* భారతదేశంలో చిన్న పెద్ద నదులు కలిసి దాదాపు రెండు వేలకు పైగా ఉన్నాయి. అందుకే మన దేశానికి నదీ దేశమని పేరు. భారతదేశంలోని నదులను వాటి నుంచి ప్రవహించే నీటి పరిమాణం, పరీవాహక వ్యవస్థను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి: i) భారీ/ పెద్ద నదులు
ii) మధ్యతరహా నదులు
iii) చిన్న నదులు
* సాధారణంగా 20,000 చ.కి.మీ. కంటే అధిక పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను భారీ లేదా పెద్ద నదులు అంటారు. 20,000 నుంచి 2,000 చ.కి.మీ. మధ్యలో పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను మధ్యతరహా నదులు అంటారు. 2,000 చ.కి.మీ. కంటే తక్కువ పరీవాహక వ్యవస్థ ఉన్న నదులను చిన్న నదులు అంటారు.
* దేశంలోని 14 భారీ నదులు, 44 మధ్యతరహా నదులు, 55 చిన్న నదులు ఉన్నాయి. వీటితోపాటు చిన్న చిన్న నదులు అనేకం ఉన్నాయి.
* దేశంలోని నదులను అవి జన్మించిన ప్రాంతాలు, వాటి లక్షణాలు, ప్రవాహ తీరు తెన్నులను బట్టి ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. అవి:
i) హిమాలయ నదులు లేదా జీవనదులు
ii) ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులు
హిమాలయ నదులు: ఇవి ప్రధానంగా హిమాలయ పర్వతాల్లోని మంచు కరగడం వల్ల జన్మిస్తాయి. అందుకే వాటిని జీవనదులు అంటారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో అత్యంత వేగంగా ప్రవహించే ఈ నదులు మైదానాలకు చేరేసరికి వేగం తగ్గి మందకొడిగా సాగుతాయి.
ఉదా: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదులు.
* ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి, ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు. వీటి ప్రవాహవేగం, నీటి పరిమాణం వర్షంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని వర్షాధార నదులు అని కూడా పిలుస్తారు. ప్రవహించే మార్గాన్ని బట్టి వీటిని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
a) తూర్పు వైపు ప్రవహించే నదులు
b) పశ్చిమం వైపు ప్రవహించే నదులు
* తూర్పు వైపు ప్రవహించే నదులు ప్రధానంగా పశ్చిమ కనుమల్లో జన్మిస్తాయి. తూర్పు వైపు ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తాయి.
ఉదా: మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, వాటి ఉపనదులు.
* పశ్చిమం వైపు ప్రవహించే నదులు ప్రధానంగా మధ్య భారతదేశంలో పుట్టి, పశ్చిమానికి ప్రవహిస్తూ చివరికి అరేబియా సముద్రంలో కలుస్తాయి.
ఉదా: నర్మద, తపతి, వాటి ఉపనదులు.
* మనదేశంలో మరికొన్ని నదులు కూడా పుట్టి, ప్రవహిస్తున్నాయి.
ఉదా: లూని, మహి, సబర్మతి.
సింధు నదీ వ్యవస్థ
ఇది టిబెట్లోని మానస సరోవరం వద్ద ఉన్న కైలాస కొండల్లోని 'బొక్కరేఛు' హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రవహిస్తూ 'ధాంచోక్' అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి, పశ్చిమ దిశగా తిరిగి జమ్మూ, కశ్మీర్ మీదుగా ప్రవహిస్తూ చివరికి పాకిస్థాన్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దక్షిణానికి మరలి అంతిమంగా కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2880 కి.మీ. ఇది భారతదేశంలో కేవలం 709 కి.మీ. పొడవున మాత్రమే ప్రవహిస్తుంది. దీని ఉపనదులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
i) పర్వత ప్రాంతంలో పుట్టి, పర్వత ప్రాంతంలోనే సింధూ నదితో కలిసే ఉపనదులు.
ఉదా: జస్కర్, ద్రాస్, అస్టార్, ష్యోక్, షిగార్, గిల్గిట్, కాబుల్.
ii) పర్వత ప్రాంతంలో పుట్టి, మైదాన ప్రాంతంలో సింధూనదిలో కలిసే ఉపనదులు.
ఉదా: జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్.
