 
భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి దశను మితవాద యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో భారతీయులు మితవాద విధానాలను అనుసరించారు. మితవాదులకు నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు ప్రార్థన - విజ్ఞప్తి - నిరసన (విజ్ఞప్తి, ప్రార్థన, నిరసన - సరైన క్రమంగా భావించాలి) అనే విధానాలను అనుసరించారు.
భారతీయులకు ఉన్నతోద్యోగాలు, శాసనసభల్లో ప్రశ్నించే హక్కు కల్పించాలని, శాసనసభలను విస్తృతపరచాలని, సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును పెంచాలని కోరారు. ఇంగ్లండ్‌తోపాటు భారతదేశంలో కూడా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు నిర్వహించాలని, భారతదేశంలో ఆంగ్లేయుల సైనిక వ్యయం,  భూమి శిస్తు, ఇతర పన్నులను తగ్గించాలని మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్‌ ద్వారా ఆంగ్లేయులను కోరారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారుగా, తమ స్నేహితులుగా భావించేవారు. ఆంగ్లేయులకు న్యాయం తెలుసని, వారు మాత్రమే  సమస్యలను పరిష్కరించగలరని విశ్వసించేవారు.
 

ఆంగ్లేయులు ప్రారంభంలో మితవాదుల కోర్కెలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించేవారు. దాంతో అతివాదులు మితవాదులను తీవ్రంగా విమర్శించేవారు. ‘ఇరవై సంవత్సరాలపాటు రొట్టె కోసం పోరాడిన మితవాదులు చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని లాలాలజపతిరాయ్‌ మితవాదులను విమర్శించారు. అయితే మితవాదులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పలేం. విద్యావంతులైన భారతీయులు ఇరవై సంవత్సరాలపాటు అనేక మందిని భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరేలా కృషిచేశారు. తొలి కాంగ్రెస్‌ సమావేశానికి కేవలం 72 మంది ప్రతినిధులు హాజరైతే 1888 నాటి నాలుగో కాంగ్రెస్‌ సమావేశానికి 1,888 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మితవాదుల కృషి ఫలితంగానే ఆంగ్ల ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. 1892 భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా భారతదేశంలో పరోక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చ జరపడానికి శాసనసభ్యులను అనుమతించారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 19 నుంచి 21 సంవత్సరాలకు పెంచారు. 1886లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్, ఇండియాలలో ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షల నిర్వహణకు అనుమతించారు.
 

మితవాదుల కోరిక మేరకే భారతదేశంలో సైనిక వ్యయం తగ్గింపు విషయంలో సూచనలు చేయడానికి ఆంగ్ల ప్రభుత్వం 1895లో వెల్సీ కమిషన్‌ను నియమించింది. ఈ విధంగా మితవాదులు 1885 నుంచి 1905 మధ్య సుమారు 20 సంవత్సరాల పాటు జాతీయోద్యమ అభివృద్ధికి కృషిచేశారు.
 

ఎ.ఒ.హ్యూమ్‌ (1829 - 1912) 
 

హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షలు రాసి ఒక సివిల్‌ సర్వెంట్‌గా భారతదేశానికి వచ్చాడు. 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1885లో భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించాడు. లార్డ్‌ రిప్పన్‌ పదవీ విరమణ సమయంలో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, రిప్పన్‌కు ఘనంగా వీడ్కోలు సభలను నిర్వహించాడు. హ్యూమ్‌ రక్షణ కవాట సిద్ధాంతాన్ని అనుసరించి 1885 డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. వాస్తవానికి 1884లోనే హ్యూమ్‌ ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ అనే సంస్థను స్థాపించాడు. దానికే 1885లో దాదాభాయ్‌ నౌరోజీ కాంగ్రెస్‌ అనే పేరును సూచించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన తెలుగు అకాడమీ పుస్తకంలో కాంగ్రెస్‌ అనే పేరును సూచించింది డబ్ల్యూసీ బెనర్జీగా పేర్కొన్నారు.) ఎ.ఒ.హ్యూమ్‌ ‘భారత జాతీయ కాంగ్రెస్‌ పితామహుడి’గా గుర్తింపు పొందాడు.
 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
 

భారతదేశ కురు వృద్ధుడిగా (Grand Oldman of India) పేరొందిన ప్రముఖ మితవాది దాదాభాయ్‌ నౌరోజీ. ఈయన బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1865లో లండన్‌ ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. అదే తర్వాతి సంవత్సరంలో ‘బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది.
 

1886 నాటి రెండో కాంగ్రెస్‌ సమావేశానికి (కలకత్తా), 1893 (లాహోర్‌), 1906 (కలకత్తా) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి కామన్స్‌ సభకు ఎన్నికై, ఇంగ్లండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడిగా కీర్తి పొందారు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని వెలువరించారు. ఆ గ్రంథంలోనే డ్రైన్‌ సిద్ధాంతాన్ని (సంపద తరలింపు సిద్ధాంతం) వివరించారు. ఆంగ్లేయులు భారతదేశ సంపదను ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలించుకుపోతున్నారో తెలిపారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన స్వదేశీ తీర్మానం చేశారు. వెల్సీ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. బ్రిటిష్‌ పాలనను ‘భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర’గా అభివర్ణించారు. బ్రిటిష్‌ నియంతృత్వంలో శాంతి భద్రతల నడుమ మనిషి ప్రశాంతంగా ఆకలిని అనుభవిస్తున్నాడని, ప్రశాంతంగా సర్వనాశనమవుతున్నాడని నౌరోజీ పేర్కొన్నారు. ఈయనే భారతదేశంలో తొలిసారిగా జాతీయాదాయాన్ని అంచనా వేశారు.
 

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
 

మకుటంలేని బొంబాయి మహారాజు, బొంబాయి సింహంగా ప్రసిద్ధి చెందిన మితవాద నాయకుడు ఫిరోజ్‌షా మెహతా. ఈయన నాయకత్వంలోనే 1884లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ ఏర్పాటైంది. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించారు. మితవాదులు 1892 చట్టాన్ని ఆంగ్లేయులు నవ్వుతూ చేసిన మోసంగా అభివర్ణించారు. వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదత్రయంగా పేరొందిన లాల్‌-బాల్‌-పాల్‌ విధానాలను ఫిరోజ్‌షా మెహతా వ్యతిరేకించారు. ముఖ్యంగా 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు ముఖ్య నాయుకుడిగా ఉన్నది ఫిరోజ్‌షా మెహతానే.
 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
 

ఇండియన్‌ బర్క్, సిల్వర్‌టంగ్‌ ఆరేటర్‌ లాంటి బిరుదులను పొందిన ప్రముఖ మితవాద నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ. ఈయన 1869లో ఐసీఎస్‌ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. 1876, జులై 26న ఆనంద్‌ మోహన్‌బోస్‌తో కలిసి కలకత్తాలో ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను స్థాపించారు. డబ్ల్యూ.సి. బెనర్జీ స్థాపించిన బెంగాలీ పత్రికను ఈయన నిర్వహించారు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమించి, జైలుకు వెళ్లారు. 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటనను తర్వాతి కాలంలో ‘భారతదేశంలో మానవ హక్కుల ప్రకటన (మాగ్నాకార్ట్‌)’గా వ్యాఖ్యానించారు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 1895 (పూనా), 1902 (అహ్మదాబాద్‌) భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదులతో చేయి కలిపారు. బెంగాల్‌ విభజన అమల్లోకి వచ్చిన 1905, అక్టోబరు 16న కలకత్తాలోని బహిరంగ సభల్లో ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ప్రసంగించారు. ఈయన వ్యక్తిత్వాన్ని హెన్రీకాటన్, విలియం వెడ్డర్‌బర్న్‌ లాంటి ఆంగ్లేయులు కూడా కొనియాడారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘ఎ నేషన్‌ ఇన్‌ ద మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు.
 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 

మితవాద వర్గానికి ముఖ్య నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. ఈయనను గాంధీజీకి రాజకీయ గురువుగా పేర్కొంటారు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేశారు. గోఖలే ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ రాజకీయంగా ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితమయ్యారు. ఈయన 1905లో బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ’ అనే సంస్థను స్థాపించారు.
 

గోరక్షక ఉద్యమాన్ని కూడా నడిపారు. ‘మహారాష్ట్ర సోక్రటీస్‌’గా పేరొందారు. 1912 లో గాంధీజీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి జాతి వివక్షా విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. గోఖలేను పవిత్రమైన గంగానది లాంటివారని గాంధీజీ, భారతదేశపు వజ్రం లాంటివారని బాలగంగాధర తిలక్‌ పేర్కొన్నారు. గోఖలేను ఆధునిక భారతదేశ ప్రథమ రాజనీతిజ్ఞుడిగా కె.ఎం. ఫణిక్కర్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు. మితవాదులు సుమారు 20 సంవత్సరాల పాటు గోఖలే నాయకత్వంలోనే ఆంగ్లేయులతో పోరాడారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం

జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 1930 జనవరి 26 న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
 

    గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31 లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గాంధీజీ చేసిన 11 డిమాండ్‌లు ....
1. భూమిశిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీర ప్రాంత షిప్పింగ్‌ను భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా పౌరుల స్వీయరక్షణకు ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలి.

 

* ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2 న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12 న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6 న దండి తీరం నుంచి పిడికెడు ఉప్పును తీసుకురావడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటి చెప్పారు. దండి యాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లోని 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
 

* ఉప్పు సామాన్య మానవుడి భోజనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పు అమ్మకం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. గాంధీజీ మాటల్లో 'గాలి, నీరు తర్వాత బహుశా ఉప్పు జీవితంలో ప్రధాన అవసరం'. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ఉప్పును ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
 

ఉద్యమ వ్యాప్తి

తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)
మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు).
పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్ గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు - బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ). ఇతడు ఎర్రచొక్కా దళాన్ని ఏర్పాటు చేశాడు.
* ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

 

ప్రజల భాగస్వామ్యం
* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్‌లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్‌నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.

 

ఉద్యమంలోని వివిధ దశలు
మొదటి దశ (1930 మార్చి - సెప్టెంబరు): ఈ దశలో పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలకపాత్ర పోషించారు.
రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): ఇందులో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలను నిర్బంధించింది. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రంపై కూడా పరిమితులను విధించింది. భూమిశిస్తు చెల్లించని వేలాదిమంది రైతుల భూములను, వారి ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 1931 నాటికి సుమారు 24,000 మందిని అరెస్టు చేశారు.

 

రౌండ్ టేబుల్ సమావేశాలు

* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.

* ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, జిన్నా, ఆగాఖాన్ హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ అంబేడ్కర్ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు.

* ఈ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిథ్యం ఇవ్వాలని, తాను ప్రతిపాదించిన 14 సూత్రాలను ఆమోదించాలని మహమ్మద్ అలీ జిన్నా డిమాండు చేశారు. డా|| అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండు చేశారు.

* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.

గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5): గాంధీజీ అప్పటి వైస్రాయి ఇర్విన్‌తో సమావేశమయ్యేలా తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్. శాస్త్రి, యం.ఆర్. జయకర్ మధ్యవర్తిత్వం చేశారు. దాని ఫలితంగా మార్చి 5, 1931 న గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది.
ముఖ్యాంశాలు: శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్‌చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మైనారిటీ రాష్ట్రాలను (వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
 

కమ్యూనల్ అవార్డు - 1932: 1932 ఆగస్టు 16 న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజకవర్గాలను కేటాయించారు.
 

* షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకవర్గాల్లో ఓటువేసే అధికారాన్ని కూడా కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20 న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మదన్‌మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25 న పుణెలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజకవర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇందులో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జైళ్లలో దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా 63 రోజులపాటు నిరాహారదీక్ష చేసి మరణించిన వ్యక్తి?
జ: జతిన్‌దాస్

 

2. రైతులు విదేశీ పాలన నుంచే కాక భూస్వాములు, పెట్టుబడిదారుల పాలన నుంచీ విముక్తి పొందాలన్న వ్యక్తి?
జ: భగత్‌సింగ్

 

3. అఖిల భారత కిసాన్ సభ మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ: స్వామి సహజానంద సరస్వతి

 

4. క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది?
జ: 1942 మార్చి

 

5. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసిన మొదటి మహిళ?
జ: కాదంబిని గంగూలీ

 

6. 'వీపుమీద కొట్టమని ప్రార్థించండి, పొట్టమీద కొట్టొద్దని చెప్పండి' అని పేర్కొన్నది?
జ: దాదాబాయి నౌరోజీ

 

7. 1907 లో లండన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో సర్ కర్జన్ విల్లీని కాల్చి చంపిన వ్యక్తి?
జ: మదన్‌లాల్ డింగ్రా

 

8. ''విభజించి, భారతదేశాన్ని విడిచి వెళ్లు" అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ?
జ: ముస్లింలీగ్

 

9. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నాటి భారత వైస్రాయ్?
జ: వేవెల్

 

10. స్వతంత్ర పార్టీ స్థాపకుడు ఎవరు?
జ: సి. రాజగోపాలాచారి

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1922 లో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు?
జ: చిత్తరంజన్‌దాస్

 

2. కిందివారిలో మార్పు కోరని వర్గానికి చెందనివారు?
ఎ) వల్లభాయ్ పటేల్      బి) ఎం.ఎ. అన్సారీ    
సి) రాజగోపాలాచారి      డి) విఠల్‌భాయ్ పటేల్
జ: డి (విఠల్‌భాయ్ పటేల్)

 

3. స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి?
జ: మోతీలాల్ నెహ్రూ

 

4. స్వరాజ్యపార్టీ కృషితో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
జ: అలెగ్జాండర్ ముద్దిమాన్

 

5. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి?
జ: బిర్కెన్ హెడ్

 

6. స్వదేశీ సంస్థానాలతో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం?
జ: బట్లర్

 

7. సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
జ: బాల్డ్విన్

 

8. ప్రజారక్షణ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్న పార్టీ?
జ: స్వరాజ్య

 

9. నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగం కానిది?
జ: కుటీర పరిశ్రమలు

 

10. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారు?
జ: మద్రాసు

 

11. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించింది?
జ: 1928

 

12. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని చంపింది?
జ: భగత్‌సింగ్

 

13. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించమని సవాలు విసిరిన వ్యక్తి?
జ: బిర్కెన్ హెడ్

 

14. నెహ్రూ నివేదికపై జిన్నాతో తీవ్రంగా విభేదించింది?
జ: ఎం.ఆర్. జయకర్

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

         భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు అనేక రాజకీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. అయితే వీటిలో ప్రధానమైంది 1876లో కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్. ఇది సివిల్ సర్వీస్ వ్యవస్థలో సంస్కరణలు, కౌలుదారుల హక్కుల రక్షణ, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల హక్కులు మొదలైన విషయాలపై పోరాడింది. బెంగాల్‌లోని గ్రామాలు, పట్టణాల్లో, బెంగాల్ రాష్ట్రం బయట అనేక నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త సంస్థగా ఎదగడానికి 1883, 1885లో రెండు జాతీయ సమావేశాలను కూడా నిర్వహించింది.
 

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
     భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందున్న సంస్థలన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడినవే. అవన్నీ ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, స్థానిక సమస్యల పట్ల దృష్టి సారించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కొందరు జాతీయ నాయకులు గుర్తించారు. దీంతో దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తలు దేశవ్యాప్త సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు.

* పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ అలాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు వారంతా ఆయనకు తమ సహకారాన్ని అందించారు. 1883 లో కలకత్తా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు రాసిన బహిరంగ లేఖలో హ్యూమ్ అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.
 

*  1885 లో భారత జాతీయ యూనియన్ అనే సంస్థను ఏర్పాటు చేసి మూడు ప్రెసిడెన్సీలలో పర్యటించాడు. అదే ఏడాది డిసెంబరులో పూనాలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పూనాలో కలరా వ్యాధి వ్యాపించడంతో సమావేశ వేదికను బొంబాయిలోని తేజ్‌పాల్ సంస్కృత పాఠశాలకు మార్చాల్సి వచ్చింది.
 

* దాదాబాయి నౌరోజీ సూచన మేరకు 'భారత జాతీయ యూనియన్‌'లో యూనియన్‌ను తొలగించి దాని స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చారు.
 

* కాంగ్రెస్ మొదటి సమావేశం డిసెంబరు 28 న బొంబాయిలో ఉమేశ్‌చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి సమావేశానికి బెంగాల్ నాయకులను దూరంగా ఉంచారు.
 

* కాంగ్రెస్ రెండో సమావేశం 1886 లో కలకత్తాలో జరిగింది. 436 మంది ప్రతినిధులు హాజరైన ఈ సభకు దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు.
 

* మూడో సమావేశం 1887 లో మద్రాసులో జరిగింది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించారు. నాలుగో సమావేశం 1888 లో అలహాబాద్‌లో జరిగింది. దీనికి జార్జి యూల్ అధ్యక్షత వహించి, ఆ బాధ్యత చేపట్టిన తొలి విదేశీయుడయ్యారు.
 

* భారత జాతీయ ఉద్యమం మూడు దశల్లో సాగింది.
1. మితవాద యుగం (క్రీ.శ. 1885 - 1905)
2. అతివాద యుగం (క్రీ.శ. 1905 - 1919)
3. గాంధీయుగం (క్రీ.శ. 1919 - 1947)

 

మితవాద యుగం
 

      కాంగ్రెస్ మొదట్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శిస్తూ, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ తీర్మానాలు చేసింది. ఏటా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. కాంగ్రెస్ చేపట్టిన మితవాద చర్యల వల్ల ఈ కాలాన్ని మితవాద యుగంగా పిలిచారు. కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావించింది. దీంతో 19 వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు వచ్చింది.
 

* ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో మితవాద జాతీయ నాయకులు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోలాగా భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే స్వపరిపాలనకు అనుమతించాలని కోరారు. మొదటిసారిగా 1905 లో గోపాలకృష్ణ గోఖలే, 1906 లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ తరపున ఈ డిమాండ్ చేశారు.
 మితవాద నాయకుల్లో ముఖ్యులు: దాదాబాయి నౌరోజీ, మహదేవ గోవింద రనడే, సురేంద్రనాధ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్‌త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, దీన్ షా వాచా, రాస్ బిహారి ఘోష్, ఆనందమోహన్ బోస్, రమేష్ చంద్రదత్, కె.టి. తెలాంగ్, ఎ.సి. మజుందార్, సుబ్రమణ్య అయ్యర్, ఆనందాచార్యులు, విలియం వెడ్డర్ బర్న్, హెన్రీ కాటన్ మొదలైనవారు.

 

ప్రధానమైన డిమాండ్లు:
* భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌ను విస్తరించడం

* ఉప్పు మీద పన్నును, రక్షణ బడ్జెట్‌ను తగ్గించడం
* భారత వస్త్ర పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడం
* ఆంగ్లేయ అధికారుల స్థానంలో భారతీయ అధికారులను నియమించడం
* భారతీయ పత్రికలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం
* పోలీసు శాఖలో సంస్కరణలను ప్రవేశపెట్టడం
* భూస్వాముల అరాచకాల నుంచి రైతులకు రక్షణ కల్పించడం
* పోటీ పరీక్షలను భారతదేశంలోనూ నిర్వహించడం
* కరవు కాటకాలు సంభవించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం
* రైతులకు రుణ సౌకర్యాలు కల్పించడం
* న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం
* మన దేశం నుంచి ఇంగ్లండ్‌కి సంపద తరలింపును ఆపడం
* భారతదేశంలో సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయడం, మొదలైనవి.

 

మితవాదుల విధానాలు
మితవాదుల విధానాలను రాజ్యాంగబద్ధమైన పోరాటంగా పేర్కొనవచ్చు. వారు సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు, తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మాత్రమే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. వారు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతులకే పరిమితం చేసి సామాన్య ప్రజలు జాతీయ ఉద్యమంలో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. మితవాద నాయకులు రాజకీయ హక్కులు, స్వయంపాలనను క్రమంగా సాధించాలనుకున్నారే గానీ వెంటనే కావాలని కోరలేదు.

విజయాలు
* ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించడం

* జాతి, మత, కుల, ప్రాంతీయ సంకుచిత భావాలను తొలగించి ప్రజాస్వామ్య, జాతీయ భావాలను ప్రచారం చేయడం.
* బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానాలతో భారతదేశ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం. ఉదా: దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం.
* భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం మరింత ఉద్ధృతం కావడానికి అవసరమైన గట్టి పునాదులు నిర్మించడం.
* బ్రిటిష్ ప్రభుత్వం 1892 లో భారత కౌన్సిళ్ల చట్టాన్ని రూపొందించడం.
* 1892 తర్వాత 'కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం' అనే నినాదాన్ని తేవడం.
* అటవీ చట్టాలు, పరిపాలనలో మార్పులు తీసుకురావడం.
* 1878 లో చేసిన ఆయుధాల చట్టాన్ని సవరించడం.
* సైన్యంలో భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించడం.

 

అపజయాలు
* సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయకపోవడం.

* చాలాకాలం వరకు బ్రిటిష్‌వారి నిజమైన స్వభావాన్ని గ్రహించలేకపోవడం.
* రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకపోవటం.
* కాంగ్రెస్ సభ్యత్వం ప్రధానంగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, సంస్కరణవాదులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులకే పరిమితం కావడం.
* 1892 - 1909 మధ్య కాలంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల్లో 90% మంది హిందువులే ఉండటం.
* బ్రిటిష్ వారి 'విభజించి పాలించు విధానం', అలీగఢ్ ఉద్యమ నాయకులు ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉండమని కోరడంతో వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా చేరకపోవడం.

 

కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి...
     పదవీ విరమణ చేసిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికే కాంగ్రెస్‌ను స్థాపించాడనే విమర్శ ఉంది. అప్పటి వైస్రాయ్ డఫ్రిన్ 1886 లో కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రతినిధుల కోసం గొప్ప విందు ఏర్పాటుచేశాడు. అలాగే 1887 లో కాంగ్రెస్ మూడో సమావేశం సందర్భంగా మద్రాసు గవర్నర్ కాంగ్రెస్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.

* అయితే కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ సంబంధాలు, సహకారం తాత్కాలికమే. క్రమేణా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సహకరించడానికి బదులు కాంగ్రెస్ పట్ల అనుమానాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ బలం పెరగడం, కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దీనికి ప్రధాన కారణాలు.

* గవర్నర్ జనరల్ మొదలు ప్రభుత్వ అధికారులంతా జాతీయ నాయకులను అవిధేయులైన బాబులు, కుట్రపూరితమైన బ్రాహ్మణులు, క్రూరమైన ప్రతినాయకులుగా వర్ణించారు.
* 1890 లో బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంపై ఆంక్షలు విధించింది. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రాజా శివప్రసాద్, ప్రభుత్వానికి విధేయులైన మరికొంతమందిని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించేలా ప్రోత్సహించింది.
* కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చిత్రించి, 1906 లో ముస్లింలీగ్‌ను ప్రారంభించేలా ముస్లింలను రెచ్చగొట్టింది. దీంతోపాటు ప్రభుత్వం అణిచివేత విధానాలను చేపట్టింది.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం - తొలి రాజకీయ సంస్థలు

మాదిరి ప్రశ్నలు


1. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘‘అల్ప సంఖ్యాకుల సంస్థ, ప్రజారాశిలో ఒక నలుసు’’ అని వ్యాఖ్యానించింది?
జ: లార్డ్‌ ఢప్రిన్‌ 

 

2. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ?
జ: అనిబిసెంటు

 

3. భారతదేశంలో తొలి రాజకీయ సంస్థగా పేరొందింది?
జ: బెంగాల్‌ భూస్వాముల సంఘం

 

4. లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపకులు?
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

5. పుణె సార్వజనిక సభను ఎప్పుడు స్థాపించారు?
జ: 1870

 

6. 1876 నాటి ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపనలో సురేంద్రనాథ్‌ బెనర్జీకి సహాయపడింది?
జ: ఆనంద్‌మోహన్‌ బోస్‌

 

7. భారతదేశంలో రాజకీయ చైతన్యానికి, సంస్కరణలకు కృషి చేసిన తొలివ్యక్తి?
జ: రాజా రామ్మోహన్‌రాయ్‌

 

రచయిత: బొత్స నాగరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం - తొలి రాజకీయ సంస్థలు

భారతదేశంలో రాజకీయ చైతన్యానికి, రాజకీయ సంస్కరణలకు కృషిచేసిన తొలి వ్యక్తి రాజా రామ్మోహన్‌రాయ్‌. పత్రికా స్వేచ్ఛ, న్యాయ సంఘం ద్వారా విచారణలు, పరిపాలనా విభాగం నుంచి న్యాయ వ్యవస్థను వేరుచేయడం ఉన్నత పదవుల్లో భారతీయులకు ప్రవేశం కల్పించడం లాంటి అంశాలపై రాజా రామ్మోహన్‌రాయ్‌ పోరాడారు. ఆయన తర్వాత బెంగాల్‌లో ఉగ్రవాద భావాలున్న యువకులు హెన్రీ డెరోజియో నాయకత్వంలో రాజకీయ చైతన్యం, భారతీయుల హక్కుల కోసం పోరాటాలు మొదలుపెట్టారు. 1828లో వీరంతా కలిసి అకడమిక్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. డెరోజియన్లుగా వీరు పేరొందారు. హెన్రీ డెరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా పిలిచారు. డెరోజియన్లు రాజకీయ చైతన్యం కోసమే కాకుండా సాంఘిక, నైతిక సమస్యలపై కూడా పోరాడేవారు. కానీ వీరి విప్లవ భావాల వల్ల ఎక్కువగా ప్రజలను ఆకర్షించలేకపోయారు. 1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘాన్ని స్థాపించారు. దీన్నే భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. ఈ సంస్థ కూడా కేవలం బెంగాల్, బిహార్, ఒడిశా ప్రాంతాల్లో ఉన్న భూస్వాముల ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా పేరొందింది.

1843లో జార్జి థాంప్సన్, డేనియల్‌ ఒకానల్‌ లాంటి ఆంగ్లేయులు బెంగాల్‌లో బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. ద్వారకానాథ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ సంఘంలో సభ్యులుగా పనిచేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన రాజకీయ సంస్థ 1851లో బెంగాల్‌ ఏర్పడింది. అదే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌. ఇంతకుముందు ఉన్న బెంగాల్‌ భూస్వాముల సంఘం (1838), బ్రిటిష్‌ ఇండియా సంఘం (1843) కలిసి ఏర్పడిందే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌.

బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాథాకాంత్‌ దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌లు పనిచేశారు. శాసనసభల ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలని ఈ సంఘమే తొలిసారిగా ప్రతిపాదించింది. 1852లో బొంబాయి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను దాదాభాయ్‌ నౌరోజీ, జగన్నాథ్, నౌరోజీ పర్థూన్‌జీ లాంటి వారు స్థాపించారు. (గమనిక: బొంబాయి అసోసియేషన్‌ను 1852లో స్థాపించినట్లు చాలా పుస్తకాల్లో పేర్కొన్నారు. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోషియేషన్‌ స్థాపించారు. ఈ తేడాను అభ్యర్థులు గమనించాలి.) 1853లో గాజుల లక్ష్మీనరసుశెట్టి లాంటివారు మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన భారత జాతీయోద్యమ చరిత్ర 3వ భాగంలో 1853 అని ఉండగా బిపిన్‌చంద్ర రాసిన ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకంలో 1852లో అని ఉంది). బొంబాయి అసోసియేషన్‌ భారతీయుల విద్యాభివృద్ధికి, భారతీయ ప్రతినిధులతో కూడిన శాసనసభల ఏర్పాటుకు, భారతీయుల ఉన్నతోద్యోగాల కల్పనకు ఆంగ్లేయులు కృషిచేయాలని కోరితే, మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ రైతులు, కార్మికులు, కూలీ పనివారి సమస్యల సాధన కోసం కృషిచేసింది. ఈ విధంగా 1858కి పూర్వం ఏర్పడిన సంస్థలన్నీ కేవలం అయా ప్రాంతీయ ప్రాతిపదికపై ఏర్పడినవే. అందుకే అవి ఆయా ప్రాంతాల సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యమిచ్చేవి.

1858 తర్వాత ఏర్పడ్డ సంస్థలు అఖిల భారత స్థాయి సమస్యల సాధన కోసం కొంతమేర కృషి చేశాయి. 1865 మార్చి 24న దాదాభాయ్‌ నౌరోజీ, డబ్ల్యూసీ బెనర్జీ లాంటివారు ఇంగ్లండ్‌లో లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ 1866 నాటికి ‘ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది. భారతీయుల పరిస్థితులను ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి, ఇంగ్లండ్‌ ప్రజలకు తెలిసేలా ఈ సంస్థ కృషి చేసింది. దాదాభాయ్‌ నౌరోజీ ఈ సంస్థ శాఖలను భారతదేశంలో కూడా నెలకొల్పారు. పూనాలో (1870) జీవీ జోషీ, చిప్లూంకర్‌ ‘పూనా సార్వజనిక సభ’ను స్థాపించారు. ఈ సంస్థ తొలి సమావేశం 1971లో మహదేవ గోవింద రనడే అధ్యక్షతన జరిగింది. భారతీయులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ విక్టోరియా మహారాణికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

బెంగాల్‌లో శిశిర్‌కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో బెంగాల్‌ ఇండియన్‌ లీగ్‌ (1875) అనే సంఘం ఏర్పడింది. 1876 జులై 26న కోల్‌కతాలో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌మోహన్‌ బోస్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. సివిల్‌ సర్వీసు పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టాలని ఈ సంస్థ తన ఆందోళనను ప్రారంభించింది. అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందిన మొదటి ఆధునిక భారతీయుడిగా సురేంద్రనాథ్‌ బెనర్జీ పేరొందారు. జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారులు హక్కుల పరిరక్షణ, తేయాకు తోట కార్మికుల హక్కుల కోసం విదేశీ తేయాకు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఇండియన్‌ అసోసియేషన్‌ పోరాడింది.

