• facebook
  • whatsapp
  • telegram

74వ రాజ్యాంగ సవరణ చట్టం

* పట్టణ, నగరపాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా పేర్కొనవచ్చు. మున్సిపల్ అనే పదం మున్సిపియం అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. మున్సిపియం అంటే సంఘటితత్వం అని అర్థం.
* భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పట్టణ, నగరపాలక సంస్థలు వర్ధిల్లుతున్నాయి. ప్రాచీన కాలంలో సింధునాగరికత మనదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతకు నిదర్శనం.
* క్రీ.పూ. 2750 - 1750 మధ్య మనదేశంలో సింధునాగరికత వర్థిల్లింది.ఈ కాలంలో...
 అద్భుతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ
 నిర్ణీత కొలతల ప్రకారం భవనాల నిర్మాణం
 ప్రధాన రహదారులను ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే విధంగా నిర్మించడం
 మహాస్నాన వాటిక నిర్మాణాలు
   ఇలా ప్రతి ఒక్కటిని అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా శాంతికాముక పరిపాలనా విధానాలను అనుసరించారు.

* మనదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం చోళులు కాగా, పట్టణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం మౌర్యులు.
* మౌర్యుల రాజధాని నగరం పాటలీపుత్రం. ఈ నగర పాలనను అయిదుగురేసి సభ్యుల చొప్పున, ఆరు బృందాలు (30 మంది) సమర్థంగా పౌరపాలనను నిర్వహించేవని, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన గ్రంథమైన ఇండికాలో వివరించారు.
* మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు, మొగలుల పరిపాలనా కాలంలో పట్టణ, నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో కొత్వాల్ అనే అధికారి కీలకపాత్ర వహించేవారు.
* ఆంగ్లేయులు మనదేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్‌ను 1687లో మద్రాస్‌లో నెలకొల్పారు.
* 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను నెలకొల్పారు.
* 1793 ఛార్టర్ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పించడానికి ఆంగ్లేయులు తొలిసారిగా ప్రయత్నించారు.
* 1870లో లార్డ్‌మేయో తీర్మానం భారతదేశంలో పట్టణ, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో, భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నించింది.
* 1882లో లార్డ్‌రిప్పన్ తీర్మానం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలను ఎక్కువగా కల్పిస్తూ, వాటి నిర్వహణలో అధికారుల సంఖ్యను 3వ వంతు తగ్గించేందుకు ప్రయత్నించింది.

1907 రాయల్ కమిషన్ సిఫారసులు
* 1907లో ఛార్లెస్ హాబ్‌హౌస్ నాయకత్వంలోని రాయల్ కమిషన్ అధికారాల వికేంద్రీకరణ కోసం కింది సిఫార్సులను చేసింది.
    A. పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో అధికారుల సంఖ్యను తగ్గించడం.
    B. ఓటు హక్కుపై ఉండే పరిమితిని తొలగించి, విస్తృత పరచడం.
    C. ఆర్థిక వనరులను అధికంగా కేటాయించడం.

* 1919లో మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రస్థాయిలో ద్వంద్వపాలనను ప్రవేశపెట్టారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తిని కల్పించారు.
 భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని నిర్దేశిక నియమాల్లోని ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి.
 పట్టణంలో/ నగరంలో నివసించే పౌరులు ఆమోదించి, ఎన్నుకున్న వ్యక్తులతో స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం ఏర్పాటైన సంస్థను పురపాలక సంస్థ/ నగరపాలక సంస్థ అంటారు.
 క్రీ.పూ. 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో 16 నగర రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
 ఎల్. ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభలో చర్చిస్తున్న కాలంలోనే సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.
 పునర్వ్యవస్థీకరించిన నగరపాలక బిల్లును వి.పి. సింగ్ ప్రభుత్వం 1990, సెప్టెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టి విఫలమైంది.
 పి.వి. నరసింహారావు ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంట్ 1992, డిసెంబరు 22న ఆమోదించింది.
 పార్లమెంట్ ఆమోదం పొందిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది 1993, జూన్ 1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ రాజ్యాంగానికి IX(A) అనే నూతన భాగాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆర్టికల్ 243(P) నుంచి 243(ZG) వరకు ఉండే మొత్తం 18 ప్రకరణల్లో పట్టణ ప్రభుత్వాల గురించి పొందుపరిచారు.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారానే రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చి పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

