• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు - భూపాతాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూకంపాలు అతి తీవ్రంగా సంభవించే జోన్ -V లో ఉన్న ప్రాంతం ఏది? (ఏఎస్‌వో - 2017)
జ: షిల్లాంగ్

 

2. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత? (గ్రూప్ - 4, 2012)
జ: 8 శాతం

 

3. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం? (గ్రూప్ - 1, 2017, ఏపీ)
జ: భూపటంలో పలకలు ఢీకొట్టడం

 

4. భూకంప సమయంలో ఏ నేల ఎక్కువగా ప్రకంపిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ - 2017)
జ: మెత్తటి నేల

 

5. కొండ చరియలు తరచుగా ఏ రాష్ట్రంలో విరిగి పడతాయి? (గ్రూప్ - 2, 2016)
జ: ఉత్తరాఖండ్

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రాదేశిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంప దుర్బలత్వం ఉంది?
జ: 59%

 

2. ఉరుములు, మెరుపులను గుర్తించే సాధనం?
జ: లైట్నింగ్ డిటెక్టర్

 

3. దిల్లీ, హైదరాబాద్‌లు ఏ భూకంప జోన్‌లలో ఉన్నాయి?
జ: జోన్ - 4, 2

 

4. కిందివాటిలో దేన్ని నియంత్రించడానికి 'లాండ్ స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి'ని ఉపయోగిస్తారు?
1) భూకంపాలు       2) కొండచరియలు విరిగిపడటం      
3) హిమపాతాలు      4) సహజ అటవీ కార్చిచ్చు
జ: 2 (కొండచరియలు విరిగిపడటం)

 

5. హిమలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతాలు ఎక్కడ సంభవిస్తాయి?
1) జమ్మూకశ్మీర్ 2) హిమాచల్‌ ప్రదేశ్  3) ఉత్తరాఖండ్ 4) అన్నీ
జ: 4 (అన్నీ)                                                              

Posted Date : 29-01-2021

చక్రవాతాలు - సునామీ

  ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.


చక్రవాతం


చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.


చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం


సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  


ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0° - 23  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.


సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35° - 66  ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.


సైక్లోన్ మండలాలు


ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.


టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.


తుపాన్


భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.


ఇటీవల ఏర్పడిన తుపాన్లు


* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.


సునామీ


  సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.


కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.

వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.


విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.


భారతదేశంలో సునామీ


మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.
* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
* 1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 08-07-2023

విపత్తు నిర్వహణ చట్టం - 2005

1. పారిశ్రామిక రసాయన విపత్తులు ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి?
జ: పర్యావరణ, అటవీ మంత్రి
2. ఆసియా విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎక్కడ ఉంది?
జ: బ్యాంకాక్
3. NDRF 10వ బెటాలియన్ ఎక్కడ ఉంది?
జ: విజయవాడ
4. విపత్తుల్లో జిల్లా ప్రణాళిక విపత్తు అభివృద్ధి స్థాయి
జ: L1
5. 2015, సెప్టెంబరు 25న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG)ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూయార్క్
6. 2015 - 2030 వరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విపత్తు కుదింపులో ఎన్ని లక్ష్యాలను పేర్కొంది?
జ: 14

7. కిందివారిలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో (NDMA) సభ్యులు కానివారు?
1) జె.సి. పంత్                 2) డి.ఎన్. శర్మ
3) ఎన్.సి మర్వా             4) కమల్ కిశోర్
జ: 1 (జె.సి. పంత్)
8. NRSA భూతల కేంద్రం (ఎర్త్ స్టేషన్) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్
9. ఇటీవల 2015 అంతర్జాతీయ (UNO) విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగింది?
జ: జపాన్ - సెండాయ్
10. ఇటీవల విపత్తు నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన NDRF దళం
జ: SSB
11. జాతీయ నిర్వహణ విపత్తు కమిటీ ఛైర్మన్
జ: హోంశాఖ కార్యదర్శి
12. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్
జ: క్యాబినేట్ కార్యదర్శి

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఎన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి? (2011, గ్రూప్ 1)
జ: 25
2. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)
జ: ప్రధానమంత్రి
3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)
జ: హోంమంత్రి
4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)
జ: 2016, జూన్ 1
5. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)
జ: కాఠ్‌మాండూ
6. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)
జ: నాగ్‌పుర్
7. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
జ: 2005, డిసెంబరు 23


 

Posted Date : 29-01-2021

కొండచరియలు విరిగిపడటం

1. కొండచరియలు విరిగిపడటంతో మనదేశంలోని ఏ జాతీయ రహదారులు తరుచుగా దెబ్బతింటున్నాయి?
జ: 1ఎ, 1బి


2. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంస్థ కొండచరియలు విరిగిపడటంపై పరిశోధన నిర్వహించింది?
జ: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా


3. ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి కలిగేవైపరీత్యాల్లో 30 శాతం భారతదేశంలోని ఏ ప్రాంతంలో  సంభవిస్తున్నాయని అంచనా?
జ: హిమాలయాలు


4. మనదేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం ఎంత శాతంగా ఉంది?
జ: 15


5. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలకు, పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టం-
జ: ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి;ప్రాంత స్వరూపం మారిపోతుంది;రోడ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి.


6. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కొండచరియలు తరచుగా విరిగిపడుతుంటాయి?
జ: హిమాలయాలు,పశ్చిమ కనుమలు,నీలగిరి కొండలు


7. మనరాష్ట్రంలో ఏ నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూండటంతో కొండచరియలు విరిగిపడి నష్టం వాటిల్లే ప్రమాదముంది?
జ: విజయవాడ, విశాఖపట్టణం


8. కొండచరియలు విరిగి పడటానికి కారణం-
జ: కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం,నేల క్రమక్షయానికి గురవడం,భూకంపాలు రావడం


9. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆర్గనైజేషన్ కొండచరియలు విరిగిపడటాన్ని గుర్తించడానికి ఏ ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది?
జ: హరిద్వార్


10. కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన ప్రాంతాల పటాలను రూపొందిస్తున్న పరిశోధనా సంస్థ ఏది?
జ: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్

Posted Date : 27-01-2021

విప‌త్తులు - ర‌కాలు

  విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌భాషకు చెందింది. Desaster అనే ఫ్రెంచ్ పదం నుంచి Disaster అనే ఆంగ్ల పదం వచ్చింది. దీనికి 'చెడ్డ నక్షత్రం (Bad star)'అని అర్థం.
పర్యావరణం, సమాజం, సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి, సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని 'విపత్తుగా' పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల (Natural Hazards) వల్ల అధిక మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలుంటాయి. జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు. ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability) ఉన్నప్పుడు, వైపరీత్యాలను ఎదుర్కొనే ముందస్తు సమర్థ చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది.
విపత్తు సందర్భంలో ప్రజలు ప్రమాదకర లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఒక ప్రాంత ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability), వయసు, పేదరికం, నిరక్ష్యరాస్యత, సరైన శిక్షణ లేకపోవడం, పర్యావరణ క్షీణత, నియంత్రించలేని అభివృద్ధి, సరైన వసతులు లేకపోవడం, ప్రమాదకర ప్రదేశాలు, నివాసాలు, ఆర్థికంగా పటిష్టంగా లేకపోవడం, పట్టణీకరణం, జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.  


  వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి, ఆర్థిక, ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు. ఉదాహరణకు ప్రాణులు, ఆవాసాలులేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే, దాన్ని విపత్తుగా భావించలేం.
వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.


అవి:


1) సహజ వైపరీత్యాలు (Natural Hazards)


2) మానవకారక వైపరీత్యాలు (Man made Hazards).


సహజ వైపరీత్యాలు: ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. తుపానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరవు, చీడపీడలు ఎక్కువ కావడం లాంటివాటిని సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


మానవకారక వైపరీత్యాలు: సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం; ఆనకట్ట కూలిపోవడం (Dam Failure); యుద్ధాలు; పరిశ్రమల నుంచి విషవాయువులు, హానికర పదార్థాలు వెలువడటం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి.
వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా కిందివిధంగా విభజించవచ్చు.


1) భౌగోళిక సంబంధ వైపరీత్యాలు (Geological Hazards): భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, గనుల్లో మంటలు రావడం, ఆనకట్ట బద్దలు కావడం, కొండచరియలు విరిగిపడటం (Land side) లాంటివాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు.


2) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు (Water & Climatic Hazards): తుపానులు, టోర్నడోలు, హరికేన్లు, వరదలు, కరవు, వేడి గాలులు, మంచు చరియలు విరిగిపడటం(Snow Avalanche), సముద్రం వల్ల కలిగే కోత (Sea erosion), వడగళ్ల వాన, గాలితో కూడిన వర్షం(Cloud burst) లాంటివాటిని నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు (Environmental Hazards): పర్యా వరణ కాలుష్యం, ఎడారి విస్తరించడం (Desertification), చీడపీడల సంక్రమణ (Pest Infection), అడవులు నశించడం లాంటివి వీటికి ఉదాహరణ.


4) జీవన సంబంధ విపత్తులు: చీడపీడలు వ్యాపించడం (Pest Attacks), ఆహారం కలుషితమవడం, మానవులు, జంతువుల నుంచి అంటు వ్యాధులు (Human/ Animal Epidemics) వ్యాపించడం లాంటివి జీవసంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ.


5) రసాయన, పారిశ్రామిక వైపరీత్యాలు: పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం, పారిశ్రామిక దుర్ఘటనలు, చమురు ఎక్కువగా ఒలికిపోవడం(Oil Spils), నూనెలవల్ల మంటలు చెలరేగడం, అణు దుర్ఘటనలు మొదలైనవాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.


6) ప్రమాద సంబంధ వైపరీత్యాలు: రైలు, విమాన, వాహన, పడవ సంబంధ ప్రమాదాలు, జనావాసాల మధ్య మంటలు చెలరేగడం, ఒకేసారి అనేకచోట్ల బాంబులు పేలడం, అడవుల్లో కారుచిచ్చు, భవంతులు కూలిపోవడం, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, పండగల సందర్భంలో జరిగే ప్రమాదాలు, గనుల్లోకి వరదరావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ. కొన్నిసార్లు సహజ, మానవ సంబంధ కారణాలు కలవడం వల్ల కూడా వైపరీత్యాలు రావచ్చు.
ఇలాంటి వాటిని సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio-Natural Hazards) అంటారు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం వల్ల వరదలు రావడం. కొన్నిసార్లు కరవు, మంటలు చెలరేగడం లాంటివి సహజ, మానవ కారణాలు రెండింటి ఫలితంగా సంభవించవచ్చు.

Posted Date : 08-07-2023

విపత్తులు - రకాలు 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. విపత్తు (Disaster) అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
జ: ఫ్రెంచ్
2. విపత్తు అనే పదానికి ఫ్రెంచ్ భాషలో అర్థం ఏమిటి?
జ: చెడ్డ నక్షత్రం
3. దేనికి తీవ్ర నష్టం వస్తే, ఆ సంఘటనను విపత్తుగా చెప్పవచ్చు?
జ: పర్యావరణం, సమాజం, వస్తువులు, ఆర్థిక రంగం
4. విపత్తు వేటి వల్ల వస్తుంది?
జ: వైపరీత్యం , ప్రజలు బలహీన స్థితిలో ఉండటం (Vulnerability), తీవ్రతను తగ్గించే చర్యలు లేకపోవడం
5. విపత్తుల వల్ల ప్రజలకు ఏవిధమైన నష్టాలు వస్తాయి?
జ: ఆస్తినష్టం, ప్రాణనష్టం
6. వైపరీత్యాన్ని ఎప్పుడు విపత్తుగా పేర్కొంటారు?
జ: దాని వల్ల ప్రజలకు ఎక్కువ హాని కలిగినప్పుడు

7. విపత్తుకు ఒక ఉదాహరణ  తెలపండి?
జ: కార్చిచ్చు వల్ల అడవి తీవ్రంగా నష్టపోవడం
8. నీరు, వాతావరణ సంబంధిత వైపరీత్యానికి ఉదాహరణ?
జ: వరదలు, టోర్నడోలు, హరికేన్లు, కరవు
9. అడవుల్లో కార్చిచ్చు రావడం, గనుల్లోకి వరద రావడం అనేవి ఎలాంటి వైపరీత్యాలకు ఉదాహరణ?
జ: ప్రమాదానికి సంబంధించిన(Accident Related)
10. 26 జనవరి 2001న భారతదేశంలోని ఏ ప్రాంతంలో భూకంపం సంభవించి, పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు?
జ: భుజ్ (గుజరాత్)
11. 19 నవంబరు 1977లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన విపత్తు వల్ల 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు?
జ: తుపాను
12. మానవకారణ వైపరీత్యాలకి ఉదాహరణ ఏది?
జ: విష పదార్థాలు వెలువడటం, కాలుష్యం, యుద్ధాలు
13. విపత్తు నిర్వహణ (Disaster Management) చక్రంలో  ఏ అంశాలు ఇమిడి ఉంటాయి?
జ: విపత్తుకు ముందు తీసుకునే చర్యలు, విపత్తు సమయంలో తీసుకునే చర్యలు, విపత్తు తర్వాత తీసుకునే చర్యలు
14. భారతదేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా 8.5 తీవ్రత (mangitude) తో ఏ ప్రాంతంలో భూకంపం సంభవించింది?
జ: అరుణాచల్‌ప్రదేశ్ - చైనా సరిహద్దు

15. కేంద్ర హోంశాఖ అధీనంలో ఏ విపత్తుకు సంబంధించిన నిర్వహణ కార్యకలాపాలుంటాయి?

జ: జీవసంబంధ విపత్తులు, రసాయనిక సంబంధ విపత్తులు, న్యూక్లియర్ (అణు) సంబంధ విపత్తులు
16. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ అధీనంలో ఏ రకమైన విపత్తు నిర్వహణ కార్యకలాపాలుంటాయి?
జ: కరవు
17. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలకు ఏ కారణాల వల్ల హానికర లేదా బలహీన (Vulnerability) పరిస్థితులు ఉంటాయి?
జ: పేదరికం, తక్కువ సంపాదన, ప్రమాదకర ప్రాంతాలు
18. భౌగోళిక సంబంధ (Geological) వైపరీత్యానికి ఉదాహరణ-
జ: భూకంపం, సునామీ, కొండచరియలు విరిగిపడటం
19. మురికినీటి కాల్వల్లో చెత్తపేరుకుపోవడం లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల వరదలు రావడం లాంటివి ఏ రకమైన వైపరీత్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio - natural hazards)

Posted Date : 29-01-2021

శిక్షణ సంస్థలు... బెటాలియన్‌లు... ప్రదేశాలు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పారా మిలిటరీ దళాలకు చెందిన నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. అవి
1. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA) - హైదరాబాద్
2. బేసిక్ ట్రెయినింగ్ సెంటర్ (BTC) - భాను (చండీగఢ్)
3. సెంట్రల్ ట్రెయినింగ్ కాలేజ్ (CTC) - II - కోయంబత్తూరు
4. BSF ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ (BIDR) టికాన్‌పూర్ (గ్వాలియర్)

బెటాలియన్ ప్రదేశం
1. మొదటి బెటాలియన్ (BSF కు చెందింది) గౌహతి (అసోం)
2. రెండో బెటాలియన్ (BSF) బరాసట్ (కోల్‌కత)
3. మూడో బెటాలియన్ (CISF) ముండలి (ఒడిశా)
4. నాలుగో బెటాలియన్ (CISF) అరక్కోనం (చెన్నై)
5. అయిదో బెటాలియన్ (CRPF) పుణె (మహారాష్ట్ర)
6. ఆరో బెటాలియన్ (CRPF) గాంధీనగర్ (గుజరాత్)
7. ఏడో బెటాలియన్ (ITBP) భటిండా (పంజాబ్)
8. ఎనిమిదో బెటాలియన్ (ITBP) గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)

* ఇవి కాకుండా భారత ప్రభుత్వం 2010లో బీహార్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, విజయవాడలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల నుంచి ఒక్కొక్క బెటాలియన్ అదనంగా పెంచాలని నిర్ణయించింది. సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)


విపత్తు నిర్వహణ చట్టం (Disaster Management Act) - 2005 లోని సెక్షన్ 44ను అనుసరించి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ పారా మిలటరీ దళాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లలో ఒక్కొక్క దాన్నుంచి 2 బెటాలియన్‌లను అంటే మొత్తం 8 బెటాలియన్‌లను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌గా రూపొందించారు. ఈ ఎనిమిది బెటాలియన్‌లు ఒక్కొక్కదాంట్లో సుమారు 1000 మంది సిబ్బంది ఉంటారు. ఇవి విపత్తు లేదా విపత్తు లాంటి సందర్భాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. వీరిలో కొందరికి సహజ, మరికొందరికి మానవకారక విపత్తుల నిర్వహణలో పాలుపంచుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Posted Date : 09-07-2023

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

మాదిరి ప్రశ్నలు

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)
2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం
3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
జ: a, b సరైనవి
4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్

5. కిందివాటిలో స్వయం పోషకాలు?
    1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
జ: 3 (ఉత్పత్తిదారులు)
6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్
7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్
8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు
2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు
3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే

4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి
5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్

Posted Date : 29-01-2021

చక్రవాతాలు - సునామీ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి

 

2. కిందివాటిని జతపరచండి.
ప్రాంతాలు                              
సైక్లోన్

a) జపాన్, చైనా                      i) బ్లిజార్డ్స్

b) ఆస్ట్రేలియా                       ii) హరికేన్లు

c) వెస్టిండీస్                        iii) విల్లీ - విల్లీ

d) అంటార్కిటికా                    iv) టైఫూన్లు

                                    v) టోర్నడోలు

జ: a-iv, b-iii, c-ii, d-i

3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్

 

4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%

 

5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
1) పగలు   2) రాత్రి  3) పగలు, రాత్రి 4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)

 

6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు

 

7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా

 

8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?(గ్రూప్-4, 2012)
జ: జపాన్

 

2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది? (గ్రూప్ - 4, 2012)
జ: 5700 కి.మీ.

 

3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత?(పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట

 

4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత?(హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట

 

5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్‌వో - 2017, ఏపీ)
1) ప్రాణ నష్టంలేని తుపాన్              
2) ఆర్థిక నష్టంలేని తుపాన్
3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్    
4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)

 

6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం?(ఏఎస్‌వో-2017)
జ: తీరప్రాంత రాడార్‌లు

 

7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్?(డీఎల్-2017)
జ: హుద్‌హుద్

 

8. జపాన్ భాషలో సునామీ అంటే?(డిప్యూటీ సర్వేయర్-2017)
జ: హర్బర్ వేవ్ 

Posted Date : 29-01-2021

తుపాను 

1. 'కత్రినా' అనే తుపాను (హరికేన్) వల్ల ఏ దేశంలో సుమారు 1836 మంది మరణించారు?
జ: అమెరికా


2. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరేంటి?
జ: నిషా


3. 1999 లో ఏ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ వల్ల 8913 మందికి పైగా ప్రజలు మరణించారు?
జ: ఒరిస్సా


4. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో 5,00,000 మంది మరణానికి కారణమైన భోలా తుపాను ఎప్పుడు సంభవించింది?
జ: 1970


5. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం ఏమిటి?
జ: వేగంగా వీచే గాలి వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు గురవుతాయి; రోడ్లు, భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.


6. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలేవి?
జ: గాలి అధిక వేగంతో వీస్తుంది; వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది.


7. భారతదేశంలోని ఏ సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి?
జ: బంగాళాఖాతం


8. అరేబియా తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాలకు తుపాను ముప్పు ఎక్కువ?
జ: గుజరాత్, మహారాష్ట్ర


9. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రానికి తుపాను వల్ల కలిగే నష్టం ఎక్కువ?
జ: ఒరిస్సా


10. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం -
జ: 8.5%

Posted Date : 27-01-2021

వరదలు 

1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ: 1972


2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు?
జ: పుణే


3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? 
జ: బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ,  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ


4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే  ఆ ప్రవాహాన్ని ఏమంటారు?
జ: తక్కువస్థాయి వరద


5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? 
జ: కోసి


6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది?
జ: 8%

7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ?
జ: జూన్-సెప్టెంబరు


8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు?
జ: 1977


9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి?
జ: గంగా-బ్రహ్మపుత్ర


10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- 
జ: అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం


11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి?
జ: డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం


12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి?
జ: అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్


13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
జ: గంగానది


14. మధ్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి?
జ: గోదావరి, కృష్ణా, కావేరి

15. తరచూ వరదలు సంభవించే ప్రాంతాల్లో వరదలకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
జవాబు: 1) దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాన్ని గుర్తించాలి  2) మంచినీరు, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలి  3) ముఖ్యమైన కాగితాలను నీటిలో తడవకుండా భద్రపరచాలి


16. వరద సంభవించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
జవాబు: 1) సురక్షితమైన నీటినే తాగాలి  2) ఆహార పదార్థాలను నీటిలో తడవకుండా చూడాలి  3) కలరా, డయేరియా లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తపడాలి


17. వరద వల్ల నేల క్రమక్షయం జరిగి జలాశయాల్లో, పంటపొలాల్లో పూడిక పెరుగుతుంది. ఇసుక మేటలు వేస్తుంది. దీన్ని ఏవిధంగా నివారించవచ్చు?
జవాబు: అటవీ, కొండ ప్రాంతాల్లో చెట్లు నాటడం


18. వరదల వల్ల కలిగే నష్టం-
జవాబు:   1) నేల క్రమక్షయానికి గురవుతుంది, సారాన్ని కోల్పోతుంది  2) రోడ్లు, భవనాలు, రైల్వేట్రాక్‌లు దెబ్బతింటాయి  3) ఆస్తి, ప్రాణ నష్టాలు

19. వరద రావడాన్ని ముందుగానే హెచ్చరించే కేంద్రాలు భారతదేశంలో ఏ నది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి? 
జవాబు: గంగానది


20. వరదల నివారణకు చేపట్టాల్సిన చర్యలేవి? 
జవాబు: 1) వరదనీటిని కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడం  2) నేల క్రమక్షయానికి గురికాకుండా చూడటం  3) పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచడం


21. భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అదనంగా ఎన్ని మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు?
జవాబు: 21.8


22. 'నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌'ను ఎప్పుడు ప్రారంభించారు? 
జవాబు: 1954


23. భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారం అందించే సంస్థ 'సెంట్రల్ వాటర్ కమిషన్'. దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 
జవాబు: ఢిల్లీ

 

24. ఏ సంస్థలు వివిధ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహించి హెచ్చరిక కేంద్రాలకు అందిస్తున్నాయి?
జవాబు: సెంట్రల్ వాటర్ కమిషన్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ 


25. ఆంధ్రప్రదేశ్‌లో ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ముందస్తు హెచ్చరికా కేంద్రాలు అధికంగా ఉన్నాయి? 
జవాబు: గోదావరి


26. భారతదేశంలో వరదల నియంత్రణ, నివారణ, సహాయ చర్యల కోసం కృషి చేస్తున్న సంస్థలు-
జవాబు:  1) సెంట్రల్ వాటర్ కమిషన్  2) ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్  3) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ 


27. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో 'ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్' చేపట్టారు. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు?
జవాబు: జలవనరుల  


28. కాల్వలు పూడిక తీయడం; నేల క్రమక్షయానికి, సముద్రం కోతకు గురికాకుండా చూడటం లాంటి వరద నియంత్రణా చర్యలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఏ పథకంలో భాగంగా నిధులు సమకూరుస్తోంది? 
జవాబు: ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్


29. పశ్చిమబెంగాల్‌లోని గంగానది పరీవాహక ప్రాంతం, ఫరక్కా బ్యారేజి ఎగువ, దిగువ ప్రాంతాల్లో జరుగుతున్న నేల క్రమక్షయంపై అధ్యయనం చేసి, రిపోర్టు సమర్పించిన కమిటీ ఏది? 
జవాబు: ప్రీతమ్‌సింగ్ కమిటీ


30. నరేష్‌చంద్ర కమిటీ దేనికి సంబంధించింది? 
జవాబు: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు 


31. భారతదేశంలో నదుల్లో పూడికకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేయడానికి జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? 
జవాబు: బి.కె. మిట్టల్ కమిటీ


32. ఎం.కె.శర్మ సమర్పించిన రిపోర్ట్ దేనికి సంబంధించింది?
జవాబు: ఉత్తర బెంగాల్‌లో వరద, నేల క్రమక్షయం

Posted Date : 29-01-2021

విపత్తు నిర్వహణ చట్టం - 2005

2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' అనే పేరుతో 2005, డిసెంబరు 23న పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ చట్టంపై 2006, జనవరి 9న రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2006, సెప్టెంబరు 27న ఛైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన 'జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ - NDMA' లాంఛనంగా అమల్లోకి వచ్చింది.
* జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొదటి ఛైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, వైస్ ఛైర్మన్ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి. వీరు 2014లో రాజీనామా చేశారు.
* 2014 డిసెంబరులో ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులను తగ్గించింది. ప్రస్తుతం ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉన్నారు.
* ప్రస్తుత NDMA ఛైర్మన్ నరేంద్ర మోదీ; సభ్యులు కమల్ కిశోర్, డి.ఎన్. శర్మ, ఎన్.సి. మర్వా, ఆర్.కె. జైన్.

* విపత్తు నిర్వహణ చట్టాన్ని 2009, అక్టోబరు 22న కేంద్రమంత్రి మండలి ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేసింది. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ విధానం (నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - NPDM) అంటారు.
* జాతీయ విపత్తు మొదటి సమావేశాన్ని 2006, నవంబరు 29న; రెండో సమావేశాన్ని 2009, నవంబరు 6న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విపత్తు పరిహారాన్ని 2015, ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒక వ్యక్తి విపత్తు వల్ల మరణిస్తే రూ.4 లక్షలు, 60% గాయాలైతే రూ.2 లక్షలు నష్ట పరిహారంగా ఇస్తారు.


జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ - NDMP):


2016, జూన్ 1న దిల్లీలో నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్ర‌ణాళిక‌ను కింది స‌ద‌స్సుల ల‌క్ష్యాల‌కు అనుగుణంగా రూపొందించారు.
a) 2015 మార్చి - జపాన్ (సెండాయ్) - అంతర్జాతీయ విపత్తు కుదింపు సదస్సు (DRR - Disaster Risk Reduction)
b) 2015 సెప్టెంబరు - అమెరికా (న్యూయార్క్) - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG - Sustainable Development Goals)
c) 2015 డిసెంబరు - ఫ్రాన్స్ (పారిస్) - వాతావరణ మార్పు సదస్సుల (COP - 21)
ఈ ప్రణాళిక 2015 - 2030 వరకు స్పల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మొత్తం 14 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. స్పల్పకాలిక 5 సంవత్సరాలు, మధ్యకాలిక 10 సంవత్సరాలు, దీర్ఘకాలిక 15 సంవత్సరాలుగా నిర్ణయించారు.       

* 2005 విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 11 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) దేశం మొత్తానికి చట్ట/న్యాయ బద్ధమైంది. సెక్షన్ 37 ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది వర్తిస్తుంది.


విపత్తు నిర్వహణ స్థాయి (Levels of Disasters):
విపత్తు నిర్వహణ అత్యున్నతాధికారి కమిటీ (HPC) - 2001 నివేదిక ప్రకారం 2016లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలో విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి వివిధ కేటగిరీలుగా విభజించారు. ఒక సాధారణ కేటగిరీని కూడా రూపొందించారు.
స్థాయి - 1 (L1) - జిల్లా స్థాయిలో విపత్తు ప్రణాళికలను నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 2 (L2) - రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 3 (L3) - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకే సమయంలో దీర్ఘకాలిక విపత్తు సంభవించినప్పుడు
స్థాయి - 0 (L0) - ఒక ప్రాంతం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు
* జాతీయ విపత్తు నిర్వహణ కో ఆర్డినేటర్ - కేంద్ర హోంమంత్రి.

జాతీయ విపత్తు నిర్వహణ విధాన నిర్ణయ కమిటీలు (National Level Decision Making bodies for DM) 

విపత్తు ఉపశమనం/నోడల్ మంత్రిత్వ నిర్వహణ (Nodel Ministry for Management/Mitigation of Disasters)  


జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (NDRF)


2005 విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది హోంమత్రి నిర్వహణలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ (ఐపీఎస్). ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్‌లో 1149 మంది ఉంటారు. ఈ బెటాలియన్లకు ప్రకృతి, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ విపత్తులపై బాధ్యత ఉంటుంది. ఇందులో BSF-3, ITBP-2, CRPF-3, CISF-2, SSB-2 ఉంటాయి. 

Posted Date : 08-07-2023

వరదలు 

నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.


  ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.


వరదలు రావడానికి కారణాలు


* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.
* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.
* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.
* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.
వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.


బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం


  బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.


గంగానదీ పరీవాహక ప్రాంతం 


  గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.


ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం 


  బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.


మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు


  నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి.
ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.


వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


  నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.
* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.
* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.
* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.
* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.


వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.
* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.
* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.


వరదలు


  ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు అనూహ్యంగా వరదల ముంపునకు గురై తీవ్ర ఇబ్బందుల పాలవుతాం. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను చూద్దాం...
* వరదలు సంభవించే కాలంలో తరచుగా రేడియో, టీవీ హెచ్చరికలను వింటూ ఉండాలి. ప్రభుత్వం లేదా వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
* ప్రాంతీయ అధికారులు చేసే హెచ్చరికలను గమనిస్తూ, వాటికి అనుగుణంగా స్పందించాలి.
* ఆహార పదార్థాలు, నీరు, దుస్తుల లాంటివి దగ్గరగా ఉంచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సామగ్రి, పశువులు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
* మన నివాస ప్రాంతాల్లో కొద్ది గంటల్లో వరద ముంపు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
* సురక్షిత, పునరావాస కేంద్రాలకు వెళ్లేటప్పుడు తమ వెంట విలువైన వస్తువులు, పత్రాలు, అత్యవసర మందులు, దుస్తుల లాంటివి తీసుకు వెళ్లాలి.
* వస్తువులను నేలపై కాకుండా ఎత్తయిన ప్రదేశంలో ఉంచాలి. ఇంటికి వచ్చే విద్యుత్ కనెక్షన్లను తీసేయాలి.
* తెలియని ప్రదేశంలో నిల్వ ఉండే నీటిలోకి వెళ్లకూడదు.


వరదల వల్ల నష్టాలు


* వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఇళ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల అది వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. పంటపొలాలు మునిగిపోయి అధిక నష్టం కలుగుతుంది.
* వరదల వల్ల అనేకమంది నిరాశ్రయులవుతారు. పశువులు మృత్యువాత పడతాయి. తాగునీరు కలుషితమవుతుంది. తాగడానికి మంచినీరు దొరకదు.
కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలుతాయి.
* నేల క్రమక్షయానికి గురై సారవంతం తగ్గుతుంది. జలాశయాల్లో పూడిక పెరుగుతుంది. అధిక వరదల వల్ల రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతింటాయి. దీని వల్ల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నాశనమవుతాయి. భవనాలు దెబ్బతినడం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది.
* అటవీ ప్రాంతాల్లో వరదల వల్ల అక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
* వరదల వల్ల మహానగరాల్లో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కొండచరియలు విరిగిపడతాయి.
* ఆకస్మికంగా సంభవించే వరదల్లో కొందరు కొట్టుకుపోయి, మరణాలు సంభవిస్తాయి. పాత భవనాలు కూలిపోవడం లాంటి వాటి వల్ల కూడా ప్రాణనష్టం జరుగుతుంది. సముద్రతీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వలలు, పడవలకు నష్టం ఉంటుంది.


భారతదేశంలో సంభవించిన వరదలు

సంవత్సరం సంభవించిన ప్రాంతాలు మరణాలు
1980 ఉత్తర్‌ప్రదేశ్, బీహర్, గుజరాత్, కేరళ, హర్యానా 1600
1989 మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 1994
1591 అసోం, అరుణాచల్‌ప్రదేశ్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా,కేరళ,గుజరాత్ 2001
1995 బీహార్, హర్యానా,జమ్మూకాశ్మీర్,పంజాబ్,  ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర 1479
1997 ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్,అసోం,బీహార్, గుజరాత్, హిమచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్,
రాజస్థాన్, పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్
1442
1998 అసోం,అరుణాచల్‌ప్రదేశ్, బీహర్, కేరళ, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ 1811
2000 గుజరాత్, ఆంధ్రప్రదేశ్,అసోం,అరుణాచల్‌ప్రదేశ్,  బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ 1290
2005 మహారాష్ట్ర 1094
2008 కోసి(బీహార్) 527


నివారణ చర్యలు


* నదుల ఎగువ ప్రాంతాల్లో అడవులను పెంచాలి. దీనివల్ల వర్షపు నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయి వరదలు రాకుండా ఉంటాయి.
* పోడు వ్యవసాయాన్ని తగ్గించాలి, నీటి ప్రవాహానికి అడ్డంకులు కల్పించకూడదు.
* వరదనీటిని వరద కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించాలి.
* వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నదులపై ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నిర్మించాలి.
* ముందస్తు హెచ్చరిక కేంద్రాల ద్వారా ప్రజలకు వరద ముప్పు గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం వరదల సమయంలో తక్షణం స్పందించి సహాయ చర్యలు చేపట్టాలి.
* లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలి. అక్కడ వారికి ఆవాసాలు ఏర్పరచాలి.
* ఏటా తరచుగా వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి శాశ్వత నివారణ కార్యక్రమాలను చేపట్టాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలతో మ్యాప్‌లను గీయాలి.
* పట్టణాల్లో డ్రైనేజి వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలి. అవసరమైతే మెరుగుపరచాలి.
* పెద్ద ఆనకట్టలతోపాటు చిన్న, చిన్న చెక్‌డ్యామ్‌లు, కాంటూర్ కందకాల లాంటివాటిని ఏర్పరచి నీటిని నియంత్రించవచ్చు.


భారతదేశంలో వరద నియంత్రణా చర్యలు


* ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి. రుతుపవన వర్షపాతం, నదులు తీసుకువచ్చే మట్టి, పర్వత ప్రాంతాల్లో కోతకు గురికావడం లాంటి కారణాల వల్ల భారతదేశంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం వరద నివారణా చర్యలను చేపడుతోంది. పదో పంచవర్ష ప్రణాళికా కాలం వరకు వరదలు సంభవించే అవకాశమున్న 45.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు. 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 2.18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అదనంగా రక్షణ చర్యలు చేపట్టారు.


1954లో 'నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌'ను ప్రారంభించిన తర్వాత వరద నియంత్రణా చర్యలను వేగవంతం చేశారు. 'సెంట్రల్ వాటర్ కమిషన్' (CWC) అనే సంస్థ భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. 


దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద సమాచారాన్ని సేకరించి, ఆయా ప్రదేశాల్లోని హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తుంది. ఈ కేంద్రాలు సమాచారాన్ని స్థానిక ప్రజలకు తెలియజేస్తాయి.


వరద నష్టం తగ్గించడానికి చేపడుతోన్న చర్యలు


* వరదల సమయంలో తగిన చర్యలు చేపట్టడానికి 'నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' (NDRF)కు చెందిన బెటాలియన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీరికి తగిన శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పరికరాలను సమకూర్చారు.
* వరదలు సంభవించిన ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రజలకు అత్యవసర వైద్య సహాయాన్ని, ఔషధాలను అందిస్తారు.
* నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల నదుల్లో నీటిమట్టాన్ని నియంత్రించగలుగుతున్నాం. ఫలితంగా వరద ముప్పు తగ్గుతోంది. వీటిలో నిల్వ ఉన్న నీటిని తిరిగి వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీరు, పరిశ్రమలకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఆనకట్టల భద్రతను కూడా పర్యవేక్షిస్తోంది.
* వరదల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి, వరదల నివారణకు ఆనకట్టల్లో పూడిక ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాల్వల్లో నీరు సాఫీగా ప్రవహించేవిధంగా చూస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో నేలక్రమక్షయం జరగకుండా అడవులను పెంచుతున్నారు.
* జాతీయ రహదార్లు, వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినకుండా వాటిని ప్రత్యేక పద్ధతిలో నిర్మించడం, వాటి రక్షణ చర్యలు చేపట్టడం, వరదలకు ముందు, తర్వాత వాటిని పరిశీలించడం లాంటి చర్యలు చేపడుతున్నారు.
* వరదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడానికి, వాటిని నివారించడానికి భారత ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక సంస్థలను ఏర్పాటు చేసింది.
* వరదలు సంభవించినప్పుడు ఆ నీటిని మళ్లించడానికి ప్రత్యేక కాల్వలను నిర్మిస్తున్నారు. తరచుగా వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించి వాటి మ్యాపులను గీస్తున్నారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో శాశ్వత వరద నివారణా చర్యలు చేపట్టడమే కాకుండా ముందస్తు హెచ్చరికలను కూడా జారీచేయవచ్చు.
* సెంట్రల్ వాటర్ కమిషన్ (CWE), ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) వారు భారతదేశంలోని 62 నదీ పరీవాహక ప్రాంతాల్లోని 945 ప్రదేశాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహిస్తున్నారు.
దీన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లోని ముందస్తు హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇలాంటి వరద హెచ్చరికల కేంద్రాలు భారతదేశంలో 175 ఉన్నాయి. వీటిలో మన రాష్ట్రంలో గోదావరీ పరీవాహక ప్రాంతంలో 18, కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో 9 ఉన్నాయి.
భారతదేశంలో ఇలాంటి హెచ్చరికల కేంద్రాలు అత్యధికంగా గంగా, దాని ఉపనదుల ప్రాంతాల్లో 87 ఉన్నాయి.
* భారతదేశంలోని కొన్ని నదులు ఇతర దేశాల్లో కూడా ప్రవహిస్తున్నాయి. ఇతర దేశాల సరిహద్దు ప్రాంతాల్లో పుట్టి, మనదేశం ద్వారా ప్రవహించే నదులున్నాయి. భారత్ ఇలాంటి నదుల వల్ల కలిగే వరద నష్టాన్ని నివారించడం కోసం నేపాల్, చైనా, భూటాన్ లాంటి దేశాలతో కలిసి పని చేస్తోంది. వరదల నియంత్రణకు సంబంధించి వివిధ ఒప్పందాలను కుదుర్చుకుంది.
* సామాన్య ప్రజలకు వరదలకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ అంశాన్ని పాఠ్యాభాగాల్లోనూ చేరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల వారికి శిక్షణ ఇస్తున్నారు. వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు వరదల గురించి పరిశోధనలు చేస్తున్నాయి.