1884లో సుబ్రహ్మణ్య అయ్యర్, వీర రాఘవాచారి, ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి కారణంగా మద్రాస్‌ మహాజన సభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌ షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జి. కె.టి. తెలాంగ్‌ లాంటి వారి కృషి ఫలితంగా బాంబే ప్రెసెడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ విధంగా 1885కు ముందు స్థాపించిన సంస్థలన్నీ ఎక్కువగా ఆయా ప్రాంతాల సమస్యల కోసమే పోరాడేవి తప్ప అఖిల భారత స్థాయి ప్రాతినిధ్య సంస్థలుగా ఎదగలేదు. ఆ సంస్థలో సభ్యత్వం, నాయకత్వం ఆయా నగరాలకే పరిమితమై ఉండేది. సురేంద్రనాథ్‌ బెనర్జీ, 1883, 1885లో రెండుసార్లు కోల్‌కతాలో జాతీయసభ సమావేశాలను నిర్వహించినప్పటికీ అది జాతీయ ప్రాతినిధ్య సంస్థగా మారలేకపోయింది. సురేంద్రనాథ్‌ బెనర్జీ సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే అభ్యర్థుల అర్హత వయసును లార్డ్‌ లిట్టన్‌ 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించి వేయడంపై దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యంగా విద్యార్థులను జాతీయోద్యమంలో భాగస్వాములను చేయడానికి విద్యార్థి సంఘాలను స్థాపించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు ముందు స్థాపించిన సంస్థలు, నాయకులు జాతీయోద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన (1885)

భారత జాతీయోద్యమ చరిత్రలో అతి ప్రధాన ఘట్టం భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన. మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థను స్థాపించాలని అనేకమంది భారతీయ నాయకులు ఆలోచించినప్పటికీ ఆ ఆలోచనకు తుది రూపు ఇచ్చింది ఆంగ్లేయుడైన ఏవో హ్యూమ్‌. 1885, డిసెంబరు 28న హ్యూమ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. దీని తొలి సమావేశం ముంబయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ తొలి కాంగ్రెస్‌ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహిస్తే మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనలో హ్యూమ్‌ రక్షక కవాట సిద్ధాంతాన్ని అనుసరించాడని ఆధునిక భారతీయ చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులు చేస్తున్న ఆందోళనలను భారతీయుల సహాయంతోనే అణచివేయాలనే భావంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని వారి భావన. ‘‘మన నిర్వాకం వల్ల ఉప్పొంగే మహాశక్తిని ఉపశమింపజేయడానికి అనువైన మార్గాన్ని చూడటం మన తక్షణ అవసరం’’ అని హ్యూమ్‌ పేర్కొన్నాడు. కాంగ్రెస్‌ స్థాపన కాలంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ డఫ్రిన్‌ తర్వాతి కాలంలో అదే కాంగ్రెస్‌ను ‘మైక్రోస్కోపిక్‌ మైనారిటీ సంస్థ’గా విమర్శించాడు. భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రసరించిన ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నాడు.

భారత జాతీయ కాంగ్రెస్‌ను నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. మొత్తం భారతీయులకు ప్రాతినిధ్య సంస్థగా పనిచేయడం, అందరి మధ్యా స్నేహబంధాన్ని పెంచి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం, భారతీయుల అవసరాలు, కోర్కెలను బ్రిటిష్‌వారికి విన్నవించి పరిష్కరించడం, ప్రజాభిప్రాయాన్ని సుశిక్షితం చేసి, సమీకరించి ప్రజాస్వామ్య భావాలను పెంపొందించడం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పుణెలో జరపాలని నిర్ణయించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో ముంబయిలో నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ రెండో సమావేశం 1886, డిసెంబరులో కోల్‌కతాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడో సమావేశం మద్రాస్‌లో (1887) బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. దీనికి మొత్తం 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం బద్రుద్దీన్‌ త్యాబ్జీ. 1888లో నాలుగో సమావేశం అలహాబాద్‌లో జార్జి యూలె అధ్యక్షతన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడిగా జార్జి యూలె పేరొందారు. 1889లో అయిదో సమావేశం ముంబయిలో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చార్లెస్‌ బ్రాడ్‌లా లాంటి ఆంగ్లేయులు హాజరయ్యారు.

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి పి. ఆనందాచార్యులు. 1891 నాటి నాగపూర్‌ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంటు, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. 1917 నాటి కోల్‌కతా సమావేశానికి అనిబిసెంటు అధ్యక్షత వహిస్తే 1925 కాన్పూర్‌ సమావేశానికి సరోజినీనాయుడు అధ్యక్షత వహించారు. గాంధీజీ ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం కాంగ్రెస్‌ సమావేశం గాంధీజీ అధ్యక్షతన జరిగింది. 1947 నాటికి అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి జె.బి. కృపలానీ. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎక్కువసార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర గ్రంథాన్ని రచించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్‌ చరిత్రకారుడిగా పేరొందారు. కాంగ్రెస్‌ ఆశయాలను ప్రచారం చేయడానికి దాదాభాయ్‌ నౌరోజీ ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు.

ఆంగ్లేయులు ప్రారంభించిన భారత జాతీయ కాంగ్రెస్‌ క్రమంగా బలపడటంతో కాంగ్రెస్‌ పట్ల ఆంగ్లేయుల దృక్పథం మారిపోయింది. లార్డ్‌ డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను అల్పసంఖ్యాక వర్గాల సంస్థగా పేర్కొన్నాడు. ‘కాంగ్రెస్‌ కోర్కెలను మన్నించడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లే’ అని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నాయకుల ఆశయాన్ని ‘అంతగా లోతు తెలియని గొయ్యిలోకి అడుగువేస్తున్న అవివేక చర్య’గా డఫ్రిన్‌ అభివర్ణించాడు. కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా ఆంగ్లేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం పైన విశ్వాసంలేని వాళ్లనీ, రాజద్రోహపూరిత బ్రాహ్మణులనీ, తీవ్ర దుర్మార్గులనీ కాంగ్రెస్‌ నాయకులను విమర్శించేవారు.

డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను ‘‘ప్రజారాశిలో ఒక నలుసని’’ గేలి చేశాడు. లార్డ్‌ కర్జన్‌ ‘‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే తన ప్రధాన ధ్యేయం’’ అని పేర్కొన్నాడు. 1900లో లార్డ్‌ కర్జన్‌ భారత రాజ్య కార్యదర్శికి లేఖ రాస్తూ ‘‘కాంగ్రెస్‌ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కన్నుమూయడానికి సహాయపడాలని నా కోరిక’’ అని పేర్కొన్నాడు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపి భారతదేశం నుంచి ఆంగ్లేయులను తరిమివేసింది.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతివాద యుగం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను' అని ప్రకటించిందెవరు?
జ:  బాలగంగాధర తిలక్

 

2. భారత అధికార రహస్యాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ:  1904

 

3. బెంగాల్ విభజనను రద్దు చేసిన సంవత్సరమేది?
జ:  1911

 

4. బాలగంగాధర తిలక్ 1893లో ఏ ఉత్సవం ప్రారంభించారు?
జ:  గణపతి ఉత్సవం

 

5. తిలక్ 'శివాజీ ఉత్సవా'న్ని ఎప్పడు ప్రారంభించారు?
జ:  1895

 

6. అతివాద యుగ ఆవిర్భవానికి ఏ దేశ విప్లవ ఉద్యమం కారణం కాదు?
జ:  జపాన్

 

7. తిలక్ ఏ భాషలో 'కేసరి' పత్రికను ప్రచురించారు?
జ:  మరాఠీ

 

8. వందేమాతరం ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి -
జ:  బాలగంగాధర తిలక్

 

9. 'అన్‌హ్యాపీ ఇండియా' పుస్తక రచయిత -
జ:  లాలా లజపతిరాయ్

 

10. ట్రిబ్యూన్, న్యూ ఇండియా పత్రికల స్థాపకుడు -
జ:  బిపిన్ చంద్రపాల్

 

11. బెంగాల్ జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తి-
జ:  అరబిందో ఘోష్

 

12. లాలా లజపతిరాయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
జ:  పంజాబ్

 

13. బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ:  1905 అక్టోబరు 16

 

14. 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే పేరుతో వ్యాసాలు రాసిందెవరు?
జ:  అరబిందోఘోష్

 

15. 'ఆనంద మఠం' గ్రంథ రచయిత-
జ:  బంకించంద్ర ఛటర్జీ

 

16. 1906లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడెవరు?
జ:  దాదాబాయి నౌరోజీ

 

17. 'అమర్ సోనార్ బంగ్లా' గీత రచయిత -
జ:  రవీంద్రనాథ ఠాగూర్

 

18. వందేమాతర ఉద్యమం ప్రారంభం నాటి భారతరాజ్య కార్యదర్శి -
జ:  మోర్లే

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. బెంగాల్‌ సోక్రటీస్‌గా పేరు పొందిన వ్యక్తి?
జ: హెన్రీ డిరోజియో

 

2. భారతదేశంలో తొలి రాజకీయ సంస్థగా పేరు పొందింది?
జ: బెంగాల్‌ భూస్వాముల సంఘం (1838)

 

3. ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపనలో సురేంద్రనాథ్‌ బెనర్జీకి సహాయ చేసినవారు?
జ: ఆనంద్‌ మోహన్‌ బోస్‌

 

4. ‘ఆధునిక జాతీయతాభావ పితామహుడు’గా పేరు పొందింది?
జ: స్వామి వివేకానంద

 

5. 1883లో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసింది?
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

6. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘అల్ప సంఖ్యాక వర్గాల సంస్థ’ అని వ్యాఖ్యానించినవారు?
జ: డఫ్రిన్‌

 

7. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ?
జ: అనిబిసెంట్‌

 

8. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడు ఎవరు?
జ: ఎ.ఒ.హ్యూమ్‌

 

9. భారత జాతీయ కాంగ్రెస్‌లో మితవాదులకు నాయకుడు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

10. ‘ఎ నేషన్‌ ఇన్‌ ద మేకింగ్‌’ గ్రంథ రచయిత?
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

11. 1895లో ఆంగ్ల ప్రభుత్వం సైనిక వ్యయం తగ్గింపు విషయంపై నియమించిన కమిటీ ఏది?
జ: వెల్సీ కమిటీ

 

12. ఇంగ్లండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు?
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

13. మితవాదులు ఏ చట్టాన్ని ‘ఆంగ్లేయులు నవ్వుతూ చేసిన మోసం’ అని విమర్శించారు?
జ: 1892 చట్టం

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతివాద యుగం

మితవాద నాయకులు క్రీ.శ. 1905 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. వీళ్లు రాజ్యాంగబద్దమైన విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావించి విఫలమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు డిమాండ్లను పోరాడి సాధించుకోవాలన్న ఉద్దేశంతో అతివాద యుగ ప్రారంభానికి కారకులయ్యారు.
 

అతివాద యుగం ఆవిర్భవానికి కారణాలు:

i) బ్రిటిష్ పరిపాలకుల ఆర్థిక దోపిడీని భారతీయులు గ్రహించారు. ఆంగ్లేయులు అవలంబించిన ఆర్థిక విధానాలతో భారతదేశంలో 1896-1900 సంవత్సరాల మధ్య తీవ్ర కరవులు సంభవించాయని అర్థం చేసుకున్నారు.
 

ii) మితవాదులు అవలంబించిన విధానాలు విఫలం కావడం, 1892లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఇండియా కౌన్సిళ్ల చట్టం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
 

iii) బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలు: జాతీయవాదాన్ని ప్రచారం చేయడం నేరమంటూ 1898లో చేసిన చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించడానికి 1904లో చేసిన భారత అధికార రహస్యాల చట్టం, బాలగంగాధర తిలక్, ఇతర పత్రికా సంపాదకులను జాతీయవాదాన్ని ప్రచారం చేసినందుకు జైలులో నిర్బంధించడం దీనికి ఉదాహరణలు.
 

iv) సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఏడాదికోసారి సమావేశాల నిర్వహణకు బదులు, నిరంతర రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు.
 

v) భారతీయుల్లో ఆత్మగౌరవం పెంపొందించడం. స్వరాజ్యం ప్రతి భారతీయుడి జన్మ హక్కని తిలక్ ప్రకటించడం, వివేకానందుడు 'బలహీనత పాపం, బలహీనతే మరణం' అని బోధించడం.
 

vi) అంతర్జాతీయ సంఘటనల ప్రభావం: జపాన్ గొప్ప శక్తిగా ఎదగడం, 1905లో జపాన్, రష్యాను ఓడించడం, 1896లో ఇథియోపియా చేతిలో ఇటలీ సైన్యం ఓటమి, ఐర్లాండ్, రష్యా, ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాల్లో విప్లవ ఉద్యమాలు భారతీయులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముమ్మరం చేయడానికి తోడ్పడ్డాయి.
 

తక్షణ కారణం: అతివాదం ఆవిర్భవించడానికి తక్షణ కారణం కర్జన్ దుష్టపరిపాలన, బెంగాల్ విభజన.
 

అతివాదుల లక్ష్యాలు: స్వరాజ్య సాధనే తమ లక్ష్యమని అతివాదులు ప్రకటించారు. వీరి దృష్టిలో స్వరాజ్యం అంటే బ్రిటిష్ వలసలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాదిరి స్వపరిపాలన కాదు. స్వరాజ్యం అంటే పూర్తి స్వాతంత్య్రం.
 

అతివాద నాయకులు: పంజాబ్‌కు చెందిన లాలా లజపతిరాయ్, మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర తిలక్, బెంగాల్‌కు చెందిన బిపిన్ చంద్రపాల్ ముఖ్యమైన అతివాద నాయకులు. వీరే లాల్-బాల్-పాల్‌గా, అతివాదత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వీరితోపాటు బెంగాల్‌కు చెందిన అరబిందోఘోష్ కూడా ప్రముఖ అతివాద నాయకుడు.
 

బాలగంగాధర తిలక్: ఈయన్ను భారతీయులు లోకమాన్య అని కీర్తించగా, బ్రిటిషర్లు ''భారత అశాంతి పితామహుడి"గా పేర్కొన్నారు. మితవాదిగా రాజకీయ జీవితం ప్రారంభించిన తిలక్, ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం నాటికి అతివాదిగా మారారు.
 

సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయడానికి 1893లో గణపతి ఉత్సవాన్ని, 1895లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. 1896-97లో కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రముఖ సభ్యుడు. న్యూ ఇంగ్లిష్ స్కూల్ స్థాపనకు కృషి చేశారు. ఇదే తర్వాతి కాలంలో ఫెర్గుసన్ కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆంగ్ల భాషలో మహారట్ట (Maharatta), మరాఠీ భాషలో కేసరి పత్రికలను స్థాపించారు. తిలక్ 1916 ఏప్రిల్‌లో హోం రూల్ లీగ్‌ను ప్రారంభించారు.
 

లాలా లజపతిరాయ్: పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఆర్య సమాజంలో 'కళాశాల' విభాగానికి నాయకుడు. సామాజిక, విద్యా సంస్కరణల కోసం కృషి చేశారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు 1907లో బ్రిటిష్‌వారు బర్మా దేశానికి పంపించారు.
లజపతిరాయ్ 'పంజాబీ' అనే వార్తా పత్రికకు సంపాదకత్వం వహించారు. 'అన్‌హ్యాపీ ఇండియా' అనే పుస్తకాన్ని రచించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని, పోలీసుల దెబ్బలకు గాయపడి, మరణించారు.

 

బిపిన్ చంద్రపాల్: భారత విప్లవ భావాల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన పారిదర్శక్ (Paridarshak) అనే వార పత్రికను ప్రారంభించారు. అలాగే బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ట్రిబ్యూన్ పత్రికలకు సహ సంపాదకుడిగా వ్యవహరించారు.
క్రీ.శ. 1901లో 'న్యూ ఇండియా' అనే పత్రికను ప్రారంభించారు. క్రీ.శ. 1906లో అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్ ప్రారంభించిన వందేమాతరం పత్రిక అతివాద భావాలను ప్రచారం చేయడంలో కీలకపాత్ర వహించింది. అరబిందో ఘోష్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనందుకు బ్రిటిష్ ప్రభుత్వం బిపిన్ చంద్రపాల్‌కు 1907లో ఆరునెలల కారాగార శిక్షను విధించింది. ఆ శిక్ష అనుభవించాక 1908-11 మధ్యకాలంలో ఇంగ్లండ్‌లో గడిపారు. తర్వాత 20 ఏళ్లపాటు జాతీయోద్యమంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర వహించలేదు.

 

అరబిందో ఘోష్: బరోడాలో ఉపన్యాసకుడిగా పనిచేస్తూ 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే వ్యాసాల ద్వారా మితవాద రాజకీయాలను విమర్శించారు. వందేమాతర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా 1906లో కలకత్తాలో ప్రారంభించిన బెంగాల్ జాతీయ కళాశాలకు అరబిందో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు- 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఈయన్ను అరెస్ట్ చేసింది. క్రీ.శ. 1910లో పాండిచ్చేరికి వెళ్లి ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలపై దృష్టి సారించారు. సావిత్రి, ది లైఫ్ డివైన్ అనే రెండు గ్రంథాలు ఈయన రచనల్లో ప్రధానమైనవి.
 

వందేమాతరం ఉద్యమం

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన ఉద్యమమే వందేమాతర ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో బంకించంద్ర చటర్జీ రచించిన 'ఆనందమఠం' అనే గ్రంథం నుంచి స్వీకరించిన 'వందేమాతరం' నినాదాన్ని భారతీయులంతా ఎలుగెత్తి చాటారు. క్రీ.శ. 1905లో కర్జన్ (అప్పటి వైస్రాయి) ఢాకా, చిట్టగాంగ్, అస్సాం, మైమెన్‌సింగ్ ప్రాంతాలతో కూడిన తూర్పుబెంగాల్, అస్సాం రాష్ట్రాన్ని సృష్టించాడు. దీనికి ఢాకా రాజధాని. పరిపాలన సౌలభ్యం కోసమే బెంగాల్‌ను విభజించినా దీనికి ప్రధాన కారణం బెంగాల్‌లో జాతీయ ఉద్యమాన్ని బలహీన పరచడమే అనే నగ్నసత్యాన్ని బెంగాలీయులు గ్రహించారు. విభజన తర్వాత బెంగాల్‌లో బెంగాలీలు మైనారిటీలుగా మిగిలారు. ఈ విధంగా హిందూ-ముస్లింలను విభజించి జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని బ్రిటిష్‌వారు భావించారు. 

వందేమాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తు వినియోగం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలను చేపట్టారు. 1905 ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్ హాల్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఆమోదించారు. 1905లో గోపాల కృష్ణగోఖలే అధ్యక్షతన జరిగిన బెనారస్ సమావేశంలో కాంగ్రెస్ 'స్వదేశీ' ఉద్యమానికి పిలుపునిచ్చింది. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజైన 1905 అక్టోబరు 16ను జాతీయ దుర్దినంగా పాటించారు. ఆ రోజు కలకత్తాలోని అన్ని కార్యాలయాలు మూసివేశారు. జనపనార మిల్లులు, రైల్వే కర్మాగారాల్లో సమ్మెను పాటించారు. బాలగంగాధర్ తిలక్ ఈ ఉద్యమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా పూనా, బొంబాయిలకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. అజిత్‌సింగ్, లాలాలజపతిరాయ్ పంజాబ్‌లో, సయ్యద్ హైదర్ రజా ఢిల్లీలో, చిదంబరం పిళ్లై మద్రాసు రాష్ట్రంలో, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వందేమాతర ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. 
 

క్రీ.శ. 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటితమైంది. అతివాదులు, మితవాదుల మధ్య నెమ్మదిగా విబేధాలు ప్రారంభమయ్యాయి. మితవాదులు విదేశీ వస్తు బహిష్కరణను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని భావించగా, అతివాదులు బహిష్కరణ ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు, బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణకు కూడా ఉపయోగించాలని భావించారు. బ్రిటిష్‌వారు మితవాదులను తమవైపుకు తిప్పుకోవడానికి లెజిస్లేటివ్ కౌన్సిళ్ల సంస్కరణకు హామీ ఇచ్చారు.
క్రీ.శ. 1907 డిసెంబరు 26న సూరత్‌లో కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అధ్యక్షుడిగా మితవాదులు రాస్ బిహారి ఘోష్ పేరును ప్రకటించడంతో, అతివాదులు వ్యతిరేకించారు. దీంతో సుమారు 1600 మంది ప్రతినిధులు హాజరైన సభలో గందరగోళం నెలకొంది. ఇది చివరికి కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోవడానికి దారితీసింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అనిబిసెంట్ ప్రయత్నాల వల్ల మితవాదులు, అతివాదులు మళ్లీ కలిశారు. అలాగే తిలక్ కృషితో కాంగ్రెస్, ముస్లింలీగ్ కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.

 

విధానాలు

i) ప్రభుత్వ సర్వీసులు, న్యాయస్థానాలు, పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం పట్ల సహాయ నిరాకరణ ప్రకటించడం.

ii) స్వదేశీ వస్తు వినియోగాన్ని పెంచడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం.

iii) జాతీయ విద్యను ప్రవేశపెట్టి, ఆచరించడం.
 

విజయాలు

* స్వరాజ్యం భారతీయుల జన్మహక్కు అని ప్రకటించారు.

* సామాన్య ప్రజలను కూడా జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేశారు.

* జాతీయస్థాయిలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు.

అపజయాలు

* ఉద్యమాన్ని రైతులు, వ్యవసాయ కార్మికుల చెంతకు తీసుకెళ్లలేకపోయారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

         క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.
 

       క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
 

¤ మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
 

జైనమతం - ఆవిర్భావం 

         జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.
 

మహావీరుడి జీవితం, బోధనలు:
         వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
¤ వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.

 

¤ మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.
 

పంచ మహావ్రతాలు:
       జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి. 1) అహింస, 2) సత్యం, 3) అస్తేయం (దొంగిలించకూడదు), 4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు), 5) బ్రహ్మచర్యం. అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
 

మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.
 

¤ మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
 

జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.
¤ జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.

 

రాజుల ఆదరణ 

       చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
¤ క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
¤ కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
¤ క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
¤ మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
¤ క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.

 

జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
 

రచయిత: భాస్కర్ వేడియం
 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

1. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపథం?
జ: అస్మక

 

2. షోడశ మహాజనపథాల కాలంలో వ్యవసాయ కూలీలను ఏమని పిలిచేవారు?
జ: భర్తుకా

 

3. అలెగ్జాండర్‌ దండయాత్ర కాలం క్రీ.పూ.327 - 324 అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు?
జ: అరెల్‌స్టైన్‌

 

4. భారతదేశంలో తొలి దేశ ద్రోహిగా పేరొందిన వ్యక్తి
జ: అంబి

 

5. ‘కురు’ జపపథానికి రాజధాని?
జ: ఇంద్రప్రస్థ

 

6. షోడశ మహాజనపథాల్లోని గణరాజ్యాలు ఎన్ని?
జ: 2

 

7. రెండో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించారు?
జ: వైశాలి

 

8. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినవారు?
జ: మహాకస్యపుడు
 

రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

భారతదేశ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం మౌలికమైన మార్పులకు కారణమైంది. ఈ కాలంలో షోడశ మహాజనపథాలు ఆవిర్భవించి రెండో పట్టణీకరణకు దోహదం చేయగా అనేక నూతన మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంపై పారశీక, గ్రీకు దండయాత్రలు జరిగాయి. వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారు. మలివేద కాలం చివరినాటికి (క్రీ.పూ.6వ శతాబ్దం) ఉత్తర భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో కొత్తమార్పులు సంభవించాయి. 16 మహాజనపథాలు ఆవిర్భవించి మగధ తొలి సామ్రాజ్యంగా ఏర్పడింది.

షోడశ మహాజనపథాలు
క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 మహాజనపథాలు ఏర్పడ్డాయి. వీటినే షోడశ మహాజనపథాలు అంటారు. సంస్కృతంలో ‘జన’ అంటే ప్రజలు, ‘పథం’ అంటే నివాసప్రాంతం అని అర్థం. 16 జనపథాల్లో 15 జనపథాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడగా ఒకే ఒక జనపథం ‘అస్మక’ దక్షిణ భారతదేశంలో ఏర్పడింది. వీటిలో 14 జనపథాలు రాచరిక వ్యవస్థను కలిగి ఉంటే వజ్జి, మల్ల అనే రెండు జనపథాల్లో గణరాజ్య వ్యవస్థ లేదా గణపాలన ఉండేది.
 

తొలి సామ్రాజ్యం
భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ మహాజనపథాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపథాలను జయించి విశాల సామ్రాజ్యంగా విస్తరించింది. దీని రాజధానులు రాజగృహం (గిరివ్రజం), వైశాలి, పాటలీపుత్ర. మగధను హర్యంక, నందవంశం లాంటి పటిష్ఠమైన రాజవంశాలు; బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు, ధననందుడు వంటి బలమైన రాజులు పరిపాలించారు. విస్తారమైన ఇనుపగనులు మగధ దక్షిణ భాగంలో ఉండటం, సారవంతమైన గంగ, సోన్, గండక్‌ నదులు ప్రవహించడం; అటవీసంపద, ఏనుగులను వినియోగించుకోవడం; నిత్యం విదేశీ దండయాత్రలు జరిగే ఈశాన్య భారతదేశానికి దూరంగా ఉండటం వల్ల ఇది బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది.
      పురాణకాలంలో మగధను రిపుంజయుడు అనే రాజు పరిపాలించేవాడు. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు అతడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువు వైవాహిక సంబంధాలు, యుద్ధ విజయాల ద్వారా మిగిలిన మహాజనపథాలను మగధలో విలీనం చేశాడు. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు. గంగా - సోన్‌ నదుల మధ్య పాటలీపుత్ర దుర్గాన్ని అజాతశత్రువు నిర్మించాడు. మొదటి బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో మహాకస్యపుడి అధ్యక్షతన నిర్వహించాడు. తన మంత్రి వసకార సహాయంతో లిచ్ఛవుల రాజ్యాన్ని ఆక్రమించాడు.
అజాతశత్రువు తర్వాత ఉదయనుడు రాజ్యానికి వచ్చాడు. హర్యంక వంశస్థులు పితృహంతకులుగా పేరొందారు. ఈ వంశం అనంతరం మగధను శైశునాగ వంశస్థులు పరిపాలించారు. శిశునాగుడు, అతడి కుమారుడు కాలాశోకుడు మగధను పాలించారు. కాలాశోకుడి కాలంలోనే రెండో బౌద్ధ సంగీతిని సబకామి అధ్యక్షతన వైశాలి నగరంలో నిర్వహించారు. 
          మహాపద్మనందుడు మగధలో శైశునాగ వంశాన్ని నిర్మూలించి నందవంశపాలనను ప్రారంభించాడు. ఇతడి బిరుదులు ఉగ్రసేన, ఏకరాట్‌. చివరి నందవంశ పాలకుడైన ధననందుడిని ఓడించి మగధను ఆక్రమించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు.

 

సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు
షోడశ మహాజనపథాల కాలాన్ని భారతదేశ చరిత్రలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. (భారతదేశంలో తొలి నగరీకరణ సింధు నాగరికత కాలం). ఈ కాలంలో అయోధ్య, కౌశాంబి, తక్షశిల, కాశీ పట్టణాలు అభివృద్ధి చెందాయి. వైశాలి, బరుకచ్చం, తక్షశిల, ఉజ్జయిని లాంటి రేవు పట్టణాలు విదేశీ వ్యాపారంలో కీలకపాత్రను పోషించాయి. దీంతో అనేక నూతన వ్యాపార రహదారులు ఏర్పడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా నాణేల చలామణీ అమల్లోకి వచ్చింది. నాటి నాణేలను విద్దాంక నాణేలు అనేవారు. వేదకాలంలో నాణేలు వాడినట్లు సాహిత్యంలో పేర్కొన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సమాజంలో రాజు, సైనికులు, వ్యవసాయదారులు, వృత్తిపనివారు, బానిసలు లాంటి అనేక వర్గాలు ఉండేవి. కుటుంబ పెద్దను/వ్యవసాయ అధిపతిని ‘గాహపతి’ (గృహపతి), వ్యవసాయ కూలీలను ‘భర్తుకా’ అనేవారు. వృత్తిపనివారు ఏడాదిలో ఒకరోజు రాజు పొలంలో ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు.
             బానిసలు, స్త్రీలు, పిల్లలకు రాజకీయ సభలు, సమావేశాల్లో ప్రవేశం ఉండేది కాదు. ప్రజలు ప్రకృతి శక్తులు, స్త్రీ దేవతలను, వేదకాలం నాటి దేవతలను ఆరాధించేవారు. నేటి హిందూ సమాజంలో అనుసరిస్తున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, సాంఘిక దురాచారాలు ఆ కాలంలోనే ఉన్నాయి. సమాజంలో ధనవంతులకు గ్రామ పెద్దగా ఉండే అవకాశాన్ని కల్పించేవారు.
వ్యవసాయ ఉత్పత్తులు అధికమవడం, చేతివృత్తులు అభివృద్ధి చెందడం; విదేశీ, దేశీయ వాణిజ్యాలు పెరగడం వల్ల నాటి సమాజం ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేది.