74వ రాజ్యాంగ సవరణ చట్టం - విశేషాలు
 

ఆర్టికల్ 243(P): పట్టణ ప్రభుత్వాల నిర్వచనాన్ని తెలియజేస్తుంది.
* స్థానిక సంస్థల్లోని మున్సిపల్ సంస్థల నిర్వచనాలను గవర్నరు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.
* రాష్ట్రప్రభుత్వం గవర్నరు నోటిఫికేషన్‌ను అనుసరించి, కింది అంశాలపై చట్టాల ద్వారా నిర్వచనాలను రూపొందిస్తుంది.
1. జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.
2. పంచాయతీ: ఆర్టికల్, 243(B) ప్రకారం పంచాయతీగా ఏర్పాటు చేసిన ప్రాంతం.
3. జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
4. కమిటీ: ఆర్టికల్ 243(S) ప్రకారం ఏర్పాటైన కమిటీ.
5. మున్సిపల్ ప్రాంతం: గవర్నరు నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం.
6. మున్సిపాలిటీ: ఆర్టికల్, 243(Q) ప్రకారం ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
7. మెట్రోపాలిటన్ ప్రాంతం: 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం.

ఆర్టికల్ 243(Q): మున్సిపల్ సంస్థల వ్యవస్థాపన
1. మెట్రోపాలిటన్ నగరాలు: 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
2. నగరపాలక సంస్థలు: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు.
3. మున్సిపల్ కౌన్సిల్: 20 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మున్సిపల్ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.
4. నగర పంచాయతీలు: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు. వీటి కనీస జనాభా 11 వేల పైన, 20 వేల లోపు ఉంటుంది.
5. టౌన్‌షిప్‌లు: భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసే సంస్థలు.

 

ఆర్టికల్ 243(R) మున్సిపల్ వ్యవస్థల నిర్మాణం
* మున్సిపల్ ఛైర్‌పర్సన్, నగర కార్పొరేషన్ మేయర్, మెట్రోపాలిటన్ నగర మేయర్‌లు అంటే ఆయా సంస్థల అధిపతులు. వీరిని ఆయా సంస్థలకు చెందిన సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.
* నగర పంచాయతీల అధ్యక్షుల ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనే అంశాన్ని రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. పట్టణ, నగరపాలక సంస్థలు ఏ పార్లమెంటు నియోజక వర్గ పరిధి కిందకు వస్తాయో, సంబంధిత పార్లమెంటు సభ్యులు, శాసనసభల సభ్యులు ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్‌ల సభ్యులు కూడా ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటుహక్కు కల్పించే అంశంపై రాష్ట్రప్రభుత్వం చట్టం చేయవచ్చు.
* 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటుహక్కు కల్పించింది.

ఆర్టికల్, 243(S): వార్డులు, వార్డు కమిటీల ఏర్పాటు
* పట్టణ, నగరపాలక సంస్థలను కొన్ని వార్డులు/ డివిజన్లుగా విభజిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహుళ సభ్య వార్డుల ఏర్పాటును సుప్రీంకోర్టు సమర్థించింది.

మెట్రోపాలిటన్ నగరాలు:
* మెట్రోపాలిటన్ నగరాలను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. వీటిలో 100 - 200 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికైనవారిని కార్పొరేటర్లు అంటారు.
* గ్రేటర్ ముంబై కార్పొరేషన్‌లో 228 డివిజన్లు ఉన్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్:
* మున్సిపల్ కార్పొరేషన్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. కార్పొరేష‌న్‌లో 50 - 100 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికయ్యే సభ్యులను కార్పొరేటర్లు అంటారు.

మున్సిపాలిటీ

* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను కౌన్సిలర్లు అంటారు. మున్సిపాలిటీలో వార్డు సభ్యుల సంఖ్య 23 - 50 వరకు ఉంటుంది.