Posted Date : 08-07-2023

కరవులు - వరదలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ వరద నియంత్రణ మండలిని (NFCB) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1954

 

2. భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతాన్ని 'కరవు పీడిత' ప్రాంతంగా గుర్తించారు?
జ: 68%

 

3. భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
జ: 5

 

4. ఆకస్మిక వరదలు (Flash Floods) ఎప్పుడు వస్తాయి?
a) ఉరుములు, తుపాన్లు వచ్చినప్పుడు
b) అధిక వర్షం వల్ల నదులు ఉప్పొంగినప్పుడు
జ: a, b సరైనవి

 

5. 'జాతీయ వ్యవసాయ కమిషన్' ప్రకారం మృత్తిక తేమ కోల్పోవడం ఏ రకమైన కరవు?
జ: వ్యవసాయ కరవు

6. భారతదేశంలో ఆకస్మిక వరదలు ఎక్కువగా ఏ నది వల్ల సంభవిస్తుంటాయి?
జ: బ్రహ్మపుత్ర

 

7. 'హాలోజెన్' బిళ్లలను దేనికి ఉపయోగిస్తారు?
జ: నీటిని శుద్ధిచేయడానికి

 

8. వరదలు వస్తున్నప్పుడు భూజల తలాన్ని కొలవడానికి, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగించే సాధనం?
జ: నైలో మీటర్

 

9. ఒక ప్రాంతంలో కరవును ఎంత శాతం వర్షపాతం నమోదైతే చాలా తక్కువ అని (-) గుర్తిస్తారు?
జ: సగటు కంటే 60% నుంచి 99% తక్కువ వర్షం

 

10. ప్రభుత్వం కరవు ప్రభావాన్ని తగ్గించడానికి కింది ఏ పథకాల ద్వారా కృషి చేస్తుంది?
(a) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
(b) భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతల పథకం
జ: a, b సరైనవి

 

11. పట్టణ వరదలు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి?
జ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ

12. భూ ఉపరితలంపై ఎంత మొత్తం నీరు ఉప్పొంగినప్పుడు వరదగా నమోదు చేస్తారు?
జ: 12 అంగుళాలు

 

13. కరవు అనేది?
జ: నిదాన ప్రక్రియ


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. కిందివాటిలో నిదానంగా విస్తరించే విపత్తు? (ఏఎస్ఓ-2017)
1) రసాయనిక                            2) భూకంపం
3) కొండ చర్యలు విరగడం           4) కరవు
జ: 4 (కరవు)

 

2. కిందివాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది? (ఏఎస్ఓ-2017)
1) చెన్నై వరదలు              2) చెన్నై సునామీ
3) కేదార్‌నాథ్ వరద          4) తక్కువ వర్షం
జ: 1 (చెన్నై వరదలు)

 

3. క్షామం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు? (గ్రూప్-4, 2012)
జ: మహిళలు

4. భారతదేశంలో కరవు దేనితో ముడిపడి ఉంది? (పంచాయతీ కార్యదర్శి - 2013)
జ: రుతు పవనాలు

 

5. కిందివాటిలో ఏది కరవు నివారణా చర్య కాదు? (గ్రూప్-2, 2011)
1) చెక్‌డ్యామ్‌ల నిర్మాణం                            2) చెరువులు పూడిక తీయడం 
3) పొలంలో ఇంకుడు గుంత తవ్వడం         4) మొక్కలు నాటడం
జ: 4 (మొక్కలు నాటడం)

 

6. ''విపత్తులన్నీ ఆపదలే, కానీ ఆపదలన్నీ విపత్తులు కావు" ఈ ప్రకటన - (డిప్యూటీ సర్వేయర్-2017)
జ: నిజమైంది

 

7. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రదేశం సుమారు ఎంత శాతం ఉంది? (గ్రూప్-2, 2012)
జ: 12%

 

8. 2016 కరవు నిర్వహణ కరదీపిక ప్రకారం దీర్ఘకాలిక కరవును ఎంత వర్షపాతం ఉంటే ప్రకటిస్తారు? (గ్రూప్-1, 2017)
జ: 750 mm కంటే తక్కువ

Posted Date : 29-01-2021

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

  భూఉపరితలంపై క్రీ.పూ.10 వేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. క్రమానుగతంలో 1750 నాటికి 50 కోట్లు, 1900 నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు ఉంటే ప్రస్తుతం 700 కోట్లకు పెరిగింది. ఇది 2100 సంవత్సరం నాటికి 1000 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఈ విధంగా జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగడంతో అనేక పరిశ్రమలను స్థాపించారు. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.


భూగోళంపై శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు ఆవరణాలు ఉన్నాయి. ఈ ఆవరణాల మధ్య భూఉపరితలంపై అత్యధికంగా జలావరణంలో జీవావరణం ఆవరించి ఉంది. ఇది జంతు, వృక్ష, ప్రాణులను కలిగి ఉంటుంది.


* జీవుల ఆధారంగా జీవావరణాన్ని 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి:

1) ఉత్పత్తిదారులు (Producers)

2) వినియోగదారులు (Consumers)

3) విచ్ఛిన్నకారులు (Decomposers)


ఉత్పత్తిదారులు: కిరణజన్య సంయోగక్రియ (సూర్యరశ్మి, నీరు) ద్వారా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకంగా జీవించే వాటిని ఉత్పత్తిదారులు అంటారు.


ఉదా: మొక్కలు, గడ్డి, లెగ్యుమినేసి జాతులు


వినియోగదారులు: ఉత్పత్తిదారులు తయారుచేసిన వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. ఇవి నాలుగు రకాలు.


1) శాఖాహారులు (Herbivores): ఇవి ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: మిడత, చిమ్మెట, ఉడుత, కుందేలు, జిరాఫీ, పశువులు.


2) మాంసాహారులు (Carnivores): ఇవి శాఖాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: తేలు, పాము, చిరుత, పులి, సింహం.


3) సర్వభక్షకులు (Omnivores): ఇవి శాఖాహార, మాంసాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: ఎలుక, పిల్లి, కుక్క, డేగ, మానవుడు (అతి ప్రధాన సర్వభక్షకుడు).


4) పూతికాహారులు (Detritivores): ఇవి మలిన జీవులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: చెదపురుగులు, చీమలు.


విచ్ఛిన్నకారులు: ఇవి విగత జీవులు (మరణించిన), వ్యర్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంద్రాలు.


ఆవరణ వ్యవస్థ

ఆవరణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఇకాలజీ (Ecology) అంటారు. ఇది గ్రీకు భాషలోని ఓయికస్ (ఇల్లు), లోగోస్ (అధ్యయనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడం అని అర్థం. ఇకాలజీ అనే పదాన్ని మొదట 1866లో జర్మనీకి చెందిన హెర్నెస్ట్ హెకెల్ అనే జీవ శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌లే ఆవరణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చాడు. భౌతిక పరిసరాల్లోని జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు.


పర్యావరణం

పరిసరాల నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. పర్యావరణం 'ఎన్విరాన్' (Environ) అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం మనచుట్టూ ఉన్న ప్రాంతం. మానవుడి జీవనం, మొక్కలు, జంతు, వృక్ష; జీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేసేదే పర్యావరణం.

* పర్యావరణంలో రెండు అణుఘటకాలు ఉంటాయి.

     1) నిర్జీవ అణుఘటకాలు (Abiotic Compounds)

     2) జీవ అణుఘటకాలు (Biotic Compounds)


నిర్జీవ అణుఘటకాలు: ఇవి ప్రకృతి నుంచి ఉద్భవించిన సహజ వనరులు.
ఉదా: గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని.


జీవ అణుఘటకాలు: ఇవి సహజ వనరులపై ఆధారపడతాయి.
ఉదా: వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, శిఖరాగ్ర వినియోగదారులు ఉంటాయి.


జీవావరణ పిరమిడ్

చార్లెస్ హెల్టన్ ఆహార గొలుసు ఆధారంగా జీవావరణ పిరమిడ్‌ను తయారుచేశాడు. దీనిలో కింది నుంచి పైస్థాయికి ఉత్పత్తి ప్రవాహం తగ్గుతుంది. అలాగే పై నుంచి కింది స్థాయికి సంపద సంఖ్య తగ్గుతుంది.

                                            

 

పర్యావరణ కాలుష్యాలు

మానవుడి దైనందిన జీవన కార్యకలాపాల ద్వారా ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు జీవావరణ సమతౌల్యం దెబ్బతినే స్థాయిలో విడుదలవడాన్ని పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం అంటారు. రసాయనాలు, ఖనిజాలు, పేపర్, చక్కెర లాంటి భారీ మౌలిక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.


వాయు కాలుష్యం

భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలిపొరను వాతావరణం అంటారు. ఇది భూగోళం చుట్టూ 6 కి.మీ. ఎత్తులో అత్యధికంగా వ్యాపించి భూభ్రమణ, గురుత్వాకర్షణ వల్ల సంకోచం, వ్యాకోచం చెందుతుంది. సహజ వాతావరణంలో అనేక వాయువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. వీటిలో.......

       నత్రజని - 78.084%

       ఆక్సిజన్ - 20.947%

       కార్బన్ డై ఆక్సైడ్ - 0.0314%

       మీథేన్ - 0.002%

       హైడ్రోజన్ - 0.00005%

ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, గ్జినాన్ అనే వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప జీవకోటి అవసరాలకు పనికి రాదు. ఆమ్లజని (ఆక్సిజన్) జీవకోటికి అత్యంత అవసరమైన వాయువు. బొగ్గుపులుసు వాయువు (CO2) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్ష జాతుల్లో పిండి పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు, చమురు లాంటివి వాడటం వల్ల కార్బన్లు, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువులు గాలిలో అధిక పరిమాణంలో కేంద్రీకృతమై పర్యావరణానికి హాని కలిగించడాన్నే వాయు కాలుష్యం అంటారు.

ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం; మాంసం, జీవవ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ పెరగడం; భూఉపరితల ఉష్ణోగ్రత అధికమై మంచుకొండలు, కొండచరియలు, సముద్ర మట్టం పెరగడం, వరదలు, తుపాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. దీన్నే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. అలాగే వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిశ్రమాల వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ పెరిగి వివిధ పత్రాలు, లైబ్రరీ పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.

భూఉపరితలానికి 30 - 35 కి.మీ. ఎత్తులో ఉన్న స్ట్రాటో పొర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. దీన్నే ఓజోన్ పొర (O3) అంటారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, మిక్సీలు, క్లీనింగ్ సాల్వెంట్లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ల (CFCs) వల్ల ఓజోన్ పొర పలచబడి దానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తీవ్రనష్టం జరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ, శ్వాసకోశ, మెదడు, గుండె, కంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.


నేల కాలుష్యం
 

వివిధ వ్యర్థ పదార్థాల మిశ్రమం వల్ల భూమి యొక్క జీవ - భౌతిక - రసాయన ధర్మాల్లో మార్పులు ఏర్పడి, భూమి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి నేల కాలుష్యం ఏర్పడుతుంది. భూ నాణ్యత కోల్పోవడాన్ని భూమి క్షీణత/కాలుష్యం అంటారు.

భూమికోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, అధిక పరిమాణంలో రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం కోల్పోవడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. భూఉపరితలంపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోవడాన్ని భూమికోత అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికి పంటపొలాలుగా మార్చడం వల్ల ఇది ఏర్పడుతుంది.


ఎడారీకరణ
ఎడారి భూములు నిస్సారంగా, ఇసుకతో ఉండి కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పశువులు మేయడం, వృక్షాలను వంటచెరుకుగా ఉపయోగించడం, అడవులను నరకడం, క్షారీకరణ, లవణీకరణ వల్ల భూములు ఎడారులుగా మారుతున్నాయి.


లవణీకరణ
భూమిలో లవణాలు కేంద్రీకృతమవడం సహజంగా లేదా మానవ చర్యల వల్ల జరుగుతుంది. సముద్ర తరంగాలు, వాయుగుండాలు, వరదల వల్ల నేల లవణీకరణం చెందుతుంది. దీనితో పాటు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం; కృత్రిమ నీటి సదుపాయాలైన కాలువలు, గొట్టపుబావుల ద్వారా సేద్యం చేయడం వల్ల లవణీకరణ ఏర్పడుతుంది.


ఆమ్లీకరణ
వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో ఆమ్లవర్షాలు కురిసి భూఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు భూమిలోకి చొచ్చుకుపోవడం, భూ నాణ్యతను కాపాడే బ్యాక్టీరియా, వానపాములు లాంటి సూక్ష్మజీవులు అంతరించడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది.

Posted Date : 08-07-2023

సునామీ

సముద్ర తీరంలో రాకాసి!

  ఆ విపత్తు విరుచుకుపడితే ఆహ్లాదాన్ని అందించే అలలు అసాధారణంగా రాకాసి రూపాన్ని సంతరించుకుంటాయి. భారీ ఎత్తున ఎగసిపడే కెరటాలు తీరాన్ని కబళించే కరాళకేళి విపరీత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఏం జరిగిందో గ్రహించేలోగా అంతా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అంతులేని విషాదం వేలమైళ్లు విస్తరిస్తుంది. ఇంతకీ ఆ రాక్షస తరంగాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వాటి ప్రభావం జీవరాశిపై ఏ విధంగా ఉంటుంది? ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

  మహాసముద్రాలు, పెద్ద జలాశయాలు, సరస్సుల్లోని నీరు పరిమాణంలో పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడం వల్ల సంభవించే భారీ నీటి తరంగాల వరసను సునామీ అంటారు. ఆంగ్లంలో సునామీ ్బగి(్య-్చ్ఝi్శ అనే పదం జపాన్‌ భాషలోని స్బుగి(్య్శ అంటే హార్బర్, నామి ్బ-్చ్ఝi్శ అంటే కెరటం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. సునామీని తెలుగులో ‘రాకాసి అలలు’ అని, తమిళంలో ‘ఆఝి పెరలై’ అని అంటారు. ఇలా ప్రాంతీయ పేర్లు అనేకం ఉండటం వల్ల 1963లో అమెరికాలోని హవాయి దీవుల్లో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ‘సునామీ’ అనే పదాన్ని సార్వతిక పదంగా నిర్ణయించింది.



కారణాలు

సునామీ ఏర్పడటానికి మూడు భౌగోళిక కారణాలు, ఒక అంతరిక్ష కారణం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూపాతాలు: సముద్రం లోపల లేదా కడలికి దగ్గర భూపాతం అంటే కొండచరియలు విరిగి సముద్రంలోకి జారిపడినప్పుడు నీటి కదలికలు ఏర్పడి సునామీగా మారవచ్చు.

ఉదా: 1958లో అలస్కాలోని లిటుయాబే ప్రాంతంలో భూపాతం కారణంగా సునామీ ఏర్పడి 50-150 మీటర్ల ఎత్తులో సముద్ర తరంగాలు ఎగసిపడ్డాయి. 14% సునామీలు భూపాతాల వల్ల జరుగుతున్నాయని అంచనా.

అగ్నిపర్వత విస్ఫోటాలు: తీరానికి సమీపంలో లేదా సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు నేల సాధారణంగా పైకి ఎగబాకడమో, కుంగిపోవడమో జరుగుతుంది. దాంతో సముద్ర నీరు పెద్ద ఎత్తున కదలి సునామీగా మారవచ్చు.

ఉదా: 1983లో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెంది 40 మీటర్ల ఎత్తులో సునామీ కెరటాలు ఏర్పడ్డాయి. 2% సునామీలు ఈ కారణంగా వస్తున్నాయని అంచనా.

భూకంపాలు: సునామీలకు అత్యంత సర్వసాధారణ, ప్రధాన కారణం భూకంపాలు. సముద్ర భూతలం కింద లేదా మహాసముద్రం సమీపంలో సంభవించే భూకంపాల కారణంగా సముద్ర భూతలం కదలి సునామీకి దారితీస్తుంది. ఇలా వచ్చే సునామీ తరంగాలు గంటకు వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూకంపం వచ్చిన నిమిషాల నుంచి కొన్ని గంటల వ్యవధిలో తీరాన్ని తాకుతాయి. సాధారణంగా సముద్ర గర్భంలో రిక్టర్‌ స్కేలుపై 7.5 పాయింట్లు తీవ్రత ఉన్న భూకంపాలు జరిగినప్పుడే సునామీలు సంభవిస్తాయి. 84% సునామీలు భూకంపాల వల్లే ఏర్పడుతున్నాయి.

ఉల్కాపాతాలు: సునామీలు ఏర్పడేందుకు కారణాల్లో ఇది చాలా అరుదైంది. ఉల్కలు, గ్రహశకలాలు లాంటివి భూమి వైపు దూసుకొచ్చినప్పుడు సముద్రాలపై ప్రభావం చూపి సునామీలు రావచ్చు.

ఉదా: 6.5 కోట్ల ఏళ్ల కిందట ఒక పెద్ద గ్రహశకలం భూమిని తాకడం వల్ల అప్పట్లో జీవిస్తున్న డైనోసార్లు, కొన్ని జీవరాశులు చనిపోయినట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. మానవుడు భూమి మీద అవతరించిన తర్వాత ఉల్కాపాతం వల్ల ఒక్క సునామీ కూడా ఏర్పడలేదు.

సామర్థ్యం

సునామీలు గంటకు 800 కి.మీ. అత్యధిక వేగంతో సముద్ర తీరాన్ని తాకగలిగిన అవకాశం ఉంది.

ఉదా: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ వద్ద ప్రారంభమైన సునామీ జెట్‌ వేగం కంటే అధిక వేగంతో జపాన్‌లోని టోక్యో నగరాన్ని తాకే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడి సునామీ కెరటాలు మధ్యదరా సముద్రంతోపాటు అన్ని మహాసముద్రాలకు విస్తరించవచ్చు.

* సునామీ ప్రారంభమైనప్పుడు తక్కువ డోలన పరిమితి, సుదీర్ఘ తరంగదైర్ఘం ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి ఎక్కువై, తరంగదైర్ఘ్యం తగ్గిపోతూ ఉంటుంది. స్వల్ప వ్యవధిలోనే కెరటాలు గరిష్ఠ ఎత్తుకు పెరుగుతాయి.

* సునామీల ప్రారంభ ప్రాంతంలో సముద్రం లోపల కెరటాల ఎత్తు 30-40 సెం.మీ. మాత్రమే ఉంటుంది. అవే తీరానికి చేరినప్పుడు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి.

* సునామీ కేంద్రం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెనువిధ్వంసం సృష్టిస్తాయి.

* తీరాన్ని చేరేటప్పుడు సునామీ వేగం తగ్గుతూ, కెరటాల ఎత్తు పెరుగుతూ తీరాన్ని చేరుతుంది. దీన్ని షోలింగ్‌ ప్రభావం అంటారు.

* సునామీ ఒకే ఒక పెద్ద తరంగం కాదు. ఒక సునామీ 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలను కలిగి ఉంటుంది. వాటిని సునామీ తరంగ రైలు బండి అంటారు.

* ఒక తరంగం తీరాన్ని తాకిన తరువాత 5 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరో తరంగం తీరాన్ని తాకుతుంది.

* సునామీ కెరటం తీరాన్ని తాకిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తే వేగం కంటే కొన్ని రెట్లు వేగంగా అంటే గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. అంటే పరుగెత్తే మనుషులను కూడా కబళించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది.

* సునామీ అలలు చాలా దూరం తీరం భూభాగాన్ని ముంచేస్తాయి. ఈ దూరాన్ని రన్‌అప్‌ అంటారు. పెద్ద సునామీలు తీరం నుంచి 1.5 కి.మీ. వరకూ వ్యాపిస్తాయి.

* కొన్నిసార్లు సముద్ర గర్భంలో భూకంపం సంభవించినప్పుడు సముద్రంలో నేల కిందికి కుంగిపోవడం వల్ల తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి మహాసముద్ర భూతలం బయటకు కనిపిస్తుంది. దీన్ని సహజసిద్ధమైన సునామీ హెచ్చరికగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభావం

* సునామీలు ఇసుక తీరాన్ని ఖండఖండాలుగా చేస్తాయి. తీరప్రాంతంలోని వృక్షజాతులను విచ్ఛిన్నం చేస్తాయి. కట్టడాలు ధ్వంసమవుతాయి.

* సునామీ కెరటాలు పురోగమించేటప్పుడు మార్గంలో అడ్డంగా ఉన్న ప్రతిదాన్ని కూల్చివేస్తాయి. అవే కెరటాలు తిరోగమనంలో అన్నింటిని కబళించి సముద్రంలోకి తీసుకెళ్లి పోతుంది. ఇది సునామీ విధ్వంసక స్వభావానికి ప్రతీక.

* సునామీతో వచ్చే వరద ప్రభావం వల్ల మానవ ఆవాసాలు, రోడ్లు, ఓడరేవులు, మౌలిక వసతులకు అపార నష్టం కలుగుతుంది. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.

* నీరు ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరడంతో ప్రజలు అందులో మునిగిపోయి మరణిస్తారు. అనేకమంది సముద్రంలోకి కొట్టుకుపోతారు. తరంగాలతోపాటు కొట్టుకొచ్చే వ్యర్థాలు, పెద్దపెద్ద వస్తువుల కింద ఇరుక్కుని మరికొందరు మరణించే ప్రమాదం ఉంది.

* బావులు, ఇతర భూగర్భ జలవనరుల్లో ఉప్పు నీరు, మురుగు నీరు, వ్యర్థాలు చేరి కలుషితమవుతాయి.

* వరదతో పంట నష్టం జరుగుతుంది. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్సకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. పర్యావరణానికీ అపార నష్టం కలుగుతుంది.

సునామీల వ్యాప్తి

* పసిఫిక్‌ మహాసముద్రం - 73%

* మధ్యదరా సముద్రం, నల్ల సముద్రం వంటి భూపరివేష్టిత సముద్రాలు - 16%

* కరేబియన్‌ సముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రాలు - 6%

* హిందూ మహాసముద్రం - 5%

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-12-2022

వ‌ర‌ద‌ల విప‌త్తు

మాదిరి ప్రశ్నలు


1. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే వరదలతో ఏ వర్గం వారు అధికంగా ప్రభావితమవుతున్నారు?

1) అధిక ఆదాయం గలవారు    2) అల్ప ఆదాయం గలవారు

3) తక్కువ మధ్య ఆదాయం గలవారు   4) అధిక మధ్య ఆదాయం గలవారు


2. దేశ మొత్తం వైశాల్యంలో వరద దుర్బలత్వం ఉన్న భూమి ఎంత?

1) 12%  2) 85%  3) 68%  4) 56%


3. దేశ మొత్తం వర్షంలో నైరుతి రుతువులో (జూన్‌ - సెప్టెంబర్‌ మధ్య) ఎంత వర్షం కురుస్తుంది?

1) 75%  2) 85%  3) 50%  4) 20%


4. దేశంలో వరదల స్థితి కింది విధంగా ఉంది?

1) దేశంలో పెద్ద నదుల ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

2) దేశంలో చిన్న నదుల ప్రాంతంలో వరదలు సంభవిస్తున్నాయి.

3) దేశంలో దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

4) తూర్పునకు వెళ్లే నదులు మాత్రమే వరదలకు కారణమవుతున్నాయి.


5. ఉద్ధృతిపరంగా వరదలు ఎక్కువ సంభవించే రాష్ట్రాలు వరుసగా?

1) ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం 

2) ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌

3) బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం 

4) అస్సాం, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌


6. దేశంలో పెద్ద విపత్తు ఏది?

1) భూకంపాలు  2) తుపాన్లు  3) కరవు  4) వరదలు


7. ప్రపంచంలో విపత్తుల జాబితాలో జల, వాతావరణ విపత్తుల గ్రూపులో కింది ఏ విపత్తు ఎక్కువ ప్రభావవంతమైంది?

1) సునామీలు  2) కరువు  3) వరదలు  4) తుపాన్లు


8. గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం 90% వరద బాధితులు ఏ ప్రాంతాల్లో ఉన్నారు?

1) దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిపిక్‌ దేశాల్లో

2) దక్షిణాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో

3) ఆసియా, ఆఫ్రికా దేశాల్లో

4) ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు


9. భారత్‌లో కింది ఏ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురవుతుంది?

1) ఉత్తర వాయవ్య ప్రాంతం 2) ఉత్తర, ఈశాన్య ప్రాంతం

3) ఉత్తర, దక్షిణ ప్రాంతం 4) ఈశాన్య ఆగ్నేయ ప్రాంతం


10. భారత ప్రభుత్వం జాతీయ వరదల నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

1) 1954 2) 1952 3) 1986 4) 1994

 

సమాధానాలు: 1-2; 2-1; 3-1; 4-3; 5-1; 6-4; 7-3; 8-1; 9-2; 10-1.

ర‌చ‌యిత‌: జ‌ల్లు స‌ద్గుణ‌రావు

Posted Date : 11-02-2023

జలవనరులు

సమస్త జీవులకు సర్వాధారం!


ప్రకృతి వనరుల్లో ప్రధానమైంది, ప్రాణికోటి జీవనానికి అత్యంత అవసరమైంది జలం. జీవుల ఆవిర్భావం నుంచి నాగరికతా వికాసం వరకు అన్నింటికీ నీరే ప్రధానం. దేశంలో వ్యవసాయ ప్రగతి, నగరీకరణ విస్తరణ అంతా ఆ వనరుపైనే ఆధారపడి సాగుతోంది. అందుకే అతి విలువైన నీటి లభ్యత, వినియోగం, నిర్వహణ తీరుతెన్నులను పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన నీరున్న గ్రహం భూమి మాత్రమే. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ (70.7%) జలం ఆవరించి ఉంది. భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే. ఒక జాతి ఆర్థికాభివృద్ధి, సామాజిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు అక్కడి నీటివనరులతో ముడిపడి ఉంటాయి. భూమి మీద ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహా సముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది. మిగిలిన మంచినీరులో మంచు, హిమానీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది. ప్రపంచంలో బ్రెజిల్, రష్యా, చైనా, కెనడా, ఇండొనేసియా, అమెరికా, భారత్, కొలంబియా, కాంగో లాంటి దేశాల్లో 60% నీటి లభ్యత ఉండగా, మిగిలిన దేశాలన్నింటిలో 40% నీటి లభ్యత ఉంది.


యునెస్కో విడుదల చేసిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌’ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని పట్టణ ప్రజల్లో 50% మంది భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 69% వ్యవసాయం భూగర్భ జలాలపైనే సాగుతోంది. 22% గృహావసరాల కోసం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. 9% పారిశ్రామిక రంగ అవసరాలకు భూగర్భ జలాలు ఉపయోగపడుతున్నాయి.

భారత్‌లో లభ్యత

నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (NCIWRD) ప్రకారం.. 329 మిలియన్ల హెక్టార్లున్న దేశ భూభాగంపై సాలీనా జలచక్రం ద్వారా 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీరు లభిస్తోంది. ఇందులో 40% (1600 బీసీఎం) ఆవిరైపోగా, 9% (360 బీసీఎం) నేలలో తేమ రూపంలో, 10% (400 బీసీఎం) భూగర్భజలంగా ఉంటుంది. మిగిలిన 41% (1640 బీసీఎం) నదులు, చెరువులు, సరస్సుల్లో ఉపరితల జలంగా నిల్వ ఉంటుంది.

* దేశంలో ఉపరితల, భూగర్భ జలాలుగా ఉన్న మొత్తం 2040 బీసీఎం నీరు.. దేశ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక       అవసరాలకు ఉపయోగపడుతోంది.

ప్రపంచ జనాభాలో భారత్‌లో 17.5% ఉంది. అలాగే ప్రపంచ పశు జనాభాలో 15% ఇక్కడ ఉంది. కానీ ప్రపంచ నీటి లభ్యతలో భారత్‌ వాటా 4% మాత్రమే. జలవనరులు దేశమంతటా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అందుబాటులో లేవు. భూగర్భజలాల పరంగా చూస్తే అవక్షేప శిలలతో, నిక్షేపణ పదార్థాలతో నిండిన ఉత్తర మైదానంలోని గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నీరు లభ్యమవుతోంది. దీనికి భిన్నంగా ద్వీపకల్ప పీఠభూమి కఠిన శిలలతో ఉండటంతో నీటి లభ్యత తక్కువ ఉంటుంది.


ఆసియాలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశం భారతదేశమే. ఇక్కడి నీటిలో 93.37% వ్యవసాయానికి, 3.73% గృహావసరాలకు వినియోగమవుతోంది. పరివాహక ప్రాంతాల్లో నీటి ఉపరితల లభ్యత ఆధారంగా చూస్తే అయిదు అతి పెద్ద నదుల్లోనే 60% నీరు చేరుతోంది. మిగిలిన 250 నదుల్లో 40% ఉపరితల జలాలు అందుబాటులో ఉన్నాయి.


దేశంలో నైరుతి రుతుపవన కాలంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ కాలంలోనే 75% వర్షం కురుస్తుంది. దీంతో అధికభాగం నీరు  వరదల రూపంలో నదుల ద్వారా సముద్రాల్లో కలిసిపోతుంది.


నిర్వహణ చర్యలు

జాతీయ జలవిధానం: నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ, క్రమబద్ధీకరణ లాంటి ఆశయాలతో మొదటి జాతీయ జల విధానాన్ని 1987లో తీసుకొచ్చారు. దీని తర్వాత 2002, 2012తో కలిపి ఇప్పటివరకూ మూడు జాతీయ జల విధానాలు వచ్చాయి.


అమృత్‌ పథకం: 500 నగరాల్లో గృహ వినియోగానికి నీరు అందించే ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది.


జలక్రాంతి అభియాన్‌: జలవనరుల నిర్వహణ, సంరక్షణ దృష్ట్యా నీటి సరఫరాను మరింత సమర్థంగా అమలుచేసేందుకు 2015 - 16లో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు.


జల్‌ జీవన్‌ మిషన్‌: ప్రతి గ్రామంలో ఇంటింటికీ కొళాయి ద్వారా నీరు అందించే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఇది. రూ.3.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తోంది.


వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన పథకం (ఏఐబీపీ): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు అనుమతించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలనే లక్ష్యంతో 1996 - 97లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం: సమగ్ర వరద  నిర్వహణ కోసం 11వ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.


నమామి గంగే కార్యక్రమం: గంగా నది కాలుష్యాన్ని 2020 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన కార్యక్రమం.


ప్రధానమంత్రి కృషి సించాయి యోజన: పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో 2015 - 16లో హర్‌ ఖేత్‌ కో పానీ (ప్రతి పొలానికి నీరు) నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.


కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్‌  మేనేజ్‌మెంట్‌: నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ దిగుబడిని పెంచి రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్రం 1974 - 75లో దీన్ని అమలు చేసింది. 2015-16 నుంచి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు.


అంతరాష్ట్రీయ నదీ జలాల చట్టం: రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారానికి 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు.


నదుల అనుసంధానం: ఉత్తర భారతదేశంలో వరదల నియంత్రణ, దక్షిణ భారతదేశంలో కరవు నివారణ కోసం ఉత్తర భారతంలోని 16 నదులను, దక్షిణ భాగంలో 14 నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలని 2002లో కేంద్రం నిర్ణయించింది. 

మాదిరి ప్రశ్నలు


1. గంగానదీ జల కాలుష్య నిర్మూలన కోసం భారత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం ఏది?

1) నమస్తే గంగా     2) నమామి గంగే     3) పవిత్ర గంగ     4) మిషన్‌ గంగ


2. నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ కోసం మొదటి జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1987     2) 1978      3) 1952      4) 1990


3. జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1980      2) 1974      3) 1950     4) 1998


4. జల వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకోవడానికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1982      2) 1999    3) 1965       4) 1986


5. ప్రపంచ నీటిలభ్యతలో భారతదేశ వాటా ఎంత?

1) 10%      2) 20%     3) 4%     4) 15%


6. మన దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో వార్షిక నీటిలభ్యత అధికంగా ఉంది?

1) గంగా      2) గోదావరి     3) సింధూ     4) బ్రహ్మపుత్ర 


7. ఏ నది నీరు సముద్రంలో అత్యధికంగా కలిసిపోతుంది?

1) బ్రహ్మపుత్ర     2) గంగ    3) మహానది, గోదావరి     4) నర్మద, తపతి 


8. దేశంలో ప్రతి గ్రామీణ గృహానికి కొళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమం పేరేంటి?

1) అమృత్‌ పథకం     2) జల్‌ జీవన్‌ మిషన్‌    3) జలక్రాంతి అభియాన్‌    4) అమృత్‌ జల క్రాంతి


9. భారతదేశ భూ విస్తీర్ణం 329 మి.హెక్టార్లలో జలచక్రం ద్వారా లభిస్తున్న నీరు ఎంత?

1) 1000 బి.సి.ఎం.    2) 4000 బి.సి.ఎం.   3) 3000 బి.సి.ఎం.   4) 400 బి.సి.ఎం.


10. భారతదేశంలో లభిస్తున్న అన్ని జలవనరుల్లో వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్న నీటి శాతం ఎంత?

1) 90%     2) 93%    3) 50%      4) 60%

సమాధానాలు: 1-2, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-1, 8-2, 9-2, 10-2.

రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 10-07-2023

మానవ కారక విపత్తులు

స్వీయ విధ్వంసక సంక్షోభాలు!

  భూకంపాలు, సునామీలు, తుపాన్ల వంటి సహజ విపత్తులను ఆపడం, అడ్డుకోవడం అసాధ్యం. కానీ అదుపు చేయగలిగిన మానవ కారక ప్రమాదాలు కూడా ఇప్పుడు ప్రపంచానికి పెను విపత్తులుగా పరిణమిస్తున్నాయి. మనిషి చేసే నిర్లక్ష్యం, తప్పులు, సరైన శిక్షణ లేకుండా చేసే పొరపాట్ల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలు అధికమవుతున్నాయి. అధిపత్య ధోరణులతో ఆధునిక సాంకేతికతను వినాశనాలకు వినియోగించడమూ మానవుల వల్ల ఏర్పడుతున్న స్వీయ విధ్వంసక సంక్షోభాలే. ఇలాంటి విపత్తుల రకాలు, వాటి ప్రభావాల గురించి కాబోయే ప్రభుత్వోద్యోగులకు సరైన అవగాహన ఉండాలి. 

  మానవ అభివృద్ధిని అడ్డుకునే విపత్తుల్లో భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు లాంటి సహజ విపత్తులతోపాటు అనేక మానవ ప్రేరిత విపత్తులు కూడా అభివృద్ధి నిరోధకాలుగా పరిణమిస్తున్నాయి. మానవ ప్రమేయం, తప్పిదాలు, నిర్లక్ష్యం, మానవ నిర్మిత వ్యవస్థలు దెబ్బతినడం లాంటి కారణాలతో ఏర్పడే విపత్తులను మానవ కారక విపత్తులు అంటారు. అవి రెండు రకాలుగా ఉంటాయి.

1) సామాజికపరమైన మానవ కారక విపత్తులు: పౌర యుద్ధాలు, పౌర తిరుగుబాట్లు, తీవ్రవాదం, తొక్కిసలాటలు, ఆస్తులు తగలబెట్టడం లాంటి వాటితో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ హాని జరగడాన్ని సామాజికపరమైన మానవకారక విపత్తులు అంటారు.

2) సాంకేతికపరమైన మానవ కారక విపత్తులు: వివిధ ప్రయోగాలు, నిర్మాణాలు, పారిశ్రామికీకరణ, రవాణా లాంటి వాటిలో మానవ నిర్లక్ష్యం, తప్పిదాలు, యాంత్రిక వైఫల్యం వల్ల ఏర్పడే విపత్తులను సాంకేతికపరమైన విపత్తులుగా పరిగణిస్తారు. పారిశ్రామిక విపత్తులు, నిర్మాణాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రేడియేషన్‌ విపత్తులు, అంతరిక్ష ప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు ఇందులో ప్రధానమైనవి.

సామూహిక విధ్వంసక ఆయుధాలు

ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీ నష్టం తెచ్చే ఆయుధాలివి. అణు, రసాయన, బయోలాజికల్, రేడియోలాజికల్‌ ఆయుధాలు ఇందుకు ఉదాహరణ. 2003లో యూఎస్‌ఏ సారథ్యంలో మిత్రరాజ్యాలు ఇరాక్‌పై దాడి చేసిన సందర్భంగా ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

అణ్వాయుధాలు: విధ్వంసకర శక్తిని విడుదల చేసే విస్ఫోటక ఆయుధాలే అణ్వాయుధాలు. ఇవి రెండు రకాలు. 1) కేంద్రక విచ్ఛిత్తి ద్వారా పెను విధ్వంసం సృష్టించే అణుబాంబులు లేదా వి - బాంబులు లేదా ఫిజన్‌ బాంబులు. 2) కేంద్రక సంలీన చర్య ద్వారా పెద్ద మొత్తంలో శక్తి విడుదల చేసే హైడ్రోజన్‌ బాంబులు లేదా బీ - బాంబులు లేదా ఫ్యూజన్‌ బాంబులు లేదా థర్మోన్యూక్లియర్‌ బాంబులు. హైడ్రోజన్‌ బాంబులు వి - బాంబుల కంటే వెయ్యి రెట్ల అధిక శక్తిని ఇస్తాయి.

  రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ప్రయోగించింది. ‘బి-29 బాంబర్‌ ఎనోలా గే’ అనే యుద్ధ విమానం నుంచి మొదటిసారి ‘లిటిల్‌బాయ్‌’ అణుబాంబుని 1945, ఆగస్టు 6న హిరోషిమాపై వేసింది. రెండోసారి 1945, ఆగస్టు 9న అదే యుద్ధ విమానంతో ‘ఫ్యాట్‌మాన్‌’ అణుబాంబుని నాగసాకి నగరంపై విడిచిపెట్టింది. ఈ చర్య మానవ జాతి చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా నిలిచిపోయింది.

రసాయన ఆయుధాలు: శరీర వ్యవస్థపై దాడి చేసే రసాయన పదార్థాలు లేదా విష పదార్థాలను ఉపయోగించి ప్రజల ప్రాణానికి భారీ నష్టం కలగజేయడాన్ని రసాయన ఆయుధాల దాడిగా భావిస్తారు. సాధారణ రసాయనాలతోనే వీటిని తయారుచేయవచ్చు. వీటిలో అనేక రకాలున్నాయి. ఫాస్జిన్‌ లాంటి ఊపిరాడకుండా చేసే వాయువులు మనుషుల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి ప్రాణాలు హరిస్తాయి. 