* టిబెట్ ప్రాంతంలో సింధూ నదిని 'సింగి - జంబన్' అని పిలుస్తారు. అంటే 'సింహపు నోరు' అని అర్థం. ఇది భారతదేశంలో ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీదుగానే ప్రవహిస్తుంది. దీని ఉపనదులు మాత్రం హిమాచల్ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తాయి.
సింధూనది ప్రధాన (మైదాన ప్రాంత) ఉపనదులు:
1. జీలం: ఇది కశ్మీర్ లోయలోని 'వెరినాగ్' వద్ద జన్మించి అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉలార్ సరస్సులో కలుస్తుంది. తర్వాత నైరుతి దిశగా భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రవహిస్తూ చివరికి పాకిస్థాన్లో త్రిమ్ము వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 724 కి.మీ. ఇది కశ్మీర్లో అత్యంత ప్రధానమైన నది. దీన్ని 'విటస్తా' అని కూడా అంటారు.
2. చీనాబ్: ఇది జస్కర్ శ్రేణుల్లోని 'బారాలాప్ చాలా' కనుమ వద్ద చంద్ర - భాగ అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని 'అక్నోర్' వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి పాకిస్థాన్లోని ముల్తాన్ వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది సట్లెజ్లో కలవడానికి ముందు జీలం, రావి నదులను తనలో కలుపుకుంటుంది. ఈ నది మొత్తం పొడవు 1180 కి.మీ. ఇది సింధూ నది ఉపనదులన్నింటిలో అతి పెద్దది. ఈ నదిపై ఉన్న ప్రధాన జల విద్యుత్ కేంద్రాలు: సలాల్, బాగ్లిమార్, దుల్హస్తీ. ఈ నదిని 'ఆసికేని' అని కూడా పిలుస్తారు.
3. రావి: ఇది కులు పర్వతాల్లోని రోహ్తంగ్ కనుమల్లో పుట్టి, అక్కడి నుంచి పర్వతాల మీదుగా ప్రవహించి 'పాంగ్' వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. చివరికి 'హరికె' వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 725 కి.మీ. దీన్ని ఐరావతి లేదా పరుషుని నది అని కూడా పిలుస్తారు.
4. సట్లెజ్: ఇది టిబెట్లోని రాకీస్ సరస్సు వద్ద పుట్టి అక్కడ నుంచి దౌలధర్, జస్కర్ పర్వతాల మీదుగా ప్రవహిస్తూ షిప్క్లా కనుమ వద్ద హిమాచల్ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. చివరికి పాకిస్థాన్లోని 'మైదాన్కోట్' వద్ద సింధూ నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1450 కి.మీ. అయితే భారతదేశంలో ఇది ప్రవహించే దూరం మాత్రం 1050 కి.మీ. భారతదేశంలో ప్రవహించే సింధూ నది ఉపనదుల్లో ఇదే పెద్దది. ఈ నదిపైనే మన దేశంలోకెల్లా ఎత్తయిన, పెద్ద ఆనకట్ట 'భాక్రానంగల్'ను నిర్మించారు. ఈ నదిని శతద్రు లేదా సతుద్రి అని కూడా పిలుస్తారు.
5. బియాస్: ఇది రోహ్తంగ్ కనుమల్లోని బియాస్ కుండ్ వద్ద జన్మించి 'కపుర్తలా' వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 475 కి.మీ. దీన్ని విపాసా లేదా ఆర్గికేయ అని కూడా పిలుస్తారు.
గంగా నదీ వ్యవస్థ
ఇది భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ. గంగా నది కుమయూన్ హిమాలయాల్లో భగీరథి, అలకనంద అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది. భగీరథ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమయూన్ హిమాలయాల్లోని కేదారనాథ్ సమీపంలో గంగోత్రి హిమనీ నదంలో జన్మించి, దేవప్రయాగ వద్ద అలకనంద నదితో కలుస్తుంది. అలకనంద నది కూడా కుమయూన్ హిమాలయాలు ఉన్న ఘర్వాల్ జిల్లా, బద్రీనాథ్ సమీపంలోని అలకనందా లేదా సతోపంత్ అనే హిమనీ నదంలో జన్మిస్తుంది.
* దేవప్రయాగలో అలకనందతో భగీరథ కలిశాక దాన్ని గంగా నదిగా పేర్కొంటారు. హరిద్వార్ వద్ద గంగానది మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్ర నదిని కలుపుకుని మరికొంత దూరం ప్రయాణించి, బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా చీలి ప్రపంచంలోనే పెద్దదైన డెల్టాను ఏర్పరుస్తోంది.