నగర పంచాయతీ
* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను వార్డు సభ్యులు అంటారు. నగర పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్య 15 - 21 వరకు ఉంటుంది.
* 3 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.
* రెండు లేదా అంత కంటే ఎక్కువ వార్డులు/ డివిజన్‌లు కలిసి వార్డు కమిటీగా ఏర్పాటైనప్పుడు ఆ వార్డులు/ డివిజన్‌ల సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
* ఈ వార్డు కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తాయి.

ఆర్టికల్ 243 (T)
* పట్టణ, నగరపాలక సంస్థల్లో కొన్ని స్థానాలను జనాభా ప్రాతిపదికపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.
* వెనుకబడిన వర్గాలకు (OBC) రిజర్వేషన్లు కల్పించే అంశంపై 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాలవారికి 34% స్థానాలను రిజర్వ్ చేస్తున్నారు.
* మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని మున్సిపాలిటీలో, ముగ్గురిని మున్సిపల్ కార్పొరేషన్‌లో కో ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసుకునే వీలుంది.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా ప్రస్తుతం మనదేశంలో 11 రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల్లో మొత్తం స్థానాల్లో 50% స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు.
* వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వెనుకబడిన తరగతుల్లో జన్మించినవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని వివాహం చేసుకున్న అగ్ర కుల స్త్రీలు వెనుకబడిన తరగతులకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీచేయడానికి అర్హులు కాదని 2005లో సుప్రీంకోర్టు పేర్కొంది.

ర్టికల్ 243 (U): పదవీకాలం
* అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 5 సంవత్సరాలు.
* పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు.
* పదవీకాలం ముగియకముందే ఈ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు.
* ఏ కారణం వల్లనైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేసినట్లయితే, రద్దయిన 6 నెలల్లోగా తప్పనిసరిగా ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
* ఏవైనా స్థానాలకు ఖాళీలు ఏర్పడినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకునే సభ్యుల పదవీకాలం మిగిలిన పదవీకాలం వరకే వర్తిస్తుంది. అయితే సంస్థ మొత్తం ఎన్నికలు కాలయాపన ద్వారా ఆలస్యం జరిగితే పూర్తి పదవీకాలం కొనసాగవచ్చు. సంస్థ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఆర్టికల్ 243 (V): అర్హతలు, అనర్హతలు
* పట్టణ, నగరపాలక సంస్థల్లోని అన్ని స్థాయుల్లో అధ్యక్షులు, వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.
* పార్లమెంటు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
* స్థానిక సంస్థలకు పోటీచేసేవారి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి.
* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.

ఆర్టికల్ 243 (W): అధికారాలు, విధులు
* 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థలకు 18 రకాల అధికారాలు, విధులను బదిలీ చేయాలని నిర్దేశించారు.
* వీటిలో 11 విద్యుక్త (తప్పనిసరి) అంశాలు కాగా, 7 ఐచ్ఛిక అంశాలు. ఈ అధికారాల బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు.

పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులు:
    1. నగర ప్రణాళిక
    2. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి
    3. భూమి సమర్థవంత వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణలు
    4. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
    5. రహదారులు, వంతెనలు
    6. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ
    7. అగ్నిమాపక వ్యవస్థ
    8. ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల, చెత్త నియంత్రణ
    9. పరిశ్రమలకు, గృహాలకు నీటివసతి
    10. వీధి దీపాలు, బస్‌స్టాండ్‌ల నిర్వహణ
    11. బలహీనవర్గాల సంరక్షణలు, వికలాంగులకు వసతి
    12. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
    13. కబేళాలపై నియంత్రణ
    14. జంతువుల సంరక్షణ
    15. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు
    16. జనన మరణాల నమోదు
    17. స్మశాన వాటికల నిర్వహణ
    18. ఆటస్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ


ఆర్టికల్ 243 (X): ఆదాయ వనరులు, పన్నులు
» పట్టణ, నగరపాలక సంస్థలు శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులను విధించి, వసూలు చేసుకోవచ్చు.
పన్నులు
» తాగునీరుపై పన్ను
» వినోదపు పన్ను
» ఇంటి పన్ను
» ఆక్ట్రాయ్ పన్ను
» అడ్వర్టైజ్‌మెంట్‌లపై పన్ను
» మార్కెట్లు, సంతలపై పన్ను
» ఖాళీస్థలాలపై పన్ను
» నిర్మాణాలకు ఇచ్చే అనుమతులపై పన్ను
» మున్సిపల్ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి.
» దేశంలోని మొత్తం స్థానిక సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్ పన్ను ద్వారానే సమకూరుతుంది.
ఆక్ట్రాయ్ పన్ను అంటే: సరిహద్దులను మూసివేసి, చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వసూలు చేసే పన్ను.