  మస్టర్డ్‌ గ్యాస్‌ లాంటి వాటితో శరీరంపై పొక్కులు వస్తాయి. శరీరం కాలిపోవడంతోపాటు చూపు పోతుంది. వీటన్నింటి కంటే ప్రాణాంతకమైంది నెర్వ్‌ ఏజెంట్‌. ఇది శరీరంలోని కండరాలకు మెదడు పంపే సంకేతాలను అడ్డుకుంటుంది. చిన్న బిందువు కూడా ప్రాణాంతకం అవుతుంది. ఉదా: 0.5 మిల్లీగ్రాముల వీఎక్స్‌ నెర్వ్‌ ఏజెంట్‌ ఒక వ్యక్తి ప్రాణం తీస్తుంది. రసాయన కారకాన్ని వ్యాప్తి చేయడానికి ముందు దాన్ని లక్ష్యంపైన లేదా దాని పక్కనే చల్లి తేలికగా వ్యాపింపజేయవచ్చు. అందువల్ల ఈ రసాయన పదార్థాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించాలి. యుద్ధ సమయంలో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో రసాయన పదార్థాన్ని నింపి ప్రయోగించవచ్చు. దీన్ని తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలు ఫ్లోరిన్‌ సిలిండర్‌ను తెరచి శత్రువులపైకి పంపాయి. 1980లో ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధంలో; 2013, ఆగస్టు 21న సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలో సారిన్‌ అనే నెర్వ్‌ ఏజెంట్‌ను ప్రయోగించారు.

పారిశ్రామిక విపత్తులు: రసాయన విపత్తులను, పారిశ్రామిక విపత్తులను ఒకదానికొకటి ప్రత్యామ్నాయ పదాలుగా వాడతారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌’ (యూసీఐఎల్‌)’ అనే క్రిమిసంహారక మందుల తయారీ పరిశ్రమ నుంచి 30 - 40 టన్నులకు పైగా మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే విషవాయువు లీకవడంతో 3 వేల మందికి పైగా మరణించారు. సుమారు 5 లక్షల మంది అనేక విధాలుగా అనారోగ్యాలకు గురయ్యారు. ఈ సంఘటన 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి తర్వాత జరిగింది.

* 1976, జులై 10న ఇటలీలోని సెవేసోలో రసాయనాల తయారీ పరిశ్రమ నుంచి ‘డియోక్సిన్‌’ వాయువు లీకై 3,300 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత 80 వేల పశువులను చంపేయాల్సి వచ్చింది.

* 2020, మే 7న తెల్లవారుజామున విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ‘స్టైరీన్‌’ వాయువు లీకై 12 మంది చనిపోయారు. ఇలా రసాయన పారిశ్రామిక విపత్తులు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి.

రేడియోధార్మిక ఆయుధాలు: ఏదైనా ప్రదేశంలో రేడియోధార్మికత కలిగిన పదార్థం కారణంగా తీవ్రనష్టం జరిగితే రేడియోధార్మిక విపత్తు అంటారు. సంప్రదాయ పేలుడు పదార్థాలతో రేడియోధార్మిక పదార్థాలను కలిపి ప్రయోగించడం వల్ల సాధారణం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల వీటిని ‘డర్టీబాంబులు’ లేదా ‘బ్యాక్‌ప్యాక్‌ బాంబులు’ అంటారు. వీటిని తయారు చేయడానికి సీజియం-137, స్ట్రాన్షియం-90, కోబాల్ట్‌-60, రేడియో అయోడిన్‌-131 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌ పదార్థాలను వాడతారు. వీటిని సాధారణంగా ఉగ్రవాదులు వినియోగిస్తుంటారు.

జీవాయుధాలు: హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలను ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి చేసి, విడుదల చేయడం ద్వారా భారీస్థాయిలో ప్రాణాలను హరించే సూక్ష్మజీవులను జీవాయుధాలు అంటారు. ఇలాంటి జైవిక దాడిని ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపితే అది బయోటెర్రరిజం అవుతుంది. వీటిని విడిచిపెట్టడానికి అధునాతన సాధనాలు పెద్దగా అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో చెట్లు, జంతువుల టాక్సిన్ల నుంచీ తయారు చేయవచ్చు. 1 చ.కి.మీ. పరిధిలోని ప్రజలపై దాడి చేయడానికి సంప్రదాయ బాంబుకి 2 వేల డాలర్లు వ్యయమైతే, అణ్వాయుధాలకు 800 డాలర్లు, నెర్వ్‌ గ్యాస్‌ ఆయుధాలకు 600 డాలర్లు ఖర్చవుతుంది. అదే జీవాయుధాలకు ఒక్క డాలరు మాత్రమే వ్యయమవుతుంది. అందువల్ల జీవాయుధాలను ‘పేదవాడి అణుబాంబులు’ అంటారు. ఆంత్రాక్స్, రెసిన్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని జీవాయుధాలు. మశూచిని కలిగించే వేరియోలా వైరస్, ప్లేగును కలిగించే యెర్సీనియా పెస్టిస్‌ బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందే జీవాయుధాలకు ఉదాహరణ.

ఆంత్రాక్స్‌: ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంథ్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. శ్వాస పీల్చినప్పుడు అది మనిషి శరీరంలోకి ప్రవేశించి వాంతులు, చర్మంపై పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది ప్రాణాపాయం కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి.

రైసిన్‌ టాక్సిన్‌: ఇది కొంత తక్కువ హానికర రసాయనం. దీన్ని క్యాస్టర్‌ బీన్స్‌ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. ఇది మతిభ్రమించి స్పృహ కోల్పోయే విధంగా చేస్తుంది.

మశూచి: ఇది ఆర్ధ్రోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందింది. భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా సహజసిద్ధ మశూచి (స్మాల్‌ పాక్స్‌) వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. అయితే దీన్ని జీవాయుధంగా ప్రయోగించే వీలుంది. తుంపర్ల రూపంలో ప్రయోగించే వీలున్న మశూచి ఆయుధాన్ని 1980లో సోవియట్‌ యూనియన్‌ అభివృద్ధి చేసినట్లు చెబుతారు. దీనివల్ల శరీరంపై దద్లుర్లు, జ్వరం, తలనొప్పితో పాటు కంటిచూపు కూడా పోతుంది.

ప్లేగు: ఈ వ్యాధి యెర్సీనియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఈ సూక్ష్మజీవులను నీటి తుంపర్ల ద్వారా ప్రయోగించవచ్చు. దీనివల్ల తీవ్రజ్వరం, చలి, తలనొప్పి, వాంతులు, తల తిరగడం సంభవించి ప్రాణం పోతుంది. ఇందులో నిమోనిక్‌ ప్లేగు ప్రమాదకరమైంది.

కబళిస్తున్న రోడ్డు ప్రమాదాలు: మానవ కారక విపత్తుల్లో రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు లాంటి రవాణా ప్రమాదాలతో పాటు, అగ్ని, గని ప్రమాదాలు, ఆహార పదార్థాల పంపకంలో తొక్కిసలాటలు, దేవాలయాల్లో తొక్కిసలాటలు వంటి అనేక మానవ కారక విపత్తులు అనునిత్యం మనిషికి ఎదురవుతున్న మరికొన్ని మానవ కారక విపత్తులుగా చెప్పవచ్చు. అయితే మానవ కారక విపత్తుల్లో రోడ్డు ప్రమాదాలు అత్యధిక ప్రాణనష్టం కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 12 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచ వాహనాల్లో 46% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఉంటే, రోడ్డు ప్రమాద మృతుల్లో మాత్రం 90% ఈ దేశాల్లోనే ఉంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై మరణించినవారు(డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక):

1) రోడ్డు ప్రమాదాలు - 22.8%

2) ఆత్మహత్యలు - 16.9% 

3) హింస - 10.8% 

4) నిర్మాణాలు కూలిపోయి - 7.5% 

5) విషప్రయోగాలు - 6.7% 

6) అగ్నిప్రమాదాలు - 6.2% 

నమూనా ప్రశ్నలు

1. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీగా నష్టం కలిగించే ఆయుధాలను ఏమంటారు? 

1) రసాయన ఆయుధాలు 2) సామూహిక విధ్వంసక ఆయుధాలు

3) పారిశ్రామిక విపత్తులు 4) భౌగోళిక విపత్తులు

2. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 

1) 1984, డిసెంబరు 2

2) 1986, డిసెంబరు 2

3) 1979, మార్చి 28

4) 1976, జులై 10

3. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ఎప్పుడు వేసింది? 

1) 1945, అక్టోబరు 2) 1945, జనవరి 3) 1945, ఆగస్టు 4) 1945, జులై

4. శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి, రోగాన్ని కలిగించే ఆంత్రాక్స్‌ ఏ రకమైంది? 

1) వైరస్‌ 2) బ్యాక్టీరియా 3) ఫంగస్‌ 4) ప్రోటోజోవా

5. గాలి/తాకడం వల్ల ఇతరులకు వ్యాపించే మశూచి వ్యాధికి కారణం?

1) వేరియోలా వైరస్‌ 2) యెర్సీనియా పెస్టిస్‌ 3) బోట్సులియం బ్యాక్టీరియా 4) ఏదీకాదు

6. కింది ఏ ఆయుధాలను డర్టీబాంబులు అంటారు? 

1) రేడియోధార్మిక బాంబులు 2) జైవిక్‌ ఆయుధాలు

3) రసాయన ఆయుధాలు 4) అణ్వాయుధాలు

7. మానవ కారక విపత్తుల్లో అధిక ప్రాణనష్టానికి గురిచేసే విపత్తు ఏది? 

1) అగ్ని ప్రమాదాలు 2) ఇల్లు కూలిపోవడం 3) రైలు ప్రమాదాలు 4) రోడ్డు ప్రమాదాలు 

8. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో లీకైన విషవాయువు ఏది? 

1) మిథైల్‌ ఐసోసైనేట్‌ 2) మిథైల్‌ ఐసోసైనైట్‌ 3) డియోక్సిన్‌ 4) స్టైరిన్‌ వాయువు

9. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్ల సంవత్సరానికి సరాసరిగా ఎంతమంది చనిపోతున్నారు?

1) 12 లక్షలు 2) 5 లక్షలు 3) 20 లక్షలు 4) 50 లక్షలు

10. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ దురంతంగా పిలిచే అణువిపత్తు ఎప్పుడు జరిగింది? 

1) 1984 2) 1986 3) 1996 4) 1982

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-2, 5-1, 6-1, 7-4, 8-1, 9-1, 10-2

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-04-2023

భూవనరులు

మట్టితోనే మనుగడ!

  పంటలు బాగా పండాలి. అందరికీ ఆహారం సమృద్ధిగా అందాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆక్సిజన్‌ అవసరమైనంత వాతావరణంలో చేరాలి. పర్యావరణాన్ని కాపాడాలి. చిన్న మొక్క పెద్ద వృక్షమై జీవుల అవసరాలను తీర్చాలి. అందుకు మట్టి కావాలి. అంటే భూగోళశాస్త్రం పరిభాషలో మృత్తికలు. సహజ వనరుల్లో అత్యంత కీలకమైన ఆ మృత్తికల రకాలు, లక్షణాలు, వాటిని కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

  భూమి ఆవిర్భవించి 4.6 బిలియన్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి అది అంతర్గతంగా, బహిర్గతంగా అనేక మార్పులకు గురై నేటి మానవ జీవన విధానానికి అనుకూలంగా మారింది. ఒకప్పుడు అన్ని ఖండాలు కలిసి ఒక మహా ఖండం (పేంజియా)గా భూమి ఉండేది. క్రమంగా అది కొన్ని పలకలుగా విడిపోయి ఏడు ఖండాలు, అయిదు మహా సముద్రాలుగా విస్తరించింది. శిలలతో నిర్మితమైన ఖండాలు భౌతిక, రసాయనిక చర్యల వల్ల శిథిలమై క్రమంగా మృత్తికలుగా విస్తరించాయి. ఇవి ఒక దేశ ఆర్థిక, సాంస్కృతిక, సాంఘిక, ఆరోగ్య, పర్యావరణ అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రకృతిలో లభించే సహజ వనరుల్లో మృత్తికలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణించాలి. ఒక ప్రాంతంలోని వృక్ష సంపద, పంటల వైవిధ్యం ఆ ప్రాంతంలో విస్తరించిన మృత్తికలు/నేలలపై ఆధారపడి ఉంటాయి. 

  ప్రపంచవ్యాప్తంగా 36 బిలియన్‌ హెక్టార్ల భూవనరులు ఉంటే, అందులో 329 మిలియన్‌ హెక్టార్లు భారత దేశంలో ఉంది. భూస్వరూపం, శీతోష్ణ స్థితిగతులు, వృక్ష సంపదను బట్టి దేశంలో వైవిధ్యమైన మృత్తికలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా వాటి భౌతిక, రసాయనిక ధర్మాల్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తాయి. మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. మృత్తిక తయారవడం ఒక దీర్ఘకాల ప్రక్రియ. ఒక సెంటీమీటరు మందం మృత్తిక ఏర్పడటానికి సుమారుగా 400 ఏళ్లు పడుతుందని అంచనా. శిలాశిథిల పదార్థాన్ని మృత్తిక అంటారు. శిలల అధ్యయనాన్ని శాస్త్రాన్ని పెట్రాలజీ/లిథాలజీగా పేర్కొంటారు. కొన్ని చోట్ల నేలపైన కుళ్లిన జీవ పదార్థమైన ‘హ్యూమస్‌’ ఒక పొరలా విస్తరించి ఉంటుంది. అలాంటివి సారవంతమైన నేలలు.

  మృత్తికలు ఏర్పడే తీరును బట్టి రెండు రకాలుగా విభజించారు. 

స్థాన బద్ధ మృత్తికలు: ఇవి మాతృశిలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెంది అదే ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. వీటినే ఇన్‌సైటు నేలలు అంటారు.

ఉదా: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లేటరైట్‌ నేలలు, పర్వత నేలలు, ఎడారి నేలలు

స్థాన బద్ధంకాని నేలలు: ఈ రకమైన నేలలు మాతృశిలపై ఏర్పడిన తర్వాత నీరు/గాలి వల్ల వేరొక ప్రాంతానికి రవాణా చెంది, ఆ ప్రాంతంలో నిక్షేపితమవుతాయి. వీటినే పరస్థానీయ నేలలు లేదా ఎక్స్‌ సైటు నేలలు అంటారు. 

ఉదా: ఒండ్రు నేలలు, లోయిస్‌ నేలలు, మొరైన్‌ నేలలు. 

భారతదేశంలో నేలల రకాలు


మనదేశ భూస్వరూపం అనేక రకాలైన శిలలతో నిర్మితమైన శిలల మ్యూజియం లాంటిది. వాటికి తగ్గట్టుగానే దేశంలో వైవిధ్యమైన శీతోష్ణస్థితి లక్షణాలు కూడా ఉండటంతో అనేక రకాల భౌతిక, రసాయనిక లక్షణాలున్న నేలలు విస్తరించి ఉన్నాయి. అమెరికా శాస్త్రవేత్త వోలేకర్‌ 1893లో మొదటిసారిగా మన దేశ మృత్తికలపై అధ్యయనం చేశాడు. స్వాతంత్య్రానంతరం భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రిసెర్చ్‌) దేశంలోని మృత్తికలపై అధ్యయనం చేసి 1953లో 8 రకాల మృత్తికలున్నట్లు తెలిపింది.


1) ఒండ్రు మృత్తికలు: దేశ భౌగోళిక విస్తీర్ణంలో వీటి వాటా 43 శాతం. ఈ నేలలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అంతటా, దేశంలో ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో సున్నం, పొటాషియం, కాల్షియం లాంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో ఆహార, వాణిజ్య రకానికి చెందిన అన్ని రకాల పంటలు పండుతాయి. ఇందులో పాత ఒండ్రు (బంగర్‌), కొత్త ఒండ్రు (ఖాదర్‌), సున్నం పొరను ఆవరించిన (కంకర) నేలలు అనే రకాలున్నాయి.  అయితే అక్కడక్కడ నిస్సారమైన ఆమ్ల, క్షార నేలలు కూడా విస్తరించి ఉంటాయి. వీటిని ఉత్తర మైదానంలో ప్రాంతీయంగా రే, కల్లార్, ఉషర్, రకర్, చోపన్‌ నేలలని  పిలుస్తారు. 


2) ఎర్రనేలలు: ఇవి గ్రానైట్, నీస్, సిస్ట్‌ లాంటి నేలలు శిథిలం కావడం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఐరన్‌ ఆక్సైడ్‌ లేదా ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉండటంతో ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇనుము, మెగ్నీషియం ఎక్కువ; హ్యూమ‌స్‌
నైట్రోజన్‌ తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన దేశంలో ద్వీపకల్ప పీఠభూమి వైపున, ముఖ్యంగా ఈశాన్య ఆగ్నేయ భాగాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు దేశంలో 18 శాతం వరకు ఉండి, రెండో ప్రధాన నేలలుగా నిలిచాయి. వీటిలో మొక్కజొన్న, జొన్న, రాగులు, వరి, వేరుశనగలు, పప్పుధాన్యాలు, కూరగాయలు లాంటి ఆహార పంటలు పండుతాయి.    


3) నల్లరేగడి నేలలు: వీటినే రేగురు నేలలు అంటారు. ఇందులో టైటానియం ఆక్సైడ్‌ కలిసి ఉండటంతో నలుపు రంగులో ఉంటాయి. ఇవి మన దేశంలో దక్కన్‌ పీఠభూమి వైపు మాత్రమే 15 శాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు లావా ఘనీభవించడంతో ఏర్పడిన బసాల్ట్‌ శిలలు శిథిలమై ఇవి ఏర్పడ్డాయి. వీటికి నీటిని నిల్వ చేసుకునే స్వభావం ఎక్కువ. వేసవిలో పగిలిపోయి, నెర్రెలు ఇచ్చి మట్టి మార్పిడి జరుగుతుంది. అందువల్ల వీటిని సెల్ఫ్‌ ప్లవింగ్‌ నేలలు అంటారు. ఇందులో పత్తి, పొగాకు, చెరకు, మిరప, పసుపు, నూనె గింజలు లాంటి వాణిజ్య పంటలు బాగా పండుతాయి. 


4) లేటరైట్‌ నేలలు: అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బసాల్ట్, అల్యూమినియం శిలలు శిథిలమైనప్పుడు ఇవి ఏర్పడతాయి. కొండ వాలు ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, వింధ్య పర్వతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు లాంటి తోటల పంటలు; సుగంధ ద్రవ్యాలు, మామిడి, జీడిమామిడి లాంటి ఉద్యానవన పంటలు ఎక్కువగా పండుతాయి. 


5) పర్వత నేలలు: ఇందులో హ్యూమస్‌ పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటినే అటవీ నేలలు అని కూడా అంటారు. ఇవి కొండల మధ్య లోయల్లో విస్తరించి ఉంటాయి. హిమాలయాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలల్లో వరి, మొక్కజొన్నలతోపాటు పండ్ల తోటలు సాగు చేస్తారు. వీటిలో కరేవా నేలలు ప్రత్యేకమైనవి. సాధారణంగా సున్నపు నిక్షేపాల వల్ల ఏర్పడతాయి. జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌ వ్యాలీ, బద వ్యాలీలోనూ ఉన్నాయి. కుంకుమ  పువ్వు ప్రధానంగా పండుతుంది. బాదం, వాల్‌నట్, ఆపిల్‌ లాంటి వాటినీ సాగు చేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పలంపుర్, పుల్మావా, కుల్గాం ప్రాంతాల్లో నాణ్యమైన కుంకుమపువ్వు పండుతుంది. 


6) ఎడారి నేలలు:  ఇవి మన దేశంలో వాయవ్య ప్రాంతంలో రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోనూ, పంజాబ్, హరియాణా, నైరుతీ ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో ఫాస్ఫేట్లు, నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు అందిస్తే నేల సారవంతంగా మారి జొన్నలు, సజ్జలు, పప్పుధాన్యాలు లాంటి పంటలు పండుతాయి. దేశంలో పొడవైన వ్యవసాయ కాలువగా పిలిచే ఇందిరాగాంధీ కాలువ/రాజస్థాన్‌ కాలువ రాజస్థాన్‌లోని అతి శుష్క ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది. 


7) ఆమ్ల, క్షార నేలలు: నిస్సారమైన ఈ నేలలు దేశంలో 1.29 శాతం ఉన్నాయి. నేల గాఢత 6.5 pH కంటే తక్కువగా ఉంటే ఆమ్ల నేలలుగా, అదే 7.5 pH కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలలుగా పిలుస్తారు. ఇవి ఉత్తర మైదానంలº అక్కడక్కడ విస్తరించాయి. వీటిని సారవంతం చేయడానికి సున్నం లేదా జిప్సం ఎరువుగా వాడాలి. 


8) ఊబి నేలలు: వీటినే పీటీ నేలలు లేదా సేంద్రియ నేలలు అంటారు. పొటాషియం ఫాస్ఫేట్లు తక్కువగా ఉండి, హ్యూమస్‌ అధికంగా ఉంటుంది. దేశంలో 1.17% ఉన్నాయి.  కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లోనూ, పశ్చిమ బెంగాల్‌లో సుందరబన్స్‌ ప్రాంతంలోనూ, ఒడిశా, తమిళనాడు తీరాలకు దగ్గరలోనూ విస్తరించాయి. నల్లటి ఈ నేలలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. 

మృత్తికా క్రమక్షయం

  భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో మృత్తికా క్రమక్షయం ప్రధానమైంది. అధిక నీటి ప్రవాహం, పవనాలు, పశువుల గడ్డిమేత, అడవులు తొలగించడం లాంటి కారణాల వల్ల మృత్తిక కోసుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో 175 మిలియన్‌ హెక్టార్ల భూమిలో మృత్తికా క్రమక్షయం జరుగుతోంది. ఇది ఎక్కువగా ఎర్ర, నల్లనేలల్లో సంభవిస్తుంది. దేశంలో సాలీనా ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మట్టిని కోల్పోతున్నట్లు 1951లోనే ప్రణాళికా సంఘం తెలియజేసింది.

1) పటక్రమక్షయం: నేల పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని పటక్రమక్షయం అంటారు. ఈ ప్రక్రియ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో జరుగుతోంది.

2) వంక క్రమక్షయం: పట క్రమక్షయం మరింతగా కొనసాగితే దానిపైన చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడతాయి. దీన్నే వంక క్రమక్షయం అంటారు. ఇది ద్వీపకల్పం వెంట జరుగుతోంది.

3) అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం ఇంకా కొనసాగితే లోతైన, వెడల్పైన లోయలు ఏర్పడతాయి. వీటినే అవనాళికలు అంటారు. చంబల్, యమునా నదీ ప్రాంతాల్లో 10 మిలియన్‌ హెక్టార్ల భూమి గల్మీలుగా మారిపోయింది. 

4) రిపారియన్‌ క్రమక్షయం: నదుల గట్లు కోసి తీయడాన్ని రిపారియన్‌ క్రమక్షయం అంటారు. ఇది పశ్చిమ బెంగాల్‌లో గంగానది ప్రాంతంలో జరుగుతుంది.

5) పవన క్రమక్షయం: ఎడారుల్లో వీచే గాలుల వల్ల రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాల్లో క్రమక్షయం జరుగుతుంది.

నివారణ చర్యలు: మృత్తికా క్రమక్షయాన్ని నివారించకపోతే నేల సారాన్ని కోల్పోతుంది. రిజర్వాయర్ల అడుగు భాగంలో మట్టి చేరడంతో వాటి నీటి సామర్థ్యం తగ్గి తిరిగి వ్యవసాయంపైన పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి.

కాంటూర్‌ బండింగ్స్‌: వాలు ప్రాంతాల్లో అడ్డంగా గోడల్లాంటి నిర్మాణాలు చేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపే పద్ధతి. 

స్ట్రిప్‌ క్రాపింగ్‌: ఒక పంట పక్కనే మరొక పంటను జతగా వేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపవచ్చు.

స్టబుల్‌ మల్చింగ్‌: పంట కోతకొచ్చిన తర్వాత వాటి అడుగు భాగాలను కొంతకాలం నేలలో వదిలేయాలి.

టెర్రసింగ్‌: వాలు ప్రాంతాల్లో గట్లు కœట్టి పంటలు పండించాలి.

పోడు వ్యవసాయం: పొదలు, చెట్లు నరికి కాల్చి వాటి బూడిదపైన చేసే వ్యవసాయాన్ని నిరోధించాలి.

* మృత్తికా, జలవనరుల సంరక్షణ కోసం 8 ప్రాంతీయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

1) హిమాలయ ప్రాంత పరిశోధనా కేంద్రం - దెహ్రదూన్‌

2) శివాలిక్‌ ప్రాంత పరిశోధనా కేంద్రం - చండీగఢ్‌  

3) రాజస్థాన్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - కోట

4) గుజరాత్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - పసద్‌ 

5) యమునా అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - ఆగ్రా

6) నల్లరేగడి నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - బళ్లారి 

7) అటవీ నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - ఉదక మండలం

8) ఎడారి నేలల పరిశోధనా కేంద్రం - జోధ్‌పుర్‌ 

రచయిత: జల్లు సద్గుణరావు 


 

Posted Date : 06-05-2023

విపత్తు నిర్వహణ - సంసిద్ధ చర్యలు

సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!

  విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది ఒక సంరక్షణ ప్రక్రియ. ఇందులో ప్రభుత్వాలు, వ్యక్తులు విపత్తు    పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయడం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు, తగిన   హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. విపత్తు    సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే.

  కమ్యూనిటీ ప్రణాళిక: విపత్తు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతానికి పొరుగున ఉన్నవారు లేదా కమ్యూనిటీ ప్రజలే తక్షణం ప్రతిస్పందిస్తారు. స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఏ సహకారం అందకముందే ఇలాంటి ప్రతిస్పందనలు కనిపిస్తాయి.

  2004, డిసెంబరు 26న సునామీ తాకిడితో తమిళనాడులో సామియార్‌పెట్టాయ్‌ గ్రామానికంటే దాని చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. సామియార్‌పెట్టాయ్‌ గ్రామస్థులకు ప్రథమ చికిత్స, శోధన, రక్షణ చర్యలు, తొలి హెచ్చరిక వంటి వాటిలో ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండటంతో ప్రాణనష్టం స్థాయి తగ్గింది. ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా కమ్యూనిటీయే కీలకమని కొన్ని ప్రాధాన్యాలు వివరిస్తాయి.

1) మొదటి ప్రతిస్పందకుడు: ఏదైనా విపత్తు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కార్యాచరణలోకి దిగేది అక్కడి కమ్యూనిటీయే.

2) గరిష్ఠ సమాచారకుడు: ఒక ప్రాంతంలో విపత్తు   జరిగినప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది ఆ ప్రాంత నివాసితులే. అందువల్ల విపత్తుకు సంబంధించి అత్యంత నమ్మకమైన సమాచారాన్ని ఆ కమ్యూనిటీయే అందిస్తుంది.

3) స్థానిక యంత్రాంగాన్ని కలిగి ఉండటం: కొన్ని ప్రాంతాల్లో విపత్తులు పునరావృతం అవుతుంటాయి. అలాంటిచోట స్థానిక ప్రజలు సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలను ముందుగానే కలిగి ఉంటారు.

ఉదా: వరదలు వచ్చే ప్రదేశాలలో ఇళ్లకు దగ్గరగా గట్లు వేసుకుని నీళ్లు రాకుండా చేసుకునే ఏర్పాట్లు వంటివి.

4) స్వయం సహాయకుడు: విపత్తుల సమయంలో  స్థానికులకు బయటి నుంచి సహకారం అందేలోపు స్వయంగా వారిలో వారే సహాయం చేసుకుంటారు.

  పాఠశాల వద్ద విపత్తులు ఎదుర్కొనేందుకు నిర్వహణా ప్రణాళిక: 2001, జనవరి 26న గుజరాత్‌లో సంభవించిన కచ్‌ భూకంపంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కవాతు చేస్తున్న 300 మంది విద్యార్థులపై ఇరువైపులా ఉన్న  భవనాలు కూలడంతో చనిపోయారు. అందువల్ల పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉంటే    విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు. 

ఈ ప్రణాళికలో ఉండాల్సిన అంశాలు:

* ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యానికి విపత్తులపై అవగాహన కల్పించడం, విపత్తు నిర్వహణ ప్రణాళిక ఆవశ్యకతను తెలియజేయడం.

* విపత్తు నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడం.  ఈ కమిటీకి ప్రిన్సిపల్‌ నాయకత్వం వహించాలి.

* వైపరీత్యాన్ని గుర్తించడం, మదింపు చేయడం.

* మానవ వనరులు, భౌతిక వనరుల జాబితా తయారు చేయడం.

* చిన్నపిల్లలు, ఇతర సిబ్బంది తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించే విధంగా మ్యాపులు తయారుచేయడం.

* పాఠశాలలో సురక్షిత ప్రదేశం, ఖాళీ చేసే మార్గం సూచించే చార్టులు అందుబాటులో ఉంచడం.

గ్రామ విపత్తు నిర్వహణ ప్రణాళిక: సర్పంచ్‌ నాయకత్వంలో గ్రామ విపత్తు నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి (ఎమ్‌డీఓ) గ్రామస్థులకు సూచిస్తారు. ఆ విధంగా ఏర్పాటయ్యే కమిటీలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, స్వయం సహాయక సంఘం లీడర్లు, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీలో వాలంటీర్లుగా యువకులను తీసుకుంటారు. వారికి ప్రాథమిక వైద్యం అందించడంలో, శోధన, రక్షణ చర్యల్లో శిక్షణ ఇస్తారు. వీరంతా విపత్తు సమయంలో ముందుండి రక్షణ చర్యల్లో పాల్గొంటారు.

విపత్తు వేళ ప్రతి కుటుంబం వద్ద ఉండాల్సిన కిట్‌: 1) పొడి దుస్తులు 2) ఎండు ఆహార పదార్థాలు, తాగునీరు  3) ముఖ్యమైన పత్రాలు  4) బ్యాటరీలు, టార్చిలైట్, ట్రాన్సిస్టర్‌ 5) ప్రథమచికిత్స పెట్టె  6) అవసరమైన మందులు 7) ఇష్టమైన బొమ్మలు, ఆటవస్తువులు 8) దుప్పటి, దిండు 9) కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువుల ఫొటోలు.

దేశంలో విపత్తు నిర్వహణ పరిణామక్రమం

1) 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఈ తర్వాత బ్రిటిష్‌ హయాంలోనే విపత్తు నిర్వహణపై వ్యవస్థీకృత నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం ఒక శాఖను ఏర్పాటుచేసి ప్రధాన ఉపశమన అధికారి (సెంట్రల్‌ రిలీఫ్‌ కమిషనర్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు.

2) ఈ వ్యవస్థ విపత్తు సంభవించిన ప్రదేశంలో  ఉపశమన సామగ్రిని అందించడం, డబ్బు, వస్త్రాలు, మందుల పంపిణీ వంటి పరిమిత  విధులు నిర్వర్తించేది.

3) స్వాతంత్య్రానంతరం కూడా విపత్తు నిర్వహణ ప్రధాన   ఉపశమన అధికారి ఆధ్వర్యంలోనే చాలాకాలం కొనసాగింది.

4) 1990లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 1990 - 2000ను ప్రకటించింది. ఆ వెంటనే మన దేశంలో  శాశ్వతమైన సంస్థాగత విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

5) మహారాష్ట్రలోని లాతూర్‌ భూకంపం (1993), ఉత్తరాఖండ్‌లోని మాల్పా భూపాతం (1998), ఒడిశాలో సూపర్‌ సైక్లోన్‌ (1999) వంటి వరుస విపత్తుల నేపథ్యంలో 1999, అక్టోబరులో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి జె.సి.పంత్‌ ఛైర్మన్‌గా విపత్తులపై అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటుచేశారు.

6) 10వ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పథకాల్లో విపత్తు నిర్వహణ, తీవ్రతను తగ్గించే పథకాలను కూడా  కలిపినప్పుడే దీర్ఘకాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

7) 2002, ఫిబ్రవరి 2న విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి హోం మంత్రిత్వ శాఖలోని  ఒక సంయుక్త కార్యదర్శి  ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కొనసాగుతోంది.

8) ప్రస్తుతం విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బహుళ భాగస్వామ్య వ్యవస్థగా పనిచేస్తోంది. ఇందులో పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖల పాలనా సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ విధంగా దేశంలో విపత్తు   నిర్వహణ ఏదైనా సంఘటన  జరిగినప్పుడే ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తుకు ముందే దానికి దారితీసే కారణాలు  అన్వేషించి, వాటిని నివారించే వ్యవస్థాగత స్థాయికి అభివృద్ధి చెందింది. అంటే ఏక ప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్య  స్థాయికి చేరింది.

విపత్తు నిర్వహణ చట్టం: సమర్థ విపత్తు నిర్వహణకు, విపత్తుకు సంబంధించిన లేదా దానివల్ల యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల నిర్వహణకు భారత ప్రభుత్వం చట్టం చేసింది. 2005, డిసెంబరు 23న ‘విపత్తు నిర్వహణ చట్టం’ను రూపొందించింది. 

Posted Date : 21-05-2023

విపత్తు నిర్వహణలో అవశిష్ట నైపుణ్యాలు

ప్రాణాలు కాపాడే నేర్పరితనం!


  
  హఠాత్తుగా అనుకోని సంఘటనలు ఎదురైతే దాదాపు అందరూ కాసేపు స్తంభించిపోతారు. అలాంటిది పెద్ద ప్రమాదమే జరిగితే దాన్ని చూసిన, అందులో ఉన్న బాధితుల మానసిక స్థితిని ఊహించడం కష్టం. కానీ ఆ విధమైన విపత్కర పరిస్థితుల్లో కూడా విపరీత భావోద్వేగాలకు గురికాకుండా, పరిస్థితులకు అనుగుణంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమాచారాన్ని అందించడం, సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను అవశిష్ట నైపుణ్యాలు అంటారు. విపత్తు నిర్వహణలోని ఆ నేర్పరితనం ప్రాణాలను కాపాడుతుంది. ఆస్తులు సహా ఇతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది. 


  విపత్తు ఎప్పుడు, ఎక్కడ సంభవించినా మొదట స్పందించేది స్థానికులే. వారే వేగంగా తక్షణ, రక్షణ చర్యలు మొదలుపెడతారు. శిక్షణ, సరైన వనరులు లేకుండా విపత్తుల నుంచి బాధితులను రక్షించడం స్థానికులకు కష్టతరమైన అంశం. విపత్తు తర్వాత అక్కడి భౌతిక, పర్యావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శోధన, రక్షక చర్యలు (సెర్చ్, రెస్క్యూ) కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటం శోధన, రక్షక చర్యల బృందాల బలం, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.


  అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తి/వ్యక్తుల సమూహం నిర్వహించే ఒక సాంకేతిక చర్యను శోధన, రక్షక చర్యలుగా నిర్వచించవచ్చు. వీటిని కమ్యూనిటీ సాన్నిహిత్య సహకారం, బృంద దృక్పథంతో నిర్వహిస్తారు


శోధన, రక్షక చర్యల బృందం కూర్పు: నిజాయతీ, భావోద్వేగం, వృత్తిపరంగా తిరుగులేని నైపుణ్యం, శారీరక దారుఢ్యం, ప్రదర్శనా సామర్థ్యం, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండే స్త్రీ, పురుష వాలంటీర్లతో రక్షక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరికి 18 ఏళ్లు నిండి, స్థానిక భాషలో చదివే, రాయగలిగే సామర్థ్యం ఉండాలి. మాజీ సైనిక సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది.


ప్రధాన లక్ష్యాలు:  * కూలిన భవనాల శిథిలాల నుంచి లేదా తుపాను, సునామీ, వరదలు లాంటి కల్లోలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడటం.


* బాధితులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యచికిత్సకు పంపడం.

* కూలేందుకు సిద్ధంగా/ప్రమాదంలో ఉన్న భవనాలను తాత్కాలికంగా కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం.


* ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి, అక్కడినుంచి తొలగించి, సంబంధీకులకు అందజేయడం.


* స్థానిక వనరులను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ, ప్రదర్శన ద్వారా కమ్యూనిటీ ప్రజలకు అవగాహన కల్పించడం.


విధులు: దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టడం బృంద సభ్యుల ప్రాథమిక విధి. ఇది సమర్థ రక్షణకు ఉపయోగపడుతుంది. నష్టం జరిగిన ప్రాంతం పరిధి, వివరాలు, ఇంకా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా లాంటి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం.


మూడు కీలక సూత్రాలు: బృంద సభ్యులు శోధన, రక్షక చర్యల్లోకి దిగే ముందు కింది సూత్రాలు పాటించాలి.


పరిశీలించు (Look): జరిగిన సంఘటన ఏ రకమైందో కళ్లతో చూసి తనిఖీ చేయాలి.


విను (Listen): జరిగిన సంఘటన వివరాలు కమ్యూనిటీ (స్థానిక ప్రజలు) నుంచి లేదా ప్రభుత్వ రికార్డులు, మీడియా వంటి వనరుల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి చర్యల్లోకి దిగాలి.


స్పందించు (Feel): ప్రమాద తీవ్రత గురించి వాస్తవాన్ని గ్రహించి, దానికి ప్రతిస్పందించి చర్యల్లోకి దిగే ముందు వనరులను, సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.


రక్షక బృందం వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) తాడు  2) నిచ్చెన  3) కత్తిరించే చిన్న సాధనాలు  4) ప్రథమ చికిత్స పెట్టె  5) గునపం 6) సుత్తి  7) బాధితుడిని మోసుకెళ్లే జోలె (స్ట్రెచర్‌). అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సామగ్రి బృందానికి అందుబాటులో లేనప్పుడు స్థానికంగా లభించే పీపాలు, టిన్‌ డబ్బాలు, గొట్టాలు, కర్రలు లాంటి వస్తువులు వినియోగించుకునే సమయస్ఫూర్తి ఉండాలి.