* గంగానది ముఖ ద్వారంలో ఏర్పడిన అనేక పాయల్లో ప్రధానమైంది 'మేఘన'. పశ్చిమ్ బంగ రాష్ట్రంలో ఫరక్కాకు దక్షిణంగా గంగానది నుంచి 'హుగ్లీ - భగీరధ' అనే పాయ చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది ప్రధాన పాయ మరికొంత దూరం ప్రయాణించి బంగ్లాదేశ్లో (అక్కడ దీన్ని పద్మా నదిగా పిలుస్తారు) 'గేలుండో' అనే ప్రాంతం వద్ద బ్రహ్మపుత్రా నదిని కలుపుకుని, చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2525 కి.మీ. భారతదేశంలో ఇది సుమారు 2100 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. గంగా నదికి ఉన్న ఉపనదులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
(i) హిమాలయాల్లో పుట్టి గంగా నదితో కలిసే, హిమాలయ ఉపనదులు.
ఉదా: యమున, కోసి, రామ్గంగ, శారద, గండక్, తీస్తా.
(ii) ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి గంగానదితో కలిసే, ద్వీపకల్ప ఉపనదులు.
ఉదా: సోన్, దామోదర్.
* పై నదులను తిరిగి రెండు రకాలుగా కూడా విభజించవచ్చు. అవి:
1) గంగా నదికి కుడివైపు కలిసే ఉపనదులు.
2) గంగా నదికి ఎడమవైపు కలిసే ఉపనదులు.
గంగా నది ప్రధాన ఉపనదులు
యమున: గంగానది ఉపనదులలోకెల్లా అతిపెద్దది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘర్వాల్ జిల్లాలో ఉన్న యమునోత్రి అనే హిమానీనదం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా కొంతదూరం ప్రయాణించి చివరికి ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. యమునా నది మొత్తం పొడవు 1376 కి.మీ. దీని ప్రధాన ఉపనదులు చంబల్, కెన్, బెట్వా, టాన్స్. ఇది నాగతిబ్బ, ముస్సోరి, శివాలిక్ కొండలను దాటి తాజెవాలా వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
చంబల్: ఇది యమునా నది ఉపనదులు అన్నింటిలో అతిపెద్దది. ఇది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల్లో ఉన్న 'జనపావో' కొండల్లో జన్మించి, చివరికి ఉత్తర్ ప్రదేశ్లోని ఎట్వా జిల్లాలో యమునా నదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 1050 కి.మీ. దీని ప్రధాన ఉపనది 'బనాస్'. ఇది సవాయ్ మాధపూర్ వద్ద యమునా నదితో కలుస్తుంది. ఈ నదిపై ఉన్న ప్రధాన ఆనకట్టలు గాంధీసాగర్, రాణీ ప్రతాప్ సాగర్ (రావత్ భట్టా), జవహర్ సాగర్. కాళీసింద్, పర్బతి నదులు చంబల్ నదికి కుడివైపు ఉపనదులు.
సోన్: ఇది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ పీఠభూమిలో పుట్టి, ఉత్తరదిశగా ప్రవహిస్తూ గంగా నదితో కలుస్తుంది. గంగా నదితో కుడివైపు కలిసే ఉపనదుల్లో ఇది అత్యంత ప్రధానమైంది. ద్వీపకల్పంలో పుట్టి ఉత్తరానికి ప్రవహిస్తూ గంగా నదితో కలిసే నదుల్లో ఇదే అతి పెద్దది. ఇది బిహార్లోని పట్నా జిల్లా, ధనీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 780 కి.మీ. దీని ప్రధాన ఉపనదులు జోహిల్లా, కన్హార్, నార్త్కోయల్, సౌత్కోయల్.
దామోదర్: ఇది ఛోటానాగపూర్ పీఠభూమిలో జన్మించి పగులు లోయ మీదుగా తూర్పు వైపు ప్రవహిస్తూ చివరికి పశ్చిమ్ బంగ రాష్ట్రంలో గంగానది పాయ అయిన హుగ్లీ నదితో కలుస్తుంది. దీన్ని 'బెంగాల్ దుఃఖదాయని' అని కూడా పిలుస్తారు. కలకత్తా సమీపంలో దామోదర్ నదిపై 'హౌరా వారధిని' నిర్మించారు. ఈ నదికి ఉన్న ప్రధాన ఉపనదులు బార్కార్, కోనాల్. దీని మొత్తం పొడవు 541 కి.మీ.