ఇతర ఆదాయ వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు
» విరాళాలు
» అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆదాయం.


ఆర్టికల్ 243 (Y) రాష్ట్ర ఆర్థిక సంఘం:
» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 243 (I)లో నిర్దేశించిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్, 243 (Y)కు కూడా వర్తిస్తుంది.
» కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఫైనాన్స్ కమిషన్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పంపుతుంది.
» రాష్ట్రంలోని పట్టణ, నగరపాలక సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చాలి.
» రాష్ట్రాలు ఆర్థిక వనరులను రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు అందిస్తాయి.
» రాష్ట్ర ఆర్థిక సంఘం అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక సంఘం 1994లో ఏర్పడింది. దీని మొదటి ఛైర్మన్ లక్ష్మణస్వామి.
» రాష్ట్ర ఆర్థిక సంఘం సూచనలను, వాటిపై ప్రభుత్వం తీసుకునే చర్యలతో కూడిన రిపోర్టును గవర్నరు శాసనసభకు సమర్పించాలి.


ఆర్టికల్ 243 (Z) అకౌంటింగ్, ఆడిటింగ్
» మున్సిపల్ వ్యవస్థల జమా ఖర్చుల ఖాతాల నిర్వహణ, వాటి ఆడిటింగ్‌కు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్ సంచాలకుడు నిర్వహిస్తారు.
     ఎ. లోకల్ ఫండ్ ఆడిట్
     బి. శాఖాపరమైన ఆడిట్
     సి. సాధారణ ఆడిట్
» స్థానిక సంస్థల ఆడిట్‌ను CAG పరిధిలోకి తీసుకురావాలని CAGగా పదవీ విరమణ చేసిన వినోద్‌రాయ్ సూచించారు.


ఆర్టికల్ 243 (ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం
» రాష్ట్రస్థాయిలో గవర్నరు నియమించే రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
» పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఎన్నికల చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన విధులను నిర్వహిస్తుంది.
» రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమించినప్పటికీ రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు.
» మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలను ఆర్టికల్ 243 (K)లో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుంది.


ఆర్టికల్, 243 (ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం?
» కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టణ, నగరపాలక సంస్థల అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
» కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది.
» శాసనసభలు ఉన్న దిల్లీ, పాండిచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. కానీ ఆ చట్టం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కొంతభాగానికి వర్తింపజేస్తూ రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేయవచ్చు.


ఆర్టికల్ 243 (ZC) మినహాయించిన ప్రాంతాలు
» ఆర్టికల్ 244 (1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు, ఆర్టికల్ 244 (2)లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలకు 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.
» మనదేశంలో ట్రైబల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటు విషయమై మినహాయింపు ఉంది.
» పశ్చిమ్ బంగలోని డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాలాండ్ ప్రాంతం కూడా మినహాయింపు పొందింది.
» పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి, ఈ ప్రాంతాల్లో కూడా సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. సంస్థల ఏర్పాటు; మార్పులు, చేర్పులు చేయడంలోనూ పార్లమెంటు పూర్తి అధికారాన్ని కలిగి ఉంటుంది.


ఆర్టికల్ 243 (ZD) జిల్లా ప్రణాళికా బోర్డు ఏర్పాటు
» జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక బోర్డు రూపొందిస్తుంది.
» జిల్లా ప్రణాళికా బోర్డు‌కు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర శాసనసభ మార్గదర్శక సూత్రాలను రూపొందించవచ్చు.
» జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నికైన సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా,

పట్టణ ప్రాంత జనాభాల నిష్పత్తిపైన ఆధారపడి ఉంటుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళికా బోర్డుకు మెంబర్ సెక్రెటరీగా కలెక్టరు వ్యవహరిస్తారు.
» జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యులు 30 మంది. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. సంబంధిత అంశాలపై ముగ్గురు నిపుణులు నామినేట్ అవుతారు. అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఒక్కరు నామినేట్ అవుతారు.
» జిల్లా పరిషత్ ఛైర్మన్ + జిల్లా కలెక్టరు
» జిల్లా ప్రణాళికా కమిటీ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను జిల్లా ప్రణాళికా కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాడు.