రక్షక బృందం సభ్యుడి వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) హెల్మెట్‌  2) టార్చ్‌లైట్‌  3) గమ్ముతో అతికించిన బూట్లు  4) లైఫ్‌ జాకెట్‌  5) విజిల్‌


ప్రథమ చికిత్సే ప్రధానం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య ప్రథమ చికిత్స. గాయం తగిలిన లేదా అకస్మాత్తుగా జబ్బు పడిన బాధితుడికి అధునాతన వైద్యం అందించడానికి ముందు ప్రమాదం జరిగిన చోట లభించే మానవ, ఇతర వనరులతో తొలి సంరక్షణ అందించడమే ప్రథమ చికిత్స. దీనికి బంగారు సూత్రం.. ‘ప్రశాంతంగా ఉండాలి, భయాందోళన చెందవద్దు.’


కార్యాచరణ ప్రణాళిక: ప్రథమ చికిత్స అవసరమా, లేదా అని మదింపు చేసుకోవడంలో బృంద సభ్యులకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. లేదంటే ప్రాణం పోయిన శవాన్ని ఆస్పత్రిలో చేర్చినట్లవుతుంది. అందుకోసం రక్షక చర్యల బృందం సభ్యులు ముందుగా కింది పరిశీలనలు చేయాలి. వీటినే DRABC అంటారు.


* D - డేంజర్‌ (ప్రమాదం): మీకు/బాధితులకు/ఇతరులకు ఏదైనా ప్రమాదం ఉందేమో గమనించాలి.


* R - రెస్పాన్స్‌ (ప్రతిస్పందన): బాధితుడు స్పృహలో ఉన్నాడా లేదా అచేతనంగా ఉన్నాడా అని పరిశీలించాలి.


* A - ఎయిర్‌వే (వాయునాళం): ముక్కు తెరచుకుని ఉందో లేదో చూడాలి.


* B - బ్రీతింగ్‌ (శ్వాస): బాధితుడి శ్వాస శబ్దం వినిపిస్తుందా, గుండె కొట్టుకుంటుందా అనేది పరిశీలించాలి.


* C - సర్క్యులేషన్‌ (రక్తప్రసరణ): బాధితుడి నాడీ కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి.



ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన 12 వస్తువులు: 1) దూది  2) టేపు  3) బ్యాండేజ్‌  4) డ్రెస్సింగ్‌ క్లాత్‌  5) ట్రయాంగులర్‌ బ్యాండేజ్‌ 6) థర్మామీటర్‌ 7) కత్తెర  8) గ్లౌజులు 9) సబ్బు  10) నొప్పి నివారణ మందులు 11) యాంటాసిడ్‌ 12) ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు.


స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స:


ఆ వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. తల వెనక్కి వంచి, చేతులు శరీరానికి లంబకోణంలో ఉంచాలి.


* కాలిని 8 నుంచి 12 అంగుళాలు ముందుకు జరపాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది.


* దుస్తులు బిగుతుగా ఉంటే తొలగించాలి.


* బాధితుడి చుట్టూ జనం గుమికూడనీయకూడదు. 


కాలిన గాయాలకు చికిత్స: * కాలిన భాగాన్ని వెంటనే చల్లటి నీటిలో ముంచిన వస్త్రాలతో తుడవాలి.

* మంటల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే బయటకు లాగి వస్త్రంతో కప్పి దొర్లించాలి. లేదా తక్షణమే దుప్పటి చుట్టాలి.


* కాలిన ప్రాంతంలో వెన్న, నూనె, ఐస్‌ లాంటివి పూయకూడదు.


* గాయంపై నేరుగా నీటిని ధారాళంగా పోయకూడదు.


ఎముకలు విరగడం లేదా బెణకడం:  * విరిగిన ప్రదేశంలో దన్నుగా సరైన ప్యాడింగ్‌ చేయాలి.


* విరిగిన ప్రదేశాన్ని కదలకుండా ఉంచాలి.


* గాయం తగిలిన ప్రాంతంలో నొప్పి తగ్గే విధంగా వాపు రాకుండా ఐసు ముక్కతో రుద్దాలి.


* గాయంపై షాక్‌ తగలకుండా చికిత్స చేయాలి.


విద్యుదాఘాతం జరిగినప్పుడు: * కరెంట్‌ షాక్‌ తగిలిన వ్యక్తికి చికిత్స చేయడానికి ముందు విద్యుత్తు ప్రవాహాన్ని నిలిపివేయాలి.


* విద్యుత్తు నిరోధకం సాయంతో బాధితులను అక్కడి నుంచి తీయాలి.


* ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు షాక్‌ తగిలిన భాగాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలి.


*  DRABC ని పాటించాలి.


పాము కాటుకు గురైనప్పుడు: 


* పాము కాటుకు గురైన భాగాన్ని గుండె ఉన్న ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి.


* కాటు వేసిన భాగం నుంచి 15 నుంచి 30 సెకన్ల వరకు రక్తం కారనివ్వాలి.


* కాటు వేసిన ప్రాంతానికి రెండు అంగుళాలపైన బిగువైన రోలర్‌ బ్యాండ్‌ వేయాలి.


* కాటు వేసిన భాగాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి.


* పాము కాటు వేసిన వెంటనే అక్కడి రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయాలి. అలా చేసిన తర్వాత నీళ్లతో నోటిని పుక్కిలించాలి.


ఈ విధంగా చేసే ప్రథమ చికిత్స అనేక సందర్భాల్లో మరణం నుంచి వ్యక్తులను కాపాడుతుంది.


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 06-07-2023

భూకంపాలు - భూపాతాలు

  భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాల వల్ల భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చరియలు విరిగి పడటం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.

ఉదా: 2004, డిసెంబరు 24న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.


భూకంపం ఎందుకు వస్తుంది?

  భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటి కంటే పెద్దదైన 'భూపటలం' అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటినే 'పలక చలనాలు' అంటారు.

భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను 'సిస్మిక్ ప్రాంతాలు' లేదా 'భూకంప ప్రభావిత ప్రాంతాలు' అంటారు.


భూకంపాలు - కారణాలు

భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అయితే కింది కారణాల వల్ల భూకంపాలను కొంతవరకు గుర్తించవచ్చు.

అవి: 1) అగ్నిపర్వతాల ఉద్భేదన ప్రక్రియ

     2) అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనం

     3) గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం

     4) భూ అంతర్భాగంలో పలక చలనాలు (ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్)

పై కారణాల వల్ల భూ అంతర్భాగంలో ఎక్కడైన అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు ప్రారంభమైన మూల స్థానాన్ని 'భూకంపనాభి' అంటారు. నాభి నుంచి ఉపరితలానికి చేరే ప్రాంతాన్ని 'అధికేంద్రం' అంటారు. భూకంప నాభి నుంచి ప్రకంపనాలు పరావర్తనం చెంది వక్రీభవిస్తాయి.


భూకంప కదలికలు - తరంగాలు


భూ అంతర్భాగంలో కదలికలు/ పలక చలనాలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే 'సిస్మిక్ తరంగాలు' అంటారు. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.

ఇవి మూడు రకాలు:

ఎ) భూమిలో ప్రారంభమయ్యే మొదటి తరంగాలను 'p' లేదా ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి ఒత్తిడితో కూడిన శబ్ద తరంగాలు. అన్ని మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.

బి) రెండో తరంగాలను 's' లేదా గౌణ తరంగాలు అంటారు. ఇవి నిటారుగా/ ఊర్థ్వ వ్యాప్తంగా, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూ కేంద్రం ద్వారా ప్రయాణించవు.

సి) 'p', 's' తరంగాల వల్ల వచ్చే ఉపరితల తరంగాలను 'L' లేదా దీర్ఘ తరంగాలు అంటారు. వీటి వల్ల భూ ఉపరితల నష్టం తీవ్రంగా ఉంటుంది.


భూకంపాలు - విస్తరణ


* భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.

¤* ఇవి అగ్నిపర్వత ప్రాంతాల్లో, ముడుత పర్వతాలు ఉన్నచోట ఎక్కువగా సంభవిస్తాయి.

¤* ఇప్పటివరకు భూకంపాలను గుర్తించని ప్రాంతం ఆస్ట్రేలియా.

¤* భూకంపాలను ముందుగా పిల్లులు, పాములు, పశువులు గుర్తిస్తాయి.

* ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యదరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.


భూకంపాలు - పరికరాలు

* భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్/ భూకంప లేఖిని అంటారు. దీన్నే మెర్కెలి స్కేలు అని పిలుస్తారు. ఈ స్కేలును  ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఉపయోగించవచ్చు.

* భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని.

* భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుతో గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రోటోల్యూన్ (TNT) పదార్థం ఆధారంగా లెక్కిస్తారు. రిక్టర్ స్కేలుపై 09 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేలు కొలత 7.0 కంటే ఎక్కువ న‌మోదైన‌ప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.

* భూకంప తీవ్రతను మరో పద్ధతి ద్వారా 'భ్రామక పరిమాణ' స్కేలును ఉపయోగించి కనుక్కోవచ్చు.


రిక్టర్ స్కేలు రీడింగ్ - భూకంప ప్రభావం

   రిక్టర్‌స్కేలు           -              భూకంప ప్రభావం

ఎ) 3.5 కంటే తక్కువ   -      మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి.

బి) 3.5 - 5.4         -     కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49 వేల సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు.

సి) 5.5 - 6.0        -     భవనాలు, నాణ్యతలేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి.

డి) 6.1 - 6.9         -    100 కి.మీ. వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.

ఇ) 7.0 - 7.9         -    పెద్ద భూకంపాలు, ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.

ఎఫ్) 8.0 కంటే ఎక్కువ  -  తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతి పెద్ద భూకంపాలు


ఇప్పటివరకు రిక్టర్‌స్కేలుపై 9.0 వచ్చిన భూకంపాలు

1) 1960 చిలీ  2) 1964 అలస్కా 3) 2004 ఇండోనేసియా, భారతదేశం


భూకంపాలు - ఫలితాలు

* భూకంపాలు నిర్ణీత వ్యవధిలో (ఒక నిమిషంలోపే) వస్తాయి.

* భూకంపాలకు పగలు, రాత్రి సమయాలుండవు. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య  ఉంటాయి.

¤* భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది.


భారతదేశంలో భూకంపాలు

* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బిహార్‌లో వస్తున్నాయి.

ఉదా: 1897లో ఈశాన్య షిల్లాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ హైదరాబాద్ భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 2002లో జోన్ - I ను జోన్ - II లో విలీనం చేశారు. ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. వీటిలో జోన్ V అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు జోన్ - V లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 4వ జోన్ పరిధిలో ఉంది.

* భారత భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో భూకంపాల వల్ల సుమారు 59% దుర్బలత్వం సంభవిస్తుంది.

ఉదా: 1) 2001, జనవరి 26 - గుజరాత్ భుజ్ భూకంపం

     2) 2005, అక్టోబరు 8 - జమ్మూ కశ్మీర్ ఉరి, తంగదర్ భూకంపం

     3) 2011, అక్టోబరు 5 - సిక్కిం భూకంపం

     4) 2015, ఏప్రిల్ 25 - కాఠ్‌మాండూ, బిహార్ భూకంపం

* ప్రాంతీయ భూకంప ప్రమాదాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, గోదావరి మైదానాలు 3వ జోన్‌లోనూ, హైదరాబాద్ నగరం 2వ జోన్‌లోను ఉన్నాయి.


భూకంప అధ్యయనాలు - పరిశోధన

* భూకంపాలను సిస్మాలజీ ద్వారా అధ్యయనం చేస్తారు.

* సమాన భూకంప ప్రాంతాలను కలిపే రేఖలను 'ఐసో సిస్మిల్స్' అంటారు.

* అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం - లండన్.

* జాతీయ భూకంప పరిశోధన సమాచార కేంద్రం - న్యూదిల్లీ.

* ఇండో రష్యా భూకంప పరిశోధన కేంద్రం - న్యూదిల్లీ.

¤* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ - హైదరాబాద్.

¤* 1898లో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.

* రూర్కీ (ఉత్తర్ ప్రదేశ్)లోని కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే భవన నిర్మాణ ప్రణాళికలను రూపొందించింది.


భూపాతాలు

* వాలుగా ఉండే నిర్మాణ ప్రదేశాల్లో ప్రకృతి కారకాల వల్ల కొంత భాగం విడివడి బయటకు కొట్టుకుని పోయి క్రమక్షయం చెందడాన్ని 'భూపాతం' అంటారు. వీటినే కొండ చరియలు విరిగి పడటం లేదా పదార్థ నాశనం అంటారు. ఇటీవల 2018 ఆగస్టులో కేరళలో అధిక వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

* ఇవి ఎక్కువగా పర్వత వాలు ప్రదేశాలు, నదీ వక్రతల ప్రాంతాలు, అధిక వర్షం కురిసే కొండ ప్రాంతాల్లో సంభవిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో గృహ నిర్మాణం 'పిరమిడ్' ఆకారంలో ఉండటం వల్ల భూపాతాల నుంచి రక్షణ పొందవచ్చు.

* భారతదేశంలో వీటి వల్ల 15 శాతం దుర్బలత్వం ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాలు 7 పొరల అవక్షేప శిలలతో ఏర్పడి ఉన్న కారణంగా ప్రపంచ భూపాతాల్లో అధికంగా 30 శాతం ఇక్కడే సంభవిస్తున్నాయి.

ఉదా: 2013, జూన్ 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయి.

* దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అధిక వర్షం, అడవులను నరికివేయడం వల్ల ఎక్కువగా భూపాతాలు ఏర్పడుతున్నాయి.

* భూపాతాలను 'లాండ్‌స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి' ద్వారా ముందే గుర్తిస్తారు. 2004 నుంచి భూపాతాలకు నోడల్ ఏజెన్సీగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కతా బాధ్యత వహిస్తుంది.

హిమపాతాలు:

* వీటినే మంచుకొండలు విరిగి పడటం అంటారు. ఇవి ఎక్కువగా అతి శీతల, ఎత్తయిన ప్రాంతాల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల పర్వతం పైభాగం నుంచి కిందికి జాలువారుతూ తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.

* ఈ రకమైన మంచు లేదా హిమపాతాలు సాధారణంగా ద్రాస్, ఫెర్ పంజాల్, స్పిటి, లేహ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

* హిమాలయ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కులు, స్పిటి, కిన్నార్; ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో హిమపాతాలు సంభవిస్తాయి.


ఉరుములు, మెరుపులు:

మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలతో ఘర్షణ వల్ల ఆవేశపూరితం అవుతాయి. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ధన, రుణ ఆవేశాల మధ్య ఉత్సర్గం (discharge) జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలు/ రేఖలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. వీటినే మెరుపులు, ఉరుములు అంటారు. ఈ ప్రక్రియను 'విద్యుత్ ఉత్సర్గం' అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరుగుతుంది. ఇవి ఎక్కువగా వర్షం వచ్చే ముందు వస్తాయి. వీటిని 'లైట్నింగ్ డిటెక్టర్ల' ద్వారా 90 శాతం కచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పుణెలో ఉంది. లైట్నింగ్ డిటెక్టర్లను ఫిన్‌లాండ్ తయారు చేస్తుంది. పిడుగులు/ మెరుపుల నుంచి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి 'తటి ద్వాహకం' (Lightning) లను ఉపయోగిస్తారు.                                                                                                              ‌

Posted Date : 08-07-2023

కరవు - వరదలు

ప్రస్తుత ప్రపంచంలో జనాభా విస్ఫోటనం, వన నిర్మూలన, మానవ జీవ వ్యర్థాలు, అధిక పరిశ్రమల వ్యర్థాల వల్ల కార్బన్ల సంఖ్య అధికమై పర్యావరణం క్షీణించి అనేక ఖండాలు, దేశాల్లో భూతాపం పెరిగి కరవులు, వరదలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా పశ్చిమ పసిఫిక్‌లో ఎల్‌నినో, లానినో పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక కరవు కాటకాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ - పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.


కరవు ఎలా వస్తుంది?


  కరవు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో కురవాల్సినంతగా వర్షం కురవకపోతే ఆ ప్రాంతం పొడిగా మారుతుంది. దాన్నే కరవు అంటారు. కరవును క్షామం, అనావృష్టి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని 'కరవు పీడిత ప్రాంతాలు' అంటారు.

ఉదా: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి అయిదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరవు ఏర్పడే అవకాశం ఉంది.

* ఒక ప్రాంతంలో అధిక లేదా అల్ప వర్షపాతాన్ని (70 - 100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు.


a) అధిక: + సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ.


b) సాధారణ: + సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ.


c) అల్ప: - సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ.


d) అత్యల్ప: - సగటు వర్షపాతం కంటే 60% తక్కువ.

¤* జాతీయ వ్యవసాయ కమిషన్ (National Commission for Agriculture) కరవును మూడు రకాలుగా పేర్కొంది.


a) వాతావరణ కరవు: ఈ రకమైన కరవు సాధారణ అవపాతంలో (వర్షం) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించడం.


b) వ్యవసాయ కరవు: మృత్తికల్లో తేమ లోపించడం, నేలలు సరిగా లేకపోవడం.


c) జల సంబంధ కరవు: భూగర్భ జలాలు ఇంకిపోవడం, మృత్తికలు అంతర్ భౌమ జలాలను గ్రహించకపోవడం.

* 2016 డిసెంబరు జాతీయ కరవు నిర్వహణ కరదీపిక (Manual of Drought Management) లో కరవును నాలుగు రకాలుగా పేర్కొన్నారు.

a) 750 mm కంటే తక్కువ వర్షం - దీర్ఘకాలిక కరవు - 33%

b) 750 mm - 1125 mm మధ్య వర్షం - కరవు పీడిత ప్రాంతం - 35%

c) 1126 mm - 2000 mm అధిక వర్షం - సాధారణ కరవు - 24%

d) 2000 mm కంటే అధిక వర్షం - కరవులేని ప్రాంతం - 8% గా దేశభౌగోళిక వైశాల్యంలో కలిగి ఉంది.

* భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును 5 రకాలుగా వర్గీకరించింది. భారతదేశభౌగోళిక వైశాల్యంలో 68% కరవులు సంభవిస్తున్నాయి.


కరవు ప్రభావం:

కరవు సంభవించిన ప్రాంతాల్లో దాని ప్రభావం క్రమేణ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

¤* భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగు నీటి కొరత.

¤* పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.

¤* ఆహార ధాన్యాల, పశుగ్రాస కొరత; పశువులు చనిపోవడం.

¤* పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో అతిసారం, కలరా లాంటి రోగాలు; ఆహార కొరత వల్ల కంటి చూపు దెబ్బతినడం, పని కోసం ప్రజలు వలస వెళ్లడం.


కరవు నివారణ, దాన్ని ఎదుర్కోవడం:

* కరవు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం కాదు. అది నిదానంగా వస్తుంది. దీన్నే Creeping Disaster అంటారు.

¤* మన దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.

¤* బెంగాల్ కరవు వల్ల 1770లో మొత్తం జనాభాలో 33% ( 1/3వ వంతు) మంది మరణించారు.

¤* 1943 - 44లో మన దేశంలో 3 - 4 మిలియన్ల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు.

¤* మన దేశంలో తరచూ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవులు ఏర్పడతాయి.

¤* కరవును నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

* వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు.

* కరవు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తుంది.


వరదలు (Floods)

ఒక ప్రాంతంలో కొంతకాలం పొడిగా ఉండి అకస్మాత్తుగా అధిక వర్షాలతో ఆ ప్రాంతం పొంగి పొర్లడాన్ని వరదలు అంటారు. అంటే కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం రావడాన్ని 'వరద బీభత్సం' లేదా 'అతివృష్టి' అంటారు.

సాధారణంగా వాతావరణ శాఖ (IMD) ప్రకారం భూ ఉపరితలంపై 12 అంగుళాల వర్షం కురిసినప్పుడు వరదగా ప్రకటిస్తారు.


ప్రధానంగా వరదలు అనేవి

a) అధిక వర్షం కురిసే మైదాన ప్రాంతాల్లో

b) పర్వత వాలు ప్రదేశాల్లో

c) నదీ వక్రత, తీర ప్రాంతాల్లో

d) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

* ప్రకృతి విపత్తుల్లో వరదలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆయా దేశాలను అకస్మాత్తుగా ముంచేస్తాయి. ఇవి ఆరు అంగుళాల వరదలో మనిషిని ప్రమాదంలోకి నెట్టి వేస్తాయి.

* ప్రపంచంలో ఎక్కువగా వరదలు ఆసియా తూర్పు దేశాల్లో (80%) సంభవిస్తున్నాయి.

* వరదల నుంచి కాపాడటానికి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు 'నైలో మీటర్' సాధనాన్ని ఉపయోగిస్తారు.

* గ్రామీణ ప్రాంతంలోని మైదాన వరదల కంటే పట్టణ ప్రాంతంలోని వరదలు వైశాల్యంలో 6 రెట్లు, ఎత్తులో 8 రెట్లు ఎక్కువగా వస్తాయి. కారణం పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ సరిగా లేకపోవడం, ఇరుకు రోడ్లు, భూమి నీటిని పీల్చుకోకపోవడం.


భారతదేశం - వరదలు

మన దేశంలో వరదలు ప్రధానంగా అతిపెద్ద నదులైన గంగా - సింధూ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల్లో వస్తున్నాయి. వాటిలో ఆకస్మిక వరదలు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తున్నాయి.

A) ఉత్తర భారతదేశంలో 60% వరదలు గంగా - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల వల్ల సంభవిస్తున్నాయి.

గంగా నది  దాని ఉపనది ప్రాంతాలైన ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, బెంగాల్‌లో అత్యధిక భౌగోళిక వైశాల్యం వరద ప్రమాదంలో ఉంది. అలాగే గంగా - బ్రహ్మపుత్ర నదుల వల్ల తరచుగా అసోం, బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో వరదలు వస్తున్నాయి.

ఉదా: 2013 జూన్ 17 నాటి ఉత్తరాఖండ్ వరదల వల్ల సుమారు 5 వేల మంది మరణించారు.

2016 సెప్టెంబరు 3 - 6 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది వరద వల్ల 300 మంది మరణించారు.

B) ద్వీపకల్ప భారత్‌లో 40% వరదలు స్థానిక నదుల వల్ల వస్తున్నాయి. దక్షిణ భారత్‌లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా వరదలు వస్తాయి.

ఉదా: 2009లో తుంగభద్ర నది వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు వచ్చాయి.

మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్లలో వరదలు వస్తున్నట్లు జాతీయ వరద కమిషన్ పేర్కొంది. దేశ  భౌగోళిక వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూభాగంలో వరద ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. జాతీయ విపత్తు వరద అంచనా ప్రకారం భౌగోళిక ప్రాంతంలో 12% వరదలు వస్తున్నట్లు పేర్కొంది. 2016 UNISDR ప్రకారం ప్రతి సంవత్సరం 5% వరదలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు, విపత్తులకు ఖర్చు చేసే వ్యయంలో కేవలం వరదలకే 33% వెచ్చిస్తున్నట్లు అంచనా వేసింది.


వరదలు - నివారణ చర్యలు

¤* 1937లో బ్రిటిష్‌వారు వరదలను నివారించడానికి ఒక సివిల్ సర్వెంట్ ద్వారా 'ఫ్లడ్ రిలీఫ్ కమిషన్‌'ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేవారు.

* 1954లో 'జాతీయ వరద నియంత్రణ మండలి'ని (National Flood Control Board - NFCB) ఏర్పాటు చేశారు.

* 1980లో జాతీయ వరద కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* 2010లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని NDMA మార్గదర్శకాల ప్రకారం పట్టణ వరద విపత్తు నివారణ (UFDM)ను రూపొందించారు.

* వరదలు వస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరిస్తుంది.

* ప్రతి సంవత్సరం వరదల వల్ల 8.1 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, 3.6 మిలియన్ హెక్టార్ల పంటలు నష్టపోతున్నాయి.

* వరదలను నివారించడానికి 2007-12 మధ్య 11వ ప్రణాళికలో రూ.8 వేల కోట్లను కేటాయించారు.


వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

a) మరిగించిన నీటిని తాగాలి.

b) డయేరియా ప్రబలినప్పుడు టీ - డికాషన్లు, గంజి, లేతకొబ్బరి నీరు తీసుకోవాలి.

c) వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.

d) నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ (Halogen) బిళ్లలు ఉపయోగించాలి. 

Posted Date : 08-07-2023

ఆవరణ శాస్త్రం - పోషక వలయాలు

జీవనాధార వలయాలు

  భూమి మీద సమస్త జీవరాశులకు, జీవ పక్రియలకు సౌరశక్తి ప్రధాన ఆధారం. సౌరశక్తి వల్ల నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. తిరిగి వర్షించి చక్రీయ వలయంలో నీరుగానే మారుతుంది. ఆవరణ వ్యవస్థలోని కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ లాంటి పోషకాలు నిరంతరం జీవులకు, వాటి పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడతాయి. అసలు ఈ వలయాలు జీవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

  ప్రతి జీవికి శ్వాసించడానికి, శారీరక ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి నిర్వహించడానికి నిరంతరం పోషక విలువలు కావాలి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్‌ మొదలైన ఖనిజ పోషకాలు నేలలో, నీటిలోనూ స్థిరంగా ఉంటాయి. వీటినే పోషకాల నిలకడ స్థితి అంటారు. అయితే ఇవి జీవులకు, వాటి పరిసరాలైన శిలావరణం, జలావరణం, వాతావరణాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడుతుంటాయి. దీన్నే జీవ-భూ-రసాయన వలయం అంటారు. ఈ వలయం సక్రమంగా కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర పోషిస్తాయి.

  చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడిన సేంద్రియ పదార్థాల్లో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. బ్యాక్టీరియా చర్యల వల్ల సేంద్రియ పదార్థాలు చివరికి సరళమైన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు లాంటి సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్చుకుంటాయి. అవి తిరిగి ఆహార గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని జీవజాతులకు అందుతాయి. ఈ వలయం నిరంతరం కొనసాగుతుండటంతో ఆవరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. 

పోషక వలయాలను కింది విధంగా విభజించారు

ఆక్సిజన్‌ వలయం: పరిసరాల్లోని జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య జరిగే ఆక్సిజన్‌ వినిమయాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. చెట్లు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరిపి తిరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్‌ను గాలిలోకి విడుదల చేస్తుంటాయి. వాతావరణంలో 21% వరకు ఉండే ఆక్సిజన్‌ నీటిలోనూ కొంత కరిగి ఉంటుంది. అదేవిధంగా ఓజోన్‌ పొరలో కూడా ఆక్సిజన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్‌ పుష్కలంగా లభించి సమస్త ప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది.


కర్బన వలయం: వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్‌ వెన్నెముక లాంటిది. భూమి మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో లభించే కార్బన్‌ డై ఆక్సైడ్‌ని సూర్యకాంతి సమక్షంలో మొక్కలు శోషించుకుని కార్బోహైడ్రేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ పోషకం ఉత్పత్తిదారులు, వినియోగదారులకు బదిలీ అవుతూ చివరగా బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు లాంటి విచ్చిన్నకారుల వల్ల సరళ అకర్బన పదార్థాలుగా విడిపోతుంది. అంతిమంగా దీనిలోని కార్బన్‌ వాయుస్థితిలో వాతావరణంలోకి, కార్బోనేట్, బైకార్బోనేట్‌ల రూపంలో జలావరణం, శిలావరణంలోకి బదిలీ అవుతుంది. ఈవిధంగా కార్బన్‌ ఘన, ద్రవ, వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ అవుతూ తిరిగి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోనేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.


నత్రజని వలయం: వాతావరణంలో నైట్రోజన్‌ వాయువు 78% వరకు ఉంటుంది. ఇది జడవాయువు. రసాయన చర్యల్లో పాల్గొనదు. జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు. ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల నిర్మాణానికి నత్రజని మూలాధారం. అయినప్పటికీ జీవజాతులు నైట్రోజన్‌ని పరోక్షంగానే గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువు నేలలో నైట్రేట్లుగా స్థిరీకరణకు గురవుతుంది. దీన్నే నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రేట్లను వృక్షాలు నేల నుంచి గ్రహిస్తాయి. నత్రజని స్థాపన వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా మారుతుంది. మొక్కల కళేబరాల్లోని ఈ కర్బన నత్రజని సూడోమోనాస్‌ లాంటి నత్రీకరణ బ్యాక్టీరియా వల్ల వినత్రీకరణ (డీనైట్రిఫికేషన్‌) జరిగి కొంత నైట్రేట్లుగా నేలలోకి పోగా, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ విధంగా జీవులకూ, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు.


ఫాస్ఫరస్‌ వలయం: శక్తి వాహకంగా వ్యవహరించే ఫాస్ఫరస్‌ అవక్షేప వలయాల్లో చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్‌ మూలకం అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ ్బతిగిశ్శి గా కణజాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది భౌమావరణ వ్యవస్థలోనూ, జలావరణ వ్యవస్థలోనూ కొద్దిమొత్తంలో లభిస్తుంది. ఫాస్ఫాటిక్‌ శిలల శైథిల్యం ద్వారా లభించిన ఆర్ధోఫాస్ఫేట్‌ అయాన్ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్లు.. వృక్షాల జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి ఆహారపు గొలుసుల ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలో విడుదలైన ఫాస్ఫేట్లు తిరిగి వృక్షాలకు వినియోగమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం ఎక్కువవడంతో నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోయి యూట్రిఫికేషన్‌కు దారితీసి జలకాలుష్యం ఏర్పడుతోంది. 


జల వలయం: జీవులకు, వాటి చుట్టూ ఉన్న వాతావరణం, శిలావరణం, జలావరణం లాంటి భౌతిక పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని జలచక్రంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమికి చేరే సౌర వికిరణం ద్వారా జలాశయాలు, మంచు ప్రాంతాల నుంచి బాష్పీభవనం (నీరు ఆవిరవడం), ఉత్పతనం (ఘన పదార్థాలు నీరుగా ఆవిరవడం), బాష్పోత్సేకం (చెట్ల నుంచి విడుదలయ్యే నీటిఆవిరి) లాంటి ప్రక్రియల ద్వారా నీరు గాలిలోకి చేరి మేఘాలుగా మారుతుంది. తిరిగి మేఘాలు ద్రవీభవనం చెంది వర్షంగా, ఘనీభవనం చెంది మంచుగా భూమికి చేరతాయి. ఈవిధంగా భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి కావాల్సిన నీటి అవసరాలు తీరుతున్నాయి.


మాదిరి ప్రశ్నలు

1. జీవ సందీప్తి అంటే ఏమిటి?  

1) కొన్ని జీవులు కాంతి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం

2) కొన్ని జీవులు కాంతిని గ్రహించడం

3) కొన్ని జీవులు కాంతిని తీసుకోకపోవడం

4) గాలి, సూర్యరశ్మి సంయోగం చెందడం

2. సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకాంతిని ఏమంటారు? 

1) సౌరవికిరణం 2) సూర్యపుటం 3) భూవికిరణం 4) పైవేవీకాదు

3. బాష్పోత్సేకం అంటే ఏమిటి?

1) చెట్లు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం           

2) చెట్లు ఆకుల ద్వారా నీటిని విడిచిపెట్టడం

3) చెట్లు ఆకు రాల్చడం                   

4) చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడం

4. ఘనపదార్థాలు నేరుగా ఆవిరవడాన్ని ఏమంటారు? 

1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం 3) ఉత్పతనం 4) హైడ్రేషన్‌

5. సౌర వికిరణం అంటే ఏమిటి?

1) సూర్యుడు బయటకు విడుదల చేసే శక్తి 

2) సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి

3) సూర్యుడి కేంద్రంలో ఉద్భవించే శక్తి 

4) సౌరశక్తి వల్ల నీరు ఆవిరవడం

6. వృక్ష, జంతు కణజాల నిర్మాణానికి వెన్నెముక లాంటిది? 

1) ఆక్సిజన్‌ 2) నైట్రోజన్‌ 3) కార్బన్‌ 4) హైడ్రోజన్‌

7. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి అకర్బన పోషకాల మొత్తం పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1) నిలకడ స్థితి 2) బయోమ్‌ 3) జీవ ద్రవ్యరాశి 4) బయోట్‌

8. ఆవరణ వ్యవస్థలో జీవులకు, పరిసరాలకు మధ్య పోషకాల చక్రీయ బదిలీ విధానాన్ని ఏమంటారు?  

1) భూ - జీవ వలయం 2) భూ- రసాయన వలయం 

3) భూ విజ్ఞాన వలయం 4) జీవ- భూ- రసాయన వలయం

సమధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-1, 6-3, 7-1, 8-4.

జల వలయం:

Condensation = ద్రవీభవనం

Precipitation = అవపాతం

Evaporation = బాష్పీభవనం

Rain =  వర్షం

Snow = మంచు

Surface Runoff = ఉపరితల నీరు

Ground Water = భూగర్భ జలం

జల్లు సద్గుణరావు

Posted Date : 09-07-2023

చక్రవాతాలు

సుడిగాలుల విలయం

  ప్రచండ వేగంతో వీచే గాలుల ధాటికి భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతాయి. కరెంటు స్తంభాలు కట్టె పుల్లల్లాగా నేలకొరుగుతాయి. ఇళ్ల పైకప్పులు గాలిలో చెక్కర్లు కొడతాయి. వాటికి కుంభవృష్టి తోడై నీరు వరదలై పారుతుంది. తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఈ విలయం ఎలా ఏర్పడుతుంది? ఆ సుడిగాలులు సృష్టించే విధ్వంసాలకు కారణం ఏమిటి? విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి తెలుసుకోవాలి. 


విధ్వంసం సృష్టించగలిగే వేగమైన గాలులు, కుండపోత వర్షంతో కూడిన వాతావరణ పరిస్థితినే చక్రవాతం అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సముద్రనీటి మట్టాన్ని పెంచి, తీరంలోని భూభాగాన్ని ముంచెత్తే ఉప్పెనగా (అధిక వేళాతరంగాలు) కూడా మారతాయి. చుట్టూ అధిక పీడన ప్రాంతంతో ఆవరించిన అల్పపీడన ప్రాంతంలోని శక్తిమంతమైన గాలులతో కూడిన సుడులు తిరిగే వాతావరణ అలజడే చక్రవాత స్వరూపం. ఇవి ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో సుడులు తిరుగుతాయి. చక్రవాతాన్ని ఆంగ్లంలో సైక్లోన్‌ అంటారు. అది ‘సైక్లోస్‌’ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. గ్రీకు భాషలో సైక్లోస్‌ అంటే పాము మెలికల చుట్ట అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా ఉన్నట్లు గమనించిన హెన్రీ పెడింగ్టన్‌ అనే బ్రిటన్‌ వాతావరణ శాస్త్రవేత్త 1848లో వీటికి ‘సైక్లోన్‌’ అని పేరు పెట్టారు.


అల్పపీడనం నుంచే ఆవిర్భావం


  సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ఒక అల్పపీడన ప్రాంతం అన్ని వైపుల నుంచి అధిక పీడన గాలులను ఆకర్షించడం వల్ల మధ్యలో చక్రవాత కేంద్రం ఏర్పడుతుంది. దీని వ్యాసార్ధం సుమారు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిధిలో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ చుట్టూ చక్రవాత కుడ్యంగా పిలిచే ప్రాంతం విధ్వంసకర పవనాలతో అలజడి సృష్టిస్తుంది. ఈ చక్రవాతాలను మూడు దశలుగా విభజించారు.


1) రూపకల్పన దశ: బాష్పీభవనం ద్వారా గాలిలో 7,000 మీటర్ల ఎత్తు వరకు అధిక సాపేక్ష ఆర్ధ్రతను చేరుకోవడానికి సముద్ర నీటిలో 60 మీటర్ల లోతు వరకు 26 డిగ్రీసెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటప్పుడే క్రమంగా నీటిఆవిరి నల్లని క్యుములోనింబస్‌ మేఘాలుగా మారుతుంది. 


2) పరిపక్వ దశ: ఈ దశలో క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుములు, మెరుపులను ఏర్పరుస్తూ చక్రవాత కంటి చుట్టూ పట్టీల్లా దట్టంగా అల్లుకుంటాయి. ఆ సమయంలో చక్రవాత కన్ను ఉపగ్రహ చిత్రాల్లో నల్లని కేంద్రం/చుక్కగా కనిపిస్తుంది. ఈ నల్లని కేంద్రం ఎంత చిన్నగా కనిపిస్తే చక్రవాతం అంత బలంగా మారుతుంది. చక్రవాతం క్రమంగా తన స్థానాన్ని జరుపుతూ తీరాన్ని తాకుతుంది.


3) బలహీనపడటం: గాలి పీడనంలో వచ్చిన మార్పుల వల్ల చక్రవాతం పైకి లేదా కిందికి జరిగినప్పుడు అకస్మాత్తుగా ఛేదనం చెంది బలహీనపడుతుంది. ఈ విధంగా చక్రవాతాల కాలవ్యవధి 24 గంటల కంటే తక్కువ వ్యవధి నుంచి 3 వారాల కన్నా ఎక్కువకాలం వరకు ఉండవచ్చు. ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి సగటున 6 రోజులు పడుతుంది. అత్యంత సుదీర్ఘ చక్రవాతంగా పేరు పొందిన ‘టైఫూన్‌ జాన్‌’ 1994లో ఆగస్టు - సెప్టెంబరుల మధ్య 31 రోజులు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగింది.


వివిధ పేర్లు


చక్రవాతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలవారీగా వివిధ పేర్లతో పిలుస్తారు.

* హిందూ మహాసముద్రం (భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, అరేబియా దేశాలైన యెమన్, ఒమన్‌) దేశాల్లో - ఉష్ణమండల తుపాన్లు

* ఆస్ట్రేలియా - విల్లీ - విల్లీలు

* వాయవ్య పసిఫిక్‌లో చైనా, జపాన్‌ - టైఫూన్లు

* పిలిఫ్పైన్స్‌ - బగుయియేస్‌

* ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో అమెరికా తూర్పుతీరం పైన, వెస్టిండీస్‌ దీవులు - హరికేన్లు 

* అమెరికా సంయుక్త రాష్ట్రాల భూప్రాంతం - టోర్నడోలు

గాలి వేగం ఆధారంగా తుపాను తీవ్రత
కల్లోల రకం గాలి వేగం (గం./కి.మీ.లలో)
అల్పపీడనం (Low pressure) 31
వాయుగుండం (Depression) 31 - 49
తీవ్ర వాయుగుండం (Deep depression) 49 - 61
తుపాను కల్లోలం (Cyclonic storm)  61 - 88
తీవ్ర తుపాను కల్లోలం (Severe cyclonic storm) 88 - 118
అతి తీవ్ర తుపాను కల్లోలం (Very sever cyclonic storm) 118 - 221 
సూపర్‌ సైక్లోన్‌  221 కంటే ఎక్కువ


సూపర్‌ సైక్లోన్‌: 1999, అక్టోబరు 29న ఒడిశాలో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ వల్ల గంటకు 260 - 300 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. సముద్ర నీటిమట్టం 9 మీటర్లు కెరటాలతో ఉప్పెనగా మారి 140 మీటర్ల మేర తీరాన్ని ముంచేసింది. 10 వేల మంది మంది మరణించగా, 2 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.