 

విదేశీ దండయాత్రలు (పారశీక, గ్రీకు)
భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చి సింధు నాగరికత పతనానికి కారణమయ్యారని అధ్యయనం చేశాం కానీ భారతదేశంపైకి దండెత్తిన తొలి విదేశీ పాలకుడు/రాజుగా సైరస్‌ ది గ్రేట్‌ను పేర్కొంటారు (ఆర్యులు సమూహంగా వచ్చారు, వారి నాయకుడు ఎవరో తెలియదు). పారశీక (పర్షియన్‌/ఇరాన్) చక్రవర్తి అయిన సైరస్‌ ది గ్రేట్‌ క్రీ.పూ.553లో, అతడి వారసుడైన మొదటి డేరియస్‌ క్రీ.పూ.516లో భారతదేశంపై దండెత్తారు. వీటినే పారశీక దండయాత్రలుగా పేర్కొంటారు. ఈ దండయాత్రల వల్ల భారతదేశం, ఇరాన్‌ మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. పారశీకుల నమూనా నాణేలను భారతీయులు వాడుకలోకి తెచ్చారు.
 

అలెగ్జాండర్‌ దండయాత్ర
భారతదేశ చరిత్రలో కాల నిర్ణయానికి తోడ్పడింది అలెగ్జాండర్‌ దండయాత్ర. అరెల్‌స్టైన్‌ అనే చరిత్రకారుడి ప్రకారం క్రీ.పూ.327 - 324 మధ్య అలెగ్జాండర్‌ భారతదేశంపైకి దండెత్తాడు. ఈయన గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజ్యానికి చెందిన ఫిలిప్‌ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్న వయసులోనే చక్రవర్తి అయిన అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనే ఆశయంతో విదేశీ దండయాత్రలు చేశాడు. మొదట పారశీకులపైకి దండెత్తి, అర్భేలా యుద్ధంలో పారశీక చక్రవర్తి అయిన మూడో డేరియస్‌ను ఓడించాడు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. జీలం, చీనాబ్‌ నదుల మధ్య గల విశాల సామ్రాజ్యానికి రాజైన పురుషోత్తముడిని (పోరస్) ఓడించలేక తక్షశిల రాజైన అంబి భారతదేశ దండయాత్రకు అలెగ్జాండర్‌ను ఆహ్వానించి తొలి దేశ ద్రోహిగా పేరొందాడు. అయితే అలెగ్జాండర్‌ మొదట అంబినే ఓడించి అతడి సహాయంతో భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై దండెత్తాడు.
           అలెగ్జాండర్‌ దండయాత్రలో అతి ప్రధానమైంది జీలం నది యుద్ధం లేదా హైడాస్ఫస్‌ యుద్ధం. గ్రీకులు తమ గ్రంథాల్లో జీలం నదిని హైడాస్ఫస్‌ నదిగా, పురుషోత్తముడిని పోరస్‌గా పేర్కొన్నారు. క్రీ.పూ.326లో పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ మధ్య హైడాస్ఫస్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరస్‌ ఓడిపోయినప్పటికీ అలెగ్జాండర్‌ అతడి ధైర్య సాహసాలకు మెచ్చి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. అనంతరం నాటి మగధ రాజ్యంపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. కానీ తన సైనికుల అనాసక్తి వల్ల ధననందుడిపై దండెత్తకుండానే వెనుదిరిగాడని చరిత్రకారులు పేర్కొంటారు. భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు సెల్యూకస్‌ నికేటర్‌ను ప్రతినిధిగా నియమించిన అలెగ్జాండర్‌ తిరుగు ప్రయాణంలో క్రీ.పూ.323లో బాబిలోనియాలో మరణించాడు.

రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం సాహసవీరులు!

 ఛందేల రాజుల కాలంలో నిర్మించిన ఖజురహో దేవాలయాలు హర్షుడి అనంతరం మన దేశంలో అనేక పరిణామాలు సంభవించాయి. రకరకాల రాజవంశాలు ఆవిర్భవించి స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాయి. కానీ వీరందరిలో అనైక్యత కారణంగా ఏర్పడిన పరిస్థితులు అరబ్బుల దాడులకు, యూరోపియన్ల విస్తరణకు దారితీశాయి. భారత దేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్‌ల దండయాత్రలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చివేశాయి. ఆ దాడులు సోలంకీలు, చౌహానుల కాలాల్లో జరిగాయి. అప్పటి పరిస్థితులు, ఆ యుద్ధాలకు కారణాలను మధ్యయుగంలో మన దేశాన్ని పాలించిన రాజపుత్రుల్లో ప్రతీహారులు, పరమారులు, ఛందేలుల అనంతరం మరికొన్ని వంశాల వారు ఉన్నారు. ఆ రాజుల కాలంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. మధ్యయగ అధ్యయనంలో భాగంగా పోటీపరీక్షల అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి.
 

మధ్యయుగ భారతదేశ చరిత్ర - రాజపుత్ర యుగం
 భారతదేశ చరిత్రలో క్రీ.శ.8 నుంచి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మధ్యయుగం అంటారు. ఇది రాజపుత్రులతో ప్రారంభమై ఐరోపావారి రాక వరకు కొనసాగుతుంది. భూస్వామ్య వ్యవస్థ/ ఫ్యూడలిజం నాటి ప్రధాన లక్షణంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ యుగం అధ్యయనంలో భాగంగా ఉత్తర భారతదేశంలో రాజపుత్ర యుగం, మహమ్మదీయ దండయాత్రలు, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ సామ్రాజ్యం; దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, యాదవులు, హొయసాలులు, పాండ్యులు, విజయనగర, బహమనీ సామ్రాజ్యాల గురించి తెలుసుకోవాలి.

రాజపుత్రులు
హర్షుడి మరణానంతరం ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పరిపాలించారు. వారిలో ప్రతీహారులు, పరమారులు, ఛందేలులు, చౌహానులు, సేన, పాల, గహద్వాలు లాంటి సుమారు 36 రాజ వంశాల వారు ఉన్నారు. వీరు ఉత్తర భారతదేశంలో అనేక దేవాలయాలు, కోటలను నిర్మించి వాస్తు, కళారంగాల అభివృద్ధికి కృషి చేశారు. సంస్కృత భాషను అధికార భాషగా చేసుకుని పాలించారు. అనేకమంది కవి పండితులను పోషించి భాష, సాహిత్యాల వికాసానికి తోడ్పడ్డారు. దేశభక్తి, ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్రులు అనైక్యత కారణంగా మహమ్మదీయుల చేతిలో ఓడి, రాజ్యాలను కోల్పోయారు.

ఎవరు వీరు?
రాజపుత్రుల జన్మస్థల మూలాల గురించి పరిశోధనలు చేసిన అనేక మంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజపుత్ర రాజులు శాసనాల్లో వారిని సూర్యవంశ, చంద్రవంశ క్షత్రియులుగా ప్రకటించుకున్నారు. కానీ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆస్థాన కవి చాంద్‌బార్థై తన రచన ‘పృథ్వీరాజ్‌ రాసో’లో రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాడు. కల్నల్‌ టాడ్‌ అనే చరిత్రకారుడు రాజపుత్రులపై పరిశోధన చేసి రచించిన ‘రాజస్థాన్‌ కథావళి’ (ఏనల్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌)లో వారిని విదేశీ జాతుల సంతతిగా చెప్పాడు. రాజపుత్రుల కాలంలో క్రీ.శ.712లో జరిగిన అరబ్బుల సింధు దండయాత్రను ప్రామాణికంగా తీసుకున్న చరిత్రకారులు క్రీ.శ.8వ శతాబ్దం నుంచే మధ్యయుగం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

ప్రతీహారులు
 రాజపుత్రుల్లో తొలి వంశంగా ప్రసిద్ధి పొందిన ప్రతీహారులు నేటి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కనోజ్‌ పరిసర ప్రాంతాలను పాలించారు. ప్రతీహారులు అంటే ద్వారపాలకులు అని అర్థం. వీరి చరిత్రకు ప్రధాన ఆధారమైన రాజౌర్‌ (రాజోర్‌) శాసనం ప్రకారం ఈ వంశ మూలపురుషుడు హరిశ్చంద్రుడు. వీరు నేటి మాళ్వా, కనోజ్‌ ప్రాంతాలను పాలించేవారు. ప్రతీహారుల్లో మొదటి నాగభట్టు, మొదటి వత్సరాజు, రెండో నాగభట్టు, మొదటి భోజుడు (మిహిర భోజుడు) ప్రసిద్ధి చెందారు. గ్వాలియర్‌ శాసనం మొదటి నాగభట్టు విజయాలను వివరిస్తుంది. ఇతడి కాలంలోనే కనోజ్‌పై ఆధిపత్యం కోసం పాల, ప్రతీహార, రాష్ట్రకూట వంశాల మధ్య త్రిముఖ పోరాటం ప్రారంభమైంది.
మొదటి వత్సరాజు కాలంలో ప్రతీహారులకు పాల వంశీయులతో ఘర్షణలు మొదలయ్యాయి. ఇతడు నాటి రాష్ట్రకూట రాజు ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వాను కోల్పోయాడు. మొదటి వత్సరాజు ఆస్థానంలోని ఉద్యోధనుడు అనే కవి ‘కువలయమాల’ గ్రంథాన్ని రచించాడు. ప్రతీహారుల్లో మొదటి మిహిర భోజుడు గొప్పవాడిగా ఖ్యాతి పొందాడు. మిహిర, ఆదివరాహ లాంటి బిరుదులతో పాలించిన ఇతడు చౌహాన్‌ రాకుమారి కళావతిని వివాహం చేసుకున్నాడు. ఇతడి పాలనా కాలంలోనే సులేమాన్‌ అనే అరబ్బు యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఈ వంశానికి చెందిన మహేంద్రపాలుడు తన ఆస్థానంలో రాజశేఖరుడు అనే కవిని పోషించాడు. కర్పూర మంజరి, కావ్య మీమాంస లాంటి ప్రముఖ గ్రంథాలను రాజశేఖరుడు రచించాడు. మహీపాలుడి కాలంలో అరబ్బు యాత్రికుడు అల్‌మసూది వీరి రాజ్యాన్ని సందర్శించాడు. గజనీ మహమ్మద్‌ చేతిలో ఓడిపోయిన రాజ్యపాలుడి అనంతరం విజయపాలుడు, త్రిలోచన పాలుడు రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వంశంలో చివరి పాలకుడు యశపాలుడు.

పరమారులు
 ప్రతీహారులకు సామంతులుగా పరమారులు నేటి మాళ్వా ప్రాంతాన్ని పాలించేవారు. ధార్‌ (ధారా నగరం), ఉజ్జయిని నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యం చేశారు. పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. రాజ్యస్థాపకుడైన వాక్పతిరాజు (ముంజరాజు) నాటి కల్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడిని ఓడించాడు. ముంజసాగరం అనే చెరువును తవ్వించాడు. ఇతడి ఆస్థానంలో పద్మగుప్తుడు, ధనుంజయుడు, ధనిక, హలాయుధ కవి పండితులు ఉండేవారు. ధనుంజయుడు దశరూప గ్రంథాన్ని రచించాడు. పరమారుల్లో గొప్పరాజు భోజుడు (పరమార భోజుడు). ఇతడికి కవిరాజు అనే బిరుదు ఉంది. ఈయన తన ఆస్థానంలో ధనపాల, శోభన, శాంతిసేన, ప్రభా చంద్రసూరి, విజ్ఞానేశ్వరుడు లాంటి కవులను పోషించాడు.
పరమార భోజుడు భోజపురి నగరాన్ని, భోజశాల అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. ఇతడు ఆయుర్వేద సర్వస్వం, సమరాంగణ సూత్రధార (వాస్తు శాస్త్రం) లాంటి 12 గ్రంథాలను రచించాడు. శ్రీకృష్ణ దేవరాయలను పరమార భోజుడితో పోల్చి ఆంధ్రభోజుడిగా కీర్తించారు. ధార్‌ నగరంలోని సరస్వతీ ఆలయం భోజుడి కాలంలో నిర్మించిన గొప్ప దేవాలయం. పరమారుల్లో చివరి పాలకుడైన మహ్లాక దేవుడిని అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఓడించాడు. దీంతో పరమార రాజ్యం పతనమైంది.

ఛందేలులు
ప్రతీహారులకు సామంతులుగా ఛందేలులు నేటి మధ్యప్రదేశ్‌లోని ఖజురహోను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. ఛందేల వంశ మూలపురుషుడిగా జయశక్తిని పేర్కొంటారు. యశోవర్మ అనే రాజు స్వతంత్ర ఛందేల రాజ్యస్థాపన చేశాడు. ఈయన కుమారుడు ధంగ ఛందేల వంశ రాజుల్లో గొప్ప పాలకుడిగా పేరొందాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలను ధంగ నిర్మించాడు. మొదట యశోవర్మ ఖజురహోలో చతుర్భుజ విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో ఇక్కడ ధంగ మహారాజు విశ్వనాథ, జిననాథ, దిననాథ ఆలయాలను నిర్మించాడు. ధంగ అనంతరం రాజ్యానికి వచ్చిన విద్యాధరుడు గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. ఈ వంశ చివరి పాలకుడు రెండో విక్రమవర్మను ఓడించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్యాన్ని ఆక్రమించాడు.

సోలంకీలు
ప్రస్తుత గుజరాత్‌లోని అనిహిల్‌వాడ్‌ను రాజధానిగా చేసుకుని సోలంకీలు రాజ్యపాలన చేశారు. వీరినే ‘లాట చాళుక్యులు’ అని పిలుస్తారు. ఈ వంశ, రాజ్య స్థాపకుడు మూలరాజు. మొదటి చాళుక్య భీముడు (సోలంకీ భీముడు) గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. క్రీ.శ.1026లో సోలంకీ భీముడిని ఓడించి కథియవాడ్‌లోని సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేశాడు. ఇప్పటి రాజస్థాన్‌లోని మౌంట్‌అబూ పర్వత శిఖరంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలను సోలంకీ భీముడు నిర్మించాడు. సోలంకీ రాజు కర్ణుడు నేటి అహ్మదాబాద్‌ నగరాన్ని నిర్మించాడు. ఈ వంశ రాజుల్లో గొప్పవాడిగా పేరుపొందిన జయసింహ సిద్ధరాజు అనేక మంది కవి పండితులను పోషించాడు. ప్రముఖ జైన పండితుడు హేమచంద్రుడు ఇతడి ఆస్థానంలోనివాడే. హేమచంద్రుడి ప్రముఖ రచన పరిశిష్ఠపర్వం. జయసింహ సిద్ధరాజు సిద్ధపురంలోని రుద్ర మహకాల్‌ ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం పాలనకు వచ్చిన కుమారపాలుడు, హేమచంద్రుడి ప్రభావంతో జైనమత పోషకుడిగా మారాడు. కానీ కుమారపాలుడి కుమారుడు అజయపాలుడు జైన దేవాలయాలను కూల్చి, జైన పండితులను హింసించాడు. ఘోరీ మహమ్మద్‌ దండయాత్రల కాలంలో రెండో మూలరాజు బాలుడిగా ఉండటంతో అతడి తల్లి నాయకీదేవి సైన్యాలను నడిపి మౌంట్‌అబూ యుద్ధంలో (క్రీ.శ. 1178) తురుష్కులను ఓడించింది. ఆ తర్వాత పాలనకు వచ్చిన రెండో భీముడు సోమనాథ దేవాలయానికి మరమ్మతులు చేయించాడు. ఇతడు ఘోరీ, కుతుబుద్దీన్‌ ఐబక్‌ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో సోలంకీ రాజ్యం పతనమైంది. బరోడా వద్ద ఉన్న సూర్యదేవాలయం, మౌంట్‌అబూలోని విమల దేవాలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.

చౌహానులు
నేటి తూర్పు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన ప్రముఖ రాజపుత్ర వంశం చౌహానులు. వీరినే చహమానులు అని వ్యవహరిస్తారు. మొదట ప్రతీహారులకు సామంతులుగా ఉండేవారు. చౌహాన్‌ వంశ స్థాపకుడు సింహరాజు ‘మహారాజాధిరాజు’ బిరుదుతో పాలన చేశాడు. అజ్మీర్‌ ప్రాంతంలోని శాకంభరి (నేటి సాంభర్‌ సరస్సు ప్రాంతం) ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 12వ శతాబ్దంలో రెండో అజయరాజు తన రాజధానిని శాకంభరి నుంచి అజ్మీర్‌కు (అజయమేర్‌) మార్చాడు. చౌహానులు రాజ్య విస్తరణలో భాగంగా నాటి గుజరాత్‌ సోలంకీలు/చాళక్యులతో, మాళ్వా - పరమారులతో, తురుష్క పాలకులైన గజనీ, ఘోరీలతో పోరాడారు. మహారాజు బిరుదుతో పాలించిన వాక్పతిరాజు పుష్కర్‌ వద్ద శివాలయాన్ని కట్టించాడు. చౌహానుల్లో ఒకరైన నాలుగో విగ్రహరాజు విశాలదేవుడు ‘హరకేళి’ అనే ప్రసిద్ధ రచన చేశాడు. ఈ గ్రంథంలోని (నాటకం) కొన్ని అంశాలను అర్హిదిన్‌కా జోంప్రా మసీదు గోడలపై చిత్రించారు. విశాలదేవుడి ఆస్థానంలోని సోమదేవుడు అనే కవి లలిత విగ్రహరాజు అనే నాటకాన్ని రచించాడు. విగ్రహరాజు ‘కవి బాంధవ’ అనే బిరుదును పొందాడు. ఇతడు అజ్మీర్‌లో సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాడు. విశాల్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు. చౌహానుల్లో గొప్పరాజు మూడో పృథ్వీరాజ్‌. క్రీ.శ.1179-1192. ఈయనను ముస్లిం రచనల్లో రాయపితౌరా అని ప్రస్తావించారు.
ఘోరీ మహమ్మద్‌తో ఇతడు రెండు తరైన్‌ యుద్ధాలు చేశాడు. 1191 నాటి మొదటి తరైన్‌ యుద్ధంలో ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ చేతిలో మరణించాడు. పృథ్వీరాజ్‌ ఆస్థాన కవి చాంద్‌బార్ధై ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే ప్రముఖ గ్రంథాన్ని హిందీలో రాశాడు.

గహద్వాలులు
కనోజ్‌ను రాజధానిగా చేసుకుని ప్రతీహారులకు సామంతులుగా పాలించినవారు గహద్వాలులు. వీరి రాజ్య స్థాపకుడు చంద్రదేవుడు. ఈ వంశంలో గొప్పవాడు జయచంద్రుడు. గోవింద చంద్రుడి కాలంలో 14 మంది రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించారు. ఈయన ఆస్థాన కవి లక్ష్మీధరుడు కృత్యకల్పతరు/కల్పద్రుమ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. గోవింద చంద్రుడి భార్య కుమార దేవి బౌద్ధమతాన్ని అవలంబించి సారనాథ్‌లో ఒక విహారాన్ని నిర్మించింది. జయచంద్రుడి కాలంలో అతడి కుమార్తె రాణి సంయుక్తను మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తీసుకుపోవడంతో ఘోరీ మహమ్మద్‌ను ఇతడు భారతదేశ దండయాత్రకు ఆహ్వానించాడు. జయచంద్రుడి ఆస్థాన కవి శ్రీహర్షుడు ‘నౌషధ చరిత్ర’ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. గహద్వాలుల్లో చివరి రాజు హరిశ్చంద్రుడు.

ఇతర రాజ్యాలు

పాలవంశీయులు: నేటి బెంగాల్‌ ప్రాంతాన్ని పాలించిన పాలవంశ స్థాపకుడు గోపాలుడు. ఇతడు ప్రజల ద్వారా ఎన్నికైన రాజుగా పేరొందాడు. వీరిలో గొప్పవాడైన ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. దేవపాలుడు, నారాయణ పాలుడు, మహీపాలుడు రాజులు ఈ వంశంలో ముఖ్యులు.

సేన రాజులు: బెంగాల్‌ ప్రాంతాన్ని పాలించిన సేన వంశ స్థాపకుడు సామంత సేనుడు. ధనసాగర, అద్భుతసాగర లాంటి గ్రంథాలను ఈ వంశానికి చెందిన భల్లాలసేనుడు రాశాడు. లక్ష్మణసేనుడి ఆస్థాన కవి జయదేవుడు గీతగోవిందం అనే ప్రసిద్ధ రచన చేశాడు.

తూర్పుగాంగులు: ప్రస్తుత ఒడిశా ప్రాంతాన్ని ఈ రాజులు పాలించారు. ఈ వంశాన్ని అనంతవర్మన్‌ బోడగాంగుడు స్థాపించాడు. భువనేశ్వర్‌ లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ ఆలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.

కశ్మీర్‌ పాలకులు: కశ్మీర్‌ను కర్కోట, ఉత్పల, లోహార వంశీయులు పరిపాలించారు. కర్కోట వంశరాజు అనంతవర్మన్‌ తన ఆస్థానంలో రత్నాకరుడు, ఆనంద వర్ధనుడు అనే కవులను పోషించాడు. ఉత్పల వంశ రాజు క్షేమగుప్తుడి భార్య దిడ్డ 50 ఏళ్లు కశ్మీర్‌ను పాలించింది. లోహర వంశ రాజు శ్రీహర్షుడి ఆస్థానంలో ‘కల్హణుడు’ రాజతరంగిణి గ్రంథాన్ని రాశాడు.
 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రాలో సంఘ సంస్కరణోద్యమాలు

కందుకూరి వీరేశలింగం యుగం

* కందుకూరి వీరేశలింగం యుగం 19వ శతాబ్దం అర్ధభాగంలో ప్రారంభమైంది. ఈయన జీవించిన కాలాన్ని (1848-1919) ఒక యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో కవులు, పండితులు, కళాకారులు తమ రచనల ద్వారా సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు.

* రాజా రామ్మోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటి బ్రహ్మసమాజ నాయకుల బోధనలతో అనేక మంది ప్రభావితులయ్యారు. ఆ కాలంలో కందుకూరి వీరేశలింగం ఆంధ్రాలో సంస్కరణలకు పాటుపడి ‘యుగ పురుషుడు’, ‘ఆంధ్రా నవయుగ వైతాళికుడి’గా పేరొందారు.

* వీరేశలింగం 1848, ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కె.సుబ్బారాయుడు, పూర్ణమ్మ.

* వీరి పూర్వికులది ప్రకాశం జిల్లాలోని కందుకూరి గ్రామం. అక్కడి నుంచి రాజమండ్రికి వలస వెళ్లి స్థిరపడ్డారు. దీంతో వారి ఇంటిపేరు కందుకూరిగా మారింది.

* వీరేశలింగం రాజమండ్రి వీధి బడిలో చదవడం, రాయడం నేర్చుకున్నారు. నాలుగో ఏటే తండ్రి  మరణించడంతో పెదనాన్న, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు.

* అయిదేళ్ల వయసులోనే బాలరామాయణం, అమరం, ఆంధ్రనామసంగ్రహం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం నేర్చుకున్నారు.

* దూసి సోమయాజుల వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే అన్ని తరగతుల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లం నేర్చుకున్నారు. 

* 13వ ఏట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ)ను బాల్యవివాహం చేసుకున్నారు.

* చిన్నతనం నుంచే విగ్రహారాధనను, లంచగొండితనాన్ని, అవినీతిని, అబద్ధాలు చెప్పడాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకించారు.

* విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా సమ్మె చేసి, ఆయన్ను బదిలీ చేయించారు. మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసై రాజమండ్రి పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు.

* కేశవ చంద్రసేన్, పాశ్చాత్య నాగరికతకు చెందిన పుస్తకాల ప్రభావం ఈయనపై ఎక్కువగా ఉండేది. 

* 1872లో కోరంగి ఆంగ్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. చివరి వరకు అదే వృత్తిలో కొనసాగారు. ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని, సంస్కరణాభిలాషకు వృత్తి కొంతమేర దోహదపడుతుందని నమ్మారు.

* విద్యార్థులు, అధ్యాపక వృత్తి సంస్కరణ రచనా వ్యాసంగానికి తోడ్పడ్డాయి. ఆయన రచనలే సమాజ సంస్కరణకు సాధనాలుగా మారాయి. 
 

సంస్కర్తగా.. వీరేశలింగం విద్యార్థి దశ నుంచే హేతువాదాన్ని నమ్మి, బ్రహ్మసమాజ సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. నాటి  సమాజంలో మూఢ నమ్మకాలు ఎక్కువ. వితంతువులకు పునర్వివాహాలు లేవు. బాల్యవివాహాలు ఉండేవి. స్త్రీలకు విద్య లేదు. అందుకే ఈ యుగాన్ని ఆంధ్రాలో ‘చీకటియుగం’గా పేర్కొంటారు. సమాజంలో వచ్చే విప్లవాత్మక మార్పు ద్వారానే వీటిని అధిగమించవచ్చని వీరేశలింగం అభిప్రాపపడ్డారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడానికి సాహిత్యం, పత్రికలు ఉపయోగపడతాయని గ్రహించి అనేక రచనలు చేశారు.

* మూఢనమ్మకాలపై పోరాడి నూతన సంస్కరణలకు నాంది పలికారు. శకునాలు, మంత్రతంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, దేవుని అవతారాలను నమ్మలేదు. వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించలేదు. వేదాలు, బైబిల్, ఖురాన్‌లలో రాసిన మహిమలన్నీ నమ్మశక్యాలు కావని పేర్కొన్నారు.

* స్త్రీ విద్య కోసం ఉద్యమించి, వారి కోసం బాలికా పాఠశాలను స్థాపించారు. స్త్రీ, పురుష లింగభేదం లేకుండా సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అణగారిన కులాలకు చెందిన పిల్లలను బడిలో చేర్చుకుని సమాన అవకాశాలు కల్పించారు.

* పోలీసులు, న్యాయవాదుల దౌర్జన్యాలను తన రచనల ద్వారా విమర్శించారు.

* అప్పట్లో న్యాయస్థానాల్లో తీర్పు చెప్పేందుకు న్యాయమూర్తులు డబ్బు ఆశించేవారు. ఆ విధానాన్ని తన వివేకవర్ధిని పత్రికలో విమర్శించారు.
 

నాటకాలు: వీటిని వీరేశలింగం సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. అవి: అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం.
 

పౌరాణిక గ్రంథాలు: సత్యవతి చరిత్ర, చంద్రమతి, దశకుమార చరిత్ర అనే గ్రంథాలను రచించారు.


చారిత్రక గ్రంథాలు: ఏసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర.


నవలలు: అలీవర్‌ గోల్డ్‌ స్మిత్‌ రాసిన ‘వికార్‌ ఆఫ్‌ వేక్‌ ఫీల్డ్‌’ గ్రంథం ఆధారంగా వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ అనే నవలను రచించారు. దీన్ని ‘Fortune of Wheels’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన తొలి నవల ఇదే.

* లంకాద్వీపం, అడుమలయాళం అనే రెండు భాగాలతో సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనే పేరుతో హాస్య నవలను రచించారు. స్విఫ్ట్‌ రాసిన గలివర్‌ ట్రావెల్స్‌ గ్రంథం దీనికి ఆధారం.

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన  వీరేశలింగం గ్రంథాలు:

1. Comedy of Errors -  చమత్కార రత్నావళి

2.  Sheridens duese  - రాగమంజరి

3. Dorivals - కల్యాణ కల్పవల్లి

4. Cowpers Jungism - దుర్మార్గపు చరిత్ర

* బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనకు ‘రావు బహద్దూర్‌’ అనే బిరుదును ఇచ్చింది. 

* 1919, మే 27న కొమర్రాజు లక్ష్మణరావు నివాస గృహం (వేద నివాసం)లో వీరేశలింగం మరణించారు. ఈయన సమాధిని రాజమండ్రిలోని స్వగృషంలో నిర్మించారు.

* ఈయన ఆంధ్ర సంస్కరణ ఉద్యమ పితామహ, ఆంధ్ర పునర్వికాస పితామహ, ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, యుగకర్త, గద్య వాజ్మయ బ్రహ్మ అనే బిరుదులు పొందారు.

* ఎం.జి.రనడే అనే సంఘసంస్కర్త వీరేశలింగానికి ‘దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు’ అనే బిరుదును ఇచ్చారు.

* ఈ విధంగా కందుకూరి వీరేశలింగం ఆంధ్ర సమాజంలో నూతన ఒరవడిని సృష్టించారు. ఈయన పుట్టినరోజును ‘తెలుగు నాటక రంగ దినోత్సవం’గా జరుపుకుంటారు.


వితంతు పునర్వివాహం

బాల్య వివాహాలకు వ్యతిరేకించారు. కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ‘వివేకవర్ధిని’లో అనేక వ్యాసాలు ప్రచురించారు. ఆయన చేపట్టిన వితంతు పునర్వివాహాలు ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి 1881, డిసెంబరు 11న తన ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం చేశారు.

* తిరువూరు తాలూకా రేవూడికి చెందిన 9 ఏళ్ల బాలవితంతువు గౌరమ్మకు, గోగులపాటి శ్రీరాములుతో వివాహం జరిపించారు. ఇది ఆందోళనలకు దారితీసింది. పెళ్లిలో పాల్గొన్న వారిని సమాజం నుంచి వెలేశారు. దీని తర్వాత సుమారు 40 వితంతు వివాహాలు చేశారు. వీటికి పైడా రామకృష్ణయ్య ధన సహాయం చేశారు. ఈయన కాకినాడలో వ్యాపారి.

* కందుకూరి వీరేశలింగం చేపట్టిన కార్యక్రమాలకు ఆయన మిత్రులైన పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు, విద్యార్థులు అండగా ఉండేవారు.

* ఆయన స్త్రీల కోసం సతీహితబోధిని అనే పత్రికను నడిపారు. వితంతు శరణాలయాన్ని స్థాపించారు. స్త్రీ విద్య కోసం 1874లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పారు. మల్లాది అచ్చనశాస్త్రి  దీనికి మొదటి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించారు. పిఠాపురం రాజా ఇచ్చిన రూ.పదివేలతో స్త్రీ విద్య

కోసం రాజమండ్రిలో ఒక ఉన్నత పాఠశాలను స్థాపించారు. 

* సమాజంలోని దురాచారాలను రూపుమాపి, తన భావాలను ప్రచారం చేయడానికి ‘వివేకవర్ధిని’ అనే పత్రికను ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యాలు సమాజంలోని రుగ్మతలను, ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతిని ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన.

* హాస్య సంజీవిని (1876) అనే హాస్య పత్రికను ప్రారంభించారు. తెలుగులో మొదటి ప్రహసనాన్ని ఇందులోనే ప్రచురించారు. వ్యంగ్య రూపకాలనూ అచ్చువేశారు.

* సమాజసేవ కోసం 1905లో ‘హితకారిణి’ అనే ధర్మ సంస్థను స్థాపించి తన ఆస్తిని దానం చేశారు.

* యుగకర్తగా పేరొంది, గద్య తిక్కన అనే బిరుదుపొందారు.


స్త్రీల పట్ల సానుభూతి

* 1887లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. దీనిద్వారా స్త్రీల స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి దుస్థితిని తొలగించడానికి నిర్విరామంగా కృషి చేశారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, భోగం వారికి కట్నాలు ఇవ్వడం మొదలైన దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు.


సాహిత్యసేవ

సంఘసేవకే కాకుండా  వీరేశలింగం సాహిత్యానికీ ఎనలేని సేవ చేశారు. చదువుకునే రోజుల నుంచే వ్యాసాలు రాయడం, వ్యవహారిక భాషలో రచనలు చేయడాన్ని అలవరుచుకున్నారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల్లో ఈయన ఒకరు. 

* ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం)లోని సంధి, విగ్రహ భాగాలను పరవస్తు చిన్నయసూరి వదిలేయగా వీరేశలింగం పూర్తిచేశారు.
 

ఇతర విశేషాలు...

* స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి వివేకవర్ధిని (1874), స్త్రీజనోద్ధరణ కోసం సతీహిత బోధిని (1883), సత్యసంవర్ధిని, సత్యదూత, చింతామణి, తెలుగు జనానా (1904), సత్యవాదిని (1905) పత్రికలను నిర్వహించారు. 

* వివేకవర్ధినికి శాశ్వత చందాదారుడిగా ఇ.పి.మెట్కాఫ్‌ అనే ఆంగ్లేయుడు సభ్యత్వం తీసుకున్నారు. దీనికి చందాదారుడిగా చేరిన తొలి విదేశీయుడూ ఈయనే.

* రాజమండ్రిలో టౌన్‌హాల్‌ను నిర్మించారు.

* కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కందుకూరి వీరేశలింగం సామాజిక సంస్కరణలు నచ్చక తన ‘ఆంధ్రభాషా సంజీవని’ పత్రికలో ‘వీరిగాడు’ అనే పాత్రను సృష్టించి, కందుకూరిని అవహేళన చేశారు. పంతులు దానికి పోటీగా ‘హస్య సంజీవని’ పత్రికలో ‘కొ.కొ.కొ.క్కొండ’ అనే నత్తిపాత్రను సృష్టించి వెంకటరత్నాన్ని విమర్శించారు. వెంకటరత్నం తెలుగులో వెండి అనే పేరుతో సంతాన ఛందస్సును ప్రవేశ పెట్టారు. ఈయనకు మహా మహోపాధ్యాయ అనే బిరుదు ఉంది.

* వీరేశలింగం 1875లో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. 

* వితంతు పునర్వివాహ సంఘానికి 1880లో మానింగ్‌ అనే బ్రిటన్‌ మహిళ 50 పౌండ్లను ఇచ్చారు.

* వీరేశలింగం తెలుగు సాహిత్యంలో స్వీయ చరిత్రలు, గద్య, నవలా రచనలు, ప్రకృతి-స్త్రీ రచనలు, ప్రహసన రచనలకు నాంది పలికారు.
 

వీరేశలింగం తర్వాతి యుగం

రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939)

* ఈయన్ను ‘దివాన్‌ బహదూర్‌’, ‘సర్‌’ అని పిలిచేవారు.

* విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మసమాజ ప్రచారకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

* వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1న మచిలీపట్నం (కృష్ణా జిల్లా)లో జన్మించారు. తల్లిదండ్రులు అప్పాయనాయుడు,  శేషమ్మ. తండ్రి మద్రాస్‌ సైనికదళంలో సుబేదారుగా విధులు నిర్వహించారు. వీరి పూర్వీకులు మద్రాస్, తూర్పు ఇండియా వర్తకసంఘ సైన్యంలో కమాండర్లుగా పనిచేశారు.

* తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల ఈయన విద్యాభ్యాసం అనేకచోట్ల జరిగింది. ప్రాథమిక విద్య చంద్రాపూర్‌ (మహారాష్ట్ర)లో, మాధ్యమిక విద్య హైదరాబాద్‌లోని నిజాం ఉన్నత పాఠశాలలో  అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ వద్ద పూర్తిచేశారు.

* మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు.
 

సంఘ సంస్కరణ సేవ: 

19వ శతాబ్దం నాటికి ఆంధ్రాలో అనేక ఆచార సంప్రదాయాలు, సాంఘిక దురాచారాలు ఉండేవి. వాటిని రూపుమాపడానికి వెంకటరత్నం ఎంతో కృషి చేశారు. సమాజం, మతంలోని లోపాలను విమర్శిస్తూ సాంఘిక సంస్కరణలకు పూనుకున్నారు.

* వెంకటరత్నం కాకినాడలో సంఘ సంస్కరణోద్యమాన్ని ప్రచారం చేశారు.

* ఈయన వేశ్యావృత్తిని వ్యతిరేకించారు. అప్పట్లో ‘భోగం’ కులానికి చెందిన స్త్రీలను దేవదాసీలుగా మార్చేవారు. దీన్ని పూర్తిగా రూపుమాపారు. 

* పిల్లల కోసం కాకినాడలో ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించారు. దీనికి పిఠాపురం మహారాజు ఆర్థికసాయం అందించారు. 

* మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇది మద్రాస్‌లో ప్రారంభమై ఆంధ్రా అంతటా వ్యాపించింది. 

* కాకినాడలో అనాథ శరణాలయాన్ని, హరిజన బాలికల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఆదాయంలో ఎక్కువభాగం పేద విద్యార్థులకే ఖర్చు చేశారు.

* దేవేంద్రనాథ్‌ ఠాగూర్, కేశవ్‌ చంద్రసేన్‌ల వల్ల బ్రహ్మసమాజ సాహిత్యానికి ఆకర్షితుడై 1885లో బ్రహ్మసమాజంలో చేరారు.

* 189495లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో బ్రహ్మసమాజ సిద్ధాంతాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.

*  పిఠాపురం రాజా సహకారంతో కాకినాడలో బ్రహ్మోపాసన మందిరాన్ని నిర్మించారు. ఇవే కాకుండా ధర్మ ప్రచారక నిధి, ఆంధ్ర బ్రహ్మ అనే సంస్థలను స్థాపించారు.

* బెంగాల్‌ భాషలోని బ్రహ్మసమాజ గ్రంథాలను తెలుగులోకి అనువదించేందుకు   పిఠాపురం రాజా బ్రహ్మప్రచారకులకు లక్షరూపాయల మూలధనంతో ఒక నిధిని కేటాయించారు.

* 1891లో ‘సాంఘిక శుద్ధి' (Social Purity Association)' అనే సమాజాన్ని స్థాపించారు. నిజాయతీగల పౌరులను తయారుచేయడం దీని లక్ష్యం.

* వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.

* 1932లో బ్రహ్మసమాజం ఈయనకు ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఇచ్చింది.

* కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్యలను ‘బ్రహ్మసమాజ త్రయం’గా పిలుస్తారు.

* ఈయన ‘బ్రహ్మప్రకాశిక’, ‘ఫెల్లోవర్కర్‌’, ‘పీపుల్స్‌ ఫ్రెండ్‌’ అనే పత్రికలను స్థాపించారు. ఇవి సాంఘిక సంస్కరణకు, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు దోహదం చేశాయి.

* ఈయనకు 1884లో వివాహం జరిగింది. 1889లో భార్య మరణించినా, పునర్వివాహం చేసుకోకుండా తెల్ల దుస్తులు ధరించారు. అందుకే ఆయన్ను ‘శ్వేతాంబర రుషి’ అని పిలిచేవారు.


విద్య కోసం కృషి- సంస్కరణలు: 

* William words worth, ఎమర్సర్, Mincobert వంటి ఆంగ్లకవులకు వెంకటరత్నం ఆకర్షితులయ్యారు.

* మద్రాసులోని పుచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల ఆచార్యునిగా మొదలుపెటి, 1899-1904 వరకు సికింద్రాబాద్‌ మహబూబ్, ముంబయి కాలేజీల్లో పనిచేశారు.

* 1904లో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలకు(పి.ఆర్‌.కళాశాల) ప్రిన్సిపాల్‌గా చేశారు.

* 1911లో మొదటిసారిగా మహిళలను కళాశాలలో చేర్చుకుని సహవిద్యను ప్రోత్సహించారు.

* 1925-28లలో మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి(వైస్‌ఛాన్సలర్‌)గా వ్యవహరించారు.

* మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడుగా నాయుడు ప్రసిద్ధి చెందారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన బిల్లు(ఆంధ్ర విశ్వకళా పరిషత్‌)ను రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు. ఈ విశ్వవిద్యాలయానికి వి.సి.గా పనిచేశారు.

* విజ్ఞానాభివృద్ధికి తన గురువైన డాృృ మిల్లర్‌ పేరిట మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో 10వేల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు.

* 1923లో మద్రాస్‌ శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు, మద్యపాన నిషేధం బిల్లు ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.

* 1924లో బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి విద్య, సంఘ సంస్కరణ కృషికి ‘నైట్‌హుడ్‌’ పురస్కారాన్ని పొందారు. ఒక అనధికార విద్యావేత్తకు ఈ బిరుదు దక్కడం ఇదే ప్రథమం.

* 1927లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ మొదటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

* భాషావేత్తలకు డాక్టరేట్‌ డిగ్రీలను ఇచ్చే సంప్రదాయాన్ని మొదటగా నాయుడు ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతోంది.

* తమిళ సాహిత్యంలో డాక్టరేట్‌ అందుకున్న మొదటి వ్యక్తిగా స్వామినాథ్‌ అయ్యర్‌ గుర్తింపు పొందారు.

* రఘుపతి వెంకటరత్నం నాయుడు అపర సోక్రటీస్, కులపతి, కైజర్‌-ఇ-హింద్‌’ అనే బిరుదులు కూడా ఉన్నాయి.

* ఉర్దూ, పర్షియన్, హిందీ భాషలలో కూడా మంచి ప్రావీణ్యం పొందారు.

* ‘సాంఘిక సంస్కరణ’ అనే గ్రంథం రచించారు.

* గురు-శిష్యుల జంటగా నాయుడుని- వేమూరి రామక్రిష్ణారావులను పేర్కొంటారు.

* రఘుపతి వెంకటరత్నం సోదరుడు - రఘుపతి వెంకయ్యనాయుడు. ఇతను ఆంధ్రాలో ప్రముఖ సినీ నిర్మాతగా, పంపిణీదారుగా పేరొందారు.

* వెంకటరత్నం గౌరవార్థం ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పారు.

* ఆంధ్రదేశ సాంఘిక వైతాళికులలో అగ్రగణ్యుడుగా నిలిచారు.

* 1939 మే 26న, 76 సంవత్సరాల వయసులో మరణించారు.


 దేశిరాజు పెదబాపయ్య (1877-1903)

* ఈయన 1877లో మచిలీపట్నంలో జన్మించారు. 

* కందుకూరి వీరేశలింగానికి ఆత్మబంధువుగా ఈయన్ను పేర్కొంటారు. 

* స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. 

* బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల ప్రభావితుడై, సంఘ సంస్కరణకు కృషి చేశారు.

* ‘వాయిస్‌ ఆఫ్‌ ట్రూత్‌’ అనే పత్రికను నడిపారు. 

* టెంపరెన్స్‌ సోషల్‌ ప్యూరిటీ, యంగ్‌ మెన్స్‌ ప్రియర్‌ యూనియన్‌’ సంస్థలను స్థాపించారు. 


వేమూరి రామకృష్ణారావు (1876-1939)

* ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడు శిష్యుడు. వెంకటరత్నం ఈయన్ను తన నీడగా అభివర్ణించారు.

* వెంకటరత్నం ప్రవచనాలను, అధ్యక్షోపన్యాసాలను, ఉపన్యాసాలను 8 వాల్యూమ్స్‌గా ప్రచురించారు.


వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1812-91)

* ఈయన 1812లో నెల్లూరులోని విదవలూర్‌లో జన్మించారు.

* ‘సరస్వతి ముద్రాలయం’ అనే తెలుగు పబ్లిషింగ్‌ హౌస్‌ను స్థాపించారు. తర్వాత, దీని పేరు ‘వావిళ్ల ప్రెస్‌’గా  మార్చారు.

* 1854లో చెన్నపట్నంలో ‘హిందూ భాషా సంజీవని’ పేరుతో మరో ప్రెస్‌ను స్థాపించారు. ఇది తెలుగులో ఏర్పాటైన మొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌.

* ఈయన 50కి పైగా తెలుగు, సంస్కృత గ్రంథాలను ముద్రించారు.

* 1860లో ‘ది గ్రేట్‌ ప్రైమర్‌’ అనే టైప్‌ రైటింగ్‌ను రూపొందించారు.

* తెలుగు భాషకు ఈయన చేసిన కృషికి సి.పి. బ్రౌన్‌ అభినందించారు. 

* ‘ఆది సరస్వతి నిలయం’ అనే సంస్థను స్థాపించారు.

* రామస్వామి అనంతరం ఆయన కుటుంబసభ్యులు ఈ ప్రెస్‌ను కొనసాగించారు.

కందుకూరి వీరేశలింగం పంతులు యుగం తర్వాత 19, 20 శతాబ్దాల్లో ఆంధ్రాలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. వారిలో గురజాడ వెంకట అప్పారావు ముఖ్యులు. 

గురజాడ అప్పారావు (1862-1915)

* ఈయన 1862, సెప్టెంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలుకా ఎస్‌ రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట రామదాసు, కౌసల్యమ్మ.  

* ప్రముఖ రచయిత, మహాకవి, సాహితీవేత్త, సంఘసంస్కర్త, హేతువాది, అభ్యుదయ వాదిగా గుర్తింపు పొందారు.

* తన రచనల ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. తెలుగు వ్యాసాంగాన్ని సంప్రదాయ శైలి నుంచి ఆధునిక శైలికి మార్చారు.

* ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా గురజాడ గ్రామం. అందుకే వీరి ఇంటిపేరు గురజాడగా మారింది. తర్వాత విశాఖపట్నానికి వలస వచ్చారు.

* వెంకట రామదాసు విజయనగర సంస్థానంలో వివిధ హోదాల్లో పనిచేశారు.

* అప్పారావు తన పదేళ్ల వయసు వరకు చీపురుపల్లిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తర్వాత ఎం.ఆర్‌.కాలేజీ ప్రిన్సిపల్‌ సి.చంద్రశేఖర శాస్త్రి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. 

* 1882లో మెట్రిక్యులేషన్, 1884లో ఎఫ్‌ఏ పూర్తిచేసి ఎం.ఆర్‌. హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు.

* విజయనగరంలో బీఏ పూర్తి చేశారు. అక్కడే వాడుకభాష/ వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులుతో పరిచయం ఏర్పడింది.

* 1885లో నరసమ్మతో వివాహం జరిగింది.

* 1889లో ఆనంద గజపతి డిబేటింగ్‌ క్లబ్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకుడిగా పనిచేశారు.

* 1886లో డిప్యూటీ కలెక్టర్‌ హెడ్‌ ఆఫీస్‌లో హెడ్‌ క్లర్క్‌గా; 1887లో మహారాజ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 

* 1887లో విజయనగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో పాల్గొని సామాజిక చైతన్యం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. 

* విశాఖపట్నం వాలంటరీ సర్వీసుల్లో చేరారు.

* 1882లో మొదటిసారిగా ‘ది - కాకు’ అనే కవితను రాశారు. ‘ఇండియన్‌ లీజర్‌  అవర్‌’ పత్రిక దీన్ని ప్రచురించింది. 

* ఆనంద గజపతి మరణించాక, ఆయన సోదరి దేవా మహారాణి అప్పల కొండాయమ్మ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆమె అభీష్టం మేరకు 1907లో నీలగిరి పాటలను రచించారు.

* గురజాడ తన తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్ల పద్యాలను రాశారు. ‘సారంగధర’ (1883) కవిత వీరికి మంచి పేరు తెచ్చింది. ఇది ఇండియన్‌ లీజర్‌ అవర్‌ పత్రిక విజయనగరం ఎడిషన్‌లో అచ్చయ్యింది. ఆ సమయంలో దీని సంపాదకులుగా గుండుకుర్తి వెంకట రమణయ్య ఉన్నారు.

* 1896లో ‘ప్రకాశిక’ పత్రికను ప్రారంభించారు.

* 1910లో ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా’ అనే ప్రముఖ గేయాన్ని రచించారు.

* 1911లో మద్రాస్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం పొందారు.

* గురజాడ తన స్నేహితులతో కలిసి ‘ఆంధ్రాసాహిత్య పరిషత్‌’ను ప్రారంభించారు.

* 20వ శతాబ్దం తొలినాళ్లలో గిడుగు రామ్మూర్తి పంతులుతో కలిసి వ్యవహారిక భాషోద్యమంలో పాల్గొన్నారు. 

* 1913లో అప్పారావు అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారు. 

* 1915, నవంబరు 30న 53 ఏళ్ల వయసులో మరణించారు. ఈ సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఆయన చనిపోలేదు, జీవించడం ప్రారంభించారు’ అని వ్యాఖ్యానించారు.

* మద్రాస్‌ విశ్వవిద్యాలయం అప్పారావును ‘ఫెల్లో’ బిరుదుతో సత్కరించింది.


రచనలు

కన్యాశుల్కం: ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యంగా విజయనగర సంస్థానంలో కన్యాశుల్కం, వేశ్యావృత్తి, బాల్యవివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవి. వీటికి వ్యతిరేకంగా  కన్యాశుల్కం పేరుతో గురజాడ తెలుగు వాడుక భాషలో నాటకాన్ని రచించారు. ఆంధ్రా ప్రాంతంలో తొలి సాంఘిక వచన

నాటకం ఇదే. దీన్ని విజయనగరం రాజైన ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 

* కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు 1897లో జరిగింది. దీన్ని అయిదు అంకాలు, 132 రంగాలు, 109 పేజీలతో పూర్తిచేశారు.

* శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం (సంస్కృత నాటకం) స్ఫూర్తితో గురజాడ కన్యాశుల్కాన్ని రచించారు. ఇందులోని శకారునితో గిరీశం పాత్రను; వసంత సేనతో మధురవాణి పాత్రను సృష్టించారు. ఈ నాటకంలో శ్రీకాకుళం మాండలికాన్ని తొలిసారి వాడారు. 

* ఈ నాటకం రెండో కూర్పు 1909లో ఉదక మండలంలో జరిగింది. ఇందులో ఏడు అంకాలు, 133 రంగాలు, 199 పేజీలు ఉన్నాయి. 

* ఈ నాటకాన్ని మొదట 1892లో జగన్నాథ విలాసిని సంస్థ ప్రదర్శించింది. 

* ఈ నాటకంలో సత్యకాలపు వితంతువుగా బుచ్చమ్మ, సంస్కారం ఉన్న వేశ్యగా మధురవాణి, చదువుకున్న వంచకుడిగా గిరీశం, ఛందస్సు పండితుడిగా అగ్నిహోత్రావధానులు, సంస్కర్తగా సౌజన్యరావు, ఢాంబికుడిగా రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఉన్నాయి.

* కట్టమంచి రామలింగా రెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటకాన్ని మహాకావ్యంగా, ఆంధ్రా సాహిత్యంలో శాశ్వత స్థానం పొందిందని వ్యాఖ్యానించారు.

* గిడుగు రామ్మూర్తి పంతులు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఈ నాటకం విలువలను ఎంతో ప్రశంసించారు.

* 1897లో కన్యాశుల్కం నాటకాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ (మద్రాస్‌) వారు ప్రచురించారు.

* కన్యాశుల్కం నాటకాన్ని కన్నడ, తమిళం, హిందీ, ఫ్రెంచ్, రష్యన్, ఆంగ్ల (రెండుసార్లు) భాషల్లోకి అనువదించారు.

* 100 ప్రదర్శనలు పూర్తిచేసుకున్న మొదటి  తెలుగు సాంఘిక నాటకం ఇదే.

* గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకానికి సాటి వచ్చే రచన భారతీయ సాహిత్యంతో మృచ్ఛకటికం తప్ప మరొకటి లేదని శ్రీశ్రీ వ్యాఖ్యానించారు. ఇది బీభత్సరస ప్రధాన విషాదాంత నాటకమని పేర్కొన్నారు.

* ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అనే సుప్రసిద్ధ గేయాన్ని గురజాడ రాశారు. ఇందులోని ఇతివృత్తం కూడా కన్యాశుల్కమే. ఇందులో బాల్యవివాహ వ్యవస్థ వల్ల జరిగే అనర్థాలను వివరించారు.

* కొండుభట్టీయం, ముత్యాలసరాలు (1910), కన్యక, సత్యవతి శతకం, సుభద్ర, లంగరెత్తుము (1915), దించులంగరు (1914), లవణరాజు కల, కథానికలు, సౌదామిని, మీపేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతం-విమతం, పుష్పాలవికలు మొదలైన రచనలు చేశారు. 

* తెలుగు సాహిత్యంలో ముత్యాలసరాలు అనే నూతన ఛందస్సును ప్రవేశపెట్టారు.

* ‘బిల్హణీయం’ అనే గ్రంథం అసంపూర్ణ రచనగా మిగిలింది.

* కొండుభట్టీయం అనే గ్రంథంలో గిరీశం పాత్రను రెండోసారి ప్రవేశపెట్టారు.

* లవణరాజు కల అనే కథలో కుల వ్యవస్థను ఖండించారు.

* దిద్దుబాటు, సంస్కర్త హృదయం రచనల్లో వేశ్యావృత్తిని వివరించారు.

* చారిత్రక గ్రంథాలైన పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగరాజుల చరిత్ర మొదలైనవి ఈయన రచనలే.
 


చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1940)

* ఈయన 1867, సెప్టెంబరు 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకయ్య, తల్లి రత్నమ్మ.

* నరసాపురం, రాజమండ్రిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 

* సంఘ సంస్కరణలో కేశవ చంద్రసేన్, ఎం.జి.రనడే లాంటి వారి నుంచి స్ఫూర్తి పొందారు.

* కవిగా, రచయితగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా, సంఘ సంస్కరణవాదిగా, విద్యావేత్తగా, సాహిత్యకారుడిగా, దేశభక్తుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.

* 1889లో రాజమండ్రిలోని ఆర్య పాఠశాలలో, ఇన్నీసుపేట మున్సిపల్‌ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

* 1899లో హిందూ లోయర్‌ సెకండరీ పాఠశాలను స్థాపించారు. తర్వాత దీన్ని వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చారు.

* 30 ఏళ్ల వయసులో ఈయనకు రేచీకటి వ్యాధి వచ్చింది.

రచనలు: 1889లో మొదటిసారి ‘కీచకవధ’ అనే నాటకాన్ని రచించారు. 188990 మధ్య కాలంలో  ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకల్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటకాలు రాశారు. 1922లో చతుర చంద్రహాసం అనే రచన చేశారు.

నవలలు: రామచంద్ర విజయం (1894), హేమలత (1896), అహల్యాబాయి (1897), సుధా శరచ్ఛంద్రం, సౌందర్య తిలక (1898-1900), పార్వతీ పరిణయం.

* ఈయన రాసిన గణపతి అనే హాస్య నవల బాగా ప్రాచుర్యం పొందింది. 

* 1893లో న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీల్లో రామచంద్ర విజయం ఉత్తమ నవలగా ఎంపికైంది. సుబ్బారావు నిర్వహించిన చింతామణి పత్రికలో హేమలత, గణపతి, అహల్యాబాయి నవలలు ప్రచురితమయ్యాయి.

* కల్నల్‌ టాడ్‌ రాసిన రాజస్థాన్‌ కథాకళిని చిలకమర్తి తెలుగులోకి అనువదించారు. ఇది ఒక చారిత్రక గ్రంథం.

* లులాయి అనే శతకాన్ని రచించారు.

* పోలవరం జమీందారు స్థాపించిన సరస్వతి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.

* 1906లో మనోహర, 1907లో దేశమాత పత్రికలను నడిపారు.


సంఘసంస్కర్తగా..: 

* 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. నిమ్నవర్గాల వారి కోసం మరో హరిజన పాఠశాలను నెలకొల్పారు.

* బ్రహ్మసమాజం, హితకారిణి నిర్వహించే సమాజ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

* దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు.

* దళితులకు చేసిన సేవలకు అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్డ్‌ పెంట్‌లాండ్‌ ఈయన్ను ప్రశంసించారు.

* పండిత శివనాథ శాస్త్రి ఈయన్ను ‘లోకల్‌ షేక్‌స్పియర్‌’ అని ప్రశంసించారు. ‘చిలకమర్తిది ఫొటోజెనిక్‌ మెమొరీ’ అని వాసురాయ కవి పేర్కొన్నారు.

* చిలకమర్తి రాసిన ‘గయోపాఖ్యానం’ నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడయ్యాయి.

* స్వాతంత్రోద్యమ సమయంలో ఈయన ‘భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’  అనే గేయాన్ని రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

* 21 అధ్యాయాలతో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర రాసుకున్నారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.

* 1907, ఏప్రిల్‌ 19న రాజమండ్రిలో జరిగిన సభలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు.

* చతురకవి, ఆంధ్రా స్కాట్, ఆంధ్రుల అంధకవి అనే బిరుదులు పొందారు.

* ఆంధ్రా తొలి తెలుగు జాతీయకవిగా చిలకమర్తి గుర్తింపు పొందారు.

* ఈయన 1940, జూన్‌ 17న మరణించారు.

* 1943లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ పురస్కారంతో ఈయన్ను సత్కరించింది.
 

మాదిరి ప్రశ్నలు

1. ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించింది ఎవరు?

1) వీరేశలింగం పంతులు     2) రఘుపతి వెంకటరత్నం నాయుడు

3) వీరస్వామి        4) ఎవరూకాదు

2. ‘సాంఘిక శుద్ధి’ అనే సమాజాన్ని స్థాపించింది ఎవరు?

1) రఘుపతి వెంకటరత్నం నాయుడు     2) అనంత రామశాస్త్రి

3) వీరేశలింగం       4) వీరసామయ్య

3. ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఎవరికి ఉంది?

1) వీరసామయ్య      2) లక్ష్మీ నరసింహం     3) వీరేశలింగం       4) రఘుపతి వెంకటరత్నం నాయుడు

4. కింది ఎవరిని బ్రహ్మసమాజ త్రయంగా పిలుస్తారు?

1) కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య

2) లక్ష్మీ నరసింహం, కందుకూరి వీరేశలింగం, దేశిరాజు పెదబాపయ్య

3) సామినేని ముద్దు నరసింహం, అనంత రామశాస్త్రి, కందుకూరి వీరేశలింగం

4) ఎవరూకాదు


 

5. శ్వేతాంబర రుషి అని ఎవరిని పిలుస్తారు?

1) వీరేశలింగం పంతులు         2) గాజుల లక్ష్మీనరసుశెట్టి

3) దేశీరాజు పెదబాపయ్య         4) రఘుపతి వెంకటరత్నం




6. బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్‌ ఫ్రెండ్‌ పత్రికలను స్థాపించిన వారు?

1) దేశిరాజు పెదబాపయ్య           2) వీరేశలింగం

3) రఘుపతి వెంకటరత్నం నాయుడు      4) శ్రీనివాస పిళ్లై




7. మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడు? 

1) రఘుపతి వెంకటరత్నం నాయుడు      2) అనంత రామశాస్త్రి

3) వీరేశలింగం పంతులు      4) శివనాథ శాస్త్రి


సమాధానాలు: 1-2;  2-1;  3-4;  4-1; 5-4;  6-3;  7-1.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసన ఉల్లంఘన ఉద్యమం - 2

విముక్తి కాంక్ష‌ను ర‌గిలించిన పోరాటం!

  అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, ఆస్తుల స్వాధీనాలు, అన్యాయమైన ఆంక్షలు, అమానుష కాల్పుల మధ్య అత్యంత కఠినంగా ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రబలమైన ప్రజల జాతీయవాద శక్తికి తల వంచాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఒప్పందం కుదుర్చుకొని, సమావేశాలకు మహాత్ముడిని స్వాగతించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే శాసనోల్లంఘన ఉద్యమం. తర్వాతి దశలో పలు కారణాలతో బలహీన పడినప్పటికీ, పరాయి పాలన నుంచి విముక్తి పొంది తీరాలనే కాంక్షను బలంగా ప్రజల్లో రగిలించింది. పోరాటాల కష్టాలను తట్టుకొని నిలబడగలిగే సహనాన్ని వారికి సమకూర్చింది. ఈ పరిణామాలను, వాటి ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. ప్రజాక్షేమం దృష్ట్యా 11 కనీస చర్యలను ప్రకటించి, ప్రభుత్వం వాటికి సమ్మతించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అప్పటి వైస్రాయ్‌ (రాజప్రతినిధి) ఆ డిమాండ్లలో వేటికీ స్పందించకపోవడంతో శాసనోల్లంఘనకు ఉపక్రమించారు. ఉప్పుపై పన్ను శాసనాన్ని తొలుత ఉల్లంఘించాలని నిర్ణయించారు. 1930, మార్చి 12న 78 మంది సుశిక్షితులైన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరిన గాంధీజీ గుజరాత్‌ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి ఏప్రిల్‌ 6న చేరుకున్నారు. అక్కడ ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక యాత్రలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎర్నేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాంధీజీ దండి యాత్రకు దారి పొడవునా జనసందోహం జయజయధ్వానాలతో మద్దతు తెలిపారు. ప్రజల్లో స్వాతంత్య్ర దీక్ష వెల్లివిరిసింది. 

  ఉద్యమంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను గాంధీÅజీ నిర్దేశించారు. అవన్నీ అహింసా పద్ధతిలోనే జరగాలన్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం ఉప్పు సత్యాగ్రహం, చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేయడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ-ముస్లిం ఐక్యత, పన్నుల చెల్లింపు నిరాకరణ, అంటరానితనం నిర్మూలనను పాటించాలని సూచించారు. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. ఆ తర్వాత ఉద్యమానికి అబ్బాస్‌ థ్యాబ్జి, సరోజినీ నాయుడు వరుసగా నాయకత్వం వహించారు. సరోజినీ నాయుడు నాయకత్వంలో మే 21న సత్యాగ్రహులు ప్రభుత్వ ఉప్పు డిపోపై దాడి చేశారు.

ఉద్యమ వ్యాప్తి: శాసనోల్లంఘన ఉద్యమం దేశమంతా త్వరగా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు, శ్రామికులు, రైతులు ముఖ్యంగా మహిళలు విశేషంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిచోటా హర్తాళ్లు, విదేశీ వస్త్ర బహిష్కరణ, పన్నుల నిరాకరణ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. చక్రవర్తి రాజగోపాలాచారి తంజావూర్‌ తీరంలో తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు; మలబారు తీరంలో కెల్లప్పస్‌ కాలికట్‌ నుంచి పయన్నూర్‌ వరకు సత్యాగ్రహులతో పాదయాత్ర చేసి, ఉప్పు తయారుచేసి శాసనాన్ని ఉల్లంఘించారు. వాయవ్య ప్రాంతంలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ ‘ఖుదాయి కిద్‌మత్‌గార్‌’ అనే ప్రతిఘటన సంస్థను స్థాపించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంస్థ సభ్యులను ప్రజలు ‘రెడ్‌ షర్ట్స్‌’ అనేవారు. నాగాలాండ్‌కు చెందిన రాణి గైడెన్‌ అనే ధీర వనిత 13 ఏళ్ల ప్రాయంలోనే గాంధీజీ పిలుపునకు స్పందించి, విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్ష అనుభవించింది.

ఆంధ్రాలో ఉద్యమం: ఆంధ్ర ప్రాంతంలో శాసనోల్లంఘన ఉద్యమ బాధ్యతలను కాంగ్రెస్‌ కొండా వెంకటప్పయ్యకు అప్పగించింది. ఆయన ప్రతి జిల్లాలో నాయకుడిని నియమించి, శిబిరం ఏర్పాటు చేసి, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య; గుంటూరు జిల్లాలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీబాయమ్మ; గోదావరి జిల్లాల్లో బులుసు సాంబమూర్తి, విశాఖ జిల్లాలో తెన్నేటి విశ్వనాథం, నెల్లూరు జిల్లాలో బెజవాడ గోపాలరెడ్డి, రాయలసీమలో కల్లూరి సుబ్బారావు, మద్రాసు నగరంలో టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు తదితర నాయకులు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేశారు.

ప్రభుత్వ వైఖరి: ఉద్యమకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. లాఠీఛార్జీలు, అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, నిరాయుధులైన ఉద్యమకారులపై కాల్పులు నిత్యకృత్యం అయ్యాయి. కాంగ్రెస్‌ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు. జాతీయవాద పత్రికలపై ఆంక్షలు విధించారు. 1930 చివరి నాటికి దేశవ్యాప్తంగా లక్షల మంది నిర్బంధంలో ఉన్నారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు: ఈలోగా బ్రిటన్‌లో సైమన్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భవిష్యత్తులో చేపట్టబోయే రాజ్యాంగ సంస్కరణల గురించి భారత నాయకులతో చర్చించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసింది. 1930, నవంబరు 12న నాటి బ్రిటిష్‌ చక్రవర్తి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పార్టీల నుంచి 16 మంది, భారత రాష్ట్రాల నుంచి 16 మంది, బ్రిటిష్‌ ఇండియా నుంచి 57 మంది వివిధ రాజకీయ పక్షాలకు/సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ బహిష్కరించింది. దాంతో రాజకీయ సంస్కరణల విషయంలో ఈ సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. భారతదేశంలో అత్యధిక ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ పాల్గొనని ఆ సమావేశం నిష్ప్రయోజనమని భావించింది. 1931, జనవరి 19న సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది.

గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక: కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రహించింది. తేజ్‌బహదూర్‌ సప్రూ, డాక్టర్‌ ఎం.ఆర్‌.జయకర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలకు రాజీ కుదిరింది. దీని ఫలితంగా గాంధీతో సహా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ విడుదల చేశారు. 1931, మార్చి 5న వైస్రాయ్‌ ఇర్విన్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది.

ముఖ్యాంశాలు: * హింసకు బాధ్యులైన వారిని తప్ప, మిగతా రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు. జప్తు చేసిన వారి ఆస్తులు పునరుద్ధరిస్తారు. 

* సారాయి, నల్లమందు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ప్రశాంతంగా పికెటింగ్‌కు, నిబంధనలకు లోబడి ఉప్పు తయారీకి అనుమతిస్తారు. 

* కాంగ్రెస్‌ కూడా తన వంతుగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 1931, మార్చిలో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం దీన్ని ఆమోదించింది.

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. కాంగ్రెస్‌ ప్రతినిధిగా మహాత్మాగాంధీ పాల్గొన్నారు. జాతీయవాదుల ప్రధాన డిమాండ్లను, తక్షణ అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) ఇచ్చే అంశాన్ని ఈ సమావేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విస్మరించి అజెండాను పక్కదారి పట్టించింది. భారతదేశ రాజకీయ సంస్కరణల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గ్రహించిన గాంధీ స్వదేశానికి తిరిగివచ్చారు. వచ్చీ రావడంతోనే రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిష్ప్రయోజనమైందని ప్రకటించారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరించారు.

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: ఇది 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సాధించేదేమి ఉండదని భావించి కాంగ్రెస్‌పార్టీ దీన్ని బహిష్కరించింది.  

  ఇంతలో భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ స్థానంలో లార్డ్‌ వెల్లింగ్టన్‌ నియమితులయ్యారు. ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.  ఉద్యమకారులను అణచివేసేందుకు పోలీసులు హింసాత్మక చర్యలకు దిగారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, మతతత్వ రాజకీయాలు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఐకమత్య లోపం, ప్రభుత్వ అణచివేత విధానాలతో ఉద్యమం బలహీనమైంది. కాంగ్రెస్‌ ఈ ఉద్యమాన్ని 1933, మేలో నిలిపేసింది. 1934లో అధికారికంగా ఉపసంహరించుకుంది.

ఉద్యమ ఫలితాలు: సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. భారతీయులు పరాయి పాలనను, వలసవాదుల చట్టాలను భరించే స్థితిలో ఏమాత్రం లేరని చాటింది. వాటి నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పానికి ప్రతిరూపమే శాసనోల్లంఘన ఉద్యమం. స్వరాజ్య భావన, పోరాట స్వభావం ప్రజల్లో నాటుకుపోయింది. సమాజంలోని అనేక వర్గాలతో పాటు, రైతులు, వ్యాపారులు, పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొని ఉద్యమ సామాజిక పరిధిని విస్తృతం చేశారు. ఉద్యమకారులు కేవలం బ్రిటిష్‌ చట్టాలకు సహాయ నిరాకరణ మాత్రమే కాకుండా, బ్రిటిష్‌ చట్టాలను ఉల్లంఘించి తమ స్వరాజ్య కాంక్షను విస్పష్టం చేశారు. ఈ ఉద్యమం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చింది. రాజకీయ పోరాటాల్లో బాధలు తట్టుకునే శక్తిని, సహనాన్ని భారతీయులకు అలవాటు చేసింది. తర్వాతి రోజుల్లో క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు వారిని సిద్ధం చేసింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయవాద రాజకీయాలు

స్వరాజ్య కాంక్షను రగిలించిన రాజకీయం!


  త్యాగాలతో కూడిన భారతీయుల పోరాటాలు, నిజాయతీ నిండిన రాజకీయాలు తెల్లవారిని ఆలోచనలో పడేశాయి. వారిలోని ఉదారత్వాన్ని మేల్కొలిపాయి. తదనంతర కాలంలో దేశంలో పాలనకు మూలమైన ఒక చట్టాన్ని చేయడానికి ప్రేరణగా మారాయి. ఆ కొత్త చట్టం కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతగా ప్రభావం చూపలేకపోయిన ముస్లింలీగ్‌ అవకాశవాద చర్యలతో ఆంగ్లేయుల వైపు చేరింది. బలవంతంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగిన బ్రిటన్‌ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా నిరసించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వైఖరి మార్చుకున్న వైస్రాయ్, ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపి ప్రత్యేక దేశ విభజన డిమాండ్లను ప్రోత్సహించాడు. సంగ్రామ కాలంలో సంభవించిన పరిణామాలతో రగిలిన స్వాతంత్య్రకాంక్ష తర్వాతి దశ జాతీయోద్యమంపై అత్యంత ప్రభావాన్ని ప్రదర్శించింది.


  గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. మనవాళ్ల ప్రగాఢ స్వాతంత్య్రాభిలాషను విభిన్న నిరసనలతో ప్రదర్శించింది. స్వాతంత్య్రం కోసం భారతీయులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని లోకానికి తెలియజేసింది ఈ క్రమంలో బ్రిటిషర్లలో కొంత ఉదారవాద చైతన్యం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమం, నైతిక విలువలతో కూడిన గాంధీజీ రాజకీయాల వల్ల ఆంగ్లేయ ప్రభుత్వంలోనూ కొంత మార్పును తీసుకొచ్చింది. అయినా రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతలో సైమన్‌ కమిషన్‌ నివేదిక, మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన సూచనలు కలిపి 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. ఈ సూత్రాలను పరిశీలించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్‌ లిన్‌లిత్‌గో నాయకత్వంలో పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.


భారత ప్రభుత్వ చట్టం-1935 ముఖ్యాంశాలు: * ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌-గవర్నర్‌ జనరల్‌కు కట్టబెట్టింది.


* కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్‌ లెజిస్లేచర్‌) చట్టాలను చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. 


* కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ల నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని (అటానమీ) కల్పించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. 


* భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలను ఇవ్వడానికి లండన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ చట్టానికి జాతీయోద్యమ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 


* భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలోని అనేక అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించింది. 


భారత ప్రభుత్వ చట్టం-1935 కింద ఎన్నికలు: బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లో ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ వివరణాత్మకమైంది, సుదీర్ఘమైంది. 1937, ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముస్లింలీగ్‌ అతికష్టం మీద ఇతర పార్టీల సహాయంతో రెండు రాష్ట్రాల్లో గెలిచింది. అధిక సంఖ్యాక ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారని తేటతెల్లం కావడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.* ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారానే మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల అధికార పరిధిలోకి బదిలీ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు. బొంబాయి, మద్రాసు, సెంట్రల్‌ ప్రావిన్స్, ఒరిస్సా, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఈ ప్రభుత్వాలు తమకున్న పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చడానికి, పౌర హక్కులు కల్పించడానికి కృషి చేశాయి. పత్రికలపై ఆంక్షల తొలగింపు, కొన్ని సంస్థలపై బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన బహిష్కరణలను ఎత్తివేయడంతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేశాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రజానుకూల శాసనాలను తీసుకొచ్చాయి. ఖాదీని ప్రోత్సహిస్తూ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాయి. పారిశ్రామికవేత్తలు, కార్మికుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. మంత్రులు వేతనాలు, ఖర్చులను తగ్గించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు నిజాయతీతో వ్యవహరించిన కాంగ్రెస్‌ మంత్రివర్గాలు ప్రజాసేవలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి.


రెండో ప్రపంచ యుద్ధం

 
  జర్మనీ నియంత హిట్లర్‌ రాజ్య విస్తరణ కాంక్షతో పోలెండ్‌పై యుద్ధం ప్రకటించడంతో 1939, సెప్టెంబరులో రెండో ప్రపంచ సంగ్రామం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోలెండ్‌కు మద్దతుగా జర్మనీతో తలపడాల్సి వచ్చింది. జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఒక వైపు; బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా మరో వైపు యుద్ధానికి దిగాయి.  మన జాతీయ నాయకులు, కేంద్ర శాసనసభ సభ్యులెవరినీ సంప్రదించకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి దింపింది. నాజీ, ఫాసిస్ట్‌ వంటి ప్రపంచ నియంతృత్వ శక్తులతో పోరాటానికి కాంగ్రెస్‌ నాయకులు సుముఖంగానే ఉన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటన్‌ అవలంబిస్తున్న పద్ధతుల పట్ల విముఖత చూపారు. దేశంలో రాజ్యాంగబద్ధ అసెంబ్లీ, కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు వంటి కనీస షరతులను ఆమోదిస్తేనే బ్రిటన్‌ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలను రాజప్రతినిధి లిన్‌లిత్‌గో తోసిపుచ్చాడు. ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. మరోవైపు మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ఇండియన్‌ ముస్లింలీగ్‌ మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. 1939, డిసెంబరు 22ను ముస్లింలీగ్‌ ‘విమోచన దినం’గా నిర్వహించింది.


ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ 


  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజీనామా చేయడంతో వైస్రాయ్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపుతూ, దాని డిమాండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా ముస్లింలీగ్‌ మారింది. 1940, మార్చిలో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ సమావేశంలో హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అనే ఒక అశాస్త్రీయ సిద్ధాంతాన్ని జిన్నా ప్రచారం చేశాడు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్‌ మొదటిసారిగా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ‘పాకిస్థాన్‌’ కావాలని తీర్మానం జరిగింది. యుద్ధ కాలంలో భారతదేశ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. రెండో ప్రపంచ సంగ్రామం హోరుగా సాగుతున్న సమయంలోనే, ఐరోపా వలస రాజ్యాల్లో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికి ప్రజా పోరాటాలు పుంజుకున్నాయి. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో తదుపరి స్వాతంత్య్ర పోరాట గతిని అనూహ్యంగా మార్చేసింది.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)

ప్రజలే సారథులై.. పోరాట యోధులై!


 

రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అది తప్పిపోవాలంటే ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లాలని గాంధీజీ డిమాండ్‌ చేశారు. అప్పటికే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ అంటూ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో మరింత విజృంభించారు. అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం నేతలందరినీ అరెస్టు చేసింది. అయినా జనంలో రగిలే అసంతృప్తి జ్వాలలు ఆరలేదు, అదుపులోకి రాలేదు. నింôకుశ నిర్బంధాలను ధిక్కరించి, నాయకత్వం లేకపోయినా ప్రజలే సారథులై, పోరాట యోధులై పెద్ద ఎత్తున ఉద్యమించారు. క్విట్‌ ఇండియా నినాదం దేశమంతా మారుమోగింది. అణచివేతకు ప్రభుత్వం ప్రజలపై దమనకాండను సాగించింది. తిరగబడిన ఉద్యమకారులు సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారు. యుద్ధం ఆగిపోవడంతో ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రమే భారతీయుల ఉక్కు సంకల్పమనే వాస్తవం తెల్లవారి తలకెక్కింది. 

దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం జాతికి స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఘట్టం. 1942, ఆగస్టులో గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునివ్వడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించాయి. తక్షణం అధికార బదిలీ జరగాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. రాజకీయ సంస్కరణల కోసం భారత నాయకులతో సంప్రదింపులు సాగించిన అనంతరం క్రిప్స్‌ చేసిన ప్రతిపాదనలు భారతీయులను మెప్పించలేకపోయాయి. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశంలో ఆహార పదార్థాల కృత్రిమ కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి. కష్టకాలంలో ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజాజీవితం దుర్భరంగా మారింది. మరోవైపు యుద్ధంలో అక్షరాజ్య కూటమి తరఫున జపాన్‌ సైన్యం ఆసియా ఖండంలో విజృంభించింది. ఆంగ్లేయులను మలయా, సింగపూర్, బర్మాల నుంచి తరిమేసి బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జపాన్‌ సైన్యం భారత్‌ పొరుగు దేశమైన అప్పటి బర్మాలోకి ప్రవేశించింది. ఆ యుద్ధాగ్ని జ్వాలలు భారతదేశాన్నీ తాక వచ్చనే భయం ప్రజల్లో వ్యాపించింది.

1942లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను, ప్రజల ఆగ్రహావేశాలను గాంధీ గ్రహించారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలివెళ్లడం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వానికి తన ‘హరిజన’ పత్రిక ద్వారా సూచించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై ఆ తీర్మానాన్ని ధ్రువీకరించింది. అహింసాయుతంగా, గాంధీ నాయకత్వంలో పోరాడాల్సిందిగా ఈ తీర్మానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ప్రభుత్వం దమననీతికి పాల్పడి ఉద్యమ నాయకులను అరెస్ట్‌ చేస్తే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రగాఢంగా కోరుకునే ప్రతి భారతీయుడు ఉద్యమస్ఫూర్తితో స్వయంగా కార్యక్రమం రూపొందించుకోవాలని కోరింది.


   బొంబాయిలోని గోవలియ ట్యాంక్‌ మైదానంలో (క్రాంతి మైదానం) ఆగస్టు 8న గాంధీజీ ఉపన్యసిస్తూ స్వాతంత్య్రానికి తక్కువైంది ఏదీ అంగీకరించడం కుదరదని స్పష్టం చేశారు. దానికోసం ఒక మంత్రం ఉపదేశించారు. అదే ‘విజయమో.. వీరస్వర్గమో’ (డూ ఆర్‌ డై), దేశాన్ని విముక్తి చేయడమో లేదా ఆ ప్రయత్నంలో మరణించడమో ఏదో ఒకటి జరగాలని ఉద్వేగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలను అహింసాయుతంగా ధిక్కరించాలని చెప్పారు. అయితే ఈ ఉద్యమ నిర్వహణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పటికి ఇంకా ఖరారు చేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఫార్వర్డ్‌ బ్లాక్, జయప్రకాష్‌ నారాయణ్, అచ్యుత్‌ పట్వార్దన్, రామ్‌ మనోహర్‌ లోహియా మొదలైనవారు స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వంటి రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియన్‌ ముస్లింలీగ్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. తర్వాత ముస్లింలీగ్‌ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అని డిమాండ్‌ చేసింది.


ప్రభుత్వ చర్య: బొంబాయిలో కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పట్నాలో అరెస్టయ్యారు.


ప్రజా ప్రతిఘటన: 1942, ఆగస్టు 9 నాటికి దాదాపు నాయకులంతా అరెస్టయ్యారు. అప్పటికే బ్రిటిషర్ల నిరంకుశ, అణచివేత విధానాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిక్షిప్తంగా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉద్యమ నాయకులను ప్రభుత్వం నిర్బంధించినా, ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించారు. అందుకే క్విట్‌ ఇండియా గొప్ప ప్రజా ఉద్యమంగా మారింది. అయితే ప్రజల ముందు ఒక స్పష్టమైన అజెండా లేదు. గాంధీ జైలులో నిర్బంధంలో ఉండటంతో ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేకపోయారు. తొలి దశలో చాలాచోట్ల నిరసనలు, హర్తాళ్లు, శాంతియుత సమావేశాలు నిర్వహించారు. దిల్లీ, బొంబాయి, కాన్పుర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, బెంగళూరు, మద్రాసు, అహ్మదాబాద్‌ లాంటి ప్రముఖ నగరాలు, పట్టణాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి వారు, చేతివృత్తులవారు క్విట్‌ ఇండియా నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులతో, సైన్యంతో ఘర్షణకు దిగారు. ఉద్యమానికి బొంబాయి కేంద్రంగా మారింది. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా ఉక్కు కార్మికులు జాతీయ ప్రభుత్వం ఏర్పడే వరకు విధుల్లో చేరేది లేదంటూ సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. క్విట్‌ ఇండియా ఒక్కటే ఉద్యమకారులందరి డిమాండ్‌గా మారింది.


ప్రభుత్వ చర్య - ప్రతిచర్య: ప్రభుత్వం ఈ ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ దమనకాండ ప్రజల ఆగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హింసకు ప్రతిహింసను సృష్టించింది. ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించారు. కార్మికులు, స్త్రీలు, చేతివృత్తులవారు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు వారి లక్ష్యమయ్యాయి. టెలిగ్రాఫ్‌ లైన్‌లు తెగిపడ్డాయి. రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వార్దన్, జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు తెరచాటు సహాయం అందించారు. విప్లవభావాలతో ఉన్న నాయకులు మిడ్నపూర్‌లోని తామ్రలుక్, మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు లాంటి చోట్ల రహస్య పోటీ ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ఉద్యమం ప్రారంభమైన మూడు నెలల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికార గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.

ఉద్యమ ప్రాముఖ్యం: ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి చాటారు. ఈ మహా ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. కాంగ్రెస్‌ విధానాల పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడింది. చిరకాలంగా ప్రభుత్వ ఎజెండాగా ఉన్న ‘డొమినియన్‌ ప్రతిపత్తి’ ఆగస్టు ఉద్యమంలో ఆహుతైంది. ప్రజల నినాదమైన సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరేదీ అంగీకారం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

నోట్‌: క్విట్‌ ఇండియా నినాదాన్ని మొదటిసారి రూపొందించినవారు యూసుఫ్‌ మెహర్‌ అలీ. ఈయన 1942 నాటి బొంబాయి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక సంస్కరణల కోసం మహమ్మదీయుల ఉద్యమాలు

* మహమ్మదీయుల్లోని కులవ్యవస్థ, పరదా పద్ధతి లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని బెరైలికి చెందిన సయ్యద్ అహ్మద్ ఖాన్, బెంగాల్‌కు చెందిన షరియతుల్లా కృషిచేశారు.

* షరియతుల్లా ఫైరైజి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

* నవాబ్ అబ్దుల్ లతీఫ్ (1828 - 1893) 'మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈ సంస్థ కూడా మహమ్మదీయుల సంస్కరణల కోసం కృషి చేసింది.

* అబ్దుల్ లతీఫ్ హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు; మహమ్మదీయల్లో విద్యావ్యాప్తికి కృషిచేశాడు.

* సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 - 1898) మొగల్ దర్బారుకు చెందిన గొప్ప వంశస్థుడు. ఇతడు 1875లో అలీఘర్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇది తర్వాతి కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.

* మహమ్మదీయుల్లో సాంఘిక జాగృతి కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో చేసిన ఉద్యమాన్ని 'అలీగఢ్ ఉద్యమం' అంటారు. ఇతడు హిందువులు, ముస్లింలు భారతీయులేనని విభేదాలు ఉండకూడదని బోధించాడు.


ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820 - 1891):

* ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1820లో బెంగాల్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సంస్కృతాన్ని అభ్యసించిన గొప్పవిద్వాంసుడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతడికి 'విద్యాసాగర్' అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. సమాజానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి బెంగాలీ పత్రికల్లో ఉత్తేజపరిచే రచనలు చేశాడు.

* అనేక మంది సంఘ సంస్కర్తలు వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యకు కృషి చేశారు. వారిలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919), నారాయణ గురు (కేరళ) ముఖ్యమైనవారు.

సాంస్కృతిక జాగృతీ ప్రభావం:

* యూరోపియన్ విద్వాంసులు భారత సాహిత్యాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో విలియం జోన్స్ మార్గదర్శకత్వం వహించి 'ఏషియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు.

* విలియం జోన్స్ కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలాన్ని' ఆంగ్లంలోకి అనువదించాడు.

* 19వ శతాబ్దపు విద్వాంసులు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి శాసనాలను అనువదించారు.

* ఏషియాటిక్ సొసైటీ ఈ రచనలన్నింటినీ ముద్రించింది. భారతీయులు ఈ గ్రంథాలను చదివి ప్రాచీన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోగలిగారు.


సాహిత్యం, భాష, కళలు:

* మనదేశంలో 19వ శతాబ్దంలోని సాహిత్యం ప్రాచీన సాహిత్యం కంటే భిన్నమైంది.

* ప్రాచీన సాహిత్యం పద్య, శ్లోకాల రూపంలో ఉండేది. 19వ శతాబ్దంలో గద్య రచనలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది.

* భరతేందు హరిశ్చంద్ర (1850 - 1885) ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.

* బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారు బెంగాలీ సాహిత్యంలో మార్గదర్శకులు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' స్వతంత్ర భారతదేశానికి జాతీయ గీతం అయ్యింది. ఠాగూర్ సాహిత్య కృషికి 1913లో అత్యున్నత అంతర్జాతీయ నోబెల్ పురస్కారం లభించింది.

* బంకించంద్ర రాసిన 'వందేమాతరం', మహమ్మద్ ఇక్బాల్ రచించిన 'సారేజహాసే అచ్ఛా' గేయాలను ప్రజలు దేశభక్తి ప్రబోధకాలుగా పాడుకుంటున్నారు.

* గురజాడ అప్పారావు - తెలుగు, హరినారాయణ - మరాఠీ, సుబ్రమణ్య భారతి - తమిళం, హేమచంద్ర బారువా - అసోం, ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా, కె.వి. పుట్టప్ప - కన్నడ; కుమరన్ ఆసన్, వి.కె. నారాయణ మీనన్ - మళయాళం భాషల్లో ప్రసిద్ధ రచయితలు. వీరంతా 19వ, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో రచనలు చేసి సొంత భాషల్లో సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

* భారతదేశ గ్రామాల్లోని పేదరికాన్ని ప్రేమ్‌చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. దీనికోసం బెంగాల్‌లో పాఠశాలను స్థాపించాడు.

* రాజారామ్మోహన్ రాయ్ రామాయణ, మహాభారత గాథలను; అమృతా షేర్గిల్ భారతీయుల నిత్యజీవితాలను, నందలాల్ బోస్ వృత్తి పనుల వారి నిత్యజీవితాలను, ప్రాచీన గాథలను, స్వాతంత్య్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో చూపారు.


పత్రికల అభివృద్ధి, వాటి పాత్ర:

* ది హిందూ, అమృత్‌బజార్, ది మరాఠా, ది ఇండియన్ మిర్రర్, ది స్వదేశ్ మిత్రన్, ది ప్రభాకర్, ది ఇందు ప్రకాశ్ లాంటి పత్రికలు భారత ప్రజలను ఉత్తేజపరచి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాయి.
 

సైన్సు అభివృద్ధి:

* ప్రాచీన భారతదేశ విద్యావిధానంలో సైన్సును బోధించేవారు కాదు.

* రాజారామ్మోహన్ రాయ్ లాంటివారు ఆంగ్ల విద్యను అభ్యసించాలని, తద్వారా సైన్సు చదవడంతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావించారు.

* 19వ శతాబ్దపు ఆరంభంలో సైంటిఫిక్ సొసైటీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా భారతదేశంలో సైన్సు అభివృద్ధి చెందింది.

* మహేందర్‌లాల్ సర్కార్ మొదటి వైద్య విద్యార్థి. ఇతడు 1876లో సైన్సు అభివృద్ధికి 'ఇండియన్ అసోసియేషన్' అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

* 20వ శతాబ్దంలో 'ఇండియన్ సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌'ను స్థాపించారు.

* 1930లో సర్ సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగానూ ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.

* శ్రీనివాస రామానుజన్ గణితంలో; మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులు.

* విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేసి, దేశానికి విశిష్ట సేవలందించారు. జల విద్యుదుత్పత్తి, ఆనకట్టల నిర్మాణం, పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.

* ప్రఫుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్, డి.ఎన్. వాడియా, బీర్బల్ సహాని, మేఘనాథ్ సాహ లాంటివారు సుప్రసిద్ధ శాస్త్ర విజ్ఞానవేత్తలు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

      లార్డ్ వేవెల్ 1945లో తన ప్రణాళికను చర్చించడానికి భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేవెల్ ప్రణాళిక ప్రకారం వైస్రాయ్ పాలకమండలిలో సర్వ సైన్యాధ్యక్షుడు మినహా మిగిలినవారంతా భారతీయులే ఉంటారు. పాలకమండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుంది. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ వైస్రాయ్ పాలక మండలిలోని ముస్లిం సభ్యులను ముస్లింలీగ్ మాత్రమే ఎంపిక చేయాలని పట్టుబట్టింది. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
 

మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక (1946): ఇంగ్లండ్‌లో 1945లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చర్చిల్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది. లేబర్ పార్టీ మొదటి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. ఇంగ్లండ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సి.ఆర్. అట్లీ, వేవెల్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

* 1946 మార్చి 24న లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లతో కూడిన ముగ్గురు క్యాబినెట్ మంత్రుల బృందం భారతదేశానికి వచ్చింది. దేశానికి వీలైనంత తొందరగా స్వాతంత్య్రం ఇవ్వడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ మంత్రుల బృందం అయిదు వారాలపాటు స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపింది. చివరగా 1946 మే 5న సిమ్లాలో కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

* 1946 మే 16న మిషన్ తన సిఫారసులను ఒక ప్రకటన రూపంలో ప్రకటించింది. దీన్ని 'క్యాబినెట్ మిషన్ ప్రణాళిక' అంటారు.

* 1946 ఆగస్టు 12న వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరాడు. ప్రారంభంలో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి ముస్లింలీగ్ అయిష్టత చూపింది.

* తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులు (9 మంది కాంగ్రెస్, అయిదుగురు ముస్లింలీగ్) ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు.
 

ప్రత్యక్ష చర్యా దినోత్సవం

        ముస్లింలీగ్ 1946 జులై 30న సమావేశమై 1946 ఆగస్టు 16న భారతదేశమంతటా ప్రత్యక్ష చర్యాదినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.

* ముస్లింలీగ్ కలకత్తాలో ఆగస్టు 16న ప్రదర్శనలు, హర్తాళ్‌లు నిర్వహించడం గొడవలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. బెంగాల్‌లో హెచ్.ఎస్. సుహ్రావర్డి ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ ప్రభుత్వం ఆగస్టు 16ను సెలవుదినంగా ప్రకటించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వం పరిస్థితి చేయిదాటేంత వరకు సైన్యాన్ని పిలవకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది.
 

* మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947 మార్చిలో వేవెల్ స్థానంలో మౌంట్ బాటన్ వైస్రాయ్‌గా నియమితుడయ్యాడు. ఇతడు ఇంగ్లండ్ రాజుకు దగ్గరి బంధువు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియా ప్రాంతానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు. మౌంట్ బాటన్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 1947 జూన్ 3న ఒక రాజీ సూత్రాన్ని రూపొందించి, ప్రకటించాడు. దీన్నే జూన్ 3 ప్రణాళిక అంటారు. దీని ప్రకారం భారతదేశాన్ని భారత యూనియన్, పాకిస్థాన్‌గా విభజించి స్వాతంత్య్రం ఇస్తారు.

 

* భారత స్వాతంత్య్ర చట్టం (1947): జూన్ 3 ప్రణాళిక ఆధారంగా ఒక బిల్లును రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 12 రోజుల స్వల్ప వ్యవధిలో (జులై 4 - జులై 16) పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది. జులై 18న బ్రిటిష్ రాజు కూడా ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. భారత భూభాగాల విభజన, పంజాబ్, బెంగాల్‌లలో రెండు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. రెండు దేశాలకు ప్రత్యేక గవర్నర్ జనరల్, శాసనశాఖల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

* దేశ విభజన అనేక అనర్థాలకు దారితీసింది. సుమారు 1.5 కోట్ల మంది హిందూ ముస్లింలు బలవంతంగా తమ ఇళ్లు, గ్రామాలు, నగరాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇది వారిలో కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చింది. రెండు నుంచి అయిదు లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు. మత ఘర్షణలకు కేంద్రమైన తూర్పు బెంగాల్‌లోని నోఖాలిలో 1947 ఆగస్టు 15న పర్యటించిన గాంధీజీ శాంతిని పునరుద్ధరించడానికి కృషిచేశారు. గాంధీజీ 1947 సెప్టెంబరు 9న ఢిల్లీకి చేరుకున్నారు. వాయవ్య భారతదేశంలో మతఘర్షణలను, ప్రజల భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. కొంతమంది మతోన్మాదులు గాంధీజీ నిర్వహించే సర్వమత ప్రార్థనలకు ఇబ్బందులు సృష్టించారు.

* గాంధీజీ 1948 జనవరిలో చివరిసారిగా నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయి పటేల్ మతపరమైన వైఖరిని నిరసించారు. గాంధీజీ మరణానికి రెండు రోజుల ముందు ఆయన హత్యకు విఫలయత్నం జరిగింది. 1948 జనవరి 28న గాంధీజీ మాట్లాడుతూ - 'ఒక పిచ్చివాడి బుల్లెట్‌కు నేను మరణించవలసి వస్తే, నేను చిరునవ్వుతో మరణిస్తాను. నాలో ఎలాంటి కోపం లేదు. దేవుడు నా హృదయంలోను, పెదాలపై ఉన్నాడు' అన్నారు.

* స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోపే 1948 జనవరి 30న సర్వమత ప్రార్థనకు వెళ్తున్న గాంధీజీ నాథూరామ్ గాడ్సే తుపాకి గుళ్లకు బలయ్యారు.
 

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు

       భారత జాతీయ రాజకీయాల్లో విభజనవాదానికి ప్రధాన కారణం - అధిక సంఖ్యాకులైన హిందువులు అల్ప సంఖ్యాకులైన ముస్లింలపై (వ్యాపారం, పరిశ్రమలు, ప్రభుత్వ సర్వీసులు, విద్య లాంటివి) పలు విషయాల్లో ఆధిపత్యం వహించడం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కాలం నుంచే బ్రిటిషర్లకు, ముస్లింలకు మధ్య మంచి సంబంధాలు లేవు. బ్రిటిషర్లు తమ నుంచి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ముస్లింలు భావించారు. ముస్లింలు తమ సామ్రాజ్యానికి ప్రధాన శత్రువులని బ్రిటిషర్లు భావించారు.

* బ్రిటిషర్లు హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. 1857 విప్లవం తర్వాత ఈ పరిస్థితి తారుమారైంది. హిందువులు ఆంగ్ల విద్యను అభ్యసించి, పాశ్చాత్య భావాలను అంగీకరించారు. వారిలో క్రమంగా జాతీయతాభావం అభివృద్ధి చెందింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి గొప్ప ఆటంకంగా పరిణమించింది. దీంతో ముస్లింల సహాయంతో హిందువులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్‌వారు విభజించి, పాలించు విధానాన్ని అవలంబించారు.

* 1871లో సర్ విలియం హంటర్ రచించిన 'ది ఇండియన్ ముసల్మాన్స్' అనే గ్రంథం ప్రచురితమైంది. ముస్లింలతో విరోధాన్ని కొనసాగించడం కంటే వారితో స్నేహంగా ఉండటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మేలు చేస్తుందనే భావన ఈ గ్రంథంలో వ్యక్తమైంది. అలీగఢ్‌లోని ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ బెక్ ముస్లింలు బ్రిటిషర్లకు దగ్గరవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలు పాశ్చాత్య విద్యను అభ్యసించేలా, బ్రిటిషర్లకు విధేయులుగా ఉండేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

* 1906 డిసెంబరులో ఢాకాలో నవాబు వికార్ ఉల్‌ముల్క్ ముస్లింలీగ్ పార్టీని స్థాపించి, మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ పార్టీ స్థాపనలో ఆగాఖాన్ ప్రముఖ పాత్ర వహించాడు. 1906 నుంచి 1910 వరకు ముస్లింలీగ్ కేంద్ర కార్యాలయం అలీగఢ్ ఉండేది. ఆ కాలంలో దాని ప్రభావం పెద్దగా లేదు. పార్టీ ప్రధాన కార్యాలయం లక్నోకు మారడంతో, దీని రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి.
 

ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాలు

* 1906లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో వ్యక్తిగత కార్యదర్శి స్మిత్ భారతీయ ముస్లింల ప్రతినిధులకు వైస్రాయ్‌ని కలవమని సలహా ఇచ్చాడు. ఆగాఖాన్ నేతృత్వంలోని ఈ బృందం మింటోను కలిసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని కోరింది. దీని ఫలితంగా రూపొందిన 1909 చట్టం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది.

* భారతదేశం లోపల, వెలుపల సంఘటనలు కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు చేరువకావడానికి దోహదం చేశాయి. ఖిలాఫత్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సహాయం అవసరమని ముస్లింలీగ్ గుర్తించింది. ఇది 1916లో లక్నో ఒడంబడికకు దారితీసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ముస్లింల సానుభూతిని సంపాదించాలని ప్రయత్నించారు. అయితే ఈ ఉద్యమం నిలిపివేయడంతో హిందూ-ముస్లిం ఐక్యత బలహీనపడింది.

* 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికను కాంగ్రెస్ అంగీకరించగా, జిన్నా ముస్లింల కనీస డిమాండ్లుగా తన పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు. 1930లో ప్రసిద్ధ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలీగ్ అలహాబాద్ సమావేశంలో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వాయవ్య భారత ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.

* 1933లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విద్యార్థి చౌదరి రెహమత్ అలీ పాకిస్థాన్ పేరును మొదటగా ప్రతిపాదించాడు. పంజాబ్, అఫ్గన్, కశ్మీర్, సింధుల నుంచి మొదటి అక్షరాలు, బెలూచిస్థాన్‌లో చివరి పదంతో ఈ పేరును రూపొందించాడు.

* 1937లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలకు కేటాయించిన 482 సీట్లలో ముస్లింలీగ్ 102 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 58 ముస్లిం స్థానాలకు పోటీచేయగా, 26 స్థానాలను గెలుచుకుంది. ముస్లింలీగ్ మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.

* యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాసులలో సీట్లు సాధించిన ముస్లింలీగ్ బెంగాల్, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. సింధు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. అయితే 1946లో కేంద్ర, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముస్లిం సీట్లు గెలుచుకోవడంలో సఫలీకృతమైంది.

* యునైటెడ్ ప్రావిన్స్‌లో ముస్లింలీగ్ తగినన్ని సీట్లు సాధించినా, దాంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నిరాకరించింది. కాంగ్రెస్‌లోని సభ్యులు ముస్లింలీగ్ సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధించింది. దీన్ని కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు వ్యతిరేకించడంతో 1938లో కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యత్వం కలిగి ఉండకూడదని పేర్కొంది.
 

విమోచ‌న దినం

* 1939 డిసెంబరు 22న బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. జిన్నా ఈ రోజును విమోచన దినంగా ప్రకటించారు.

* 1940, మార్చి 23న ముస్లింలీగ్ ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానంలో దేశ విభజన లేదా పాకిస్థాన్ గురించి ఎక్కడా పేర్కొనలేదు. తర్వాతి రోజుల్లో ఈ తీర్మానం పాకిస్థాన్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది.

* 1942లో కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ముస్లింలీగ్‌ను బలపరిస్తే ఇస్లాంను బలపరిచినట్లేనని బహిరంగంగా ప్రకటించారు. 1940-46 మధ్య ముస్లిం సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక దేశం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి ముస్లింలీగ్ అవగాహన కల్పించింది. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను జైళ్లలో నిర్బంధించింది. ఈ సమయాన్ని ముస్లింలీగ్ తనకు అనుకూలంగా మలచుకుని బలపడింది.

* సి. రాజగోపాలాచారి ఫార్ములా (1944), గాంధీజీ - జిన్నా చర్చలు (1944), భులాబాయ్ దేశాయ్, లియాఖత్ అలీఖాన్ ఒప్పందం (1945) కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. సిమ్లా సమావేశం కూడా మహమ్మద్ అలీ జిన్నా మొండివైఖరి వల్ల విఫలమైంది.

* 1946 సాధారణ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందగా, ముస్లింలీగ్ ముస్లింలకు కేటాయించిన 30 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ 923 సీట్లు, ముస్లింలీగ్ 425 సీట్లు గెలుచుకున్నాయి. ముస్లింలీగ్ ఈ ఎన్నికల్లో 86 శాతం సీట్లు దక్కించుకోవడం విశేషం.

* ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌ను అంగీకరించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది. చివరకు మౌంట్‌బాటన్ 1947 జూన్-3 ప్రణాళికను అనుసరించి భారత్‌ను భారత్ యూనియన్, పాకిస్థాన్‌గా విభజించారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం ఆవిర్భావం - విస్తరణ

సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఐరోపావారు క్రమంగా భారతదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని వలస, వాణిజ్య, సామ్రాజ్యవాదంతో వ్యవహరించారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు మిగతా ఐరోపా దేశాలను అధిగమించి భారతదేశాన్ని ఆక్రమించుకుని, తమ ప్రధాన వలస రాజ్యంగా మార్చుకున్నారు. 1757 నాటి ప్లాసీ యుద్ధం వారి రాజకీయ అధికారానికి పునాది వేసింది. 1764 నాటి బక్సార్‌ యుద్ధానంతరం ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. 1773 నాటి రెగ్యులేంటిగ్‌ చట్టం ద్వారా ఆంగ్లేయులు పాలనా సంస్కరణలను ప్రారంభించారు. తమ దేశ పాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక దోపిడీ విధానాల ద్వారా భారతదేశ వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలను నాశనం చేశారు. వారు అనుసరించిన బలవంత మత మార్పిడి, జాత్యాహంకార విధానాలతో పాటు వారు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలు భారతీయులకు ఆంగ్లేయుల పట్ల వ్యతిరేక భావాలు రావడానికి కారణమయ్యాయి. వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యే వారిని భారతదేశం నుంచి పంపించడానికి కారణమైంది.
 

కారణాలురాజకీయ ఐక్యత

ఆంగ్లేయులు రాకముందు భారతదేశం మొఘలు చక్రవర్తుల పాలనలో ఉండేది. వారి బలహీనతల వల్ల దేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. కానీ ఆంగ్లేయుల యుద్ధాలు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి లాంటి విధానాలు; బిరుదులు, భరణాలను రద్దు చేయడం; దుష్పరిపాలన నెపంతో రాజ్యాలను ఆక్రమించడం ద్వారా మొత్తం భారతదేశాన్ని ఒకే పాలన కిందకు తెచ్చారు. ఇది భారతీయుల్లో రాజకీయ ఐక్యతకు కారణమై, తామంతా ఒకటే అనే భావన తలెత్తి జాతీయోద్యమం ఆవిర్భవించడానికి దోహదపడింది. ఆంగ్లేయులు మొదట 1740 - 1763 మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాల ద్వారా ఫ్రెంచివారిని ఓడించి, కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలపై ఆధిపత్యం సాధించారు. ప్లాసీ (1757), బక్సార్‌ (1764) యుద్ధాల తర్వాత బెంగాల్‌పై పట్టు సాధించారు. మైసూర్‌ యుద్ధాల ద్వారా టిప్పుసుల్తాన్‌ రాజ్యాన్ని, మరాఠా యుద్ధాల ద్వారా మహారాష్ట్రుల స్వరాజ్యాన్ని, సిక్కు యుద్ధాల ద్వారా సిక్కు రాజ్యాన్ని జయించి దేశంలో రాజకీయ ఐక్యత తెచ్చారు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి ద్వారా, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మిగిలిన రాజ్యాలను జయించి మొత్తం దేశాన్ని ఏకపాలన కిందకు తెచ్చారు. ఇదే జాతీయోద్యమ భావాలు రావడానికి దోహదపడింది.
బ్రిటిష్‌వారు రావడానికి ముందే భారతదేశంలో జాతీయతావాదం ఉన్నప్పటికీ, వారి కాలంలోనే అది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ జాతీయతా భావమే భారత స్వాతంత్య్ర పోరాటానికి దారితీసింది.

 

ఆర్థిక దోపిడీ విధానాలు

ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించి, వలస రాజ్యంగా మార్చుకుని దేశ సంపదను దోపిడీ చేశారు. బ్రిటిష్‌ పాలన కారణంగా భారతదేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. వారు భారత వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ వాణిజ్యీకరణ విధానాలు, తీన్‌కథియా పద్ధతులు, భూమిశిస్తు విధానాలు భారత రైతాంగాన్ని దోపిడీ చేయడానికి కారణమయ్యాయి. ప్రభుత్వం వడ్డీ వ్యాపారులకు, వర్తకులకు మాత్రమే మేలు చేకూరుస్తుందనే వాస్తవాన్ని గ్రహించిన రైతాంగం ఆంగ్ల వ్యతిరేక భావాలను పెంచుకుంది. ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య, వలసవాద విధానాలు భారత వాణిజ్య రంగాన్ని దెబ్బతీశాయి. పారిశ్రామిక విప్లవం కారణంగా మన దేశంలో చేనేత, కుటీర, చిన్న తరహా పరిశ్రమలు నాశనమయ్యాయి. ఫలితంగా దేశంలోని కార్మికులు, వృత్తి పనివారు తమ దైన్య స్థితికి ఆంగ్లేయులే కారణమని తెలుసుకొని జాతీయతా భావాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా ఆధునిక విజ్ఞానాన్ని పొందిన భారతీయ విద్యావంతులు ఆంగ్లేయుల ఆర్థిక, దోపిడీ విధానాలను ప్రజలకు వివరించి వారిని జాతీయోద్యమం వైపు నడిపించారు. దాదాభాయ్‌ నౌరోజీ తన డ్రైన్‌ సిద్ధాంతం (సంపద తరలింపు) ద్వారా భారతదేశ సంపద హోంఛార్జీల రూపంలో ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలిపోతుందో వివరించాడు. రమేష్‌చంద్ర దత్‌ (ఆర్‌.సి.దత్‌) ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య ప్రధాన దశ, స్వేచ్ఛా వాణిజ్య దశ, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం లాంటి వలసవాద దశల గురించి ప్రచారం చేశాడు. ఫలితంగా భారతీయులు తమ పేదరికానికి, నిరుద్యోగానికి ఆంగ్లేయులే కారకులని గ్రహించి వారిపై పోరాటానికి సిద్ధపడ్డారు.
 

ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన

ఆంగ్లేయులు తమ ప్రయోజనం కోసమే భారతదేశంలో ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించారు. 1853లో డల్హౌసీ కాలంలో భారతదేశంలో తొలి రైల్వేలైన్‌ వేశారు. తంతి తపాలా వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ముడి సరుకులను ప్రధాన పట్టణాలకు, తర్వాత ఓడరేవులకు అక్కడి నుంచి ఇంగ్లండ్‌కు తరలించడానికి రైలు, రోడ్డు, జల రవాణా మార్గాలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరగడం, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలుసుకోవడం, సుదూర ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం జాతీయతా భావం పెరగడానికి దోహదపడింది. తంతి తపాలా వ్యవస్థల ద్వారా ప్రజలు ఒకరి సమాచారాన్ని మరొకరు తెలుసుకుని ఐక్యంగా ఉద్యమించే అవకాశం ఏర్పడింది.
 

ఆంగ్ల విద్య 

మెకాలే కమిటీ సిఫారసుల మేరకు 1835లో విలియం బెంటింగ్‌ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఫలితంగా అనేకమంది భారతీయులు ఆంగ్ల విద్యను నేర్చుకుని హేతువాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం అనే ఆధునిక పాశ్చాత్య భావాలను తెలుసుకోగలిగారు. ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో విప్లవాలు రావడానికి గల కారణాలను గ్రహించారు. భారతీయ విద్యావంతులు స్వేచ్ఛ, సమానత్వం లాంటి భావాల ప్రాధాన్యాన్ని, వాటిని పొందడానికి మనం చేయాల్సిన పోరాటం గురించి సామాన్యులకు వివరించారు.
ఫలితంగా భారతదేశంలో ఆంగ్ల విద్య కారణంగా జాతీయతా భావాలు పెరిగి స్వాతంత్య్రోద్యమం సాధ్యపడింది. ‘పాశ్చాత్య విద్య (ఆంగ్ల విద్య) ద్వారా భారతీయులు స్వపరిపాలనా వ్యవస్థల విలువను గ్రహించి, వారు మనల్ని భారతదేశం నుంచి వెళ్లగొట్టవచ్చు’ అని లయోనల్‌ స్మిత్‌ కామన్స్‌ సభ సెలక్ట్‌ కమిటీలో చెప్పిన అభ్రిపాయం నిజమైంది. విద్యావంతులందరిలో ఒకే రకమైన భావాలు, అనుభూతులు, ఆశలు, ఆదర్శాలు పెంపొందడం వల్ల జాతీయోద్యమ భావాలు అభివృద్ధి చెందాయి.

 

సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాల ప్రభావం

భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణోద్యమ సంస్థలైన బ్రహ్మ, ఆర్య సమాజాలు, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజాల సంస్కర్తలైన రాజా రామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారి బోధనలు భారతీయుల్లో జాతీయతా భావాలు పెంపొందడానికి దోహదపడ్డాయి. ఫలితంగా భారతీయుల్లో దేశభక్తి, ఆత్మ విశ్వాసం లాంటివి అభివృది ్ధచెందాయి. స్వామి దయానాంద సరస్వతి ‘భారతదేశం భారతీయులకే’ అనే నినాదానిచ్చారు. స్వామి వివేకానంద తన బోధనల ద్వారా యువతలో జాతీయతా భావాలు, దేశభక్తి, హిందూమతం పట్ల అభిమానాన్ని పెంచి ‘ఆధునిక జాతీయతా పితామహుడి’గా పేరొందాడు. దివ్యజ్ఞాన సమాజం ద్వారా అనిబిసెంట్‌ రాజకీయ చైతన్యాన్ని పెంపొందింపజేశారు. అన్ని మతాలు ఒకటే అని చెప్పడం ద్వారా మత సమైక్యతను పెంచి తద్వారా జాతీయోద్యమంలో అందరూ పాల్గొనేలా చేశారు.
 

1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం

1857 నాటి సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి మరో ముఖ్య కారణమైంది. ఆంగ్ల సైన్యంలో పనిచేసే భారతీయ సిపాయిలు తమపై ఆంగ్లేయులు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా 1857, మే 10న మీరట్‌లో తిరుగుబాటు ప్రారంభించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు జరిగినప్పటికీ ఆంగ్ల ప్రభుత్వం దీన్ని అతి త్వరగానే అణచివేసింది. ఈ తిరుగుబాటు వైఫల్యమే భారతీయుల్లో జాతీయతా భావాలు పెరగడానికి దోహదపడింది. ఆంగ్ల ప్రభుత్వం ఈ తిరుగుబాటు కారణంగానే ‘1858 భారత ప్రభుత్వ చట్టం’ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా లేకపోవడం వల్లే తిరుగుబాటు విఫలమైందని, భవిష్యత్తులో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమిస్తే స్వాతంత్య్రం లభిస్తుందని భారతీయులు గ్రహించారు. కాబట్టే వి.డి. సావర్కర్‌ 1857 సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం’ అని పేర్కొన్నారు.
 

పత్రికల పాత్ర

భారత జాతీయోద్యమ అభివృద్ధికి, వ్యాప్తికి వార్తా పత్రికలు కూడా ప్రధాన కారణమయ్యాయి. దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఆధునిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ భావాలు ¨, చైతన్యాన్ని పెంచడానికి పత్రికలు ప్రధాన సాధనాలుగా ఉపయోగపడ్డాయి. వాస్తవానికి పత్రికల చరిత్ర కూడా ఆంగ్ల పాలనతోనే ప్రారంభమైంది. భారతదేశంలో తొలి పత్రిక బెంగాల్‌ గెజిట్‌ను 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ ప్రారంభించాడు.
హిందూ పేట్రియాట్, ఇండియన్‌ మిర్రర్, అమృతబజార్, ది హిందూ, స్వదేశమిత్రన్, ఆంధ్రప్రకాశిక లాంటి అనేక పత్రికలు జాతీయతా భావాలను, ఆంగ్లపాలనా లోపాలను, ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలను ప్రజలకు తెలిపేవి. ఫలితంగా భారతీయులు జాతీయతా భావాలను పెంపొందించుకొని, స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

 

ఆంగ్లేయుల జాత్యాహంకార విధానాలు:

భారతీయుల పట్ల ఆంగ్లేయులు అనుసరించిన జాత్యాహంకార ధోరణి కూడా జాతీయోద్యమ ఆవిర్భావానికి దోహదపడింది. భారతీయులు నల్లవారని, నాగరికత తెలియనివారని, వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించరాదని లార్డ్‌ కారన్‌వాలీస్‌ లాంటి ఆంగ్ల అధికారులు బహిరంగంగానే విమర్శించేవారు. భారతీయుల్ని హింసించి, చంపినప్పటికీ తెల్లవారు తప్పించుకున్న అనేక సంఘటనలను పత్రికలు తరచూ ప్రచురించేవి. భారత న్యాయమూర్తుల విషయంలో కూడా ఇలాంటి వివక్ష ఉండేది. భారతదేశంలో ఆంగ్ల న్యాయమూర్తుల న్యాయ నిర్ణయాన్ని (తీర్పును) గురించి ఆంగ్ల చరిత్రకారుడైన ట్రెవిలియన్‌ ‘న్యాయస్థానంలో ఒక ఆంగ్ల వ్యక్తి సాక్ష్యానికి, అనేక మంది భారతీయుల సాక్ష్యం కంటే ఎక్కువ విలువ ఉంది. అధర్మ, భీతిలేని, దురాశాపరుడైన ఆంగ్ల వ్యక్తి చేతుల్లో ఒక భయంకరమైన అధికారాన్ని పెట్టే పరిస్థితి ఆంగ్లేయులది’ అని 1864లోనే పేర్కొన్నాడు. భారతీయ విద్యావంతులను సైతం ఆంగ్లేయులు బహిరంగంగా అవమానపరిచేవారు. ఈ జాతి వివక్షా విధానాలను సహించలేని అనేకమంది భారతీయ యువకులు ఉగ్రవాద చర్యలకు సైతం పూనుకున్నారు.
 

లార్డ్‌ లిట్టన్‌ చర్యలు

1876 - 80 మధ్య వైస్రాయ్‌గా పనిచేసిన లార్డ్‌ లిట్టన్‌ అనుసరించిన విధానాలు భారతీయుల్లో జాతీయతా భావం రావడానికి కారణమయ్యాయి. భారతదేశానికి దిగుమతి అయ్యే ఆంగ్లేయుల వస్త్రాలపై సుంకాలు రద్దు చేశాడు. 1878లో ఆయుధ చట్టాన్ని దేశ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టి భారతీయులు ఎలాంటి ఆయుధాలు ధరించరాదని, ప్రాంతీయ భాషల్లో పత్రికలు ప్రచురించరాదని ఆంక్షలు పెట్టాడు. సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 21 నుంచి 19 సంవత్సరాలకు తగ్గించాడు. ఈ చర్యల గురించి పేర్కొంటూ ‘లిట్టన్‌ చర్యలు నిర్లిప్తంగా ఉన్న భారతీయులను మేల్కొల్పి ప్రజల్లో చురుకు పుట్టించాయి’ అని సురేంద్రనాథ్‌ బెనర్జీ అన్నారు.

ఇల్బర్ట్‌ బిల్లు వివాదం

భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి, భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు తక్షణ కారణం ఇల్బర్ట్‌ బిల్లు వివాదమని చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఈ వివాదం లార్డ్‌ రిప్పన్‌ కాలంలో చోటుచేసుకుంది. భారతీయ న్యాయమూర్తులు ఐరోపా నేరస్తులను విచారించకూడదనే వివక్ష నాటి న్యాయస్థానాల్లో ఉండేది. లార్డ్‌ రిప్పన్‌ ఈ అంశంపై ఇల్బర్ట్‌ కమిటీని నియమించాడు. ఆ కమిటీ సూచన మేరకు భారతీయ న్యాయమూర్తులు కూడా ఐరోపా నేరస్థులను విచారించవచ్చని బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతదేశంలోని ఐరోపావారు ఉద్యమం చేపట్టగా, ప్రభుత్వం బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ సంఘటన భారతీయులకు కనువిప్పు కలిగించింది. కొంతమంది ఐరోపావారు ఉద్యమం చేస్తేనే ఇల్బర్ట్‌ బిల్లును రద్దు చేసినప్పుడు, భారతీయులంతా ఐక్యంగా ఉద్యమం చేసి ఆంగ్లేయులను వెళ్లగొట్టగలమని భావించి జాతీయోద్యమాన్ని ప్రారంభించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించి మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులుగా పనిచేసి చివరగా 1947లో స్వాతంత్య్రాన్ని పొందగలిగాం.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బోస్‌ ప్రత్యక్ష పోరాటం (సుభాష్‌ చంద్రబోస్‌ - భారత జాతీయ సైన్యం)

 సాహసవీరుడి స్వతంత్ర సమరం!

నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, ఆయన నిర్ణయాలతోనే నిర్మొహమాటంగా విభేదించి బోస్‌ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుగా వచ్చే ఈ అధ్యాయంపై అభ్యర్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్, చిత్తరంజన్‌ దాస్‌ స్థాపించిన బెంగాల్‌ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, కలకత్తా నగర మేయర్‌గా విధులు నిర్వర్తించాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్‌ వేల్స్‌ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్‌ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవాడు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్‌ తప్పుబట్టాడు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆ తర్వాత చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశాడు.

1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్‌ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించాడు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశ అధ్యక్ష పదవికి బోస్‌ పోటీ చేశాడు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నాడు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. అది కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించాడు. 1940లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం: 1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్‌ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్‌ మీదుగా జర్మన్‌ నగరం బెర్లిన్‌ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్‌ ట్రాప్‌ లాంటి జర్మన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్‌ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్‌ చేరాడు.


జపాన్‌లో బోస్‌: అగ్రరాజ్య కూటమిలో సభ్య దేశమైన జపాన్, జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండో ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్‌ వలస రాజ్య సైన్యాలు విలవిలలాడాయి. జపాన్‌ సైన్యం మలయాలో బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది. భారత బ్రిటిష్‌ సైన్యాధికారి కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ జపాన్‌ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన భారత-బ్రిటిష్‌ సైనికులు యుద్ధఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధఖైదీలు సహా కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ను ఒప్పించి, అతడి నేతృత్వంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి 1942లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని జపాన్‌ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌ అప్పటికే జపాన్‌ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం చేశాడు. ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ను స్థాపించి, దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్‌ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతు తెలిపారు. అన్నివిధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్‌ బిహారీ భావించాడు. భారత జాతీయ సేన, జపాన్‌ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు సాధించే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌కు చేరిన సుభాష్‌ చంద్రబోస్, అక్కడి ప్రధాని టోజో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలకు ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు.


భారత జాతీయ సైన్యం: సుభాష్‌ చంద్రబోస్‌కు జపాన్‌ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943, జులైలో రాస్‌ బిహారీ బోస్‌ నుంచి భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌) బాధ్యతలను, కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నుంచి భారత జాతీయ సైన్యం బాధ్యతలను (ఐఎన్‌ఏ) స్వీకరించాడు. ఆ తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’గా మార్చాడు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్‌ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్‌ రెజిమెంట్‌ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్‌కు లక్ష్మీ సెహగల్‌ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్‌ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. ‘నాకు రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతిపోరాటంలో ఉత్తేజితులను చేశాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ 1943, అక్టోబరు 21న సింగపూర్‌లో ‘ఆజాద్‌ హింద్‌’ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆర్థికమంత్రిగా ఎ.సి.ఛటర్జీ, ప్రచార సారథిగా ఎస్‌.ఎ.అయ్యర్‌ వ్యవహరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను బోస్‌ ప్రవాస ప్రభుత్వానికి జపాన్‌ బదిలీ చేసింది. బోస్‌ వాటికి షహీద్‌ దీవులు (అండమాన్‌), స్వరాజ్య దీవులు (నికోబార్‌) అని నామకరణం చేశాడు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించాôడు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్‌ను, భారత జాతీయ సేన కమాండ్‌ను రంగూన్‌కు (బర్మా) తరలించాడు. జపాన్‌ సైనికులతో పాటు బోస్‌ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాలవైపు దూసుకొచ్చింది. మౌడాక్, కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్‌ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్‌ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్‌ జపాన్‌ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్‌ రేడియో ప్రకటించింది. మహావీరుడిని కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాస్‌ చంద్రబోస్‌ రచనల్లో ఒకటి ఇండియన్‌ స్ట్రగుల్‌. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది.  దేశ స్వాతంత్య్ర సమస్యను బ్రిటిష్‌ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని, బోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయసేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్య్ర సాధన వేగవంతమైంది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రైతులు, గిరిజనుల తిరుగుబాట్లు            

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆంగ్లేయులపై తిరగబడిన అన్నదాతలు.. అడవి బిడ్డలు!

ఆంగ్లేయులు అడుగు పెట్టడంతోనే భారతదేశంలో అలజడులు మొదలయ్యాయి. సుభిక్షంగా, స్వయంసమృద్ధితో సాగిపోతున్న సమాజం చిన్నాభిన్నమైంది. అరాచక భూమి శిస్తు విధానాలతో అన్నదాతలు అల్లాడిపోయారు. అడవుల్లోకి చొరబడి వనరులు కొల్లగొట్టడంతో గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలకు విఘాతం కలిగింది. అడవి బిడ్డలపై వలస పాలకుల అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ విధానాల్లో జీవనం సాగించే రైతులు, తెగల ప్రజల్లో విప్లవాత్మక ధోరణులు పెరిగి తిరుబాట్లకు దారితీసింది. బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేసిన ఆ పోరాటాల వివరాలు, నాయకత్వం వహించిన యోధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. రైతులు, గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు?

1) రాజకీయ కారణాలు      2) ఆర్థిక కారణాలు   3) గిరిజనుల అసంతృప్తి       4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


2. ప్రకటన-A: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. 

ప్రకటన-B: ఈస్టిండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు.

జవాబు: ప్రకటన A, B లు సరైనవి



3.  ప్రకటన-A: వలస పాలనలో చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు. 

 కారణం- R: ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం.

జవాబు: ప్రకటన A కి కారణం R సరైన వివరణ.


4.  కిందివాటిని జతపరచండి.

రాష్ట్రాలు   -    గిరిజన తెగలు 

1) మహారాష్ట్ర     ఎ) కోలి

2) గుజరాత్‌      బి) నాయక్‌ 

3) ఒడిశా        సి) ఖోండ్‌ 

4) బిహార్‌      డి) సంతాలీలు

జవాబు: 1-ఎ; 2-బి; 3-సి; 4-డి


5.  బ్రిటిష్‌వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది?

జవాబు: గిరిజనుల ఆదాయం పెంచాయి.


6.     నరబలి, శిశుహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి?

జవాబు: ఖోండ్‌ 


7.  బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1855-56  


 


8.     తమల్‌ గిరిజన తెగ ఉన్న ప్రాంతం?

జవాబు:  ఛోటానాగ్‌పుర్‌    


9.     1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న ‘చిరో’ తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?

జవాబు: పితాంబర్‌

10. ‘బిల్‌’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇది 1817 - 19 మధ్య జరిగింది.

బి) ఈ తిరుగుబాటు మార్కోస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో జరిగింది.

సి) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో ఉంటారు. 

డి) వీరికి సహాయం చేసినవారు పీష్వా రెండో బాజీరావు.

జవాబు: ఎ, బి, సి, డి 


11. రమోసే తెగ వారు చిత్తూర్‌ సింగ్‌ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు?

జవాబు: 1822 


12. రమోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం?

జవాబు: సతారా 


13. కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం?

జవాబు: 1831 - 32   


14. సిర్దార్‌ అంటే

జవాబు:  గిరిజన నాయకుడు  


15. కోల్‌ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది?

జవాబు: రాంచీ    


16. కిందివాటిలో భిన్నమైంది?

 జవాబు: బెవార్‌ 


17. 1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశం?


జవాబు: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం


18. సంతాల్‌ తిరుగుబాటు ఏ గవర్నర్‌ జనరల్‌ చివరి కాలంలో జరిగింది?

జవాబు: లార్డ్‌ డల్హౌసీ


19. సంతాల్‌ తిరుగుబాటుకు నాయకుడు?

1) సిధు    2) కన్హూ    3) 1, 2   4) బిర్సా

జవాబు:  1, 2  


20. కోల్‌ తిరుగుబాటుకు సంబంధించి సరైంది?

ఎ) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

బి) ఈ తిరుగుబాటుకు నాయకుడు బుద్ధో భగత్‌.

జవాబు: బి మాత్రమే   


 

21. అహోమ్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణం?

జవాబు: అస్సాంలో బ్రిటిష్‌ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు


22. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1832  


23. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి.    

ఎ) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ జమీందారీలలో జరిగింది.

బి) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జి రుస్సెల్‌.

సి) 1839లో ప్రభుత్వం XXIV చట్టం చేసింది.

డి) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.

జవాబు: ఎ, బి, సి, డి 


24. ప్రకటన-A: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్‌ ఇంటరెస్ట్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను రూపొందించింది.

ప్రకటన-B ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని రద్దు చేసింది.

జవాబు:  ప్రకటన A, B లు సరైనవి   


25. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి?

ఎ) దీని నాయకుడు కొమురం భీం.

బి) దీని నినాదం జల్, జంగిల్, జమీన్‌.

సి) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం.

జవాబు: ఎ, బి, సి   


26. ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటిష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు?

జవాబు: ఖాసీ 


27. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం?

జవాబు: మణిపుర్‌  

28. రంప ఏజెన్సీ అధిపతి మన్సబ్‌దార్‌కు సహాయపడినవారు?

జవాబు: ముత్తాదార్లు   


29. 1835లో మరణించిన రంప మన్సబ్‌దారు?

జవాబు:రామ భూపతిదేవ్‌  


30. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు?

జవాబు: సల్లెవన్‌  


31. గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు?

1) తినడానికి    2) మద్యం తయారీకి   3) 1, 2      4) అలంకరణకు

జవాబు: 1, 2  


32. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు. 

బి) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు.

జవాబు: ఎ, బి సరైనవి


33. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) పంజాబ్‌ - వాన్‌ గుజ్జర్లు - ఆవులను మేపేవారు 

బి) కులూ - గద్దీలు - గొర్రెలు మేపేవారు

సి) కశ్మీర్‌ - బకర్వాలాలు - మేకల కాపరులు

డి) ఆంధ్రప్రదేశ్‌ - లంబాడీలు - పందులను పోషిస్తారు

జవాబు: డి మాత్రమే   


34. గిరిజన పంట కాలాలను జతపరచండి.

1) జేత్‌     ఎ) కుత్కి పక్వానికి వస్తుంది 

2) కార్తిక్‌    బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు

3) కౌర్‌     సి) విత్తడం ప్రారంభిస్తారు

4) మాగ్‌    డి) బీన్స్‌ పక్వానికి వస్తుంది

జవాబు:  1-సి; 2-ఎ; 3-డి; 4-బి


35. నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం?

జవాబు: అరుణాచల్‌ ప్రదేశ్‌ 


36. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు?

జవాబు: 1900 


37. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది?

జవాబు: బిర్సాను 1897లో అరెస్ట్‌ చేశారు.

38. గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు:  కొల్హాపుర్‌


39. ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియా మిలిటెంట్‌ నేషనలిజమ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే 


40. భూగాన్‌ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

జవాబు: ఒరిస్సా 


41. ఖాసిస్‌ తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు: మేఘాలయ


42. బాలగంగాధర్‌ తిలక్‌ గురువు ఎవరు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే


43. భిల్లుల తిరుగుబాటుకు (1818 - 36) నాయ‌క‌త్వం వ‌హించిన‌వారు?

జవాబు: సేవారం

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చేరువైన స్వాతంత్య్రం (1944-45)

అందరూ ఏకమై.. అంతిమ లక్ష్యం వైపు!

 రాయబారాలు, రాజకీయ సంస్కరణల పేరుతో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయోజనం లేని ప్రతిపాదనలను భారత జాతీయ నేతల ముందుకు తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వాటిని చేసినప్పటికీ, ముస్లిం లీగ్‌ మంకుపట్టుతో మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి. దాంతో గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం భారతీయుల చేజారిపోయింది. నేతాజీ నేతృత్వంలో ఆంగ్లేయులను హడలెత్తించిన జాతీయ సైన్యంపై గవర్నమెంటు కఠిన చర్యలకు తెగబడటంతో దేశం మరోసారి భగ్గుమంది. పరిస్థితులను పసిగట్టిన రాజప్రతినిధి శిక్షలను రద్దు చేశాడు. ఈ పరిణామాలు ప్రజల్లో ఐక్యతను పెంచి, దేశభక్తిని రగిలించాయి. అంతిమ లక్ష్యమైన సంపూర్ణ స్వాతంత్య్రం దిశగా వడి వడిగా అడుగులు వేయించాయి. 


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయులను సానుకూలం చేసుకోవడానికి ఆంగ్లేయులు ప్రకటించిన ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ రాయబారం (1942) విఫలమయ్యాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యమని ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియన్‌ ముస్లింలీగ్‌ ప్రత్యేక పాకిస్థాన్‌ తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని సృష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు వర్గాల మధ్య సామరస్యం లేకపోవడంతో భారత రాజకీయ సంస్కరణల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. వాటి మధ్య సయోధ్యకు కొందరు జాతీయ నాయకులు ప్రయత్నించారు.


రాజగోపాలచారి ఫార్ములా (1944): అనారోగ్య కారణాలతో 1944 మేలో గాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో దేశంలో అశాంతి, అలజడి అలముకొని ఉన్నాయి. గాంధీజీ 1944 సెప్టెంబరులో జిన్నాను కలిసి దేశ సమైక్యతను కాపాడేందుకు హిందూ-ముస్లిం ఐక్యత గురించి చర్చించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ నాయకుడు చక్రవర్తుల రాజగోపాలచారి దేశ స్వాతంత్య్ర సాధనలో హిందూ-ముస్లిం ఐక్యత, సామరస్యం ఆవశ్యకత ప్రాధాన్యంగా ఒక పథకాన్ని సూచించారు.



రాజాజీ ఫార్ములాలోని ముఖ్యాంశాలు:  


* దేశ స్వాతంత్య్ర సాధనలో ఇండియన్‌ ముస్లింలీగ్, భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించి అధికార బదిలీకి ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలి. 



* యుద్ధానంతరం ముస్లింలు అధికసంఖ్యలో ఉన్న దేశ ఈశాన్య, వాయవ్య ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దానికి అనుగుణంగా దేశ విభజన లేదా సమైక్యత ప్రక్రియను నిర్ణయించాలి.



* ఒకవేళ విభజనకు అనుగుణంగా నిర్ణయం జరిగితే దేశ రక్షణ, వాణిజ్యం, సమాచార సౌకర్యాలు వంటి అంశాలపై ఉభయులు ఒడంబడిక కుదుర్చుకోవాలి. అవన్నీ బ్రిటిషర్లు అధికారాన్ని పూర్తిగా బదిలీ చేసిన తర్వాతే అమల్లోకి వస్తాయి.



ముస్లింలీగ్‌ మొండివైఖరి కారణంగా రాజాజీ ఫార్ములా విఫలమైంది. 1945 ఏప్రిల్‌లో జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధ జ్వాలలు సద్దుమణిగాయి. అయినా ఆసియా ఖండంలో జపాన్‌ ముప్పు తొలగలేదు. ఇంగ్లండ్‌లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న లేబర్‌ పార్టీ క్లిమెంట్‌ అట్లీ నేతృత్వంలో (ప్రధానమంత్రిగా) అధికారంలోకి వచ్చింది. భారత రాజకీయ సమస్య పరిష్కారం కోసం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అప్పటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ లండన్‌ వెళ్లి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాడు. 1945 జూన్‌లో, రాజ్యాంగ ప్రతిష్టంభన తొలగించడానికి తన ప్రణాళికను  ప్రకటించాడు.



వేవెల్‌ ప్రణాళిక:


* ఈ ప్రణాళిక భారతదేశ గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణానికి ఉద్దేశించింది.



* నూతన కార్యనిర్వాహక మండలిలో గవర్నర్‌ జనరల్, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ తప్ప మిగతా వారంతా భారతీయులే నియమితులవుతారు.


* కార్యనిర్వాహక మండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తారు. ఇతర మతాల వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం ఉంటుంది. 


* విదేశీ వ్యవహారాల శాఖ గవర్నర్‌ జనరల్‌ నుంచి భారత మంత్రికి బదిలీ (రక్షణ వ్యవహారాలు మినహా) అవుతుంది.


* కార్యనిర్వాహక మండలి ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం (1935 భారత ప్రభుత్వ చట్టం) పనిచేస్తుంది. యుద్ధానంతరం నూతన రాజ్యాంగ రచనకు చర్చలు జరుగుతాయి.



ఈ ప్రకటన విడుదల తర్వాత లార్డ్‌ వేవెల్‌ సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటుచేసి భారత రాజకీయ నాయకులను ఆహ్వానించాడు. సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ రాజకీయ పరిష్కారం విషయంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ముస్లింలీగ్, జిన్నాల మొండివైఖరేనని పలువురు విమర్శించారు. కాంగ్రెస్‌ తరఫు నుంచి కార్యనిర్వాహక మండలిలోకి ముస్లిం సభ్యులను ఎంపిక చేసేందుకు లీగ్‌ అంగీకరించలేదు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ముస్లిం లీగ్‌ మాత్రమేనని, గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులనంతా ముస్లింలీగ్‌ సభ్యుల నుంచే తీసుకోవాలని పట్టుబట్టింది. కాంగ్రెస్‌ కూడా తనను హిందూ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాన్ని అంగీకరించలేదు. కార్యనిర్వాహక మండలిలోని స్థానాలకు తమ తరఫున అన్ని మతాల వారిని ప్రతిపాదించే హక్కు ఉందని వాదించింది. గవర్నర్‌ జనరల్‌ కూడా ఉదాసీన వైఖరి అవలంబించడంతో చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం జిన్నా వాదనకు లొంగిపోయిందని పలువులు విమర్శించారు.



భారత జాతీయ సైనికుల విచారణ:
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియాలో సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) అప్రతిహతంగా విజృంభించింది. బోస్‌ ప్రవాసంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. అయితే జపాన్‌ సైనిక సహాయం అందకపోవడం, ఈశాన్య భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితి, బోస్‌ విమాన ప్రమాదంలో మరణించడం వంటి కారణాలతో ఐఎన్‌ఏ బ్రిటిషర్లకు లొంగిపోయింది. ఐఎన్‌ఏలో ప్రముఖపాత్ర వహించిన సైనికాధికారులపై రాజద్రోహ నేరారోపణ చేసి, ప్రభుత్వం బహిరంగంగా విచారించేందుకు నిశ్చయించింది. దీనికి కారణం వారికి వేసే శిక్షలతో భారతీయులను భయానికి గురి చేయాలని భావించడమే. 1945, నవంబరులో దిల్లీలోని ఎర్రకోటలో విచారణ ప్రారంభమైంది. జాతీయ సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను ప్రభుత్వం విచారిస్తున్న విషయాన్ని వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించి దేశ ప్రజలను జాగృతం చేశాయి. ఆ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. హర్తాళ్లు, బంద్‌లు జరిగాయి. 1945, నవంబరు 5 నుంచి 11 మధ్య ‘భారత జాతీయ సైన్య వారం’గా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాదులు భూలాభాయ్‌ దేశాయ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ తదితరులు ఐఎన్‌ఏ యుద్ధ ఖైదీల తరఫున వకాల్తా తీసుకుని వాదించారు. దేశం ఇంతటి ఆగ్రహావేశాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోయింది. మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్ సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను దేశద్రోహులుగా నిర్ణయించి ఉరిశిక్ష విధించడంతో దేశం ఒక్కసారిగా భగ్గుమంది. దేశ ప్రజల మానసిక స్థితిని గమనించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ వీరికి విధించిన శిక్షను రద్దు చేశాడు. స్వాతంత్రోద్యమ గతిని ప్రభావితం చేసిన ఈ ఉదంతం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికను పంపింది.



భారత జాతీయ సైన్యం ఒకప్పుడు ఆంగ్లేయుల అధీనంలోని సైన్యమే. వీరు ఆగ్నేయాసియాలో జపాన్‌కి పట్టుబడి, యుద్ధ ఖైదీలైన తర్వాత సంభవించిన పరిణామాల వల్ల భారత జాతీయ సైన్యంగా మారారు. వీరు మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం చూసిన అనంతరం వారి విధేయతపై బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసం సడలింది. ఐఎన్‌ఏ స్ఫూర్తి బ్రిటిష్‌ భారతీయ సైన్యంలోకి పాకడం పట్ల కూడా అధికారులు ఆందోళన చెందారు. ఆ త్యాగధనుల పోరాటం భారత జాతీయవాద పార్టీల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఐక్యతను పెంచింది. ఐఎన్‌ఏ పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భారతీయుల్లో దేశభక్తిని మరింతగా ఇనుమడింపజేసి, స్వాతంత్య్ర సాధన లక్ష్యాన్ని మరింత చేరువ చేసింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 30-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వాతంత్య్రానికి ఒక సంవత్సరం ముందు!

సామ్రాజ్య వాదానికి సైనికుల సవాలు!
 


  రెండో ప్రపంచ యుద్ధంతో ఆంగ్లేయులు అన్ని విధాలుగా బలహీనపడ్డారు. సరికొత్త శక్తులు ఆవిర్భవించడంతో ప్రపంచ రాజకీయం మారిపోయింది. వలస రాజ్యాలను నిరంకుశంగా పాలించలేని స్థితికి బ్రిటిష్‌ ప్రభుత్వం వచ్చేసింది. ఆ దశలో జాతి వివక్షకు గురైన భారతీయ నావికాదళ సైనికులు చేసిన ఉద్యమం సామ్రాజ్య వాదాన్ని సవాలు చేసింది. వారి వీరోచిత పోరాటాన్ని అణచి వేయడం తెల్లవారికి సాధ్యం కాలేదు. ఫలితంగా పరిపాలన కోసం భారతీయులపై ఆధారపడలేని పరిస్థితులు తలెత్తాయి. అంతర్జాతీయ పరిణామాలన్నీ దేశ స్వాతంత్య్ర సమరానికి సానుకూలంగా ఉండటంతో ఇంగ్లిషువారి వైఖరి మారింది. అదే సమయంలో బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వం రావడం మరింత అనుకూలమై ఇండియాలో అధికార మార్పిడికి చర్యలు వేగవంతమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించేందుకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన ఈ పరిణామాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ ఆత్మహత్యతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. విజేతలకు, పరాజితులకు తీవ్ర నష్టం మిగిల్చింది. పశ్చిమ యూరప్‌ దేశాల స్థానంలో అమెరికా, సోవియట్‌ రష్యాలు అగ్రగామి దేశాలు (సూపర్‌ పవర్స్‌గా) గా అవతరించాయి. ఆ సమయంలో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇండియన్‌ ముస్లింలీగ్‌ మొండివైఖరి వాటిలో ప్రధానమైనది. అప్పటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ 1945లో భారత రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశం ఫలితం లేకుండానే ముగిసింది. ఆ విధంగా రాజకీయ పరిస్థితులన్నీ స్తబ్దుగా ఉన్న సమయంలో బ్రిటిష్‌ పాలకులపై ఒక పిడుగుపాటు పడింది అదే 1946, ఫిబ్రవరిలో జరిగిన ‘రాయల్‌ ఇండియన్‌ నేవీ’ తిరుగుబాటు. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలోని నావికాదళానికి ‘రాయల్‌ ఇండియన్‌ నేవీ’ అని పేరు. బొంబాయిలో ప్రారంభమైన ఈ మెరుపు తిరుగుబాటుకు అనేక కారణాలున్నాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ప్రభావితం చేసిన ముఖ్య ఘట్టాల్లో ఇది ఒకటి.


తిరుగుబాటుకు కారణాలు: మొదటి నుంచి భారతీయుల పట్ల బ్రిటిషర్లు జాత్యహంకార ధోరణితో వ్యవహరించేవారు. రాయల్‌ ఇండియన్‌ నేవీలోనూ అదే విధానాన్ని పాటించారు. నియామకాలు, జీతభత్యాలు, పదోన్నతులు, ఆహారం వంటి అన్ని విషయాల్లోనూ భారతీయ నావికాదళ ఉద్యోగులు జాతి వివక్షకు గురయ్యారు. భారతీయ అధికారులను కూడా తరచూ అవమానిస్తూ, చిన్నచూపు చూసేవారు. ఈ వివక్షా విధానానికి స్వస్తి చెప్పాలని, ఉద్యోగ విషయాల్లో తెల్లవారితో సమానంగా భారతీయులను చూడాలని, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందే జరిగిన భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) తిరుగుబాటు, తదనంతర పరిణామాల్లో యావత్‌ భారతీయుల మద్దతు వీరికి ప్రేరణగా నిలిచాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయ సైనికులు వివిధ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు వారికి అర్థమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపా సామ్రాజ్యవాద దేశాలు బలహీనపడ్డాయి. ఈ పరిస్థితులు రాయల్‌ నేవికి అనుకూలించాయి. 1946, ఫిబ్రవరి 18న హెచ్‌.ఎం.ఎస్‌.తల్వార్‌ అనే ఓడపై ‘క్విట్‌ ఇండియా’ అని రాసినందుకు ఒక భారతీయ నేవీ సైనికుడిని అరెస్ట్‌ చేశారు. దీనిపై ఇతర నావికుల్లో నిరసన వ్యక్తమైంది. ఓడలోని శిక్షణ సిబ్బంది తమకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించారు. వారు బొంబాయి వీధుల్లో కాంగ్రెస్‌ జెండాలు పట్టుకొని ప్రదర్శనలు జరిపారు. ప్రజలు కూడా ఉద్యమకారులతో కలిసిపోయారు. బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలు బొంబాయి నగరంలో మార్మోగాయి. పౌరజీవనం అస్తవ్యస్తమైంది.


 కరాచీ, కలకత్తా లాంటి ఇతర ప్రధాన నౌకా కేంద్రాలకు ఉద్యమం వ్యాపించింది. మద్రాసు, విశాఖపట్నం, కొచ్చిన్‌ తదితర నౌకా కేంద్రాల్లోనూ సైనికులు తిరుగుబాటుకు మద్దతుగా నిలిచారు. ఉద్యమం ఉద్ధృతి పెరిగింది, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సమ్మె తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు 78 నౌకలు, 20 రేవు స్థావరాలు, 20,000 మంది నావికులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం దీన్ని అణచలేకపోయింది. అన్నిచోట్లా పరిస్థితి అదుపుతప్పింది. తిరుగుబాటు సమయంలో సుమారు 200 మందికి పైగా మరణించారని ప్రభుత్వ అంచనా. చివరికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి జాతీయ నాయకులు జోక్యం చేసుకొని నౌకాదళ సమ్మెను విరమింపజేశారు. నావికాదళ సైనికుల తిరుగుబాటు ఆంగ్లేయులపై తీవ్ర ప్రభావం చూపింది. భారతీయ సైన్యం విధేయతపై వలస పాలకులకు విశ్వాసం సడలింది. జాతీయోద్యమాన్ని అణచడానికి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం పౌర పాలనా యంత్రాంగంలోని భారతీయ ఉద్యోగులు లేదా భారత సైనిక బలాల మీద ఆధారపడలేని పరిస్థితి ఏర్పడింది. 

క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌-1946:  రెండో ప్రపంచ యుద్ధానంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమ్మెలు, హర్తాళ్లు జరిగాయి. కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతులు క్రియాశీలక పోరాటాలు మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌లోనూ భారత సానుకూల లేబర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలన్నీ భారతదేశానికి అనుకూలంగా ఉండటంతో బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరిలోనూ మార్పు కనిపించింది. దేశానికి అధికారాన్ని బదలాయించే విషయంపై భారత రాజకీయ నాయకులతో సంప్రదింపులు, చర్చలు జరిపేందుకు 1946, మార్చిలో మంత్రిత్రయ రాయబారాన్ని పంపింది. ఈ మిషన్‌లో లార్డ్‌ పెథిక్‌ - లారెన్స్‌ (భారత రాజ్య కార్యదర్శి), సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ (బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ప్రెసిడెంట్‌), ఎ.వి. అలెగ్జాండర్‌ (ఫస్ట్‌ లార్డ్‌ ఆఫ్‌ ది అడ్మిరాలిటీ) సభ్యులు. అందరూ బ్రిటిష్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ మంత్రులవడంతో దీనికి క్యాబినెట్‌ రాయబారమనే పేరు వచ్చింది. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఇది ఒక శుభపరిణామం. క్యాబినెట్‌ మిషన్‌ 1946, మార్చి 24న ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్, ముస్లింలీగ్, ఇతర పార్టీల నాయకులతో చర్చలు ప్రారంభించింది. కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోవడంతో తానే ఒక ప్రణాళికను రచించి ప్రకటించింది. దీన్నే క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌గా పేర్కొంటారు. 


ముఖ్యాంశాలు:


* ముస్లింలీగ్‌ ప్రధాన డిమాండ్‌ అయిన ప్రత్యేక పాకిస్థాన్‌ను తిరస్కరించడం.


* బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలతో కూడిన భారత్‌ ఫెడరల్‌ యూనియన్‌ ఏర్పాటు.


* ఈ ఫెడరేషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ, విదేశాంగ శాఖ, రవాణాలపైనే అధికారం ఉంటుంది.


* ఇతర అధికారాలతో పాటు అవశిష్ట అంశాలపై నియంత్రణ రాష్ట్రాలకు ఉంటుంది.


* భారత్‌ యూనియన్‌కు బ్రిటిష్‌ ఇండియా, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో కూడిన కార్యనిర్వాహకవర్గం, శాసనసభ ఉంటాయి.


* భారతీయులకు అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తారు.


* రాష్ట్రాల్లోని శాసనసభలు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యాంగ సభ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాష్ట్రానికి వచ్చిన స్థానాలను, రాష్ట్రంలోని విభిన్న మతాల వారికి జనాభా నిష్పత్తిలో కేటాయిస్తారు.


* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తుకు తమ ప్రతినిధులను నియామకం (నామినేషన్‌) ద్వారా పంపుతాయి.


* బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాలు గ్రూపులుగా (ఉపసమాఖ్యలు) ఏర్పడటానికి స్వేచ్ఛ ఉంటుంది. హిందూ మెజారిటీ రాష్ట్రాలు ‘ఎ’  గ్రూపుగా; వాయవ్య రాష్ట్రాలైన సింధు, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రమైన బెలూచిస్థాన్‌లను ‘బి’ గ్రూపుగా; బెంగాల్, అస్సాంలను ‘సి’ గ్రూపుగా వర్గీకరించారు. ప్రతి విభాగం తమ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యాంగ విషయాలను నిర్ణయిస్తుంది. గ్రూపులన్నీ కలిసి యూనియన్‌ రాజ్యాంగాన్ని రూపొందిస్తాయి.


* అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.


తమ ప్రధాన డిమాండ్‌ అయిన ప్రత్యేక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఇండియన్‌ ముస్లింలీగ్‌ క్యాబినెట్‌ మిషన్‌ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించింది. 1946, ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినంగా జరపాలని నిర్ణయించింది. దీని ఫలితంగా ఉత్తర భారతదేశంలో మత ఘర్షణలు చెలరేగాయి.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 09-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వాతంత్య్రోద్యమంలో మహిళామణులు

  విముక్తిపోరులో వీర వనితలు!

భారత స్వాతంత్య్ర సమరంలో పురుష పోరాట యోధులకు దీటుగా ఎందరో వీర వనితలు పాల్గొన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ధైర్యంగా ఎదిరించారు. సేవాసంస్థలను, పత్రికలను స్థాపించి సరైన సమయంలో నాయకత్వ బాధ్యతలను అందుకొని పోరాటం కొనసాగించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లారు. దేశ, విదేశాల్లో విప్లకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. ఆంగ్లేయుల అరాచక పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆస్తులు పోగొట్టుకొని అజ్ఞాతంలోనూ ఉద్యమాలు నడిపారు. ప్రాణత్యాగాలు చేశారు. వారి అచంచల సంకల్పం, నిబద్ధత దేశానికి విముక్తిని ప్రసాదించడంలో అత్యంత కీలకంగా దోహదపడ్డాయి. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలైన ఆ మహిళల గురించి పోటీ పరీక్షార్థులు తప్పకుండా తెలుసుకోవాలి.


 
భారతీయ మహిళల దేశభక్తి, త్యాగాలు ఆధునిక భారత చరిత్రలో సువర్ణాక్షరాలలతో లిఖించదగిన అధ్యాయాలు. రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్, కిట్టూరు చెన్నమ్మ లాంటి ఎందరో వీరనారీమణులు 1857 తిరుగుబాటుకు ముందే సమరశంఖం పూరించారు. సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్‌ మహల్‌; 1885లో కాంగ్రెస్‌ స్థాపన తర్వాత స్వాతంత్య్రోద్యమంలో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్, సుచేత కృపాలాని, మాతంగిని హర్జ, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్‌ అలీ మొదలైన ఎందరో మహిళామణులు సాగించిన పోరాటాలు ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాలు.


ఝాన్సీ లక్ష్మీబాయి (1828 - 58):
అసలు పేరు మణికర్ణిక. డల్హౌసీ ప్రకటించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రిటిషర్లు, ఈమె దత్తపుత్రుడు దామోదరరావును రాజ్యాధీశుడిగా అంగీకరించకుండా ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. దాంతో ఆమె ఆంగ్లేయులతో యుద్ధానికి సిద్ధమైంది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొని తెల్లదొరలను ఎదిరించింది. ఆ సమయంలో జరిగిన భీకర యుద్ధంలో మొదట విజయం లక్ష్మీబాయి వైపే ఉంది. కానీ ఆంగ్లేయులు ఆధునిక ఆయుధ సంపత్తితో సేనాధిపతి హ్యూరోజ్‌ని రంగంలోకి దింపారు. అనంతరం గ్వాలియర్‌ వద్ద యుద్ధం చేస్తూ వీరమరణం పొందింది. ఆమె ధైర్యం, తెగువ స్త్రీ జాతికి స్ఫూర్తినిచ్చే గుణాలు. అందుకే నేటికీ ఆమె పేరు దేశంలో ప్రతి ఇంటా వినిపిస్తుంటుంది.


సావిత్రి బాయి ఫులే (1831-97):
 

ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫులే భార్య. లింగవివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం, సార్వత్రిక విద్య కోసం ఈ దంపతులు అవిశ్రాంత పోరాటం చేశారు. అనాథ స్త్రీలు, వితంతువులను సావిత్రి బాయి అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. భర్తతో కలిసి 1848 పుణెలో బాలికల పాఠశాలను స్థాపించారు. ‘సత్య శోధక్‌ సమాజ్‌’ నిర్వహణ బాధ్యతల్లో చురుకైన పాత్ర పోషించారు.

అనీబిసెంట్‌ (1847-1933):
 

 ఐర్లాండ్‌కు చెందిన అనీబిసెంట్‌ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. దివ్యజ్ఞాన సమాజం సేవలో ఆమె భారతదేశానికి వచ్చారు. అప్పటి రాజకీయాల్లో ప్రవేశించి 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆమె బెనారస్‌లో స్థాపించిన ‘సెంట్రల్‌ హిందూ కాలేజీ’నే 1916 నాటికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. దీని వెనుక ప్రముఖ జాతీయవాది మదన్‌ మోహన్‌ మాలవ్య కృషి ఉంది. 1916 ఏప్రిల్‌లో హోంరూల్ ఉద్య‌మాన్ని మొద‌ట బాల‌గంగాధ‌ర్ తిల‌క్ స్థాపించిన‌ప్ప‌టికీ అనీబిసెంట్‌ 1916, సెప్టెంబరులో హోమ్‌రూల్‌ లీగ్‌ స్థాపించి, భారతీయులకు స్వపరిపాలనను డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమ ప్రచారానికి ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’ అనే పత్రికలు స్థాపించారు. ఆమె కృషి ఫలితంగానే కాంగ్రెస్‌ అతివాద వర్గం, మితవాద వర్గం 1916లో జరిగిన లఖ్‌నవూ సమావేశంలో తిరిగి ఏకమయ్యాయి. దాంతో కాంగ్రెస్‌ మహోన్నత రాజకీయ శక్తిగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దేశంలో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నప్పుడు అనీబిసెంట్, తిలక్‌లు సాగించిన హోమ్‌ రూల్‌ ఉద్యమ పోరాటం బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మాంటేగ్‌ 1917లో భారతీయులకు స్పష్టమైన హామీలతో ప్రకటన చేయాల్సి వచ్చింది. హోమ్‌రూల్‌ ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం అనీబిసెంటును కారాగారంలో నిర్బంధించింది. ఆమె సేవలను ప్రశంసించిన భారత జాతీయ కాంగ్రెస్‌ 1917 కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ అనీబిసెంటు.


మాతంగిని హజ్రా (1870-1942):
గాంధీజీ పిలుపు మేరకు, 1932లో బెంగాల్‌లోని మిడ్నపుర్‌ జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు., తూములూక్‌ (toomluk) కోర్టు భవనంపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని, పోలీస్‌ కాల్పుల్లో ప్రాణత్యాగం చేశారు.


మేడం బికాజీ కామా (1861-1936): బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించారు. దాదాభాయ్‌ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి బారిన పడి, చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శి అయ్యారు. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ ని స్థాపించారు. విదేశాల్లో ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మేడం కామాను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.


కమలాదేవి దేవి చటోపాధ్యాయ (1903-1988): సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. 1923లో మహాత్మాగాంధీ పిలుపు అందుకుని సహాయ నిరాకరణ ఉద్యమ  సేవాదళ్‌ సంస్థలో పనిచేశారు. విదేశాల్లో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితిగతులు, విద్యాసంస్థలు  తదితరాలను పరిశీలించారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్య‌మంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేసిన సాహస నారి కమలాబాయి. ఈమె జయప్రకాశ్‌ నారాయణ్, రాంమనోహర్‌ లోహియాల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేశారు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. పద్మ విభూషణ్‌తో పాటు రామన్‌ మెగసెసే అవార్డు, శాంతినికేతన్‌ నుంచి ‘దేశికోత్తమ’ సత్కారం అందుకున్న ప్రతిభావంతురాలు.


సరోజినీ నాయుడు (1879-1949): 


భారత కోకిల (నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి. ‘ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌’, ‘ది బర్డ్‌ ఆఫ్‌ టైమ్‌’, ‘ది బ్రోకెన్‌ వింగ్స్‌’ లాంటి రచనలు చేశారు. బొంబాయి (1915), లఖ్‌నవూ (1916) కాంగ్రెస్‌ మహాసభల్లో పాల్గొన్నారు. 1925, డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నరుగా చేశారు. దేశంలోని ముఖ్య నగరాలను సందర్శిస్తూ, స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ పిలుపు అందుకుని, శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. దర్శన ఉప్పు డిపోపై దాడిలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమె పుట్టిన రోజును ‘జాతీయ మహిళా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 

రాణి గైడిన్లు (1915-1993): మణిపుర్‌కు చెందిన 14 ఏళ్ల వీరబాలిక. గొప్ప దేశభక్తురాలు. విదేశీయుల పాలనను వ్యతిరేకించింది. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈమెను బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లో జైలులో బంధించింది.  అప్పటి నుంచి అక్కడే ఉండిపోయింది. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ చొరవతో విడుదలైంది. గైడిన్లు జాతి గర్వించదగిన మహిళామణి. ఈమె 100వ జన్మదినాన్ని 2015లో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆమె నిరుపమాన సేవలను కొనియాడింది.


ఉషా మెహతా (1920-1996): క్విట్‌ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. అలాంటి సమయంలో ఉషా మెహతా బొంబాయిలో రహస్య రేడియో స్థాపించి ఉద్యమకారులను చైతన్యపరిచారు. ఉద్యమవ్యాప్తిలో క్రియాశీలక పాత్ర పోషించారు. ‘మహాత్మాగాంధీ అండ్‌ హ్యూమనిజం’ అనే గ్రంథం రాశారు.


అరుణా అసఫ్‌ అలీ (1909-1996): గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో బహిరంగ ఊరేగింపుల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సోషలిస్ట్‌ భావజాలంతో ప్రభావితురాలైన ఆమె కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించింది.  రామ్‌ మనోహర్‌ లోహియాతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ మాసపత్రిక ఇంక్విలాబ్‌కు ఆమె సంపాదకత్వం వహించారు. 1964లో ‘అంతర్జాతీయ లెనిన్‌ శాంతి బహుమతి’, 1991లో ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ అవార్డు’ లభించాయి. 1992లో పద్మవిభూషణ్‌ అందుకున్నారు. 1997లో మరణాంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆమెను వరించింది.భారత ప్రభుత్వం 1998లో ఆమె స్మారకార్థం స్టాంపు విడుదల చేసింది.


దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ (1909-1981):
ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్, మహాత్మాగాంధీ శంఖారావం చెవిన పడగానే జాతీయోద్యమంలో దూకిన సాహసి. ఆమె భర్త ప్రముఖ ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ను ప్రోత్సహించారు. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆమె  పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.


కస్తూర్బా గాంధీ (1869-1944): గాంధీజీ సతీమణి. దక్షిణాఫ్రికాలో ఆంగ్లేయుల జాత్యంహంకార విధానాలపై మహాత్ముడు సాగించిన అవిశ్రాంత అహింసా పోరాటంలో ఆయన వెంటే నడిచిన ధీర వనిత. 1913లో దక్షిణాఫ్రికాలో భారతీయ వలసదారుల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించినందుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. దాంతో ఆమెను అరెస్టు చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు గోపాల‌కృష్ణ‌ గోఖలే కోరిక మేరకు గాంధీజీ 1915లో భారతదేశం వచ్చినప్పటి నుంచి 1943 వరకు నిర్వహించిన అన్ని ప్రముఖ రాజకీయ ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాంధీజీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో పాటు కస్తూర్బా అరెస్ట్‌ అయ్యారు. ఆమెను పుణెలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో బంధించారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. పుణెలోని నిర్బంధ శిబిరంలోనే మరణించారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానం

 సనాతన విద్యకు సంస్కరణలు! 

బ్రిటిష్‌ వలస పాలనలో భారతీయ విద్యావ్యవస్థ సనాతనం నుంచి ఆధునికతను సంతరించుకుంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, సమాజ నియమాలు, చట్టాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిషర్లు విద్యాసంస్థలను, ఆంగ్ల బోధనను ఇక్కడ ప్రారంభించారు. యూనివర్సిటీలను నెలకొల్పారు. దాంతో సరికొత్త భారత మేధావి వర్గం పుట్టుకొచ్చింది. వారు  సామ్రాజ్యవాద పోకడలను, ఆర్థిక దోపిడీని అర్థం చేసుకున్నారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్లలో పెంపొందించేందుకు కృషి చేశారు.  అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిణామక్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి సంస్కరణలను అమలు చేసిందో తెలుసుకోవాలి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన ప్రారంభానికి ముందు విద్య సంప్రదాయ విధానంలో ఉండేది. విద్యాకేంద్రాలుగా హిందువులకు గురుకులాలు, దేవాలయాలు వ్యవహరిస్తే, ముస్లింలకు పర్షియన్‌ మదర్సాలు ఉండేవి. ఈ విద్యాసంస్థలు, మదర్సాలు ఎక్కువగా రాజ కుటుంబీకులు/వారి ఉన్నత ఉద్యోగులు/సుల్తానులు, జమీందారులు, కులీన కుటుంబాల పోషణలో ఉండేవి. హిందూ విద్యాసంస్థల్లో పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్యం, ఖగోళం, గణితం, వైద్యం, తత్వం లాంటివి పాఠ్యాంశాలుగా ఉండేవి. మత/నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణులు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు.


18వ శతాబ్దం చివరినాటికి ఈ సంప్రదాయ విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించడం ప్రారంభించడంతో  స్వదేశీ సంస్థానాలు బలహీనపడ్డాయి. వాటి ప్రభావం వారి ఉద్యోగ బృందం మీద కూడా పడింది. విద్యావ్యవస్థలకు పోషణ కరవైంది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తో ఇంగ్లండ్‌కు కేవలం ముడిసరకులు సరఫరా చేసే వలసప్రాంతంగా మన దేశం మారింది.తమ ఫ్యాక్టరీల్లో తయారుచేసిన వస్తువులకు మంచి విపణిగా ఈ దేశాన్ని బ్రిటిషర్లు  మార్చడంతో ఇక్కడి కుటీర పరిశ్రమలకు ఆదరణ కరవైంది. దీంతో దేశంలో వృత్తివిద్యలు కూడా దెబ్బతిన్నాయి. స్థూలంగా చెప్పాలంటే దేశీయ విద్యావ్యవస్థ విదేశీయుల పాలనలో క్షీణించింది.


బక్సర్‌ (1764) యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం ఆంగ్లేయుల హస్తగతమైంది. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు, యూరోపియన్, క్రైస్తవ మిషనరీల ప్రసక్తి తప్ప తొలిదశలో భారతదేశంలో విద్య కోసం చేసిన కృషి గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు (1772-85) 1781లో కలకత్తాలో ముస్లింల కోసం ఒక మదర్సా స్థాపించారు. 1782లో జోనాథన్‌ డంకన్‌ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. హేస్టింగ్స్, అతడి తోటి అధికారులు హాల్‌హెడ్, జోనాథన్‌ డంకన్‌ ప్రాచ్య విద్య పట్ల మక్కువ చూపారు. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం కూడా అవసరమని భావించారు. ఆ ప్రయత్నంలో హాల్‌హెడ్‌ మనుస్మృతిని జెంటూలాస్‌ అనే పేరుతో అనువాదం చేశాడు. మరుగున పడిన భారతీయ సంస్కృతిని వెలికితీయడానికి అప్పటి కంపెనీ న్యాయాధికారి విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్, మరొక కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తర్వాత అనేక ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత గ్రంథాలను కంపెనీ సేవలో భారతదేశానికి వచ్చిన పలువురు ఆంగ్లేయులు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. లార్డ్‌ వెల్లస్లీ పరిపాలనా కాలంలో కలకత్తాలోని విలియమ్స్‌ కోటలో కంపెనీ అధికారులకు పరిపాలనలో తర్ఫీదు ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో భారతీయ సంస్కృతి, న్యాయం, భౌగోళిక శాస్త్రం, తత్వం కూడా బోధించేవారు. బ్రిటిషర్లు తమ పాలన కోసమే ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని వల్ల భారతదేశ సాంస్కృతిక వైభవం వెలుగులోకి వచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని కొన్ని యూరోపియన్‌ క్రైస్తవ మిషనరీలు కూడా మనదేశంలో విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి. విలియం క్యారీకి చెందిన బాప్టిస్ట్‌ మిషన్‌ బెంగాల్‌లో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది. పోర్చుగీసు వారు అచ్చు యంత్రాన్ని మనకు పరిచయం చేశారు. క్రైస్తవ మిషనరీలు బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లోకి అచ్చువేయడం ద్వారా భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వాడకం విస్తృతమైంది. రాజా రామ్మోహన్‌ రాయ్, రాధాకాంత్‌ దేవ్, డేవిడ్‌ హేర్‌ లాంటి వారి కృషి వల్ల కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1817లో రాజా రామ్మోహన్‌ సహాయంతో, డేవిడ్‌ హేర్‌ కలకత్తాలో ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌ స్థాపించాడు. రామ్మోహన్‌ రాయ్‌ వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు.


కంపెనీ పాలనలో స్పష్టమైన విద్యా విధానం 1813 చార్టర్‌ చట్టంతో ప్రారంభమైంది. ఈ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూ.లక్ష కేటాయించాలని సూచించింది. కానీ ఆ మొత్తం ప్రాచ్య విద్య కోసమా లేదా పాశ్చాత్య విద్యాభివృద్ధి కోసమా అనే వాదనలు తలెత్తాయి. దాంతో ఈ నిధిని చాలా కాలం ఉపయోగించలేదు. వాదనలు విలియం బెంటింక్‌ కాలం (1828-35) వరకు నడిచాయి. బెంటింక్‌ చొరవతో అతడి కార్యనిర్వాహకవర్గ న్యాయ సభ్యుడు లార్డ్‌ మెకాలే ఆ పీటముడిని విప్పాడు. అతడి సూచన మేరకు బెంటింక్‌ 1835లో భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో సాహిత్యం, లెక్కలు, సైన్స్, తర్కం, తత్వం లాంటి పాశ్చాత్య విషయాలను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం విద్యారంగంలో ఒక చారిత్రక సంఘటన.

లార్డ్‌ డల్హౌసీ పదవీ కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి తగిన సూచనలు చేయడానికి ప్రభుత్వం సర్‌ చార్లెస్‌ ఉడ్‌ను నియమించింది. ఆయన సూచనలను ‘ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854’ అంటారు.

అందులోని ముఖ్యాంశాలు:

* ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు

* ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

* ప్రాంతీయ భాషల్లో బోధన

* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, యూనివర్సిటీ విద్యాలయాలుగా విభజించడం; మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన

* ఉపాధ్యాయ శిక్షణ

* బాలికా విద్యకు ప్రోత్సాహం

* విద్యారంగంలో ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలతో ఉడ్స్‌ డిస్పాచ్‌ ఆధునిక విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేసింది.


ఉడ్స్‌ డిస్పాచ్‌ తర్వాత చెప్పుకోదగిన విద్యారంగ సంస్కరణలు లార్డ్‌ రిప్పన్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్నప్పుడు జరిగాయి. ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854 సూచించిన విధానాలు, వాటి అమలు తీరును పరిశీలించడానికి విలియం హంటర్‌ కమిషన్‌ (1882)ను లార్డ్‌ రిప్పన్‌ నియమించాడు. ఇది బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించిన మొదటి కమిషన్‌.


హంటర్‌ నివేదిక ముఖ్యాంశాలు:  

* ప్రాథమిక, మాధ్యమిక విద్యను విస్తరించాలని, దాని నిర్వహణ బాధ్యత కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది.

* మతాలకు అతీతంగా లౌకిక బోధన జరగాలని పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలు విద్యాసంస్థలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాధ్యమిక విద్యతో పాటు వృత్తి విద్య నేర్పించాలని, స్త్రీ విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది.


రిప్పన్‌ తర్వాత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పదవీకాలంలో థామోస్‌ రాలి కమిషన్‌ (1902)ను నియమించాడు. దీనినే విశ్వవిద్యాలయాల కమిషన్‌ అంటారు. విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి దీన్ని నియమించారు. ఈ కమిషన్‌ సూచనల ప్రాతిపదికగా 1904 విశ్వవిద్యాలయాల చట్టం రూపొందింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను ప్రభుత్వమే నియమిస్తుంది. సెనెట్‌లో ఎన్నుకున్న సభ్యుల సంఖ్య తగ్గి, అధికార సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ చట్టం కారణంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది.


విద్యా సంస్కరణల్లో మరొక మైలురాయి హార్టోగ్‌ కమిటీ నియామకం. ఈ కమిటీని లార్డ్‌ ఇర్విన్‌ (1926-31) గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు నియమించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని సూచించింది. 1934లో నియమించిన సప్రూ కమిటీ వృత్తి విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యం ఇవ్వమని సూచించింది. 1944లో లార్డ్‌ వేవెల్‌ పదవీ కాలంలో సార్జెంట్‌ కమిటీని నియమించారు.

ఆధునిక భారతదేశంలో 20వ శతాబ్ద ప్రథమార్ధానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ విశ్వభారతితో సహా అలీగఢ్, ఉస్మానియా, ఆంధ్ర, ఢాకా, లఖ్‌నవూ, దిల్లీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1916లో ఆచార్య డి.కె.కార్వే పూనాలో స్త్రీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక వృత్తిపరమైన అంటే వైద్య, న్యాయ వ్యవసాయ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటై బ్రిటిష్‌ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశాయి.


ఆధునిక విద్యనభ్యసించిన విద్యావంతులు బ్రిటిషర్ల పాలన నిజ స్వరూపాన్ని గుర్తించగలిగారు. ఈ దేశ ఆర్థిక వెనుకబాటుకు పరాయి పాలనే కారణమని, వారి వివక్షా పూరిత విధానాలు, నిరంతర ఆర్థిక దోపిడీని ఆకళింపు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని భారతీయులకు ఈ ఆధునిక విద్యే అందించిందనడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వాతంత్య్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర

అక్షరాలే అగ్నికణికలై! 


స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ పత్రికల అక్షరాలే అగ్నికణికలై ఆంగ్లేయుల అక్రమాలను, అన్యాయాలను, అణచివేతలను  ఎదిరించాయి. ప్రజాభిప్రాయానికి శక్తిమంతమైన స్వరంగా మారాయి.  వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాయి. సామాజిక కట్టుబాట్లు, దురాచారాల చట్రంలో నలిగిపోతున్న జనానికి మంచిచెడులను వివరించి చైతన్యపరిచాయి. భిన్న మతాలు, జాతులుగా విడిపోయిన సమాజంలో  ఐక్యతను పెంచి, జాతీయవాదాన్ని రగిలించాయి. దోపిడీలను బహిర్గతం చేసి, ధైర్యాన్ని నూరిపోసి పాలకులపై తిరగబడే విధంగా ప్రోత్సహించాయి. ప్రభుత్వాన్ని నేరుగా ధిక్కరిస్తూ, స్వాతంత్య్ర పోరాటానికి దన్నుగా నిలిచాయి. స్ఫూర్తిదాయకమైన భారత పత్రికా రంగం ప్రస్థానాన్ని, పీడితుల తరఫున పోరాడిన పత్రికల వివరాలను, విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన చారిత్రక శక్తుల్లో మన వార్తాపత్రికలకు గణనీయ స్థానం ఉంది. బ్రిటిష్‌ ఇండియాలో విభిన్న జాతులు, మతాలతో కూడిన  ప్రజల్లో సమైక్యతను బోధించి, జాతీయతా భావాలు వ్యాప్తి చేయడంలో పత్రికా రంగం అద్వితీయ పాత్ర పోషించింది. ప్రభుత్వ విధానాలు, చర్యలను విశ్లేషించి ప్రజలకు వివరించడంతోపాటు వలస పాలకుల పక్షపాత వైఖరి, ఆర్థిక దోపిడీని విమర్శించడంలో ఎనలేని ధైర్యాన్ని ప్రదర్శించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే క్రమంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు, అణచివేత విధానాలను తట్టుకుని నిలబడింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం పత్రికా రంగం ఆచరించిన ఆ అసమాన అసిధారావ్రతం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిక్షిప్తమైంది.

ఆధునిక యుగంలో పత్రికా రంగం ఆవిర్భావం పూర్వాపరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన జాన్‌ గుటెన్‌బర్గ్‌ కనుక్కున్న ముద్రణా యంత్రాన్ని (ప్రింటింగ్‌ ప్రెస్‌) 16వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు వారు భారతదేశానికి పరిచయం చేశారు. అనంతరం మనదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పదవీకాలంలో 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ ద్వారా ‘ది బెంగాల్‌ గెజెట్‌’ పేరుతో ప్రచురితమైంది. దీనినే ‘కలకత్తా జనరల్‌ అడ్వర్టైజర్‌’, ‘హిక్కీస్‌ గెజెట్‌’ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాతి అయిదేళ్లలో ‘ది ఇండియా గెజెట్‌’, ‘ది కలకత్తా గెజెట్‌’, ‘ది బెంగాల్‌ జర్నల్‌’ అనే పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్‌ ఇండియాలోని కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రావిన్స్‌ల్లో పత్రికల స్థాపన విరివిగా సాగింది. 1785లో మద్రాసులో రిచర్డ్‌ జాన్సన్‌ ‘మద్రాస్‌ కొరియర్‌’ను, 1795లో ఆర్‌.విలియం ‘మద్రాస్‌ గెజెట్‌’, 1796లో హంఫ్రీ ‘ఇండియా హెరాల్డ్‌’లను స్థాపించారు. 1789లో బొంబాయిలో స్థాపించిన మొదటి వార్తా పత్రిక ‘బాంబే హెరాల్డ్‌’. 1789లో ‘బాంబే కొరియర్‌’, 1791లో ‘బాంబే గెజెట్‌’ వెలువడ్డాయి. ఇవన్నీ ఆంగ్లభాషా పత్రికలే.

భారతదేశంలో 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, గుజరాతీ, మరాఠీ భాషల్లో ప్రాంతీయ భాషా పత్రికల స్థాపన వేగంగా సాగింది. 1821లో రాజా రామ్మోహన్‌ రాయ్‌ స్థాపించిన ‘వంగదూత’, ‘సంవాద కౌముది’, పర్షియన్‌ పత్రిక ‘మిరాత్‌-ఉల్‌-అక్బర్‌’లు ప్రజల్లో మూఢాచారాలను ఖండించి, శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచడానికి కృషి చేశాయి.

బొంబాయి రాష్ట్రంలో దాదాభాయ్‌ నౌరోజీ నాయకత్వంలో వెలువడిన ‘రాస్త గోఫ్టర్‌’ అనే గుజరాతీ పత్రిక పార్శీ ప్రజల్లో చైతన్యానికి కృషి చేసింది. బాలశాస్త్రి జంబేకర్‌ ‘బొంబాయి దర్పణం’ అనే పత్రికను మరాఠీ భాషలో ప్రారంభించి, ప్రజల సంక్షేమ విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1822లో ఫర్దాంజీ ముర్జ్‌బాన్‌ ‘బాంబే సమాచార్‌’ను ప్రారంభించారు. ఈయన బొంబాయిలోని వెర్నాక్యులర్‌ ప్రెస్‌కు మార్గదర్శకుడు.


మద్రాసు రాష్ట్రంలో మొదట్లో పత్రికా ప్రచురణ వేగంగా సాగలేదు. 1844లో గాజుల లక్ష్మినరసుశెట్టి ‘క్రిసెంట్‌’ అనే పత్రికను  స్థాపించాడు. ఈ పత్రికలో ప్రభుత్వ అక్రమాలను, ఆంగ్ల ప్రభుత్వోద్యోగుల దోపిడీని విమర్శించారు. 1838 నుంచి 1851 వరకు మద్రాసు నుంచి వెలువడిన తెలుగు పత్రిక ‘వృత్తాంతిని’ ప్రభుత్వాన్ని విమర్శించి ఆంక్షలకు గురైంది.

బ్రిటిష్‌ ఇండియాలో పత్రికలను స్థూలంగా 1858కు ముందు, 1858 తర్వాత అని రెండు దశలుగా చెప్పవచ్చు. 1857కి ముందు ప్రచురితమైన భారతీయ పత్రికలు వినోద, విజ్ఞానాలే కాకుండా సాంఘిక, రాజకీయ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, జాతిని జాగృతం చేయడానికి కృషి చేశాయి.

1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయ పత్రికలు దేశంలో జాతీయత భావాలను పెంపొందించడంలో, దేశభక్తిని ప్రబోధించడంలో, బ్రిటిషర్ల దుష్పరిపాలన, వర్ణ వివక్ష, దోపిడీ విధానాలను ఎండగట్టడంలో విప్లవాత్మక ధోరణిని అవలంబించాయి. లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించినప్పుడు, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో అనేక పత్రికలు ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన పాత్ర అద్వితీయం. బెంగాల్‌లో కె.కె.మిత్ర స్థాపించిన ‘సంజీవని’, సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘బెంగాలీ’, మోతీలాల్‌ ఘోష్‌ ‘అమృతబజార్‌ పత్రిక’; బరింద్రకుమార్‌ ఘోష్, భూపేంద్రనాథ్‌ దత్త స్థాపించిన ‘యుగాంతర్‌’, బిపిన్‌ చంద్రపాల్‌ ‘వందేమాతరం’ వంటి పత్రికలు 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాయి.


ప్రముఖ అతివాద కాంగ్రెస్‌ నాయకుడైన బాలగంగాధర్‌ తిలక్‌ బొంబాయి రాష్ట్రంలో ‘కేసరి’ అనే పత్రికను మరాఠీలో, మరాఠా పత్రికను ఇంగ్లిష్‌లో ప్రచురించారు. తిలక్‌ తన పత్రికల్లో నిప్పు కణికల్లాంటి సంపాదకీయ వ్యాసాల ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆర్థిక దోపిడీ, దాష్టీకాలను తీవ్రంగా విమర్శించేవాడు. కేసరి, మరాఠా పత్రికలు ప్రభుత్వంపై తిరగబడే ధైర్యాన్ని ప్రజలకు నూరిపోసి ఆంగ్లేయ అధికారులకు దడ పుట్టించేవి. ప్రభుత్వ ఆంక్షలకు వెరవక హోమ్‌రూల్‌ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర నిర్వహించాయి. మద్రాసు రాష్ట్రంలో జి.సుబ్రమణ్య అయ్యర్, విజయ రాఘవాచారి స్థాపించిన ‘ది హిందూ’ కూడా ప్రజాభిప్రాయానికి దర్పణంగా నిలిచింది. 

ఇవేకాకుండా స్వాతంత్య్ర సమరయోధులు అనేక మంది పత్రికలు స్థాపించి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించడంతో పాటు తమ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఉదాహరణకు అనిబిసెంట్‌ స్థాపించిన ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’ పత్రికలు హోమ్‌రూల్‌ లీగ్‌ భావజాలాన్ని సమర్థంగా ప్రచారం చేశాయి. మౌలానా ఆజాద్‌ స్థాపించిన ‘అల్‌-హిలాల్‌’, గాంధీజీ స్థాపించిన ‘యంగ్‌ ఇండియా’, ‘హరిజన్‌’ ఈ తరహాలోనే ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఎన్నో పత్రికలు గాంధీ సాగిస్తున్న జాతీయోద్యమాలకు బాసటగా నిలిచాయి. 

బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరి: బ్రిటిషర్ల జాత్యహంకార పాలనను, అణచివేత విధానాలను తీవ్రంగా విమర్శించిన అమృత బజార్, హిందూ, స్వదేశీ మిత్రన్, మరాఠా, కేసరి లాంటి ఎన్నో పత్రికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత శిక్షాస్మృతి, 1860లోని 124A సెక్షన్‌ కింద రాజద్రోహం కేసులు పెట్టింది. ఈ విధంగా భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో పత్రికలపై ప్రభుత్వ నిర్బంధం తీవ్రంగా ఉన్నప్పటికీ అధైర్యపడకుండా పోరాడాయి. అకుంఠిత దేశభక్తితో కర్తవ్యాన్ని పాటిస్తూ, జాతీయత, సమైక్యత, మానవత, దేశాభిమానం లాంటి మహోన్నత ఆశయాలను వ్యాప్తి చేశాయి. స్వాతంత్య్ర పోరాటం దిశగా ప్రజలను జాగృతం చేస్తూ, రాజకీయ కార్యోన్ముఖులను చేసిన దేశీయ పత్రికా రంగ పాత్ర చిరస్మరణీయం.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 17-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