ఆర్టికల్ 243 (ZE) మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం
» మెట్రోపాలిటన్ నగరాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించడానికి దీన్ని ఏర్పాటు చేస్తారు.
» మెట్రోపాలిటన్ నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం నిర్మాణపరమైన, నిర్వహణపరమైన అభివృద్ధి విషయాలే కాకుండా సాధారణ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాల్సి ఉంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు సభ్యులను మెట్రోపాలిటన్ ప్రాంత పరిధి నుంచి ఎన్నికైన మున్సిపాలిటీల సభ్యులు, కార్పొరేషన్‌ల సభ్యులు, పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటారు.
» ఈ సభ్యుల్లో పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలి, మున్సిపల్ వ్యవస్థకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది వాటి జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మందిని ఎన్నుకుంటారు. నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
» దీనికి ఛైర్మన్‌గా నగర మేయర్, మెంబర్ సెక్రెటరీగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తారు.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు తన నివేదికను రాష్ట్ర గవర్నరుకు సమర్పిస్తుంది. మరొక నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తుంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు ప్రణాళిక రూపకల్పన చేసే సందర్భంలో గవర్నరు నిర్దేశించిన సంస్థలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే భౌతిక వనరులను ఆధారం చేసుకుని మౌలిక వసతుల కల్పనపై ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది.
» 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ నగరాలు వర్థిల్లుతాయి.
» ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మాదిరి దిల్లీలో కూడా మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం ఉండాలి. కానీ, దాని స్థానంలో దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వం మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం కార్యకలాపాలను నిర్వరిస్తుంది.
» 1964లో దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో నెలకొల్పారు.


ఆర్టికల్ 243 (ZF): పాత శాసనాల కొనసాగింపు
» 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు అంటే 1994, మే 31 వరకు పాత శాసనాలు కొనసాగుతాయి.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత చట్టాలు రూపొందించి, అమలుపరచుకోవచ్చు.


ఆర్టికల్ 243 (ZG): మున్సిపల్ ఎన్నికల విషయంలో కోర్టుల జోక్యం నిషేధం
» మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియోజక వర్గాల పరిధులను నిర్ణయించడం, సీట్ల కేటాయింపులను న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.
» పట్టణ, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిపే సందర్భంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా సాధికారిక (స్వయం ప్రతిపత్తి) సంస్థలను ఏర్పాటు చేయవచ్చు.
» దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలను జిల్లా సెషన్స్ కోర్టులకు అప్పగించారు.
» జిల్లా సెషన్స్ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ కోర్టుల మాదిరి కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్స్‌గా వ్యవహరిస్తాయి.


పట్టణ స్థానిక ప్రభుత్వాలు - వర్గీకరణ
1. నగరపాలక సంస్థలు (Municipal Corporations)
» రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ శాసనసభలో చట్టం చేయడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాయి.
» 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
» మనదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి.
» 1950లో హైదరాబాద్ కార్పొరేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
» 1955 నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసి ఏర్పాటు చేశారు.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లో సవరణకు గురైంది.


మున్సిపల్ కార్పొరేషన్ - ప్రధాన అంగాలు

నగరపాలక మండలి
» మున్సిపల్ కార్పొరేషన్ చర్చా సంబంధమైన అంగ(భాగ)మే నగరపాలక మండలి. నగరపాలక సంస్థలోని రిజిస్టరైన ఓటర్లు డివిజన్ల నుంచి కార్పొరేటర్లను ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» కార్పొరేటర్ల పదవి కాలం 5 సంవత్సరాలు.
» నగరపాలక సంస్థ పరిధిలోని శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ పదవిరీత్యా నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నగరపాలక మండలికి మేయర్ అధ్యక్షత వహిస్తారు.


మేయర్, డిప్యూటీ మేయర్
» డివిజన్ల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు తమలో నుంచి ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు.
» మేయర్ నగరపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.
» మేయర్ నగరపాలక సంస్థకు రాజకీయ అధిపతి. ఇతడి పదవీకాలం 5 సంవత్సరాలు.
» ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లు పరోక్షంగా ఎన్నికవుతున్నారు.


స్థాయీసంఘాలు
» నగరపాలక సంస్థలకు కళ్లు, చెవులు, చేతులుగా స్థాయీసంఘాలను పేర్కొంటారు. ఇవి నగరపాలక సంస్థకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి.
స్థాయీ సంఘాల విధులు
» నగరపాలక సంస్థ కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం.
» నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ను పరిశీలించడం.
» అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందడం.
కమిషనర్
» ఇతడు నగరపాలక సంస్థకు పరిపాలనా అధిపతి. రాష్ట్రప్రభుత్వం ఇతడిని నియమిస్తుంది. ఇతడు సాధారణంగా ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన వ్యక్తి అయి ఉంటారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పరిపాలన, నియంత్రణాధికారాన్ని కలిగి ఉంటారు. మేయర్‌ను సంప్రదించి నగరపాలక సంస్థ సమావేశాల తేదీలు, కార్యక్రమాల అజెండాను రూపొందిస్తారు.
మనదేశంలో వివిధ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య:
    మహారాష్ట్ర - 26
    ఉత్తర్‌ప్రదేశ్ - 14
    మధ్యప్రదేశ్ - 14
    ఆంధ్రప్రదేశ్ - 13
    తమిళనాడు - 12
    కర్ణాటక - 11
    తెలంగాణ - 6
    జమ్మూకశ్మీర్ - 2


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు - 13
    1) గ్రేటర్ విశాఖపట్నం
    2) కాకినాడ
    3) రాజమండ్రి
    4) ఏలూరు
    5) విజయవాడ
    6) గుంటూరు
    7) ఒంగోలు
    8) నెల్లూరు
    9) కడప
    10) కర్నూలు
    11) తిరుపతి
    12) చిత్తూరు
    13) అనంతపురం
» విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ - 1989
» విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ - 1991
» మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లను - 1994 నాటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు.
» కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పర్వీన్‌భాను అనే హిజ్రా ఎన్నికయ్యారు.


2. పురపాలక సంఘాలు: (Municipalities)
» ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం - 1965 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ చట్టం 1965, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టాన్ని 1994లో సవరించారు.
» నగరపాలక సంస్థకు దిగువన గ్రామపంచాయతీ, నగర పంచాయతీలకు ఎగువన ఏర్పాటు చేసిన పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంఘాలు. 20,001 లేదా అంతకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో పురపాలక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను వాటి ఆదాయం ప్రాతిపదికగా 5 గ్రేడులుగా వర్గీకరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాల వర్గీకరణ - వివరాలు

పురపాలక సంఘం గ్రేడ్  వార్షిక ఆదాయం (రూ. కోట్లలో) సంఖ్య
1. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ 8 కోట్లపైన 4
2. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ 6 - 8 7
3. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ 4 - 6 13
4. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ 2 - 4 25
5. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ 1 - 2 18
మొత్తం మున్సిపాలిటీల సంఖ్య   67

పురపాలక సంఘాలు - ప్రధాన అంగాలు

పురపాలక మండలి
» పురపాలక సంఘం చర్చావేదికే పురపాలక మండలి. ఇది సాధారణంగా నెలకొకసారి సమావేశమవుతుంది. దీనిలో కింద పేర్కొన్న సభ్యులుంటారు.
ఎన్నికైన సభ్యులు: పురపాలక మండలి ఎన్నిక కోసం దాన్ని వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి కౌన్సిలర్‌లను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
ఎక్స్అఫీషియో సభ్యులు: రాష్ట్రాల విధాన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు పదవీరీత్యా పురపాలక మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరికి ఓటువేసే అధికారం ఉంటుంది.
» జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు కూడా ఓటువేసే అధికారం లేకుండా పురపాలక మండలి సభ్యులుగా పదవిరీత్యా వ్యవహరిస్తారు.
» మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని పురపాలక సంఘానికి కో-ఆప్టెడ్ సభ్యుడిగా నియమిస్తారు.
» పురపాలక మండలి సభ్యులు, ఛైర్మన్‌ల పదవీకాలం 5 సంవత్సరాలు.
» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.


మున్సిపల్ ఛైర్మన్
» పురపాలక సంస్థకు ఎన్నికైన కౌన్సిలర్‌లు తమలో నుంచి ఒకరిని మున్సిపల్ ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
» మున్సిపల్ ఛైర్మన్ పురపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.
» ఛైర్మన్ ఎన్నిక పరోక్షం.
» ఛైర్మన్ పురపాలక మండలిలోని కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


కమిషనర్
» మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థకు పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు.
» ఛైర్మన్‌ను సంప్రదించి, సమావేశాల అజెండాను రూపొందిస్తారు.
» మండలి సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొంటారు.
» పురపాలక మండలికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
» పురపాలక మండలి తీర్మానాలను జిల్లా కలెక్టరుకు, పురపాలక పాలన ప్రాంతీయ డైరెక్టరుకు పంపుతారు.
» సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, కార్యకలాపాలపై నియంత్రణ కలిగి ఉంటారు. సంస్థ వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తారు.


పురపాలక సంస్థ - విధులు
ఇవి 2 రకాలు
ఆవశ్యక విధులు (Compulsory Functions)
» ప్రజారోగ్యం, పరిశుభ్రతలను నిర్వహించడం
» జనన, మరణ రికార్డులను నిర్వహించడం
» ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ పాఠశాలలను నిర్వహించడం.
» పౌరులకు పరిశుభ్రమైన నీరు, వీధి దీపాలను ఏర్పాటు చేయడం.
» పురపాలక సంస్థ పరిధిలోని రహదారులు, భవనాల నిర్మాణం, నిర్వహణ.
వివేచనాత్మక విధులు (Discriminary Functions)
» మాతా, శిశు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం.
» పార్కులు, మ్యూజియం, విశ్రాంతి గృహాలు, గ్రంథాలయాలను నిర్వహించడం.
» మహిళల కోసం ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం.


స్థాయీ సంఘాలు
» వీటిని పురపాలక సంస్థకు కళ్లు, చెవులు, చేతులుగా అభివర్ణిస్తారు.
    1) విత్తం
    2) ఆరోగ్యం
    3) పన్నులు
    4) మహిళా సంక్షేమం
    5) వెనకబడిన వర్గాల సంక్షేమం
    6) విద్య
పై అంశాలకు సంబంధించిన స్థాయీ సంఘాలు ఉంటాయి.


ఆర్థిక వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు.
» వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.
» విరాళాలు, స్థిర ఆస్తుల ద్వారా సమకూరే ఆదాయం.


3. నగర పంచాయతీలు
» గ్రామీణ ప్రాంతం క్రమంగా పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంటే దాన్ని నగర పంచాయతీగా మారుస్తారు. నగర పంచాయతీ జనాభా 11000 కంటే ఎక్కువగా 25000 కంటే తక్కువగా ఉంటుంది. నగర పంచాయతీ పరిపాలన నగర పంచాయతీ కమిటీ ద్వారా జరుగుతుంది.
» పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి నగర పంచాయతీ కొన్ని వార్డులుగా విభజన చెంది ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక వార్డు మెంబరు చొప్పున 5 సంవత్సరాల కాలానికి వయోజన ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు. నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నికైన వార్డు మెంబర్లు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ పరిధిలో ఉండే ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సీలు పదవీరిత్యా సభ్యులుగా ఉంటారు.
» నగర పంచాయతీ సభ్యులు తమలో నుంచి ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.


ఆదాయ వనరులు
» వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలుచేసే ఫీజు, భవన నిర్మాణం, నీటి సరఫరాపై వసూలు చేసే పన్ను.
» ఆస్తులపై అద్దె, అమ్మకం వ్యవహారాలపై వసూలు చేసే రుసుములు.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు
» ఆస్తిపన్ను, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలు చేసే పన్ను.
» ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 నగర పంచాయతీలు ఉన్నాయి.


4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
» 'సెమీ మున్సిపల్ అథారిటీ పద్ధతిలో చిన్నపట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర శాసనసభ చేసే చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్ చేసిన లేదా కొందరు నామినేట్ విధానం ద్వారా, మరొకొందరు ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రజలకు అవసరమైన పౌర సదుపాయాలను కల్పించడానికి ఇవి పనిచేస్తాయి.


5. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
» అతివేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపాలిటీలను ఏర్పాటుచేయడానికి అనువైన పరిస్థితులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తుంది. అందుకే వీటిని నోటిఫైడ్ ఏరియా కమిటీలు అంటారు.
» వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. ఇందులోని సభ్యులందరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కాబట్టి ఇవి ఎన్నికైన సంస్థలు కావు.


6. టౌన్ షిప్‌లు (Townships)
» ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంతంలో నివసించేవారికి పౌరసదుపాయాలు కల్పించడానికి సంబంధిత పారిశ్రామిక సంస్థలు టౌన్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తాయి.
» టౌన్‌షిప్‌ల నిర్వహణ అధికారిని, ఇతర సిబ్బందిని సంబంధిత పరిశ్రమ యాజమాన్యమే నియమిస్తుంది. దీనిలో ఎన్నికైన సభ్యులుండరు. పౌరసదుపాయాల కల్పనలో వీటిని అత్యున్నత శ్రేణి సంస్థలుగా అభివర్ణిస్తారు. ఉదా: విశాఖ స్టీల్


7. పోర్ట్‌ట్రస్ట్ (Port Trust)
» నౌకాశ్రయాలు ఉన్నచోట పోర్ట్‌ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం లాంటి కీలక ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు.
» పోర్టు పరిరక్షణ, నిర్వహణ, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌరసదుపాయాలు కల్పించడానికి పోర్ట్ ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. 1963 నాటి మేజర్ పోర్ట్స్ చట్టం ప్రకారం ప్రస్తుతం 13 పోర్ట్ ట్రస్టులు ఉన్నాయి.


8. కంటోన్మెంట్ బోర్డు (Cantonment Board)
» కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌరసదుపాయాలను కల్పించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. దీనిలో పాక్షికంగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. సంబంధిత ప్రాంత మిలటరీ కమాండింగ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డుకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడుగురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ఉపాధ్యక్షుడిని బోర్డు సభ్యులు ఎన్నికుంటారు. కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు.
» కంటోన్మెంట్ బోర్డు చట్టం - 1924 ప్రకారం దేశంలో ప్రస్తుతం 62 కంటోన్మెంట్ బోర్డులున్నాయి. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది.


ప్రత్యేక ప్రయోజన సంస్థలు (Special Purpose Agencies)
» బహుళ ప్రయోజనార్థం పట్టణాల్లో వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన సంస్థలను ఏర్పాటు చేస్తుంది. వీటిని విధుల ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తారు. వీటి అధిపతులను రాష్ట్రప్రభుత్వమే నియమిస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లతోనూ కలిసి పనిచేస్తాయి.
ఉదా: 1. పట్టణాభివృద్ధి సంస్థలు HUDA, TUDA, VUDA
         2. హౌసింగ్ బోర్డులు
         3. పొల్యుషన్ కంట్రోల్ బోర్డులు
         4. ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డులు
పట్టణ, నగర పాలక సంస్థలకు సంబంధించి 2వ పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు
» స్థానిక సంస్థల్లో ఎంఎల్ఏ, ఎంపీలకు ప్రాతినిథ్యం కల్పించకూడదు.
» అన్ని రాష్ట్రాలకు విధానపరిషత్‌లను ఏర్పాటుచేసి, వాటిలో స్థానిక సంస్థల సభ్యులకు స్థానం కల్పించాలి.
» రిజర్వ్ చేసిన నియోజన వర్గాలు కనీసం 10 సంవత్సరాలపాటు కొనసాగాలి.
» పరిపాలనా పారదర్శకతకు జిల్లాస్థాయిలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి.
» స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండకూడదు.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు లేని గ్రాంట్లను అందజేయాలి.
» మేయర్ లేదా ఛైర్మన్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.
» నగరాల్లో మెట్రోపాలిటన్ పోలీస్ అథారిటీని ఏర్పాటు చేయాలి.
» రాష్ట్ర శాసనసభల్లో స్థానిక సంస్థల విషయాలను పరిశీలించడానికి స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