సాంకేతిక సహకారం: 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కుదిపేసిన హుద్‌-హుద్‌ తుపాను కారణంగా సూపర్‌ సైక్లోన్‌ కంటే తక్కువ వేగంతో గంటకు 180 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. 46 మంది చనిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో తుపాన్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తం చేస్తుండటంతో ఇటీవల కాలంలో ప్రాణనష్టం తగ్గించడం సాధ్యమవుతోంది.


టోర్నడో: ఇది భూఉపరితలంపై ఏర్పడే చక్రవాతం. 3 - 30 నిమిషాలపాటు మాత్రమే కొనసాగుతుంది. కానీ గాలి వేగం గంటకు 200 కి.మీ. నుంచి అత్యధికంగా 400 కి.మీ. ఉంటుంది. ఆ సమయంలో పైకి విసిరే సుడిగాలినే టోర్నడో అంటారు. దీని గాలివేగాన్ని ఫుజితా స్కేల్‌తో కొలుస్తారు. టోర్నడోలు ఎక్కువగా అమెరికా, మెక్సికో దేశాల భూభాగాల్లో వస్తుంటాయి. పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్‌ జంగిల్‌ విస్తీర్ణం పెరుగుతున్న కారణంగానే అమెరికాలో టోర్నడోల తాకిడి తీవ్రరూపం దాలుస్తోంది. అప్పడప్పుడు ఆస్ట్రేలియాలో ఏర్పడుతున్న నీటి టోర్నడోల (వాటర్‌ స్పౌట్‌) గురించి వాతావరణ నిపుణులు చర్చలు జరుపుతున్నారు.


భారత్‌లో 

మన దేశానికి రెండువైపులా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఆవరించి ఉన్నాయి. వాటిలో వేడినీరు ప్రవహిస్తుండటంతో రెండు సందర్భాల్లో తుపాన్లు సంభవిస్తున్నాయి.

1) నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు - మే-జూన్‌ నెలల్లో అరేబియా సముద్రంలో సంభవించే చక్రవాతాలు ఈశాన్యం, తూర్పు, వాయవ్యం దిశల్లో కదిలి తీర దేశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి.


2) ఈశాన్య రుతుపవనాల సమయంలో - అక్టోబరు - నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాలు ఎక్కువగా వాయవ్యం వైపు, కొన్నిసార్లు ఉత్తరం, పశ్చిమ దిశల్లో కదిలి తీర ప్రాంతంలో ప్రభావం చూపుతున్నాయి.

* హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాల వల్ల నష్టపోతున్న 8 దేశాలు 2004 నుంచి కొన్ని పేర్ల జాబితాను ముందుగానే రూపొందించాయి. వాటినే చక్రవాతాలకు పెడుతున్నారు. 2020లో మరో 5 దేశాలు ఇందులో చేరాయి. ప్రస్తుతం 13 దేశాల్లో ముందుగా నిర్ణయించిన పేర్ల జాబితాను చక్రవాతాల కోసం వినియోగిస్తున్నారు. 

* 1977, నవంబరు 19న సంభవించిన దివిసీమ తుపాను ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయింది. నాటి విపత్తులో సుమారు 10 వేల మంది చనిపోయారు.


హెచ్చరికలు


రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తుపాను హెచ్చరికలను నాలుగు దశల్లో జారీ చేస్తుంది.


1) ప్రీ సైక్లోన్‌ వాచ్‌: సముద్రంలో తుపాను ఏర్పడే పరిస్థితి ఉన్నప్పటి నుంచి అంటే 72 గంటల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తారు.


2) సైక్లోన్‌ అలర్ట్‌: తీరం వెంట ప్రతికూల ప్రభావం మొదలవుతుందని భావించిన 48 గంటల ముందు వెలువరిస్తారు.


3) సైక్లోన్‌ వార్నింగ్‌: తుపాను రాబోయే 24 గంటల్లో తీరాన్ని తాకుతుందని భావించినప్పుడు తుపాను హెచ్చరికలు చేస్తారు. ఇక్కడి నుంచి ప్రతి గంట గంటకి సమాచారం వెలువడుతుంది.


4) సైక్లోన్‌ హిట్‌ దశ: రాబోయే 12 గంటల్లో తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన సమయం నుంచి ఈ హెచ్చరిక మొదలవుతుంది. భూమిపై గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే సమయం వరకు ఈ హెచ్చరిక జారీ చేస్తారు.


 

మాదిరి ప్రశ్నలు


1. దేశంలో గుజరాత్‌ తర్వాత రెండో పొడవైన తీరం ఉన్న రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌     4) ఒడిశా


2. ఒకప్పుడు రేవు పట్టణంగా కొనసాగిన కోరింగ ప్రాంతం 1839లో వచ్చిన తుపానుకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ప్రస్తుతం చిన్న గ్రామంగా కొనసాగుతోంది. ఆ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

1) కాకినాడ     2) పశ్చిమ గోదావరి    3) నెల్లూరు    4) తిరుపతి


3. విశాఖపట్నాన్ని హుద్‌-హుద్‌ తుపాను ఏ తేదీన తాకింది?

1) 2014, అక్టోబరు 12        2) 2014, సెప్టెంబరు 14     3) 2015, ఆగస్టు 5     4) 2016, జనవరి 3


4. ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక తుపాను హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?

1) చెన్నై   2) విశాఖపట్నం    3) కోల్‌కతా    4) పారాదీప్‌ 


5. తీవ్రమైన తుపాను గాలులను అడ్డుకోవడానికి తీర ప్రాంతం వెంబడి పెంచే చెట్లను ఏమంటారు?

1) ఆశ్రయతోరణ మొక్కలు    2) మడ అడవులు    3) శృంగాకార అడవులు   4) ఆల్ఫైన్‌ అడవులు


6. భారతదేశంలో తుపానులు ఎక్కువగా సంభవించే నెలలు?

1) డిసెంబరు - జనవరి    2) జూన్‌ - జులై     3) అక్టోబరు - నవంబరు    4) మార్చి - ఏప్రిల్‌


7. భారతదేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం చక్రవాతాలకు అనువుగా ఉంది?

1) 8%        2) 18%        3) 30%        4) 40%


8. 1970లో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి మూడు లక్షల మంది ప్రాణాలు బలిగొన్న తుపాను పేరు?

1) నైనా      2) లైలా      3) ట్రేసి     4) బోలా 


9. ఎంత వేగంతో గాలులు వీచినప్పుడు సూపర్‌ సైక్లోన్‌గా పిలవాలి?

1) గంటకు 221 కి.మీ.కంటే ఎక్కువ        2) గంటకు 118 కి.మీ.కంటే ఎక్కువ

3) గంటకు 88 కి.మీ. కంటే ఎక్కువ        4) గంటకు 400 కి.మీ. కంటే ఎక్కువ


10. మన దేశంలో బంగాళాఖాతానికి, అరేబియా సముద్రానికి మధ్య తుపాన్ల నిష్పత్తి ఎలా ఉంటుంది?

1) 4 : 1        2) 1 : 4        3) 2 : 6        4) 6 : 2

సమాధానాలు: 1-3,   2-1,   3-1,   4-2,   5-1,   6-3,   7-1,   8-4,   9-1,   10-1

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 09-07-2023

తుపాను

* సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.


  తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ. భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.          భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.
వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 


* తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.


నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు


* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.


* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.


* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  


* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.


* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.


* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.


జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్


  భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.
2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 
* ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.
మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.


ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.


కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 08-07-2023

కొండచరియలు విరిగిపడటం

        భారతదేశంలో సహజంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో కొండచరియలు విరిగిపడటం (Land slide) ఒకటి. కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు లాంటివి కిందకు పడటాన్ని ఈ రకమైన వైపరీత్యంగా పేర్కొంటారు. మనదేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు (westren ghats), నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తోంది. సిక్కిం, ఘర్వాల్ (Garwal) ప్రాంతాల్లో సరాసరి ఒక చదరపు కిలోమీటర్‌కు 2 సార్లు కొండచరియలు విరిగిపడుతుంటాయి.
భారతదేశంలో ఈ వైపరీత్యం సంభవించే అవకాశం 22 రాష్ట్రాల్లో ఉంది. మనదేశంలోని 15 శాతం భూమిని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఘర్వాల్, కౌమాన్ (Kumaon) ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తుంది.


నష్టాలు 


  కొండచరియలు విరిగిపడటం వల్ల పర్యావరణానికి, ప్రజలకు తాత్కాలిక, దీర్ఘకాలిక నష్టాలుంటాయి.
ప్రాణ, ఆస్తి నష్టాలు; రోడ్లు దెబ్బతినడం లాంటివి తాత్కాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. ఈ వైపరీత్యం సంభవించిన ప్రాంత బాహ్య స్వరూపం మారిపోవడం; పంటపొలాలు, వ్యవసాయ భూమి నాశనం కావడం, నేల క్రమక్షయానికి గురవడం, ప్రజలకు పునరావాస సమస్యలు తలెత్తడం లాంటివి దీర్ఘకాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు, ఆనకట్టలు, టన్నెల్స్, కమ్యూనికేషన్ టవర్స్ లాంటివి తరచుగా దెబ్బతింటున్నాయి. దీని వల్ల మనదేశంలో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడటం వల్ల నదీప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. 1970లో పాతాళగంగానదిని కొండచరియలు విరిగి అడ్డగించడం వల్ల అలకనందా ప్రమాదం జరిగింది. 2005లో ఇదేవిధంగా పరెచ్చు (Parechhu) నదికి అడ్డంకి ఏర్పడటం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. 
         ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించిన నష్టాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 2006లో అరకులోయలో కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.


కారణాలు 


  భారతదేశంలో కొండచరియలు విరిగిపడటానికి కారణాలు 2 అవి:
1) సహజ కారణాలు,
2) మానవ కారణాలు.
కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం, కొండవాలుగా ఉండటం, కొండచరియలు వదులుగా అమరి ఉండటం, భూకంపాలు రావడం లాంటివి సహజ కారణాలు. అడవుల నిర్మూలన వల్ల నేల క్రమక్షయానికి గురవడం, సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలు లోపించిన కట్టడాలు, కొండ కింది ప్రాంతాల్లో జనావాసాల ఏర్పాటు, గనులు, క్వారీల తవ్వకం; నేలను ఉపయోగించే విధానాలు లాంటివి మానవ కారణాలుగా చెప్పవచ్చు.


వైపరీత్యాన్ని గుర్తించే విధానం 


  నేల, కొండ ప్రాంతాల్లో సంభవించే మార్పుల ఆధారంగా ఈ వైపరీత్యాలను కొద్ది గంటలు లేదా నిమిషాల ముందుగానే గుర్తించవచ్చు. కొండచరియలు విరిగిపడటానికి ముందుగా ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతట అవే బిగుసుకుపోవడం, గోడలు, ఇతర నిర్మాణాల్లో పగుళ్లు రావడం, ఇంటిగోడలు కదలడం, నేలలో పగుళ్లు ఏర్పడటం, ఫెన్సింగ్, ప్రహారి గోడలు, స్తంభాలు, వృక్షాలు పక్కకు జరగడం, కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కొద్దికొద్దిగా రాలుతూ ఉండటం లాంటి మార్పులను గమనించవచ్చు.


నివారణా చర్యలు 


*   ఏటవాలు, కొండ ప్రాంతాలు, సాధారణ ప్రదేశాల్లో చెట్లు నాటడం.
*   ఈ వైపరీత్యం సంభవించే ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టడం
*    రోడ్లు, కాల్వల లాంటివి నిర్మించేటప్పుడు నీటి సహజ ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటం.
*   ప్రమాద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోకుండా చూడటం.
*    ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కొండ ప్రాంతాల్లో గోడలను నిర్మించడం.
*    కట్టడాల్లో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించడం.
*   తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపులను తయారు చేయడం.
*   పటిష్టమైన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం.


భారతదేశం చేపడుతోన్న చర్యలు 


  కొండచరియలు విరిగిపడే విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అనేక నిర్వహణా చర్యలను చేపడుతున్నాయి. భారతదేశంలో 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ.) దీనిపై మొదటిసారిగా పరిశోధన నిర్వహించింది. ఈ విపత్తు నిర్వహణకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ) మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌వో(బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్)తో కలసి మంచు విరిగిపడే ప్రమాద నియంత్రణా చర్యలను చేపడుతున్నాయి. వివిధ సంస్థలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల పటాలను రూపొందిస్తున్నాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన శిక్షణ, పరికరాలున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వైపరీత్యం సంభవించిన తర్వాత ప్రజలను గుర్తించి, రక్షణ చర్యల్లో పాల్గొంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఎమ్ఏ)తో కలసి అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, పుస్తకాలు ప్రచురణ, కరపత్రాల పంపిణీ, స్థానిక భాషలో వీడియో చిత్రాలను చూపించడం, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తోంది. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ విపత్తును ఎదుర్కొనే చర్యలను చేపడుతోంది. అంతేకాకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్రాలకు తగిన సహాయాన్ని అందిస్తోంది.


పరిశోధన, నిర్వహణ చేపడుతున్న సంస్థలు


*   జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)
*   సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ)
*   సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్ఐ)
*   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కి (ఐఐటీ - ఆర్)
*   వాడియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ)
*   డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్)
*   నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ)
*   డిఫెన్స్ టెర్రేయిన్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీటీఆర్ఎల్)
*   బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ)
*   భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్ఏఎస్ఈ) సంస్థ మంచుచరియలు విరిగిపడటంపై పరిశోధన చేస్తోంది.
*   బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలను చేపడుతోంది.
*   డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వైపరీత్యం గురించి పరిశోధన, అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తోంది.
*   సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐవో) కొండచరియలు విరిగి పడటాన్ని గుర్తించడానికి 2006లో హరిద్వార్‌లోని మానసదేవి ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది.
*   బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంబీటీపీసీ), అన్నా యూనివర్సిటీ సంయుక్తంగా 2004లో కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన అట్లాస్‌ను ప్రచురించాయి.
*   నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఎన్ఎస్‌సీ) కొండచరియలు విరిగిపడే వైపరీత్యం ఉన్న ప్రాంతాల పటాలను (Land slide Hazard Zonation Maps) తయారు చేస్తోంది.

Posted Date : 08-07-2023

వరదల విపత్తు

జల విలయం

   నదుల ప్రవాహాలు గట్లు దాటినా, అధిక వర్షాల వల్ల కురిసిన నీటిని అదుపు చేయలేకపోయినా వరదలు సంభవిస్తాయి. పొలాలను, జనావాసాలను ముంచేస్తాయి. ఆస్తులకు, ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. తాగునీరు కలుషితమైపోతుంది. పారిశుద్ధ్యం క్షీణించి అంటువ్యాధులు ప్రబలుతాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇదంతా వరదలు సృష్టించే విలయమే. నదులకు నిలయమైన మన దేశంలో ఏటా ఈ పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా వరదల స్థితిగతులను, కారణాలను, ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

నీరు సాధారణ స్థితిని లేదా ప్రవాహ స్థాయిని మించినప్పుడు వరదలు వస్తాయి. వాన చినుకులు జడివానగా మారి కొన్ని గంటల  వ్యవధిలోనే వరదగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనకట్టలు  తెగిపోవడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చు. ఎక్కువ శాతం వరదలకు నదీ ప్రవాహాలే ప్రధాన కారణం. వాటి అంతర్భాగం, ఆనకట్టల సామర్థ్యాన్ని మించి    ప్రవహించినప్పుడు చుట్టుపక్కల భూభాగాలను ముంచెత్తుతుంటాయి.


వరదల్లో రకాలు


నదీ వరదలు: వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల, తుపాన్లు సంభవించే సందర్భాల్లోనూ, మంచు కరిగి నదిలో కలిసినప్పుడు నదీ వరదలు సంభవిస్తాయి. సముద్రంలోకి పంపే నీటి పరిమాణం కంటే ఎక్కువ నీటిని నది కలిగి ఉన్నప్పుడు నీరు పొంగి గట్టు దాటి   వరదలు సంభవిస్తాయి. వీటినే నదీ వరదలు అంటారు. నది తనలో ఉంచుకోగలిగిన నీటి పరిమాణాన్ని దాని పారుదల సామర్థ్యం అంటారు. నీటి పరీవాహక ప్రాంతం నుంచి ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని ‘డిశ్చార్జ్‌’ అంటారు.


తీరప్రాంత వరదలు: తుపాను వచ్చినప్పుడు, సముద్ర ఉప్పెనల వల్ల, సునామీలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడినప్పుడు వచ్చే వరదలను తీర ప్రాంత వరదలు అంటారు.


నదీముఖద్వార వరదలు: సముద్రంలో ఉప్పెన కారణంగా గానీ, సునామీ కెరటాలు నెట్టుకొస్తున్నప్పుడుగానీ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో వేలా తరంగాలు ఎక్కువగా ఉన్నప్పుడు గానీ, నది ద్వారా సముద్రంలోకి ప్రయాణించే నీటిని సముద్రం స్వీకరించలేక వెనక్కి పంపినప్పుడు తీరం వెంబడి వరదలు రావచ్చు. నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలను నదీ ముఖ ద్వారాలు అంటారు.


మెరుపు వరదలు: హఠాత్తుగా మంచు కరిగి నదిలో చేరడం,  కొండలపైన కుండపోత వర్షాలు, ఆనకట్టలు పగిలిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా సంభవించేవి మెరుపు వరదలు.


పట్టణ వరదలు: పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణాల్లో ఈ  వరదలు సంభవిస్తుంటాయి.


ప్రమాదం కారణంగా వచ్చే వరదలు: అధిక పరిమాణంలో నీటి సరఫరా చేసే నీటి గొట్టాలు పగిలిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో మునిగిపోవడం ద్వారా వచ్చే వరదలు.

ప్రపంచ వరద స్థితిగతులు

ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే విపత్తుల్లో అత్యంత విధ్వంసకర విపత్తు వరదలు. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో అత్యధికంగా 30% ఈ వరదల వల్లే జరుగుతోంది. దీని తర్వాత స్థానంలో 21% నష్టం తుపాన్ల వల్ల ఏర్పడుతోంది. ‘ద హ్యూమన్‌ కాస్ట్‌ ఆఫ్‌ వెదర్‌ రిలేటెడ్‌ డిజాస్టర్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక ప్రకారం 1995-2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల 230 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 1,57,000 మంది  మరణించారు. మొత్తం జల, వాతావరణ విపత్తుల్లో ఈ నష్టం 56% మేర ఉంది.


ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (United Nations International Strategy for Disaster Reduction)’ రూపొందించిన గ్లోబల్‌ ఎసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న   జనాభాలో 90% మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉన్నారు. ఇందులో దక్షిణాసియా దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌లు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశాలు చైనా, ఇండియా, బంగ్లాదేశ్, జర్మనీ, పోలండ్, మొజాంబిక్, అమెరికా వరుస   క్రమంలో ఉన్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాల వరద బాధితులు:  

* అల్పాదాయం ఉన్నవారు  50% 

* దిగువ మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  26%  

*  అధిక మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  23%  

* అధిక ఆదాయం ఉన్నవారు - 1%


భారతదేశంలో వరదలు

* ప్రపంచ మొత్తం వరద మరణాల్లో 1/5 (20%) మన దేశంలోనే సంభవిస్తున్నాయి. భారత్‌లో మొత్తం విపత్తు నష్టంలో 52% వరదల వల్లే జరుగుతోంది.


* దేశ వైశాల్యంలో 40 మిలియన్‌ హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురవుతోంది. ఇది దేశ వైశాల్యంలో 12%. (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రకారం)


* దేశంలో ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు ఏటా వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి.


* దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు వరద పీడిత   ప్రాంతాలుగా ఉన్నాయి. 


* ఉద్ధృతిపరంగా చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎక్కువగా వరదల బారిన పడుతున్నాయి.


* వరదల వల్ల దేశంలో ఏటా 40 లక్షల టన్నుల వడ్లు నీటిపాలవుతున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (IRRI) వివరించింది.


* 1953 - 2009 మధ్య గమనిస్తే భారతదేశంలో వరదల వల్ల ఏటా సగటున రూ.1650 కోట్ల నష్టం మేర వాటిల్లింది. సగటున 1,464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.


వరద ముప్పు ప్రాంతాలు:  ప్రపంచంలో అత్యధిక వరద ముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడి వరదలకు రుతుపవన కాలాల్లో తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురవడం, అధిక పూడిక ఉన్న నదులు, వాలైన హిమాలయ పర్వత శ్రేణులు లాంటివి ముఖ్యమైన కారణాలు.   


గంగా నదీ పరీవాహక ప్రాంతం: దేశంలో వరద దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది. అందులోనూ గంగా పరీవాహకంలోని ఉత్తర భాగం ఉపనదుల    కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదుల వల్ల; బిహార్‌లో కోసీ, గండక్‌ నదుల వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ భాగంలో దామోదర్, జయ నదులు, వాటి ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి.


బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల పరీవాహక ప్రాంతం: ఈ నదులు, వాటి ఉప నదులతో అస్సాం ఎక్కువగా వరదలకు గురవుతోంది. ఈ పరీవాహక ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ ఉత్తర భాగంలో జల్దాకా, తీస్తా, తోర్సా నదులు వరదలకు కారణమవుతున్నాయి. అలాగే మణిపుర్‌లో తిలాంగ్, నంబుల్, చప్కి, తోబుల్‌ నదులు, అధిక వర్షాల వల్ల ఇంఫాల్‌లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.


వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం: భారత వాయవ్య ప్రాంతంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.


మధ్య భారత్, దక్కన్‌ పరీవాహక ప్రాంతం: ఈ ప్రాంతంలో గోదావరి, కృష్ణా, కావేరి, పెన్న, తుంగభద్ర, నర్మద మొదలైన నదుల పరీవాహక ప్రాంతాలు, ఒడిశాలోని   మహానది, బైతరణి, బ్రహ్మణి నదీ పరీవాహక ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వరదల స్వభావాలు

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పెద్ద  ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు వరదలు కారణమవుతున్నాయి.

* తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో వరదల దుర్బలత్వం ఎక్కువ. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు సముద్రంలో కలిసే నదీ ముఖ ద్వారాల్లో డెల్టా మైదానాలు ఏర్పడి, అవి విశాలంగా, పాయలుగానూ చీలిపోయి ప్రవహిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నదుల డెల్టాలతోపాటు చిన్న నదులు, వాగులు పొంగడం వల్ల, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు రుతువుల కాలంలో వరదల్లో మునిగిపోతున్నాయి.

* గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ వైపు కచ్చితమైన, స్థిరమైన ప్రవాహ మార్గాలు కలిగి ఉండటం, మానవ నిర్మిత ఆనకట్టలు వరద నీటిని సక్రమంగా మోసుకెళ్లడం వల్ల వరదల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ తెలంగాణలో గోదావరి పరీవాహక మార్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు; ప్రాణహిత మార్గంలో ప్రస్తుత కొమురం భీమ్‌ జిల్లా రుతుపవనాల కాలంలో వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

వరదలపై అధ్యయనం: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) ముంపునకు గురవుతున్న భూమి ఆకారాన్ని, పరీవాహక ప్రాంతం (హరివాణం) వైశాల్యం, నేల వాలు, మురుగు నీటిపారుదల వ్యవస్థ లాంటి వాటిపై సమాచారాన్ని సేకరించి వరద దుర్బలత్వ మ్యాపులను తయారు చేస్తుంది. 

Posted Date : 09-07-2023

సంస్థాగత ఏర్పాట్లు

సమస్త యంత్రాంగం సంసిద్ధం!

ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో అనేకమంది సిబ్బంది గంటల్లో మోహరించారు. వేగంగా సహాయక చర్యలను చేపట్టి ప్రాణ నష్టం మరింత తీవ్రం కాకుండా నివారించారు. విపత్తు అనివార్యం. కానీ  దాని వల్ల కలిగే ఇబ్బందులను అడ్డుకునే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. అది విపత్తు నివారణ, ఉపశమన కార్యక్రమాలను నిర్వహించే అధికారాన్ని సంబంధిత అధికార వర్గాలకు అందిస్తుంది. వివిధ స్థాయుల్లో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. సమస్త యంత్రాంగం సమష్టి బాధ్యతతో సంసిద్ధమయ్యే విధంగా చూస్తుంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


  విపత్తు నిర్వహణ అమలు విధానం రూపకల్పన, పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను సిద్ధం చేయడానికి భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించింది. విపత్తు నివారణ, దాని ప్రభావ మదింపు, ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలను ఈ చట్టం వివరిస్తుంది. 


చట్టం ప్రకారం సంస్థాగత ఏర్పాట్లు


1) ప్రాధికార సంస్థలు: విపత్తు నిర్వహణ మూడు దశల్లో జరుగుతుంది. 

* ప్రధాన మంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ - నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎమ్‌ఏ - స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎమ్‌ఏ - డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ). 


2) కార్యనిర్వాహక కమిటీలు: విధి నిర్వహణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఎన్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక కమిటీ, ఎస్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు.


3) సామర్థ్య నిర్మాణం కోసం: ఎన్‌డీఎమ్‌ఏ సామర్థ్య నిర్మాణం కోసం కేంద్రం స్థాయిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఏర్పాటు చేస్తారు.


4) సహాయక చర్యలు చేపట్టేందుకు: విపత్తుల సమయంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్ర స్థాయిలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్‌ - నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేయాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

5) ప్రణాళికలు రూపొందించడం: విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు తమ సొంత విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.


వివిధ సంస్థల కూర్పు


జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ: విపత్తు నిర్వహణ చట్టం చేసిన తర్వాత 2006, సెప్టెంబరు 27న ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లాంఛనంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మరో తొమ్మిది మంది సభ్యులను నియమించి అందులో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. ఈ కార్యాలయంలో ఒక ఆర్థిక సలహాదారు,  అయిదుగురు సంయుక్త కార్యదర్శులు, పది మంది జాయింట్‌ అడ్వైజర్లు, మరికొంత మంది సిబ్బంది ఉంటారు. ఈ సంస్థ విపత్తు నిర్వహణ విధానాలను రూపొందిస్తుంది. జాతీయ ప్రణాళికలను ఆమోదిస్తుంది. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రాధికార సంస్థలు రాష్ట్ర స్థాయి ప్రణాళికల రూపకల్పనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 


జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఎన్‌డీఎమ్‌ఏకు విధి నిర్వహణలో సాయపడేందుకు జాతీయ కార్య నిర్వాహక కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం-అడవులు, రక్షణ శాస్త్ర సాంకేతిక రంగం తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రక్షణ దళాల సంయుక్త అధిపతి అయిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) కూడా సభ్యులుగా ఉంటారు.


రాష్ట్ర విపత్తు ప్రాధికార సంస్థ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అథారిటీల ఏర్పాటును చట్టంలోని చాప్టర్‌-3 సెక్షన్‌-14 వివరిస్తోంది. 2003 నుంచి గుజరాత్, డామన్, డయ్యూ ఆ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 


రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవచ్చని విపత్తు నిర్వహణ చట్టం చెబుతోంది. ఆయనతో పాటు మరో నలుగురు ఇతర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

జిల్లా విపత్తు ప్రాధికార సంస్థ: జిల్లా కలెక్టర్‌ దీనికి ఛైర్మన్‌. జిల్లా పరిషత్తు అమల్లో ఉంటే జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఈ సంస్థకు సహ ఛైర్మన్‌గా ఉంటారు. ఛైర్మన్‌ నియామకం జరగపోతే, జిల్లా స్థానిక సంస్థలకు ఎన్నికైన ఒక ప్రతినిధి (జడ్పీటీసీ) సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యనిర్వాహక అధికారి (జడ్పీ సీఈఓ), జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.


మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఏర్పాటు: రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు ప్రకారం 25 లక్షలు పైబడిన జనాభా ఉన్న పెద్ద నగరాల్లో సంక్షోభాల నిర్వహణకు మేయర్‌ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, నగర పోలీసు కమిషనర్‌ సహకారం అందిస్తారు.


జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌): విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ పరిశోధన, విద్యా సంబంధ కోర్సులు, సమావేశాలు, సెమినార్లు తదితరాలను జరిపే అవకాశాన్ని చట్టం కల్పించింది. అందుకోసం ఏర్పాటైన ఈ సంస్థకు కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 

జాతీయ ప్రతిస్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌): పారా మిలిటరీ దళాల నుంచి తీసుకున్న 12 బెటాలియన్ల దళాన్ని విపత్తులకు స్పందించి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంచుతారు. ఒక బెటాలియన్‌లో వెయ్యి మంది ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో సిద్ధంగా ఉంటారు. ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఈ దళానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎమ్‌సీ): విపత్తుల సందర్భంగా పునరావాస, సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. 15 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ: దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.


పౌరరక్షణ దళం: పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం అత్యవసర ఉపశమన వ్యవస్థ పథకంలో భాగంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో పౌర రక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన పౌర రక్షణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ప్రజలకు స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కల్పించడానికి వీలుగా 2010లో ఈ చట్టాన్ని సవరించారు.

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?

1) 2005  2) 2007  3) 2003  4) 2015

2. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) ప్రధానమంత్రి  2) హోంశాఖ మంత్రి  3) హోంశాఖ సెక్రటరీ  4) వ్యవసాయశాఖ మంత్రి

3. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఎవరు?

1) కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ  2) హోంశాఖ సెక్రటరీ  3) ఎన్‌డీఎమ్‌ఏ ఉపాధ్యక్షుడు 4) ఎన్‌డీఎమ్‌ఏ అధ్యక్షుడు

4. జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఆగస్టు 15  2) నవంబరు 5  3) అక్టోబరు 5 4) అక్టోబరు 29

5. జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళానికి ఛైర్‌పర్సన్‌ ఎవరు?

1) ఎన్‌డీఎమ్‌ఏ ఛైర్మన్‌ 2) ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ 3) హోం సెక్రటరీ  4) కేబినెట్‌ సెక్రటరీ

సమాధానాలు: 1-1; 2-2; 3-1; 4-4; 5-2.

రచయిత: జల్లు సద్గుణరావు 
 

Posted Date : 10-07-2023

శక్తి వనరులు

హరిత ఇంధనం.. ప్రగతి సాధనం!

  ఆధునిక మానవుడి జీవనంలో ఇంధనం విడదీయలేని భాగం. వంటకు గ్యాస్, బండికి పెట్రోల్, ఇంటా బయటా విస్తృతంగా వినియోగించే విద్యుత్తు ఇవన్నీ ఇంధనాలే. వ్యక్తిగత వృద్ధి, దేశ ఆర్థిక ప్రగతి అంతా ఇంధన వినియోగంపైనే ఆధారపడి సాగుతోంది. మొదటి నుంచి మానవుడు ప్రకృతి ఇచ్చిన వనరుల నుంచే ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకుని అభివృద్ధి చెందాడు. ఇటీవలి కాలంలో పర్యావరణ స్పృహతో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గిస్తూ హరిత ఇంధనాలపై దృష్టి సారించాడు. ఈ శక్తివనరుల రకాలు, మన దేశంలో వాటి ఉత్పత్తి తీరుతెన్నులు, వీటి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

  ఏదైనా వస్తువు ఒక ప్రాంతం నుంచి చలించాలంటే శక్తి అవసరం. మానవ అభివృద్ధి మొత్తం ఇంధన వనరుల పైనే ఆధారపడి ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ముఖ్యమైన మౌలిక వనరుల్లో ఇంధన వనరులు ప్రధానమైనవి. వినియోగిస్తున్న కాలాన్ని బట్టి వాటిని రెండు రకాలుగా విభజించారు. 


1) సంప్రదాయ ఇంధన వనరులు: మానవుడు అభివృద్ధి చెందిన మొదటి దశ నుంచి సంప్రదాయంగా వినియోగిస్తున్న ఇంధన వనరులు.

ఉదా: థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణు విద్యుత్తు, ఇందులో జల విద్యుత్తు, మినహా మిగిలినవి పునరుత్పాదనకు వీలు కానివి. అవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి.


2) సంప్రదాయేతర ఇంధన వనరులు: పెరిగే అవసరాలకు తగినట్లుగా ఇటీవల కాలంలో అభివృద్ధి చేసుకున్న, అధిక ప్రాచుర్యంలో ఉన్న ఇంధన వనరులు. ఇవి తిరిగి రెండు రకాలు.


ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: మానవుడు వినియోగించినప్పటికీ తిరిగి పునరుత్పత్తి చేయడానికి లేదా పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు. సౌర శక్తి, పవన శక్తి, బయోగ్యాస్, బయో మాస్, బయో డీజిల్, బయో ఇథనాల్, బగస్సీ కోజనరేషన్, చిన్నతరహా జలవిద్యుత్తు లాంటివి. ఇవి పూర్తిగా కాలుష్య రహితమైనవి. వీటినే హరిత ఇంధనాలు అంటారు.

బి) నవీన ఇంధన వనరులు: ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్న కొత్తతరం శక్తి వనరులు. హైడ్రోజన్‌ శక్తి, జియోథర్మల్‌ శక్తి, సముద్ర తరంగ శక్తి, టైడల్‌ శక్తి, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్‌్్స, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్‌ శక్తి లాంటివి. 1981లో భారత ప్రభుత్వం కమిషన్‌ ఫర్‌ అడిషనల్‌ సోర్సెస్‌ ఆఫ్‌ ఎనర్జీ ్బదితిళీన్శిను ఏర్పాటు చేసింది. దేశంలో పర్యావరణ శత్రువైన శిలాజ ఇంధన వనరుల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది.



* ప్రస్తుతం దేశంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 4,16,059 వాట్లు.

జల విద్యుత్తు: జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. దేశంలో మొదటి జల విద్యుత్తు కేంద్రాన్ని 1897లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జీలింగ్‌ దగ్గర స్థాపించారు (సిద్రపోంగ్‌ జలవిద్యుత్‌ కేంద్రం). దీని సామర్థ్యం 130 కిలోవాట్లు. దేశంలో మొదటి భారీ జల విద్యుత్తు కేంద్రాన్ని కర్ణాటకలోని శివసముద్రం జలపాతంపై 1902లో స్థాపించారు. దీని సామర్థ్యం 700 మెగావాట్లు.


థర్మల్‌ విద్యుత్తు: బొగ్గు, నీటిఆవిరి, డీజిల్, సహజ వాయువుల ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని థర్మల్‌ విద్యుత్తు అంటారు. దేశంలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పాదన నిర్వహణకు 1975లో ఎన్‌టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)ని ఏర్పాటు చేశారు. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో పెద్దది మధ్యప్రదేశ్‌లోని వింధ్యాంచల్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌. దీని సామర్థ్యం 4,760 మెగావాట్లు.


సౌర శక్తి: భారతదేశంలో ఫొటో ఓల్టాయిక్‌ సెల్స్‌ను ఉపయోగించి సూర్యరశ్మి నుంచి శక్తిని పొందుతున్నారు. థార్‌ ఎడారిని సోలార్‌ ఎనర్జీ ఎంటర్‌ప్రైజ్‌గా అమెరికాలోని నెవడాతో పోల్చవచ్చు. వ్యవసాయ రంగంలో శిలాజ ఇంధన వినియోగాన్ని నివారించి రైతులను సౌరవిద్యుత్తు వైపు ప్రోత్సహించడానికి ‘ప్రధానమంత్రి కుసుమ్‌’ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. సోలార్‌ ఎనర్జీలో చైనా, అమెరికా, జపాన్, జర్మనీ తర్వాత భారత్‌ అయిదో స్థానంలో ఉంది.


వాయు శక్తి: గాలి బాగా వీచే ప్రాంతాల్లో గాలి మరలను తిప్పడం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును వాయు శక్తి అంటారు. 1986 నుంచి దేశంలో పవన విద్యుత్తు ఉత్పత్తికి అంకురార్పణ జరిగింది. తమిళనాడులోని ముప్పందల్‌లో పెద్ద పవన విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 1500 మెగా వాట్లు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల, అనంతపురంలో పవన విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. పవన విద్యుత్తు ఉత్పత్తిలో చైనా, అమెరికా, జర్మనీ తర్వాత మన దేశం నాలుగో స్థానంలో ఉంది.


బయోగ్యాస్‌ ఎనర్జీ: జంతువులు, చేపలు, పాడి పరిశ్రమలు, గృహాలు, మురుగు నీటి శుద్ధి కర్మాగారాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా పశువుల పేడను కిణ్వ ప్రక్రియ/మురగబెట్టడం ద్వారా ఈ శక్తిని ఉత్పత్తి చేస్తారు. దీన్నే గోబర్‌ గ్యాస్‌/స్వాంప్‌ గ్యాస్‌ అంటారు. 1983 నుంచి బ్రౌన్‌ రెవల్యూషన్‌ను గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టడానికి పొగరాని పొయ్యి ్బద్త్యిఃః్చ్త్శలు పంపిణీ చేశారు. వ్యర్థాల నుంచి పెద్దఎత్తున బయో గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్న దేశం డెన్మార్క్‌. బయోగ్యాస్‌లో మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌ వాయువులు ఎక్కువగా ఉంటాయి.


బయోమాస్‌ ఎనర్జీ: చెరకు పిప్పి, తవుడు, కొబ్బరి చిప్పలు, సోయా, కాఫీ, జూట్‌ వ్యర్థాలు మండించడం వల్ల బయోమాస్‌ ఎనర్జీ లభిస్తుంది. భారత్‌లో వ్యవసాయ వ్యర్థాలతో నేచురల్‌ గ్యాస్‌ను తయారుచేసే మొదటి బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను పుణెలో 2016లో ప్రారంభించారు.


