• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు
భారతదేశంలో వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశికసూత్రాలను అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, వీటిని న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణమైంది. కోర్టుల తీర్పులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది. వాటిలో కీలకమైనవి..


1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
కామేశ్వరిసింగ్‌  vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1951, జూన్‌ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆర్టికల్‌ 15కు క్లాజు (4) ను చేర్చింది. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం పొందింది.
* ఆర్టికల్‌ 19ని సవరించి ఆర్టికల్‌ 19(6)కి వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వానికి ఉన్న హక్కును ధ్రువీకరించింది.
* ఆర్టికల్‌ 31ని సవరించి, ఆర్టికల్స్  31(A), 31(B)లను కొత్తగా చేర్చి, వాటిని IXవ షెడ్యూల్‌లో పొందుపరచి, భూసంస్కరణలు, జమీందారీ విధానం రద్దుకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. IXవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.


4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
* బేలాబెనర్జీ కేసులో ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1955, ఏప్రిల్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు, అందుకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని నిర్దేశించింది. అంటే ఈ చట్టాలకు న్యాయసమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది.

 

16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963
* 1963లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1963, అక్టోబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని సవరించి, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల సంరక్షణ కోసం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
* భారతదేశ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికయ్యే వ్యక్తులు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతామనే మాటలతో చేయాల్సిన ప్రమాణపత్రాన్ని పొందుపరిచారు.


17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964
* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1964, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు..
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌  31(A)ని సవరించి ప్రజాశ్రేయస్సు కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.


24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* గోలక్‌నాథ్‌ vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1971, నవంబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.


25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1972, ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి చేర్చారు.
* ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడు  తగినంత ‘నష్ట పరిహారం’ ఇవ్వలేదనే కారణంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
* ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్‌ రూపొందించే శాసనాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ‘నష్టపరిహారం’ నిర్ణయంపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించారు. అయితే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి.
* అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.


42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు. ఇందులోని అనేక అంశాలు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్‌ 31, 31(C) లను సవరించారు.
* ఆర్టికల్స్‌ 31(D), 32(A)లను ప్రాథమిక హక్కులకు చేర్చారు.
* ఆదేశిక సూత్రాలను అమలుచేస్తున్న సందర్భంలో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని నిర్దేశించారు. దీని ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యాన్ని కల్పించారు. న్యాయస్థానాలకు ఉన్న ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని తొలగించారు.


43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977
* 1977లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1978, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్‌ 31(D), 32(A) లను రాజ్యాంగం నుంచి తొలగించారు.
* న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని పునరుద్ధరించారు.


44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులోని అనేక అంశాలు 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* ఆర్టికల్,  19(1)(f) ను స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు నుంచి తొలగించారు.
* ఆస్తిహక్కును వివరించే ఆర్టికల్‌ 31ని తొలగించారు.
* ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, దీన్ని ఆర్టికల్‌  300(A) లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22ను సవరించి, నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి:
1. సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. 
2. సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే అధ్యక్ష పదవిలో నియమించాలి. సభ్యులుగా పదవిలో ఉన్న లేదా పదవీవిరమణ చేసిన జడ్జిలు ఉండొచ్చు.
3. పార్లమెంట్‌ రూపొందించిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే, ఏ వ్యక్తినీ ఎక్కువ రోజులు నిర్బంధించకూడదు. ఎవరైనా వ్యక్తిని 2 నెలలకు మించి నివారక నిర్బంధ చట్టం ప్రకారం అరెస్టు చేయాలనుకుంటే సలహాసంఘం అనుమతి తప్పనిసరి.


77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1995, జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 16ను సవరించి, ఆర్టికల్‌ 16(4)  ను రాజ్యాంగానికి చేర్చి ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.


86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
* 2002లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2002 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21ని సవరించి, 21(A) చేర్చారు. దీని ద్వారా 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలందరికీ ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు’ను నిర్దేశించారు.


93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2006 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 15ని సవరించి, ఆర్టికల్‌ 15(5)ను కొత్తగా చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించారు.

 

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2012 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19ని సవరించి, ఆర్టికల్‌ 19(1)(C) లో “Co-operative societies”  అనే పదాన్ని చేర్చి, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