రామ్గంగ: ఇది ఉత్తర్ప్రదేశ్లోని ఘర్వాల్ జిల్లాలో జన్మించి 'కాలఘర్' వద్ద మైదానంలోకి ప్రవేశించి, చివరికి 'కనోజ్' వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 596 కి.మీ.
ఘాగ్రా: ఇది టిబెట్లోని గుర్లామందాత్ శిఖరం వద్ద జన్మించి, బిహార్ రాష్ట్రంలోని చాప్రా వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1080 కి.మీ. దీన్ని నేపాల్లో 'కర్నైలి' అని పిలుస్తారు. దీని ప్రధాన ఉపనదులు - శారద, సరయు, రపత.
శారద: ఇది నేపాల్ హిమాలయాల్లోని 'మిలామ్' హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. అక్కడ దీన్ని 'గోరిగంగా' అని పిలుస్తారు. దీనికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి. కాళీ నది అని, చౌకా నది అని అంటారు. ఇది సితాపూర్, బరబంకీ, డరాచ్ జిల్లాల కలయిక వద్ద 'ఘాగ్రా' నదితో కలుస్తుంది.
గండక్: ఇది నేపాల్లో జన్మించి బిహార్ రాష్ట్రంలో భారతదేశంలోకి ప్రవేశించి, చివరికి వైశాలి జిల్లాలోని హజీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. దీన్ని నేపాల్లో సాలగ్రామ్, కాళీ గండక్ అని పిలుస్తారు. భారతదేశంలో 'నారాయణి' అనే పేరుతో కూడా పిలుస్తారు.
బ్రహ్మపుత్రా నది
హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరాల్లో జన్మించి, సుమారు 2,900 కి.మీ. పొడవున ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మీదుగా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్రా నదికి వివిధ పేర్లున్నాయి. టిబెట్లో త్సాంగ్పో అని, అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని, అసోంలో బ్రహ్మపుత్ర అని, బంగ్లాదేశ్లో 'జమున' అని పిలుస్తారు. గంగానదితో కలిసిన తర్వాత 'పద్మానది'గా వ్యవహరిస్తారు.
* బ్రహ్మపుత్రా నది కైలాస శిఖరాల్లో జన్మించిన తర్వాత తూర్పు దిశగా టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ నామ్చాబార్వా శిఖరం వద్ద దక్షిణ దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ 'ధుబ్రి' వద్ద బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కొంతదూరం ప్రవహించి 'గేలుండే' వద్ద గంగానదితో కలుస్తుంది. చివరికి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టాను ఏర్పరుస్తుంది. దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్.
మనదేశంలో నదులు ఉద్భవించిన తీరు ఆధారంగా భారతదేశ నదీ వ్యవస్థను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:
1. హిమాలయ నదీ వ్యవస్థ
2. ద్వీపకల్ప నదీ వ్యవస్థ
3. అంతర్భూభాగ వ్యవస్థ
4. పరస్థనీయ/ ఎక్సోటిక్ నదీ వ్యవస్థ
హిమాలయ నదీ వ్యవస్థ
ఇందులో ప్రధానంగా 3 ముఖ్య నదీ వ్యవస్థలు ఉన్నాయి. అవి:
1. సింధూ నదీ వ్యవస్థ
2. గంగా నదీ వ్యవస్థ
3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
గంగా నదీ వ్యవస్థ
భారతదేశంలో ప్రవహించే నదులన్నింటిలో అతి పొడవైంది గంగా నది. ఇది దేశ వైశాల్యంలో దాదాపు నాలుగో వంతు భాగాన్ని ఆక్రమించి, అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నదిని హిందువులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు.
* హిమాలయ నదుల్లో గంగా అతితరుణ (తక్కువ వయసు కలిగిన) నది.
* అలక్నంద, భాగీరథి అనే రెండు ప్రధాన సెలయేర్లు దేవప్రయాగ్ వద్ద కలవడం ద్వారా గంగానది ఏర్పడుతుంది.
* అలక్నంద ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాల్లో ఉన్న సథప్నాథ్ హిమనీనదం వద్ద జన్మిస్తుంది.
* ఇది దేవప్రయాగ్ను చేరే ముందు మందాకిని, పిండార్, జోషిమాత లాంటి చిన్న నదులను తనలో కలుపుకుంటుంది.
* మందాకిని - అలక్నంద సంగమ ప్రాంతాన్ని రుద్రప్రయాగ్ అని; పిండార్-అలక్నంద కలిసే చోటును కరణ్ప్రయాగ్ అని; జోషిమాత - అలక్నంద కలిసే ప్రాంతాన్ని విష్ణుప్రయాగ్ అని పిలుస్తారు.
* కుమయూన్ హిమాలయాల్లోని గంగోత్రి హిమనీ నదం వద్ద భాగీరథి జన్మిస్తుంది.
* గంగా నది దేవప్రయాగ్ నుంచి ప్రవహిస్తూ హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
* ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ/ అలహాబాద్ వద్ద యమునా నదిని, అంతర్వాహినిగా సరస్వతి నదిని తనలో కలుపుకుంటుంది. ఈ ప్రాంతాన్నే త్రివేణి సంగమంగా పేర్కొంటారు. (వేదాలు, పురాణాల్లో మాత్రమే సరస్వతి నది ప్రస్తావన ఉంది.)
* ఇది ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బంగా మీదుగా ప్రవహించి ఫరక్కా (పశ్చిమ్ బెంగా) దగ్గర రెండు పాయలుగా చీలుతుంది. ఇందులో ఒక దాన్ని హుగ్లీగా పిలుస్తారు. ఇది పశ్చిమ్ బంగా మీదుగా ప్రవహిస్తుంది. రెండో పాయ పేరు ‘పద్మ’. ఇది ఫరక్కా నుంచి ఆగ్నేయంగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది.
* పద్మా నది తనలో బ్రహ్మపుత్ర నదిని కలుపుకుని, బంగ్లాదేశ్లోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
* గంగా నది మొత్తం పొడవు 2,525 కి.మీ. ఇది భారతదేశంలో దాదాపు 2,510 కి.మీ. ప్రవహిస్తుంది.
* దీని ప్రవాహ దూరం ఉత్తర్ ప్రదేశ్లో అత్యధికంగా, ఝార్ఖండ్లో అత్యల్పంగా ఉంది.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
* హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత పురాతనమైంది బ్రహ్మపుత్ర నది.
* ఇది టిబెట్లోని కైలాస కొండల్లో ఉన్న మానస సరోవరంలోని షమయంగ్డమ్ హిమనీనదం వద్ద జన్మిస్తుంది.
* ఇది సింధూ నదికి వ్యతిరేక దిశలో టిబెట్ నుంచి తూర్పుగా ప్రవహిస్తుంది. భారత్లోని అరుణాచల్ప్రదేశ్, అసోంల మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి వెళ్లి పద్మా నదిలో కలిసి, చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.
* టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి నామ్చా బర్వ పర్వతం వద్ద ‘యు’ ఆకారంలోకి తిరిగి అసోంలోని సాదియా వద్ద మైదానంలోకి ప్రవహిస్తుంది.
* అసోంలో ఎర్రనేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్రనది అని కూడా అంటారు.
* దీన్ని అసోం దుఃఖదాయనిగా పేర్కొంటారు.
* దీని ప్రధాన ఉపనదులు లోహిత్, తీస్తా.
* భారతదేశంలో ఉన్న ఏకైక నదీ ఆధారిత దీవి ‘మజూలీ’ బ్రహ్మపుత్ర వల్లే ఏర్పడింది.
* లోహిత్ నదిపై డోలా - సాదియా వారధిని నిర్మించారు. దీన్నే భూపేన్ హజారికా వారధి అని కూడా అంటారు. ఇది అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ట్రాలను కలుపుతుంది. రెండు ప్రాంతాల మధ్య రవాణా, మిలటరీ అవసరాలకు ఇది సహాయపడుతుంది.
* తీస్తా నది 1887 వరకు గంగానది ఉపనదిగా ఉండేది. కానీ అప్పట్లో సంభవించిన భూకంపం కారణంగా ఇది ప్రవాహ దిశను మార్చుకుని, బ్రహ్మపుత్రకి ఉపనదిగా మారింది.
* బ్రహ్మపుత్రనది ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు దిబ్రూగర్, గువాహటి.
గంగా నది - ఉప నదులు
గంగా నది ఉప నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవి:
హిమాలయాల్లో పుట్టి ఎడమ నుంచి కలిసేవి: రామ్గంగా, శారద, గండక్, కోసి, ఘాగ్ర.
హిమాలయాల్లో జన్మించి కుడి నుంచి కలిసేవి: యమున.
ద్వీపకల్పంలో జన్మించి కుడి నుంచి కలిసేవి: సోన్, దామోదర్ నదులు; యమునా నది ఉపనదులైన చంబల్, బెట్వా, కెన్.
రామ్గంగా: ఇది ఉత్తరాఖండ్లోని దుఢతోలి కొండల్లో జన్మిస్తుంది.
* జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మీదుగా ప్రవహిస్తూ, కనోజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
శారద: నేపాల్లోని హిమాలయాల్లో జన్మించి, ఉత్తర్ ప్రదేశ్లో ఉన్న ఘాగ్రా నదిలో కలుస్తుంది.
గండక్: నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో దాదాపు 6,268 మీ. ఎత్తున జన్మించి, బిహార్లోని గంగా నదిలో కలుస్తుంది.
* అత్యంత ఎత్తైన ప్రాంతంలో పుట్టి, భారత్లో ప్రవహిస్తున్న నదిగా దీన్ని పేర్కొంటారు.
* దీన్ని నేపాల్లో సాలిగ్రామి అని, బిహార్లో నారాయణి అని పిలుస్తారు.
కోసి: దీన్ని సంస్కృతంలో కౌసికి నది అని పిలుస్తారు.
* ఇది నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో జన్మించి, కాంచనగంగ పర్వతాన్ని తాకుతూ భారతదేశంలోకి ప్రవేశిస్తుంది.
* ఇది ఏడు ఉపనదులను తనలో కలుపుకుని సప్తకోసిగా మారి బిహార్ను తరచుగా వరదల్లో ముంచెత్తుతూ గంగా నదిలో కలుస్తుంది. అందుకే దీన్ని బిహార్ దుఃఖదాయినిగా పిలుస్తారు.
ఘాగ్ర: ఇది టిబెట్ ప్రాంతంలో జన్మించి, బిహార్లోని గంగా నదిలో కలుస్తుంది.
* దీన్నే కర్ణాలి నది అని కూడా అంటారు.
యమున: ఇది ఉత్తరాఖండ్లోని యమునోత్రి హిమనీనదం వద్ద జన్మించి, హరియాణా, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ మీదుగా ప్రవహిస్తూ అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
* దీని మొత్తం పొడవు 1376 కి.మీ.
ఇది గంగానది ఉపనదుల్లోకెల్లా, భారతదేశంలో ప్రవహించే అన్ని ఉపనదుల్లోకెల్లా అత్యంత పొడవైంది.
* చంబల్, బెట్వా, కెన్ నదులు ద్వీపకల్పంలో పుట్టి ఉత్తరంగా ప్రవహించి, యమునా నదిలో కలుస్తాయి.
చంబల్: మధ్యప్రదేశ్లోని మౌ (Mhow) అనే ప్రాంతంలో జన్మిస్తుంది.
* మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ల మీదుగా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది.
* ఇది యమునా నది ఉపనదుల్లోకెల్లా పెద్దది.
బెట్వా: మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల్లో జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ మీదుగా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది.
* దీన్నే మధ్యప్రదేశ్ గంగా నది అంటారు.
కెన్: దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
* మధ్యప్రదేశ్లోని కైమూర్ కొండల్లో జన్మించి, బుందేల్ఖండ్ పీఠభూమి మీదుగా ప్రవహించి ఉత్తర్ ప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది.
సోన్: దీన్ని గోల్డ్ రివర్ అని పిలుస్తారు
* మధ్యప్రదేశ్లోని అమర్కంఠక్ పీఠభూమిలో జన్మిస్తుంది.
* మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్ మీదుగా ప్రవహిస్తూ పట్నాకు సమీపంలో గంగా నదిలో కలుస్తుంది.
దామోదర్: ఝార్ఖండ్లోని ఛోటానాగ్పుర్ పీఠభూమిలో జన్మించి, పగులు లోయ మీదుగా ప్రవహిస్తూ కోల్కత్తాకు దిగువన 48 కి.మీ. దూరంలో హుగ్లీ నదిలో కలుస్తుంది.
* దీన్ని బెంగాల్ దుఃఖదాయినిగా పిలుస్తారు.