బయోడీజిల్‌ ఎనర్జీ: ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ అంటే ఆల్కహాల్, ఆమ్లాలను ఉపయోగించి ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేసే ఎనర్జీ. జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ మొక్కల విత్తనాల నుంచి ఈ బయోడీజిల్‌ను తయారు చేస్తారు. దీనికి కొంత డీజిల్‌ను కలపడం ద్వారా బయోడీజిల్‌ తయారవుతుంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది.


బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న మొదలైన వాటి నుంచి సంగ్రహించిన గ్లూకోజ్‌ను కిణ్వ ప్రక్రియ (మురగబెట్టడం)కు గురి చేస్తారు. ఇలా తయారయ్యే ఇంధనాన్ని బయో ఇథనాల్‌ అంటారు. దీనికి పెట్రోలియం కలిపితే జీవ ఇంధనంగా మారి కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మన దేశం 2022లో పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ని కలిపే లక్ష్యసాధనలో విజయం సాధించింది. 2030 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని కలపాలన్నది కేంద్రం ప్రస్తుత లక్ష్యం.


వేవ్‌ ఎనర్జీ: సముద్ర కెరటాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని వేవ్‌ ఎనర్జీ అంటారు. ఇది ఖరీదైన ప్రక్రియ. మొదటి ప్లాంట్‌ను కేరళలోని తిరువనంతపురంలోని విజింగం వద్ద ప్రారంభించారు.


టైడల్‌ ఎనర్జీ: సముద్ర తీరంలో పోటుపాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టైడల్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. గుజరాత్‌లో గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, కాంబే వద్ద, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ ప్రాంతంలో ఈ రకం విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దేశంలో 8 వేల మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.


ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ: సముద్ర నీటి లోతు ఆధారంగా ఉష్ణోగ్రతల్లో తేడాలుంటాయి. ఈ భేదంతో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. దీన్ని ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ అంటారు. తమిళనాడులోని ట్యుటికోరిన్, కులశేఖరపట్నం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఇందుకు అవకాశాలున్నట్టు అంచనా.


జియోథర్మల్‌ ఎనర్జీ: భూమిలోని వేడి వల్ల కొన్ని ప్రాంతాల్లో వేడి నీటి బుగ్గలు (గీజర్స్‌) బయటపడతాయి. వీటి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో మణికరన్‌ వద్ద ఈ రకం విద్యుత్తును ఉత్పత్తి చేసి శీతల గిడ్డంగులకు వినియోగిస్తున్నారు. పుగాలోయ (లద్దాఖ్‌), సూరజ్‌కుండ్‌ (ఝార్ఖండ్‌), తపోవన్‌ (ఉత్తరాఖండ్‌), జలగావ్‌ (మహారాష్ట్ర) ప్రాంతాల్లో ఈ తరహా ఉత్పత్తి జరుగుతోంది.


హైడ్రోజన్‌ ఎనర్జీ: హైడ్రోజన్‌ అయాన్లను ఆక్సిజన్‌తో చర్యకు గురిచేస్తే విడుదలయ్యే రసాయన శక్తిని ఫ్యూయల్‌ సెల్స్‌ విద్యుచ్ఛక్తిగా మారుస్తాయి. ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. కేంద్రం 2021-22 బడ్జెట్‌లో నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)ను ప్రకటించింది.


గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యం:  గ్రీన్‌ రెవల్యూషన్‌లో భాగంగా 2030 నాటికి 500 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. ఇందులో 280 గిగా వాట్ల సోలార్‌ ఎనర్జీ, 140 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ ఉండాలని నిర్ణయించింది.

రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 10-07-2023

భూ సంపాతాలు

అమాంతం విరిగిపడే ఆపద! 


కొండచరియలు విరిగిపడ్డాయని, మంచు ప్రవాహాలు ముంచుకొచ్చాయని, రాతి ఖండాలు అమాంతం కూలిపోయాయని, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని తరచూ వార్తలు వస్తుంటాయి. వీటికి భారీ వర్షాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు, అడవుల నరికివేత, అస్తవ్యస్త ఇంజినీరింగ్‌ విధానాల వంటి మానవ తప్పిదాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నిరోధించడానికి, నష్టతీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తుంటాయి. భవిష్యత్తు ఉద్యోగులుగా అభ్యర్థులు ఈ విపత్తు నిర్వహణ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి. 


ఎత్తయిన పర్వతాలు, కొండలు, వాలు ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి, బురద జారిపడటం, నెమ్మదిగా పడటం లేదా కిందికి దొర్లుతూ వచ్చే ప్రక్రియను భూపాతం లేదా కొండచరియలు విరిగిపడటం అంటారు. ఇలా అన్నిరకాల బృహత్‌ చలనాలను భూసంపాతం (Land Slides)అంటారు.

భూపాతాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. గనుల తవ్వకాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటాల సమయంలోనూ భూపాతాలు జరగవచ్చు. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా కొండల ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు నదీ ప్రవాహాలను కొండచరియలు అడ్డుకోవడంతో వరదలు వస్తుంటాయి.

ప్రకృతి సంబంధ కారణాలు:

* కొండ ప్రాంతాలు ఎక్కువ వాలు కలిగి ఉండటం.

* వాలు ప్రాంతాలు గట్టిగా ఉండి చిన్న కదలికలకు కూడా విరిగిపడటం.

* తీవ్రమైన వర్షపాతం.

* రాతి ప్రదేశాలు బాగా క్రమక్షయానికి గురికావడం.

* భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు.

* నీటిపారుదల వ్యవస్థ సరైన దిశలో లేకపోవడం.

మానవ సంబంధ కారణాలు:

* చెట్లను విచక్షణారహితంగా కొట్టివేయడంతో జరిగే మృత్తికా క్రమక్షయం.

* సరైన ప్రణాళికలు లేకుండా వాలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం.

* సరైన ఇంజినీరింగ్‌ విధానాలు లేకుండా తవ్వకాలు జరపడం.

* ఇష్టానుసారంగా గనుల తవ్వకం.

* సమర్థ భూవినియోగ ప్రణాళికలు కొరవడటం.

భూపాతం రకాలు

1. ప్రపాతం (Falls): ఎత్తయిన వాలు లేదా శిఖరాల నుంచి వేరుపడిన శిలలు ఎగురుతూ, దొర్లుతూ రావడం వంటి అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.

2. శిథిల ప్రవాహం (Derbis flow): వదులైన మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం లాంటివి గాలి, నీటితో కలిసి ముద్దగా ఏర్పడి వేగంగా దిగువకు ప్రవహించడం.

3. లహర్‌ ప్రవాహం (Lahar flow): అగ్నిపర్వతాల విస్ఫోటం వల్ల జ్వాలాబిల సరస్సులు విచ్ఛిన్నమై ఏర్పడిన బురద ప్రవాహం లేదా మంచు కరగడం వల్ల ఏర్పడిన శిథిల పదార్థం కిందికి ప్రవహించడం.

4. సర్పణం లేదా పాకడం (Creep): మట్టి లేదా శిలలు నెమ్మదిగా, నిటారుగా కిందికి జారడం. ఇవి రిటైనింగ్‌ గోడలు, కంచెలు, స్తంభాలను కిందికి నెట్టుకు వస్తాయి.

5. పంక ప్రవాహం (Mud flow): 50% ఇసుక, బురద మట్టి కలిగిన తడిపదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.

6. కూలిపోవడం (Topple): ఒక రాతి ఖండం ముందుకు వంగుతూ అమాంతంగా పడిపోవడాన్ని కూలిపోవడం అంటారు.

ప్రపంచ భూపాతాల దుర్బలత్వం: ప్రపంచంలో మొత్తం విపత్తుల్లో 4% భూపాతాల బెడద ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య అన్ని ఖండాల్లోనూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూ ఉంటుంది.

భారత్‌లో స్థితిగతులు:

* దేశంలో మొత్తం విపత్తుల్లో భూపాతాల దుర్బలత్వం 11%గా ఉంది.

* దేశంలో అధికశాతం భూపాతాలు కొండచరియలు విరిగిపడటం వల్లే జరుగుతున్నాయి.

* దాదాపు 0.49 మిలియన్‌ చ.కి.మీ.ల్లో భూపాతాలు సంభవిస్తున్నాయి. ఈ విస్తీర్ణం దేశ భూభాగంలో 0.15%.

* అత్యధికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఆ తర్వాత పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లో భూసంపాతాలు జరుగుతున్నాయి.

* ప్రపంచంలో మొత్తం భూపాతాల్లో 30% హిమాలయాల్లోనే నమోదవుతున్నాయి.

* నీలగిరి లోయను శిథిల సంపాత లోయ అంటారు. 1978లో అసాధారణ వర్షాలతో ఇక్కడ వంద సార్లు భూపాతాలు వచ్చాయి.

* దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో భూపాతాల ప్రభావం ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్‌ అధిక ప్రభావిత రాష్ట్రాలు.

* శాస్త్రీయ అంచనాల ప్రకారం సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో ప్రతి చ.కి.మీ.కు రెండు భూపాతాలు జరుగుతున్నాయి.

* ద్వీపకల్ప భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో భూపాతం కారణంగా తక్కువ నుంచి ఒక మోస్తరు ప్రమాద అవకాశాలు ఉన్నాయి.

* భారతదేశంలో భూపాతం/ కొండచరియలు విరిగిపడే విపత్తులకు సంబంధించి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2004 నుంచి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇది భూపాతపు ప్రాంతాలను పటచిత్రీకరణ చేయడం, అధ్యయనాలు నిర్వహించడం, నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తుంది.

ఉపశమన వ్యూహాలు:

* వాలు ప్రాంతాల్లో నీటిపారుదల సరైన మార్గంలో ప్రవహించే విధంగా వరద కాలువలను ఏర్పాటు చేయాలి.

* శిలాశకలాలు కిందికి జారే ప్రాంతాల్లో వాటిని అడ్డుకోవడానికి రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాలి.

* భూపాతాలను ఆపడానికి వృక్ష సంపదను పెంచాలి. చెట్లు నేలకోతను ఆపి భూపాతాన్ని నిరోధిస్తాయి.

* భూపాత దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి, సరైన విపత్తు నివారణ వ్యూహాన్ని (హజార్డ్‌ మ్యాపింగ్‌) ముందుగా తయారు చేసుకోవాలి.

* ప్రజలకు అవగాహన కల్పించడం, వర్షాల సమయంలో ముందుగానే సమాచారం అందించడం లాంటివి చేయాలి.

మాదిరి ప్రశ్నలు


1. భారతదేశంలో భూపాతాలు ఎక్కువగా జరిగే చోటు

1) హిమాలయాలు       2) ఆరావళి పర్వతాలు      3) నీలగిరి కొండలు       4) తూర్పు కనుమలు

జ: హిమాలయాలు

2. భూపాత దుర్బలత్వంపై సత్వర హెచ్చరికలు జారీ చేసే సంస్థ ఏది?

1) భారత వాతావరణ శాఖ             2) బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ

3) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా               4) రహదారుల శాఖ

జ: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో కొండచరియలు విరిగి పడే విపత్తు భాగం ఎంత?

1) 0.15 శాతం      2) 11 శాతం      3) 30 శాతం      4) 20 శాతం

జ: 11 శాతం

4. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో భూపాత నష్టం ఎంత?

1) 4 శాతం      2) 10 శాతం      3) 20 శాతం      4) 11 శాతం

జ: 4 శాతం

5. మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం కలిసి ముద్దలుగా వేగంగా దిగువకు ప్రవహించడం ఏ రకమైన భూపాతం?

1) శీఘ్రపాతం      2) శిథిల ప్రవాహం      3) కూలిపోవడం              4) పాకడం

జ: శిథిల ప్రవాహం

6. శిథిల సంపాత లోయ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) హిమాలయాలు      2) పశ్చిమ కనుమలు      3) వింధ్య పర్వతాలు      4) నీలగిరి కొండలు

జ: నీలగిరి కొండలు​​​​​​​

7. మన దేశంలో భూపాతాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు

1) సిక్కిం, ఉత్తరాఖండ్‌         2) మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌

3) అస్సాం, పశ్చిమ బెంగాల్‌       4) తమిళనాడు, కేరళ

జ: సిక్కిం, ఉత్తరాఖండ్‌​​​​​​​

8. శిలాశకలాలు దొర్లడం, ఎగిరిపడటం వంటి భూపాతాన్ని ఏమంటారు?

1) శిథిల సంపాతం      2) శిథిల ప్రవాహం       3) ప్రపాతం       4) లహర్‌

జ: ప్రపాతం​​​​​​​

9. కిందివాటిలో భూపాతాలకు కారణాలేవి?

ఎ) కొండవాలు ఎక్కువగా ఉండటం          బి) కొండల క్రమక్షయం జరగడం

సి) కొండలు వృక్షాలతో కప్పి ఉండటం        డి) కొండలపై వృక్షాలు లేకపోవడం

1) ఎ, బి, సి, డి           2) బి, సి        3) ఎ, బి, డి        4) బి, సి, డి

జ: ఎ, బి, డి​​​​​​​

10. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో భూపాతాలు జరిగే అవకాశం ఉంది?

1) 20        2) 10       3) 4          4) అన్ని రాష్ట్రాలు 

జ: 20

 రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2023

కరవు

పట్టి పీడించే కాటకం!

కావాల్సినంత కురవని వర్షం, బీటలు వారిన భూములు, అడుగంటిన చెరువులు, ఎండిపోయిన పంటలు, నిస్సారమైన నేలలు, వీటి ప్రభావంతో వస్తుసేవలు అందక జనం పడే ఇబ్బందులు. ఇదే విపత్తు. సమాజ పురోగతిని కుంగదీసే ప్రకృతి విపరిణామం. ఇలాంటి కాటక పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? నివారించే మార్గాలు ఏమిటి? తదితర అంశాలను ‘విపత్తు నిర్వహణ’ అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులు తెలుసుకోవాలి.


ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకూ పూర్తిగా వర్షం లేకపోవడం లేదా అల్ప వర్షపాతం ఉండవచ్చు. ఇది శీతోష్ణస్థితి సాధారణ లక్షణం. దీనివల్ల నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడటం, ఉపాధి అవకాశాలు కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే కరవు లేదా దుర్భిక్షం అని పిలుస్తారు. ఈ వైపరీత్యంతో వ్యవసాయదారులతోపాటు మొత్తం సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. 


ప్రధాన కారణాలు: 

* దేశంలో రుతుపవనాలు అసమానంగా విస్తరించడం.

* మానవ అభివృద్ధి వల్ల వృక్షసంపద దెబ్బతిని నీరు భూమిలో ఇంకకపోవడం.

* అధిక జనాభా వల్ల నీటివనరులపై ఒత్తిడి పెరగడం.

* పట్టణీకరణ పెరగడంతో నీటి నిల్వ ప్రాంతాలు, నీటివనరుల పరీవాహక ప్రదేశాలు ఆక్రమణకు గురవడం.

* నీటి అవసరాలు, నిర్వహణ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.


నాలుగు రకాలు

భారత వ్యవసాయ కమిషన్‌ కరవును నాలుగు రకాలుగా విభజించింది.


వాతావరణ సంబంధ కరవు: ఒక ప్రదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు సంభవించే కరవును వాతావరణ సంబంధ కరవుగా పేర్కొనవచ్చు. ఇలాంటి కరవు కారణంగా మిగతా కరవులు ఏర్పడతాయి. ఇది అన్ని కరువుల్లోనూ అతి తీవ్రమైంది.


జల సంబంధ కరవు: చాలాకాలం పాటు ఏర్పడే వాతావరణ కరవు కారణంగా భూఉపరితలంపైన, భూగర్భంలో నీటివనరుల లభ్యత తగ్గిపోవడాన్ని జలసంబంధ కరవుగా నిర్వచించవచ్చు.


వ్యవసాయ సంబంధ కరవు: జలసంబంధ కరవు ఎక్కువ కాలం కొనసాగితే మృత్తికల్లో తేమ తగ్గిపోయి మొక్కలు, పంటలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడలేని స్థితిని వ్యవసాయ సంబంధ కరవుగా భావించవచ్చు.


సామాజిక - ఆర్థిక కరవు: పై మూడు రకాల కరవులతో పాటు వస్తువులు, సేవల సరఫరా డిమాండ్‌పైన ప్రభావం చూపడాన్ని సామాజిక - ఆర్థిక కరవుగా పిలుస్తారు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ప్రభావం చూపుతుంది.


ఎలా కొలుస్తారు?


1) కరవు ఆరంభం: ఒక ప్రదేశంలో సాధారణ వర్షపాతంలో 25 శాతం తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 75 శాతం వరకే నమోదైతే కరవు మొదలైనట్లు పరిగణిస్తారు.


2) మిత కరవు: సాధారణ వర్షపాతంలో 26% నుంచి 50% వరకు తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 50% వరకు మాత్రమే కురిస్తే మిత కరవుగా పిలుస్తారు.


3) తీవ్ర కరవు: సాధారణ వర్షపాతంలో 50% కంటే తగ్గితే తీవ్ర కరవుగా వ్యవహరిస్తారు. మన దేశంలో వాయవ్య ప్రాంతంలో బలహీన రుతుపవనాల వల్ల, పర్యావరణం దెబ్బతినడంతో అతి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి.


ప్రపంచ స్థితిగతులు


* ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సహజ విపత్తుల్లో కరవు ద్వారా వచ్చే విపత్తు వాటా 19 శాతం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరవు విపత్తు 3వ స్థానంలో ఉంది (మొదటి స్థానం వరదలు - 30%, రెండో స్థానం తుపాన్లు - 21%).

* ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల సహజ విపత్తు మరణాల్లో కరవు, దుర్భిక్షం వల్ల అత్యధికంగా 45%, ఆ తర్వాత వరదల కారణంగా 16% మరణాలు సంభవిస్తున్నాయి.

* వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ సంయుక్తంగా విడుదల చేసిన సహజ వైపరీత్యాలు, అసహజ వైపరీత్యాల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం సంభవించే విపత్తులు వరదలు, తుపాన్లు. అయితే ఆఫ్రికా దేశాల్లో మాత్రం కరవు తరచూ సంభవిస్తుంది.  


భారత్‌లో కరవు పరిస్థితులు


  ఏటా దేశంలో 5 కోట్ల మంది ప్రజలు కరవు ప్రభావానికి గురవుతున్నారు. మొత్తం 640 జిల్లాల్లో 191 జిల్లాలు తీవ్ర కరవు ముప్పు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 68% భూమి క్షామం బారిన పడుతోంది. ఇది దేశం మొత్తం భూమిలో 16%. శుష్క, అర్ధశుష్క మండలాల్లో దాదాపు 8-9 ఏళ్లకు ఒకసారి తీవ్ర, అసాధారణ కరవు ఏర్పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరవు ఏటా సర్వసాధారణం.

ఉదా: రాజస్థాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో 2000, 2001, 2002, 2003లలో వరుసగా నాలుగేళ్లు కరవు తాండవించింది.


కరవు తీవ్రత ఆధారంగా భారత వ్యవసాయ కమిషన్‌ దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించింది.


1. వాయవ్య భారతదేశం: రాజస్థాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు; గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇది దేశంలో ఎక్కువగా కరవు ఎదుర్కొనే ప్రాంతం.


2. పశ్చిమ, మధ్య భారతదేశం: మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ భాగాలు; కొంకణి, గోవా ప్రాంతాలు, తెలంగాణ ఇందులో ఉన్నాయి.


3. ద్వీపకల్ప భారతదేశం: ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు.


4. మధ్య ఈశాన్య భారతదేశం: ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ భాగాలు.


5. ఈశాన్య భారతదేశం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, హిమాలయాల దిగువనున్న పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలు.

దేశంలో భూగర్భ జలాల వినియోగం ఆధారంగా రెండు ప్రాంతాలుగా విభజించారు.

డార్క్‌ జోన్‌: దేశంలో 40% ప్రాంతాన్ని డార్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా తోడేశారు.

ఉదా: రాజస్థాన్‌లోని సరిష్కా జాతీయ పార్కు ప్రాంతం.


గ్రే జోన్‌ ప్రాంతం: దేశంలో 30% ప్రాంతం గ్రే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను అక్కడి వర్షపాతం కంటే ఎక్కువ పరిమాణంలో తోడేస్తుంటారు.


కరవు తీవ్రతను తగ్గించే చర్యలు: * వర్షం నీటిని సరైన మార్గాల్లోకి మళ్లించే విధానాలు (వాటర్‌ హార్వెస్టింగ్‌) పాటించాలి.

* దేశంలో ఉత్తర భారత నదులను, దక్షిణ భారత నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలి.

* గుజరాత్‌లో ఝలరా, రాజస్థాన్‌లోని బోలిస్‌ లాంటి మెట్ల బావుల విధానం, చెరువుల నిర్మాణం లాంటి సంప్రదాయ జలసంరక్ష పద్ధతులను ప్రోత్సహించాలి.

* ప్రజల్లో కరవుపై అవగాహన కల్పించాలి.

* వర్షపాతం, జలాశయాలు, సరస్సులు, నదులు లాంటి వాటిలో నీటి లభ్యతను గమనిస్తూ సరైన నీటి పర్యవేక్షణ చేపట్టాలి.

* పొలాల నుంచి వృథాగా పోతున్న నీటిని వ్యవసాయ కుంటల్లాంటి ఉమ్మడి జలాశయాల్లోకి చేరేలా చూడాలి.

* ముందుగానే కరవు ప్రణాళికను తయారు చేసుకోవాలి.

* కరవు ప్రాంతంలో జీవనోపాధి ప్రణాళికలు, పంటల బీమా పథకాలు అమలు చేయాలి.


మాదిరి ప్రశ్నలు


1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) బెంగళూరు     3) ఇందౌర్‌     4) కోల్‌కతా

జ: హైదరాబాద్‌

2. ఝలరా, బోలిస్‌ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? 

1) చెరువులు    2) మెట్ల బావులు    3) ఆనకట్టలు    4) నీటి కాలువలు

జ: మెట్ల బావులు

3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?

1) వాటర్‌షెడ్‌ విధానం       2) రైన్‌ షాడో విధానం

3) రైన్‌ ప్రిసిపిటేషన్‌ విధానం      4) వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

జ: వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?

1) 38%      2) 68%      3) 48%      4) 28%

జ:  68%

5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?

1) డార్క్‌ జోన్‌     2) గ్రే జోన్‌     3) ఎల్లో జోన్‌      4) రెడ్‌ జోన్‌

జ: డార్క్‌ జోన్‌

6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు? 

1) 25% వరకు    2) 50% వరకు    3) 75% వరకు    4) 10% వరకు

జ: 50% వరకు

7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?

1) 50%      2) 19%      3) 5%          4) 80%

జ: 19%

8. మహారాష్ట్రలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో కరవును పారదోలిన అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?

1) అన్నాహజారే     2) రాజేంద్రసింగ్‌      3) మేధాపాట్కర్‌      4) పాలేకర్‌

జ: అన్నాహజారే

9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం.

1) మధ్య భారతదేశం        2) ఈశాన్య భారతదేశం

 3) వాయవ్య భారతదేశం       4) హిమాలయ ప్రాంతం

జ: వాయవ్య భారతదేశం
 

10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ      2) ముంబయి      3) బెంగళూరు      4) కోల్‌కతా

జ: దిల్లీ

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2023

నేల కాలుష్యం

 
భూసారం ఆగమాగం!


నేలలు సారాన్ని కోల్పోతున్నాయి. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కారణం నేల కాలుష్యం. పరిశ్రమల విషపూరిత వ్యర్థాలను భూమిలోకి వదిలేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రేడియో ధార్మికాలను నేలలోకి నెట్టేస్తున్నారు. దీంతో మట్టి సహజత్వాన్ని కోల్పోయి హానికరంగా మారుతోంది. భూసారం ఆగమాగమైపోతోంది. అది అన్ని రకాల విపరిణామాలకు దారితీస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను, నివారణ మార్గాలను తెలుసుకోవాలి. పలు రకాల పోటీ పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. 

సహజ వనరుల్లో మృత్తికలు/నేలలు అత్యంత ప్రధానమైనవి. భూమిని ఆవరించి ఉన్న శిలావరణంపై జీవ సంబంధమైన పదార్థాలు, అనేక లవణాలు, రసాయనాలతో కూడిన వదులుగా ఉండే పొరను నేలగా పిలుస్తారు. నేలలో ఉన్న భౌతిక, రసాయనిక ధర్మాల ఆధారంగా ఎర్రనేలలు, నల్లనేలలు, ఒండ్రు నేలలు, పర్వతాలపై ఉండే లేటరైట్‌ నేలలు లాంటి ఎన్నో రకాలు భూగోళాన్ని ఆవరించి ఉంటాయి. మనిషికి ఆహారాన్ని ఇచ్చే పంటలు, అవసరాలు తీర్చే వృక్షాలు ఈ నేలల ఆధారంగానే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. రాతిపై ఒక సెంటీమీటరు మందం ఉన్న మృత్తిక ఏర్పడాలంటే కనీసం 400 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. అంత ప్రాముఖ్యం ఉన్న మృత్తికల్లో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కలవడంతో సహజ లక్షణాలను కోల్పోయి నేల కాలుష్యం లేదా భూకాలుష్యం జరుగుతోంది.


వ్యవసాయ, పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలు; మురుగు నీరు, భార లోహాలు, ఘనపదార్థాలు నేలలో కలవడం వల్ల ఏర్పడే దాన్ని ధనాత్మక నేల కాలుష్యంగా పిలుస్తారు. అడవుల నరికివేత, పశువులు అతిగా మేత మేయడం, గనుల తవ్వకాలు, బ్లాస్టింగ్, మట్టి తవ్వకాలు, అశాస్త్రీయ వ్యవసాయ విధానాల కారణంగా నేల సహజ నిర్మాణం దెబ్బతినడం కూడా నేల కాలుష్యమే. దీన్ని రుణాత్మక నేల కాలుష్యం అంటారు.


నేల కాలుష్య కారకాలు


పారిశ్రామిక వ్యర్థాలు: ఆధునిక మానవుడి అభివృద్ధికి పరిశ్రమలే సోపానాలు. అయితే పరిశ్రమల నుంచి వెలువడే ఆమ్లాలు, క్షారాలు, విష సేంద్రియ పదార్థాలు, పాదరసం, సీసం, రాగి, జింక్, కాడ్మియం, సైనైడ్లు, థియోసైనేట్స్‌ లాంటి అనేక రసాయన పదార్థాలు నేలపై వ్యర్థాలుగా పడేయడం నేల కాలుష్యానికి ప్రధాన కారణం.


ఎరువులు, క్రిమిసంహారక మందులు: ప్రస్తుత వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబడికి ఎరువులు, పురుగుమందులు, కలుపు మొక్కల నివారిణులు, శిలీంధ్రనాశనుల వినియోగం తప్పనిసరిగా మారింది. వీటి అవశేషాలు నేలలో కలిసి నేల కలుషితంగా మారడమే కాకుండా భూగర్భ జలాల్లో చేరి మానవ మనుగడను దెబ్బతీస్తున్నాయి.


మానవ వినియోగ వ్యర్థాలు: గృహావసరాలకు లేదా వాణిజ్యపరంగా వినియోగించగా మిగిలిన వ్యర్థాలను నేలపై చెత్తకుప్పల దగ్గర పారవేయడంతో నేల కాలుష్యం పెరిగిపోతోంది.


ఉదా: పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, పేపరు వేస్ట్‌లు, గృహ నిర్మాణంలో మిగిలే కాంక్రీట్, మిగిలిన ఆహార పదార్థాలు లాంటివన్నీ కాలుష్య కారకాలే.


రేడియోధార్మిక వ్యర్థాలు: అణు విద్యుత్తు కేంద్రాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడిన యురేనియం, థోరియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు, ద్రావణాలు నేలలో కలిసి భూమిని కలుషితం చేస్తుంటాయి.


జీవన సంబంధ కారకాలు: మానవులు, జంతువులు, పక్షుల మలమూత్రాలు నేలను చేరతాయి. ఈ విసర్జకాల్లో రోగకారక సూక్ష్మజీవులు ఉండటం వల్ల నేల కలుషితమవుతుంది. ఈ విధంగా నేల స్వభావాన్ని మార్చి మొక్కల వేర్లపై దాడి జరిగి పంటల సామర్థ్యం తగ్గుతుంది.


గనుల తవ్వకాలతో కాలుష్యం: ఇనుము, బొగ్గు లాంటి గనుల తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే భారలోహ, కర్బన, ధూళి కణాలు నేల మీద పోగుపడి నేల కాలుష్యానికి దారిదీస్తాయి. ఇవి నేల గాఢతను మారుస్తాయి. దానివల్ల గనుల ప్రాంతాల్లో వ్యవసాయ ఫలసాయం తగ్గిపోతుంది.
 

వ్యర్థ పదార్థం నేలలో విచ్ఛిన్నానికి పట్టే కాలం (సుమారుగా)
కాగితం నెల
ఊలు ఒక సంవత్సరం
చెక్క 10-15 సంవత్సరాలు
తోలు వస్తువులు 50 సంవత్సరాలు
అల్యూమినియం వస్తువులు 100 సంవత్సరాలు
డిస్పోజబుల్‌ డైపర్స్‌ 500 సంవత్సరాలు
పాలిథీన్‌ క్యారీ బ్యాగులు లక్ష సంవత్సరాలు


నేల కాలుష్య ప్రభావాలు:


వ్యవసాయంపై: నేల కాలుష్యానికి గురైతే మొదట వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. వివిధ కాలుష్యాలతో నేలల సారం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గి ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుంది. నేలలో నైట్రోజన్‌ సార్ధకత, లవణాలు తగ్గుతాయి. నేల క్రమక్షయం పెరిగి చెరువులు, జలాశయాల్లో పూడిక చేరుతుంది.


ఆరోగ్యంపై: ప్రమాదకరమైన రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. కొన్ని భార లోహాలు మొక్కల ద్వారా మానవ, జంతు శరీరాల్లోకి బయోమాగ్నిఫికేషన్‌ జరిగి వ్యాధులు వస్తాయి. వ్యర్థాలు కుళ్లి హానికర వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. రేడియోధార్మిక పదార్థాలు విడుదల చేసే కిరణాలు జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారతాయి.


పర్యావరణంపై: నేల కాలుష్యం వల్ల వృక్ష సంపద తగ్గి పర్యావరణ అసమతౌల్యత ఏర్పడుతుంది. జీవజాతుల మధ్య సమగ్రత దెబ్బతింటుంది. ఆహార గొలుసులు విచ్ఛిన్నమవుతాయి.

నగరాలపై ప్రభావం: నగరాల్లోని వ్యర్థాల కారణంగా మురుగు నీటిపారుదల పెద్ద సమస్యగా మారుతుంది. జనాభా పెరగడం వల్ల  నగరపాలక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ పెనుభారంగా మారుతుంది. నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి.

ఉదా: మన దేశంలో అతిపెద్ద మురికివాడ సెంట్రల్‌ ముంబయిలోని ధారావి ప్రాంతం. ఇది ప్రపంచంలోని పెద్ద మురికి వాడల్లో ఒకటి.


నివారణ మార్గాలు


* పురుగుమందుల వాడకాన్ని తగ్గించి వీటికి ప్రత్యామ్నాయంగా జీవామృతం, బీజామృతం లాంటి పర్యావరణ హితమైన క్రిమిసంహారిణులు వాడాలి.


రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ ఎరువులు, వర్మీకంపోస్టు లాంటి ఎరువులు వినియోగించాలి.


* కలుపు మొక్కల నివారణ ఔషధాలను నియంత్రించి అవి మొక్కలు పెరగకుండా యాజమాన్య పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి.


* పారిశ్రామిక విసర్జితాలను భూమిలోకి విడుదల చేయకుండా వాటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలి.


పారిశ్రామిక ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌గా వృక్షాలను విరివిగా పెంచాలి.


పారిశ్రామిక వ్యర్థాల నుంచి రసాయనాలను తొలగించి భూమిలో చిన్న గుంతల్లో విడిచిపెట్టాలి.


గృహాల నుంచి వెలువడిన బయోగ్యాస్, బయోమాస్‌ లాంటి వ్యర్థాలను విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించాలి.


* వినియోగ వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానంలో వినియోగించుకోవడం వల్ల నేలపై కాలుష్యాలను సమర్థంగా తగ్గించడం సాధ్యమవుతుంది.


* సూపర్‌ థర్మల్‌ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదను (ఫ్లైయాష్‌) ఇటుకల నిర్మాణంలో వినియోగించవచ్చు.


* న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా చేయడంలో తగిన చర్యలు చేపట్టాలి.


మాదిరి ప్రశ్నలు

1. కాడ్మియం కాలుష్యం ఏ వ్యాధికి కారణం అవుతుంది?

 1) బ్లాక్‌ ఫుట్‌           2) మినమాటా 

3) మలేరియా           4) ఇటాయి-ఇటాయి 


2. బెంగాల్‌ మైదాన ప్రాంతాలు ప్రధానంగా ఏ భూకాలుష్యానికి గురవు తున్నాయి?

 1) కాడ్మియం    2) క్రోమియం    3) కాపర్‌    4) సీసం


3. భూకాలుష్యాల్లో సుదీర్ఘకాలం నిర్వీర్యం కాని వ్యర్థ పదార్థం ఏది?

1) ఖనిజోద్గ్రహణ వల్ల వెలువడే వ్యర్థాలు    2) అణుధార్మిక వ్యర్థం

 3) బయోమెడికల్‌ వ్యర్థాలు        4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


4. ఇటీవల జపాన్‌ ప్రభుత్వం ఏ మహా సముద్రంలోకి ఫుకుషిమా దైచి అనే అణు రియాక్టర్‌ నుంచి అణుధార్మిక వ్యర్థ జలాలను విడుదల చేస్తోంది?

1) పసిఫిక్‌ మహాసముద్రం        2) హిందూ మహాసముద్రం

3) అట్లాంటిక్‌ మహాసముద్రం        4) ఆర్కిటిక్‌ మహాసముద్రం


5. ఏ వ్యర్థాలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది?

 1) అల్యూమినియం వస్తువులు    2) ఊలు వస్తువులు

  3) తోలు వస్తువులు        4) ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు


6. అశాస్త్రీయ వ్యవసాయ విధానాల వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతినడాన్ని ఏవిధంగా భావిస్తారు?

 1) రుణాత్మక నేల కాలుష్యం        2) ధనాత్మక నేలకాలుష్యం

 3) న్యూట్రల్‌ నేల కాలుష్యం        4) అసాధారణ నేలకాలుష్యం


7. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

  1) హైడ్రో కార్బన్లు  2) నైట్రేట్స్‌ 3) సల్ఫేట్స్‌  4) పైవన్నీ


8. హరిత విప్లవం సందర్భంలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల నేల కాలుష్యానికి గురై ఏర్పడిన నిస్సారమైన నేలలను ఏమని పిలుస్తారు?

1) రే నేలలు   2) కల్లార్‌ నేలలు   

3) ఉషర్‌ నేలలు   4) రకర్‌ నేలలు


9. నేల కాలుష్యం వల్ల ఏర్పడిన ప్రతిఫల కాలుష్యం ఏది?

1) వాయు కాలుష్యం  2) భూగర్భ జలాల కాలుష్యం

3) ఓజోన్‌ కాలుష్యం  4) జీవ కాలుష్యం


10. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కణయుత కాలుష్యాన్ని తొలగించడానికి ఏ సాంకేతిక పద్ధతి సరైంది?

1) ఎలక్ట్రో డయాలసిస్‌   2) వెట్‌ స్క్రబ్బర్స్‌

3) ఫ్యాబ్రిక్‌ ఫిల్టర్స్‌  4) ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌


సమాధానాలు

1-4; 2-1; 3-2; 4-1; 5-4; 6-1; 7-4; 8-1; 9-2; 10-4. 


 


రచయిత: జల్లు సద్గుణ
 

Posted Date : 01-09-2023

మనిషికి తెలిసిన భయంకర వైపరీత్యం!

భూకంపాలు - సునామీలు

మానవుడు నివారించలేని ప్రకృతి విపత్తుల్లో ప్రధానమైనవి భూకంపాలు, సునామీలు. అయితే తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న విపత్తుల్లో భూకంపాలు, సునామీల వాటా ఎనిమిది శాతం వరకు ఉంది. అనుకోకుండా, అకస్మాత్తుగా విరుచుకుపడే ఈ ప్రకృతి ప్రకోపాలకు కారణాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. భూకంపాలకు భూపటలంలోని ఫలకాల కదలికలు కారణమైతే, సునామీలు సర్వసాధారణ భూకంపాలతోనే సంభవిస్తాయి. ఈ అంశాలపై శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇప్పటివరకు ఎదురైన విపత్తుల నష్టాలు, సంబంధిత నివేదికలపై అవగాహన పెంచుకోవాలి. 

భూకంపం అంటే భూ పటలం లేదా ప్రావారంలో ఉనికిని పొంది నాభి నుంచి జనించే ప్రకంపన తరంగాల పరంపరలు. ఆకస్మిక, అంతర్జనిత బలాల వల్ల శిలలు ఆకస్మికంగా స్థానభ్రంశం చెందినప్పుడు శక్తి వెలువడుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ విధంగా ప్రాథమిక, ద్వితీయ, రేఖాంశ (PSL) తరంగాలు వ్యాపించి ప్రకంపనలు కలగజేస్తాయి. దీన్నే భూకంపం అంటారు. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు.

సునామీ అంటే తీర కెరటం అని అర్థం. ఈ పదం జపాన్‌ భాష నుంచి వచ్చింది. ‘సు’ అంటే తీరం, ‘నామి’ అంటే కెరటం. దీన్నే ‘హార్బర్‌ వేవ్‌’ అని పిలుస్తారు. సునామీలు ప్రధానంగా నాలుగు కారణాల వల్ల సంభవిస్తాయి.

1) భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు (Fault Movements)

2)    జలాంతర్గత భూకంపాలు

3)    భూపాతం (Landslide)

4)    సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటం

5)    సముద్రంలో ఉల్కాపాతం, ఆస్టరాయిడ్స్‌ పడటం


మాదిరి ప్రశ్నలు


1.     భూకంపం ఏ వేళలో సంభవించవచ్చు?

1) ఉదయం       2) మధ్య రాత్రి   

3) మధ్యాహ్నం       4) పైవన్నీ


2. 1997, జూన్‌ 26న సమోవాలో సంభవించిన అతి పెద్ద భూకంపం రిక్టర్‌ స్కేలుపై ఎంతగా నమోదైంది?

1) 8.3   2) 4.3   3) 11.3   4) 9.3


3.     సవరించిన సిస్మిక్‌ జోన్ల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం ఏది?

1) నల్గొండ       2) గుంటూరు   

3) ఒంగోలు       4) కడప


4.     ఇండియాలో ఉన్న ఐదు సిస్మిక్‌ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది?

1) 5     2) 4     3) 3     4) 2


5.     ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఎప్పుడు సంభవించింది?

1) 1556  2) 1557  3) 1558  4) 1559


6.     1556లో ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఏ దేశంలో సంభవించింది?

1) ఇండొనేసియా       2) జపాన్‌   

3) చైనా       4) ఇండియా


7.    ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఏ సాగరానికి సంబంధించింది?

1) అట్లాంటిక్‌       2) పసిఫిక్‌   

3) ఇండియన్‌       4) అంటార్కిటిక్‌


8.     భూకంపాల వల్ల జరిగే పరిణామాల్లో సమ్మిళితమైంది?

1) కదలిక, నేల పగుళ్లు    2) భూపాతాలు, హిమప్రవాహాలు

3) నేల ద్రవీకరణం    4) పైవన్నీ


9.     ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?

1) 5      2) 6    3) 7    4) 8


10. 2012, ఏప్రిల్‌ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?

1) బ్రూనై    2) మలేసియా

3) ఇండొనేసియా    4) ఫిలిప్పీన్స్‌


11. భూకంపం నుంచి సంభవించేవి?

1) కంపనాలు            2) ప్రకంపనాలు    

3) కంపనాలు, ప్రకంపనాలు    4) ప్రకంపనాలు, మంటలు


12. ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు?

1) చిలీ    2) పాకిస్థాన్‌    

3) న్యూజిలాండ్‌    4) ఆస్ట్రేలియా


13. భూకంపాలు, అగ్నిపర్వతాలు దేంతో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి?

1) ముడత భ్రంశం చెందిన ప్రాంతం    2) అగాథ సముద్ర మైదానం

3) పీఠభూమి ప్రాంతం    4) సముద్ర తీర ప్రాంతం


14. భారతదేశ రాష్ట్రాల విస్తృత వైపరీత్య వివరణను ప్రతిబింబించే వల్నరబిలిటీ అట్లాసును తయారుచేసింది ఎవరు?

1) బిల్డింగ్‌ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌    2) భారత వాతావరణ శాఖ

3) భారత విపత్తు నిర్వహణ సంస్థ    4) యునెస్కో


15. ‘నిఫే’ అనే పదం దేన్ని సూచిస్తుంది?

1) భూకంపాలు    2) భూమి అంతర్భాగం

3) భూపటలం        4) మహాసముద్రపు అడుగు భాగం


16. 2003, డిసెంబరు 26న ఏ దేశంలో శక్తిమంతమైన భూకంపం వచ్చి విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది?

1) ఇరాన్‌    2) ఇరాక్‌    

3) సౌదీ అరేబియా    4) జోర్డాన్‌


17. ప్రబలమైన సునామీలు ఎక్కువగా వేటి వల్ల కలుగుతాయి?

1) భూకంపాలు     2) వల్కనోలు 

3) భూపాతాలు     4) తుపాన్లు


18. భారతదేశంలో ఏ రాష్ట్రానికి భూకంపాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?    

1) ఢిల్లీ    2) ఆంధ్రప్రదేశ్‌    

3) గుజరాత్‌    4) కేరళ


19. ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?

1) అస్సాం    2) బిహార్‌    

3) మేఘాలయ    4) మహారాష్ట్ర


20. రిక్టర్‌ స్కేల్‌ మీద దేన్ని కొలుస్తారు?

1) ద్రవాల సాంద్రత      2) భూకంపాల తీవ్రత

3) తుపానుల వేగం      4) పర్వతాల ఎత్తు


21. కిందివాటిలో పెద్ద భూప్రకంపనం ఏది?

1) చిలీ (27-02-2010) 2) జపాన్‌ (11-03-2011)

3) ఇండొనేసియా (26-12-2004)   4) పైవన్నీ


22. భూకంపం దేనికి దారితీస్తుంది?

1) భూమి కదలికలు       2) భూపాతం   

3) ఉపరితల పగులు      4) పైవన్నీ


23. కిందివాటిలో ఏది సరైంది?

1) భూకంపం అకస్మాత్తుగా జరిగే విపత్తు.    2) భూకంపాన్ని ముందే ఊహించవచ్చు.

3) భూకంపం 25 నిమిషాల పాటు ఉంటుంది.   4) భూకంపం రాత్రి పూట సంభవిస్తుంది.


24. మధ్య అమెరికా దేశమైన నికరాగువాలో ఏ సంవత్సరంలో భూకంపాలు సంభవించి, భారీ నష్టం కలిగింది?

1) 1972  2) 1973   3) 1974  4) 1975


25. ‘సునామీ’ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?

1) జపనీస్‌       2) రష్యన్‌   

3) అరబిక్‌         4) ఫ్రెంచ్‌


26. సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశాల్లో వస్తాయి?

1) తూర్పు కోస్తా ప్రాంతం    2) మలబారు రేవు   

3) గల్ఫ్‌ ఆఫ్‌ కంబాట్‌      4) రాణా ఆఫ్‌ కచ్‌


27. సముద్రం లోపల భూకంపాల వల్ల ఏర్పడేవి?

1) అగ్నిపర్వతాలు      2) భూపాతాలు  

3) సునామీలు      4) వరదలు


28. ఏ రిపోర్టుల నుంచి ఇండియన్‌ సునామీ గురించి పాత రికార్డులు లభించాయి?

1) 1941 భూకంపం  2) 286 బి.సి. భూకంపం   

3) 316 బి.సి. భూకంపం       4) 326 బి.సి. భూకంపం


29. సునామీలు ఎక్కడ ఎక్కువగా సంభవిస్తాయి?

1) హిందూ మహాసముద్రం      2) అట్లాంటిక్‌ మహాసముద్రం

3) పసిఫిక్‌ మహాసముద్రం 4) మధ్యధరా సుముద్రం


30. ఏ రోజున సముద్రం లోపల తీవ్ర భూకంపం సునామీకి దారితీసి జపాన్‌ ఈశాన్య  ప్రాంతాన్ని తాకి 19,000 మంది మరణానికి కారణమైంది?

1) 2011, మార్చి 11       2) 2011, ఫిబ్రవరి 14   

3) 2011, జనవరి 11        4) 2010, మార్చి 14


31. నీటి లోతు ఆధారంగా సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?

1) 600 - 800 కి.మీ.     2) 900 - 1100 కి.మీ. 

3) 800 - 900 కి.మీ.     4) 950 - 1150 కి.మీ.


32. సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి?

1) సముద్రగర్భ భూకంపాలు    2) అగ్నిపర్వత సంబంధ పగుళ్లు 

3) భూపాతాలు         4) పైవన్నీ


33. 2012, మార్చి 11 నాటికి ఏ దేశపు భూకంపం, సునామీ వల్ల వేలాదిమంది చనిపోయి ఒక సంవత్సరం అయ్యింది?

1) మెక్సికో     2) ఫిలిప్పీన్స్‌ 

3) ఇండొనేసియా     4) జపాన్‌


34. సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల ఏర్పడేవి?

1) తుపాన్లు     2) ఉరుములు 

3) మెరుపులు     4) సునామీలు


35. సునామీ తరంగాలు/అలలు సంభవించే కారణాలు?

1) సముద్రంలో భూకంపాలు     2) అగ్నిపర్వత ఉద్భోదనాలు 

3) భూపాతాలు     4) పైవన్నీ


36. ఏ సంవత్సరంలో ఇండొనేసియాలోని కాక్రటోవా ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్పోటం వల్ల 40 అడుగుల సునామీలు సంభవించాయి?

 1) 1881   2) 1882  3) 1883   4) 1884


37. భారత్‌లో జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థ (NTWS) ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?

1) 2004  2) 2005  3) 2006  4) 2007


38. జపాన్‌ చరిత్రలో 23 అడుగుల సునామీని కలిగించిన భూకంపం ఎప్పుడు వచ్చింది?

1) 2010, మార్చి 11     2) 2011, మార్చి 11 

3) 2010, ఫిబ్రవరి 11     4) 2011, ఫిబ్రవరి 11


39. సునామీలు అధిక భాగం సంభవించే ప్రాంతం?

1) భూకంపాల ప్రాంతం     2) ఇండొనేసియా ప్రాంతం 

3) ఇండియన్‌ సముద్రం     4) పసిఫిక్‌ సముద్రం


40. మొదటిసారిగా క్రీస్తు పూర్వం ఏ సంవత్సరంలో ఏజియన్‌ సముద్రపు ఉత్తర ప్రాంతంలో సునామీలు సంభవించినట్లు సమాచారం లభ్యమైంది?

1) క్రీ.పూ.450     2) క్రీ.పూ.412 

3) క్రీ.పూ.379     4) క్రీ.పూ.479


41. మనిషికి తెలిసిన భయంకరమైన ప్రకృతికారక వైపరీత్యం?

1) తుపాన్లు     2) సునామీలు 

3) భూపాతాలు     4) గాలివానలు


42. పసిఫిక్‌ సునామీ హెచ్చరిక వ్యవస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1948      2) 1952  

3) 1949      4) 1947



సమాధానాలు


1-4; 2-1; 3-3; 4-1; 5-1; 6-3; 7-2; 8-4; 9-1; 10-3; 11-3; 12-4; 13-1; 14-1; 15-2; 16-1; 17-1; 18-3; 19-1; 20-2; 21-4; 22-4; 23-1; 24-1; 25-1; 26-1; 27-3; 28-4; 29-3; 30-1; 31-1; 32-4; 33-4; 34-4; 35-4; 36-3; 37-4; 38-2; 39-4; 40-3; 41-2; 42-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 01-01-2024

భూపాతాలు - వరదలు - కరవులు - తుపానులు

మేలో తరుముకొచ్చే దుమ్ము తుపానులు!

ప్రకృతిలో సహజ పరిణామాలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తుల్లో తుపాను, వరద, భూపాతం, కరవు ప్రధానమైనవి. అవి ప్రభావిత ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులను సృష్టించి, అక్కడి సమాజానికి తీరని ఇబ్బందులు కలిగిస్తాయి.  ఈ విపత్తులకు కారణాలు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, చూపే ప్రభావాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో సంభవించిన ప్రధాన విపత్తులు, ప్రాంతాలవారీగా పీడ కలలుగా మిగిలిన సంఘటనలు, జరిగిన నష్టాలను గణాంక సహితంగా గుర్తుంచుకోవడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి.

భూపాతం: కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు/మట్టి దిబ్బలు వాటంతటవే లేదా వర్షాలు, వరదలు, భూకంపాలు, తుపానులు, ఇతర కారణాల వల్ల జారి కిందకు పడటాన్ని కొండచరియలు విరగడం, భూపాతం అంటారు. ఎత్తయిన నదీ తీర ప్రాంతాలు, హిమాలయాలు, తూర్పు కనుమలు, ఈశాన్య భారతదేశ ప్రాంతాలు లాంటి పర్వతాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో కొండచరియలు విరగడం సర్వసాధారణం.


వరద: అధిక భూప్రాంతం కొంతకాలంపాటు నీటిలో మునిగిపోవడాన్ని వరదలు రావడం అంటారు. కుండపోత వర్షం, తుపాన్లు, రిజర్వాయర్లు నిండిపోవడం వరదలకు ప్రధాన కారణాలు. భూకంపాలు, తుపాను గాలులు, తుపాను అలలు, సునామీ, మంచు కరగడం, ఆనకట్టలు, కరకట్టలు తెగిపోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.


కరవు: ఎక్కువకాలం పాటు నీటికొరత వల్ల ఏర్పడే అనార్ద్ర పరిస్థితిని కరవు అంటారు. సంవత్సర సగటు వర్షపాతంలో 50% కంటే తక్కువ వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితిని కరవు అని పేర్కొంటారు. దేశంలో దాదాపు 24% ప్రాంతం కరవు బారినపడే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బావులు ఎండిపోవడం, నదులు, రిజర్వాయర్లు ఎండిపోవడం, వ్యవసాయోత్పత్తులు భారీగా తగ్గిపోవడం లాంటివి కరవు లక్షణాలు.


తుపాను: అల్పపీడనం ఉన్న ప్రదేశాల్లో సుడిగాలి వల్ల వాతావరణంలో కలిగే మార్పులనే తుపాను అంటారు. ఒక అల్పపీడన ప్రాంతం చుట్టూ ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్యదిశలో అతి వేగంగా గాలి తిరుగుతున్నట్లయితే అలా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం అంటారు. చక్రవాతాల మధ్య అల్ప పీడనం ఏర్పడుతుంది. వీటినే వాయుగుండాలు అంటారు. ‘సైక్లోన్‌’ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. చుట్టుకున్న పాము అని దీనర్థం. ఈ వైపరీత్యం సముద్రంలో జరుగుతుంది.


మాదిరి ప్రశ్నలు


1.    భూపాతాలు దేనివల్ల కలుగుతాయి?

1) వర్షపాతం తీవ్రత      2) ఏటవాలులు  

3) నేలకోతకి దారితీసే అటవీ నిర్మూలన    4) పైవన్నీ


2.     ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భూపాతాలు, నైసర్గిక ఆపదలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తాయి?

1) హిమాలయ పర్వతాలతో సహా భారతదేశంలోని  పర్వత ప్రాంతాలు    2) తూర్పు భారతదేశ పర్వత ప్రాంతాలు

3) పశ్చిమ భారతదేశ పర్వత ప్రాంతాలు   4) దక్షిణ భారతదేశ పర్వత ప్రాంతాలు


3. భూపాతాలు ఏర్పడటానికి కారణం?

1) వర్షపాతం తీవ్రత      2) ఎత్తయిన వాలులు   

3) ఎక్కువగా విచ్ఛేదం చెందిన శిలా పొరలు      4) పైవన్నీ


4. భారతదేశంలో దుమ్ము తుపాన్లు (డస్ట్‌ స్టోర్మ్‌) ఏ నెలలో ఎక్కువగా వస్తాయి?

1) మార్చి  2) మే   3) జులై   4) అక్టోబరు


5.     1980 నుంచి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి?

1) లాండ్‌స్లైడ్‌ జొనేషన్‌ మ్యాపింగ్‌  2) లాండ్‌ డెవలప్‌మెంట్‌ జూమింగ్‌

3) లాండ్‌ రిక్లమేషన్‌ జూమింగ్‌    4) లాండ్‌ డిజాస్టర్‌ మ్యాపింగ్‌


6.     ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?

1) హిమాలయాలు  2) తూర్పు కనుమలు (ఘాట్స్‌)  

3) వింధ్యాచలాలు 4) పశ్చిమ కనుమలు (ఘాట్స్‌)


7.     కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమప్రవాహాలు సంభవిస్తాయి?

1) జమ్ము-కశ్మీర్‌      2) హిమాచల్‌ ప్రదేశ్‌  

3) ఉత్తరాఖండ్‌      4) పైవన్నీ


8.     భూపాతం కలగడానికి కారణం?

1) జలాశయంలో మార్పు         2) భూగర్భ జలాల్లో కదలిక  

3) దిగ్భ్రాంతి, కంపనాలు      4) పైవన్నీ


9.     భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) ఏప్రిల్‌-జూన్‌       2) మే-అక్టోబరు 

3) జూన్‌-డిసెంబరు       4) జూన్‌-సెప్టెంబరు


10. ‘కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌’ని హైదరాబాద్‌లో ఇటీవల ఎవరు విడుదల చేశారు?

1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ

2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ

3) భారత వాతావరణ శాఖ

4) భారత జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం


11. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు?

1) పెన్నా డెల్టా ప్రాంతాలు      2) కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు

3) రాయలసీమ ప్రాంతాలు        4) ఉత్తర కోస్తా ప్రాంతాలు


12. వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయాలని ఏ కమిషన్‌కు సూచించింది?    

1) జాతీయ వరదల కమిషన్‌      2) జాతీయ విపత్తుల కమిషన్‌

3) కేంద్ర జల కమిషన్‌       4) కేంద్ర విద్యుత్‌ కమిషన్‌


13. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం?

1) అధిక ఉష్ణోగ్రత      2) భారీ వర్షపాతం   

3) గాలిలో తేమ      4) తుపాన్లు


14. వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారమవుతుంది?

1) ఆల్‌ ఇండియా రేడియో           2) దూరదర్శన్‌  

3) వార్తాపత్రికలు          4) పైవన్నీ


15. భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) 11%  2) 12%  3) 13%  4) 14%


16. వరదలు వేటివల్ల కలుగుతాయి?

1) అధిక వర్షపాతం       2) చెరువులకు గండ్లు  

3) తీవ్రమైన గాలులు     4) చెరువుల నుంచి నీరు పైకి రావడం


17. భారతదేశంలోని ఏ నది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి?    

1) గోదావరి      2) గోమతి   

3) బ్రహ్మపుత్ర      4) కావేరీ


18.తీవ్రమైన కరవు’ అని దేనిని పేర్కొంటారు?

1) వర్షపాతం 50% కంటే తక్కువగా ఉంటే

2) వర్షపాతం 26-50 శాతానికి మధ్య ఉన్నట్లయితే

3) పైరెండూ       4) ఏదీకాదు


19. నీటిపారుదల కమిషన్‌ క్షామ ప్రాంతాల్ని నిర్వచిస్తూ 10 సెం.మీ. కంటే తక్కువ వర్షం నమోదైతే దానిని తక్కువ  క్షామ  ప్రాంతంగా గుర్తించింది. ఇది ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1952  2) 1962  3) 1972   4) 1982


20. భారతదేశంలో మొత్తం క్షామ ప్రాంతం ఎన్ని మిలియన్‌ చదరపు కిలోమీటర్లుగా ఉంది?

1) 1.5    2) 1.7   3) 1.9   4) పైవన్నీ


21. కరవు నివారణ చర్యల్లో భాగంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఎన్ని వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు?

1) 1230   2) 1330  3) 1430  4) 1530


22. భూమిపై ఒక సెంటీమీటరు నేల పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

1) 120 - 300        2) 150 - 600   

3) 140 - 400       4) 150 - 400 


23. కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) గుడ్‌గావ్‌      2) జోధ్‌పుర్‌  

3) పట్నా      4) పాటియాలా


24. సారవంతమైన నేలలు కోతకు గురవకుండా ఏ విధంగా నివారించవచ్చు?

1) కాంటూర్‌ గట్ల నిర్మాణం  

2) పొలం గట్ల వెంట గుబురు వేర్లుండే మొక్కల్ని నాటడం

3) వాటర్‌ షెడ్లను నిర్మించడం   4) పైవన్నీ


25. హిమాలయ పర్వత చరియల మధ్య సాగే సన్నని జాలు నీటిని అక్కడి రైతులు ఏ విధంగా వాడుకుంటున్నారు?

1) 1 కి.మీ. నుంచి 50 కి.మీ వరకు కాలువల్ని నిర్మించి వ్యవసాయం చేస్తారు.

2) 1 కి.మీ. నుంచి 15 కి.మీ. వరకు కాలువలు నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

3) 1 కి.మీ. నుంచి 8 కి.మీ. వరకు కాలువలను నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

4) పైవన్నీ


26. ప్రస్తుతం మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న డ్రిప్‌ ఇరిగేషన్‌ దేని ఆధారంగా వచ్చింది?

1) మేఘాలయలోని వెదురుబొంగుల సేద్యం    2) త్రిపురలోని సేద్యపు పద్ధతి

3) మణిపుర్‌లోని వాటర్‌షెడ్‌ పద్ధతి   4) అస్సాంలోని సేద్యపు విధానం


27. కిందివాటిలో సంప్రదాయబద్ధమైన నీటిపారుదల పద్ధతి ఏది?

1) కుండ్స్‌  2) జాల్స్‌  3) సొరంగం  4) పైవన్నీ


28. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 మంది ప్రాణాలను హరించిన తుపాను సంభవించిన రోజు?

1) 15-11-1977     2) 15-11-1978 

3) 15-11-1976     4) 15-11-1975


29. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తీవ్రమైన తుపాను వల్ల 63,40,000 మంది నిరాశ్రయులయ్యారు. 26,00,000 మంది ప్రజలకు నష్టం వాటిల్లింది?

1) 1977  2) 1998  3) 1996  4) 1995


30. తుపాన్ల అవాంఛనీయ ప్రభావం?

1) అవస్థాపన నష్టం     2) దూరప్రసారాల నష్టం 

3) విద్యుత్తు ఆటంకం     4) పైవన్నీ 


31. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీరప్రాంతాల దగ్గర నివసిస్తున్నారు?    

1) 7%   2) 6%   3) 5%   4) 4% 


32. తుపాను అంటే ఏమిటి?

1) ఉత్తరార్ధ గోళంలో సవ్య (ప్రదక్షిణ) గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ. 

2) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య (అప్రదక్షిణ) గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ.

3) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ 

4) ఉత్తరార్ధ గోళంలో సవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ


33. టోర్నడోలు ప్రధానంగా ఏ దేశంలో సంభవిస్తుంటాయి.

1) రష్యా 2) బ్రెజిల్‌ 3) ఇండియా 4) అమెరికా


34. భారతదేశంలో తుపాను తరంగాలు, తుపాన్లు, సునామీల వల్ల హాని కలిగే తీర ప్రాంతం ఎంత?

1) 5700 కి.మీ.     2) 4700 కి.మీ.

3) 3700 కి.మీ.     4) 2700 కి.మీ.


35. ‘సైక్లోన్‌’ అనే మాట ‘సైక్లోస్‌’ అనే గ్రీకు మాట నుంచి వచ్చింది. ‘సైక్లోస్‌’ అంటే..

1) తుపాను    2) పాము చుట్ట 

3) ప్రకటన     4) కింది భాగం


36. ‘సైక్లోన్‌’ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) చైనీస్‌   2) లాటిన్‌  3) ఫ్రెంచ్‌  4) గ్రీకు


37. గాలివాన (హరికేన్‌) అనేది?

1) ప్రకృతి విపత్తు    2) మానవ ప్రేరిత విపత్తు

3) సునామీ        4) భూమి విరిగిపడటం


38. తుపాను హెచ్చరికలను ఎన్ని దశల్లో చేస్తారు?

1) రెండు   2) మూడు  

3) నాలుగు   4) అయిదు 



సమాధానాలు

1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-1; 7-4; 8-4; 9-4; 10-4; 11-2; 12-3; 13-2; 14-4; 15-2; 16-1; 17-3; 18-1; 19-2; 20-2; 21-3; 22-4; 23-2; 24-4; 25-2; 26-1; 27-4; 28-1; 29-3; 30-4;  31-1; 32-3; 33-4; 34-1; 35-2; 36-4; 37-1; 38-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 22-01-2024

విపత్తులు  ప్రాథమిక భావనలు

అంతా ధ్వంసం చేసే ఆపదలు!

ప్రజలకు తీవ్ర నష్టం కలిగించి, వనరులను ధ్వంసం చేసే ప్రకృతిపరమైన లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలే విపత్తులు. సంవత్సరాలుగా సాధించిన సమాజ వికాసాన్ని, భౌతిక ప్రగతిని ఒక్కసారిగా తుడిచేయగలిగే, సుస్థిరాభివృద్ధికి ఆటంకాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ విపత్తుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ భావనలు, సంబంధిత పదజాలంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. విపత్తు లక్షణాలు, రకాలు, వర్గీకరణ, వాటి  కారణంగా తలెత్తే నష్టాలు, ఉదాహరణలపై తగిన పరిజ్ఞానం ఉండాలి.


ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి, సమాజంలోని సహజ, సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి సమాజ సాధారణ కార్యకలాపాలకు అంతరాయాలను కలిగించే, ప్రజలను నిరాశ్రయులుగా చేసే ప్రకృతిపర లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలు, దుర్ఘటనలే విపత్తులు. ‘విపత్తు’ను ఆంగ్లంలో డిజాస్టర్‌ అంటారు. గ్రీకు భాషలోని Dus (దుష్ట), aster (నక్షత్రం) అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన ఫ్రెంచ్‌ పదం desastre నుంచి డిజాస్టర్‌ వచ్చింది. గ్రీకు, లాటిన్‌ భాషల్లో disaster అంటే దుష్టనక్షత్రం అని అర్థం. ప్రాచీన కాలంలో పూర్వీకులు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రంతో ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్టనక్షత్రంగా భావించేవారు. భూకంపాలు, తుపాన్లు, వడగళ్ల వానలు, కుంభవృష్టి, భూపాతం, భూ క్రమక్షయం, హిమపాతం, వరదలు లాంటి సహజ లేదా ప్రకృతి విపత్తులు; అగ్నిప్రమాదాలు, మహమ్మారి వ్యాధులు, రోడ్లు, విమాన, రైలు ప్రమాదాలు, రసాయన, అణుప్రమాదాలు లాంటి మానవ కారక విపత్తులు నిత్యం సంభవిస్తూనే ఉంటాయి. విపత్తు సహజమైంది లేదా మానవ ప్రేరేపితం కావచ్చు. విపత్తు వల్ల పెద్దఎత్తున మనుషుల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు, ప్రాంతాలకు నష్టాలు జరుగుతుంటాయి. 


  విపత్తు ప్రభావం:  విపత్తు ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి.

* సమాజ సాధారణ జీవనానికి అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావం పెద్దసంఖ్యలో ప్రజలపై పడుతుంది. 

 పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. విపత్తు ప్రభావానికి గురైన కమ్యూనిటీకి ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి బయటి నుంచి సహాయం అవసరమవుతుంది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుంది.

ముఖ్య లక్షణాలు: 

* ఆకస్మికంగా సంభవిస్తాయి.

అతివేగంగా ఏర్పడతాయి. 

 మానవ సమాజాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన వనరులను ధ్వంసం చేస్తాయి. 

 పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తాయి.

 పర్యావరణ వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధిని అడ్డుకుంటాయి. 

 సమాజ సాధారణ జీవనానికి అంతరాయాన్ని కలిగిస్తాయి. 


  ఐక్యరాజ్య సమితి నిర్వచనం:   ‘సమాజ సాధారణ కార్యకలాపాలకు అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’.


 విపత్తుల వర్గీకరణ:  విపత్తుల ఆవిర్భావం, అవి సంభవించే వేగం, వాటికి దారితీసే కారణాల ఆధారంగా పలు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ఎ) నిదానమైన లేదా వేగవంతమైన విపత్తులు:

1) నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు: రోజులు, నెలలు లేదా కరవు మాదిరిగా సంవత్సరాల తరబడి కొనసాగే విపత్తును నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు. ఉదా: పర్యావరణ క్షీణత, తెగుళ్ల దాడి, దుర్భిక్షం లాంటివి.


2) వేగంగా వచ్చే విపత్తు: తక్షణ విఘాతం వల్ల సంభవించే విపత్తును వేగంగా వచ్చే విపత్తు అంటారు. దీని ప్రభావం స్వల్పకాలం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం   కొనసాగవచ్చు. ఉదా: భూకంపం, చక్రవాతం, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వత విస్ఫోటం.


బి) సహజ లేదా మానవకారక విపత్తులు:

1) సహజ విపత్తులు: ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించి, ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక నష్టాలకు దారితీసేఘటనను సహజ విపత్తు అంటారు.

 వరదలు, కరవులు, సముద్ర వేలా తరంగాలు, భూప్రకంపనల కారణంగా సంభవించే విపత్తులు సహజ విపత్తుల కిందకి వస్తాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, 2008 చైనాలో వచ్చిన భూకంపం, 2007లో బంగ్లాదేశ్‌లో వచ్చిన సిదర్‌ తుపాను, రాజస్థాన్‌లో తరచూ వచ్చే కరవు; ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఏటా సంభవించే వరదలు సహజ విపత్తులకు ఉదాహరణలు.

  ప్రకృతి సంబంధ విపత్తుల నివారణ సాధ్యం కాదు. కానీ ఆధునిక శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాలను ఉపయోగించుకుని, వాటి తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.


2) మానవకారక విపత్తులు: ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీసే మానవ ప్రేరేపిత వైపరీత్యం సాధారణ జీవితానికి కలగజేసే తీవ్ర అంతరాయాన్ని మానవ కారక విపత్తు అంటారు. 

* అగ్నిప్రమాదాలు, రసాయన లేదా పారిశ్రామిక ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, రోడ్డు, రైలు, విమాన, జల ప్రమాదాలు, రాజకీయ అశాంతి మొదలైనవాటితో తలెత్తే విపత్తులను మానవకారక విపత్తులు లేదా మానవ ప్రేరేపిత విపత్తులు అంటారు.

ఉదా: 1984 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, 1997లో దిల్లీలోని ఉపహార్‌ సినిమాహాలులో జరిగిన ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడం, 2003లో కుంభకోణం పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం, 2008లో జైపుర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు, 2013, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లు: విశాఖపట్టణం సమీపంలో ఆర్‌ఆర్‌ వేంకటాపురంలో 2020, మే 7న ఎల్జీ పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదం మొదలైనవి.


 అయిదు విభాగాలు: ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన ‘డెస్‌ఇన్వెంటర్‌’ విపత్తు సమాచార నిర్వహణ వ్యవస్థ వర్గీకరణ ప్రకారం సహజ విపత్తులను అయిదు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు.


1) భూభౌతిక విపత్తులు: మానవ జీవనానికి, సామాజిక, ఆర్థిక అంతరాయానికి లేదా పర్యావరణ నష్టానికి కారణమయ్యే భౌగోళిక ప్రక్రియ లేదా ధర్మాన్ని భూభౌతిక విపత్తు అంటారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు గాయపడటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, జీవనోపాధికి, సేవలకు నష్టం జరుగుతుంది. ఉదా: భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సునామీ.


2) హైడ్రోలాజికల్‌ ఘటనలు: సాధారణ జలచక్రంలో వచ్చే మార్పుల కారణంగా లేదా వాయువ్యవస్థలో మార్పు వల్ల జలాశయాలు పొంగిపొర్లడంతో సంభవించే ఘటనలు.

ఉదా: వరదలు, భూపాతాలు, తరంగ చర్యలు.


3) వాతావరణ సంబంధిత ఘటనలు: స్వల్ప వ్యవధి నుంచి దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితుల కారణంగా సంభవించే విపత్తులు. ఉదా: తుపాను, టోర్నడో తుపాన్లు, ఉష్ణమండల తుపాన్లు, శీతలగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలు, పొగమంచు, మంచు గడ్డకట్టుకుపోవడం, వడగాలులు, పిడుగులు, భారీ వర్షాలు, ఇసుక తుపాన్లు, ధూళి తుపాన్లు, మంచు తుపాన్లు.


4) శీతోష్ణస్థితికి సంబంధించిన ఘటనలు: స్వల్పకాలం నుంచి దశాబ్దాల తరబడి శీతోష్ణస్థితి పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగా సంభవించే విపత్తు ఘటనలు. ఉదా: కరవు, అసాధారణ ఉష్ణ పరిస్థితులు, కార్చిచ్చులు, హిమానీనదాలు ఉప్పొంగడం, కుంగిపోవడం.


5) జైవిక ఘటనలు: వ్యాధికారక సూక్ష్మజీవులు, విష కీటకాలు, జైవిక చర్యను జరిపే పదార్థాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం, వ్యాధుల సంక్రమణ జరిగితే దాన్ని జైవిక విపత్తు అంటారు. దీని ప్రభావంతో జీవనోపాధి, సేవలు, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయంతో పాటు పర్యావరణ నష్టం జరుగుతుంది. ఉదా: వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాలు, ప్రియాన్‌ లాంటి వాటి ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులు, కీటకాల దాడులు, జంతువుల తొక్కిసలాటలు. 


 విపత్తు నిర్వహణ భావనలు ::విపత్తు ప్రభావం తక్షణంగా, స్థానికంగా ఉంటుంది. తరచూ విస్తారంగా, దీర్ఘకాలం కూడా ఉండొచ్చు. ఒక కమ్యూనిటీ సొంత వనరులతో ఎదుర్కోగలిగిన సామర్థ్యానికి మించి ఉండొచ్చు. అందువల్ల వెలుపలి నుంచి జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి వనరుల సాయం అవసరం కావచ్చు. 


అత్యవసరం: కొన్నిసార్లు విపత్తుకు బదులుగా ఈ భావనను వాడుతుంటారు. సమాజం మనుగడకు తీవ్ర అంతరాయం కలిగించే జైవిక లేదా సాంకేతిక వైపరీత్యాలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు.


విపత్తు నష్టం: ఇది విపత్తు సమయంలో లేదా విపత్తు ఏర్పడిన క్షణమే సంభవిస్తుంది. దీనిని సాధారణంగా భౌతిక యూనిట్ల (ఇళ్లకు సంబంధించి చదరపు మీటర్లు, రోడ్లయితే కి.మీ.లు)లో లెక్కిస్తారు. ప్రభావిత ప్రాంతంలో భౌతిక ఆస్తుల మొత్తం లేదా పాక్షిక విధ్వంసాన్ని, ప్రాథమిక సేవలకు కలిగే అంతరాయాన్ని, జీవనోపాధి వనరులకు కలిగే ఇబ్బందులను వివరిస్తుంది.


విపత్తు తాకిడి: ఇదొక వైపరీత్య ఘటన లేదా విపత్తు ప్రతికూల, సానుకూలం సహా మొత్తం ప్రభావాన్ని   తెలియజేస్తుంది. ఇందులో ఆర్థిక, మానవ, పర్యావరణ తాకిడులు కూడా ఇమిడి ఉంటాయి. 


 విపత్తు రకాలు : విపత్తు ముప్పు తగ్గింపునకు సెడాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2015-2030 పరిధి ప్రయోజనం ఆధారంగా విపత్తును వివిధ రకాలుగా పేర్కొంటారు. 


చిన్నతరహా విపత్తు: స్థానిక కమ్యూనిటీలపై మాత్రమే ప్రభావం చూపి, ఆ కమ్యూనిటీకి వెలుపల నుంచి సహకారం అవసరమయ్యే విపత్తు, చిన్నతరహా విపత్తు.


భారీతరహా విపత్తు: జాతీయ లేదా అంతర్జాతీయ  సహకారం అవసరమయ్యే విధంగా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే విపత్తు.తరచూ, అరుదుగా వచ్చే విపత్తులు: విపత్తులు సంభవించే సంభావ్యత, ఒక నిర్దిష్ట వైపరీత్యం తిరిగి వచ్చే వ్యవధి, దాని తాకిడి ఆధారంగా విపత్తులను తరచుగా వచ్చే లేదా అరుదైన విపత్తులుగా వర్గీకరిస్తారు. 


నెమ్మదిగా విస్తరించే విపత్తు: కాలక్రమేణా క్రమంగా విస్తరించే విపత్తును నెమ్మదిగా విస్తరించే విపత్తు అంటారు. ఉదా: కరవు, ఎడారీకరణ, సముద్ర మట్టాల పెరుగుదల, కొవిడ్‌-19 లాంటి  మహమ్మారుల వ్యాప్తి.


అకస్మాత్తుగా దాడి చేసే విపత్తు: ఇది సత్వరం లేదా ఆకస్మికంగా సంభవించే వైపరీత్య ఘటన. ఉదా: భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటం, ఆకస్మిక వరదలు, రసాయన విస్ఫోటం.


 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 15-03-2024

విపత్తు నిర్వహణ వ్యవస్థ, నిర్మాణం

ఆపదల్లో ఆదుకునే అత్యున్నత సంస్థలు!

సహజ, మానవకారక విపత్తులకు అవకాశం ఉన్న దేశం మనది. విశాలమైన భూభాగం, అధిక జనాభా, భౌగోళికంగా, నైసర్గికంగా విభిన్న పరిస్థితులు, వాతావరణ వ్యత్యాసాలు, అస్థిర రుతుపవనాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా దేశంలో ఏదో ఒక చోట విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి రాష్ట్రాల     వారీగా విపత్తు నిర్వహణ యంత్రాంగాలు ఉన్నప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సేవలు సరిపోవు. అందుకే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులపై సత్వరం స్పందించి ఉపశమనం కల్పించే ఏర్పాట్లు సంస్థాగతంగా ఉన్నాయి. ప్రణాళికల నుంచి పునరావాసం వరకు బాధ్యత తీసుకునే ఈ వ్యవస్థ నిర్మాణంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర స్థాయిలో విపత్తు నిర్వహణలో కీలకమైన సంస్థలు, కమిటీలు, విభాగాలు, వాటి విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది. 2019 విపత్తు నిర్వహణ ప్రణాళిక ఈ మేరకు నిర్దేశించింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీలు కీలకంగా ఉంటాయి. ఏ విపత్తునైనా జాతీయ విపత్తుగా గుర్తించడానికి విపత్తు నిర్వహణ చట్టం-2005లో తగిన నిబంధనలు లేవు.


విపత్తు నిర్వహణలో జాతీయ స్థాయి నిర్ణాయక సంస్థలు:


1) కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ: ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి, ఆర్థికమంత్రి, దేశీయవ్యవహారాల మంత్రి, విదేశీవ్యవహారాల మంత్రి ఉంటారు. ఏదైనా సంఘటనలో భద్రతకు సంబంధించిన అంశాలుంటే, ఈ కమిటీ దాన్ని జాతీయ భద్రతా దృక్కోణంలో అంచనా వేస్తుంది. రసాయన, జైవిక, రేడియోధార్మిక, అణుఅత్యవసర పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలున్న విపత్తులకు సంబంధించి సంసిద్ధత, ఉపశమనం, నిర్వహణల అన్ని దృక్కోణాలను పరిశీలిస్తుంది. కెమికల్‌ బయోలాజికల్‌ రేడియోలాజికల్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) ముప్పు, అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. విపత్తు నివారణ, ఉపశమనం, సంసిద్ధత, సమర్థ ప్రతిస్పందనకు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశకం చేస్తుంది.


2) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ: ఈ కమిటీకి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్‌పర్సన్‌. నిర్దిష్ట విపత్తు నిర్వహణ బాధ్యతలున్న మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల కార్యదర్శులు సభ్యులు. ఈ కమిటీ విపత్తు ప్రతిస్పందన ఆదేశాలు, నియంత్రణ, సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. అవసరమైన పక్షంలో సంక్షోభ నిర్వహణ బృందానికి సూచనలిస్తుంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నిర్దిష్ట కార్యాచరణలకు సంబంధించి మార్గనిర్దేశం చేస్తుంది.


3) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ): దీనికి ప్రధానమంత్రి ఛైర్‌పర్సన్‌. ప్రధాని నామినేట్‌ చేసినవారు సభ్యులుగా ఉంటారు. వీరి సంఖ్య 9 మందికి మించదు. ఈ విభాగం విపత్తు నిర్వహణకు సంబంధించిన విధానాలు, ప్రణాళికలతోపాటు వేర్వేరు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విపత్తు నిర్వహణ మార్గదర్శకాలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా వాటి అమలును సమన్వయం చేస్తుంది. 


4) జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఈ కమిటీకి కేంద్ర హోం సెక్రటరీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. వ్యవసాయం, అణుశక్తి, రక్షణ, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పిడి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్షం, టెలీకమ్యూనికేషన్, పట్టణాభివృద్ధి, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు, సమీకృత రక్షణ దళాల అధిపతి, సైనిక దళాల అధిపతులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

* భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు సిద్ధం చేసిన జాతీయ ప్రణాళిక, ప్రణాళికల అమలును పర్యవేక్షిస్తుంది.

* అత్యవసర ప్రతిస్పందన, రెస్క్యూ సహాయక చర్యల కోసం తమ వద్ద ఉన్న మానవ వనరులు, సామగ్రి లేదా ఇతర వనరులను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లేదా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి అందుబాటులో ఉంచాల్సిందిగా ప్రభుత్వ విభాగాలు లేదా ఏజెన్సీలకు సూచిస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చూస్తుంది.

* విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంఘటన సమయంలో ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేస్తుంది.

* ముందస్తు హెచ్చరికల పర్యవేక్షణకు బాధ్యత వహించే సంబంధిత వైజ్ఞానిక సంస్థలు, ఏజెన్సీలతో సమన్వయం చేస్తుంది.

* రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత పాలనా విభాగాల ద్వారా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పౌర రక్షణ వాలంటీర్లు, హోంగార్డులు, అగ్నిమాపక సేవలను సమన్వయం చేస్తుంది.


5) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం: వెంటనే రంగంలోకి దిగే విధంగా పారామిలటరీ తరహాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం. దీనికి డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వం వహిస్తారు. ఈ దళం వైపరీత్య సంఘటన సమయంలో లేదా సంభవించిన తర్వాత సంబంధిత రాష్ట్రం, జిల్లా పాలనా యంత్రాంగానికి సహకరిస్తుంది.


6) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ: కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ప్రముఖ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రాక్టీషనర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోడల్‌ మంత్రిత్వశాఖలు, విభాగాలకార్యదర్శులు, జాతీయస్థాయి శాస్త్రవిజ్ఞాన, పరిశోధన సాంకేతికసంస్థల అధిపతులు సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

 * ఎన్‌డీఎమ్‌ఏ రూపొందించిన   విధానాలు, మార్గదర్శకాల పరిధిలో విపత్తు నిర్వహణ కోసం మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం.

* శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధి, అమలు.

* పరిశోధనలు చేపట్టడం

*  సమగ్ర మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అభివృద్ధి చేయడం.

* జాతీయవిధాన రూపకల్పనకు సహకారం అందించడం, తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడానికి ఇతర పరిశోధన శిక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు సహకరించడం.

* పంపిణీ చేయడానికి అవసరమైన విద్యాసామగ్రిని అభివృద్ధి చేయడం.

* విపత్తులు, వాటిని ఎదుర్కొనే విధానాలపై  అవగాహన పెంపొందించడం.


నమూనా ప్రశ్నలు


1.  ‘యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌ సంస’్థ ఎక్కడ ఉంది?

1) కైరో   2) జోహెన్నస్‌ బర్గ్‌   

3) లాగోస్‌   4) కిన్షాస


2.  కిందివాటిలో అలర్ట్‌నెట్‌ అనే సంస్థ ఎక్కడ ఉంది?

1) మాంచెస్టర్‌    2) బర్మింగ్‌హామ్‌   

3) బ్రాడ్‌ ఫోర్డ్‌    4) లండన్‌


3. ‘ఆసియన్‌ డిజాస్టర్‌ రిడక్షÛన్‌ సెంటర్‌ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) కోబ్‌   2) టోక్యో    3) క్యోటో    4) ఒసాకా


4. ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీస్‌’ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) జెనీవా    2) జ్యూరిచ్‌    3) బెర్న్‌    4) బాసెల్‌


5.  ‘ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ (ఐఎస్‌డీఆర్‌)’ అనే సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? 

1) బెర్న్‌    2) జ్యూరిచ్‌    3) బాసెల్‌    4) జెనీవా 


6. ‘అంతర్జాతీయ వాతావరణ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) ఇంటర్‌ లాకెన్   2) జెనీవా   

3) లాసాన్‌   4) బెర్న్‌


7. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌   క్లైమేట్‌ ఛేంజ్‌’ సంస్థ ఎక్కడ ఉంది?

1) జెనీవా   2) ఇంటర్‌ లాకెన్‌  

3) బెర్న్‌   4) లాసాన్‌


8. సౌత్‌ ఆసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) లఖ్‌నవూ     2) దిల్లీ 

3) ముంబయి     4) హైదరాబాద్‌


సమాధానాలు

1-2; 2-4; 3-1; 4-1; 5-4; 6-2; 7-1; 8-2.


 రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌

Posted Date : 05-04-2024

ప్రపంచంలో విపత్తులు - సమీక్ష

అంతకంతకు అధికమవుతున్న ఆపదలు!


 

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల నష్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే దశాబ్దాల్లో నగరీకరణ వల్ల మరింత ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆసియా దేశాల్లోనే అధికంగా ఉంది. మానవ కారక విపత్తులు కూడా గణనీయంగా ఎక్కువవుతున్నాయి. ఇవి మానవాభివృద్ధి అల్పంగా ఉన్న ప్రాంతాల్లో అధికంగా ఉండటం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతం కూడా దుర్బలత్వాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ జలావరణ విపత్తుల వల్ల అధిక ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ తాజా గణాంకాలతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటితోపాటు ఇటీవల సంభవించిన వైపరీత్యాలకు సంబంధించిన వివరాలపై పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

ప్రకృతి విపత్తులకు సంబంధించిన రికార్డుల నమోదు క్రీ.పూ.430 సమయంలోనే ప్రారôభమైంది. ఆ ఏడాదే ఏథెన్స్‌ నగరంలో టైఫన్‌ మహమ్మారి సంభవించినట్లు నమోదైంది. క్రీ.శ.1556కు ముందు   ప్రపంచంలో 10 అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తులు సంభవించాయి. 1556, జనవరి 23న చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో భూకంప తాకిడికి 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల కారణంగా ఏటా సగటున సంభవించే నష్టం విలువ 1980లలో 50 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఉండగా, గత దశాబ్దం (2010)లో నాలుగింతలు అంటే 200 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు పైగా నగరాల్లో నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా. ఈ ధోరణులు 1.3 బిలియన్ల ప్రజలను, 158 బిలియన్‌ డాలర్ల ఆస్తులను నదీ, తీరప్రాంత వరదల ముప్పులోకి నెట్టనున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. నగరాలను మరింత పటిష్ఠం చేయడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని, లేకపోతే 2030 నాటికి ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచ    వ్యాప్తంగా నగరాల్లోనే ఏటా 314 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతుందని కూడా ప్రపంచ బ్యాంకు ‘ఇన్వెస్టింగ్‌ ఇన్‌ అర్బన్‌ రెసిలియన్స్‌’ నివేదిక పేర్కొంది. 20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో 200కి పైగా పెనువిపత్తులు సంభవించాయి. సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక దేశాలతో పోల్చుకుంటే విపత్తుల వల్ల సంభవించిన నష్టం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 రెట్లు అధికంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రాణనష్టం అధికంగా జరిగిన దేశాల జాబితాలో ఆసియా దేశాలు అగ్రభాగాన ఉన్నాయి.

ఇటీవల కాలంలో సహజ, మానవకారక విపత్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 1994 నుంచి 1998 వరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 428 విపత్తులు సంభవించాయి. 1992-2000 మధ్య ఏటా సగటున 500 విపత్తుల చొప్పున, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4,989 విపత్తులు సంభవించాయి. 1990-2023 మధ్య ఏటా సగటున 707 విపత్తులు నమోదయ్యాయి. 1994-1998 మధ్యకాలంతో పోల్చుకుంటే 1999-2003 మధ్య విపత్తుల సంఖ్య సగటున సంవత్సరానికి 60% పెరిగింది. మానవాభివృద్ధి అల్పంగా ఉన్న దేశాల్లో 142% విపత్తులు పెరగడం గమనార్హం. 1992-2001 మధ్య సంభవించిన విపత్తులను పరిశీలిస్తే కరవు, దుర్భిక్షం అత్యంత ప్రాణాంతక విపత్తులని నిరూపితమయ్యాయి. వరదలు, సాంకేతిక ప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు, అసాధారణ ఉష్ణోగ్రతలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దక్షిణాసియా పరిస్థితి: వైపరీత్య ఘటనలకు సంబంధించి దక్షిణాసియా ప్రాంతం అధిక ప్రమాదం, దుర్బలత్వాన్ని ఎదుర్కొంటోంది. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా తప్పనిసరిగా సహాయక, ప్రతిస్పందన, పునరావాస కార్యక్రమాలకు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా మూలధన కల్పనను బలవంతంగా నిలిపేయాల్సిన పరిస్థితి. గత పదేళ్లలో దక్షిణాసియా దేశాలకు వాటిల్లిన నష్టం 50 బిలియన్‌ డాలర్లకు పైమాటే. ఎమర్జెన్సీ ఈవెంట్స్‌ డేటాబేస్‌ (EMDAT) ప్రాతిపదికన 1971-2009 మధ్యకాలంలో దక్షిణాసియా 1,017 ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది. 1971లో 8 విపత్తులు నమోదుకాగా, 2009లో 40కు పైగా నమోదయ్యాయి. ఈ ఘటనలు 2 బిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేయగా, 8 లక్షల మందికి పైగా మరణించారు. ఈ కాలంలో 80 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లింది. పరోక్ష నష్టాలనూ పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ఎక్కువవుతుంది. అధిక వర్షపాతం, తుపాను ఘటనలను తట్టుకునే సామర్థ్యం పరిమితంగా ఉండటం, తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లోనే ఆస్తులు కేంద్రీకృతం అవుతుండటంతో దక్షిణాసియా ప్రాంతంలో జలవాతావరణ విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు అధికమవుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా వరదలు, తుపాన్లను ఎదుర్కొనే ప్రాంతంగా దక్షిణాసియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా వరదలకు గురయ్యే ప్రజల్లో 64% దక్షిణాసియా వాసులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తుపాన్లకు గురయ్యే ప్రాంతాల్లో దక్షిణాసియాది రెండో స్థానం. గత 40 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో మౌలిక వసతులపై వ్యయం గణనీయంగా పెరిగింది. స్థిర మూలధన కల్పన 1970తో పోల్చుకుంటే 2010 నాటికి దాదాపు 50 రెట్లు అధికమైంది. ఫలితంగా నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక వసతులతో ఎక్కువగా ఆస్తుల కేంద్రీకరణ జరిగింది. అభివృద్ధి స్థాయులు పెరిగినప్పటికీ ఈ ఆస్తులు  వైపరీత్య ఘటనలను తట్టుకునే విధంగా ఉండటం లేదు ఆస్తులు, ఉత్పత్తిపై దీర్ఘకాలిక ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా దక్షిణాసియాలో వరదల వల్ల నష్టాలు అధికంగా ఉంటున్నాయి. దక్షిణాసియా ప్రాంత జీడీపీ పరిమాణంలో వరద నష్టాలు, దేశాల నష్టాల కంటే దాదాపు 15 రెట్లు అధికం. దీనికి భిన్నంగా అధిక మరణాలకు దారితీసే తుపాన్లు, అధిక తీవ్రత కలిగిన ఘటనలు తక్కువ నష్టం కలిగిస్తున్నాయి. గత కొన్నేళ్లలో సహజ విపత్తుల కారణంగా దక్షిణాసియాలో 8,25,000 మంది మృతిచెందారు. గత దశాబ్దం (2010)లోనే ఈ ప్రాంత జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే 700 మిలియన్ల మందికి పైగా ప్రజలు విపత్తుల ప్రభావానికి గురయ్యారు.

తుర్కియే అతలాకుతలం

తుర్కియేలో 2023, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని తీరులో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విపత్తులో 35 వేల మందికిపైగా దుర్మరణం చెందారని, 1,05,505 మంది గాయపడ్డారని ఆ దేశాధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డొగాన్‌ ప్రకటించారు. 2,11,000 మంది నివసిస్తున్న 47 వేల భవనాల్లో కొన్ని కుప్పకూలగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల స్వరాలు వినిపిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. నీరు, ఆహారం లేక అలమటించి ఎందరో ప్రాణాలు విడిచారు. క్షతగాత్రుల చికిత్స కోసం తుర్కియే ఒక యుద్ధ నౌకను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చింది. ఇదే భూకంపంలో పొరుగునున్న సిరియా దేశంలో 50 లక్షల మంది ప్రభావితమయ్యారు. వీరిని ఆదుకోవడానికి 397 మిలియన్‌ డాలర్ల సేకరణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. తుర్కియే, సిరియాలో కలిపి 2 కోట్ల 60 లక్షల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అతిశీతల ఉష్ణోగ్రతలు, అపరిశుభ్రత కారణంగా అనేక రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తుర్కియేలోని ఎర్జింకాన్‌ ప్రావిన్స్‌లో 1939లో వచ్చిన భూకంపంలో 33 వేల మంది  మరణించారు.

ఇతర వివరాలు

2005లో రెగెర్, బాబర్‌ రచించిన ‘ఇన్‌ ద లైన్‌ ఆఫ్‌ ఫైర్‌: ట్రామా ఇన్‌ ది ఎమర్జెన్సీ సర్వీసెస్‌’ పుస్తకం ప్రకారం 1995-2005 మధ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు లేదా ప్రపంచ జనాభాలో 1/3వ వంతు జనాభా విపత్తుల తాకిడికి గురైంది. సహజ విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 60,000 మంది మరణిస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌క్రిసెంట్‌ సొసైటీస్‌ ప్రచురించిన ‘ప్రపంచ విపత్తు నివేదిక 2010’ ప్రకారం 2000-2009 మధ్య ప్రపంచవ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురైన వారిలో 85% ఆసియా, పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు.

* ఐక్యరాజ్యసమితి విపత్తు కుదింపునకు అంతర్జాతీయ వ్యూహం విడుదల చేసిన గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదలకు గురవుతున్న వారిలో 90 శాతానికిపైగా దక్షిణాసియా, తూర్పుఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉంటున్నారు.

* అధిక జనాభా కారణంగా భారత్, బంగ్లాదేశ్‌ అధికంగా విపత్తులకు గురవుతున్నాయి. భౌగోళిక విస్తీర్ణం, నదులు, స్థలాకృతి కారణంగా బంగ్లాదేశ్‌ తీర ప్రాంతాలు వరదలు, తుపాన్ల బారిన పడుతున్నాయి.  ః ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ‘నేచురల్‌ హజార్డ్స్, అన్‌నేచురల్‌ డిజాస్టర్స్‌’ నివేదిక ప్రకారం వరదలు, తుపాన్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం విస్తరించి ఉండగా, ఆఫ్రికాలో తరచూ కరవులు సంభవిస్తున్నాయి. కరవులు, వరదల పీడిత దేశాలే ప్రపంచంలోనే అత్యంత ఆకలి దేశాలుగా ఉన్నాయి.

* కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2011 నివేదిక ప్రకారం విపత్తుల వల్ల సంభవించే నష్టం (జీడీపీలో శాతం) పారిశ్రామిక దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 రెట్లు అధికం.

* యూఎన్‌ఐఎన్‌డీఆర్‌ విడుదల చేసిన ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌: యాన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ అఛీవింగ్‌ ద మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ ప్రకారం భూకంపాలు, తుపాన్లు, వరదలు, కరవులకు గురవుతున్నవారిలో 85% మంది అభివృద్ధి చెందుతున్న దేశాలవారే.

* విపత్తుల వల్ల నేరుగా సంభవించే నష్టం విలువ 1960ల్లో సంవత్సరానికి 75.5 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు కాగా, గత పదేళ్లలో సంవత్సరానికి ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు)కు చేరింది.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌  

Posted Date : 23-05-2024

విపత్తు నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌

ఆపదలను పసిగట్టే నిఘా నేత్రం!

ఒక వస్తువును లేదా ప్రాంతాన్ని సుదూరం నుంచి చూసి, దాని స్వభావాన్ని పరిశీలించగలిగే ఆధునిక సాంకేతికతే రిమోట్‌ సెన్సింగ్‌. భూగర్భంలోని  వనరుల గుర్తింపు నుంచి దేశ రక్షణ, అంతరిక్ష శోధన వరకు ఎన్నో రకాలుగా కీలకంగా మారిన ఈ ఆధునిక పరిజ్ఞానం విపత్తు నిర్వహణలోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది. కెమెరాలు, సెన్సర్లతో ముడిపడిన ఆ టెక్నాలజీ పనితీరుపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రిమోట్‌ సెన్సింగ్‌లో రకాలు, దేశంలో వాటిని  వినియోగిస్తున్న విధానం,  ఉపగ్రహాల్లో వాడుతున్న అత్యాధునిక సెన్సర్లు, వాటి ఉపయోగాలు, విపత్తుల నిర్వహణలో అవి అందిస్తున్న విస్తృత ప్రయోజనాలను తెలుసుకోవాలి.

వివిధ రకాల వస్తువులు, విభిన్న తరహా ఉద్గారాలను వెలువరిస్తాయనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని, వస్తువులను సుదూర ప్రాంతాల నుంచి సున్నితంగా పరిశీలించి, ఛాయాచిత్రాల రూపంలో ఫలితాన్ని అందించే సాంకేతికతనే ‘రిమోట్‌ సెన్సింగ్‌’ అంటారు. భారతదేశంలో రిమోట్‌ సెన్సింగ్‌ కార్యకలాపాలు 1988 నుంచి ప్రారంభమయ్యాయి.

రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా చేపట్టే కార్యక్రమాలు:

విపత్తుల నిర్వహణ 

సహజ  వనరుల అన్వేషణ, నిర్వహణ, అంచనా, పర్యవేక్షణ              

నేరస్థుల కదలికలు

మెరుగైన రవాణా వ్యవస్థ, అభివృద్ధి

ఉపరితల దృశ్యాల చిత్రీకరణ

దేశ  సరిహద్దు ప్రాంతాల్లో శత్రుదేశాల సైనికుల కదలికలు            

దేశ భద్రతా వ్యవస్థపై నిఘా.

విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లోని దృశ్య, పరారుణ, మైక్రోవేవ్‌ తరంగాలను విమానాలు, కృత్రిమ ఉపగ్రహాల్లో అమర్చిన సెన్సర్‌లు గ్రహించి, భూఉపరితల దృశ్యాలను చిత్రాలు, పటాల రూపంలో అందిస్తూ రిమోట్‌ సెన్సింగ్‌ విధులు నిర్వహిస్తాయి.

ప్రపంచంలో ప్రతి వస్తువు మనిషి కంటికి కనిపించడానికి కారణం, అది కాంతిని పరావర్తనం చెందించడమే. ఆ విధంగా ప్రతి వస్తువు కాంతి తరంగాల్లోని కొంత నిర్ణీత తరంగదైర్ఘ్యం ఉన్న కాంతులను పరావర్తనం చెందిస్తుంది. ఆ తరంగదైర్ఘ్యాన్నే ‘స్పెక్ట్రో సిగ్నేచర్‌’ అంటారు. అయితే ప్రతి వస్తువు తరంగ   దైర్ఘ్యాన్ని ఆకాశంలోకి పరావర్తనం చెందించడం వల్ల ఉపగ్రహాల్లో అమర్చిన కెమెరాలు అన్ని వస్తువుల తరంగదైర్ఘ్యాన్ని నమోదు చేసుకోలేవు. ఎందుకంటే కొంత భాగం తరంగదైర్ఘ్యం మేఘాలు, నీటిఆవిరి, దుమ్ము ధూళికణాల వల్ల నాశనం అవుతుంది. ఈ కారణాల వల్ల నాశనం కాకుండా ఉపగ్రహంలోని కెమెరాలు నమోదు చేయగలిగే తరంగదైర్ఘ్యాలను ‘రేడియేషన్‌ విండోస్‌’ అంటారు. ఇందులో ప్రతి నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలను నమోదుచేసే పరికరాన్ని ‘సెన్సర్‌’ అంటారు.

1988లో IRS-1A ఉపగ్రహ ప్రయోగంతో  ఇండియన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.

రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల పనితీరు సామర్థ్యం అందులో ఉపయోగించే సెన్సర్ల రిజల్యూషన్‌ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ‘రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచి స్పష్టంగా చూడగలిగే శక్తి’నే రిజల్యూషన్‌ సామర్థ్యం అంటారు.

హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో రిమోట్‌ సెన్సింగ్‌ ఉప   గ్రహాలు ఫొటోల రూపంలో అందించే సమాచారాన్ని  సేకరించి విశ్లేషిస్తారు. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు, వినియోగదారులకు చేర్చేందుకు దేశ  వ్యాప్తంగా 5 ప్రాంతీయ కేంద్రాలున్నాయి. అవి..                    

1) బెంగళూరు

2) దెహ్రాదూన్‌

3) జోథ్‌పుర్‌                  

4) కోల్‌కతా

5) నాగ్‌పుర్‌. ఈ ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఎన్‌ఆర్‌ఎస్‌సీ రిమోట్‌ సెన్సింగ్‌ సమాచారాన్ని దేశమంతటా ప్రసారం చేస్తుంది.

జాతీయ స్థాయిలో ‘నేషనల్‌ నేచర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎన్‌ఆర్‌ఎంఎస్‌)’ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నిర్వహిస్తుంది.

రిమోట్‌ సెన్సింగ్‌లో రెండు రకాలున్నాయి. అవి..

1) ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌లు

2) శాటిలైట్‌ ఇమేజెస్‌

ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌లు: ఈ ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌ విధానంలో విమానాల్లో సెన్సర్లు అమర్చి ఛాయాచిత్రాలు తీయాలనుకున్న ప్రాంతం మీది నుంచి వాటిని పంపితే ఆ ప్రాంతం చిత్రాలను సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ విధానంలో రెండు విధాలుగా భూఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తారు. అవి: ఎ) లంబంగా, నిశ్చలంగా ఉండే కెమెరాల ఆధారంగా ఫొటోలు తీసే విధానం. ఇందులో కెమెరా స్థిరంగా ఉండి, భూఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వీటినే ఊర్ధ్వ ఫొటోగ్రాఫ్‌లు అంటారు. బి) అటూ ఇటూ కదిలే కెమెరాల ద్వారా ఫొటోలు తీసే విధానం. కెమెరాలు పెండ్యూలం మీద తిరుగుతూ చుట్టూ ఉన్న ప్రదేశాలను చిత్రీకరి  స్తాయి. అందుకే మొదటి విధానం కంటే రెండో విధానాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ విధంగా తీసే ఫొటోలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని నిలువుగా, పక్కల నుంచి తీయడం వల్ల ఆయా ప్రాంతాల్లోని భవనాలు, కార్యాలయాలు, ఆయుధాల తయారీ కేంద్రాలు, న్యూక్లియర్‌ ప్లాంట్లను చూసే వీలుంటుంది.
అటూ ఇటూ తిరిగే కెమెరా తీసే ఫొటోల్లో ఒక ప్రాంతం చాలాసార్లు ఫొటోల్లో పడటం వల్ల అతివ్యాప్తి చెందుతాయి. అలాంటి ఫొటోలను ‘స్టీరియోస్కోపు’ పరికరం ద్వారా చూడటం వల్ల ఈ ప్రాంతం ‘త్రిమితీయం’గా కనిపిస్తుంది. ఈ ఏరియల్‌ ఫొటోగ్రాఫుల్లో స్కేలును ఒక సూత్రం ఆధారంగా కనుక్కుంటారు.

f = కెమెరాలోని లెన్స్‌ ముందు భాగానికి, ఫిల్మ్‌కు మధ్య దూరాన్ని సూచిస్తుంది.

h = భూ ఉపరితలం నుంచి కెమెరా ఉన్న ప్రాంతానికి గల ఎత్తు.

ఉపగ్రహ ఛాయాచిత్రాలు (శాటిలైట్‌ ఇమేజెస్‌): వివిధ దేశాలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తుంటాయి. వాటిలో పలు సెన్సర్లు, కెమెరాలు అమర్చి వాటి నుంచి ఛాయాచిత్రాలను తీసుకుని విశ్లేషిస్తుంటాయి. ఉపగ్రహాల్లో వినియోగించే సెన్సర్లు కేవలం పగటివేళలోనే చిత్రాలు తీస్తాయి. ఎందుకంటే రాత్రివేళ వాటి నుంచి ఎలాంటి కాంతి తరంగదైర్ఘ్యం పరావర్తనం చెందదు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ‘థర్మల్‌ సెన్సర్‌’లు ఉపయోగిస్తారు.

థర్మల్‌ సెన్సర్లు కాంతి తరంగదైర్ఘ్యాలను నమోదు  చేయకుండా కేవలం ఆయా వస్తువుల నుంచి వచ్చే ఉష్ణాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. ఇలాంటి సెన్సర్లను పగటి, రాత్రి వేళల్లో ఉపయోగించుకోవచ్చు.

ఇటీవల ఉపగ్రహాల్లో మల్టీ స్పెక్టరల్‌ స్కానర్‌ (ఎంఎస్‌ఎస్‌) లను ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు ఒక్కో స్కానర్‌ కేవలం నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని మాత్రమే నమోదు చేసేది. ఎంఎస్‌ఎస్‌ మాత్రం వివిధ తరంగదైర్ఘ్యాలను నమోదు చేస్తుంది. అంటే ఈ స్కానర్‌లు అతినీలలోహిత, పరారుణ, థర్మల్‌ ఇన్‌ఫ్రా బ్యాండ్స్‌ శక్తి తరంగాలన్నింటినీ నమోదు చేస్తాయి.

విపత్తుల నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌ వల్ల కలిగే  ప్రయోజనాలు:  

విపత్తు దుర్భలత్వ ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాలవ్యవధిలో చిత్రీకరిస్తుంది.                      

విపత్తుల దుర్భలత్వ ప్రాంతాలను గుర్తించి, మ్యాపులతో కూడిన అట్లాస్‌లను రూపొందిస్తుంది.

భూకంప ప్రదేశాల పటాలను రూపొందిస్తుంది. వరద ప్రభావిత ప్రాంత పటాలను అందిస్తుంది.

దీని సాయంతో ప్రకృతి విపత్తులైన తుపానులు, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఏర్పడే నష్ట తీవ్రతలను అంచనా వేయొచ్చు.

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 
 

Posted Date : 11-07-2024

మానవ కారక విపత్తులు  

రోడ్డుపై దాగి ఉన్న మహమ్మారి!
 

విపత్తుల కారణంగా ఏటా అత్యధికంగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటోంది. ప్రపంచ    వ్యాప్తంగా ప్రకృతి ప్రకోపాలకు తోడు రోడ్డు ప్రమాదాలు, యుద్ధాలు, జాతుల హింస లాంటి మానవ కారక విపత్తులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయవాదం, ఉగ్రవాదం, ఆధిపత్య భావజాలం తదితరాలన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా ఈ తరహా దుర్బలత్వానికి అవకాశం ఉన్న అంశాలపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహనతో ఉండాలి. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలతో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎదురైన విపత్తులు, సంభవించిన సంవత్సరాలు, ప్రాంతాలు, మిగిల్చిన ప్రాణనష్టం గణాంకాలను గుర్తుంచుకోవాలి.


1. మానవప్రేరిత విపత్తులకు కారణాలు?
1) వనరుల దోపిడీ        2) సామ్రాజ్యవాదం 
3) జాతీయాభిమానం     4) పైవన్నీ


2. దేశంలో అతిపెద్ద మానవకారక విపత్తు ‘భోపాల్‌ పారిశ్రామిక దుర్ఘటన’ జరిగిన రోజు?
1) 1984, డిసెంబరు 2    
2) 1984, డిసెంబరు 3    
3) 1984, డిసెంబరు 4     
4) 1984, డిసెంబరు 5
 

3. భోపాల్‌ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలను బలిగొన్న విషవాయువు?    
1) ఇథైల్‌ ఐసోసైనేట్‌    2) పాస్జీన్‌    
3) మిథైల్‌ ఐసోసైనేట్‌    4) సెరీన్‌


4. భోపాల్‌ గ్యాస్‌ విషాదం జరిగిన కంపెనీ?
1) నెరోలాక్‌ కెమికల్‌ కంపెనీ 
2) యూనియన్‌ కార్బైడ్‌ 
3) ఎన్‌రాక్‌ సంస్థ       
4) రాజోల్‌ కంపెనీ


5. కిందివాటిలో ‘పేదవాడి ఆయుధాలు’ అని వేటిని పిలుస్తారు?
1) అణ్వాయుధాలు     2) రసాయన ఆయుధాలు 
3) జీవాయుధాలు     4) అటామిక్‌ ఆయుధాలు

6. దక్షిణ కొరియాలో 2014, ఏప్రిల్‌ 16న జరిగిన పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు?
1) 380        2) 75    3) 150        4) 200

7. ఏ సందర్భం తర్వాత ‘సామూహిక జనహనన’ ఆయుధాలను ‘సంప్రదాయేతర’ ఆయుధాలుగా పిలుస్తున్నారు?
1) 2004, ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత
2) 2003, ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత
3) 2004, వియత్నాంపై అమెరికా దాడి తరువాత
4) ఏదీకాదు

8. ‘దాగి ఉన్న మహమ్మారి’ గా కిందివాటిలో దేన్ని  పిలుస్తారు?
1) రోడ్డు ప్రమాదాలు     2) రైల్వే ప్రమాదాలు 
3) జీవాయుధాలు     4) అణ్వాయుధాలు


9. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
1)  కర్ణాటక       2) తమిళనాడు 
3) మహారాష్ట్ర     4) ఆంధ్రప్రదేశ్‌


10. 1945, ఆగస్టు 6న ‘ఎనలాగో’ అనే అమెరికన్‌ విమానం ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది?
1) నాగసాకి      2) హిరోషిమా 
3) జెరూసలేం     4) టోక్యో


11. ‘సామూహిక జనహనన’ ఆయుధాలు అనే మాట ఎప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది?
1) 2003   2) 2004  3) 2005  4) 2006


12. ఉక్రెయిన్‌లోని ‘చెర్నోబిల్‌’ న్యూక్లియర్‌ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1994   2) 1995  3) 1984  4) 1986


13. ‘డర్టీబాంబ్స్, బ్యాక్‌ పాప్‌ బాంబ్స్‌’ అని వేటిని  పిలుస్తారు?
1) జీవాయుధాలు 
2) రేడియోధార్మిక పేలుడు పదార్థాలు 
3) పారిశ్రామిక దుర్ఘటనలు      4) పైవేవీకావు
 

14. తమిళనాడులోని కుంభకోణంలో అగ్నిప్రమాదం సంభవించి 93 మంది పిల్లలు ప్రాణాలు  కోల్పోయిన సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 2000  2) 2001  3) 2002  4) 2004


15. దిల్లీలోని ఉపహార్‌ థియేటర్‌ అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది?
1) 1997, జూన్‌ 23       2) 1997, జూన్‌ 13      
3) 1999, జూన్‌ 23      4) 1999, జులై 16


16. దేశంలో అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణ పథకాన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది?
1) 2009, నవంబరు      2) 2006, డిసెంబరు   
3) 2004, నవంబరు       4) 2008, డిసెంబరు
 

17. కిందివాటిలో ఏది మానవకారక విపత్తు?
1) వరద       2) భూకంపం   
3) కరవు       4) అగ్నిప్రమాదం


18. ఏ అడవులు అధికంగా అగ్నిప్రమాదాలకు     గురవుతున్నాయి?
1) కొనిఫెరస్‌ అడవులు     2) మడ అడవులు   
3) చిట్టడవులు         4) ఆకురాల్చు అడవులు


19. ఇచ్చినవాటిలో ఏది మానవ కారక విపత్తు?
1) వరద       2) భూకంపం   
3) కరవు       4) రోడ్డు ప్రమాదం


20. కిందివాటిలో ఏది మానవ కారక విపత్తు?
1) భూపాతం            2) భూకంపం   
3) రైలు ప్రమాదం      4) తుపాను ఉప్పెన


21. కిందివాటిలో ఏది భూనిర్మితిలో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యం?
1) అగ్నిపర్వత పేలుళ్లు      2) బాంబు విస్ఫోటం   
3) క్షామం                    4) అగ్నిప్రమాదం


22. అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు ఏ వయసుల మధ్య వారికి జరుగుతున్నాయి?
1) 18 - 35 ఏళ్లు       2) 12 - 15 ఏళ్లు   
3) 30 - 45 ఏళ్లు       4) 45 ఏళ్లకు పైబడి


23. విమానం అగ్నిప్రమాదంలో చిక్కుకున్నపుడు ప్రయాణికుల్ని పడుకోమని చెప్పడానికి కారణం?
1) వారిని ఎవరూ నెట్టకుండా ఉండటానికి
2) వారిని సీట్ల కింద దాక్కుని ఉండమనడానికి
3) పొగ పైకి వెళుతుంది కాబట్టి
4) గాజు కిటికీలకు వెళుతుంది కాబట్టి

24. జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది?
1) నాగ్‌పుర్‌       2) చెన్నై   
3) హైదరాబాద్‌       4) బెంగళూరు


25. 2005, అక్టోబరు 29న రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడ ప్రమాదానికి గురైంది?
1) రామన్నపేట - నల్గొండ 
2) బొత్తలపాలెం - నల్గొండ
3) నకిరేకల్‌ - నల్గొండ      
4) పానగల్లు - నల్గొండ


26. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్యలో మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఎంత? 
1) 7వ    2) 13వ    3) 14వ   4) 15వ 

27. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్యలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) 8వ   2) 9వ    3) 10వ   4) 11వ

28. 2004, జులై 16న జరిగిన పాఠశాల అగ్నిప్రమాదంలో 93 మంది విద్యార్థులు మరణించిన సంఘటన జరిగిన ప్రాంతం?
1) తిరువనంతపురం - కేరళ     
2) కుంభకోణం - తమిళనాడు
3) ఉడుపి - కర్ణాటక      
4) నాందేడ్‌ - మహారాష్ట్ర


29. దిల్లీలో సౌదీ అరేబియా - కజకిస్థాన్‌ విమానాలు ఢీకొని 349 మంది మరణించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1996, నవంబరు 12        
2) 1997, నవంబరు 20 
3) 1997, నవంబరు 12        
4) 1996, నవంబరు 20      

30. దేశవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రం?
1) మహారాష్ట్ర     2) తమిళనాడు
3) కర్ణాటక           4) ఆంధ్రప్రదేశ్‌ 


31. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత దేశంలో ఏటా ఎన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు?
1) 20    2) 15  3) 12   4) 10


32. మంగళూరు విమాన ప్రమాదం జరిగిన తేదీ?
1) 2010, మే 22        2) 2010, మే 20 
3) 2009, మే 22        4) 2009, మే 20

33. అండమాన్‌ తీరంలో బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ మునిగిపోయిన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు?
1) 30     2) 21    3) 25     4) 45 


34. అండమాన్‌ తీరంలో 21 మంది మరణానికి కారణమైన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది? 
1) 2014, ఫిబ్రవరి 9     
2) 2013, అక్టోబరు 10 
3) 2014, జులై 17      
4) 2014, జనవరి 26


35. ఒడిశాలోని హీరాకుడ్‌ రిజర్వాయర్‌లో 31 మంది మరణానికి కారణమైన పడవ ప్రమాద సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 2013, అక్టోబరు 30     2) 2014, జనవరి 26 
3) 2014, ఫిబ్రవరి 9      4) 2014, జులై 17

36. ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దుల్లో మలేసియాకు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని ఉగ్రవాదులు ఎప్పుడు కూల్చివేశారు? 
1) 2014, జులై 17     2) 2013, జులై 17 
3) 2011, జులై 17     4) 2012, జులై 17


37. 2014, జులై 17న ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దుల్లో ఉగ్రవాదులు కూల్చివేసిన మలేసియాకు చెందిన బోయింగ్‌ 777 విమానంలో ఎంతమంది ప్రయాణికులు మరణించారు? 
1) 195     2) 95 
3) 295     4) 275  

38. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం గ్రామంలో 2013, అక్టోబరు 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు? 
1) 45     2) 35 
3) 55     4) 15 


39. మెదక్‌ జిల్లాలో మూసాపేట్‌ రైల్వేక్రాసింగ్‌ వద్ద స్కూల్‌ బస్సు, రైలు ఢీకొని పలువురు విద్యార్థుల మరణానికి కారణమైన సంఘటన ఎప్పుడు    జరిగింది?
1) 2014, జూన్‌ 24     2) 2014, ఆగస్టు 24 
3) 2014, మే 24     4) 2014, జులై 24


40. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు 2014, ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీని నిర్ణయించింది? 
1) ముగ్గురు     2) ఐదుగురు 
3) ఆరుగురు     4) ఏడుగురు 


41. కిందివాటిలో నాడీవ్యవస్థపై ప్రభావం చూపే విష వాయువులు ఏవి? 
1) టబున్‌     2) సరీన్‌ 
3) సొమన్‌     4) పైవన్నీ 
 

42. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల సైనికులపై జపాన్‌ సైనికులు ప్రయోగించిన విషవాయువు? 
1) మస్టర్డ్‌ గ్యాస్‌     
2) సరీన్‌ 
3) ప్యాసిజిన్‌     
4) లెవిసైడ్‌ 

సమాధానాలు
1-4; 2-2; 3-3; 4-2; 5-3; 6-1; 7-2; 8-1; 9-2; 10-2; 11-1; 12-4; 13-2; 14-4; 15-2; 16-1; 17-4; 18-1; 19-4; 20-3; 21-1; 22-1; 23-3; 24-1; 25-1; 26-1; 27-3; 28-2; 29-1; 30-2; 31-3; 32-2; 33-2; 34-4; 35-3; 36-1; 37-3; 38-1; 39-4; 40-1; 41-4; 42-2.

Posted Date : 20-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు