• facebook
  • whatsapp
  • telegram

న్యాయసమీక్ష 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత రాజ్యాంగంలోని న్యాయసమీక్ష అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
జ: అమెరికా

 

2. సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రకటించింది?
జ: కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం

 

3. భారతదేశంలో న్యాయసమీక్షాధికారాలు ఎవరికి ఉన్నాయి?
జ: సుప్రీంకోర్టు, హైకోర్టులు

 

4. గోలక్‌నాథ్ వివాదం దేనికి సంబంధించింది?
జ: ప్రాథమిక హక్కులు

 

5. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయసమీక్షకు అవకాశం కల్పిస్తుంది?
జ: 13 వ ఆర్టికల్

 

6. సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారానికి నిదర్శనం?
జ: అమెరికా కంటే తక్కువగా ఉంటుంది.

 

7. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చకూడదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: శంకరీ ప్రసాద్ Vs భారత యూనియన్ - 1952

8. ఏ కేసులో సుప్రీంకోర్టు 'ఇప్పటి నుంచి చెల్లదనే' సిద్ధాంతాన్ని అవలంబించింది?
జ: గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం

 

9. ఏ కేసులో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్షల్ న్యాయసమీక్షాధికారాలను గుర్తించారు?
జ: మార్బురీ Vs మాడిసన్

 

10. జతపరచండి.

జాబితా-I జాబితా-II
ఎ) కేశవానంద భారతి కేసు 1) పార్లమెంటరీ సార్వభౌమాధికార సిద్ధాంతం
బి) గోలక్‌నాథ్ కేసు 2) భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం
సి) బ్యాంకుల జాతీయీకరణ 3) ప్రాథమిక హక్కులను సవరించకూడదు
డి) 25వ రాజ్యాంగ సవరణ 4) మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడం

 జ: ఎ-2 బి-3 సి-4 డి-1
 

11. భారతదేశంలో న్యాయసమీక్ష కిందివాటిలో దేనిపై ఆధారపడింది?
1) శాసనం రూపొందించిన కార్య విధానం (Procedure established by law)
2) శాసనానికి సంబంధించి తగిన విధానం (Due Process of law)
3) సమన్యాయపాలన
4) పూర్వ ఉదాహరణలు, సాంప్రదాయాలు
జ: 1 (శాసనం రూపొందించిన కార్య విధానం (Procedure established by law))

12. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 368 కింద ప్రాథమిక హక్కులను సవరించకూడదనే సత్యాన్ని ప్రతిపాదించింది?
1) గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం                 2) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం
3) గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం              4) మేనకా గాంధీ Vs కేంద్ర ప్రభుత్వం
జ: 3 (గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం)

13. కిందివాటిలో న్యాయసమీక్షకు కచ్చితమైన నిర్వచనం ఏది?
1) రాజకీయ నేరస్థులను రక్షించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
2) ప్రభుత్వ తప్పిదాలను సవరించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
3) వివిధ రకాలైన ఆదేశాలను జారీ చేయడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
4) శాసనాల న్యాయబద్ధతను వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
జ: 4 (శాసనాల న్యాయబద్ధతను వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం)

 

14. ప్రకరణ 368 ప్రకారం పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం లేదు. ఎందుకంటే?
జ: రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కాబట్టి

 

15. భారత సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ అంశాన్ని నిర్ధారించాలంటే?
1) కింది కోర్టు పనితీరును సమీక్షిస్తుంది.
2) తన సొంత నిర్ణయాలతో కేసులను పరిష్కరిస్తుంది.
3) తన తీర్పును తానే సమీక్షిస్తుంది.
4) శాసనసభ రూపొందించిన చట్టం, కార్యనిర్వహణ వర్గం జారీ చేసిన ఆర్డరు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టివేస్తుంది
జ: 4 (శాసనసభ రూపొందించిన చట్టం, కార్యనిర్వహణ వర్గం జారీ చేసిన ఆర్డరు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టివేస్తుంది)

16. కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు నుంచి చేసిన రాజ్యాంగ సవరణలకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు వామన్‌రావు కేసులో స్పష్టం చేసింది. కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు?
జ: ఏప్రిల్ 24, 1973

 

17. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించే సిద్ధాంతం?
జ: రాజ్యాంగ మౌలిక స్వరూపం, స్వభావాన్ని మార్చడానికి వీల్లేదు

 

18. ఏ కేసులో సుప్రీంకోర్టు 'రాజ్యాంగ సభ' ప్రాథమిక హక్కులను సవరణ చేస్తుందని తీర్పు ఇచ్చింది?
జ: గోలక్‌నాథ్ కేసు

 

19. కిందివాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది?
1) సమాఖ్య      2) లౌకికవాదం    3) న్యాయసమీక్షాధికారం     4) న్యాయస్థాన క్రియాశీలత
జ: 4 (న్యాయస్థాన క్రియాశీలత)

 

20. భారతదేశంలో న్యాయసమీక్షను ఎందులో పొందుపరిచారు?
జ: రాజ్యాంగం

 

21. 24వ రాజ్యాంగ సవరణను ఏ కేసులో ప్రశ్నించారు?
జ: కేశవానంద భారతి కేసు

 

22. సుప్రీంకోర్టు మినర్వామిల్స్ కేసులో ఏ కేసుకు సంబంధించిన అంశాలను మార్పు చేసింది?
జ: కేశవానంద భారతి కేసు

23. కింది నిర్వచనాలలో సరైంది గుర్తించండి.
1) మౌలిక స్వరూపం అంటే ఏమిటో రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది
2) సుప్రీంకోర్టు, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరణాత్మకంగా నిర్వచించింది
3) భారత అటార్నీ జనరల్ సహాయంతో భారత లా కమిషన్ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.
4) సుప్రీంకోర్టుగానీ పార్లమెంటుగానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించలేదు
జ: 4 (సుప్రీంకోర్టుగానీ పార్లమెంటుగానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించలేదు)

 

24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కల్పించారు?
జ: 42వ

 

25. ఆర్టికల్ 31c, 368 కి జరిపిన రాజ్యాంగ సవరణ చెల్లదని 1980 లో సుప్రీంకోర్టు ఏ కేసులో వెల్లడించింది?
జ: మినర్వామిల్స్ కేసు

 

26. రాజ్యాంగంలోని 39(c) అధికరణ ఉద్దేశం?
జ: సంపద కొందరి వద్దే కేంద్రీకృతం కాకుండా అడ్డుకోవడం

 

27. అధికరణ 13(3)(a) దేని అర్థాన్ని తెలుపుతుంది?
జ: చట్టం

28. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని/ ఏదైనా ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: మినర్వామిల్స్

 

29. చట్టసభలు చేసే చట్టాలు, రెగ్యులేషన్స్‌ను చెల్లుబాటు చేసే అధికరణం?
జ: ఆర్టికల్ 31B

 

30. ఏ సవరణ రాజ్యాంగ సవరణ చట్టం కాదని తెలియజేసింది?
జ: 24

 

31. గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అంటే ఇచ్చిన వివరణ?
జ: లా కాదు

32. రాజ్యాంగంలోని సాంఘిక, ఆర్థిక సంక్షేమాల అంశం/అధికరణ?
జ: 39(b), (c)

 

33. 31వ అధికరణం కల్పించిన ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు?
జ: 44వ సవరణ

 

34. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోని అంశాలు చట్టాల చెల్లుబాటును ఏ అధికరణం ప్రకారం ప్రశ్నించకూడదు?
జ: 31(b)

35. కింద పేర్కొన్న ఏ కేసులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
ఎ) గోలక్‌నాథ్ కేసు        బి) సజ్జన్ సింగ్ కేసు       సి) శంకరీ ప్రసాద్ కేసు
జ: బి, సి మాత్రమే

 

36. ఏ అధికరణం ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరించకూడదు?
జ: 13(2)

 

37. రాజ్యాంగానికి ముందునుంచి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే అధికరణం?
జ: 13(1)

 

38. 31(C), 39(B), 39(C) అధికరణాల కింద చేసే చట్టం 14వ అధికరణాన్ని తిరస్కరించవచ్చు. ఇది ఏ రాజ్యాంగ సవరణ కింద సాధ్యపడుతుంది?
జ: 24వ

 

39. 'Procedure established by law' నుంచి 'Due process of law' వరకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించిన వివాదం?
జ: మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా

40. కిందివాటిని కాలక్రమం ఆధారంగా గుర్తించండి.
ఎ) కేశవానంద భారతి కేసు    బి) గోలక్‌నాథ్ కేసు    సి) మినర్వామిల్స్ కేసు     డి) సజ్జన్‌సింగ్ కేసు
జ: డి, బి, ఎ, సి

 

41. కిందివాటిని కాలక్రమం ఆధారంగా గుర్తించండి.
ఎ) చంపకం దొరైరాజన్ కేసు           బి) శంకరీ ప్రసాద్ కేసు
సి) సజ్జన్ సింగ్ కేసు                  డి) గోలక్‌నాథ్ కేసు
జ: ఎ, బి, సి, డి

 

42. 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలను చేసినప్పుడు భారత ప్రధాని ఎవరు?
జ: ఇందిరాగాంధీ

 

43. 24, 25, 26 వ రాజ్యాంగ సవరణ చట్టాలు చేసిన సంవత్సరం?
జ: 1971

 

44. ప్రకరణ 368 కి లోబడి చేసిన సవరణకు ప్రకరణ 13 లోని ఏదీ వర్తించదని చెప్పే నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
జ: 24 వ సవరణ చట్టం

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర శాసన నిర్మాణ శాఖ - పార్లమెంటు  

  పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టినిల్లైన బ్రిటన్ పార్లమెంటును ప్రపంచ 'పార్లమెంటరీ వ్యవస్థకు మాత'గా పేర్కొంటారు. పార్లమెంటరీ తరహా వ్యవస్థలో పార్లమెంటు దేశ అత్యున్నత శాసన శాఖగా పనిచేస్తుంది. మనదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.
* భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో రెండు సభలు ఉండే పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పరిచింది. మనదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా రూపొందించడం వల్ల సమాఖ్య వ్యవస్థకు అవసరమైన విధంగా 2 సభలను ఏర్పాటు చేశారు.

* 'పార్లమెంటు' అనే పదం ఫ్రెంచి భాషలోని 'పార్లర్', లాటిన్ భాషలోని 'పార్లమెంటమ్' అనే పదాల నుంచి వచ్చింది. పార్లర్ లేదా పార్లమెంటమ్ అంటే "To-Talk" (చర్చించే స్థలం) అని అర్థం.
* 'జాతి ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంటు భారతదేశంలో అతిపెద్ద పంచాయతీ' అని మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.
* పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని 'వెస్ట్ మినిస్టర్' తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. బ్రిటన్ దేశపు పార్లమెంటు ఆ దేశంలో 'వెస్ట్ మినిస్టర్' అనే ప్రాంతంలో ఉంది.

* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 2వ అధ్యాయంలో ఆర్టికల్స్ 79 నుంచి 122 మధ్య భారత పార్లమెంటు నిర్మాణం, శాసన ప్రక్రియ, అధికారాలు, విధులను వివరించారు.
* ఆర్టికల్, 79 ప్రకారం మనదేశానికి అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. దాని పేరు పార్లమెంటు. పార్లమెంటు అంటే రాష్ట్రపతి + రాజ్యసభ + లోక్‌సభ.
* 1952, ఏప్రిల్ 3న రాజ్యసభ; 1952, ఏప్రిల్ 17న లోక్‌సభ ఏర్పడ్డాయి.
* 1952, మే 13న పార్లమెంటు మొదటి సమావేశం జరిగింది.
* లోక్‌సభ మొదటి స్పీకరైన జి.వి. మౌలాంకర్ ఎగువసభ అయిన 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌'ను రాజ్యసభగా, దిగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ పీపుల్‌'ను లోక్‌సభగా నామకరణం చేశారు.
* రెండు సభల సభ్యులను పార్లమెంటు సభ్యులుగానే పరిగణిస్తారు. అందుకే ఏ సభలోని సభ్యుడినైనా 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అంటారు.

 

భారత్‌లో పార్లమెంటు పరిణామ క్రమం
* 1833 చార్టర్ చట్టం ద్వారా మనదేశంలో తొలిసారిగా కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణ శాఖను వేరుచేశారు.
* 1853 చార్టర్ చట్టం ద్వారా మనదేశంలో జాతీయ స్థాయిలో మొదటి సారిగా 'లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు.
* 1861లో భారత కౌన్సిల్ చట్టం ప్రకారం కేంద్ర 'లెజిస్లేటివ్ కౌన్సిల్‌'లో ముగ్గురు భారతీయలకు ప్రాతినిధ్యం కల్పించారు.
* 1892 భారత్ కౌన్సిల్ చట్టం ప్రకారం తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం ద్వారా పరిమితి ప్రాతిపదికపై మనదేశంలో కొద్దిమందికి ఓటుహక్కును కల్పించి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో 'ద్విసభా విధానాన్ని' ప్రవేశపెట్టి ఎగువ సభను 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌'గా , దిగువ సభను 'లెజిస్లేటివ్ అసెంబ్లీ'గా ఏర్పాటు చేశారు. ఈ ద్విసభా విధానం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
* భారత పార్లమెంటరీ భవనాన్ని 1921 - 1927 మధ్య నిర్మించారు. పార్లమెంటరీ భవనానికి రూపకల్పన చేసింది ఎడ్వర్డ్ బేకర్, ఎడ్వర్డ్ ల్యూటిన్స్.
* 1921లో గవర్నర్ జనరల్ లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు.
* 1927, జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు.
* పార్లమెంటు భవనం దిల్లీలోని 'సన్‌సద్' మార్గ్‌లో ఉంది. పార్లమెంటును హిందీలో 'సన్‌సద్' అంటారు.
* పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించేందుకు 15వ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఒక కమిటీని ఏర్పాటుచేయగా, ప్రస్తుత 16వ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ కమిటీ నివేదిక ఆధారంగా నూతన పార్లమెంటు భవన ఏర్పాటును ప్రతిపాదించారు. దీనికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

రాజ్యసభ
* దీన్ని ఎగువసభ, పెద్దలసభ, శాశ్వతసభ, రాష్ట్రాల మండలిగా పేర్కొంటారు.
* మనదేశ రాజ్యసభను అమెరికాలోని 'సెనేట్‌'తో పోలుస్తారు. అమెరికా సెనేట్‌లో ఆ దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ మనదేశంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభా మేరకే నిర్ణయిస్తారు.
* ఆర్టికల్, 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్, 80(3) ప్రకారం కళలు, సాహిత్యం, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రం లాంటి రంగాల్లో విశిష్టమైన 12 మందిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
* 238 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకుంటారు.
* 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనే విధానాన్ని చేర్చారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం ఎన్నుకుంటారు.
* రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసన సభలోని ఎన్నికైన శాసన సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు.
* 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్లు కేటాయించారు.
* రాజ్యసభకు నియోజక వర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల రాజ్యసభను 'రాష్ట్రాల మండలి'గా పేర్కొంటారు.


 


 

* రాష్ట్రపతిని ఎన్నుకున్నట్లే ప్రాధాన్యత పద్ధతిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.
* రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతిని మనదేశం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించింది.
* రాజ్యసభ పదవీకాలం శాశ్వతం.
* రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.
* రాజ్యసభ సభ్యులు మొత్తం ఒకేసారి ఎన్నికకారు. ఒకేసారి పదవీ విరమణ చేయరు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు సభ్యులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పదవీ విరమణ చేయగా, అంతే స్థాయిలో కొత్తవారు ఎన్నికవుతారు.

రాజ్యసభ సభ్యులు - అర్హతలు (ఆర్టికల్, 84)
* భారతీయ పౌరుడై ఉండాలి.
* 30 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలుండాలి.
* మిగిలినవన్నీ లోక్‌సభ సభ్యుల అర్హతలే.
* 1951 భారత ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్, 3 ప్రకారం ఒక వ్యక్తి రాజ్యసభకు ఒక రాష్ట్రం నుంచి ఎన్నికవ్వాలంటే అతడు అదే రాష్ట్ర నివాసి అయి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలో పొందుపరిచారు. దీన్ని 2003లో సవరించారు.
* ఈ సవరణ ప్రకారం ఏ రాష్ట్ర నివాసితుడు అయినప్పటికీ దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

 

రాజ్యసభ - ఛైర్మన్
* ఆర్టికల్, 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్అఫీషియా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని రాజ్యసభకు వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.
* ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభాకార్యకలాపాల నిర్వహణకు 1 నుంచి 6 వరకు ప్యానల్ ఛైర్మన్లను ఛైర్మన్ నియమిస్తారు.
* రాజ్యసభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తున్నపుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన నిర్ణాయకపు ఓటు (Casting Vote) వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
* రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల కోరం 1/10వ వంతు.
* రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం రాజ్యాంగబద్ధంగా నిర్ధారించనప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంతకాలం అంటే ఆ పదవీకాలం ముగిసే వరకు (6 ఏళ్లు) పదవిలో కొనసాగుతారు.
* రాజ్యసభ ఛైర్మన్‌ను పార్లమెంటు, డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందస్తు నోటీసుతో సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఛైర్మన్ లేదా డిప్యూటీ ఛైర్మన్‌లపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు సభకు అధ్యక్షత వహించరాదు. కానీ సభా సమావేశాల చర్చల్లో పాల్గొనవచ్చు.
* రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ సాధించాల్సిన కనీస సభ్యుల సంఖ్య 1/10వ వంతు.
* 1967లో కాంగ్రెస్(ఓ)కు చెందిన శ్యామ్ నందన్ మిశ్రాను రాజ్యసభలో మొదట గుర్తింపు పొందిన ప్రతిపక్షనాయకుడిగా గుర్తించారు.
* 1977లో భారత పార్లమెంటు గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి 'గుర్తింపు నిచ్చే చట్టాన్ని' ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాజ్యసభలో మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీనేత కమలాపతి త్రిపాఠి (1977, కాంగ్రెస్ పార్టీ).
* ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్.
* రాజ్యసభకు మొదటి సభానాయకుడు ఎన్. గోపాలస్వామి అయ్యంగార్.
* రాజ్యసభకు ప్రస్తుత సభానాయకుడు అరుణ్ జైట్లీ.
* రాజ్యసభకు మొదటి ఛైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* రాజ్యసభకు ప్రస్తుత ఛైర్మన్ హమీద్ అన్సారీ.
* రాజ్యసభకు మొదటి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి. కృష్ణమూర్తి.
* రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ పి.జె. కురియన్.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌లుగా పని చేసిన మహిళలు
    వయోలెట్ అల్వా, ప్రతిభా పాటిల్, నజ్మా హెప్తుల్లా.
* రాజ్యసభకు అత్యధికంగా 17 సంవత్సరాలు డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేసిన వారు నజ్మా హెప్తుల్లా.
* ఆర్టికల్, 90 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి ఏదైనా కారణం వల్ల తన పదవిని కోల్పోతే రాజ్యసభకు అధ్యక్షత వహించే అర్హతను కూడా కోల్పోతారు. ఆయనను తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
* డిప్యూటీ ఛైర్మన్ తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించాలి.
* రాజ్యసభకు అత్యధిక కాలం సభానాయకుడిగా వ్యవహరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ (2004 - 2014).
* రాజ్యసభకు ప్రస్తుత సెక్రటరీ జనరల్ షంషేర్ కె. షరీఫ్

 

రాజ్యసభ - ప్రత్యేక అధికారాలు
* ఆర్టికల్, 67(b) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 249(1) ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై జాతీయ ప్రాధాన్యం ఉందని రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు శాసనం చేస్తుంది. ఈ విధంగా రూపొందించిన శాసనం దేశం మొత్తానికి లేదా కొంత భాగానికైనా వర్తిస్తుంది.
* ఆర్టికల్, 249(2) ప్రకారం ఈ విధంగా రూపొందించిన శాసనం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. రాస్యసభ 2/3వ వంతు మెజార్టీతో మరొక తీర్మానాన్ని ఆమోదిస్తే, మరో సంవత్సరం ఇలా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.
ఉదా: 1952లో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్ధం చేయడానికి రాజ్యసభ ఒక తీర్మానాన్ని చేసింది.
* ఆర్టికల్, 312 ప్రకారం రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తూ చట్టాన్ని రూపొందిస్తుంది.

ఆర్టికల్, 312 ప్రకారం రాజ్యసభ ఇంతవరకు ఆమోదించిన తీర్మానాలు
1961లో
1. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
2. ఇండియన్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్
3. ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్
1965లో
1. ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్
2. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్
* వీటిలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను మాత్రమే 1966లో ఆలిండియా సర్వీసులో చేర్చారు.
* 1961లో వరకట్న నిషేధ బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1970లో మాజీ సంస్థానాధిపతుల హక్కుల రద్దు బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1978లో బ్యాంకింగ్ సర్వీసెస్ రద్దు బిల్లును, గుంటూరులోని టొబాకో బోర్డ్‌ను వేరే ప్రాంతానికి మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినప్పుడు దానిలోని 7 అంశాలను రాజ్యసభ వ్యతిరేకించగా, వాటిని తొలగించారు.
* ఆర్టికల్, 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో లోక్‌సభతో సమానంగా రాజ్యసభకు కూడా అధికారాలు ఉన్నాయి.
* రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. అయితే ఇంతవరకు 41వ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మిగిలిన బిల్లులన్నీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
* 41వ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు వ్యతిరేకంగా సివిల్, క్రిమినల్ కేసులు నమోదు కాకుండా మినహాయింపును ఉద్దేశించారు.
* ఆర్టికల్, 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన
* ఆర్టికల్, 356 ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన
* ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనలను రాజ్యసభ కూడా ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి లేకపోతే రద్దవుతాయి.
* 1976, మార్చి 22న జనతా పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి సెలవుకోసం అనుమతి కోరగా రాజ్యసభ తిరస్కరించింది.
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే 'ఎలక్టోరల్ కాలేజీ'లో, రాజ్యసభలోని మొత్తం సభ్యులు (ఎన్నికైన + నామినేటెడ్) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు.

 

మారిస్ జోన్స్ తన గ్రంథమైన 'ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా'లో రాజ్యసభ 3 ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు.
1. లోక్‌సభ తొందరపాటుతో చేసే శాసనాలను పునరాలోచన చేసి, లోటుపాట్లను సవరించడానికి తోడ్పడుతుంది.
2. అవసరమున్న అదనపు రాజకీయ పదవులను రాజ్యసభ సమకూరుస్తుంది.
3. శాసన నిర్మాణపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి సహకరిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతి శుక్రవారం రాజ్యసభలో రెండున్నర గంటల పాటు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చిండానికి అవకాశం కల్పిస్తారు.


రాజ్యసభపై వ్యాఖ్యానాలు
* 'మనం అధికారాన్ని రాజ్యాంగం నుంచి పొందుతున్నాం. రాజ్యసభ, లోక్‌సభలను ఎగువసభ, దిగువసభ అని పిలవడం సరైంది కాదు. ఈ రెండింటిలో ఏ ఒక్క సభ భారత పార్లమెంటు కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా పనిచేయాలంటే ఈ రెండు సభల మధ్య చాలా సన్నిహిత సహకారం ఉండాలి'- జవహర్‌లాల్ నెహ్రూ
* 'ఎగువసభ ఉదాత్తమైన చర్చలను జరుపుతుంది. క్షణికమైన ఆవేశాల వల్ల జరిగే శాసన నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మేధావులు, విజ్ఞాన వేత్తలు ఈ సభా కార్యకలాపాల్లో పాల్గొని, తమ విద్యావిజ్ఞానాల ప్రయోజనాన్ని దేశానికి అందజేయడానికి రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది' - గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యసభను 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్' అనడం కంటే 'రాష్ట్ర విధానసభల రాజకీయ పక్షాల కౌన్సిల్ అనడం సరైంది'- గిరిధర్‌లాల్

                                            
లోక్‌సభ
* లోక్‌సభను దిగువసభ, ప్రజాప్రతినిధులసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే మన దేశంలో పార్లమెంటులో భాగమైన లోక్‌సభలో మెజార్టీ సాధించినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
* ఆర్టికల్, 81 లోక్‌సభ నిర్మాణం, ఎన్నిక లాంటి అంశాలను తెలియజేస్తుంది. సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
* 1950లో మొదటి డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 525.
* 1972లో మూడో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసుల మేరకు 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించిన లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552.
* ఆర్టికల్, 81(1a) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు 530.
* ఆర్టికల్, 81(b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు 20.
* ఆర్టికల్, 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్ల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు ఇద్దరు.
* అయితే ప్రస్తుతం లోక్‌సభలోని సభ్యుల సంఖ్య 545. వీరిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13, ఆంగ్లో ఇండియన్ల ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ
* ఆర్టికల్, 82 ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ అనంతరం లోక్‌సభ స్థానాలను పునర్వ్యవస్థీకరిస్తారు.
* ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలోని స్థానాల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చరాదని నిర్దేశించింది.
* అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలోని స్థానాల సంఖ్య 2026 వరకు పొడిగించరాదని నిర్దేశించింది.
* ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను 1971 జనాభా లెక్క ఆధారంగానే కొనసాగిస్తున్నారు.
* సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కుల్‌దీప్ సింగ్ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్ కమిషన్‌ను 2002లో నియమించారు.
* షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల జనాభాలో వచ్చిన మార్పులను అనుసరించి ఎస్సీ, ఎస్టీ జనాభాలో పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు, చేర్పులు చేయాలని, నియోజక వర్గాల్లోని ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భౌగోళికంగా పార్లమెంటు, శాసన సభల నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించి, 1991 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్వ్యస్థీకరించాలని 87వ రాజ్యాంగ సవరణ చట్టం - 2003 ద్వారా నిర్దేశించారు.
* 4వ డీలిమిటేషన్ కమిషన్ కంటే ముందు లోక్‌సభలో ఎస్సీ వర్గాలకు 79 సీట్లు ఉండగా, ప్రస్తుతం 84కు పెరిగాయి.
* ఎస్టీ వర్గాలకు 41 సీట్లు ఉండగా, ప్రస్తుతం 47కు పెరిగాయి.


లోక్‌సభ సభ్యుల ఎన్నిక
* లోక్‌సభ సభ్యులు ఆర్టికల్, 326 ప్రకారం ఓటర్ల ద్వారా నేరుగా నియోజక వర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికవుతారు. దీన్నే "First past the post" అంటారు.
* భారత పార్లమెంటు ఎన్నికల నియమాల గురించి 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో రూపొందించారు. 1961లో ఎన్నికల నిర్వహణ చట్టం రూపొందించారు.
* భారత మౌలిక రాజ్యాంగంలో వయోజన ఓటింగ్ వయసు 21 ఏళ్లు ఉండేది. దీన్ని 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 18 ఏళ్లకు తగ్గించారు.


ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
* ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ఆధారంగా కొన్ని స్థానాలు రిజర్వ్ చేసేవారు. ఇది ప్రారంభంలో 10 ఏళ్ల వరకు ఉండేది.

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల రిజర్వేషన్లు  కొనసాగించేందుకు ఇప్పటివరకు ఏడు రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించారు.

రాజ్యాంగ సవరణ చట్టం

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ల పొడిగింపు కాలం

8వ రాజ్యాంగ సవరణ చట్టం - 1960 1960 నుంచి 1970 వరకు
23వ రాజ్యాంగ సవరణ చట్టం - 1970 1970 నుంచి 1980 వరకు
45వ రాజ్యాంగ సవరణ చట్టం - 1980 1980 నుంచి 1990 వరకు
62వ రాజ్యాంగ సవరణ  చట్టం - 1989 1990 నుంచి 2000 వరకు
79వ రాజ్యాంగ సవరణ చట్టం - 2000 2000 నుంచి 2010 వరకు
95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2010 2010 నుంచి 2020 వరకు
104వ రాజ్యాంగ సవరణ చట్టం - 2020 2020 నుంచి 2030 వరకు

* చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ల పొడిగింపునకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం - 2020గా అమల్లోకి వచ్చింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు
ఆర్టికల్‌ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయా వర్గాల జనాభా ఆధారంగా కొన్ని నియోజకవర్గ స్థానాలను రిజర్వ్‌ చేశారు. 
* ఈ రిజర్వేషన్‌ సదుపాయం ప్రారంభంలో 10 సంవత్సరాల వరకే ఉండేది.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 4
అవి: 1. అమలాపురం 2. బాపట్ల  3. చిత్తూరు 4. తిరుపతి
* తెలంగాణలో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 3
అవి: 1. పెద్దపల్లి   2. నాగర్‌కర్నూల్‌   3. వరంగల్‌
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 1 (అరకు)
* తెలంగాణలో ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 2
1. ఆదిలాబాద్‌  2. మహబూబాబాద్‌
* మనదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం - లద్దాఖ్‌ 
* మనదేశంలో వైశాల్యం రీత్యా అతిచిన్న లోక్‌సభ నియోజకవర్గం - చాందినీచౌక్‌ (దిల్లీ)
* మనదేశంలో ఓటర్లపరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం - మల్కాజ్‌గిరి (తెలంగాణ)
* ఓటర్ల రీత్యా మనదేశంలో అతిచిన్న లోక్‌సభ నియోజకవర్గం - లక్షద్వీప్‌
* ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేస్తారు. ఈ విధానాన్ని ప్రారంభంలో 1960 వరకే నిర్దేశించారు. దీన్ని పార్లమెంట్‌ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చట్టం ద్వారా పొడిగిస్తుంది.
* 2009లో 109వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్‌ చేసే విధానాన్ని 2020 వరకు పొడిగించారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం
* లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుతం 545 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు.
* ఆర్టికల్‌ 81 (1a) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య  530
* ఆర్టికల్‌ 81 (1b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య - 20
* ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు   ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్‌ చేస్తారు.

ప్రస్తుతం లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలు

1. ఉత్తర్‌ప్రదేశ్‌ 80
2. మహారాష్ట్ర 48
3. పశ్చిమ్‌ బెంగాల్‌ 42
4. బిహార్‌ 40
5. తమిళనాడు 39
6. మధ్యప్రదేశ్‌ 29
7. కర్ణాటక 28
8. గుజరాత్‌ 26
9. ఆంధ్రప్రదేశ్‌ 25
10. రాజస్థాన్‌ 25
11. ఒడిశా 21
12. కేరళ 20
13. తెలంగాణ 17
14. అసోం 14
15. ఝార్ఖండ్‌ 14
16. పంజాబ్‌ 13
17. చత్తీస్‌గఢ్ 11
18. హరియాణా 10
19. ఉత్తరాఖండ్‌ 5
20. హిమాచల్‌ ప్రదేశ్‌    4
21. త్రిపుర 2
22. మేఘాలయ 2
23. మణిపూర్‌ 2
24. అరుణాచల్‌ప్రదేశ్‌ 2
25. గోవా 2
26. మిజోరం 1
27. సిక్కిం‌ 1
28. నాగాలాండ్ 1
మొత్తం స్థానాలు 524

కేంద్రపాలిత ప్రాంతాల నుంచి

1. దిల్లీ 7
2. జమ్మూకశ్మీర్‌ 5
3. దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యూ 2
4. పాండిచ్చేరి 1
5. అండమాన్‌ నికోబార్‌ 1
6. చండీఘర్‌ 1
7. లక్షద్వీప్‌ 1
8. లద్దాఖ్‌    1 1
మొత్తం స్థానాలు 19

లోక్‌సభకు పోటీచేసే సభ్యుల అర్హతలు, షరతులు
* భారతీయ పౌరుడై ఉండాలి.
* 25 ఏళ్లు నిండి ఉండాలి.
* ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలు మించరాదు.
* దివాళాతీసిన వ్యక్తయి ఉండకూడదు.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* నామినేషన్ పత్రంతోపాటు సాధారణ అభ్యర్థులైతే రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12500 డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఆర్టికల్, 17 ప్రకారం శిక్షకు గురై ఉండకూడదు.
* 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షకు గురై ఉండరాదు
* నేరారోపణ రుజువై ఉండకూడదు.
* దేశంలో ఏదైనా లోక్‌సభ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* 25% ప్రభుత్వ పెట్టుబడులున్న కంపెనీల్లో డైరెక్టర్ స్థాయిలో ఉండరాదు.
* ఎన్నికల వ్యయాన్ని గురించి ఆడిట్ నివేదికను 15 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించని కారణంగా నిషేధం ఉండరాదు.
* ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951 ప్రకారం నియమాలను ఉల్లంఘించారనే కారణంతో ఎన్నికల కమిషన్ నిషేధానికి గురై ఉండరాదు.
* 2002లో సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి తమ వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.


లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. ఉదా: 4వ లోక్‌సభ పదవీకాలం పూర్తవకుండానే 1971లో రద్దుచేసి, అదే ఏడాది లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలను నిర్వహించారు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు. ఉదా: 1976లో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం వల్ల ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు పొడిగించింది. మనదేశంలో 5వ లోక్‌సభ 1971 నుంచి 1977 వరకు అత్యధికంగా 5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు కొనసాగింది.
మనదేశంలో 12వ లోక్‌సభ అత్యల్పంగా 1998 నుంచి 1999 వరకు కేవలం 13 నెలల 4 రోజులు కొనసాగింది. అందుకే లోక్‌సభను ‘అనిశ్చిత సభ’గా పేర్కొంటారు.

ప్రమాణ స్వీకారం
* ఆర్టికల్, 99 లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి సమక్షంలో 3వ షెడ్యూల్లో ప్రస్తావించిన విధంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొంటే, పాల్గొన్న ప్రతి రోజుకు రూ.500 అపరాధ రుసుము చెల్లించాలి.


పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు (ఆర్టికల్, 106)
   2010లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
వేతనం                              రూ.50,000
నియోజకవర్గ అలవెన్స్       రూ.45,000
దినసరి అలవెన్స్               రూ.2,000
ఇతర ఖర్చులు                  రూ.45,000
* పైన పేర్కొన్న వేతనంతోపాటు ఉచిత నివాసం, ఉచిత రవాణా, వైద్య ఖర్చులు కూడా లభిస్తాయి. పదవీకాలం ముగిసిన తర్వాత నెలకు రూ.20,000 పెన్షన్ లభిస్తుంది.

 

పార్లమెంటు సభ్యుల రాజీనామా
* పార్లమెంటు సభ్యులు నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా సభాధ్యక్షులను (లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్) సంబోధిస్తూ రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు దాన్ని ధ్రువీకరించుకున్న తర్వాత సభాధ్యక్షులు సభ్యుల రాజీనామాను ఆమోదిస్తారు.
* ఆర్టికల్, 85 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని 'సమన్స్', పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని 'ప్రోరోగ్', లోక్‌సభను రద్దు చేయడాన్ని 'డిసాల్వ్' అని అంటారు.
* ఆర్టికల్, 86 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా తన సందేశాలను పంపుతారు.
* ఆర్టికల్, 87 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి విశేష ప్రసంగాలను చేయవచ్చు. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత, ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాల కంటే ముందు జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
* ఆర్టికల్, 101 ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా వ్యవహరించరాదు.
* ఒక వ్యక్తి రెండు సభలకు ఏకకాలంలో ఎన్నికైతే నిర్ణీత కాల 10 రోజుల్లోగా తాను ఏ సభలో సభ్యుడిగా కొనసాగాలనుకుంటున్నాడో తెలపాలి. లేకపోతే సంబంధిత వ్యక్తి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైతే 14 రోజుల నిర్ణీత సమయంలోగా తన ప్రాధాన్యాన్ని తెలియజేయకపోతే శాసనసభ సభ్యత్వాన్ని కలిగి ఉండి, పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతారు.
* రాజ్యసభ లేదా లోక్‌సభల్లో ఏదైనా ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు ఎన్నికైతే 10 రోజుల్లోగా తన నిర్ణయాన్ని తెలియజేయకపోతే మొదటి సభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాల్లో ఏదైనా పదవిని చేపడితే ఆ పదవిని చేపట్టిన నెలరోజుల్లోగా తన ప్రాధాన్యాన్ని తెలియజేయకపోతే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.


ఆర్టికల్, 102 ప్రకారం కింద పేర్కొన్న సందర్భాల్లో పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు
* లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు
* భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు
* మతిస్థిమితం కోల్పోయినప్పుడు
* దివాళా తీసినప్పుడు
* వరకట్నం, సతీ, అస్పృశ్యతా చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు
* పదవి దుర్వినియోగానికి పాల్పడినప్పుడు
* న్యాయస్థానం దోషిగా ప్రకటించినప్పుడు
* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభాపతి అనర్హుడిగా ప్రకటించినప్పుడు
* ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు
* కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.


సుప్రీం కోర్టు తీర్పులు

కె. ఆనందన్ నంబియార్ vs చీఫ్ సెక్రటరీ, మద్రాస్
   ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దేశరక్షణకు సంబంధించిన నిబంధనలకు భంగం కలిగించిన సందర్భంలో సరైన కారణాలున్నప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులను అరెస్ట్ చేయడం సమంజసమేనని పేర్కొంది.
జయాబచ్చన్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2006)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గౌరవ వేతనం కూడా లాభాదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపు కూడా లాభంగానే పరిగణించాలని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని పేర్కొంది.
లిల్లీథామస్ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు (2014)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రెండు ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్షపడిన వారు అనర్హులని పేర్కొంది.
పి.వి. నరసింహారావు vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను ప్రజా సేవకులుగానే భావించాలని పేర్కొంది.
డి.కె. తరవేది సిద్ధాంత vs విజయ్ మాల్యా కేసు (2009)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశంలో నివాసం ఉండని భారతీయులు (ఎన్ఆర్ఐ) భారత్‌లో ఓటుహక్కులను కలిగి ఉన్నప్పుడు వారు దేశంలో స్థిరనివాసులు కానప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది.


లోక్‌సభ స్పీకర్‌లు

1. ప్రొటెం స్పీకర్
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు సభ్యుల్లో సీనియర్‌ను 'ప్రొటెం స్పీకర్‌'గా రాష్ట్రపతి నియమిస్తారు.
* ప్రొటెం స్పీకర్ పదవిని ఫ్రాన్సు నుంచి గ్రహించారు.
* లోక్‌సభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే వరకు వీరే సభకు అధ్యక్షత వహిస్తారు.
* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు ప్రొటెం స్పీకర్ జి.వి. మౌలాంకర్.
* 2014లో ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్.
* అత్యధికసార్లు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినది బి.డి. దాస్ (4 సార్లు), ఇంద్రజిత్ గుప్తా (4 సార్లు).
* ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్ పదవికి పోటీ చేయాలంటే తన ప్రొటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి.

2. డిప్యూటీ స్పీకర్
* డిప్యూటీ స్పీకర్‌ను లోక్‌సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్‌సభ స్పీకర్ సమావేశాలకు హాజరుకాని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు.
* మొదటి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్.
* ప్రస్తుత 16వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ తంబిదొరై. ఈయన 1985లో కూడా డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు.
* 1967 నుంచి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీలకు కేటాయించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

3. స్పీకర్
* ఆర్టికల్, 93లో స్పీకర్ పదవిని ప్రస్తావించారు. మన దేశంలో మొదటిసారిగా 1921లో సభాధిపతి పదవిని ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ పదవిని అధ్యక్షుడిగా పిలిచేవారు.
* 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్ పదవిగా మార్చారు.
* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు మొదటి స్పీకర్ ఫ్రెడరిక్‌వైట్.
* స్వాతంత్య్రం అనంతరం ఎన్నికైన మొదటి స్పీకర్ విఠల్‌భాయ్ పటేల్.
* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
* స్పీకర్ పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు.
* బ్రిటన్‌లో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
* మనదేశంలో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
* లోక్‌సభ రద్దైనప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాకుండా, నూతన లోక్‌సభ ఏర్పాటయ్యేవరకు కొనసాగుతుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు లోక్‌సభ సభ్యులుగా, ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ప్రత్యేక ప్రమాణ స్వీకారం ఉండదు.


స్పీకర్ అధికారాలు - విధులు
* స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహించి, సభాకార్యకలపాలను నిర్వహిస్తారు.
* సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ వంటి అంశాలను నియంత్రిస్తారు.
* లోక్‌సభలో ఏ బిల్లు ప్రవేశ పెట్టాలన్నా స్పీకర్ అనుమతి అవసరం.
* లోక్‌సభలో గెలుపొందిన రాజకీయ పక్షాలకు గుర్తింపునిస్తారు.
* స్పీకర్ అనుమతి లేకుండా అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు లోక్‌సభలో ప్రసంగించరు.
* లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా వ్యవహరించి, సిబ్బందిపై పరిపాలనా నియంత్రణ కలిగి ఉంటారు.
* సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు వంటి అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
* క్రమశిక్షణను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కల్గించే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తారు.
* సభా రికార్డుల్లో చోటు కల్పించే అంశం లేదా తొలగించే అంశం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
* ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని ధ్రువీకరిస్తారు.
* లోక్‌సభలో ఏదైనా బిల్లు విషయమై ఓటింగ్‌లో బలాబలాలు సమానమైనప్పుడు స్పీకర్ తన 'నిర్ణాయక ఓటు' (Casting vote) ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్దేశిస్తారు.
* ఆర్టికల్, 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, దానికి అధ్యక్షత వహిస్తారు.
* లోక్‌సభ సమావేశాలను తేదీ, సమయం చెప్పి తాత్కాలికంగా వాయిదా వేస్తారు.
* లోక్‌సభ సమావేశాలను తేదీ, సమయం చెప్పకుండా అర్ధంతరంగా వాయిదా వేస్తారు (సైనిడై).
* ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌కి హోదారీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* అఖిలభారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
* రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారు.
* పార్లమెంటు, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
* పార్లమెంటు నుంచి ఏర్పడే 24 స్టాండింగ్ కమిటీల్లో 16 కమిటీల ఛైర్మన్‌లను నియమిస్తారు.
* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే లోక్‌సభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు.
* పార్లమెంటు నుంచి ఏర్పడే సభావ్యవహారాల కమిటీ, నియమనిబంధనల కమిటీ, సాధారణ అవసరాల కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు
* సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం నిర్ణయం లాంటి అంశాలపై నియంత్రణ కలిగి ఉంటారు.
* భారత అధికార హోదాలో 7వ స్థానం ఉండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవ హోదాను పొందుతారు.


స్పీకర్ పదవిపై వ్యాఖ్యానాలు
* 'స్పీకర్ లోక్‌సభకు ప్రతినిధి, జాతి స్వేచ్ఛకు చిహ్నం ఆయన గౌరవ ప్రతిపత్తి గొప్పది'. - జవహర్‌లాల్ నెహ్రూ
* 'స్పీకర్ స్థానం అసమానమైంది. దేశపరిపాలన, విదేశాంగ విధానంలో ప్రత్యక్షంగా అధికారాన్ని వినియోగిస్తున్నట్లు కన్పించకపోయినా, పరోక్షంగా కొంత ప్రభావాన్ని ఆ రెండింటి మీద చూపుతారు'. - జి.వి. మౌలాంకర్


సభాధ్యక్షుల వేతనాలు
* ఆర్టికల్, 97లో సభాధ్యక్షుల వేతనాలు నిర్దేశించారు.
రాజ్యసభ ఛైర్మన్                   -   రూ.1,25,000
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్      -   రూ.90,000
లోక్‌సభ స్పీకర్                     -   రూ.1,25,000
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్        -   రూ.90,000

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల రాజీనామా, తొలగింపు
* ఆర్టికల్, 94 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు విధానాన్ని తెలియజేస్తుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల లోక్‌సభ సభ్యత్యం రద్దు అయితే వారు తమ పదవులను కోల్పోతారు.
* లోక్‌సభ సభ్యులు ఒక సాధారణ తీర్మానం ద్వారా 14 రోజుల ముందస్తు నోటీసుతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.
* స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.
* ఆర్టికల్, 95 ప్రకారం స్పీకర్ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆ విధులను డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే లోక్‌సభ నియమాల ప్రకారం లోక్‌సభ సభ్యుల్లో ఆర్హుడైన వ్యక్తిని స్పీకర్ విధులను నిర్వహించేందుకు రాష్ట్రపతి నియమిస్తారు.
* ఆర్టికల్, 96 ప్రకారం స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ని తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపడతారో వారు సభకు అధ్యక్షత వహించరాదు.
* స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో వారు చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ తీర్మానంపై మొదటి దఫాలోనే అంటే సాధారణ సభ్యులుగానే ఓటు హక్కు వినియోగించుకోవాలి.
* డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చిప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు.
* స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉండే డిప్యూటీ స్పీకర్ తన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు.
* ఆర్టికల్, 98 లోక్‌సభ, రాజ్యసభల సచివాలయం గురించి తెలియజేస్తుంది.


4. ప్యానల్ స్పీకర్స్
* ప్యానల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సమావేశాలకు హాజరు కానప్పుడు అధ్యక్షుడిగా ఉండేందుకు నియమించే తాత్కాలిక స్పీకర్లనే 'ప్యానల్ స్పీకర్లు' అంటారు.
* సమావేశం తొలి రోజునే స్పీకర్ 1 - 6 మందిని ప్యానల్ స్పీకర్లుగా నియమిస్తారు.


స్పీకర్ పదవి- కీలకాంశాలు
* అత్యధిక కాలం స్పీకర్‌గా వ్యహరించింది - బలరాం జక్కర్ (1980 - 1989)
* పోటీ ద్వారా ఎన్నికై అతి తక్కువ కాలం స్పీకర్‌గా వ్యవహరించింది - బలిరాం భగత్ (1976 - 77)
* పదవిలో ఉండగా మరణించిన స్పీకర్లు - జి.వి. మౌలాంకర్, జి.ఎం.సి. బాలయోగి
* లోక్‌సభకు మొదటి మహిళా స్పీకర్ మీరాకుమార్ (15వ లోక్‌సభ).
* లోక్‌సభకు మొదటి దళిత స్పీకర్ - జి.ఎం.సి బాలయోగి.
* ప్రస్తుత 16వ లోక్‌సభ స్పీకర్ - సుమిత్రా మహాజన్ (మధ్యప్రదేశ్‌లోని - ఇండోర్ లోక్‌సభ స్థానం)

 

శాసన నిర్మాణ ప్రక్రియ
    మనదేశ శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్ నుంచి గ్రహించారు. ఒక బిల్లు చట్టంగా మారాలంటే మన దేశంలో 7 దశలను అధిగమించాల్సి ఉంటుంది. బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. ఇది చట్టం మొదటి దశ.
1. ప్రవేశదశ
* ఈ దశలో బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి సభాధిపతి అనుమతితో బిల్లు శీర్షికా ప్రకటన చేస్తూ బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరతారు.
* అవసరమైతే ఈ దశలో బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో బిల్లు నెగ్గితే బిల్లు ప్రతిని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురిస్తారు.
* ఈ దశలో బిల్లు ఓడిపోతే కేవలం బిల్లు మాత్రమే రద్దు అవుతుంది. ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదు.
2. మొదటి పఠనం
* ఈ దశలో సంబంధిత శాఖా మంత్రి బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు చట్టంగా మారితే దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తారు.
3. ద్వితీయ పఠనం
* ఈ దశలో సంబంధిత మంత్రి బిల్లుకు సంబంధించిన ముఖ్య అంశాలను సవివరంగా సభకు వివరిస్తారు.
* బిల్లును సభ మొత్తంగా చర్చించాలా లేక కమిటీకి అప్పగించాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏ బిల్లునైనా పార్లమెంటరీ కమిటీలకు అప్పగిస్తారు.
4. కమిటీ దశ
* ఆధునిక కాలంలో పార్లమెంటు చేసే చట్టాల తయారీలో కమిటీలదే కీలకపాత్ర. సంబంధిత రంగాలకు చెందిన నిపుణుల సలహాలను, రాజ్యాంగ న్యాయనిపుణుల సలహాలను, ప్రజాభిప్రాయాన్ని ఈ కమిటీ సేకరిస్తుంది. ఈ విధంగా సేకరించిన అంశాలతో కూడిన 'నోట్‌'ను బిల్లుకు జతచేసి సభాధిపతికి సమర్పిస్తారు.
5. నివేదిక దశ
* వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల ఆధారంగా బిల్లులో చేసే సవరణలు, అవసరమైన సూచనలు, మేధావుల సలహాలను చేర్చి ఒక నివేదికను రూపొందించి ఆ 'నివేదిక'ను సభ ముందు ఉంచుతారు.
6. తృతీయ పఠనం
* పార్లమెంటరీ కమిటీ సమర్పించిన బిల్లులోని అంశాలపై చర్చిస్తూ, ఒక్కో క్లాజుపై లేదా మొత్తం బిల్లుపై సమగ్ర చర్చ జరిపి, సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌కు పెట్టవచ్చు. ఈ దశలో లోక్‌సభలో జరిగే ఓటింగ్‌లో బిల్లు వీగిపోయినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.
7. రాష్ట్రపతి ఆమోదం
* పైన పేర్కొన్న దశలు రెండో సభలోనూ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. వారి ఆమోదంతో బిల్లు శాసనంగా మారుతుంది.
* పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజుల్లో బిల్లు శాసనంగా రూపొందేందుకు కనీసం 19 రోజుల సమయం పడుతుంది.


బిల్లులు - రకాలు

  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 107 నుంచి 122 మధ్య శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, బిల్లుల వివరాలను పొందుపరిచారు.
సాధారణ బిల్లులు
* ఆర్టికల్, 107 ప్రకారం ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు కాని వాటిని 'సాధారణ బిల్లులు'గా పరిగణించాలి. సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లులను ఉభయసభలు వేర్వేరుగా లేదా సంయుక్తంగా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు శాసనంగా మారుతుంది.
* సాధారణ బిల్లులను ఆమోదించే సందర్భంలో పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్, 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఇంత వరకు మనదేశంలో కేవలం 3 సార్లు మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి. అవి:
1. 1961 మే, 6న వరకట్న నిషేధ బిల్లు విషయమై రాజ్యసభ ప్రతిపాదించిన సవరణను లోక్‌సభ తిరస్కరించడం.
2. 1978 మే, 17న బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లును లోక్‌సభ ప్రతిపాదించగా రాజ్యసభ తిరస్కరించడం.
3. 2002 మార్చి, 26న 'ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్' బిల్లును లోక్‌సభ తిరస్కరించడం.


ద్రవ్య బిల్లులు (Money Bills)
రాజ్యాంగంలోని ఆర్టికల్, 109లో ద్రవ్యబిల్లు ఆమోద ప్రక్రియ, ఆర్టికల్, 110లో ద్రవ్య బిల్లుల నిర్వచనం గురించి వివరించారు. అవి:
* భారత సంఘటిత నిధి, ఆగంతుక నిధి నుంచి నగదు తీసుకోవడం, జమ చేయడం.
* పన్నులు విధించడం, తగ్గించడం, క్రమబద్దీకరించడం.
* ప్రభుత్వ రుణాలను క్రమబద్దీకరించటం, ఆర్థిక లావాదేవీలు.
* ఆర్టికల్, 110 (3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనేది లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోను సవాల్ చేయకూడదు.
* ద్రవ్య బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాలి. లోక్‌సభ ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు స్పీకర్ ధ్రువ పత్రంతో రాజ్యసభకు పంపుతారు.
* ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా తన ఆమోదాన్ని తెలియజేయాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

 

ఆర్థిక బిల్లులు (Financial Bills)
  ఆర్టికల్, 117లో ఆర్థిక బిల్లుల గురించి ప్రస్తావించారు. ఆర్థిక బిల్లులను కింది విధంగా వర్గీకరించారు. అవి:
A. ద్రవ్య బిల్లులు - ఆర్టికల్, 110
B. మొదటి రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్, 117(1)
C. రెండో రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్, 117(3)
 ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు.
* స్పీకర్ ధ్రువీకరించిన ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ద్రవ్య బిల్లులకు, ఆర్థిక బిల్లులకు తేడా స్పీకర్ ధ్రువీకరణ మాత్రమే.
మొదటి రకం ఆర్థిక బిల్లు
* కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే అంశాలపై చట్టాలను చేయాలనుకున్నప్పుడు, రుణాలను సేకరించే నియమాలతో పాటు సాధారణ నియమాలు కూడా ఉంటాయి. ఈ రకమైన బిల్లు ద్రవ్య బిల్లుతో సమానమైంది. ఈ బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.
రెండో రకం ఆర్థిక బిల్లు
* ఈ రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలుంటాయి. ఆర్టికల్, 110లో పేర్కొన్న అంశాలు దీనిలో ఉండవు కాబట్టి దీన్ని సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ బిల్లుపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు.
ఫైనాన్స్ బిల్లు: బడ్జెట్‌లో పన్నుల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లు.
ఫైనాన్షియల్ బిల్లు: ఆర్టికల్, 117లో పేర్కొన్న అంశాలు ఉన్న 'ఆర్థిక బిల్లు'.


పార్లమెంటు అధికారాలు - విధులు 

శాసనాధికారాలు
* భారత దేశానికి అవసరమైన సమగ్ర శాసనాలు రూపొందించేది పార్లమెంటు మాత్రమే.
* కేంద్ర జాబితాలోని 100 అంశాలు, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.

పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే సందర్భాలు..
* ఆర్టికల్, 249 - జాతీయ ప్రాధాన్యత రీత్యా రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని చేసినప్పుడు
* ఆర్టికల్, 352 - జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో (ఆర్టికల్, 250 ప్రకారం).
* ఆర్టికల్, 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభీష్టం మేరకు.
* ఆర్టికల్, 253 - అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం.
* ఆర్టికల్, 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు.
కింద పేర్కొన్న అంశాలపైన కూడా పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది
* ఆర్టికల్, 2 - కొత్త రాష్ట్రాల ఏర్పాటు
* ఆర్టికల్, 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
* ఆర్టికల్, 11 - పౌరసత్వ సంబంధ విషయాలు
* ఆర్టికల్, 16(3) - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొన్ని తరగతుల ఉద్యోగాల్లో నివాస, అర్హత విషయాలు
* ఆర్టికల్, 33 - సైనికుల, శాంతిభద్రతల ఉద్యోగుల ప్రాథమిక హక్కులపై
* ఆర్టికల్, 71 - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు
* ఆర్టికల్, 248 - అవశిష్టాంశాలపై
* ఆర్టికల్, 169(1) - రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్ ఏర్పాటు/ రద్దు
* ఆర్టికల్, 312 - రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే అఖిల భారత సర్వీసుల ఏర్పాటు
* ఆర్టికల్, 83(2) - లోక్‌సభ కాలపరిమితి పెంపు.
* ఆర్టికల్, 123 - రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సులను ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించడం.
* ఆర్టికల్, 280(1) - ఆర్థిక సంఘం విధి విధానాలపై


కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే పద్ధతులు
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి ఆర్టికల్, 75(3) ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
* సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వాయిదా తీర్మానం, అవిశ్వాస తీర్మానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
* లోక్‌సభ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నియంత్రణను కలిగి ఉంటుంది. అవి:
A. ద్రవ్య బిల్లులను, బడ్జెట్‌ను తిరస్కరించడం.
B. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తిరస్కరించడం ద్వారా
C. కోత తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా
D. అభిశంసన తీర్మానాన్ని, వాయిదా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా
E. విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా
F. ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా
G. ప్రశ్నలు, అనుబంధపు ప్రశ్నలు, జీరో అవర్ (శూన్య సమయం) ద్వారా


ఆర్థిక అధికారాలు
* పార్లమెంటు అనుమతి లేనిదే పన్నులు విధించకూడదు. ఆర్టికల్, 265 ప్రకారం చట్టబద్ధంగా తప్ప మరే విధంగా పన్నులు విధించరాదు.
* బడ్జెట్, ఆర్థిక విధానాలను కూడా పార్లమెంటు ఆమోదిస్తుంది.
* ఆర్టికల్, 266 ప్రకారం కేంద్ర సంఘటిత నిధిపై పార్లమెంటు అధికారాన్ని కలిగి ఉంటుంది.
* పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల నివేదికలను పరిశీలించడం.
* ఆర్టికల్, 292 ప్రకారం విదేశాల నుంచి ప్రభుత్వం పొందే రుణాలకు అనుమతివ్వడం.
* ఆర్టికల్, 267 ప్రకారం కేంద్ర ఆగంతుక నిధి ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం.


అర్ధ న్యాయాధికారాలు: మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం
* ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను తొలగించే తీర్మానాలను విచారించి ఆమోదించడం.
* సభాహక్కులకు భంగం కల్గించినా లేదా పార్లమెంటు ధిక్కారానికి పాల్పడిన సభ్యులను, ఇతర వ్యక్తులను శిక్షించడం.

ఎన్నికల అధికారాలు
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియలో పార్లమెంటు పాల్గొంటుంది.
రాజ్యాంగ సవరణ అధికారాలు
* ఆర్టికల్, 368 ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. 3 రకాల పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరిస్తుంది.
నివేదికలపై చర్చ, ఆమోదం
* జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, మైనార్టీ కమిషన్, కాగ్, జాతీయ బీసీ కమిషన్; ఎస్సీ, ఎస్టీ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు సమర్పించిన నివేదికలను చర్చించి, ఆమోదిస్తుంది.
* వివిధ పార్లమెంటరీ స్థాయి సంఘాలు సమర్పించిన నివేదికల ఆధారంగా నూతన చట్టాలను రూపొందిస్తుంది.


జీతభత్యాలను నిర్ణయించడం
  పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు; లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, గవర్నర్లు, కేంద్ర ఎన్నికల కమిషనర్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలను పార్లమెంటు నిర్దేశిస్తుంది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
* డీలిమిటేషన్ కమిటీ సూచనలను అనుసరించి లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల సంఖ్యను, వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో కూడా సవరణలు చేస్తుంది.


లోక్‌సభ, రాజ్యసభల మధ్య వ్యత్యాసాలు

లోక్‌సభ రాజ్యసభ
* లోక్‌సభ ప్రజల సభ. సభ్యులను నేరుగా ఓటర్లే ఎన్నుకుంటారు. * రాజ్యసభ పరోక్షసభ. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
* లోక్‌సభ స్పీకర్ ద్రవ్య బిల్లులను నిర్ధారిస్తారు. ఇతని నిర్ణయమే అంతిమం. * రాజ్యసభ ఛైర్మన్‌కు ద్రవ్య బిల్లులపై ఎలాంటి అధికారం లేదు.
* అవిశ్వాస తీర్మానాన్ని, విశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. * ఈ తీర్మానాలు రాజ్యసభలో ప్రవేశపెట్టే వీల్లేదు.
* లోక్‌సభ పదవీకాలం అనిశ్చితం. * రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం.

లోక్‌సభ, రాజ్యసభల మధ్య వ్యత్యాసాలు

లోక్‌సభ రాజ్యసభ
* రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. * ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. * కేంద్ర ప్రభుత్వ మనుగడ రాజ్యసభపై ఆధారపడదు.
* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. * ఆర్టికల్, 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందించాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం.
  * ఆర్టికల్, 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం.

పబ్లిక్ బిల్లు, ప్రైవేటు బిల్లుల మధ్య వ్యత్యాసాలు

పబ్లిక్ బిల్లులు ప్రైవేటు బిల్లులు
* కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవే పబ్లిక్ బిల్లులు. * మంత్రులు కాని సభ్యులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రతిపాదించే బిల్లులనే ప్రైవేటు బిల్లులు అంటారు.
* పబ్లిక్ బిల్లుల విషయంలో మంత్రి మండలికి సమష్టి బాధ్యతా సూత్రాన్ని అన్వయిస్తారు. * ప్రైవేటు బిల్లుల విషయంలో మంత్రిమండలికి సమష్టి బాధ్యతా సూత్రం వర్తించదు.
* పబ్లిక్ బిల్లులు ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపడి ఉంటాయి. * ప్రైవేటు బిల్లుల విషయంలో అదేమీ ఉండదు.
* పబ్లిక్ బిల్లులను మంత్రులు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. * ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టే సభ్యుడు ఏ సభకు చెందుతాడో ఆ సభలోనే బిల్లును ప్రవేశపెట్టాలి.
* పబ్లిక్ బిల్లులకు సాధారణంగా సభలో అత్యధిక సభ్యుల మద్దతు లభిస్తుంది. * ప్రైవేటు బిల్లులకు సభలో అధిక సంఖ్యాక సభ్యుల మద్దతు లభించవచ్చు లేదా లభించకపోవచ్చు.
* పబ్లిక్ బిల్లులను ప్రవేశపెట్టే సంబంధిత మంత్రి 7 రోజుల ముందు సభాధిపతికి నోటీసు ఇవ్వాలి. * ప్రైవేటు బిల్లును ప్రతిపాదించే సభ్యులు నెల రోజులు ముందే నోటీసును సభాపతికి ఇవ్వాలి.

పార్లమెంటరీ కమిటీలు
* రోజు రోజుకూ శాసనాల సంఖ్య పెరగడం, శాసనాల రూపకల్పనలో సాంకేతికత పెరగడం, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిమాణం లాంటి అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆధునిక కాలంలో శాసనాల రూపకల్పనలో ఈ కమిటీల పాత్ర కీలకమైంది.
* పార్లమెంటు తరఫున నిపుణులు, సమర్థులైన కొంత మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగిస్తారు.
* భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ఆర్టికల్ 88, 105లలో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.


వ్యాఖ్యానాలు
* 'ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చేతులు, చెవులుగా; కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి' - థామస్ రీడ్
* 'శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి'. - మారిస్ జోన్స్
* 'ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి' - ఉడ్రో విల్సన్.

కమిటీల లక్షణాలు
* పార్లమెంటరీ కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్.
* మంత్రులు కమిటీల్లో సభ్యులుగా ఉండకూడదు.
* కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పిస్తుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.
* కమిటీ సమావేశాల నిర్వహణకు కావల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరం) 1/3వ వంతు.
* సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
* కమిటీల్లోని సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.
* సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.
* 1997లో రాజ్యసభ నుంచి, 2004లో లోక్‌సభ నుంచి నైతిక విలువల కమిటీలు ఏర్పడి పని చేస్తున్నాయి.
కమిటీలు 2 రకాలు
1. స్థాయి కమిటీలు (Standing Committees)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)

స్థాయి కమిటీలు
* ఇవి ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నికై నిరంతరంగా పని చేస్తుంటాయి. ఈ కమిటీల్లో సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు.
తాత్కాలిక కమిటీలు
* అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించగానే రద్దు అవుతాయి.


కీలకమైన పార్లమెంటరీ కమిటీలు 
ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee) 
* ఇది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాచీనమైంది.
* దీన్ని 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫారసుల మేరకు 1921లో ఏర్పాటు చేశారు.
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 22. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఈ కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. కమిటీ తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.
* 1967 నుంచి ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించడం ఒక సంప్రదాయంగా మారింది.


విధులు
* కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం.
* పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉందో, లేదో పరిశీలించడం.
* ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చుపెట్టారా లేదా అని పరిశీలించడం.
* కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రభుత్వ ఖాతాల సంఘంకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగాను పనిచేస్తుంది.
* కాగ్ నివేదికను ప్రభుత్వ ఖాతాల సంఘం పరిశీలించి అవకతవకలుంటే బాధ్యులపై చర్యలకోసం సిఫారసు చేస్తుంది.
* ప్రభుత్వ ఖాతాల సంఘంను ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు.


అంచనాల సంఘం (Estimates Committee)
* జాన్ ముత్తాయ్ కమిటీ సిఫారసుల మేరకు 1950లో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఈ కమిటీలోని మొత్తం 30 మంది సభ్యులను లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
* ఈ కమిటీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.
* దీన్ని నిరంతర పొదుపు కమిటీ అంటారు.
* పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
* ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను పార్లమెంటు కవలలుగా పేర్కొంటారు.

 

ప్రభుత్వరంగ సంస్థల సంఘం (Committee on Public Undertakings)
* ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కృష్ణమీనన్ కమిటీని ఏర్పాటు చేసింది.
* కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో 'ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని' ఏర్పాటు చేశారు.
* 1974 వరకు ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు.
* 1974 నుంచి దీనిలోని సభ్యుల సంఖ్యను 22కు పెంచారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన BHEL, BALCO, IOC, LIC లాంటివి సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
* ప్రభుత్వరంగ సంస్థల నివేదికను, ఖాతాలను పరిశీలిస్తుంది.
* ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి 'కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్' (CAG) నివేదికను పరిశీలిస్తుంది.
* ఇది కూడా కీలకమైన ఆర్థిక కమిటీ.

 

సాధారణ కమిటీలు
సభా వ్యవహారాల కమిటీ (Business Advisory Committee)
* లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి.
* ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
* లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీలో 15, రాజ్యసభ సభావ్యవహారాల కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
* ఈ కమిటీల్లో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను సభ్యులుగా ఎంపిక చేస్తారు.
* సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ అందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. ఇది ఎజెండాను తయారు చేస్తుంది.


ప్రభుత్వ హామీల కమిటీ (Committee on Government Assurance)
* లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలు ఏర్పాటవుతాయి.
* లోక్‌సభ కమిటీలో 15, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులుంటారు.
* ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల, తీర్మానాల మీద చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీల అమలు లాంటి విషయాలను కమిటీ పరిశీలిస్తుంది.


ప్రైవేట్ అర్జీల బిల్లుల కమిటీ
* ఇది లోక్‌సభకే ఉద్దేశించిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15. దీనికి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన విధి.
దత్త శాసనాల కమిటీ (Committee on Delegated Legislation)
* దీన్నే నియోజిత శాసనాల కమిటీ అంటారు.
* ఈ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.
* ఈ కమిటీని 'పార్లమెంటు విధుల రక్షణ కర్త'గా జి.వి.మౌలాంకర్ పేర్కొన్నారు.
* పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్దతను పరిశీలించడం, గతంలో రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ప్రధాన విధి.
సభాహక్కుల కమిటీ (Committee on Privilege of Members)
* ఈ కమిటీలు లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఉంటాయి.
* లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు.
* ఈ కమిటీ పార్లమెంటు సభ్యుల హక్కులు, హోదాలను పరిరక్షిస్తుంది.
* దీనికి అర్ధన్యాయ సంబంధమైన (Quasi Judicial) విధులు ఉంటాయి.
షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిటీ
* ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
* జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల నివేదికలను పరిశీలిస్తుంది.
మహిళా సాధికారతా కమిటీ (Committee on Empowerment of Women)
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* మహిళలకు రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి, తన నివేదికను రూపొందిస్తుంది.
* మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సిఫారసులు చేస్తుంది.
* మహిళా సాధికారిత, సమానత్వం కోసం చేపట్టే కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
* ఈ కమిటీని 1997లో ఏర్పాటు చేశారు.
ఎథిక్స్ కమిటీ (Committee on Ethics)
* ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997, లోక్‌సభలో 2004లో ఏర్పడింది.
* సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు లాంటి అంశాలపై సూచనలు ఇస్తుంది.
జీతభత్యాల కమిటీ
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.
లైబ్రరీ కమిటీ
* ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9. వీరిలో లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తారు.
* పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సదుపాయాల కల్పనపై సిఫారసు చేస్తుంది.

సాధారణ అవసరాల కమిటీ
* దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15 మంది. స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* పార్లమెంటు సభ్యులకు సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన వసతుల గురించి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.
లాభదాయక పదవుల కమిటీ (Committee on Office of Profit)
* దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15, వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు లాంటి అంశాలను పరిశీలిస్తుంది.
డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలు
* లోక్‌సభ రూల్స్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలోనూ 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ, మిగిలిన 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. ఈ కమిటీల సభ్యులను ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. ఈ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం.
* 16 కమిటీలు లోక్‌సభ, 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (JPC)
* సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను విచారించేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు.
* ఉభయసభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయవచ్చు.
* సుమారు 15 నుంచి 30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా ఉంది.
ఇప్పటి వరకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు
1. బోఫోర్స్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు 1987, ఆగస్టు 6న శంకరానంద్ (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, తన నివేదికను 1998, ఏప్రిల్ 26న ఇచ్చింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.
2. స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 1992, ఆగస్టు 6న రాంనివాస్ మిర్థా (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 1993, డిసెంబరు 21న సమర్పించింది.
3. స్టాక్ మార్కెట్ కుంభకోణం (కేతన్ పరేఖ్ కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 2001, ఏప్రిల్ 26న ప్రకాష్‌మణి త్రిపాఠీ (బీజేపీ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2002 డిసెంబరు 19న సమర్పించింది.
4. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసేందుకు శరద్ పవార్ (ఎన్‌సీపీ) అధ్యక్షతన 2003, ఆగస్టు 8న ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2004, ఫిబ్రవరి 4న సమర్పించింది.
* శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉండటం నిజమేనని పేర్కొంది. దీని సిఫారసుల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడింది.
5. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు పి.సి. చాకో (కాంగ్రెస్) అధ్యక్షతన 2011, మార్చి 1న ఏర్పడిన ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది.


పార్లమెంటరీ పారిభాషిక పదాలు
     పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ లాంటి పద్ధతులు ఉంటాయి. పార్లమెంటులో ప్రయోగించే ఈ పదాలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. వీటిని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. అవి:
కోరం
* పార్లమెంటు సమావేశాలు జరగడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభ, రాజ్యసభల్లో సభాధ్యక్షులతో కలిపి కోరం 1/10వ వంతు. ప్రస్తుతం లోక్‌సభలో కోరం 55 మంది సభ్యులుకాగా, రాజ్యసభలో 25 మంది.

క్రాసింగ్
* ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడు మరొక ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని 'క్రాసింగ్' అంటారు.
కార్పెట్ క్రాసింగ్
* అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని 'కార్పెట్ క్రాసింగ్' అంటారు.
ఫ్లోర్ క్రాసింగ్
* ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికారపక్ష పార్టీలోకి మారడాన్ని 'ఫ్లోర్ క్రాసింగ్' అంటారు.
కార్పెట్ బెగ్గర్
* ఒక స్థానికేతర అభ్యర్థి, స్థానిక అభ్యర్థిపై ఎన్నికల్లో పోటీచేసి ఎన్నిక కావాలని కోరుకోవడాన్ని 'కార్పెట్‌బెగ్గర్' అంటారు.
ఎజెండా
* సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను 'ఎజెండా' అంటారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను నిర్ణయిస్తుంది. సభా కార్యక్రమాలను ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు.
ఎగ్జిట్ పోల్
* సాధరణ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్ల మనోభావాలను, అభిప్రాయాలు తెలుసుకుని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని 'ఎగ్జిట్‌పోల్‌'గా పేర్కొంటారు.
గ్యాలప్ పోల్:
* సాధారణ ఎన్నికల కంటే ముందే ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రాధాన్యత వహిస్తాయో పరిశీలించి, ఆయా అంశాల పట్ల ప్రజల మనోభావాలను ముఖాముఖి ద్వారా తెలుసుకుని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని 'గ్యాలప్ పోల్' అంటారు. అమెరికాకు చెందిన గ్యాలప్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.
రెఫరెండం
* ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడమే 'రెఫరెండం'. ఫ్రాన్స్‌లో తొలిసారిగా నెపోలియన్ రెఫరెండం నిర్వహించారు. ప్రస్తుతం దీన్ని స్విట్జర్లాండ్‌లో ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ప్లెబిసైట్ (ప్రజానిర్ణయ సేకరణ)
* ప్రభుత్య చట్టాల్లో లేదా రాజ్యాంగంలో సవరణలు చేసే సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించే ప్రక్రియనే 'ప్లెబిసైట్‌'గా పేర్కొంటారు. ఈ విధానం స్విట్జర్లాండ్‌లో ఉంది.
రీకాల్ (పునరాయనం)
* అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు అసమర్థులుగా లేదా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా, వారి పదవీ కాలం ముగియడానికి ముందే పదవి నుంచి తొలగించడానికి వారిని వెనుక్కు పిలుస్తారు. ఆ స్థానంలో నూతన ప్రతినిధులను ఎన్నుకుంటారు.
* ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న స్విట్జర్లాండ్‌లో రీకాల్ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తారు.
జీరో అవర్ (శూన్యకాలం)
* ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, ఎజెండా కార్యక్రమాల కంటే ముందు ఉండే సమయమే 'జీరో అవర్'. ఇది భారత పార్లమెంటరీ సంప్రదాయంలో నూతనంగా అవతరించిన ఒరవడి. 'జీరో అవర్‌'కు నిర్దిష్ట సమయం ఉండదు.
* 1962లో 'జీరో అవర్‌'ను సృష్టించారు. దీన్ని 1964 నుంచి క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఏ విధమైన ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్రశ్నలు అడగవచ్చు.
సంకీర్ణ ప్రభుత్వం: (Coalition Govenment)
* రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే 'సంకీర్ణ ప్రభుత్వం' అంటారు.


జాతీయ ప్రభుత్వం
* 1991, మే 21న రాజీవ్ గాంధీ హత్యానంతరం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఆనాటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ప్రతిపాదించారు.
* దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి, తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననే 'జాతీయ ప్రభుత్వం'గా పేర్కొంటారు.


ప్రశ్నోత్తరాల సమయం (Question Hour)
* పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిరోజు మొదటి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. సభాధ్యక్షులకు సభ్యులు నోటీసు ఇచ్చి వివిధ అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. సంబంధిత మంత్రులు వీటికి సమాధానం చెబుతారు. ఈ ప్రశ్నలు 3 రకాలు అవి:
1. నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలు (Stared Questions)
* నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు మౌఖిక సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల ప్రాధాన్యాన్ని బట్టి సభాధ్యక్షులు నక్షత్రపు గుర్తులు ఇస్తారు. నక్షత్రపు గుర్తున్న ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధపు ప్రశ్నలను కూడా అడగవచ్చు.
2. నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలు (Un-stared Questions)
* నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలకు సంబంధిత మంత్రులు లిఖిత పూర్వక (Written) సమాధానాలు ఇస్తారు. ఈ ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధపు ప్రశ్నలను అడిగే వీల్లేదు.
3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు (Short Duration Questions)
* అత్యవసర ప్రజాప్రాముఖ్యం ఉన్న విషయమై సభ్యులు అడిగే మౌఖిక ప్రశ్నలను స్వల్పవ్యవధి ప్రశ్నలు అంటారు.


విశ్వాస తీర్మానం (Motion of Confidence)
* లోక్‌సభలో విశ్వాసం ఉన్నంత మేరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో రాష్ట్రపతి నియమించే ప్రధాని, మంత్రిమండలి నిర్ణీత గడువులోగా లోక్‌సభలో తమ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి.
* ఈ తీర్మానం వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
* ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన తొలి ప్రధాని చరణ్‌సింగ్.
* ఈ తీర్మానం ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని వి.పి. సింగ్. కాగా, రెండో ప్రధాని హెచ్.డి. దేవెగౌడ.

 

అవిశ్వాస తీర్మానం (No confidence motion)
* ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం.
* ఈ తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాన్ని చూపాల్సిన అవసరం లేదు.
* కనీసం 50 మంది సభ్యులు తీర్మాన నోటీసుపై సంతకాలు చేయాలి. మరో 50 మంది సభ్యులు తీర్మానానికి మద్దతును ప్రకటించాలి.
* అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. 2 అవిశ్వాస తీర్మానాల మధ్య వ్యత్యాసం 6 నెలలు.
* 'రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ - 1950' చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
* మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.
* అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ.
* అత్యధికంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీ.


అభిశంసన తీర్మానం (Censure Motion)
* ప్రభుత్వంలోని ఒక మంత్రి లేదా కొందరు మంత్రులు లేదా మొత్తం ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.
* ఈ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తప్పనిసరిగా కారణం చూపాలి. 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
* సభాహక్కుల్ని ఉల్లంఘించినప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు, సంబంధింత మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి.
* ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం లేదా మంత్రులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అది వారి నైతికతపైనే ఆధాపరడి ఉంటుంది.

 

ఆర్డినెన్స్
* కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం; రాష్ట్రాల శాసన సభలు సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్టికల్, 213 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.
* ఈ ఆర్డినెన్స్‌కు సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంటుంది.
* ఈ ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం 7నెలలు.


ఆపద్ధర్మ ప్రభుత్వం (Care Taker Government) 

గెర్రీ మాండరింగ్
* అధికార పార్టీ సభ్యులు తమ విజయావకాశాలను మెరుగు పరచుకునేందుకు నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి నియోజక వర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియను 'గెర్రీ మాండరింగ్' అంటారు.
విప్ (Whip)
     విప్ అంటే ఆదేశం అని అర్థం. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లేదా శాసనసభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీచేసే ఆదేశాన్నే 'విప్' అంటారు.
* 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అన్వయింపు అంశమే విప్.
* 'విప్‌'ను ధిక్కరించిన సభ్యులపై 15 రోజుల్లోగా సభాధిపతికి ఫిర్యాదు చేయాలి. 'విప్‌'ను ధిక్కరించిన వారి సభ్యత్వాలను సభాధిపతులు రద్దు చేయగలరు.
* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌లకు 'విప్' మినహాయింపు ఉంటుంది.
* అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు పరిపాలనా బాధ్యతలను కొనసాగించడానికి అదే ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే వరకు అధికారంలో కొనసాగమని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరడం.
* ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోరాదు.
హంగ్ పార్లమెంట్
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ లభించని పక్షంలో ఏర్పడే పరిస్థితిని 'హంగ్ పార్లమెంట్' లేదా 'త్రిశంకు సభ' అంటారు.
* శాసనసభ ఎన్నికల్లో ఈ పరిస్థితి వచ్చినప్పుడు 'హంగ్ అసెంబ్లీ' అంటారు.


ఇంత వరకు మనదేశంలో ఏర్పడిన హంగ్ పార్లమెంట్‌లు

1 9వ లోక్‌సభ/ పార్లమెంట్ 1989
2 10వ లోక్‌సభ/ పార్లమెంట్ 1991
3 11వ లోక్‌సభ/ పార్లమెంట్ 1996
4 12వ లోక్‌సభ/ పార్లమెంట్ 1998
5 13వ లోక్‌సభ/ పార్లమెంట్ 1999
6 14వ లోక్‌సభ/ పార్లమెంట్ 2004
7 15వ లోక్‌సభ/ పార్లమెంట్ 2009


వాయిదా తీర్మానం:
* ప్రజాప్రాముఖ్యం ఉన్న ఏదైనా అంశంపై చర్చించేందుకు 'ఎజెండా'లోని కార్యక్రమాలను వాయిదా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే 'వాయిదా తీర్మానం'.
* వాయిదా తీర్మాన నోటీసుపై కనీసం 10 మంది సభ్యులు సంతకాలు చేయాలి. దీన్ని అనుమతించాలా? లేదా? అనేది సభాధ్యక్షుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
వాయిదా (అడ్జర్న్) (తాత్కాలిక వాయిదా)
* పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయడాన్నే 'అడ్జర్న్' అంటారు.
* సభాధిపతి సభను వాయిదా వేసినప్పుడు తిరిగి సమావేశాలు ఏ తేదీ, ఏ సమయంలో జరుగుతాయనేది ముందుగానే తెలియజేస్తూ సభను వాయిదా వేస్తారు.
అర్ధంతర వాయిదా (సైనిడై)
* జరుగుతున్న సమావేశాల తర్వాత తేదీని లేదా సమయాన్ని ప్రకటించకుండా అర్ధంతరంగా వాయిదా వేయడాన్నే 'సైనిడై' అంటారు.
రద్దు (డిసాల్వ్)
   లోక్‌సభ పదవీకాలం పూర్తయినా లేదా రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఉన్న సమయంలో ఆర్టికల్, 85 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయడాన్ని 'రద్దు' అంటారు.
దీర్ఘకాలిక వాయిదా (ప్రోరోగ్)
   పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి పార్లమెంటును, గవర్నర్ శాసనసభను దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని 'దీర్ఘకాలిక వాయిదా' అంటారు.
సమావేశాల ప్రారంభం (సమ్మన్స్)
    రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని, గవర్నర్ శాసనసభ సమావేశాలను ప్రారంభించడాన్ని 'సమ్మన్స్' అంటారు.
మెయిడ్ ఇన్ స్పీచ్
* పార్లమెంటుకు లేదా శాసనసభకు మొదటిసారి ఎన్నికైన సభ్యుడు సభలో చేసిన తొలి ప్రసంగాన్ని 'మెయిడ్ ఇన్ స్పీచ్' అంటారు.
అర్ధగంట చర్చ
* పార్లమెంటు సమావేశం ముగింపు దశలో అంటే ఆ రోజు సమావేశాన్ని ముగించడానికి 'చివరి అర్ధగంటను' అర్ధగంట చర్చకు కేటాయిస్తారు.
* ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యం లేని అంశాలను చర్చించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
* లోక్‌సభలో సోమ, బుధ, శుక్ర వారాల్లో; రాజ్యసభలో ప్రతిరోజు అర్ధగంట చర్చ ఉంటుంది.


గిలెటిన్ ఓటింగ్ (ముజువాణి ఓటు)
   పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాల ముగింపు దశలో వివిధ బిల్లులపై సమగ్రమైన చర్చ జరిపేందుకు తగిన సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండానే తక్కువ సమయంలో ఎక్కువ బిల్లులను మూకుమ్మడిగా ఆమోదించడాన్ని 'గిలెటిన్' (ముజువాణి ఓటు) అంటారు.
ఓట్ ఆన్ అకౌంట్ (ఆర్టికల్, 116)
* ఎన్నికల సమయంలో లేదా దేశం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వీలులేనప్పుడు రెండు నెలల కాలపరిమితితో ప్రభుత్వం ప్రవేశపెట్టే తాత్కాతిక బడ్జెట్‌నే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు.
* సాధారణ బడ్జెట్ మొత్తం అంచనా వ్యయంలో 1/6వ వంతుకు సమానంగా అంటే రెండు నెలలకు సరిపడే గ్రాంటుగా ఓట్ ఆన్ అకౌంట్‌లో ఇస్తారు. తర్వాత దీన్ని పూర్తిస్థాయి బడ్జెట్‌లో విలీనం చేస్తారు.


ఇతర ముఖ్యాంశాలు
* 162 దేశాలు సభ్యత్వం ఉన్న 'ఇంటర్ పార్లమెంటరీ యూనియన్' 1889లో ఏర్పాటైంది. దీని 57వ సమావేశం 1969లో న్యూదిల్లీలో జరిగింది. దీనికి అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎస్. థిల్లాన్ అధ్యక్షత వహించారు.
* 1993లో న్యూదిల్లీలో జరిగిన 89వ సమావేశానికి స్పీకర్ శివరాజ్‌పాటిల్, 1997లో న్యూదిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశానికి స్పీకర్ పి.ఎ. సంగ్మా అధ్యక్షత వహించారు.
* 3వ లోక్‌సభ కాలంలో సర్దార్ హుకుంసింగ్ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాలంలో 1963లో తొలిసారిగా నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈయన కాలంలోనే అత్యధికంగా 6 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
* తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అనంతశయనం అయ్యంగార్ రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభ సభ్యురాలిగా ఉండి, ఒక్కసారి కూడా రాజ్యసభకు హాజరు కాని మహిళ లతామంగేష్కర్.
* 14వ లోక్‌సభ కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ మరణించిన మాజీప్రధాని చంద్రశేఖర్.
14వ లోక్‌సభ కాలంలో మరణించిన మాజీ రాష్ట్రపతులు: 1. కె.ఆర్. నారాయణన్
                                               2. ఆర్. వెంకట్రామన్
14వ లోక్‌సభ కాలంలో మరణించిన మాజీ ప్రధానులు  1. పి.వి. నరసింహారావు
                                              2. వి.పి. సింగ్
                                              3. చంద్రశేఖర్
* మనదేశంలో ఒకే పేరుతో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాలు
1. హమీర్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)
2. హమీర్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్)

ఉత్తమ పార్లమెంటేరియన్లు

* 1993 నుంచి ప్రతి సంవత్సరం ఒక పార్లమెంటు సభ్యుడికి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారాల కమిటీకి 'లోక్‌సభ స్పీకర్' అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* 1993లో మొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 'ఇంద్రజిత్ గుప్తా' అందుకున్నారు.
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (1997).
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (1996).
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక మహిళ సుష్మా స్వరాజ్ (2004).
* 1952 - 1957 నాటి మొదటి లోక్‌సభ కాలంలో 333 బిల్లులు ఆమోదించారు, 2009 - 2014 మధ్య 15వ లోక్‌సభ కాలంలో కేవలం 165 బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి.
* మనదేశ పార్లమెంటరీ చరిత్రలో 15వ లోక్‌సభ కాలంలో అధికారపక్ష సభ్యులే 2014, మార్చి 4న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
* లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 10 సార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి పి.ఎం. సయీద్.
* మొదటి లోక్‌సభలో కేవలం 5% (22 మంది) మహిళలు ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభలో 11.42% (63 మంది) మహిళలు ఎన్నికయ్యారు.

Posted Date : 22-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర న్యాయవ్యవస్థ (సుప్రీంకోర్టు)

    'ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆదేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చని' లార్డ్‌బ్రైస్ పేర్కొన్నారు. మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.
* భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను; అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థను గ్రహించారు.


సుప్రీంకోర్టు చరిత్ర
* ఈస్టిండియా కంపెనీ మనదేశాన్ని పాలిస్తున్న సమయంలో 1773లో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని పోర్టువిలియంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటుచేశారు.
* దీని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజాఇంఫే.
* ఇతర న్యాయమూర్తులు సీజర్ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్ చాంబర్స్.
* కలకత్తాలోని సుప్రీంకోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా మార్చి1937లో న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు.
* ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వేయర్.
* భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టిన వారు వారన్ హేస్టింగ్స్.
* భారత్‌లో న్యాయవ్యవస్థను అభివృద్ధి పరిచి, న్యాయవ్యవస్థకు పితామహుడిగా పేరొందిన వారు కారన్‌వాలీస్.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, అధికారాలు, విధుల గురించి వివరించారు.
* 1950, జనవరి 28 నుంచి భారత సుప్రీంకోర్టు న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు భవన నిర్మాణ రూపకర్త గణేశ డియోల్కర్. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె. కానియా
సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడానికి కారణాలు
 * భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం.
 * ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించడం.
 * మన దేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం.
 * భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
 * రాజ్యాంగానికి అర్ధవివరణను ఇవ్వడం.

సుప్రీంకోర్టు నిర్మాణం
* ఆర్టికల్, 124 సుప్రీంకోర్టు నిర్మాణాన్ని తెలియజేస్తుంది. 1950లో సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో ప్రారంభమైంది. ఈ సంఖ్య కింది మార్పులకు గురైంది.
1950 - 1 + 7
1956 - 1 + 10
1960 - 1 + 13
1978 - 1 + 18
1985 - 1 + 25
2008 - 1 + 30
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి సంతకం, సీలు వేసిన వారెంటు ద్వారా నియమిస్తారు.

 

అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 5 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా (Judge) పనిచేసి ఉండాలి. లేదా 10 ఏళ్లు హైకోర్టు న్యాయవాదిగా (Lawyer)
పనిచేసి ఉండాలి.
* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయసు నిర్ణయించలేదు.
* న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.
* లా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌లు పదవీ విరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచాలని సూచించాయి.

 

ప్రధాన న్యాయమూర్తి నియామకం
* సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం ఒక సంప్రదాయం. కానీ 1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తులైన జె.ఎం. షేలట్, ఎ.ఎన్. గ్రోవర్, కె.ఎస్. హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న జూనియర్ అయిన ఎ.ఎన్. రేనును ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నాను కాదని, జూనియర్ అయిన ఎమ్.హెచ్. బౌగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

న్యాయమూర్తుల నియామకం - కొలీజియం వ్యవస్థ

ఎస్.పి. గుప్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1982)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే మొదటి జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1993)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసే సమయంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) ని కొలీజియంగా తప్పనిసరిగా సంప్రదించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* 1998లో అప్పటి భారత రాష్ట్రపతి ఆర్టికల్, 143 ప్రకారం కొలీజియంపై సుప్రీంకోర్టు న్యాయసలహాను కోరారు.
* 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొలీజియంకు సంబంధించి ఈ విధంగా వివరణను ఇచ్చింది.
a) కొలీజియం అంటే సీజేఐతోపాటు మరో నలుగురు ఇతర న్యాయమూర్తులుంటారు.
b) రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి.
c) రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించిన తర్వాత న్యాయమూర్తులను నియమించాలి.

నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ (NJAC)
   మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ(JAC) ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది.
* నరేంద్ర మోదీ ప్రభుత్వం 120వ సవరణ బిల్లును ఉపసంహరించి, దాన్ని 121వ సవరణ బిల్లుగా రూపొందించి నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్(NJAC) ను ఏర్పాటు చేసింది. దీన్ని పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు, భారత్‌లోని 15 రాష్ట్రాలు కూడా ఆమోదించిన తర్వాత, అది 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2014, డిసెంబరు 31న రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైంది.
* నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్ (NJAC) 2015, ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ఫలితంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి కొలిజీయంకు బదులుగా ఎన్‌జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది.

 

ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదు - సుప్రీం తీర్పు
* సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని 2015, అక్టోబరు 16న ప్రకటించింది. దీన్నే థర్డ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తిరిగి సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

న్యాయమూర్తుల తొలగింపు విధానం
* అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో రాష్ట్రపతి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మాన నోటీస్‌పై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం.
* 14 రోజుల ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో సంబంధిత సభాధిపతి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
* కమిటీ విచారణ తర్వాత ఇచ్చే రిపోర్ట్‌పై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, రెండో సభకు కూడా పంపి అక్కడ కూడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి వారిని తొలగిస్తారు.
* తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండోసభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ తిరస్కరిస్తే తీర్మానం రద్దు అవుతుంది.
* మనదేశంలో ఇప్పటి వరకు ఈ తీర్మానం ద్వారా ఎవరినీ తొలగించలేదు.
* 1991లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామిపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది. తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు.

జీతభత్యాలు
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఆర్టికల్, 125 తెలియజేస్తుంది.
* వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను నుంచి మినహాంపు ఉంటుంది.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ.1,00,000.
* సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల వేతనం నెలకు రూ.90,000.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో వీరివేతనాలు తగ్గించకూడదు.
* సుప్రీంకోర్టు తాత్కాలిక (అడ్‌హాక్) ప్రధాన న్యాయమూర్తిని ఆర్టికల్, 126 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.
* ఆర్టికల్, 127 ప్రకారం సుప్రీంకోర్టులో అడ్‌హాక్ (తాత్కాలిక) న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ విధంగా నియమించిన తాత్కాలిక న్యాయమూర్తుల పదవీ కాలం 2 సంవత్సరాలు.
* సాధారణ న్యాయమూర్తులకు కల్పించే సౌకర్యాలన్నీ తాత్కాలిక న్యాయమూర్తులకు వర్తిస్తాయి.
* ఆర్టికల్, 128 ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టుకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.
* ఆర్టికల్, 130 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం న్యూ దిల్లీలో ఉంది.
* కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు బెంచ్‌లను కలకత్తా, చెన్నై, ముంబయిలలో ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనను 25 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2000 సంవత్సరంలో తిరస్కరించింది.

సుప్రీంకోర్టు - అధికారాలు - విధులు

ప్రారంభ/ ప్రాథమిక/ ఒరిజినల్ విచారణాధికార పరిధి (ఆర్టికల్, 131)
* ఆర్టికల్, 131 ప్రకారం మనదేశ సమాఖ్య స్వభావాన్ని కాపాడటం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటినీ సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు.
* కేంద్రం ఒకవైపు, కొన్ని రాష్ట్రాలు మరొకవైపు ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే సమస్యలు.
* దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు.
* ఏవైనా రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలు ఒరిజినల్ విచారణాధికార పరిధిలో ఉంటాయి.
* 1967లో భారత ప్రభుత్వం గనులను జాతీయం చేసిన అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ్ బంగా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా దాన్ని సమర్థిస్తూ, సుప్రీంకోర్టు తొలిసారిగా ఒరిజినల్ విచారణాధికార పరిధిని వినియోగించింది.
* కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు భారత ప్రభుత్వం న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు 1978లో పేర్కొంది.

ప్రాథమిక/ ఒరిజినల్ విచారణాధికార పరిధి నుంచి మినహాయించిన అంశాలు
* ఆర్టికల్, 253 - భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు.
* ఆర్టికల్, 262 - అంతర్ రాష్ట్ర నదీజలాల పంపకం విషయంలో కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను లేదా అవార్డులను అనుసరించి పార్లమెంటు చేసిన చట్టాలు.
* ఆర్టికల్, 275 - కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.
* ఆర్టికల్, 280 - కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడానికి చేసిన
సిఫారుసులకు సంబంధించిన అంశాలు.
* ఆర్టికల్, 290 - కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు.
* ఆర్టికల్, 304 - అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు.
* ఆర్టికల్, 81 - నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీ చేసిన సూచనలను అనుసరించి లోక్‌సభ, విధానసభల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంటు రూపొందించిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయకూడదు.

 

అప్పీళ్ల విచారణాధికార పరిధి
    సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నతమైన అప్పీళ్ల కోర్టు. హైకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందినవారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.

1. రాజ్యాంగ పరమైన అప్పీళ్లు (ఆర్టికల్, 132)
* రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దుచేయగా, దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది.

 

2. సివిల్ అప్పీళ్లు (ఆర్టికల్, 133)
* ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం, రాజ్యాంగ పరమైన అంశం ఇమిడి ఉందని భావించినా, హైకోర్టు ఇచ్చే ధ్రువీకరణతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* 30వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్తి విలువపై ఉన్న పరిమితిని తొలగించారు. కానీ ఆర్టికల్, 134 (A) ప్రకారం హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి.

 

3. క్రిమినల్ అప్పీళ్లు (ఆర్టికల్, 134)
* హైకోర్టులు వివిధ క్రిమినల్ కేసుల్లో ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* జిల్లా సెషన్స్ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించినప్పుడు అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష/ యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.

* జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరుపుతున్న కేసును హైకోర్టు తనకు బదిలీ చేయించుకుని నిందితుడికి
ఉరిశిక్ష/ యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* కింది కోర్టు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి, హైకోర్టు మరణశిక్షను రద్దుచేసిన సందర్భంలో సంబంధిత వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* 1970లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్షకు గురైన వ్యక్తులు కూడా సుప్రీంకోర్టులో నేరుగా అప్పీల్ చేసుకోవచ్చు.

 

4. ప్రత్యేకమైన అప్పీళ్లు (ఆర్టికల్, 136) (Special Leave Petitions)
* వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు తిరస్కరించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్లకు ప్రయత్నిస్తారు.
* సంబంధిత కేసుల్లో ఏదైనా న్యాయపరమైన ప్రత్యేక అంశాన్ని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు.
* సుప్రీంకోర్టులో ఉండే స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ప్రత్యేక అప్పీల్‌కి అనుమతిస్తుంది.

 

కోర్ట్ ఆఫ్ రికార్డ్ (ఆర్టికల్, 129)
* సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు.
* కోర్ట్ ఆఫ్ రికార్డ్‌నే అనుపూర్వికాలు అని కూడా అంటారు.
* కోర్టుకు సమర్పించిన రికార్డులు, డాక్యుమెంట్లు; కోర్టులో ప్రమాణ పూర్తిగా సమర్పించిన సాక్ష్యాధారాలను కోర్ట్ ఆఫ్ రికార్డ్‌ లో అంతర్భాగంగా పరిగణిస్తారు.

* కోర్ట్ ఆఫ్ రికార్డ్ కింది న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే.
* కోర్ట్ ఆఫ్ రికార్డ్ ధిక్కరణను కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణిస్తారు. దీనికి రూ.2000 జరిమాన, 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు.

 

మహ్మద్ సలీం ఇస్మాయిల్ Vs భారత ప్రభుత్వం కేసు
 ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం పరిరక్షణలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైనందుకు ఒకరోజు జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధించింది.

 

తీర్పుల పునఃసమీక్ష (ఆర్టికల్, 137)
* సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయగలదు.
* 1960లో బెరుబారి కేసు సందర్భంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొన్న సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసు సందర్భంగా ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ కేసు సందర్భంగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసు సందర్భంగా పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించరాదని పేర్కొంది.

రిట్‌లు జారీచేయడం (ఆర్టికల్, 32)
* వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని భావిస్తే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్, 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీచేస్తుంది. అవి:
1. హెబియస్ కార్పస్
2. మాండమస్
3. ప్రొహిబిషన్
4. సెర్షియోరరీ
5. కోవారంటో

 

సలహా పూర్వక అధికార పరిధి (ఆర్టికల్, 143)
* రాష్ట్రపతి ఆర్టికల్, 143 ప్రకారం 2 రకాలుగా సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందవచ్చు. అవి:
1. చట్టానికి సంబంధించిన వివాదం లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశానికి సంబంధించిన విషయాలపై
2. రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాల్లో మొదటి రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండో రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి.
* పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాలను కింది న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.

ఇప్పటి వరకు భారత రాష్ట్రపతులు ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను కింద పేర్కొన్న అంశాలపై పొందారు అవి:
1. దిల్లీ న్యాయ చట్టం, 1951
2. కేరళ విద్యా బిల్లు, 1958
3. బెరుబారి యూనియన్, 1960
4. సీ - కస్టమ్స్ యాక్ట్, 1963
5. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేశవ్‌సింగ్ వివాదం, 1964
6. రాష్ట్రపతి ఎన్నికలు, 1974
7. ఇందిరా గాంధీపై విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుల చట్టం, 1978
8. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ వివాదం, 1992
9. కొలీజియం వ్యవస్థ, 1998
10. గుజరాత్ శాసనసభ ఎన్నికలు, 2002
11. పంజాబ్ నదీ జలాల ఒప్పందం, 2004
12. లాభదాయక పదవులు, 2006
13. జమ్మూకశ్మీర్ పునరావాస, పౌరసత్వ విషయం, 1981
14. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రసారభారతి సీఈవో బి.ఎస్. లల్లీపై చర్యలు, 2010
15. రామ జన్మభూమి వివాదం, 1993

న్యాయసమీక్షా అధికారం
  పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు; ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్నే న్యాయ సమీక్ష అంటారు.

 

రాజ్యాంగ పరిరక్షణ కర్త
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో వ్యవహరించేలా సుప్రీంకోర్టు నియంత్రిస్తుంది.
* ఆర్టికల్, 147 ప్రకారం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే విషయంలో సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం.
* ఏదైనా ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని ధ్రువీకరిస్తుంది.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదాలను విచారిస్తుంది.
* యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్లు, సభ్యుల తొలగింపు విషయాల్లో రాష్ట్రపతి సలహా మేరకు సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది.

 

కింది న్యాయస్థానాలపై నియంత్రణ (ఆర్టికల్, 141)
* సుప్రీంకోర్టు దేశంలోని కింది న్యాయస్థానాలపై నియంత్రణ కలిగి ఉంటుంది.
* సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని మిగిలిన న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే.
* న్యాయ నిర్వహణలో దిగువ న్యాయస్థానాలు అనుసరించాల్సిన పద్ధతుల గురించి సుప్రీంకోర్టు జారీచేసే మార్గదర్శక సూత్రాలను అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.
* సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బందిని సుప్రీంకోర్టు నియమిస్తుంది.

విచారణ అధికార పరిధి
* సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విచారణ సంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం విచారణకు - థక్కర్ కమిషన్
* రాజీవ్ గాంధీ హత్యానంతరం విచారణకు - జైన్ కమిషన్, వర్మ కమిషన్
* బాబ్రీ మసీద్ విధ్వంసం అనంతరం - ఎం.ఎస్. లిబర్హాన్ కమిషన్
* రాజకీయ నాయకులు, నేరస్థుల మధ్య సంబంధాలు - ఎన్.ఎన్. వోహ్రా కమిషన్
* గోద్రా అల్లర్ల అనంతరం విచారణకు - నానావతి కమిషన్
* నిర్భయ ఘటన తర్వాత విచారణకు - ఉషామెహ్రా కమిషన్
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం - రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్; మదన్ మోహన్ పూంచీ కమిషన్

 

స్వలింగ సంపర్కం కేసు
* ఇద్దరు పురుషులు లేదా స్త్రీల మధ్య జరిగే స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనని 2009లో దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
* ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడైన బి.పి. సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని 2013, డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

* న్యాయస్థానాల్లో మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్ లాంటి సంబోధనలతో న్యాయమూర్తులను పిలవడం తప్పనిసరి కాదని, 'సర్' అనే పదాన్ని వాడినా సమ్మతమేనని హెచ్.ఎల్. దత్తు, ఎస్.ఎ. బాబ్డేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
* సుప్రీంకోర్టు ప్రత్యేక పిన్‌కోడ్ - 110201. ఇది 2013, సెప్టెంబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది.

 

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన మహిళలు
1. ఫాతిమాబీబీ
2. రుమా పాల్
3. సుజాత మనోహర్
3. జ్ఞాన్ సుధా మిశ్రా
5. రంజనా రాయ్
6. ఆర్. భానుమతి

 

అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమితులైన/ పనిచేసిన భారతీయులు
1. బెనగళ్ నర్సింగ్ రావు
2. నాగేంద్ర సింగ్
3. రఘునందన్ పాఠక్
4. దల్వీర్ భండారీ

 

కీలకాంశాలు
* సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె. కానియా.
* సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమాబీబీ.
* ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది వై.వి. చంద్రచూడ్ (7 సంవత్సరాల 140 రోజులు).
* అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది కె.ఎన్. సింగ్ (18 రోజులు).
* మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్.
* గోలక్‌నాథ్ కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* కేశవానంద భారతి కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం. సిక్రీ.
* ఆంతరంగిక అత్యవసర పరిస్థితి సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎన్. రే.
* ఎస్.ఆర్. బొమ్మై కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్. వెంకటాచలయ్య.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు కోకా సుబ్బారావు.
* 1993లో ఇచ్చిన తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది జస్టిస్ జె.ఎస్. వర్మ.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏక శాసనసభ, ద్వి శాసనసభ

శాసన వ్యవస్థ
* దేశంలోని ప్రజలకు అవసరమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించడానికి, చర్చల్లో వివిధ వర్గాల వారు పాల్గొనడానికి, వివిధ వర్గాల అభిప్రాయాలను సమన్వయపరచి శాసనాలను రూపొందించడానికి శాసనవ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
* బ్రిటన్‌లో తొలిసారిగా క్లర్జీలు, నోబుళ్లు, కామన్స్ ప్రతినిధులతో వైట్ సెగ్మెంట్ ఏర్పడింది.

* క్రీ.శ.1265లో సైమన్ డి మౌంట్ బరో  ప్రతినిధులతో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
* క్రీ.శ.1295లో మొదటి ఎడ్వర్డ్ ఒక మోడల్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మోడల్ పార్లమెంట్ క్రమంగా గ్రేట్ నేషనల్ కౌన్సిల్‌గా ఏర్పడింది. ఈ కౌన్సిల్‌లో ప్రభువుల సభ, కామన్స్ సభ అనే రెండు సభలు ఏర్పడ్డాయి. ఈ రెండు సభలు బ్రిటన్ పార్లమెంట్‌గా అవతరించాయి. ఇదే ప్రపంచంలో తొలి పార్లమెంటు (శాసన వ్యవస్థ).
* శాసన సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ద్వారా ఎన్నికైన శాసన సభ్యులు తిరిగి ప్రజలకు బాధ్యత వహించాలి.

 

శాసన వ్యవస్థ రకాలు
* శాసన వ్యవస్థ నిర్మాణం ప్రపంచంలో రెండు రకాలుగా కొనసాగుతోంది. శాసన నిర్మాణ శాఖలో ఒకే సభ ఉంటే దాన్ని ఏక శాసనసభ, రెండు సభలు ఉంటే ద్వి శాసనసభ అని అంటారు.

 

ఏక శాసనసభ విధానం
 ఏక శాసనసభ విధానంలో కేవలం ఒక సభ మాత్రమే ఉంటుంది. దాన్ని దిగువ సభ అంటారు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం అంతిమంగా ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి, వారి అభీష్టాన్ని తెలియజేయడానికి ఒక సభ ఉంటే సరిపోతుందని కొందరు భావిస్తారు
* ఫ్రాన్స్‌కు చెందిన అబీసాయిస్ అనే రాజనీతిజ్ఞుడు శాసన నిర్మాణ శాఖ ఒకే సభను కలిగి ఉండాలని పేర్కొన్నారు.
* అమెరికాకు చెందిన బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఏక శాసనసభ విధానాన్ని సమర్థించారు.
* ఇంగ్లండ్‌కు చెందిన జెర్మీ బెంథామ్  'ఏక శాసనసభా విధానాన్ని సమర్థించి, శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ నిరుపయోగమైందని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ఒకే సభ ఉన్న దేశాలు

దేశం పేరు శాసనసభ పేరు
గ్రీస్ హెలెనిక్
పోర్చుగల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్
చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
మాల్దీవులు మజ్లిస్
బంగ్లాదేశ్  జాతీయ సన్సద్
పెరు కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్
శ్రీలంక పార్లమెంటు
నేపాల్  రాష్ట్రీయ పంచాయతీ
ఇరాన్ మజ్లిస్
ఇరాక్ నేషనల్ అసెంబ్లీ
స్వీడన్ రిక్స్‌డాగ్
ఐర్లాండ్ ఐరిష్ టాచ్
డెన్మార్క్ ఫోకటింగ్
ఇజ్రాయెల్ నెస్సెట్
ఫిన్‌లాండ్ ఎడుస్కుంటా

ఏక శాసనసభ ఉపయోగాలు

శాసన నిర్మాణంలో జాప్యం నివారణ
* శాసన నిర్మాణంలో ఒకేసభ ఉండటం వల్ల బిల్లును ఆమోదించి, దేశాధ్యక్షుడి ఆమోదానికి పంపడం ద్వారా వెంటనే బిల్లు చట్టంగా మారుతుంది. దీని ఫలితంగా ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే శాసనాలు రూపొందించే వీలుంటుంది.

 

శాసనసభ ఏర్పాటు సులభం
* రెండు సభల విధానంతో పోల్చితే ఏకసభా విధానంలో శాసనసభ నిర్మాణాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభకు కావాల్సిన ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవడంతో శాసనసభ నిర్మాణం పూర్తవుతుంది.
కార్యనిర్వాహక వర్గ నియంతృత్వాన్ని నియంత్రిస్తుంది
* శాసన నిర్మాణ శాఖలో రెండు సభల కంటే ఏకసభ ఉండటం వల్ల అది సమర్థంగా పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక వర్గం నియంతృత్వాన్ని నియంత్రిస్తుంది.
* ద్విసభలు ఉంటే సార్వభౌమాధికారం రెండు సభల మధ్య విభజితమవుతుందని, దానివల్ల ఏ ఒక్క సభ సమర్థంగా పనిచేయలేదని విమర్శకులు పేర్కొంటారు.



ఆదర్శ శాసన నిర్మాణం
* ద్వి సభా విధానంలో ఎగువ సభ ఉన్నత వర్గాల వారికి, సంప్రదాయ వాదులకు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారు ఆదర్శ భావాలతో కూడిన శాసన నిర్మాణానికి ఆటంకం కలిగించవచ్చు.
* ఏకసభా విధానంలో దిగువ సభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరు సాధారణంగా ప్రజలకు ఉపకరించే శాసనాలను మాత్రమే రూపొందిస్తారు. లేకపోతే తదుపరి ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది.

ప్రతిష్టంభన ఉండదు
* ద్వి సభా విధానంలో ఒక సభ ఆమోదించిన బిల్లుకు రెండో సభలో ఏ దశలోనైన ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏకసభా విధానంలో దిగువ సభ ఒకే లక్ష్యంతో తన విధులను సాధించడానికి ప్రయత్నించడం వల్ల ప్రతిష్టంభనకు అవకాశం ఉండదు.
* ద్వి శాసనసభా నిర్మాణం, నిర్వహణతో పోల్చినట్లయితే ఏకసభా నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది.
* 1950లో న్యూజిలాండ్, 1954లో డెన్మార్క్ దేశాలు తమ దేశంలోని ద్విసభా విధానాన్ని రద్దు చేసుకుని ఏకసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
* 'ఏకసభా విధానం సరళమైంది మాత్రమే కాకుండా, పౌరులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అధికారికంగా తమకు ప్రాతినిధ్యం కల్పించుకుంటారు' అని ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త విల్లోభి పేర్కొన్నారు.

 

ఏకసభా విధానం - లోపాలు

నియంతృత్వం దిశగా పయనం
* ఏకసభా విధానంలోని సభ్యులు నియంతృత్వంతో వ్యవహరిస్తూ, తమకు అనుకూలమైన శాసనాలను మాత్రమే రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎగువసభ ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో దిగువసభ ఇష్టానుసారంగా శాసనాలను రూపొందించే ప్రమాదం ఉంది.

తొందరపాటు, అనాలోచిత నిర్ణయాలు
* ఏకసభా విధానంలో పెద్దగా అనుభవం లేని యువకులు భావోద్వేగాలను నియంత్రించుకోలేక తొందరపాటు నిర్ణయాలతో శాసనాలను రూపొందించుకోవడం వల్ల ప్రజలకు లాభం కంటే నష్టాలే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దేశ విశాల ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలే లక్ష్యంగా శాసనాలు రూపొందించే అవకాశం ఉంది.

 

శాసనాల్లో నాణ్యత లేమి
* ఏకసభా విధానంలో రూపొందించిన శాసనాల్లో సమగ్రత లోపించి, లోపభూయిష్ఠమైన విధానాలను చట్టాలుగా చేసే అవకాశం ఉంది. ప్రజాప్రయోజనాల కోసం రూపొందించే శాసనాల్లో నాణ్యత ఉండకపోవచ్చు.
* ఏకసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్న అనేక దేశాలు అనతి కాలంలోనే ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏకసభా విధానంలో అనేక లోపాలున్నాయని వెల్లడవుతుంది.

 

ద్విసభా విధానం
* శాసన నిర్మాణంలో రెండు సభలు ఉంటే దాన్ని ద్విసభా విధానం అంటారు.
అవి: 1) ఎగువ సభ 2) దిగువ సభ
* ద్విసభా విధానంలో దిగువ సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం వల్ల, ప్రభుత్వ ఖర్చులను మంజూరు చేసే అధికారంతోపాటు, ప్రభుత్వాన్ని నియంత్రించే అధికారం కూడా దిగువ సభకే ఉంటుంది. రెండు సభల్లోకెల్లా దిగువ సభయే శక్తిమంతమైంది.

ద్విసభా విధానం - ఎగువ సభ సభ్యుల నియామక పద్ధతులు
* అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఎగువ సభ అయిన సెనేట్‌కు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
* మనదేశంలో రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల శాసన సభ్యులు పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు.
* మనదేశంలో కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
* కెనడాలో వివిధ రంగాల్లోని ప్రముఖులను జీవితకాలానికి గవర్నర్ జనరల్ ఎగువ సభ సెనేట్‌కు నామినేట్ చేస్తారు.
* బ్రిటన్‌లోని ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌ కు కొంతమంది ప్రతినిధులను రాజు లేదా రాణి నియమిస్తారు. సభ్యుల మరణానంతరం అతడి సంతతికి చెందిన వారసులను వారసత్వ సూత్రం ప్రకారం కొనసాగిస్తారు.
* సాధారణంగా పెద్ద రాజ్యాలు, సమాఖ్య వ్యవస్థ ఉన్న రాజ్యాలు తమ చట్టాలను రూపొందించుకోవడానికి ద్విసభా విధానాన్ని అనుసరిస్తున్నాయి.

 


 

ద్విసభా విధానం - ప్రయోజనాలు
* జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం ప్రకారం తొందర పాటుతో దిగువ సభ తీసుకున్న నిర్ణయాలపై ఎగువసభ ఒక బ్రేకులా పని చేస్తుంది.
* అనాలోచితంగా, తొందరపాటుతో దిగువ సభ సభ్యులు తీసుకున్న నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో అనర్థాలకు దారితీయవచ్చు. కాబట్టి ఎగువ సభ సభ్యులు తమ అనుభవంతో దిగువ సభ సభ్యుల తొందరపాటు నిర్ణయాలను నియంత్రిస్తారు.
* దిగువసభ చేసే అపరిపక్వమైన నిర్ణయాలను ఎగువసభ తన మితవాద వైఖరితో నియంత్రిస్తుంది.
* మేధావులు, విజ్ఞాన వేత్తలు, నిపుణులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. వీరికి ఎగువసభలో ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారి సేవలను జాతి ప్రగతి కోసం వినియోగించవచ్చు.
* బ్రిటన్‌లో ప్రధాని సిఫారసుల మేరకు సాహితీవేత్తలను, సేవా తత్పరత ఉన్నవారిని బ్రిటన్ రాజు/రాణి ఎగువసభ అయిన ప్రభువుల సభకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.
* మన దేశంలో సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సంఘసేవల్లో విశిష్ట స్థానం సంపాదించిన 12 మంది వ్యక్తులను ఎగువసభ అయిన రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
* ద్విసభా విధానంలో రెండు సభల మధ్య అధికారాలు విభజించడం వల్ల ప్రజల స్వేచ్ఛకు, అల్పసంఖ్యాకుల స్వాతంత్య్రానికి రక్షణ లభిస్తుంది.
* మొదటి సభ నియంతృత్వాన్ని రెండో సభ నియంత్రిస్తుందని జె.ఎస్. మిల్ పేర్కొన్కారు.

* సమాజంలోని అన్ని వర్గాల వారికి ద్విసభా విధానం తగిన ప్రాతినిధ్యం కల్పిస్తుందని బ్లంట్‌ష్లీ పేర్కొన్నారు.
* ద్విసభా విధానంలో దిగువసభతో పాటు ఎగువసభ కూడా శాసన నిర్మాణ బాధ్యతను వహించడంతో దిగువసభకు పనిభారాన్ని తగ్గించడం ద్వారా ఎగువసభ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది.
* ద్విసభా విధానంలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* ఎగువసభలో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించడం వల్ల సమాఖ్య స్ఫూర్తి వర్థిల్లుతుంది.
* రాజకీయ అనిశ్చిత సమయంలో దిగువసభ రద్దయినప్పటికీ ఎగువసభ తన విధులను నిర్వహించడం ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడటానికి కృషి చేస్తుంది.
* ప్రారంభంలో ఏకసభను ఏర్పాటు చేసుకున్న అనేక దేశాలు తర్వాత ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాయని మెరియట్ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్నారు.

 

ద్విసభా విధానం - లోపాలు
* ద్విసభా విధానం ఏర్పాటు, నిర్వహణ వల్ల ఎక్కువ ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
* ఈ విధానంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోతుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా తన పటిష్ఠతను కోల్పోవడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ప్రతిష్టంభన ఏర్పడవచ్చు.
* ఎగువసభ సభ్యులు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవకుండా, ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం పరోక్ష పద్ధతి ద్వారా నామినేట్ అవుతారు. వీరు ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించరు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం.

* నామినేషన్ విధానంలో నియమితులైన సభ్యులు అభివృద్ధి నిరోధక శక్తులుగా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
* ద్విసభా విధానంలో ఒక బిల్లును శాసనంగా రూపొందించే సందర్భంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది. దీనివల్ల అనవసర కాలయాపన జరుగుతుంది.
* ఉభయసభలకు సమాన అధికారాలు ఉండక పోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎగువసభ అలంకారప్రాయంగా మిగిలిపోతుంది.
ఉదా: ఆర్థిక బిల్లులు
* ఎగువసభ పెట్టుబడిదారీ వర్గాలకు, సంప్రదాయ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దిగువసభ నిర్వహించే కార్యకలాపాలకు ప్రతిబంధంగా మారుతుంది.
* సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఎగువసభ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు.
* జెర్మి బెంథామ్, హెచ్.జె. లాస్కి, బెంజిమన్ ఫ్రాంక్లిన్, శామ్యూల్ ఆడమ్స్ లాంటి ప్రముఖులు ఏకసభా విధానాన్ని సమర్థిస్తూ, ద్విసభా విధానాన్ని వ్యతిరేకించారు.

 

దత్త శాసనాధికారం/నియోజిత శాసనం (Deligated Legislation)
* శాసన నిర్మాణ సభ కార్యనిర్వాహక వర్గానికి ప్రసాదించే శాసన నిర్మాణాధికారాన్ని నియోజిత శాసనం లేదా దత్త శాసనాధికారం అంటారు. దీనివల్ల కార్యనిర్వాహక వర్గం అధికారాలు, బాధ్యతలు పెరిగాయి.
* శ్రేయోరాజ్య భావన వల్ల ప్రస్తుతం రాజ్య విధులు విస్తృతంగా పెరిగాయి. పరిమిత కాలం ఉండటం వల్ల ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమగ్రమైన చట్టాలు, నియమ - నిబంధనలను రూపొందించడం పరిమిత కాలరీత్యా శాసనసభకు సాధ్యం కావడం లేదు.
* శాసన నిర్మాణ సభలు చట్టాల స్థూల రేఖా బిల్లులను మాత్రమే రూపొందించి, మిగిలిన అధికారాన్ని లేదా బాధ్యతను కార్యనిర్వాహక వర్గానికి అప్పగిస్తున్నాయి.

దత్త శాసనాధికారం - ప్రయోజనాలు
* క్షేత్రస్థాయిలో కార్యనిర్వాహక వర్గానికి మంచి అవగాహన ఉండటంతో వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన చేయగల్గుతుంది.
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు, చేర్పులను కార్యనిర్వాహక శాఖ సమర్థంగా చేస్తుంది.
* శాసన నిర్మాణ సమయం ఆదా అవుతుంది.
* శాసన సభ కొన్ని సందర్భాల్లో సమావేశంలో ఉండదు. అలాంటి సందర్భంలో శాసన సభ ఏవైనా విధానపరమైన చర్యలను తీసుకోవాల్సి వస్తే కార్యనిర్వాహక వర్గమే వాటిని నియంత్రిస్తుంది.
* శాసన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాల్సిన అవసరం శాసన సభకు ఉండకపోవడం వల్ల అది రాజ్యానికి సంబంధించిన ముఖ్య సమస్యలపై దృష్టి సారించగలదు.

 

దత్త శాసనాధికారం - లోపాలు
* కార్యనిర్వాహక వర్గం నియంతృత్వ పోకడతో, అవినీతి కార్యకలాపాలకు పాల్పడవచ్చు.
* ప్రజాస్వామ్యం మౌళిక భావన ప్రకారం శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించాలి. కానీ దత్త శాసనాధికారం వల్ల కార్యనిర్వాహక వ్యవస్థే శాసన వ్యవస్థను నియంత్రిస్తుంది.
* అధికార పృథక్కరణ (Separation of Powers) కు వ్యతిరేకంగా ఉంటుంది.
* ప్రభుత్వరంగాల్లో ఎవరి విధిని వారే నిర్వహించాలి. ఒకదానికి కేటాయించిన విధిలో మరొక యంత్రాంగం జోక్యం చేసుకుంటే అసలు లక్ష్యం దెబ్బతింటుంది.
* జాన్ మరియట్ అభిప్రాయం ప్రకారం శాసనాధికారాలను కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేయడం అనేది ఒక నవ్య నియంతృత్వానికి దారితీస్తుంది.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వం - ముఖ్య లక్షణాలు
* ప్రభుత్వాంగాలైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలుగా వర్గీకరిస్తారు.
* శాసన శాఖకు, కార్యనిర్వాహక శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది.
* పార్లమెంటరీ విధానంలో శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి దాని విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో ఉంటుంది.
* పార్లమెంటరీ ప్రభుత్వాలకు పుట్టినిల్లు బ్రిటన్.
* పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాలైన అధిపతులు ఉంటారు. వీరిలో రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటారు. వీరినే DeJure సార్వభౌమాధికారి అంటారు. మొత్తం అధికారాలు వీరి పేరుమీదనే నిర్వహిస్తారు. కాబట్టి వీరిని చట్టపర అధిపతి అంటారు.
* పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తుంది. ప్రభుత్వాధినేత అయిన ప్రధానిని Defacto సార్వభౌమాధికారి అంటారు.
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాజ్యాధినేత అయిన రాష్ట్రపతికి, శాసన శాఖకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
* ఈ విధానంలో ప్రధానమంత్రి కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తూ, సర్వాధికారాలు చెలాయిస్తారు. అందుకే దీన్ని కేబినెట్ తరహా లేదా ప్రధానమంత్రి తరహా ప్రభుత్వ విధానం అంటారు.

అధ్యక్షతరహా ప్రభుత్వ లక్షణాలు
* మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలోని అధికార పృథక్కరణ సిద్ధాంతంలో ఉన్న మౌలికాంశాలన్నీ అధ్యక్షతరహా విధానాన్ని తెలియజేస్తున్నాయి.
* అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు.
* కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
* అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అధ్యక్షతరహా విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో మంత్రులు శాసనసభలో సభ్యులుకారు.
* అధ్యక్షతరహా విధానంలో అధ్యక్షుడికి నిర్ణీత పదవీకాలం ఉంటుంది. అధ్యక్షుడు శాసన శాఖకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
* అధ్యక్షుడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీల్లేదు.
* ఈ విధానంలో దేశాధినేత, ప్రభుత్వాధినేతగా ఒక్కరే కొసాగుతారు. మొత్తం అధికారాలన్నీ అధ్యక్షుడి పరిధిలోనే ఉంటాయి.
* వివిధ రాజకీయ భావజాలం ఉన్నవారు కూడా అధ్యక్షతరహా విధానంలో మంత్రులుగా కొనసాగవచ్చు. అధ్యక్షుడు తన విచక్షణ మేరకు మంత్రి మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు.
* ఈ విధానంలో మంత్రులు అధ్యక్షుడికి కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు. మంత్రులకు అధ్యక్షుడితో సమాన హోదా ఉండదు.
* ఈ విధానాన్ని బాధ్యతారహిత ప్రభుత్వ విధానం అనికూడా అంటారు. భారత రాజ్యాంగ నిర్మాతలు భారత్‌లో పార్లమెంటరీ తరహా విధానాన్ని ప్రతిపాదించారు. దీనిలో బాధ్యతాయుత ప్రభుత్వ విధానం ఉంటుంది.
* వివిధ వైవిధ్యాలున్న భారత్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించాలంటే పార్లమెంటరీ వ్యవస్థ అనువైంది.
* రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులైన ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ భారత్‌లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించి సమర్థించారు.
బీ కె.టి. షా, కె.ఎమ్. మున్షీ భారత్‌లో అధ్యక్షతరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర కార్యనిర్వాహక శాఖ

 భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, విధివిధానాలను  ఆర్టికల్స్ 52 నుంచి 151 మధ్య వివరించారు. మన దేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటు దేశానికి అవసరమైన చట్టాలను రూపొందిస్తే... కార్యనిర్వాహక శాఖ అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చట్టాలను అమలుపరుస్తాయి. న్యాయశాఖ అయిన సుప్రీంకోర్టు శాసన, కార్యనిర్వాహక శాఖలు నిర్వర్తించే విధులు రాజ్యాంగబద్దంగా ఉండేలా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుంది.
 

A. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తున్నాయి. కార్య నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.

రాష్ట్రపతి
  రాజ్యాంగంలోని 52 - 62 వరకు ఉన్న 11 ప్రకరణలు రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు, షరతులు, ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు తదితర అంశాలను వివరిస్తున్నాయి.
* మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణాధికారులు ఉంటారు.
1. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉండి, భారత దేశానికి రాజ్యాంగ రీత్యా అధిపతిగా వ్యవహరిస్తారు.
2. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలు చెలాయిస్తుంది.
* దేశ పరిపాలనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషించినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది.

 

ఆర్టికల్ 52
* భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు.  దేశాధినేత, రాజ్యాంగ అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు.

ఆర్టికల్ 53
* దేశ కార్యనిర్వహణాధికారాలను రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరిట నిర్వహించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు. రాష్ట్రపతి పరిపాలనను స్వయంగా లేదా, ఇతర అధికారుల సహకారంతో నిర్వహిస్తారు.

 

ఆర్టికల్ 54
* రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.

 

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు
* లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు - 543
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు - 233
* దేశంలోని 31 విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ఏలు - 4,120
* 70వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎంఎల్ఏలను ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా చేర్చారు. ఈ చట్టం 1995, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా ఓటును వినియోగించుకున్నారు.

ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
* లోక్‌సభకు నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్లు - 2
* రాజ్యసభకు నామినేట్ అయిన విశిష్ట వ్యక్తులు - 12
* రాష్ట్రాల విధానసభలకు నామినేట్ అయ్యే ఆంగ్లో ఇండియన్లు - 31
* రాష్ట్రాల విధాన పరిషత్‌లకు ఎన్నికైన ఎంఎల్‌సీలు - 7
* రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష విధానంలో నిర్వహిస్తుంది.

 

ఆర్టికల్ 55
* రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది.
* రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
* భారత రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీన్నే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక అని కూడా అంటారు. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు.
* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కొన్ని సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను
నిర్వహించవచ్చు.

* రాష్ట్ర శాసనసభ రద్దవడం, పార్లమెంటులో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణాలతో రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.
*1967లో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఆర్టికల్ 356(1)(C) ప్రకారం రాజస్థాన్ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికీ, ఆ శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వినియోగించుకున్నారు
* 1974లో గుజరాత్ శాసనసభ రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహాను కోరినప్పుడు ఎన్నికను నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది.
* రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
* 1950లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్ వ్యవహరించారు.
* 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.డి.టి.ఆచారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ వి.కె.అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 1971 జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రపతి ఎన్నికలో ఎంఎల్ఏ, ఎంపీల ఓటు విలువను లెక్కిస్తున్నారు.
* ఎక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
   ఉత్తర్‌ప్రదేశ్ = 208, తమిళనాడు = 176, మహారాష్ట్ర = 175
* తక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
    సిక్కిం = 7, అరుణాచల్‌ప్రదేశ్ = 8, మిజోరం = 8, నాగాలాండ్ = 9
*  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్ఏ ఓటు విలువ = 148
*  విభజనానంతరం ఏపీలో ఎంఎల్ఏ ఓటు విలువ = 158
* తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ఏ ఓటు విలువ = 133
*  మన దేశంలో అన్ని రాష్ట్రాల మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474

రాష్ట్రాలవారీగా ఓట్లు, ప్రతి రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ

ఓటు బదలాయింపు పద్ధతి:

* ఓటు బదలాయింపు పద్ధతిని తొలిసారిగా ప్రస్తావించినవారు థామస్ హేర్. అందుకే దీన్ని హేర్ పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిని డెన్మార్క్‌లో ఆండ్రే అనే వ్యక్తి మొదటిసారి అమలు పరచడం వల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ఓటు బదలాయింపు పద్ధతిని ప్రతిపాదించారు.
 


* 2012లో జరిగిన 13వ రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓటు విలువ = 708

* మన దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓట్ల విలువ, మొత్తం ఎంపీల ఓట్ల విలువకు సమానంగా ఉండటం సమాఖ్య విధానాన్ని ప్రతిఫలిస్తోంది.
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల సంఖ్య = 4,120
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474
దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య = 776
* దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల ఓటు విలువ = 5,49,408
* 50 శాతం మించి ఓట్లను అంటే కోటా ఓట్లను ఏ అభ్యర్థీ పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యతా ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
* 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం ద్వారా గెలిచిన వ్యక్తి వి.వి.గిరి. ఈ ఎన్నికలో సి.డి.దేశ్‌ముఖ్ రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం వల్ల వి.వి.గిరి గెలిచారు.
* రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించినవారు హెచ్.వి.కామత్, కె.టి.షా.
* ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని పేర్కొన్నవారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ.
* మన దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించినవారు కె.టి.షా.


రాష్ట్రపతి ఎన్నిక - వివాదాలు - పరిష్కారం
ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది.
* రాష్ట్రపతి ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ ఎలక్టోరల్ కాలేజీలోని కనీసం 25 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేయాలి.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కింద పేర్కొన్న మార్పులను రాష్ట్రపతి ఎన్నిక విధానంలో వచ్చే వివాదాల్లో చేర్చారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయనే కారణంపై ఎన్నికను వాయిదా వేయమని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు.
* పార్లమెంటు ఒక చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగ పరిధికి లోబడి నిర్ణయించవచ్చు.
* సస్పెండ్ అయిన ఎంఎల్ఏ, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనవచ్చు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే, వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి.
* రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు, ఎంఎల్ఏలకు నిర్దేశించిన విధంగా ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. దీనికి కారణం ఈ ఎన్నికలు శాసనసభ బయట జరుగుతాయి. విప్ శాసనసభలో జరిగే తీర్మానాలకు, బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆర్టికల్ 56: రాష్ట్రపతి పదవీ కాలం
* సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ కింది సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చు.
A. మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు
B. దీర్ఘకాలిక అస్వస్థతకు గురైనప్పుడు
C. అకాల మరణం చెందినప్పుడు
D. రాజీనామా చేసినప్పుడు
* భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.
* 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి.


ఇంటరెగ్నం:
* రాష్ట్రపతి పదవీ కాలం ముగిసినప్పటికీ, నూతన రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై, ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తికానప్పుడు అంటే నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఇంటరెగ్నం అంటారు.
ఆర్టికల్ 57: రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నిక కావడం
* భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. మన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు.
ఆర్టికల్ 58: అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* లోక్‌సభకు ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలుండాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* దివాలా తీసి ఉండకూడదు.
* ఎంపీ లేదా ఎంఎల్ఏగా ఉన్న అభ్యర్థి ఆ పదవులకు రాజీనామా చేయకుండానే రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే ఎంపీ లేదా ఎంఎల్ఏ పదవి రద్దవుతుంది. ఓడిపోతే సంబంధిత పదవి కొనసాగుతుంది.
* 1952 నాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.


షరతులు:
*  రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది సభ్యులు బలపరచాలి.
* అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.15,000 ధరావత్తుగా రిజర్వ్ బ్యాంకులో చెల్లించాలి.
*  పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు లభిస్తే డిపాజిట్ (ధరావత్తు) లభిస్తుంది.


ఆర్టికల్ 59: జీతభత్యాలు
* రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్‌లో జీతభత్యాలను పొందుపరిచారు.
* రాష్ట్రపతి వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఐటీ పరిధిలోకి రాదు.
* రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ ప్రవేశపెట్టరాదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూడా రాష్ట్రపతి జీతంలో కోత విధించరాదు.
* ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ.1,50,000.
* పదవీ విరమణ అనంతరం సంవత్సరానికి రూ.9,00,000 పెన్షన్ లభిస్తుంది.
* రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. ఈ భవన రూపకర్తలు ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ ఇక్కడే ఉంది.
* 1921 - 26 మధ్య రాష్ట్రపతి భవన్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలోకి అధికారికంగా మొదట అడుగు పెట్టిన వ్యక్తి లార్డ్ ఇర్విన్.
* రాష్ట్రపతి భవన్‌ను 320 ఎకరాల్లో 340 గదులతో నిర్మించారు. దీన్ని ప్రారంభంలో Vice Regal అని పిలిచేవారు. సామాన్య ప్రజలు దీన్ని లాట్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రైజీనా హిల్స్ (Raisina Hills) అంటారు.
* రాష్ట్రపతికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి.
* విదేశీ పర్యటనల కోసం ఎయిరిండియా వన్ అనే అధికారిక విమానం ఉంది.
* దేశంలో, విదేశాల్లోనూ పర్యటించేటప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు.
* ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి తన పదవీ కాలంలో చేపట్టిన చర్యలకు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
* రాష్ట్రపతిపై క్రిమినల్ కేసు నమోదు చేయకూడదు. సివిల్ కేసు వేయాలన్నా 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి.


ఆర్టికల్ 60: ప్రమాణ స్వీకారం
* రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి లేకపోతే తదుపరి సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తారు.
* రాష్ట్రపతి తన ప్రమాణాన్ని దేవుడి పేరుతో లేదా ఆత్మసాక్షిగా చేస్తారు. రాజ్యాంగ శాసనాన్ని పరిరక్షించి, సంపూర్ణ సామర్థ్యం మేరకు భారత ప్రజల సేవకు, వారి సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు కూడా పైన పేర్కొన్న విధంగానే పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి.


రాష్ట్రపతి రాజీనామా:
* రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు కూడా తెలియజేయాలి. ఇలాంటి పరిస్థితి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ రాజీనామా చేయడంతో ఏర్పడింది.


ఆర్టికల్ 61: మహాభియోగ తీర్మానం
*  రాష్ట్రపతిని రాజ్యాంగ అతిక్రమణ అనే కారణంతో ఆర్టికల్ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు.
*  రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి గ్రహించారు.
*  మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
*  ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే మహాభియోగ ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.
*  తర్వాత మహాభియోగ తీర్మానం రెండో సభకు చేరుతుంది. రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుంచి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.
*  తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ సభ తిరస్కరిస్తే, ఆ తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు.
*  మహాభియోగ తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి, మరొక సభ తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది.
*  రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
*  1971లో వి.వి.గిరిపై తొలిసారిగా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి తర్వాత విరమించుకున్నారు.


ఆర్టికల్ 62
* రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి.
రాష్ట్రపతి అధికారాలు - విధులు
       రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాలను ఎక్కడా వర్గీకరించలేదు. పరిపాలనాంశాల సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను కింది విధంగా విభజించవచ్చు.
1) సాధారణ అధికారాలు     2) అత్యవసర/ అసాధారణ అధికారాలు


1. సాధారణ అధికారాలు
కార్యనిర్వహణాధికారాలు (Executive Powers)
* ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్రపతి దేశ పాలనను స్వయంగా లేదా ఇతర అధికారుల సహాయంతో నిర్వహిస్తారు.
* ఆర్టికల్ 77 ప్రకారం భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదు గానే నిర్వహించాలి. ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
తన కార్యనిర్వహణాధికారాలను నిర్వహించడంలో భాగంగా రాష్ట్రపతి కింద పేర్కొన్న నియామకాలు జరుపుతారు. అవి:
ఆర్టికల్ 75(1) - లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సహచరులను నియమిస్తారు.
ఆర్టికల్ 76(1) - భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌ను నియమిస్తారు.
ఆర్టికల్ 124 - సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 155 - రాష్ట్రాల్లో గవర్నర్లను
ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జరనల్ (కాగ్)ను
ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 263 - కేంద్రం - రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్ రాష్ట్ర మండలిని
ఆర్టికల్ 280 - కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని
ఆర్టికల్ 315 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను
ఆర్టికల్ 316 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 324 - కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర అధికారులను
ఆర్టికల్ 239 - కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను, పరిపాలకులను
ఆర్టికల్ 323 (A) - సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
¤ జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ సమాచార కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


శాసనాధికారాలు:
ఆర్టికల్ 79 - పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు.
ఆర్టికల్ 80 - కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, క్రీడా రంగాల్లో విశిష్ట వ్యక్తులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 331 - లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో  ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తారు. (Summons)
                  పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు.(Prorogue)
                  లోక్‌సభను రద్దు చేస్తారు. (Dissolve)
ఆర్టికల్ 86 - లోక్‌సభ, రాజ్యసభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా సందేశాలను పంపుతారు.
ఆర్టికల్ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ప్రత్యేక/ విశేష ప్రసంగాలను పంపగలరు.
ఆర్టికల్ 99 - పార్లమెంటు సభ్యులు 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతితో నియమితులైన అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆర్టికల్ 103 - పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం.
ఆర్టికల్ 108 - పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన నిర్వహిస్తారు.
ఆర్టికల్ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలుగా మారుతాయి.
ఆర్టికల్ 123 - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌లకు సాధారణ చట్టాలకు ఉండే విలువ ఉంటుంది.
 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం
 పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా)
 6 నెలలు + 6 వారాలు (లేదా)
 7  నెలలు (లేదా) 222 రోజులు.
* పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది.


ఆర్డినెన్స్ - సుప్రీంకోర్టు తీర్పులు
* 1987లో కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ దురుద్దేశంతో జారీ చేసిన ఆర్డినెన్సును న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని పేర్కొంది.
* 1987లో డి.సి.వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన తర్వాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యధాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడి లాంటిదని పేర్కొంది.
ఆర్టికల్ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.
ఆర్టికల్ 95(1) - లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 201 - రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల్లో ఏదైనా రాజ్యాంగబద్ధ సందేహం ఉందని గవర్నర్ భావిస్తే సంబంధిత బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు.


రాష్ట్రపతి వీటో అధికారాలు
* వీటో (Veto) అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫర్బిడ్ (Forbid) అంటారు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం, నిరోధించే అధికారం, నిలుపుదల చేసే అధికారం.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. అవి:


1. అబ్సల్యూట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, కారణంతో లేదా కారణం లేకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు.
ఉదా: 1954లో రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ PEPSU (Pantiala East Punjab States Union) బిల్లు విషయంలో; 1991లో రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లుల విషయంలో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు.
* రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను పార్లమెంట్ లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి ఆమోందించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లుల‌ను గ‌వ‌ర్నర్‌లు రాష్ట్రప‌తి ప‌రిశీల‌నకు రిజ‌ర్వు చేసిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 201 ప్రకారం రాష్ట్రప‌తి వాటిని తిర‌స్కరించ‌వ‌చ్చు. ఈ బిల్లుల‌ను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపిన‌ప్పుడు కూడా వారు దాన్ని త‌ప్పనిసరిగా ఆమోదించాల్సిన అవ‌స‌రం లేదు.


2. సస్పెన్సివ్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా సవరణలు, సూచనలు చేస్తూ, పునఃపరిశీలనకు తిరిగి వెనుకకు పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అంటారు.
* ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2006లో జోడు పదవుల బిల్లుల విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించుకున్నారు.
* కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ రెండోసారి అవే బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడం ద్వారా వాటికి సస్పెన్సివ్ వీటోను రద్దు చేయవచ్చు.


3. పాకెట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినేట్ లేదా పార్లమెంట్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా, ఎలాంటి నిర్ణయం తెలపకుండా వాటిని తన దగ్గరే పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు.
ఉదా: 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్‌ను అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్ పాకెట్‌వీటోకు గురిచేశారు. సుమారు 18 నెలలపాటు బిల్లును తన వద్దే పెట్టుకున్నారు.


4. క్వాలిఫైడ్ వీటో
* ఈ వీటో అధికారం 'భారతరాష్ట్రపతి'కి లేదు.
* అమెరికా అధ్యక్షుడికి ఈ రకమైన అధికారం ఉంటుంది.
* అమెరికా అధ్యక్షుడు వీటో చేసిన అంశాన్ని అమెరికా శాసన వ్యవస్థ 10 రోజుల నిర్ణీత గడువులోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో మాత్రమే రద్దు చేసే వీలుంటుంది.
రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు
* ఆర్టికల్, 3 ప్రకారం - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు.
* ఆర్టికల్, 109 ప్రకారం - ద్రవ్య బిల్లులు
* ఆర్టికల్, 112 ప్రకారం - బడ్జెట్
* ఆర్టికల్, 31(A) ప్రకారం - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
* ఆర్టికల్, 19(1)(G) ప్రకారం - వ్యాపార వాణిజ్య, స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు
* ఆర్టికల్, 117 ప్రకారం - మొదటి రకమైన ఆర్థిక బిల్లులు
* ఆర్టికల్, 349 ప్రకారం - జాతీయ అధికార భాషలో చేసే మార్పులు, చేర్పులకు సంబంధించిన బిల్లులు
* ఆర్టికల్, 368 ప్రకారం - రాజ్యాంగ సవరణ బిల్లులు


ఆర్థిక అధికారాలు:
* ఆర్టికల్, 117 - పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి
* ఆర్టికల్, 112 - ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 151 - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్రప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఆర్టికల్, 292 - భారత ప్రభుత్వం విదేశీరుణాలు సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
* ఆర్టికల్, 265 - నూతన పన్నులు వసూలు చేసే బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 267 - భారత ప్రభుత్వం ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి ఆయన అనుమతితో నగదును తీసుకోవాలి.
* ఆర్టికల్, 280 - మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సిఫారసు చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని  5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.


దౌత్యాధికారాలు:
* భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు కృషిచేయడం.
* అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం.
* మిత్ర దేశాలకు భారతదేశం తరపున రాయబారులను నియమించడం, మిత్రదేశాల నుంచి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరించడం.
* మనదేశం తరపున ప్రతినిధులను ఐక్యరాజ్యసమితి (UNO) కి నియమించడం.
* మనదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులను, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిచడం.


సైనిక అధికారాలు
* ఆర్టికల్, 53(2) ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వసైన్యాధిపతి, త్రివిధ దళాలకు అధిపతి.
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.
* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించేది, శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేసేది రాష్ట్రపతి మాత్రమే.
* మనదేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతుంది.
* రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రిస్తారు. ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని నియమిస్తారు.


న్యాయాధికారాలు:
* ఆర్టికల్, 72 ప్రకారం రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి మొత్తం 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు. అవి:
1. పార్డన్ (Absolving entire Punishment):
* న్యాయ స్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దు చేసి, క్షమాభిక్షను ప్రసాదించడం.
2. రెమిషన్ (Reduction of Sentence)
* శిక్షాస్వభావాన్ని మార్చకుండా శిక్షాకాలాన్ని తగ్గించడం.
3. కమ్యుటేషన్: (Changing Nature of Sentence)
* శిక్షాకాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం.
ఉదా: రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా మార్చారు.
4. రిప్రైవ్: (Postponement of Sentence)
* శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
5. రెస్పైట్: (Providing Relief)
* ముద్దాయి ప్రత్యేక పరిస్థితులను పరిగిణనలోకి తీసుకుని దీన్ని ప్రసాదిస్తారు.
ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యత కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణి అయినప్పుడు ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది.
క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్షకు గురవుతాయా?
* రాష్ట్రపతి గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలను న్యాయ సమీక్షకు గురిచేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గౌరు వెంకట్ రెడ్డి కేసులో ఆర్జిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 2006లో పేర్కొంది.
దేవేందర్‌పాల్ సింగ్ దిల్లార్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా ధరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై భారత రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలుపకపోతే మరణశిక్షను యావజ్జీవ కారగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.
* ఉరిశిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు వర్తించవు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహామేరకు మాత్రమే రాష్ట్రపతి న్యాయాధికారాలను వినియోగించాలి.


రాష్ట్రపతి - ప్రత్యేక రక్షణలు
* ఆర్టికల్, 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు, మినహాయింపులు ఇచ్చారు.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా అతడిని అరెస్ట్ చేయకూడదు, ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు.
* రాష్ట్రపతిపై సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలలు ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై దేశంలో ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు; రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు; రాష్ట్రాల లోకాయుక్తలను నియమించేది గవర్నర్లు అయినప్పటికీ వారిని తొలిగించేది మాత్రం రాష్ట్రపతి.
* ఆర్టికల్, 244 ప్రకారం మనదేశంలో ఆదివాసీ ప్రాంతాలు, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.


రాష్ట్రపతి  అత్యవసర పరిస్థితి  అధికారాలు
* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థతి అధికారాలను వివరించారు.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభత్వ చట్టం నుంచి అత్యవసర పరిస్థితి అధికారాలను గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించేటప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుంచి గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ జీవించే హక్కును రద్దుచేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు.
* రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను పొందుపరచాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. కృష్ణమాచారి ప్రతిపాదించారు.
* అత్యవసర పరిస్థితి అధికారాలను పూర్తిగా వ్యతిరేకించిన వారిలో హెచ్.వి. కామత్, కె.టి. షా, సి.డి. దేశ్‌ముఖ్ కీలకమైనవారు.
* అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణ..... లాంటివి పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
భారత రాజ్యాంగంలో 3 రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్నొన్నారు. అవి:
1. జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ఆర్టికల్, 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (Constitutional Emergency) ఆర్టికల్, 356 (రాష్ట్రపతి పాలన)
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergnecy) ఆర్టికల్, 360


జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352
     జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు. అవి:
A. బాహ్య కారణాలు:
* మన దేశంపై విదేశీ దాడి లేదా మనదేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
B. ఆంతరంగిక కారణాలు:
* దేశంలో ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
* 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆంతరంగిక అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి, సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ 352(7) లో చేర్చి, కేంద్ర కేబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని పేర్కొన్నారు.
* కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు కానీ కేంద్ర కేబినెట్ రెండోసారి అమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయసభలు నెలరోజుల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. (ఇంతకు ముందు పార్లమెంటు 2 నెలల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మోజార్టీతో ఆమోదించాలని ఉండేది.)
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే నాటికి ఒకవేళ లోక్‌సభ రద్దయితే, దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కానీ నూతన లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలలకు ఒకసారి చొప్పున గరిష్ఠంగా ఎన్నిసార్లయినా, ఎంతకాలమైనా విధించవచ్చు, పొడిగించవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - రద్దు
* రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే దీన్ని రద్దు చేయవచ్చు.
* పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా దీన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు మంది సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు/రాష్ట్రపతికి అందజేయాలి.
* 14 రోజుల ముందు ఇచ్చే ఈ నోటీసు ప్రకారం లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధారణ మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దుచేయవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - పరిణామాలు
* రాష్ట్ర జాబితాతోసహా అన్ని జాబితాల్లోని అంశాలపై కేంద్రమే శాసనాలు రూపొందిస్తుంది.
* కేంద్ర కార్యనిర్వహక వర్గం అధికారాలు విస్తృతం అవుతాయి.
* ఆర్టికల్, 353 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసే పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* ఆర్టికల్, 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన చట్టాలు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల అనంతరం ఈ చట్టాలు వాటంతటవే రద్దు అవుతాయి.
* ఆర్టికల్, 354 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థిక పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* లోక్‌సభ, రాష్ట్రాల శాసనభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు.
* 5వ లోక్‌సభ పదవీకాలం 1976, మార్చి 18తో ముగిసింది. అదే సమయంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977, జనవరి 18న రద్దు చేశారు. 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది.
* రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని కూడా పార్లమెంటు ఒక ఏడాది పాటు పొడిగించవచ్చు.
* 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసన సభ పదవీ కాలాన్ని 1977 నుంచి 1978 వరకు ఒక సంవత్సరంపాటు పొడిగించారు.
* ఆర్టికల్, 358 ప్రకారం ఆర్టికల్, 19 సహజంగానే సస్పెండ్ అవుతుంది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విదేశీ కారణాలతో  జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్, 19 సహజంగా రద్దు అవుతుంది. ఆంతరంగిక కారణాల ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్, 19 సహజంగా సస్పెండ్ కాదని, రాష్ట్రపతి జారీచేసే ప్రత్యేక ప్రకటన ద్వారా మాత్రమే సస్పెండ్ చేస్తారని దీన్ని పార్లమెంటు ఆమోదించాలని నిర్దేశించారు.
* ఆర్టికల్, 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్ 20, 21 లలో పేర్కొన్న హక్కులను మినహాయించి, మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.
* ఉన్నత న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకోసం ఆర్టికల్, 32 ప్రకారం సప్రీంకోర్టు; ఆర్టికల్, 226 ప్రకారం హైకోర్టులు రిట్స్ జారీచేసే అధికారాలపై పార్లమెంటు చట్టబద్ధ పరిమితులను విధించవచ్చు.


మనదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు
1. 1962, అక్టోబరు 26 - 1968, జనవరి 10 మధ్య మనదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
2. 1971, డిసెంబరు 3 - 1977, మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి, కొనసాగించారు.
* 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమవడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
3. 1975, జూన్ 25 - 1977, మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, కొనసాగించారు.
* 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నివారించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సంభవించినప్పటికీ ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేదు. దీనికి కారణం 1962లో విధించిన అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగడమే.
* 1975 నుంచి 1977 మధ్య ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు.
* 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352కు సవరణ చేసి, ఒకే సమయంలో రెండు రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే వీలును కల్పించారు.

 

ఆర్టికల్ - 358, ఆర్టికల్ - 359 మధ్య వ్యత్యాసం

ఆర్టికల్, 358 ఆర్టికల్, 359
1. దీని ప్రభావం ఆర్టికల్, 19లో ప్రస్తావించిన
వ్యక్తిగత స్వేచ్ఛలకు మాత్రమే పరిమితం.
1. దీని ప్రభావం అన్ని ప్రాథమిక హక్కులకు వర్తిస్తుంది.
2. దీని ప్రభావం బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితికే పరిమితం. 2. ఇది ఆంతరంగిక, బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.
3. దీని ప్రభావం దేశం మొత్తానికి వర్తిస్తుంది. 3. దీని ప్రభావం దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.
4. అత్యవసర పరిస్థితి ఉన్నంతవరకు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. 4. రాష్ట్రపతి నిర్ణయించిన సమయం వరకు మాత్రమే
ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల అమలు రద్దు చేయకపోవచ్చు.

జ్యాంగ అత్యవసర పరిస్థితి - రాష్ట్రపతి పాలన (ఆర్టికల్, 356)
* ఆర్టికల్, 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగపరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ఆర్టికల్, 356(1) ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్, 356 ద్వారా విధిస్తారు.
రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?
  * ప్రభుత్వం పనిచేయకపోవడం.
  * శాంతిభద్రతలు క్షీణించడం.
  * ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
  * రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడం.
  * ప్రభుత్వమే ఏర్పడకపోవడం.
  * ఆర్టికల్, 365 ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం.
» రాష్ట్రపతి పాలనను పార్లమెంటు 2 నెలల్లోగా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
» ఆర్టికల్, 356(3) ప్రకారం ఒకవేళ రాష్ట్రపతిపాలన విధించే సమయానికి లోక్‌సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పాటైన నెలరోజుల్లోగా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
* పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదం ద్వారా 6 నెలలకు ఒకసారి చొప్పున రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.
» 1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలనను విధించాలని, ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు.
* రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపినప్పుడు కేంద్ర కేబినెట్ అదే అంశాన్ని రెండోసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి.
ఉదా: అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ బిహార్‌లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని చేసిన సిఫారసును రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు. అదే సిఫారసును కేంద్ర కేబినెట్ రెండోసారి పంపడంతో కె.ఆర్. నారాయణన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది.
* రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది.
ఉదా: బిహార్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఆర్టికల్, 356(5) ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగాలంటే..
     44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి:
* దేశంలో లేదా రాష్ట్రాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి.
* సంబంధిత రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడం సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
* 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను పొడిగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదా: పంజాబ్‌లోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 59, 64, 68 రాజ్యాంగ సవరణల ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలనను 5 ఏళ్ల వరకు పొడిగించారు.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా లేదా పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా రాష్ట్రపతి పాలనను రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - పర్యవసానాలు
* రాష్ట్రప్రభుత్వాన్ని (మంత్రి మండలి) రద్దు చేయవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేసినట్లయితే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
* రాష్ట్ర విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచితే, దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంది.
ఉదా: జమ్మూకశ్మీర్ విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఆర్టికల్, 356 ప్రకారం అక్కడ రాష్ట్రపతి పరిపాలనను విధించి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ), బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడంతో రాష్ట్ర శాసనసభను పునరుద్ధరించారు.
* రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
* రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం ఆర్డినెన్స్ రూపంలో వెలువరిస్తారు.
* రాష్ట్రపతి పాలనను గవర్నర్ రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు. గవర్నర్‌కు రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఉంటాయి.
* గవర్నర్‌కు తన విధి నిర్వహణలో సహాయాన్ని, సలహాలను అందించడానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు.
» ఆర్టికల్, 357(2) ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే, అవి రాష్ట్రపతి పాలన రద్దు అయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ చట్టాలను రాష్ట్ర శాసన సభ కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - న్యాయ సమీక్ష
» 38వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్, 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
» మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షకు అతీతం కాదని నిర్దేశించారు.
ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994)
» ఈ కేసులో సుప్రీం కోర్టు రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. అవి
  * భారత సమాఖ్యకు భంగం కలిగించే విధంగా ఆర్టికల్, 356ను ప్రయోగించరాదు.
  * రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర విధాన సభను రద్దు చేయరాదు.
  * రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, విధాన సభను పునరుద్ధరించాలి.
  * రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
  * రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
  * రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభ లోపల మాత్రమే పరీక్షించాలి.
  * లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకిక తత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర  ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయవచ్చు.
  * రాష్ట్రపతి పాలనను దురుద్దేశంగా విధిస్తే, దానికి సమంజసమైన కారణాలు లేకపోతే న్యాయస్థానాలు వాటిని  రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలనా విశేషాలు
* 2015, ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 123 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1951లో పంజాబ్‌లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించారు.
* అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్. 1987, మే 11 - 1992, ఏప్రిల్ 25 వరకు అంటే 4 సంవత్సరాల 9 నెలల 3 రోజులు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రం కర్ణాటక. 1990, అక్టోబరు 10 - 1990, అక్టోబరు 17 వరకు అంటే కేవలం 8 రోజులు మాత్రమే కర్ణాటకలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
* మణిపూర్‌లో 12 , ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 , కేరళలో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
* ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు - ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ.
* 1975 - 77 మధ్య కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 21 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన బి.డి. జెట్టి 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయించారు.
* ఆర్టికల్, 356ను దుర్వినియోగం చేయకుండా 2000 లో వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో అంతర్‌రాష్ట్ర మండలి నుంచి జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పడి పలు సూచనలు చేసింది.
* ఆర్టికల్, 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో ఎం.ఎన్. వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేర్కొంది.

జాతీయ అత్యవసర పరిస్థితికి, రాష్ట్రపతి పాలనకు మధ్య వ్యత్యాసాలు

జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352 రాష్ట్రపతి పాలన - ఆర్టికల్, 356
1. దీన్ని పార్లమెంటు నెలరోజుల్లోగా ఆమోదించాలి. 1. పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాలి.
2. పార్లమెంటు  వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. 2. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా ఆమోదించాలి.
3. దేశం మొత్తం లేదా దేశంలోని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో విధించవచ్చు. 3. రాష్ట్రం మొత్తం విధించాలి.
4. దీన్ని విధిస్తే లోక్‌సభను రద్దు చేయాల్సిన అవసరం లేదు. 4. దీన్ని విధిస్తే రాష్ట్ర శాసనసభను రద్దు చేయ వచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
5. దీన్ని విధిస్తే కేంద్ర మంత్రిమండలి రద్దు కాదు. 5. దీన్ని విధించిన వెంటనే రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవుతుంది.
6. దీన్ని విధిస్తే ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. 6. దీన్ని విధించినప్పటికీ ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయి.
7. గరిష్ఠంగా ఎంతకాలమైనా విధించవచ్చు. 7. గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
1. ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధ విషయంపై టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ సి.ఎం. త్రివేది సిఫారసుల మేరకు 1954, నవంబరు 15 నుంచి 1955, మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
2. ఆంధ్రప్రదేశ్‌లోని జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి. నరసింహా రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ సిఫారసుల మేరకు 1973, జనవరి 11 నుంచి 1973, డిసెంబరు 10 మధ్య 335 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
3. ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం' నేపథ్యంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ సిఫారసుల మేరకు 2014, మార్చి 1 నుంచి 2014 జూన్ 8 మధ్య 3 నెలల 7 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 360
* దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినా, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేకపోయినా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల్లోగా పార్లమెంటు ఆమోదిస్తే ఆరు నెలల వరకు కొనసాగుతుంది. దీన్ని పార్లమెంటు ఆమోదంతో ఆరు నెలలకొకసారి చొప్పున గరిష్ఠంగా ఎంత కాలమైనా విధించవచ్చు.
* లోక్‌సభ, రాజ్యసభల మధ్య ఆర్థిక అత్యవసర బిల్లు ఆమోదం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే అది రద్దవుతుంది. ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన నాటికి లోక్‌సభ రద్దయితే రాజ్యసభ ఆమోదంతో అది కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన , పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రద్దు చేయవచ్చు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - పర్యవసానాలు
* కేంద్రం జారీచేసే ఆర్థిక ఆంక్షలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి.
* కేంద్రం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాల్సిందే.
* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు తగ్గిస్తారు.
* ఆర్టికల్, 275 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించిన చట్టాలు అది రద్దయిన అనంతరం 6 నెలల వరకు అమల్లో ఉంటాయి.
» ఇప్పటి వరకు మనదేశంలో ఒకసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు.

జాతీయ అత్యవసర పరిస్థితి - షా కమిషన్ నివేదిక
* 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి 21 వరకు సుమారు 21 నెలలపాటు ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రతిపక్ష రాజకీయ పార్టీల పట్ల అణిచివేత చర్యలు లాంటివి జరిగాయి.
* వీటిని విచారించేందుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో జయంత్‌లాల్ ఛోటాలాల్ షా
(జె.సి. షా) నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను 1978లో సమర్పించింది.
* ఈ కమిషన్ నివేదికలో తెలిపిన అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* 1980లో 'ఇందిరాను పిలవండి - దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చి, షా కమిషన్ నివేదికను రద్దు చేసింది.


అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యలు
» 'అత్యవసర పరిస్థితులను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపైన జరిపే దోపిడీ లాంటివి' - కె.ఎం. నంబియార్
» 'అత్యవసర పరిస్థితి అధికారాలనేవి మన రాజ్యాంగంలోని అవశ్యక్లేశాలు అంటే అవసరమైన చెడు' -టి.టి. కృష్ణమాచారి
» 'అత్యవసర పరిస్థితులు అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగానికి రక్షక కవచాల లాంటివి' - మహావీర్ త్యాగి
» 'అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగానికి శ్వాసను అందించే మార్గాలు, మృత సంజీవని లాంటివి' - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
» 'భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు' -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఒకవేళ రాష్ట్రపతి అత్యవసర అధికారాలను నిజంగా వినియోగిస్తే, ఆ రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర పరిస్థితి అధికారాల వల్ల రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నియంతగా మారిపోతారు' - అలెన్ గ్రేడ్‌హిల్
» 'డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మరణించారు, కానీ ఆర్టికల్, 356 సజీవంగానే ఉంది' -హెచ్.వి. కామత్
» 'వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కంటే దేశ సార్వభౌమత్వం గొప్పది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఆర్టికల్, 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వులాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేయరు అనే అభిప్రాయాలతో నేను అంగీకరించను. ఆర్టికల్, 356 అనేది మృతాక్షరం (Dead Article)' - డాక్టర్ బి.ఆర్. అంబ్కేడర్
» 'ఆర్టికల్, 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన అనేది కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పావులుగా మారారు' - జస్టిస్ వి. కృష్ణయ్యర్
» 'ఆర్టికల్, 356 అనేది రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం యొక్క కత్తి అంటే ఆ ప్రభుత్వాలను ఎప్పుడైనా వధించవచ్చు' - డి.కె. చటర్జీ

రాష్ట్రపతి - విచక్షణాధికారాలు
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించే సమయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు.
* 1989లో మనదేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్ పార్లమెంట్‌గా అవతరించిన సమయంలో 191 స్థానాలతో కాంగ్రెస్ పెద్దపార్టీగా  ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఏర్పాటుకు  ముందుకు రాకపోవడంతో 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీగా ఏర్పడిన జనతాదళ్‌కు చెందిన వి.పి. సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఆహ్వానించారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. కానీ మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైన వాజ్‌పేయీ 13 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.
» కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశాన్ని కల్పించడం లేదా లోక్‌సభను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునివ్వడం అనేది రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
ఉదా:1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసినప్పుడు చరణ్‌ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చరణ్‌ సింగ్‌ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌సింగ్ పార్లమెంటుకు హాజరుకాకుండానే 23వ రోజున పదవికి రాజీనామా చేశారు.
» చరణ్‌ సింగ్ రాజీనామా అనంతరం బాబూ జగజ్జీవన్‌రామ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు.
» 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం బీజేపీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ 12వ లోక్‌సభను రద్దు చేశారు.
» మన దేశంలో అతి తక్కువ కాలం అంటే 13 నెలలు మాత్రమే పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.
* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రసంగం బదులుగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
* 1999లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలోని 'ఆపద్ధర్మ ప్రభుత్వం' నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ. 125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
* 2006లో లాభదాయక పదవుల బిల్లును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు పంపారు.


రాష్ట్రపతి పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు
» 'మంత్రిమండలి సలహా లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు. రాష్ట్రపతి మంత్రిమండలికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యమైన పాత్రను పోషిస్తారు' - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» 'రాష్ట్రపతి పదవి భారత జాతి నిర్ణయాలను తెలియజేసే ఆమోదముద్ర లాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» '42వ, 44వ రాజ్యాంగ సవరణల అనంతరం రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది' - ఎమ్.పి జైన్
» 'భారత్‌లో పార్లమెంటరీ విధానం ఉండటం వల్ల ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి' - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» 'భారత రాష్ట్రపతులందర్నీ ప్రధానమంత్రి రాష్ట్రపతులుగానే పరిగణించాలి' - టి.ఎన్. శేషన్
» 'భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చింది' - జవహర్‌లాల్ నెహ్రూ
షంషేర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: 1974
» ఈ కేసులో జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని పేర్కొంది.


మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
   పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
* బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
* మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
* ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
* తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
* హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
* రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.


2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
  పదవీకాలం:  1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
* అమెరికా ప్రభుత్వం ప్రసాదించే 'టెంపుల్‌టన్' అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* 8 దేశాల్లో 'విజిటింగ్ ప్రొఫెసర్‌'గా పనిచేశారు.
* ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'ప్రజా దర్బార్‌'ను ఏర్పాటు చేశారు.
*" Hindu View Of Life", "All Idealist View Of Life"అనే గ్రంథాలను రచించారు.
* దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.


3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
  పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
* జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
* మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
* పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
* జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో
(1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
* దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


4. వి.వి. గిరి (1884 - 1980)
  పదవీకాలం:  1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
* వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
* నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
* అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
* రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
* తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
* కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
* బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
* 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
* ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి


5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
  పదవీకాలం:  1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
* ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
* టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
* ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని 'రబ్బర్‌స్టాంప్‌'గా విమర్శకులు పేర్కొన్నారు.
* ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


6. నీలం సంజీవ రెడ్డి (1913 - 1996)
  పదవీకాలం:  1977, జులై 25 నుంచి 1982, జులై 25
* నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
* 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
* లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.


7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 - 1994)
  పదవీకాలం:  1982, జులై 25 నుంచి 1987, జులై 25
* ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై "Pocket Veto"ను వినియోగించారు.
* వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
* 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
* 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non - Aligned Movements) సదస్సు జరిగింది.


8. ఆర్. వెంకట్రామన్: (1910 - 2009)
 పదవీకాలం:  1987, జులై 25 నుంచి 1992, జులై 25
* ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
* అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
* కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
* ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
* పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
* 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
* మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
* 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.


9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 - 1999)
 పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
* ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
* విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
* దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
* 'రాజనీతిజ్ఞ రాష్ట్రపతి'గా పేరుపొందారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.


10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)
   పదవీకాలం:  1997 జులై 25 నుంచి 2002, జులై 25
* ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
* ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
* గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి  కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 - 2015)
  పదవీకాలం:  2002 జులై 25 నుంచి 2007 జులై 25
* ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
* ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
* భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
* భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
* వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
* 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
* డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
* కలాం జన్మదినమైన అక్టోబరు 15న 'స్టూడెంట్స్ డే'గా నిర్వహిస్తున్నారు.
* PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
* కలాం 2015, జులై 27న మరణించారు.


2. ప్రతిభాపాటిల్ (1934)
  పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
* ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
* భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి మహిళా రాష్ట్రపతి.
* రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* సుఖోయ్ యుద్ధ విమానం, టీ - 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
* గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
* ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
* బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
* విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.


13. ప్రణబ్ ముఖర్జీ (1935)
   పదవీకాలం:  2012 జులై 25 నుంచి - ప్రస్తుతం
* ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా 'మిరాటి' గ్రామంలో జన్మించారు.
* పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1982 - 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
* 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
* 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
* 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
* 2011లో 'బెస్ట్ అడ్మినిస్ట్రేటర్' అవార్డును అందుకున్నారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
* 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
* ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 - 2012 మధ్య
వ్యవహరించారు.
* ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
* 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
* లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు:
* The Dramatic Decade
* Midterm
* Off the Track
* కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.


రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు
1. సుమిత్రాదేవి (1962)
2. మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
3. లక్ష్మీ సెహగల్ (2002)
4. ప్రతిభా పాటిల్ (2007)


తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు
1. వి.వి. గిరి
2. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3. బి.డి. జెట్టి


ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు
1. బాబూ రాజేంద్ర ప్రసాద్
2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
3. నీలం సంజీవరెడ్డి
4. జ్ఞానీ జైల్‌సింగ్
5. అబ్దుల్ కలాం
6. ప్రతిభా పాటిల్
7. ప్రణబ్ ముఖర్జీ


ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు
1. జి.ఎస్ పాఠక్
2. బి.డి. జెట్టి
3. జస్టిస్ హిదయతుల్లా
4. కె. కృష్ణకాంత్
5. భైరాన్‌సింగ్ షెకావత్


ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు
1. సర్వేపల్లి రాధకృష్ణన్
2. జాకీర్ హుస్సేన్
3. వి.వి. గిరి
4. ఆర్. వెంకట్రామన్
5. శంకర్ దయాళ్‌శర్మ
6. కె.ఆర్. నారాయణన్


భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు
1. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
2. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
4. వి.వి. గిరి (1975)
5. ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)


ఉపరాష్ట్రపతి

   ప్రారంభ ముసాయిదా రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావించలేదు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన హెచ్.వి. కామత్ పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుంచి 70 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ఉపరాష్ట్రపతి పదవిని గురించి వివరించారు.
* ఆర్టికల్, 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.


ఉపరాష్ట్రపతి అర్హతలు - షరతులు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండరాదు.
* 15 వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది సభ్యులు అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, మరో 20 మంది సభ్యులు బలపరచాలి.
* పోలై చెల్లుబాటయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొంది ఉండాలి.


ఎన్నిక పద్ధతి
* 1962 వరకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్‌ను నిర్వహించడం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు.
* 11వ రాజ్యాంగ సవరణ చట్టం (1962) ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను పార్లమెంటు ఉభయసభల సభ్యుల ద్వారా ఏర్పడిన 'ఎలక్టోరల్ కాలేజీ' ద్వారా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాల శాసన సభ్యులకు అవకాశం లేదు. ఆర్టికల్, 66లో ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పొందుపరిచారు.


పదవీ కాలం
* ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. కానీ ఈ పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని మన తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. దీన్నే అనుసరిస్తున్నారు.
* ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.


తొలగింపు
  అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలతో ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఆర్టికల్, 67(B) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కనీసం 1/4వ వంతు సభ్యుల సంతకాలతో కూడిన తొలగింపు తీర్మాన నోటీసును 14 రోజుల ముందు సభాధిపతికి అందించాలి.
* తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు హాజరుకావచ్చు. కానీ అధ్యక్షత వహించరాదు.
* ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతిని తొలగించలేదు.


జీతభత్యాలు
* ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఆర్టికల్, 97 ప్రకారం రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మాత్రమే ఉపరాష్ట్రపతి నెలకు రూ.1,25,000 వేతనం పొందుతారు.
* ఈ వేతనానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
* వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి వేతనంపై పార్లమెంటులో ఓటింగ్‌కు అవకాశం లేదు.


ఉపరాష్ట్రపతి అధికారాలు - విధులు
   ఆర్టికల్, 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.
* ఆర్టికల్, 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక పదవీ బాధ్యతలను నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో రాష్ట్రపతి పొందే జీతభత్యాలను పొందుతారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు.
* 'భారతరత్న' లాంటి అత్యున్నత పౌరపురస్కారాల ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తారు.
* 'ఉపరాష్ట్రపతి తన మేథోసంపత్తి, వ్యక్తిగతమైన నైతిక విలువలు, హుందాతనంతో వ్యవహరించడం వల్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రులు అనేక విషయాల్లో ఉపరాష్ట్రపతిని సంప్రదించేలా చేయుచున్నారు' - నార్మన్.డి. పామర్
* భారత ఉపరాష్ట్రపతి పదవిని 'వేల్స్ యువరాజు'తో పోల్చవచ్చు - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'భారత రాజ్యాంగం రాష్ట్రపతి పదవికి ఇచ్చినంత గొప్ప గౌరవం ఉపరాష్ట్రపతి పదవికి ఇవ్వక పోయినప్పటికీ ఆ పదవి ఉపయోగకరమైంది, ప్రతిష్ఠాత్మకమైంది' - ఎమ్.వి. పైలీ


కీలకాంశాలు
* మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* మన దేశానికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.
* రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినవారు.
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. హమీద్ అన్సారీ
* తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్.
* పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కె. కృష్ణకాంత్.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారు భైరాన్‌సింగ్ షెకావత్.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* జ్ఞానీ జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు 1982, అక్టోబరు 6 నుంచి 31 వరకు 25 రోజులపాటు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన వారు హిదయతుల్లా.
* అత్యధిక మెజార్టీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ (700 ఓట్లు).
* కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన తాత్కాలిక రాష్ట్రపతి - బి.డి. జెట్టి.
* బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* పదవికి రాజీనామా చేసిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* పదవికి రాజీనామా చేసిన రెండో ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్.
*  ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీరీత్యా 14వ వారు, వ్యక్తులరీత్యా 12వ వారు.
* ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంగా ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి సమర్పించాలి. రాజీనామా పత్రాన్ని మాత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి మాత్రమే రాయాలి.


ముగింపు
  అమెరికా ఉపాధ్యక్ష పదవితో మన ఉపరాష్ట్రపతి పదవిని పోల్చవచ్చు. ఎందుకంటే ఇద్దరూ తమ దేశాల్లో ఎగువసభకు అధ్యక్షత వహిస్తారు. అయితే మనదేశంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు మించి ఉండటానికి వీల్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం తాత్కాలిక అధ్యక్షుడిగానే కాకుండా అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు మిగిలిన అధ్యక్ష పదవీకాలమంతా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

ప్రధానమంత్రి

    ప్రపంచ పార్లమెంటుకు మాతగా పరిగణించే బ్రిటన్ పార్లమెంటరీ విధానం నుంచి స్ఫూర్తి పొందిన జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటివారు మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించారు.
* పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ప్రకారం దేశానికి ఇద్దరు అధిపతులు ఉంటారు. బ్రిటన్‌ మాదిరిగానే  మన దేశంలో కూడా దేశాధినేత అయిన రాష్ట్రపతి డీ - జ్యూరీ సార్వభౌమాధికారి (నామమాత్రపు సార్వభౌమాధికారి)గా, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి డీ - ఫ్యాక్టో సార్వభౌమాధికారి (వాస్తవ కార్యనిర్వహణాధికారి)గా వ్యవహరిస్తారు.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా మారిందని
ఆర్.ఎస్. క్రాస్‌మన్ పేర్కొన్నారు.
* మన దేశంలో కేంద్ర కేబినెట్‌కు నాయకత్వం వహించే ప్రధానమంత్రి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
* కేంద్ర కేబినెట్‌కు కేంద్ర బిందువైన ప్రధానమంత్రి ప్రాధాన్యం పెరగడంతో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగానే పరిగణిస్తున్నారు.
* ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందిన ప్రారంభంలో భారత రాజకీయాల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్రమోదీ లాంటి గొప్ప ప్రజాధరణ ఉన్న ప్రధానుల ఫలితంగా ప్రధానమంత్రి పదవికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
* ప్రధానమంత్రి ప్రభుత్వానికి, పార్లమెంటుకు, ప్రజలకు నాయకుడు. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుడు. దేశప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్స్ 74, 75, 78లలో ప్రధానమంత్రి, మంత్రిమండలి గురించి వివరించారు.
ఆర్టికల్, 74(1)
* దేశ పరిపాలనలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి పరిపాలనను నిర్వహిస్తారు.
* 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, పునఃపరిశీలనకు వెనక్కి పంపవచ్చని, కానీ మంత్రిమండలి పునఃపరిశీలన అనంతరం పంపిన బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నిర్దేశించింది.
ఆర్టికల్, 74(2)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి పదవీకాలం రాష్ట్రపతి లేదా లోక్‌సభ విశ్వాసం ఉన్నంత మేరకే కొనసాగుతుంది.
కింది సందర్భాల్లో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది
* లోక్‌సభలో అధికారపక్షం ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు
* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే కోత తీర్మానాలు నెగ్గినప్పుడు
* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు
* లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తిరస్కరణకు గురైనప్పుడు
* లోక్‌సభలో అధికారపక్షం వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేట్ బిల్లులు/ తీర్మానం నెగ్గినప్పుడు
ఆర్టికల్, 75(1)
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని లేదా మెజార్టీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు.
* ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.
* లోక్‌సభలో ఏ పార్టీ పూర్తి మెజార్టీ సాధించని పక్షంలో రాష్ట్రపతి తన విచక్షణతో ప్రధానిని నియమిస్తారు.
ఆర్టికల్, 75(1) (A):
* కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్యను లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి.
ఆర్టికల్, 75(1)(B):
* చట్టసభ సభ్యుడిని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సబాధిపతి అనర్హుడిగా ప్రకటించిన తర్వాత అదే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పదవిలోనూ నియమించరాదు.
* ఈ అనర్హత అతడు తిరిగి పార్లమెంటుకు ఎన్నికయ్యే వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఎన్నిక కాకపోతే ఆ సభ పదవీకాలం ముగిసే వరకు కూడా అనర్హత వర్తిస్తుంది.
* ఆర్టికల్, 75(1)(A) , 75(1)(B)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగానికి చేర్చింది.
ఆర్టికల్, 75(2)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగించవచ్చు.
ఆర్టికల్, 75(3)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. లోక్‌సభలో విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రిమండలి అధికారంలో ఉంటుంది.
ఆర్టికల్, 75(4)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది.
ఆర్టికల్, 75(5)
* ప్రధానమంత్రిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమితులవ్వాలంటే పార్లమెంటు ఉభయసభల్లో ఏదైనా ఒక సభలో సభ్యులై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేనివారు నియమితులైతే 6 నెలల్లోగా ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక అవడానికి అర్హతలు ఉన్న వారిని మాత్రమే ప్రధానిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమించాలని బి.ఆర్. కపూర్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్, 75(6)
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* ప్రస్తుతం ప్రధానమంత్రికి అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.1,60,000 వేతనం లభిస్తుంది. దీనిలో జీతం రూ.50,000, అలవెన్సులు రూ.1,10,000
* ప్రధాని అధికార నివాసం పేరు పంచవటి.
ఆర్టికల్, 78(1)
ఆర్టికల్, 78(3):
* రాష్ట్రపతి తన ఆమోదముద్ర నిమిత్తం పంపిన ఒక తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలి పరిశీలించలేదని, దాన్ని పునరాలోచన చేసి పంపమని ప్రధానిని కోరవచ్చు.


ప్రధానమంత్రి అధికారాలు - విధులు
* ప్రధాన మంత్రి కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి కేంద్రమంత్రులను నియమిస్తారు, మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.
* ప్రధానమంత్రి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే మొత్తం మంత్రిమండలి రద్దు అవుతుంది.
* ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి.
* ప్రధాని లోక్‌సభకు నాయకుడిగా, జాతికి ప్రతిబింబంగా వ్యవహరిస్తారు.
* ఆర్టికల్, 85 ప్రకారం ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తారు.
* భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రధాని ఆధ్వర్యంలోనే రూపొందిస్తారు.
* రాష్ట్రపతి, మంత్రిమండలికి మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తారు.
* విదేశాలతో వ్యవహరించేటప్పుడు ప్రధాని మనదేశానికి నాయకుడిగా వ్యవహరిస్తారు.
* ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్‌సభలో తన ప్రతినిధిగా మరొకరిని నాయకులుగా నియమించుకోవచ్చు.


పదవీ రీత్యా ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరించేవి
* ప్రణాళికా సంఘం (నీతి ఆయోగ్)
* జాతీయ అభివృద్ధి మండలి
* జాతీయ సమైక్యతా మండలి
* అంతర్రాష్ట్ర మండలి
* జాతీయ భద్రతా మండలి
*  జాతీయ జనాభా నియంత్రణ మండలి
* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
* జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ సమాచార కమిషన్, లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ల ఛైర్మన్‌లను నియమించే/ ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షులుగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.


ప్రధానమంత్రి పదవి - వ్యాఖ్యానాలు
* 'ప్రధాని సమానుల్లో ప్రథముడు' (Primus Inter Pares) - లార్డ్ మార్లే
* 'మనదేశ ప్రధాని పదవిని అమెరికా అధ్యక్ష పదవితో పోల్చవచ్చు' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'ప్రధానమంత్రి సూర్యుడు అయితే అతడి మంత్రివర్గ సహచరులందరూ అతడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లాంటివారు' - ఐవర్ జెన్నింగ్స్
* 'ప్రధానమంత్రి రాజ్యమనే నౌకకు కెప్టెన్' - మన్రో
* 'ప్రధాని చుక్కల్లో చంద్రుడు' - విలియం వెర్నార్ కోట్
* 'పార్లమెంటరీ ప్రభుత్వమనే పడవను నడిపే కెప్టెన్ ప్రధాని' - రాంసేమ్యూర్
* 'ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు' - హింటన్
* 'మంత్రులందరూ ప్రధానితోసహా సమానులు అనడం సరికాదు. ప్రధానితప్ప మిగతా మంత్రులందరూ సమానులే అనడం సబబు' - జె.ఎస్. దుగ్గల్
* 'ప్రధానమంత్రికి కల్పించిన అధికారాలు, ప్రాముఖ్యాన్ని పరిశీలించినట్లయితే వారు నియంతగా మారే ప్రమాదముంది' - కె.టి. షా
* 'పార్లమెంటరీ తరహా ప్రభుత్వ జీవన్మరణాల్లో కూడా ప్రధానమంత్రి కీలకపాత్ర పోషిస్తారు' - హెచ్.జె. లాస్కి
* ప్రధాని పదవి దేశ పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషించడం వల్ల అంబేడ్కర్ పార్లమెంటరీ ప్రభుత్వమనే భవనానికి మూలస్తంభం లాంటివారని వర్ణించారు.


ప్రధానులు

జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 1964)
* నెహ్రూ ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు.
* 1947, ఆగస్టు 15 నుంచి 1964, మే 27 మధ్య ప్రధానిగా వ్యవహరించారు.
* 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.
* భారతరత్న పురస్కారం పొందిన తొలిప్రధాని (1955).
* పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.
* ఎర్రకోటపై అత్యధికంగా 17 సార్లు జెండాను ఎగురవేశారు.
* భారత విదేశాంగ విధాన రూపకర్త.
* ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
* అలీనవిధాన రూపకల్పనలో కీలకపాత్ర వహించారు.
* 1948 పారిశ్రామిక విధానం ద్వారా మన దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశారు.
* న్యూదిల్లీలో జరిగిన ఆసియా దేశాల మహాసభలకు అధ్యక్షత వహించారు.
* 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు.
* 1952లో జాతీయాభివృద్ధి మండలిని నెలకొల్పారు.
* 1952లో CDP - Community Development Programme, 1953లో NESS - National Extension Service Scheme లను ప్రారంభించారు.
* 1954లో చైనా ప్రధాని చౌ-ఎన్-లై తో ప్రపంచశాంతి స్థాపనలో భాగంగా పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1953లో కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన తొలి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 1955లో మద్రాస్ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్‌సీ సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తన ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
* 1956లో భారత ఆర్థిక రాజ్యాంగంగా పేరొందిన పారిశ్రామిక తీర్మానాన్ని వెలువరించారు.
* 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించారు.
* 1961లో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.
* 1962లో చైనాతో యుద్ధం కారణంగా మన దేశంలో మొదటిసారిగా జాతీయ అత్యవర పరిస్థితిని విధించారు.
* 1963లో మొదటి అవిశ్వాస తీర్మానాన్ని నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టారు.
* లౌకికవాద సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా నిరూపించారు.
* డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథాలను రాశారు.
* భారత జాతీయ కాంగ్రెస్‌కు 3 సార్లు అధ్యక్షత వహించారు.
* 1959లో రాజస్థాన్‌లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానానికి శ్రీకారం చుట్టారు.
* రిజర్వాయర్లను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు.


గుల్జారీలాల్ నందా
» జన్మస్థలం హరియాణా.
* నెహ్రూ మరణానంతరం 1946, మే 27 నుంచి 1964 జూన్ 9 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.
* 1997లో భారతరత్న అవార్టును పొందారు.
* కేంద్రమంత్రిగా వ్యవహరించారు


లాల్‌బహదూర్ శాస్త్రి
» ఈయన పదవీకాలం 1964 జూన్ 9 నుంచి 1966 జనవరి 11 వరకు.
* జైజవాన్, జైకిసాన్ అనే నినాదం ఇచ్చారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ఇండియన్ లింకన్‌గా పేరుపొందారు.
* కేంద్రంలో ఎలాంటి పోర్ట్‌పోలియా లేకుండానే కేంద్రమంత్రిగా కొనసాగిన మొదటి వ్యక్తి.
* 1966లో పాకిస్థాన్‌కు చెందిన జనరల్ ఆయూబ్‌ఖాన్‌తో తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
* హరిత విప్లవం, క్షీర విప్లవం కోసం కృషి చేశారు.
* ఇతడి కాలంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ను స్థాపించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.
* పదవిలో ఉండగా మరణించిన రెండో ప్రధాని, విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని.
* 1966లో మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందారు.

గుల్జారీలాల్ నందా
* లాల్‌బహదూర్ శాస్త్రి మరణానంతరం 1966, జనవరి 11 నుంచి 1966, జనవరి 24 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

ఇందిరా గాంధీ
* 1966, జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు; 1980, జనవరి 14 నుంచి 1984, అక్టోబర్ 31 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* ఇందిరా గాంధీ జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్
* భారతదేశ తొలి మహిళా ప్రధాని.
* రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులుగా ఉండి, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి.
* 4 సార్లు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
* ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రధానిగా 15 సంవత్సరాల 303 రోజులు వ్యవహరించారు.
* ప్రధానిగా ఉండి, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
* 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేశారు.
* రాజభరణాలను రద్దు చేశారు.
* ఈమె కాలంలో ఆర్టికల్, 356 అత్యధికంగా 37 సార్లు వినియోగించారు.
ఆర్టికల్ 352 ప్రకారం 1971, 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1971లో గరీబీ హఠావో నినాదం ద్వారా లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించి ఘనవిజయం సాధించారు.
* 1971లో రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1972లో పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టోతో 'సిమ్లా' ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1974, మే 18న స్మైలింగ్ బుద్ధా పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో తొలి అణుపరీక్షలను నిర్వహించారు.
* 1983లో న్యూదిల్లీలో జరిగిన 7వ NAM సదస్సుకు అధ్యక్షత వహించారు.
* 1975లో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* 1975లో విధించిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అవకతవకలపై ప్రత్యేక కోర్టు విచారణను ఎదుర్కొన్నారు.
* 1971లో Maintenance Internal Security Act ను రూపొందించారు.
* అత్యధికంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.
* 1982లో న్యూదిల్లీలో 9వ ఆసియా క్రీడలు నిర్వహించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ద్వారా రద్దు చేశారు.
* ప్రపంచంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి మహిళ.
* 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక అనంతరం మొదటి మైనార్టీ ప్రభుత్వాన్ని నిర్వహించారు.
* పదవిలో ఉండగా మరణించిన 3వ ప్రధాని, హత్యకు గురైన మొదటి ప్రధాని.
* 1977లో రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి రాజ్‌నారాయణ్ అనే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు.
* ఇందిరా గాంధీ 1971లో రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పుడు అవకతవకలు జరిగాయని, కాబట్టి ఎన్నిక చెల్లదని, 1975లో అలహాబాద్ హైకోర్ట్ తీర్పునిచ్చింది.
* 1984లో అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ అనే సైనిక చర్యను నిర్వహించారు.

మొరార్జీ దేశాయ్
* మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24 నుంచి 1979 జులై 28 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం గుజరాత్ (పూర్వపు బాంబే ప్రెసిడెన్సీ).
* మన దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని.
* పార్లమెంటులో అత్యధికంగా 9 సార్లు సాధారణ బడ్జెట్, 2 సార్లు ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టారు.
* మన దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వమైన జనతా ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
* 1978లో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టారు.
* పాకిస్థాన్ దేశ అత్యున్నత పురస్కారమైన నిషాన్-ఇ-పాకిస్థాన్ ను పొందిన తొలి భారతీయుడు.
* పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో బి.పి. మండల్ అధ్యక్షతన రెండో  వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించారు.
* ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులు (చరణ్‌సింగ్, బాబూ జగ్జీవన్‌రామ్) ఈయన కాలంలోనే ఉన్నారు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఇతడి కాలంలోనే తొలిగించారు.
* ఉప ప్రధానిగా పనిచేసి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రూపాయి విలువను తగ్గించడాన్ని నిరసిస్తూ ఇందిరా గాంధీ కాలంలో ఉప ప్రధాని పదవికి రాజీనామా  చేశారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం కోసం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు.

చరణ్‌సింగ్ 
* ఈయన 1979, జులై 28 నుంచి 1980 జనవరి 14 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ఉపప్రధానిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* పార్లమెంటుకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన మొదటి ప్రధాని.
* పార్లమెంటులోకి ప్రవేశించకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి
* రైతు బాంధవుడిగా పేరుపొందారు.
* భారతీయ క్రాంతిదళ్, సంయుక్త విదాయకదళ్ సంస్థలను నెలకొల్పారు.
* లోక్‌దళ్ పార్టీ వ్యవస్థాపకుడు.
* ప్రధానమంత్రిగా 24 రోజులు, ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు.

రాజీవ్ గాంధీ
* ఈయన పదవీకాలం 1984, అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 1.
* జన్మస్థలం ముంబయి.
* 42 ఏళ్ల వయసులోనే ప్రధాని పదవిని చేపట్టారు.
* లోక్‌సభలో అత్యధికంగా 414 స్థానాలు గెలుపొందారు.
5 ఏళ్ల పదవీకాలంలో కేంద్ర మంత్రిమండలిని అత్యధిక సార్లు (13) పునర్వ్యవస్థీకరించారు.
* మన దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు.
* 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు.
* 1986లో ద ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1987లో సార్వత్రిక ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించారు.
* 1988లో నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి National Literacy Mission(జాతీయ అక్షరాస్యతా ప్రచార దళం)ను ప్రారంభించారు.
* బికారీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు.
* ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పాటు చేశారు.
* 1989లో జవహర్ రోజ్ గార్ యోజన ను ప్రారంభించారు.
* వివాదాస్పద పోస్టల్ బిల్లును ఆమోదించారు.
* గూర్ఖాలాండ్ ఒప్పందం, పంజాబ్ ఒప్పందం ఈయన కాలంలోనే జరిగాయి.
* శ్రీలంకకు భారతదేశ శాంతి సైనిక దళాల (Indian Peace Keeping Forces - IPKF) ను పంపారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం కోసం ఎల్.ఎం. సింఘ్వీ కమిటీని నియమించారు.
* 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
* మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
* ముస్లిం మహిళల వివాహం, విడాకులు, హక్కుల చట్టం - 1986 ను రూపొందించారు.
* బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.
* ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు.
* 1991, మే 21న ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు.
* మే 21ని ఉగ్రవాద వ్యతిరేకదినంగా పాటిస్తారు.
* 1991లో భారతరత్న పురస్కారం పొందారు.

విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
* ఈయన 1989, డిసెంబరు 2 నుంచి 1990 నవంబరు 10 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* విశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవిని కోల్పోయిన తొలి వ్యక్తి.
* త్రిసభ్య ఎన్నికల సంఘాన్ని ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు.
* 1990లో అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు.
* బి.పి. మండల్ కమిషన్ సిఫారసులను అమలుపరిచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించారు.
* అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు జనమోర్చా అనే సంస్థను స్థాపించారు.
* ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్ గోస్వామి కమిటీని నియమించారు.
* నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించారు.
* 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పించారు.
* 1989లో ఏర్పడిన 9వ పార్లమెంటు మన దేశంలో మొదటి హంగ్ పార్లమెంట్.
* బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ కుంభకోణాలకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వైదొలిగారు.
* అయోధ్య వివాదంలో బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.

చంద్రశేఖర్
* ఈయన 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* 'బోండ్సీ బాబా'గా పేరొందారు.
* మన దేశ రాజకీయాల్లో యంగ్ టర్క్ గా పేరొందారు.
* ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని.
* భారతదేశంలో రాజకీయ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు (కన్యాకుమారి నుంచి వారణాసి వరకు పాదయాత్ర నిర్వహించారు).
* పార్లమెంటులో కనీస కోరం సభ్యుల మద్దతు లేకుండానే జనతాదళ్ పార్టీని చీల్చి, కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
* 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి విమర్శలను ఎదుర్కొన్నారు.
* ఈయన పాలనా కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

పి.వి. నరసింహారావు
* ఈయన 1991, జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* మొదటి దక్షిణాది ప్రధాని, తెలుగు ప్రధాని.
* జన్మస్థలం కరీంనగర్ (తెలంగాణ).
* మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి పదవీకాలం నిర్వహించిన ఏకైక ప్రధాని.
* భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని అయిన 4వ వ్యక్తి
* పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
* దేశ్ బచావో - దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* 14 భాషల్లో ప్రావీణ్యాన్ని పొందారు.
* ఒక పదవీకాలంలోనే అత్యధికంగా 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.
* భారత విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ పాలసీ ని ప్రవేశపెట్టారు.
* " The Insider" అనే ఆత్మకథను రాశారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించారు.
* బాబ్రీ మసీదు విధ్వంసం ఈయన కాలంలోనే జరిగింది.


అటల్ బిహారి వాజ్‌పేయీ
* ఈయన 1996 మే 16 నుంచి జూన్ 1; 1998, మార్చి 19 నుంచి 2004 , మే 22 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం మధ్యప్రదేశ్.
* 1998 మే 11న ఆపరేషన్ శక్తి పేరుతో రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు.
* పాకిస్థాన్‌తో స్నేహం కోసం లాహోర్ బస్సు యాత్రను నిర్వహించారు.
* కేంద్రంలో అత్యధికంగా 24 పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* 1996లో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఓటింగ్ జరగకుండానే రాజీనామా చేశారు.
* 1999లో అవిశ్వాస తీర్మానం ద్వారా కేవలం ఒక ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయారు.
* పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.
* జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు.
* యూఎన్‌వో సాధారణ సభలో హిందీభాషలో ప్రసంగించిన మొదటి వ్యక్తి.
* అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* మైనార్టీల సంక్షేమంపై రంగనాథ్ మిశ్రా కమిటీని నియమించారు.
* అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన కాంగ్రెసేతర ప్రధాని.
* 2001లో పార్లమెంటుపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి జరిగింది.
* 2002లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం ద్వారా వివాదాస్పదమైన 'పోటా' చట్టాన్ని రూపొందించారు.
* 2002లో జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

హెచ్.డి. దేవెగౌడ
* ఈయన 1996, జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 20 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
జన్మస్థలం కర్ణాటక.
* దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* విశ్వాస తీర్మానంలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన 2వ ప్రధాని.
* మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిసారిగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
* అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న (44 మందిని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* సివిల్ సర్వీసెస్‌లో డిప్లమో సాధించారు.

ఐ.కె. గుజ్రాల్
* ఈయన 1997, ఏప్రిల్ 21 నుంచి 1998, మార్చి 18 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం.
* దేవెగౌడ ప్రభుత్వ పతనానంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* జనతాదళ్ నేతృత్వంలోని 14 పార్టీల కూటమి ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* భారత విదేశాంగ విధానంలో గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో నూతన విధానాన్ని ప్రారంభించారు.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు.
* కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో పదవికి రాజీనామా చేశారు.
ఈయన 2012 నవంబరు, 30న మరణించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్
* ఈయన 2004 మే, 22 నుంచి 2014, మే 25 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం తాలూకా ఘా గ్రామం.
* కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన 4వ వ్యక్తి (అసోం నుంచి).

* 2004 - 2009 మధ్య 17 పార్టీలతో కూడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రభుత్వాన్ని నడిపారు.
* 2009 - 2014 మధ్య 13 పార్టీలతో కూడిన యూపీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని నడిపారు.
* అమెరికాతో 123 పౌరఅణు ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
* 2005లో జాతీయ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.
* 2005లో బాలల హక్కుల చట్టాన్ని రూపొందించారు.
* 2005లో గృహ హింస నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు.
* 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
* 2007లో ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించారు.
* 2007లో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2009లో ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని రూపొందించారు.
* 2009లో వృద్ధుల సంరక్షణా చట్టాన్ని రూపొందించారు.
* 2009లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారు.
* 2006లో మైనార్టీల సంక్షేమం కోసం రాజేంద్ర సచార్ కమిటీని ఏర్పాటు చేశారు.
* మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
* 2007లో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన కోసం మదన్ మోహన్ పూంచీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పూర్తి పదవీకాలం నిర్వహించి, వరుసగా 2వ సారి అధికారం చేపట్టిన ప్రధానుల్లో మొదటి వారు.
* 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రతను కల్పించారు.
* 2013లో నిర్భయ చట్టాన్ని రూపొందించారు.
* 2014లో లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* అంతర్ రాష్ట్ర మండలి నుంచి శివరాజ్ పాటిల్ నేతృత్వంలో శాంతి భద్రతల పరిరక్షణ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
* ఒక పదవీకాలంలో 2 సార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.
* ఎర్రకోటపై వరుసగా 10 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ
* ఈయన పదవీకాలం: 2014 మే, 26 నుంచి ప్రస్తుతం
* జన్మస్థలం గుజరాత్.
* 1950 సెప్టెంబరు, 17న గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలోని 'వాద్ నగర్‌'లో జన్మించారు.
* నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీ, తల్లి హీరాబెన్.
* నరేంద్ర మోదీ 2001, అక్టోబరు 7న మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
* గుజరాత్‌కు 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
* కాంగ్రెసేతర ప్రధానుల్లో 8వ వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని అయిన 6వ వ్యక్తి.
* స్వాతంత్య్రానంతరం జన్మించిన వ్యక్తుల్లో మొదటి ప్రధాని.
* జాతీయ ప్రణాళికా సంఘం పేరును 'నీతి ఆయోగ్‌'గా మార్చారు.
* బేటీ బచావో - బేటీ పడావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* పరిశుభ్రతపై స్వచ్ఛభారత్ అనే నినాదాన్ని ఇచ్చారు.
* గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ నియోజక వర్గం నుంచి 5,70,128 ఓట్ల మెజార్టీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజక వర్గం నుంచి 3,71,784 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానులు
1. జవహర్‌లాల్ నెహ్రూ
2. ఇందిరా గాంధీ
3. రాజీవ్ గాంధీ


రైల్వే శాఖను నిర్వహించిన ప్రధానులు
1. లాల్‌బహదూర్ శాస్త్రి
2. అటల్ బిహారి వాజ్‌పేయీ
3. మన్మోహన్ సింగ్

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ పొందిన ప్రధానులు"
1. అటల్ బిహారి వాజ్‌పేయీ (1994)
2. చంద్రశేఖర్ (1995)
3. మన్మోహన్ సింగ్ (2002)

భారతరత్న పురస్కారం పొందిన ప్రధానులు
1. జవహర్‌లాల్ నెహ్రూ - 1955
2. లాల్‌బహదూర్ శాస్త్రి - 1966
3. ఇందిరా గాంధీ - 1971
4. రాజీవ్ గాంధీ - 1991
5. మెరార్జీ దేశాయ్ - 1991
6. గుల్జారీలాల్ నందా - 1997
7. అటల్ బిహారి వాజ్‌పేయీ - 2015


ప్రధానులు - నినాదాలు
జై జవాన్, జై కిసాన్ - లాల్ బహదూర్ శాస్త్రి
* గరీబీ హఠావో - ఇందిరా గాంధీ
* అన్యాయ్ హఠావ్ - ఇందిరా గాంధీ
* బికారీ హఠావో - రాజీవ్ గాంధీ
* దేశ్ బచావ్ - దేశ్ బనావో - పి.వి. నరసింహారావు
* జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ - అటల్ బిహారి వాజ్‌పేయీ
* బేటీ బచావో - బేటీ పడావో - నరేంద్ర మోదీ

 

ప్రధానులు - వారి సమాధులు
జవహర్ లాల్ నెహ్రూ - శాంతివన్
గుల్జారీలాల్ నందా - నారాయణ్ ఘాట్
లాల్‌బహదూర్ శాస్త్రి - విజయ ఘాట్
ఇందిరా గాంధీ - శక్తిస్థల్
మొరార్జీ దేశాయ్ - అభయ్ ఘాట్
చరణ్‌సింగ్ - కిసాన్ ఘాట్
రాజీవ్ గాంధీ - వీర్ భూమి
చంద్రశేఖర్ - స్మృతిస్థల్
దేవీలాల్ - సంఘర్ష్ స్థల్
పి.వి. నరసింహారావు - జ్ఞాన్ భూమి


ముఖ్యమంత్రులుగా పనిచేసి - ప్రధానులు అయినవారు
మొరార్జీ దేశాయ్ - బొంబాయి రాష్ట్రం
చరణ్‌సింగ్ - ఉత్తరప్రదేశ్
వి.పి.సింగ్ - ఉత్తరప్రదేశ్
పి.వి. నరసింహారావు - ఆంధ్రప్రదేశ్
దేవెగౌడ - కర్ణాటక
నరేంద్ర మోదీ - గుజరాత్

 

ఉత్తర ప్రదేశ్ నుండి అత్యధికంగా ఆరుగురు ప్రధానులు అయ్యారు.
1. జవహర్ లాల్ నెహ్రూ
2. లాల్‌బహదూర్ శాస్త్రి
3. ఇందిరా గాంధీ
4. చరణ్‌సింగ్
5. వి.పి. సింగ్
6. చంద్రశేఖర్


ఉప ప్రధానమంత్రి

* మన రాజ్యాంగంలో ఉప ప్రధాని పదవికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. రాజకీయ కారణాలు, ప్రాంతీయ రాజకీయాలు ఈ పదవి ఏర్పాటుకు కారణమవుతాయి.
* ప్రభుత్వంలో లేదా రాజకీయ పార్టీలో సమానస్థాయి నాయకులున్న సందర్భంలో పరిస్థితులు, సందర్భానుసారం ఏర్పడే రాజకీయ అవసరాల ఆధారంగా ఈ పదవిని ఏర్పాటు చేశారు.
* ఉప ప్రధాని కూడా మంత్రిమండలిలో అంతర్భాగం.  ప్రత్యేక అధికారాలు, విధులు ఉండవు. కేబినెట్ మంత్రిగా తనకు కేటాయించిన శాఖను నిర్వహిస్తారు.

కె.ఎం. శర్మ Vs దేవీలాల్ కేసు (1989)
* ఈ కేసులో దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, సుప్రీంకోర్టు ఉపప్రధాని పదవిని సమర్థిస్తూ, భారత రాజ్యాంగంలో మంత్రుల రకాలను, స్థాయిలను గురించి ఎలాంటి ప్రస్తావన చేయనందున దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానులు
* జవహర్‌లాల్ నెహ్రూ - 17 సార్లు
* ఇందిరాగాంధీ - 16
* మన్మోహన్‌సింగ్ - 10
* వాజ్‌పేయీ - 6 
* రాజీవ్ గాంధీ - 5
* పి.వి. నరసింహారావు - 5
* లాల్‌బహదూర్ శాస్త్రి - 2
* మొరార్జీ దేశాయ్ - 2
* చరణ్ సింగ్ - 1
* వి.పి. సింగ్ - 1
* హెచ్.డి. దేవెగౌడ - 1
* ఐ.కె. గుజ్రాల్ - 1
* నరేంద్ర మోదీ - 3 (2016, ఆగస్ట్ 15 నాటికి)
* చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు.
* పి.వి. నరసింహారావు 1991లో కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి 5,80,295 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధానుల్లో ఇప్పటికీ ఇదే రికార్డుగా కొనసాగుతోంది.
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ.

 

కేంద్ర మంత్రిమండలి
 ఆర్టికల్ 74 (1) ప్రకారం రాష్ట్రపతికి పరిపాలనలో సహకరించేందుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. భారత రాజ్యాంగం పార్లమెంటరీ లేదా మంత్రివర్గపాలిత ప్రభుత్వాన్ని ప్రసాదించింది. దీన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించాం. భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రిమండలిలోని మంత్రుల ర్యాంకులను, రకాలను, స్థాయిలను గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
* 1949లో "Government Missionary in India" అనే అంశంపై ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ చేసిన సిఫారసుల మేరకు మంత్రివర్గ రకాలను మూడు వర్గాలుగా పేర్కొన్నారు.

1) కేబినెట్ మంత్రులు
2) సహాయ మంత్రులు
3) డిప్యూటీ మంత్రులు
కేబినెట్ మంత్రులు (Cabinet Ministers)

* సాధారణంగా అధికార పార్టీలో అత్యంత ప్రాబల్యం, పరిపాలనా అనుభవం ఉన్న వారిని కేబినెట్ మంత్రులుగా ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. వీరి సంఖ్య సాధారణంగా 15 నుంచి 20 వరకు ఉంటుంది.
* ప్రభుత్వంలోని కీలక శాఖలను నిర్వహిస్తారు. వారానికి ఒకసారి (ప్రతి శుక్రవారం) కేబినెట్ సమావేశం అవుతుంది.
* కేబినెట్ అనే పదాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ఆర్టికల్ 352(7)లో చేర్చింది.
* కేంద్ర మంత్రివర్గం తరఫున విధానాలను, నిర్ణయాలను చేసేది కేబినెట్ మాత్రమే.
* కేబినెట్ మంత్రులు ఎంపీలుగా పొందే వేతనంతో పాటు అదనంగా రూ. 10,000 పొందుతారు.

A. సూపర్ కేబినెట్: ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల రూపకల్పనలో కేంద్ర కేబినెట్ నుంచి ఏర్పడే రాజకీయ వ్యవహారాల కమిటీనే 'సూపర్ కేబినెట్‌' గా పేర్కొంటారు.
B. సమాంతర కేబినెట్: ప్రధానమంత్రి కార్యాలయం దేశ పరిపాలనా నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తూ, పరిపాలనపై పర్యవేక్షణను కూడా కలిగి ఉండటంతో ప్రధాని కార్యాలయాన్ని 'సమాంతర కేబినెట్‌'గా పేర్కొంటారు.
C. కిచెన్ కేబినెట్: ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రధానమంత్రితో అత్యంత సన్నిహితంగా, విశ్వసనీయంగా ఉండే కేబినెట్‌లోని అత్యంత ముఖ్యమైన మంత్రుల ప్రతినిధి బృందాన్ని 'కిచెన్ కేబినెట్‌'గా పేర్కొంటారు.
D. షాడో కేబినెట్: బ్రిటన్‌లో అధికారానికి వచ్చిన పార్టీ ఏర్పాటుచేసే ప్రభుత్వం అధికారపరమైన పరిపాలన విధాన నిర్ణయాలను నీడలా వెంటాడుతూ అందులోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం కోసం ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసుకునే అనధికార మంత్రిమండలిని 'షాడో కేబినెట్‌'గా పేర్కొంటారు.

సహాయ మంత్రులు/రాష్ట్ర మంత్రులు (State Ministers)
* సహాయ మంత్రులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. స్వయం ప్రతిపత్తి కలిగినవారు: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రులు వారి శాఖలకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు అమల్లో కీలక పాత్ర వహిస్తారు. కేబినెట్ ర్యాంకు కలిగిన మంత్రులు లేని శాఖలకు స్వయం ప్రతిపత్తిని కలిగిన సహాయ మంత్రులను ఏర్పాటు చేస్తారు.
స్వయం ప్రతిపత్తి లేనివారు: వీరు కేబినెట్ సమావేశాలకు హాజరు కారు. వీరి శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చకు ప్రధాని ఆహ్వానం మేరకు హాజరు అవుతారు.
* పార్లమెంటు సభ్యుల వేతనంతో పాటు సహాయ మంత్రులు అదనంగా మరో రూ.7,000 వేతనం పొందుతారు.

డిప్యూటీ మంత్రులు: వీరు మంత్రివర్గంలో మూడో అంచెకు చెందినవారు. శాసన, పరిపాలనా వ్యవహారాల్లో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించే మంత్రులను డిప్యూటీ మంత్రులు అంటారు. స్వతంత్రంగా ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత వీరికి ఉండదు. వీరు కేవలం ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే మంత్రివర్గ సమావేశానికి హాజరు అవుతారు.
* పార్లమెంటు సభ్యుల వేతనంతో పాటు డిప్యూటీ మంత్రులు అదనంగా రూ.5,000 వేతనం పొందుతారు.
* భారత రాజ్యాంగంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్యపై ఎలాంటి ప్రస్తావన లేదు.
* 1966 నాటికి మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10 శాతం మించరాదని సిఫారసు చేసింది. రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య కూడా విధానసభ సభ్యుల సంఖ్యలో 10 శాతం మించరాదని సిఫారసు చేసింది.
* చిన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12 మందికి తగ్గరాదని నిర్ణయించారు.
* కేంద్ర మంత్రిమండలిలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 83కు మించరాదు.
* 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 75 (1) (B) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏదైనా ఒక సభలోని రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడిని Xవ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే ఆ వ్యక్తిని ఆ సభ పదవీకాలం ఉన్నంత వరకు మంత్రిగా నియమించరాదని నిర్దేశించారు.
* 91వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు 2004, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

రహస్య గోపనం
  ప్రధాని అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ మంత్రులందరూ రహస్యంగా ఉంచాలి. ఒకవేళ కేబినెట్ నిర్ణయాలను ఎవరైనా బయటికి వెల్లడిస్తే ప్రభుత్వ రహస్యాలను కాపాడతామని చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించడమే కాకుండా, ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లు అవుతుంది. మంత్రివర్గ నిర్ణయాలు సమష్టిగా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాలు. వీటిని ఏ న్యాయస్థానం ముందు సవాలు చేయరాదు. కేబినెట్ మంత్రులందరూ ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించి వాటి అమలుకు ప్రయత్నించాలి.

వ్యక్తిగత బాధ్యత
* ఆర్టికల్, 74(2) ప్రకారం మంత్రులందరూ రాష్ట్రపతికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. ఒక శాఖకు నాయకత్వం వహించే మంత్రి తన శాఖ లోటుపాట్లకు తానొక్కడే బాధ్యత వహించాలి. ప్రతి మంత్రిత్వశాఖకు సివిల్ కార్యనిర్వహణాధిపతి ఉంటారు. ఈయన  విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు చేయడంలోమంత్రికి సలహా ఇస్తారు. ఆ విధానాలు, నిర్ణయాలు తప్పుడు ఫలితాలను ఇస్తే దానికి మంత్రిదే బాధ్యత కానీ కార్యదర్శి బాధ్యుడు కాదు.
* ఒక శాఖ చేసిన పనికి మంచైనా, చెడైనా ఆ శాఖకు ఆధిపత్యం వహించే మంత్రిదే  బాధ్యత. సంబంధిత మంత్రి స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే ప్రధాని సిఫారసుల మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.

ఉదాహరణలు
* 1948లో ఆర్థికమంత్రి షణ్ముగం శెట్టిని ఆదాయపు పన్నుకు సంబంధించిన విషయంలో రాజీనామా చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.
* 1956లో రైల్వేమంత్రి పదవికి లాల్‌బహదూర్ శాస్త్రి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
* 1958లో ముంద్రాస్కాం కేసులో టి.టి. కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అప్పటి రక్షణ మంత్రి వి.కె. కృష్ణమీనన్ ను పదవి నుంచి తొలగించారు.
* 1966లో గోహత్య కారణంగా దిల్లీలో ఆందోళన జరిగినప్పుడు హోంమంత్రి గుల్జారీలాల్ నందా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
* 1968లో అవినీతి, లంచగొండితనం కేసులో కె.డి. మాలవ్యాను గనులు, చమురుశాఖ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించారు.
* 2005లో ఇరాక్ ఆయిల్‌స్కాం విషయానికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రి పదవి నుంచి నట్వర్‌సింగ్‌ను తొలగించారు.

 

సమష్టి బాధ్యత (Collective Responsibility)
* ఆర్టికల్, 75(3) ప్రకారం కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి. దీని ప్రకారం మంత్రులందరూ ఒకేసారి అధికారాన్ని పొంది, ఒకేసారి  కోల్పోతారు. ఒక మంత్రిపై అభియోగం ఉంటే అది అందరిపైనా అభియోగంగా భావించటం జరుగుతుంది.
* ఒక మంత్రికి వ్యతిరేకంగా లోక్‌సభ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఏ మంత్రి ప్రవేశపెట్టినప్పటికీ సభలో అతడు ఇచ్చే జవాబులకు, ప్రవర్తనకు మిగిలిన మంత్రులందరూ సమాన బాధ్యత వహించాలి.
* దీనిలో భాగంగా ప్రతీ మంత్రి, మంత్రివర్గ పరిధిలో అంతర్గత బాధ్యత వహించాలి. ఏదైనా విషయంపై మంత్రివర్గం ఒక నిర్ణయం చేసినప్పుడు ప్రతీ మంత్రి దాన్ని ఆమోదించాలి. ఈ నిర్ణయంతో ఎవరైనా మంత్రి విభేదిస్తే రాజీనామా చేయాల్సిందే.
* ప్రధాని లోక్‌సభలో ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానం వీగిపోయినా, ఏదైనా కారణంతో పదవి కోల్పోయినా, మరణించినా మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే.
* మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి.


సమష్టిబాధ్యతా సూత్రాన్ని ధిక్కరించడం లేదా ఉల్లంఘించడం వల్ల కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన లేదా తొలగించిన మంత్రుల వివరాలు
* 1950లో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ వ్యవహారాల మీద జరిగిన నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని నిరసిస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ, కె.సి. నియోగి రాజీనామా చేశారు.
* 1953లో హిందు కోడ్ బిల్లు విషయమై నెహ్రూతో విభేదించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
* 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ మహావీర్‌త్యాగి తన పదవికి రాజీనామా చేశారు.
* 1967లో త్రిభాషా సూత్రం విషయంలో తలెత్తిన విభేదాలను అనుసరించి ఎం.సి. చాగ్లా తన పదవికి రాజీనామా చేశారు.
* 1969లో రూపాయి విలువను తగ్గించడాన్ని నిరసిస్తూ మొరార్జీదేశాయ్ రాజీనామా చేశారు.
* 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహం, విడాకులు, హక్కుల చట్టం విషయంలో రూపొందించిన విధానాలను వ్యతిరేకిస్తూ అరీఫ్ మహ్మద్‌ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు.
* 1989లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలను నిరసిస్తూ వి.పి. సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
* 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్ల విషయాన్ని నిరసిస్తూ రాంవిలాస్ పాశ్వాన్ వాజ్‌పేయీ ప్రభుత్వానికి రాజీనామా చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రణాళికా సంఘానికి కల్పిస్తున్న ప్రాధాన్యాని నిరసిస్తూ వి.వి.గిరి తన పదవికి రాజీనామా చేశారు.
* తన ఆర్థిక విధానాలు తన సహచరులకు నచ్చలేదనే కారణంతో జాన్‌మత్తాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
* బాంబే రాష్ట్రాన్ని విభజించి, గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సి.డి. దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.
* జనతా ప్రభుత్వ కాలంలో ద్వంద్వ సభ్యత్వం విషయంపై విభేదాలు రావడంతో చరణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
* బాబ్రీమసీద్ విధ్వంసం అనంతరం 4 రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలకు పి.వి. నరసింహారావును విమర్శించడం మూలంగా కుమారమంగళం తన పదవికి రాజీనామా చేశారు.
* ముంబయిపై పాకిస్థాన్ ముష్కరుల దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎ.ఆర్. అంతూలే తన పదవికి రాజీనామా చేశారు.
* 6వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన జనతా ప్రభుత్వం, 9వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 11వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పూర్తికాలం పాటు కొనసాగకపోవడానికి కారణం అప్పటి మంత్రివర్గ సహచరుల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

 

కేంద్ర మంత్రిమండలి అధికారాలు - విధులు
ఎం.వి. పైలి అభిప్రాయం ప్రకారం కేబినెట్ 4 రకాల విధులను నిర్వహిస్తుంది
1. ప్రభుత్వ విధానాలకు అనుగుణమైన బిల్లులను పార్లమెంటుకు సమర్పించేందుకు ఆమోదించడం.
2. ఉన్నతాధికారుల నియామకం.
3. వివిధ మంత్రిత్వశాఖల మధ్య వివాదాలను పరిష్కరించడం.
4. వివిధ శాఖలు చేసే అనేక కార్యక్రమాలను సమన్వయం చేసి, ప్రభుత్వ విధానాల అమలులో జరుగుతున్న ప్రగతిని సమీక్షించడం.

 

ఇతర అధికారాలు - విధులు
* భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలను ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో అమలుపరచడం.
* మనదేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడం.
* పార్లమెంటు రూపొందించిన చట్టాలను అమలుపరిచే సందర్భంలో ఆ శాసనాలు ఆచరణయోగ్యంగా ఉండటం కోసం అవసరమైన నియోజిత శాసనాన్ని రూపొందించడం.
* దేశానికి అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడం, దేశ ఆర్థిక విధానాన్ని సంస్కరించడం.
* పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ పాఠాన్ని రూపొందించడం.
* సమష్టి బాధ్యతా సూత్రాన్ని అనుసరించి లోక్‌సభకు సమష్టి బాధ్యతను వహించడం
* ఆర్టికల్, 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల పరిపాలనను పర్యవేక్షించడం.
* ఆర్టికల్, 72 ప్రకారం రాష్ట్రపతి వినియోగించే క్షమాభిక్ష అధికారాల విషయంలో రాష్ట్రపతికి సూచనలు, సలహాలు ఇవ్వడం.
* రాష్ట్రపతికి దేశ పరిపాలనకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* శాంతిభద్రతల పరిరక్షణ అనేది రాష్ట్రాల బాధ్యత అయినప్పటికీ, రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కేంద్రంపై ఉంది.
* శాంతిభద్రతల పరిరక్షణలో కేంద్రం రాష్ట్రాలకు తన సహకారాన్ని అందించడం.
* విదేశీ దాడులు, దురాక్రమణల నుంచి దేశాన్ని రక్షించేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయడం.
* దేశ పరిపాలనలో అత్యంత కీలకపాత్రను పోషించే రాజ్యాంగ, రాజ్యాంగేతర పదవుల నియామకంలో రాష్ట్రపతికి సలహాను ఇవ్వడం.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆర్టికల్, 123 ప్రకారం దేశ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రపతి ద్వారా 'ఆర్డినెన్స్‌'ను జారీ చేయించడం.


కేంద్ర మంత్రిమండలి సలహామేరకే రాష్ట్రపతి వ్యవహరించాలని సుప్రీంకోర్టు కింద పేర్కొన్న కేసుల్లో తీర్పునిచ్చింది.
1. రామ్‌జువాయ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
2. యు.ఎన్.ఆర్. రావు Vs ఇందిరా గాంధీ కేసు
3. షంషేర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు

 

కేంద్ర కేబినెట్‌కు తన అధికార విధుల నిర్వహణలో సహకరించేందుకు ఒక 'కేబినెట్' సచివాలయం ఉంటుంది. దీనికి అధిపతిగా కేబినెట్ సెక్రటరీ ఉంటారు. దీనికి సీనియర్ సివిల్ సర్వీస్ ఉద్యోగిని నియమిస్తారు.

కేబినెట్ సచివాలయం
*  కేబినెట్ సచివాలయాన్ని 1947లో ఏర్పాటు చేశారు. దీనిలో 3 విభాగాలు ఉంటాయి. అవి:
1. సివిల్ వింగ్
2. మిలటరీ వింగ్
3. ఇంటలిజెన్స్ వింగ్


కేబినెట్ సచివాలయం - విధులు
* కేబినెట్ సమావేశాల ఎజెండాను తయారుచేయడం.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కేంద్ర మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది.
* కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం.
* వివిధ మంత్రిత్వ శాఖలకు సమాచారాన్ని చేరవేయడం.

కేబినెట్ కార్యదర్శి
* ఈయన కేబినెట్ సచివాలయానికి పరిపాలనా అధిపతిగా వ్యవహరిస్తారు.
* సివిల్ సర్వీసుల్లో ఇది అత్యున్నత పదవి.
* ఈ పదవిని 1950లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రధానమంత్రికి కళ్లు, చెవులుగా పని చేస్తారు.
* ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం
* 1947లో గవర్నర్ జనరల్‌కు వ్యక్తిగత కార్యదర్శి హోదాలో దీన్ని ఏర్పాటు చేశారు. 1977 నుంచి ప్రధానమంత్రి సచివాలయంగా పేర్కొంటున్నారు. దీనికి ప్రధానమంత్రి అధిపతిగా ఉంటారు. పరిపాలనాపరంగా ప్రిన్సిపల్ కార్యదర్శి ఒకరు ఉంటారు.

అధికారాలు - విధులు
* ఇది స్టాఫ్ ఏజెన్సీ, రాజ్యాంగేతర సంస్థ
* దీన్ని సూపర్ కేబినెట్, మైక్రో కేబినెట్, సూపర్ మినిస్ట్రీ, సూపర్ సెక్రటేరియట్‌గా పేర్కొంటారు.
* ఇతర శాఖలకు కేటాయించని అంశాలను పర్యవేక్షిస్తుంది.
* ప్రధానమంత్రికి థింక్ ట్యాంక్ లేదా వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది.
* దీన్ని అవశిష్టదత్త సంస్థ గా (Residuary Legatee) పేర్కొంటారు.
* దీన్నే ప్రభుత్వం పైన ప్రభుత్వం (The Governament of the Governament of India)గా అభివర్ణిస్తారు.


కేబినెట్ కమిటీలు
* ప్రభుత్వం సమర్థంగా, అభిలషణీయమైన పాలనను సాగించేందుకు కమిటీ పద్ధతి తోడ్పడుతుంది. కేబినెట్ కమిటీల్లో కీలక శాఖలను నిర్వహించే కొద్దిమంది మంత్రులు ఉంటారు. ఈ కమిటీలకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* కేబినెట్ పని భారాన్ని తగ్గించడానికి, సంబంధిత విషయాలపై నిరంతరం పర్యవేక్షణను కొనసాగించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి రాజ్యాంగ భధ్రత లేదు. ఇవి కేవలం సలహా అధికారాలను మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ కేబినెట్ తీసుకునే నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇవి 2 రకాలు.

1. శాశ్వత కమిటీలు (Standing Committees)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)


శాశ్వత స్థాయీ సంఘాలు
* వీటిని విషయ పరంగా ఏర్పాటు చేస్తారు. ప్రతి సంఘంలోనూ 7 మందికి మించకుండా సభ్యులు ఉంటారు.

కీలకమైన కేబినెట్ స్థాయి/ ఉప సంఘాలు



 5. ఆర్థిక వ్యవహారాల కమిటీ
 6. రక్షణ వ్యవహారాల కమిటీ
 7. పెట్టుబడులపై కమిటీ.
* మిగిలిన కమిటీలకు అధ్యక్షులను ప్రధాని నియమిస్తారు.

* 2014, జూన్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 కేబినెట్ కమిటీలను రద్దు చేశారు. అవి:
1. ధరలపై కేబినెట్ కమిటీ
2. ప్రపంచ వాణిజ్య సంస్థ విషయాలపై కమిటీ
3. ఆధార్ వ్యవహారాల కమిటీ
4. విపత్తు నిర్వహణ కమిటీ

 

తాత్కాలిక కమిటీలు
* కొన్ని సార్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు సంబంధిత సమస్యలను పరిశీలించి, నివేదికను సమర్పించిన తర్వాత వాటంతటవే రద్దు అవుతాయి.
ఉదా: అత్యవసర పరిస్థితులు, విదేశీ యుద్ధాల సమయంలో ఏర్పడ్డాయి.
* కేబినెట్ కమిటీల సంఖ్య ఎంత ఉండాలన్నది ఆయా ప్రభుత్వాల ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది.

 

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్
* ప్రభుత్వం రోజువారీ వ్యవహారాలను ఇతర ప్రజా సమస్యలను పరిశీలించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ ను నియమిస్తుంది. వీరు కేబినెట్ కమిటీలకు సహాయ సహకారాలు అందిస్తారు. వీటిలో సంబంధిత శాఖ మంత్రి, ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. వీటి సంఖ్య ఆయా ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

కేబినెట్ వ్యాఖ్యానాలు
* 'ప్రభుత్వం అనే నావకు కేబినెట్ స్టీరింగ్ లాంటిది' - రాంసేమ్యూర్
* 'కేబినెట్ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది' - గ్లాడ్‌స్టోన్
* 'కేబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం లాంటిది' - లోవెల్
* 'కేబినెట్ అనేది శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖలను కలిపి ఉంచే వారధి లాంటిది' - బేగ్ హార్ట్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుప్రీంకోర్టు అధికారాలు 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జతపరచండి. 
     అంశం                                                                                                                         
వ్యక్తి

a) తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి                               1. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా

b) సుప్రీంకోర్టులో పనిచేసిన రెండో ప్రధాన న్యాయమూర్తి                                                     2. ఎం. పతంజలి శాస్త్రి

c) 1937 దిల్లీలో ఏర్పడిన ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి                               3. సర్. మారిన్ గోయల్

d) 1774 ఫోర్ట్ విలియంలో ఏర్పడిన సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి                  4. వార్డ్ ఎలిజా ఇంపే

జ: a-1, b-2, c-3 d-4

2. జతపరచండి.
a) ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు                                               1. 1774

b) మొదటి జడ్జెస్ కేసు                                                         2. 1982

c) రెండో జడ్జెస్ కేసు                                                            3. 1993

d) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26 కి పెంపు                   4. 1986

జ: a-1, b-2, c-3, d-4
 

3. జతపరచండి.
    అంశం                                                                             షెడ్యూల్

a) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు                                     1. 3వ షెడ్యూల్

b) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం                              2. 2వ షెడ్యూల్

c) భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు                               3. 10వ షెడ్యూల్

d) పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం                                                   4. 9వ షెడ్యూల్

జ: a-2, b-1, c-4, d-3

4. జతపరచండి.
     అంశం                                                                                                                                                  
ప్రకరణలు

a) రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రత్యేక పద్ధతి ద్వారానే న్యాయమూర్తులను తొలగించాలి                                                            1. 124 (4)

b) సుప్రీంకోర్టుకు సంబంధించిన అన్ని ఖర్చులను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.                                                 2. 146 (3)

c) న్యాయమూర్తులు తమ విధి నిర్వహణలో ప్రవర్తించే తీరును పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభలో చర్చించరాదు           3. 121

d) పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులు భారత భూభాగంలో ఏ న్యాయస్థానంలోనూ ప్రాక్టీస్ చేయరాదు                               4. 124 (7)

జ: a-1, b-2, c-3, d-4
 

5. జతపరచండి.
    రిట్                                                             అర్థం

a) హెబియస్ కార్పస్                                            1. అధికార పృచ్ఛ

b) మాండమస్                                                     2. ఉత్ప్రేషణ

c) సెర్షియోరరీ                                                     3. పరమాదేశం

d) కోవారెంటో                                                      4. బందీ ప్రత్యక్ష

జ: a-4, b-3, c-2, d-1

6. జతపరచండి.
a) హెబియస్ కార్పస్    1. To have the body of

b) మాండమస్             2. We command

c) సెర్షియోరరీ              3. To be certified

d) కోవారెంటో              4. By what authority

జ: a-1, b-2, c-3, d-4
 

         అంశం                                                                                    సంవత్సరం
a) సుప్రీం కోర్టు న్యాయమూర్తుల చట్టం (తొలగింపు)                                      1. 19737. జతపరచండి.

b) మూడో జడ్జెస్ కేసు                                                                            2. 1993

c) కొలీజియం వ్యవస్థ ఏర్పాటు                                                                 3. 1998 

d) కేశవానంద భారతి కేసు                                                                      4. 1968

జ: a-4, b-3, c-2, d-1

8. జతపరచండి.
    అంశం                                              గ్రహించిన దేశం

a) న్యాయ సమీక్ష                                       1. ఇంగ్లండ్

b) సమన్యాయపాలన                                         2. అమెరికా

c) చట్టం నిర్ధారించిన పద్ధతి                               3. జపాన్

d) సమాఖ్య వ్యవస్థ                                       4. కెనడా

జ: a-2, b-1, c-3, d-4
 

9. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అంశాలను అమెరికా నుంచి గ్రహించారు.
బి) న్యాయవ్యవస్థకు సంబంధించి సమన్యాయపాలన, ఏకీకృత న్యాయవ్యవస్థ, రిట్స్ జారీ చేయడం లాంటి అంశాలను ఇంగ్లండ్ నుంచి గ్రహించారు.
జ: ఎ, బి

10. జతపరచండి.
          అంశం                                                                                    సంవత్సరం

a) స్వాతంత్య్రం తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు                                        1. 1950 జనవరి 28

b) రాజ్యాంగ పరిషత్ అధికార చట్టసభ చివరి సమావేశం                          2. 1950 జనవరి 24

c) భారత రాజ్యాంగ ఆమోదం                                                            3. 1949 నవంబరు 26

d) భారత రాజ్యాంగం అమల్లోకి రావడం                                                  4. 1950 జనవరి 26

జ: a-1, b-2, c-3, d-4
 

11. కొలీజియంలో ఉండే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
జ: 5

 

12. జతపరచండి.
a) ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి               1. జస్టిస్ జగదీశ్ ఖేహర్

b) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నాథన్    2. జస్టిస్ రమేష్ రంగ నాథన్

c) ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా                3. ముఖుల్ రోహద్గీ

d) ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్             4. పి.వేణుగోపాల్

జ: a-1, b-2, c-3, d-4

13. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు ఉంది.
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనను పార్లమెంటు చేస్తుంది.
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
డి) సుప్రీంకోర్టు అధికార పరిధిని పార్లమెంటు పెంచగలదు.
జ: ఎ, బి, సి, డి

 

14. జతపరచండి.
      అంశం                                                                  ప్రకరణం

a) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య                                         1. 124 (2)

b) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం                                 2. 124 (4)

c) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు                                     3. 124 (3)

d) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు                                   4. 124 (1)

జ: a-4, b-1, c-3, d-2

15. కింది రాజ్యాంగ అధికారుల్లో ఎవరిని తొలగించడానికి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సంప్రదింపు అవసరం?
1) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
3) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) ప్రధాన ఎన్నికల కమిషనర్
జ: 1 (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)

 

16. కిందివారిలో ఎవరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు పాటించే విధానాలు, కారణాల ఆధారంగా తొలగిస్తారు?
ఎ) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
బి) భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
సి) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
డి) భారత అటార్నీ జనరల్
సరైన జవాబును గుర్తించండి.
జ: ఎ, బి మాత్రమే

17. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను అభిశంసన అంటారు.
బి) రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను మహాభియోగం అంటారు.
సి) దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా న్యాయమూర్తులను తొలగిస్తారు.
డి) రాజ్యాంగ ఉల్లంఘన కారణంతో రాష్ట్రపతిని తొలగిస్తారు.
జ: ఎ, బి, సి, డి

 

18. కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
1) హెబియస్ కార్పస్      2) మాండమస్     3) సెర్షియోరరి      4) ఇంజెంక్షన్
జ: 4 (ఇంజెంక్షన్)

 

19. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
జ: ఎమ్. ఫాతిమా బీబీ

 

20. న్యాయమూర్తి హిదయతుల్లా ఎన్నిసార్లు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించారు?
జ: ఒకసారి

 

21. రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని గురించి వివరిస్తుంది?
జ: 39 (a)

22. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఎక్కడ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయరాదు?
1) సుప్రీంకోర్టు      2) హైకోర్టు     3) జిల్లా, సెషన్స్ కోర్టులు      4) వీటిలో ఏదైనా
జ: 4 (వీటిలో ఏదైనా)

 

23. సుప్రీంకోర్టు అతి ముఖ్య తీర్పును ఏ సిద్ధాంతం ఆధారంగా వెలువరిస్తుంది?
జ: చట్టం ద్వారా ప్రారంభమైన పద్ధతి

 

24. కిందివాటిలో భారత సుప్రీంకోర్టు పరిధికి సంబంధించి తప్పుగా పేర్కొన్నదేది?
1) ఒరిజినల్ జూరిస్‌డిక్షన్          2) అప్పిలేట్ జూరిస్‌డిక్షన్
3) అడ్వయిజరీ జూరిస్‌డిక్షన్        4) అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్‌ఫ్లిక్ట్స్
జ: 4 (అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్‌ఫ్లిక్ట్స్)

 

25. భారత రాజ్యాంగ ఏ భాగంలో కార్యనిర్వహణ నుంచి న్యాయశాఖను వేరుచేశారు?
జ: ఆదేశిక సూత్రాలు

 

26. 'సామాజిక న్యాయం' అనే భావనను కలిగి ఉన్న అధికరణ ఏది?
జ: 38

27. జతపరచండి.
     అంశం                                     దేశం

a) పాలనా న్యాయం                              1. ఇంగ్లండ్

b) సమన్యాయం                                   2. ఫ్రాన్స్

c) డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా                       3. అమెరికా

d) ప్రొసీజర్ ఎస్టాబ్లిష్‌డ్ బై లా              4. భారత్

జ: a-2, b-1, c-3, d-4
 

28. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) రాజ్యాంగపరమైన కేసులను విచారించడానికి సుప్రీంకోర్టులో ఉండాల్సిన కనీస
న్యాయ మూర్తుల సంఖ్య (కోరం)- 5
బి) కొలీజియంలో ఉండే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య- 5
సి) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (ప్రధాన న్యాయమూర్తులతో కలిపి)- 31
జ: ఎ, బి, సి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

న్యాయసమీక్ష - న్యాయవ్యవస్థ - క్రియాశీలత 

        భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు. 1803లో అమెరికాలో మార్బరీ Vs మాడిసన్ కేసు సందర్భంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌మార్షల్ ఇచ్చిన తీర్పు న్యాయ సమీక్ష భావనకు ఆధారమైంది.


* కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వం జారీ చేసే సూత్రాలు, అమలు చేసే విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని న్యాయసమీక్ష (Judicial Review) అంటారు.
* ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ, రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ సాధనకు న్యాయ సమీక్షాధికారం దోహదపడుతుంది.
* శాసనం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని కె.ఎమ్. మున్షీ పేర్కొన్నారు.

* ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు, ఆదేశాలు, ఇతర నోటిఫికేషన్లు చెల్లవని ఆర్టికల్ - 13 ప్రకారం సుప్రీంకోర్టు రద్దు చేయడాన్నే న్యాయసమీక్షాధికారం అంటారు.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 13(2) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు కల్పించారు.

 

జె.సి. జోహారి అనే రాజనీతి వేత్త ప్రకారం న్యాయ సమీక్షకు ఆధారాలైన సిద్ధాంతాలు
1) శాసన సామర్థ్య సిద్ధాంతం - (Doctrine of Legislative Competence)
2) రాజ్యాంగ పురోభావన సిద్ధాంతం - (Doctrine of Prospectivism)
3) క్రియాశీల సిద్ధాంతం - (Doctrine of Dynamism)
4) అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం - (Doctrine of Empirical)
5) వేర్వేరు భాగ సిద్ధాంతం - (Doctrine of Severability)
6) రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం - (Doctrine of Spirit of Constitutionalism)

 

భారత్‌లో న్యాయసమీక్ష అభివృద్ధి క్రమం
* 1951లో చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు సందర్భంగా మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కొన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
* 1951లో ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ థాపర్‌ను కారణాలు చెప్పకుండా నిర్భందించడం వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.

* 1952లో శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, 1965లో సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, రాజ్యాంగ సవరణలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని పార్లమెంటు చేసే సాధారణ చట్టాలు మాత్రమే న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్, 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్, 13లో భాగంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* 1969లో ఆర్.సి. కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుకోసం జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, అవి చెల్లవని పేర్కొంది.
* 1973లో కేశవానందభారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉల్లంఘించరాదని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎమ్. సిక్రీ
* 1980లో మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమని పేర్కొంది.

* 1994లో ఎస్.ఆర్. బొమ్మై Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రవేశికలోని లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని, దాన్ని రద్దు చేసే అధికారం లేదని పేర్కొంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఎన్. వెంకటాచలయ్య.
* 1997లో చంద్ర కుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
* 1975లో ఇందిరా గాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, 39వ రాజ్యాంగ సవరణ చట్టం చట్ట సమానత్వానికి విరుద్ధమైందని, అది చెల్లదని పేర్కొంది.
* 1978లో మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అమెరికాలో అమల్లో ఉన్న Due Process of Law అనే సూత్రాన్ని వినియోగిస్తూ, సహజ న్యాయ సూత్రాలను ప్రాథమిక హక్కులకు వర్తింపజేయాలని పేర్కొంది.
* 1992లో ఇందిరాసహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
* 2007లో అశోక్ కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్టికల్ - 15(5)ను చేర్చడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

* 2007లో ఐ.ఆర్. కొల్హోయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, తమిళనాడులో రిజర్వేషన్లు 69% పెంచడానికి సంబంధించి 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను వ్యతిరేకించింది. 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలేవైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు గురిచేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
* న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించేపటప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి:
1) ఇంట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్ అంటారు.
2) అల్ట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని అల్ట్రావైర్స్ అంటారు.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారంపై అనేక పరిమితులు విధించింది.
* మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్షాధికారాన్ని పునరుద్ధరించింది.
* భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించింది.

* అమెరికా సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సమీక్ష చేసే అధికారం ఉంది. అమెరికాలో న్యాయశాఖకు ఆధిక్యత ఉంది.
* What is law is - What the Judges say (న్యాయమూర్తులు చెప్పిందే న్యాయం) అనేది అమెరికాలో అమల్లో ఉన్న నానుడి.
* భారత్‌లో న్యాయ శాఖ ఆధిక్యత కంటే రాజ్యాంగ ఆధిక్యత ఎక్కువ. అంటే భారత్‌లో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారం నిరపేక్షమైంది కాదు.
* మన దేశంలో హైకోర్టులకు రాజ్యాంగ సవరణలను విచారించే అధికారం లేదు.

 

మన దేశంలో న్యాయసమీక్షకు అవకాశం లేని అంశాలు
* ఆర్టికల్, 53 - దేశపాలనాధికారాలు మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం.
* ఆర్టికల్, 74(1) - ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు.
* ఆర్టికల్ 77(1) - రాష్ట్రపతి పేరు మీద, రాష్ట్రపతి ద్వారా మాత్రమే పాలన నిర్వహించడం.
* ఆర్టికల్, 105 - పార్లమెంటు సభ్యులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, వసతులు.
* ఆర్టికల్, 122 - పార్లమెంటు వ్యవహారాలపై న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు.
* ఆర్టికల్, 82 - డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ) కమిషన్ సూచనలను అనుసరించి లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం.

* ఆర్టికల్, 154 - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 163(1) - రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు పాలనలో అందించే సలహాలు
* ఆర్టికల్, 166(1) - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 194 - శాసన సభ్యులకు కల్పించిన ప్రత్యేక రక్షణలు, సౌకర్యాలు.
* ఆర్టికల్, 212 - రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు
* ఆర్టికల్, 341 - షెడ్యూల్డు కులాల జాబితాపై భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలు.
* ఆర్టికల్, 342 - షెడ్యూల్డు తెగలకు సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* ఆర్టికల్, 329 - ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాని కార్యకలాపాల్లో ....
* ఆర్టికల్, 361 - రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించిన ప్రత్యేక మినహాయింపులు.
* ఆర్టికల్, 392(2) ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి, ఏవైనా అంశాలను ప్రస్తుత రాజ్యాంగంలోకి తీసుకోవడానికి రాష్ట్రపతి జారీచేసే ఉత్తర్వులను పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాలు.
* 2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు.
* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు.

న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే అంశాలు
* రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అన్వయించడంలో తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 13 - ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే శాసనాలు.
* ఆర్టికల్, 73 - కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తెలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 162 - రాష్ట్రప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 131 - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 132 - రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లను విచారించడం.
* ఆర్టికల్, 137 - సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయడం.
* ఆర్టికల్, 147 - రాజ్యాంగానికి అర్థవివరణ, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
* ఆర్టికల్, 246 - పార్లమెంటు, శాసనసభల శాసనాధికార పరిధి.
* ఆర్టికల్, 248 - అవశిష్టాధికారాలను నిర్ణయించడం.
* ఆర్టికల్, 254 - ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తలెత్తే విభేదాలు.
* ఆర్టికల్, 368 - రాజ్యాంగ సవరణకు సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 352 - జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 356 - రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన
* ఆర్టికల్, 123 - రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 213 - రాష్ట్రాల గవర్నర్లు జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 11 - పౌరసత్వానికి సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని బ్రిటన్‌తో పోల్చినప్పుడు ఉన్నతంగా, అమెరికాతో పోల్చినప్పుడు పరిమితంగా ఉంటుంది.
* బ్రిటన్‌లో ఆ దేశ పార్లమెంటు చేసిన శాసనాలను న్యాయ సమీక్షకు గురిచేసే అధికారం ఆ దేశ న్యాయవ్యవస్థకు లేదు.
* అమెరికాలో శాసన వ్యవస్థ రూపొందించే శాసనాలను, కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలను ఆ దేశ న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షకు గురిచేయగలదు.

 

న్యాయశాఖ - క్రియాశీలత
* జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ప్రకారం 'ప్రతి న్యాయమూర్తి కూడా ఒక క్రియాశీలి. అది అనుకూలంగా కావచ్చు లేదా వ్యతిరేకంగా కావచ్చు'.

* న్యాయశాఖ క్రియాశీలత అంటే న్యాయవ్యవస్థ తన అధికారాలు, విధులను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం. న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో నూతన పద్ధతులను, ప్రక్రియలను వినియోగించి సమన్యాయపాలనకు అవసరమైన చర్యలను చేపట్టడం.
* శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ తమ రాజ్యాంగ లక్ష్యాల సాధనలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల నెలకొనే పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాపాడటానికి; న్యాయవ్యవస్థ స్పందించి శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, వాటిపై ప్రభావం చూపుతూ అవి క్రియాశీలకంగా వ్యవహారించడానికి న్యాయశాఖ తీసుకునే చర్యలనే న్యాయశాఖ క్రియాశీలతగా పేర్కొంటారు.

 

న్యాయశాఖ క్రియాశీలత - ప్రాధాన్యం
* సామాన్య ప్రజలకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం.
* సమన్యాయపాలను, పరిపాలనలో జవాబు దారీతనాన్ని పారదర్శకతను పెంపొందించడం.
* రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలను సాధించడం.
* భారత సమాఖ్య వ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం కృషి.
* అణగారిన, వివక్షతకు గురైన వర్గాలకు న్యాయాన్ని అందించడం.
* సున్నితమైన అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా, పరిష్కరించకుండా ఉన్న సందర్భంలో ప్రజలు అసంతృప్తికి గురికాకుండా పరిష్కారం చూపడంలో న్యాయశాఖ క్రియాశీలత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

* దత్త శాసనాధికారాల వల్ల కార్యనిర్వాహక శాఖ అధికారాలు విస్తృతమై అధికార దుర్వినియోగం, జవాబుదారీతనం లోపించడం.
* ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, అభిలషణీయమైన నిర్ణయాలను ప్రభుత్వాలు రూపొందించడంలో విఫలం కావడంతో, ప్రజల కనీస అవసరాలు తీరకపోవడం.
* ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) ద్వారా లోకస్ స్టాండి (న్యాయ అర్హతా నియమం)లో మార్పులు చేయడం, బాధితుల తరఫున వాదించడం కోసం న్యాయస్థానం అమికస్ క్యూరీని నియమించడం.
* సుమోటో కేసులను ప్రోత్సహించడం ద్వారా
* సామాజిక స్ఫూర్తి ఉన్న ప్రజా ప్రయోజనాలను ఆశించే వ్యవస్థలను ప్రోబోనో పబ్లికోగా వర్ణిస్తారు. అలాంటి వారి వాదనను న్యాయస్థానాలు అనుమతించడం ద్వారా న్యాయశాఖ క్రియశీలత వర్థిల్లుతుందని చెప్పవచ్చు.

 

న్యాయశాఖ క్రియాశీలత - కేసులు 

ఎమ్.సి. మెహతా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* తాజ్‌మహల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాలైన పరిశ్రమలను వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సునీల్ భాత్రా Vs ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్:
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ తీహార్ జైలులో నిర్బంధించిన ఖైదీలను మానవీయ విలువలకు విరుద్ధంగా, శిక్షా గది పేరుతో క్రూరంగా పరిగణించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది.

 

లక్ష్మీకాంత్ పాండే Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, భారతీయ బాలబాలికలను విదేశీయులు దత్తత తీసుకునే సందర్భంలో బాలల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొంది.

 

వినాసేత్ Vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కార్యనిర్వాహక శాఖ నిర్లక్ష్యం వల్ల విచారణలో ఉన్న ఖైదీలు 20 నుంచి 30 ఏళ్ల వరకు జైలులో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

 

ఓల్గా టెల్లిస్ Vs బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఫుట్‌పాత్‌లపై నివసించే పేదలను ముందుగా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడంతోపాటు వారు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని పేర్కొంది.

విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పినిస్తూ మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై అనేక మార్గదర్శక సూత్రాలను జారీచేసింది.

 

ఇతర కేసులు - వివాదాలు 
* బిహార్‌లో పశుగ్రాసం కేసు
* కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్. బొమ్మై తొలగింపు వివాదం
* ఫరీదాబాద్ గనుల్లో పనిచేసే బాల కార్మికుల స్థితిగతులపై బంధువా ముక్తి మోర్చా అనే స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు
* ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి వివాదం
* కామన్ కాజ్ కేసు సందర్భంగా పెట్రోల్ బంకుల కేటాయింపు
* వాహనాలపై ఎర్ర బుగ్గలు, సైరన్‌ల వాడకం
* రామసేతు వివాదంలో తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కిందికి ప్రకారం రద్దుచేస్తామని హెచ్చరించడం.
* వినీతా నారాయణ్ కేసులో జైన్ హవాలా కుంభకోణంలో జైన్ సోదరుల డైరీలో పేర్కొన్న రాజకీయ నాయకులపై కేసును నమోదు చేయాలని సీబీఐని ఆదేశించడం.
* డి.కె. బసు కేసు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన పోలీసు సంస్కరణలు

ప్లీ బార్గెయ్‌నింగ్ (Plea Bargaining)
* దీన్ని 2006 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నిందితులు నేరాన్ని అంగీకరిస్తే న్యాయస్థానం విచారణను ఆపి, అతడికి తక్కువ శిక్షను విధించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి.

 

సామాజిక న్యాయ బెంచ్ (Social Justice Bench)
 దీన్ని 2014, డిసెంబరు 12న ప్రారంభించారు. ప్రజల సామాజిక సమస్యలను, ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే సామాజిక న్యాయ బెంచ్. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెంచ్ సమావేశం అవుతుంది. ఇది సుప్రీంకోర్టులో సామాజిక న్యాయానికి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న కేసులతోసహా కొత్త కేసులను కూడా విచారిస్తుంది.

 

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
 1992లో యూఎన్‌వో పర్యావరణ, అభివృద్ధి సమావేశం రియో డీ జనిరోలో చేసిన తీర్మానాల ఆధారంగా పార్లమెంటు 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చట్టాన్ని రూపొందించింది.

 

ముఖ్యాంశాలు
* ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ దీనిలో ఒక ఛైర్మన్, 10 మంది సభ్యులకు తక్కువ కాకుండా 20 మంది సభ్యులకు మించకుండా, జ్యూడిషియల్ మెంబర్స్ ఉంటారు.
* దీని ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఛైర్మన్ లేదా జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 75 సంవత్సరాలు.
* హైకోర్టు న్యాయమూర్తులు జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 67 సంవత్సరాలు.
* ఇతర నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.

 

అధికారాలు - విధులు
* పర్యావరణానికి సంబంధించిన అన్ని ముఖ్య వివాదాలు దీని పరిధిలోకి వస్తాయి.
* అటవీ పరిరక్షణ చట్టం, జీవ వైవిద్య పరిరక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం లాంటి వాటిని విచారిస్తుంది.
* ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రత్యేక సందర్భాల్లో 90 రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

 

లోక్ అదాలత్
* దీన్ని ప్రజాన్యాయస్థానం, సంచార న్యాయస్థానం అంటారు.
* మన దేశంలో న్యాయవ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలో తక్షణ న్యాయాన్ని అందించడం దీని లక్ష్యం.
* లోక్ అదాలత్ విధానాన్ని 1987లో ప్రవేశపెట్టారు.

* దీని అమలు కోసం 1987లో లీగల్ ఏడ్ అథారిటీని ఏర్పాటు చేశారు.
* ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయసహాయాన్ని అందించాలి.
* మధ్యవర్తుల సహకారంతో, రాజీమార్గం ద్వారా ఇరువర్గాల సమ్మతితో కేసులు పరిష్కారమవుతాయి.
* 2002లో లీగల్ ఏడ్ అథారిటీ యాక్ట్‌కు సవరణలు చేసి, లోక అదాలత్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
* దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు మొదలుకొని, జిల్లా సెషన్స్ కోర్టు, ఇతర సబార్డినేట్ కోర్టులు కూడా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తాయి.
* మోటారు వాహనాలకు సంబంధించిన కేసులు, ఇన్య్సూరెన్స్ క్లైమ్స్, ఆస్తి వివాదాలు, వివాహం, విడాకులు, భూసేకరణ లాంటి కేసులను లోక్ అదాలత్‌లో విచారిస్తారు.

 

గ్రామ న్యాయాలయాల చట్టం
* డి.ఎ. దేశాయ్ కమిషన్ సిఫారసు మేరకు చిన్న కేసులను సత్వరం విచారించే లక్ష్యంతో 2008లో భారత పార్లమెంటు గ్రామ న్యాయాలయాల చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా 5067 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశారు.
* హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తాయి.
* గ్రామ న్యాయాలయాలు 2009, అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

* ఈ చట్టం జమ్మూకశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు, ఆదివాసీ ప్రాంతాలు మినహా దేమంతటా వర్తిస్తుంది.
* క్రిమినల్, సివిల్ కేసులకు మరణశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, 2 ఏళ్లకు పైబడి శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులను మినహాయించి, మిగిలిన అన్నిరకాల వివాదాలపై విచారణ నిర్వహిస్తాయి.

 

ఫ్యామిలీ కోర్టులు
* 1984లో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా కుటుంబ సంబంధ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేశారు.
* వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశాలపై తలెత్తే సివిల్ వివాదాలను పరిష్కరించే నేపథ్యంలో ఈ కోర్టులను ఏర్పాటు చేశారు.
* 2014లో గాంధీ నగర్ ఫ్యామిలీ కోర్టు మాజీ క్రికెటర్ దల్వీర్ సింగ్ కేసులో భార్యనే భర్తకు భరణం చెల్లించాలని అరుదైన తీర్పును ఇచ్చింది.

 

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
* 11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2000లో మనదేశంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు.
* అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

* 2000లో మనదేశంలో 492 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య 1192.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 242 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
* రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఖర్చులతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను నిర్వహిస్తున్నాయి.

 

జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ (National Legal Services Authority)
* 1987లో జాతీయ న్యాయసలహా సేవల చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1998లో జాతీయ న్యాయసేవల అధికార సంస్థ ఏర్పడింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకులుగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తారు. ఆర్టికల్, 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం దీని లక్ష్యం.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కౌటిల్యుడి - అర్థశాస్త్రం

* అర్థశాస్త్రం అనేది ప్రముఖ రాజనీతి గ్రంథం. దీన్ని చంద్రగుప్త మౌర్యుడి ప్రధాని అయిన కౌటిల్యుడు రచించాడు. సంస్కృత భాషలో రాసిన ఈ గ్రంథంలో 6000 శ్లోకాలు, 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 1909లో ఆచార్య శ్యామశాస్త్రి ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఈ గ్రంథం మౌర్యుల 

పరిపాలనా విధానాన్ని వివరిస్తుంది.

* రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? ప్రజల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి? ప్రభుత్వ ఉద్యోగుల విధివిధానాలు, ప్రజాసంక్షేమాన్ని ఎలా సాధించాలి? అనే అంశాలను ఈ గ్రంథంలో వివరించారు.

* శత్రునిర్మూలనకు, రాజకీయ లక్ష్యాల సాధనకు కఠినమైన నియమాలు అనుసరించాలని, ‘మార్గం కంటే లక్ష్యమే ముఖ్యం’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అందుకే ఈయన్ను ‘‘భారతీయ మాకియవెల్లీ’’ (Indian Machiavelli)గా పిలుస్తారు.

* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ‘‘నీటిలో బతికే చేప నీరు తాగడాన్ని ఎలా గమనించలేమో, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవడాన్ని అలాగే గుర్తించలేం’’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు.

* ప్రజల ఆనందంలోనే రాజు/ చక్రవర్తి ఆనందం ఉంటుందని, అలాగే ప్రజలందరూ భావించిన మంచినే రాజు కూడా మంచిదిగా గుర్తించాలని ఆయన తెలిపారు.

గుప్తుల పరిపాలనా విధానం

మనదేశంలో గుప్త చక్రవర్తుల పాలనను ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు. వీరి పాలన గురించి కామందకుడు ‘నీతిసారం’ అనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రకారం వీరి పాలనను కింది విధంగా చెప్పొచ్చు.

చక్రవర్తి: రాజ్యాధిపతి, సర్వాధికారి.

బలాధికర్నిక: సర్వసైన్యాధ్యక్షుడు. 

దండ పాసాధికర్నిక: రక్షకభటాధికారి.

రణభండాగారిక: సైనిక కోశాధికారి.

వినయస్థితి స్థాపక: శాంతిభద్రతలు, న్యాయశాఖా మంత్రి.

భటస్వపతి: పదాతి, అశ్వికదళ సేనాధిపతి.

మహాపిలుపతి: గజదళ సేనాధిపతి.

సాధనిక: అప్పులు, జరిమానాలను పర్యవేక్షించే అధికారి.

హిరణ్య సముద్రిక: కరెన్సీ అధికారి.

తాడయుక్తక: కోశాధికారి.

జౌనస్థానిక: సిల్కు కర్మాగారాలను పర్యవేక్షించే అధికారి.

అగ్రహారిక: అగ్రహారాల పర్యవేక్షక అధికారి.

కరణిక: పత్రాల పర్యవేక్షకుడు.

అవస్థిక: ధర్మశాలల పర్యవేక్షకుడు.

మొగల్‌ చక్రవర్తుల పరిపాలనా విధానం

మొగల్‌ చక్రవర్తుల పాలనా కాలంలో సుస్థిర పాలన అభివృద్ధి చెందింది. వీరి పరిపాలనా విధానం గురించి అబుల్‌ ఫజల్‌ ‘ఐనీ అక్బరీ’, ‘అక్బర్‌నామా’ అనే గ్రంథాలు రాశారు. బదౌనీ రచించిన ‘ముంతకాబ్‌-ఉల్‌-తవారిక్‌’, అబ్దుల్‌ హమీద్‌ లాహిరీ గ్రంథమైన ‘పాదుషానామా’లోనూ వీరి పాలన గురించి ఉంది.

కేంద్ర ప్రభుత్వం - పరిపాలన:

చక్రవర్తి: చక్రవర్తి సర్వాధికారి. ఇతడి మాటే శాసనం.

వకీలు: ప్రధానమంత్రి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇతడి ఆధీనంలో ఉంటుంది.

దివాన్‌-ఇ-వజీర్‌: ఆర్థిక మంత్రి.

మీర్‌బక్షి: సేనాధిపతి. 

సదుర్‌-ఉస్‌-సుదుర్‌: మత, ధార్మిక సంస్థల పర్యవేక్షణ అధికారి.

ఖాజి- అల్‌- ఖజాద్‌: న్యాయ వ్యవహారాలను నిర్వహించే అధికారి.

ఖాన్‌-ఇ-సమాన్‌: రాజు అంతఃపుర విషయాలను పర్యవేక్షించే అధికారి.

దరోగా-ఇ-తోప్‌ఖానా: తుపాకులు, ఫిరంగుల విభాగానికి అధిపతి.

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన:

* పరిపాలనా సౌలభ్యం కోసం మొగల్‌ పాలకులు తమ రాజ్యాన్ని ‘సుబాలు’గా విభజించారు. 

* సుబా పాలకుడు ‘సుబేదార్‌’. ఇతడు పౌర, సైనిక అధికారాలను కలిగి ఉంటాడు.

* ‘సుబేదార్‌’కు పరిపాలనలో సహకరించేందుకు దివాన్, అమీర్, ఫౌజ్‌దార్, పోద్దార్‌ అనే అధికారులు ఉండేవారు.

* ప్రతి ‘సుబా’ను పరిపాలనా సౌలభ్యం కోసం ‘సర్కారులు’గా విభజించారు. 

* సర్కార్‌ పాలనాధికారి ‘ఫౌజ్‌దార్‌’. ఇతడికి పాలనలో సహకరించేందుకు ‘అమల్‌ గుజార్‌’, ‘ఖజానాదారు’, ‘బితిక్చి’ మొదలైన ఉద్యోగులు ఉండేవారు.

* అమల్‌ గుజార్‌’ శిస్తు వసూలు చేసే అధికారి. ఇతడికి  ‘బితిక్చి’ అనే కింది స్థాయి ఉద్యోగి సహకరించేవాడు.

* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి ‘సర్కార్‌’ను ‘పరగణా’ లేదా ‘మహల్‌’గా విభజించారు. పరగణా పాలనాధికారి ‘షిక్‌దార్‌’.

* ‘పరగణా’లో శిస్తు నిర్ణయించి, వసూలు చేసే అధికారి ‘అమీర్‌’.

* ‘పరగణా’లో ఖజానా అధికారి ‘పోద్దార్‌’.

* ‘పరగణా’ పరిధిలో ఉండే గ్రామ నిర్వాహకులను పర్యవేక్షించడానికి ‘కానుంగో’ అనే అధికారి ఉండేవాడు.

* గ్రామ పాలనను గ్రామపంచాయతీలు నిర్వహించేవి. గ్రామస్థాయిలో ‘మక్‌దన్‌’, ‘పట్వారీ’ అనే ఉద్యోగులు ఉండేవారు. వీరు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించే వారు.

నగర పాలన:

మొగలుల కాలంలో రాజ్యానికి కావాల్సిన ముఖ్యమైన నగర పాలనను ‘కొత్వాల్‌’ అనే ఉద్యోగి నిర్వహించేవారు. ఇతడు నగరంలో శాంతి-భద్రతలను పరిరక్షించడం, ధరలను క్రమబద్ధీకరించడం మొదలైన విధులను నిర్వహించేవాడు.

దహ్‌సాల పద్ధతి: 

దీన్ని రాజాతోడర్‌మల్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పదేళ్ల సరాసరి పంటను, పది సంవత్సరాల ధరలను ప్రమాణంగా తీసుకుని పన్నులు నిర్ణయించేవారు.

మౌర్యుల పరిపాలన విధానం

భారతదేశ చరిత్రలో మౌర్య చక్రవర్తులు మొదటిసారి దేశంలోని అత్యధిక భాగాన్ని ఒకే పాలన కిందకు తీసుకువచ్చారు. వీరు చక్కని పరిపాలనా వ్యవస్థను ఏర్పరచుకుని పాలనలో ఏకరూపతను పెంపొందించారు. వీరు అత్యంత కేంద్రీకృత పాలనను ఏర్పరిచారు. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని స్వరూపం కింది విధంగా ఉండేవి.

చక్రవర్తి (స్వామి): పరిపాలనలో చక్రవర్తి సర్వాధికారి. ఇతడు రాజ్యపాలకుడు, సర్వసైన్యాధ్యక్షుడు, శాసనకర్త.

మంత్రి పరిషత్‌: రాజ్యపాలనలో చక్రవర్తికి సహకరించడానికి ఏర్పాటు చేసిన కొంతమంది వ్యక్తుల బృందం. మంత్రుల ఎన్నిక తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగానే జరిగేదని అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నారు.

అమాత్య: ఉద్యోగి పాలన, కార్యనిర్వాహక అధికారులు.

అధ్యక్ష: వివిధ విభాగాల బాధ్యుడు.

సన్నిధాత: ముఖ్య కోశాధికారి.

సమాహర్త: ముఖ్య రెవెన్యూ అధికారి.

దండపాల: ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌.

అక్షపటల్‌: అకౌంటెంట్‌ జనరల్‌.

కార్మిక: వివిధ విభాగాల్లో పనిచేసే లేఖకులు.

ధమ్మమహామాత్ర: ధర్మ ప్రచారానికి కృషి చేసేవారు.

అంతమహామాత్రులు: సరిహద్దు ప్రజలు, గిరిజనులతో కలిసి పనిచేసేవారు.

మహాపాత్ర: నగరాల్లోని న్యాయమూర్తులు.

ఇతిజఖ మహామాత్ర: స్త్రీల పర్యవేక్షణాధికారులు.

ప్రాదేశిక: జిల్లాస్థాయిలో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి.

గణికాధ్యక్షులు: వేశ్యలపై పర్యవేక్షణ చేసేవారు.

రజ్జుక: న్యాయాధికారి. జిల్లాస్థాయిలో భూసర్వే, మదింపు జరిపే అధికారి.

యుక్త: జిల్లాస్థాయి కోశాధికారి.

పతివేదికలు: ప్రజల సమాచారాన్ని రాజుకు చేరవేసే అధికారులు.

పులిసాని: దిగువస్థాయిలో రాజు ప్రతినిధి.

నాగరిక: పట్టణస్థాయిలో శాంతిభద్రతలు, పరిశుభ్రత లాంటి అంశాలను పర్యవేక్షించే అధికారి.

సేనాపతి: సైన్యాధిపతి.

గ్రామిక: గ్రామ పాలనా బాధ్యుడు.

గూఢ పురుష: రాజ్యంలోని గూఢచారులు.

కంఠకశోధన: న్యాయస్థానం (క్రిమినల్‌ వివాదాలను విచారిస్తుంది.)

రూపదర్శక: నాణేలను పరీక్షించేవాడు.

అగరనోమై: మార్కెట్‌ కమిషనర్లు.

ధర్మస్థేయ: న్యాయస్థానం (సివిల్‌ వివాదాలను విచారిస్తుంది.)

* మౌర్యుల కాలంలో 10 గ్రామాలకు సంగ్రహ న్యాయస్థానం, 400 గ్రామాలకు ద్రోణముఖ న్యాయస్థానం, 800 గ్రామాలకు ఒక ప్రాంతీయ న్యాయస్థానం ఉండేవి.

* గ్రామ పరిపాలనకు, జిల్లా పరిపాలనకు మధ్యస్థాయిలో 5 నుంచి 10 గ్రామాలను ఒక భాగంగా ఏర్పాటు చేశారు.  దీనికి సంబంధించిన లెక్కలను, పద్దులను ‘గోప’ అనే అధికారులు నిర్వహించేవారు. ‘స్థానిక’ అనే అధికారి ఈ భాగంలో పన్నులు వసూలు చేసేవారు.

* ప్రతి గ్రామంలోనూ గ్రామ పెద్ద (గ్రామిక) ఉండేవారు. ఈయన గ్రామ పరిపాలనా విషయాలను గమనిస్తూ ‘గోప’కు బాధ్యత వహించేవారు.

పట్టణ పరిపాలన

మనదేశంలో పట్టణ పరిపాలనను అభివృద్ధి చేసిన పాలకులుగా మౌర్యులను పేర్కొంటారు. మెగస్తనీస్‌ రాసిన ‘ఇండికా’ గ్రంథం ప్రకారం మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్ర నగర పాలనను 30 మంది సభ్యుల బృందం చూసుకునేది. అయిదుగురు సభ్యులతో కూడిన 6 కమిటీలు సమర్థవంతంగా పట్టణ పాలనను నిర్వహించేవి. అవి: 

1. జనన మరణాల రికార్డుల నిర్వహణ కమిటీ

2. తూనికలు, కొలతల నిర్వహణ కమిటీ

3. విదేశీ యాత్రికుల సదుపాయాల కమిటీ

4. పరిశ్రమలు, చేతివృత్తుల కమిటీ

5. వస్తువుల ఉత్పత్తి, నాణ్యత, అమ్మకం కమిటీ

6. వస్తువుల అమ్మకంపై 10 శాతం పన్ను వసూలు చేసే కమిటీ.

రచయిత: బంగారు సత్యనారాయణ, విషయ నిపుణులు 

Posted Date : 18-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుప్రీంకోర్టు - అధికారాలు, విధులు

1. కింది వాటిలో భారత సుప్రీంకోర్టుకు సంబంధించి సరైనవి ఏవి?

i) రూపకర్త గణేశ్‌ బికాజీ డియోల్కర్‌

ii) ఇది న్యూదిల్లీలోని తిలక్‌రోడ్డులో ఉంది

iii) దీని తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.జె.కానియా

iv) రెండో ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి

1) i, ii, iii      2) i, iii, iv         3) i, ii, iv      4) పైవన్నీ

జ: పైవన్నీ  


2. న్యాయమూర్తులను నియమించే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ‘కొలీజియం’ సలహాను పొందాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

1) ప్రకాష్‌కదం VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) నళినీ ముఖర్జీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రాకేష్‌ మోహన్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

జ: సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు​​​​​​​   


3. 1998లో ఏ భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 ప్రకారం కొలీజియంపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందారు?

1) కె.ఆర్‌.నారాయణన్‌              2) ప్రతిభా పాటిల్‌ 

3) ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం                 4) శంకర్‌దయాళ్‌శర్మ

జ: కె.ఆర్‌.నారాయణన్‌ 


4. 1999లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ‘కొలీజియం’లో సభ్యులుగా ఎవరుంటారు?

1) ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు న్యాయమూర్తులు

2) ప్రధాన న్యాయమూర్తి, మరో ఆరుగురు న్యాయమూర్తులు

3) ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, మరో ఏడుగురు న్యాయమూర్తులు

4) ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి

జ: ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు న్యాయమూర్తులు​​​​​​​  


5. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం ‘‘నేషనల్‌ జడ్జెస్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌’’ను ఏర్పాటు చేసింది?

1) 120వ రాజ్యాంగ సవరణ చట్టం       2) 121వ రాజ్యాంగ సవరణ చట్టం

3) 99వ రాజ్యాంగ సవరణ చట్టం         4) 124వ రాజ్యాంగ సవరణ చట్టం

జ: 99వ రాజ్యాంగ సవరణ చట్టం    


6. ‘‘నేషనల్‌ జడ్జెస్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌’’ (NJAC) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది?

1) అక్టోబరు 16, 2015        2) ఆగస్టు 22, 2016

3) జులై 18, 2015           4) మార్చి 26, 2016

జ: అక్టోబరు 16, 2015​​​​​​​    


7. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. 

i) 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎ.ఎన్‌.రే నియమితులయ్యారు

ii) 1977లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎం.హెచ్‌. బేగ్‌ నియమితులయ్యారు.

iii) సుప్రీంకోర్టుకు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌

iv) సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి మీరా సాహెబ్‌ ఫాతిమా బీబీ

1) i, ii, iii         2) i, iii, iv          3) i, ii, iv        4) పైవన్నీ 

జ: i, ii, iii    ​​​​​​​  


8. ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ (Court of Record) ను కింది వాటిలో ఏ విధంగా పేర్కొంటారు?

1) సంప్రదింపుల అధికార పరిధి (Consultative Jurisdiction)

2) అనుపూర్వికాలు (Precidents)

3) ఏర్పాటు, నిర్మాణం (Establishment & Composition)

4) పౌర సమాజం (Civil Society)

జ: అనుపూర్వికాలు (Precidents)​​​​​​​  


9. సుప్రీంకోర్టు ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’కు సంబంధించి సరైంది ఏది?

i) సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పుల సారాంశాన్ని రికార్డుల రూపంలో భద్రపరచడాన్ని ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ అంటారు.

ii) ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ దేశంలోని అన్ని న్యాయస్థానాలకు శిరోధార్యం లాంటిది.

iii) దీని అమలు సరిగా లేకపోతే కోర్టు ధిక్కరణలో భాగంగా నేరంగా పరిగణిస్తారు.

iv) ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 135 తెలుపుతుంది.

1) i, ii, iv        2) i, iii, iv        3) i, ii, iii        4) పైవన్నీ

జ: i, ii, iii​​​​​​​   


10. ఏ కేసు సందర్భంగా 1951లో సుప్రీంకోర్టు తొలిసారిగా ‘‘న్యాయసమీక్షాధికారాన్ని’’ (Judicial Review) వినియోగించింది?

1) శంకరీ ప్రసాద్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) షంషేర్‌ సింగ్‌ VS స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

3) రామేశ్వర్‌ ఠాగూర్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రతన్‌సింగ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

జ: శంకరీ ప్రసాద్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు​​​​​​​   


11. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల ‘‘న్యాయసమీక్షాధికారం’’పై పరిమితులు విధించారు?

1) 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

3) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

4) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

జ: 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976​​​​​​​  


12. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం న్యాయస్థానాలకు గల న్యాయసమీక్షాధికారాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పునరుద్ధరించింది?

1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985

2) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

3) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977

4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

జ: 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977​​​​​​​  


13. ఓబీసీ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు సమంజసమేనని, సంక్షేమ స్వభావమూ రాజ్యాంగ మౌలిక రూపంలో అంతర్భాగమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

1) ఇందిరా సహానీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) ఎ.కె.గోపాలన్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) అనుపమ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) చంపకం దొరై రాజన్‌ VS స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసు

జ: ఇందిరా సహానీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


14. సుప్రీంకోర్టు - ధర్మాసనాల (Supreme court Benches) కు సంబంధించి సరైంది ఏది?

i) సింగిల్‌ జడ్జి బెంచ్‌లో ఒక న్యాయమూర్తి మాత్రమే ఉంటారు

ii) డివిజన్‌ బెంజ్‌లో 2-3 న్యాయమూర్తులు ఉంటారు

iii) ఫుల్‌ బెంచ్‌లో 3-5 న్యాయమూర్తులు ఉంటారు

iv) రాజ్యాంగ ధర్మాసనం (Constitutional Bench) లో అయిదుగురు, అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉంటారు.

1) i, ii iii      2) i, ii, iv        3) i, iii iv          4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​  


15. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.

i) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

ii) ఆర్టికల్‌ 121 ప్రకారం అభిశంసన తీర్మానం ఉన్నప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంటులో చర్చించకూడదు.

iii) ఆర్టికల్‌ 124 ప్రకారం పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశంలోని ఏ న్యాయస్థానంలోనూ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు.

1) i ii మాత్రమే        2) i, iii మాత్రమే         3) ii, iii మాత్రమే      4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​  


16. ఆర్టికల్‌ 127 ప్రకారం సుప్రీంకోర్టులో నియమితమయ్యే ‘‘తాత్కాలిక న్యాయమూర్తుల’’ పదవీ కాలం ఎంత?

1) 2 సం.లు      2) 3 సం.లు        3) 4 సం.లు      4) 6 నెలలు

జ: 2 సం.లు

​​​​​​​ 
17. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. 

i)  గోలక్‌నాథ్‌ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు

ii) కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి - ఎస్‌.ఎం.సిక్రీ

iii) ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - ఎం.ఎన్‌.వెంకటాచలయ్య

iv) అయోధ్య తీర్పు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - రంజన్‌ గొగోయ్‌

1) i, ii, iii     2) i, iii, iv           3) i, ii, iv     4) పైవన్నీ

జ: పైవన్నీ

  
18. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ‘‘పునఃసమీక్ష’’ చేయాలని కోరుతూ వేసే పిటిషన్‌ను ఏమంటారు?

1) ప్లీబార్గెయిన్‌       2) ఇంట్రావైర్స్‌      3) క్యూరేటివ్‌       4) రిడక్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌

జ: క్యూరేటివ్‌​​​​​​​


19. సుప్రీంకోర్టు ధ్రువీకరించిన లేదా ప్రకటించిన అన్ని అంశాలను దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్, 139      2) ఆర్టికల్, 140        3) ఆర్టికల్, 141      4) ఆర్టికల్, 142

జ:  ఆర్టికల్, 141 


20. మన దేశంలో ‘‘న్యాయశాఖ క్రియాశీలత’’కు కారణాన్ని గుర్తించండి.

1) శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధుల నిర్వహణలో విఫలమయ్యాయని భావించడం.

2) ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా మూడో వ్యక్తి కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడం

3) న్యాయస్థానాలు ‘‘స్వయం ప్రేరిత’’ (Suo-moto) కేసులను చేపట్టడం

4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​ 

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విధాన పరిషత్తు

 శాశ్వతమే.. కానీ రద్దవుతుంది!

  అది మేధావుల సభ. కళాకారులు గళం విప్పే వేదిక. అక్కడ జరిగే సమావేశాల్లో ఉపాధ్యాయులూ ఉత్సాహంగా పాల్గొంటారు. విధాన నిర్ణయాల్లో సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, సేవారంగాల నిపుణులు భాగస్వాములవుతారు. శాసన ప్రక్రియలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. విభిన్న వర్గాల ప్రాతినిధ్యంతో విరాజిల్లే ఆ విశిష్ట మండలి ఉనికి శాశ్వతం. కానీ కావాలనుకున్నప్పుడు రద్దు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు.

  రాష్ట్రస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ శాసనసభ. ఇందులో రెండు రకాల సభలు ఉంటాయి. మొదటిది ఎగువసభ. దీనినే విధాన పరిషత్తు అంటారు. రెండోది దిగువసభ, దానినే విధానసభగా వ్యవహరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో విధానపరిషత్తు ఉండదు.ఎగువ సభ బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ. విధాన పరిషత్తును ఎగువ సభ, పెద్దలసభ, శాశ్వతసభ, శాసన మండలిగా కూడా పేర్కొంటారు. దీనిలో ఉండే సభ్యులను ఎమ్మెల్సీ (మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) అంటారు. 1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విధాన పరిషత్తులో ఉండే కనీస ఎమ్మెల్సీల సంఖ్య 40. గరిష్ఠ ఎమ్మెల్సీల సంఖ్య విధానసభ సభ్యుల (ఎమ్మెల్యే) సంఖ్యలో 1/3వ వంతు మించకూడదు.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం అప్పటి 11 రాష్ట్రాల శాసనసభల్లోని 6 రాష్ట్రాల శాసనసభల్లో ‘ద్విసభా’ విధానాన్ని అమలు చేసి ఎగువసభగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆ ఆరు రాష్ట్రాల్లో మద్రాస్, బాంబే, అస్సాం, బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌.ఉన్నాయి.

రాజ్యాంగ సభలో చర్చ

రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో విధాన పరిషత్తుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎగువసభ శాసన నిర్మాణంలో జాప్యాన్ని కొనసాగిస్తుందని, అప్రజాస్వామికమైందని, అనవసర ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రాజ్యాంగ సభ సభ్యుడైన హెచ్‌.వి.కామత్‌ పేర్కొన్నారు.చివరికి విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం/రద్దుచేయడం అనేది సంబంధిత రాష్ట్ర అభీష్టానికి వదిలిపెట్టాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.

విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169(1) ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రంలో ఎగువసభ అయిన విధాన పరిషత్తును కొత్తగా ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్న విధాన పరిషత్తును తొలగించాలన్నా ఆ రాష్ట్ర విధాన సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి పార్లమెంటుకి పంపాలి.పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆ మేరకు చట్టం చేస్తుంది. ‘విధానపరిషత్తును పూర్తిగా లేకుండా చేయడం కుదరదు, కానీ రద్దుచేయవచ్చు’ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు.

సభ్యుల అర్హతలు

* విధాన పరిషత్తు సభ్యులుగా పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు - 30 సంవత్సరాలు.

* సభ్యుల పదవీ కాలం - 6 సంవత్సరాలు

* ప్రతి రెండేళ్లకొకసారి 1/3వ వంతు విధాన పరిషత్తు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.

* బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సభ లక్ష్యం.

నిర్మాణం

విధాన పరిషత్తుకు సభ్యులు అయిదు రకాలుగా ఎన్నికవుతారు.

1) పరిషత్తు మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

2) మొత్తం సభ్యుల్లో మరో 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకుంటారు.

3) మొత్తం సభ్యుల్లో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్లపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

4) మొత్తం సభ్యుల్లో ఇంకో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

5) మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. ఈ సభ్యులు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారై ఉంటారు.

విధాన పరిషత్తు సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నికవుతారు.

ప్రస్తుతం మన దేశంలో 6 రాష్ట్రాల్లో  విధాన పరిషత్తులు ఉన్నాయి. అవి 1) ఉత్తర్‌ప్రదేశ్‌ (100 మంది సభ్యులు), 2) మహారాష్ట్ర (78), 3) బిహార్‌  (75), 4) కర్ణాటక  (75), 5) ఆంధ్రప్రదేశ్‌  (58), 6) తెలంగాణ (40).

* జమ్ము-కశ్మీర్‌ విధాన పరిషత్తులో 36 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ప్రకారం అక్కడి విధాన పరిషత్తును రద్దుచేశారు.

* విధాన పరిషత్తు మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 1/6వ వంతు సభ్యులను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల ఎన్నిక వివరాలు

ఆంధ్రప్రదేశ్‌-58

తెలంగాణ-40 ఎన్నిక విధానం
20 14 స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా
20 14 విధానసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) ద్వారా
5 3 ఉపాధ్యాయుల ద్వారా
5 3 పట్టభద్రుల ద్వారా
8 6 గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధాన పరిషత్తు ఏర్పాటు, తొలగింపు, పునరుద్ధరణ

* 1958, జులై 1న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. అప్పటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ ఛైర్మన్‌ జి.ఎన్‌.రాజు.

* 1985, జూన్‌ 1న ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును రద్దుచేశారు. నాటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ సయ్యద్‌ ముఖ్‌సిర్‌షా, డిప్యూటీ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి.

* 2007, మార్చి 30న వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును పునరుద్ధరించారు. అప్పటి సభ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌ మహ్మద్‌ జాని.

* విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌కుమార్‌ రెడ్డి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తు ఛైర్మన్‌ కొయ్యె మోషెన్‌రాజు, డిప్యూటీ ఛైర్మన్‌ మయానా జకియా ఖానమ్‌.

* తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌.

* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.

ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవులు

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 182 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల గురించి వివరిస్తుంది. సభ్యులు (ఎమ్మెల్సీలు) సభా కార్యకలాపాల నిర్వహణ కోసం తమలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గాను, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గాను ఎన్నుకుంటారు.

* ఆర్టికల్‌ 183 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు తమ పదవులను ఏ విధంగా కోల్పోతారనే విషయాన్ని వివరిస్తుంది. శాసనమండలి/ విధాన పరిషత్తులో సభ్యత్వం రద్దయినప్పుడు, తమ పదవులకు రాజీనామా చేసినప్పుడు, విధాన పరిషత్తులో తొలగింపు తీర్మానం నెగ్గినప్పుడు పదవులను కోల్పోతారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాలి.

* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అయితే సభా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఛైర్మన్‌ తన రాజీనామాను డిప్యూటీ ఛైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు (ఎమ్మెల్సీలు) తమ రాజీనామాలను ఛైర్మన్‌కు సమర్పించాలి.

* ఆర్టికల్‌ 184 ప్రకారం ఛైర్మన్‌ పదవి ఖాళీ అయినప్పుడు  డిప్యూటీ ఛైర్మన్‌ సభా సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

* రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్తు సమావేశాలు సంవత్సరానికి తప్పనిసరిగా రెండు సార్లు జరగాలి. రెండు సమావేశాల మధ్య వ్యత్యాసం 6 నెలలు మించకూడదు.

విధాన పరిషత్తు - సమీక్ష

* సాధారణ బిల్లులను విధానసభలో లేద విధాన పరిషత్తులో ప్రవేశపెట్టవచ్చు.

* విధాన సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను విధాన పరిషత్తు గరిష్ఠంగా 4 నెలలు పాటు నిలిపి ఉంచగలుగుతుంది.

* విధాన పరిషత్తును ఒక చేతికి ఉండే 6వ వేలిగా, రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించే సంస్థగా విమర్శకులు పేర్కొన్నారు.

* విధాన పరిషత్తు భవితవ్యం విధాన సభ చేసే ప్రత్యేక తీర్మానంపై ఆధారపడి ఉంటుంది.

* విధాన సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను విధాన పరిషత్తు 14 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

రాజ్యసభ, విధాన పరిషత్‌ల మధ్య వ్యత్యాసాలు

* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కానీ రాష్ట్రాల విధాన పరిషత్తు సభ్యులకు (ఎమ్మెల్సీలు) ఎలాంటి ఓటు హక్కు లేదు.

* సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్రస్థాయిలో విధాన పరిషత్తు, విధాన సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే గవర్నర్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.

* లోక్‌సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై రాజ్యసభ 6 నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలి. విధానసభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై విధాన పరిషత్తు 3 నెలల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలి.

* రాజ్యసభ శాశ్వతసభ. దీన్ని రద్దుచేయడానికి వీలులేదు. విధాన పరిషత్తును పార్లమెంటు చేసే చట్టం ద్వారా రద్దు చేయవచ్చు.

* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ పాల్గొంటుంది. కానీ విధాన పరిషత్తుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 23-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాలనపై కార్యనిర్వాహక, న్యాయశాఖల నియంత్రణ

కార్యనిర్వాహకశాఖ

ఉద్యోగ వ్యవస్థపై రాజకీయ కార్యనిర్వాహకులకు (మంత్రి) ఉండే నియంత్రణను కార్యనిర్వాహకశాఖ నియంత్రణ అంటారు. తన మంత్రిత్వ శాఖలో పని చేసే ఉద్యోగుల పనితీరుపై మంత్రికి నియంత్రణ ఉంటుంది. పాలనా వ్యవస్థ ఏం చేయాలో, చేయకూడదో అనే అంశాన్ని వీరు ముందుగానే నిర్దేశిస్తారు.


పద్ధతులు


సివిల్‌ సర్వీస్‌ కోడ్‌: ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని రూపొందించి, దానికి అనుగుణంగా వ్యవహరించేలా నిర్దేశిస్తారు. దీని ప్రకారం ఉద్యోగుల అధికారిక ప్రవర్తనపై మాత్రమే కాక వ్యక్తిగత ప్రవర్తనపై కూడా నియంత్రణ ఉంటుంది.

విధాన రూపకల్పన: ప్రజల సంక్షేమానికి అవసరమైన పాలనా విధానాలను మంత్రిమండలి ్బద్చ్జిi-’్మ్శ రూపొందిస్తుంది. వీటిని ప్రభుత్వ ఉద్యోగులు అమలు చేస్తారు. ప్రతి మంత్రిత్వ శాఖ పాలనా విధానాలను ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ తన పరిధిలోని ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

బడ్జెట్‌: ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి ఉద్యోగులకు ఆర్థిక వనరులు ్బన్యీ-్ట(్శ అవసరం. వీటిని కార్యనిర్వాహక శాఖ బడ్జెట్‌ ద్వారా కేటాయిస్తుంది. ఇది ‘బడ్జెట్‌’ అంచనాలను ఆమోదిస్తుంది, అధికారులు నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు అనుసరించాల్సిన నియమాలను నిర్దేశిస్తుంది. దీని ద్వారా ఆర్థికశాఖ పాలనను నియంత్రిస్తుంది.

స్టాఫ్‌ ఏజెన్సీ: స్టాఫ్‌ ఏజెన్సీ అనేది కార్యనిర్వాహకులకు సలహా ఇచ్చే పాలనా విభాగం. వీటిలో ముఖ్యమైనవి ప్రధానమంత్రి కార్యాలయం ్బశిలీవ్శీ, కేబినెట్‌ సెక్రటేరియట్, నీతి ఆయోగ్‌ మొదలైనవి. స్టాఫ్‌ ఏజెన్సీలు ఇచ్చే సలహాల ఆధారంగా మంత్రులు పాలనపై నియంత్రణ కలిగి ఉంటారు.

శాసన దత్తత: విధాన రూపకల్పనకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించి, వాటికి అవసరమైన నియమాలను తయారు చేయాలని ఉద్యోగులను మంత్రి నిర్దేశిస్తారు.

ఉద్యోగ ప్రక్రియ: ఉద్యోగుల నియామకం, పోస్టింగ్, పదోన్నతులు, వేతనాలు, క్రమశిక్షణా చర్యలు, బదిలీలు మొదలైన ప్రక్రియల ఆధారంగా మంత్రి పాలనపై నియంత్రణ కలిగి ఉంటారు.

* పాలనపై కార్యనిర్వాహక శాఖ నియంత్రణ సమర్థవంతంగా ఉండాలంటే మంత్రులు నైతిక విలువలు కలిగి ఉండాలి. అవినీతి, అక్రమాలకు పాల్పడకూడదు. మంత్రులకు పాలనా నియమాలపై అవగాహన ఉండాలి. అధికారం చేపట్టిన ప్రతి మంత్రికి పాలనా వ్యవహారాలపై శిక్షణ ఇవ్వాలి.


న్యాయశాఖ

సమన్యాయ పాలన అనేది ప్రజాస్వామ్యంలో కీలక అంశం. దీని ప్రకారం పాలనలో వ్యక్తుల హక్కులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. పాలనా వ్యవస్థపై న్యాయస్థానాలు జరిపే నియంత్రణను న్యాయశాఖ నియంత్రణ అంటారు. పాలనను నియంత్రించడం ద్వారా న్యాయశాఖ ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడుతుంది.న్యాయశాఖ కింది చర్యల ద్వారా పాలనపై నియంత్రణ కలిగి ఉంటుంది.


రిట్స్‌ (Writs) జారీ చేయడం


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్స్‌ను జారీ చేస్తాయి. వీటిని పాలనపై న్యాయశాఖ నియంత్రణకు ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యమైనవి:

1. హెబియస్‌ కార్పస్‌ (Habes carpus): ఈ రిట్‌ను ఉదారమైన రిట్‌గా, వ్యక్తి స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా పేర్కొంటారు. దీని ప్రకారం, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే దానికి గల కారణాన్ని తెలపాలి. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఈ రిట్‌ నిర్దేశిస్తుంది. దీని ద్వారా ఒక వ్యక్తి అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా? కాదా? అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది.

2. మాండమస్‌ (Mandamus): ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీవు నీ విధిని సక్రమంగా నిర్వహించు’ అని న్యాయస్థానం నిర్దేశిస్తుంది. దీని ద్వారా పాలనలో అలసత్వం, అతిక్రమణను కోర్టు నియంత్రిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారిని తనకు ఉన్న చట్టబద్ధ విధులను నిర్వర్తించమని ఈ రిట్‌ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు.


3. ప్రొహిబిషన్‌(prohibition): ఏదైనా దిగువ స్థాయి న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే, తక్షణమే ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నతస్థాయి న్యాయస్థానం ఆదేశిస్తుంది.


4. సెర్షియోరరి (certiorary): దిగువస్థాయి న్యాయస్థానం నిలిపివేసిన విచారణను పక్క న్యాయస్థానానికి లేదా ఎక్కువ స్థాయి న్యాయస్థానానికి బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం.


5. కోవారెంటో (Quo Warranto) : చట్టబద్ధంగా ఎలాంటి అర్హత లేని వ్యక్తి ప్రభుత్వ పదవిని చేపట్టి, నిర్వహిస్తుంటే ‘‘నువ్వు ఏ అధికారంతో ఆ పదవిని నిర్వహిస్తున్నావు?’’ అని సంబంధిత వ్యక్తిని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. ఆ పదవి నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని నియంత్రించడం దీని ఉద్దేశం.


న్యాయ సమీక్ష (Judical Review)


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే శాసనాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లుబాటు కావని న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. దీన్ని ‘న్యాయ సమీక్ష’ అంటారు. పాలన సక్రమంగా కొనసాగేందుకు న్యాయసమీక్ష ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. పౌరుల హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధమైన పరిపాలనకు న్యాయసమీక్ష తోడ్పడుతుంది.


సుప్రీంకోర్టు తీర్పులు


ఇనాందార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ‘‘మైనార్టీ, మైనార్టీయేతర నాన్‌-ఎయిడెడ్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రభుత్వం రిజర్వేషన్‌ విధానాన్ని వర్తింపజేయడానికి వీల్లేదు’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


ఎం.నాగరాజు Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘‘సమానత్వపు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. చట్టం ముందు అందరూ సమానులే’’ అని పేర్కొంది.


వినోద్‌ దువా Vs  స్టేట్‌ ఆఫ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘‘కాలం చెల్లిన చట్టాల అమలును నిలిపివేయాలి. రాజద్రోహం కేసు అంటే - ఐపీసీలోని సెక్షన్‌ 124(తి) ఆధారంగా నమోదైన కేసులన్నింటి విచారణను తక్షణం నిలిపి వేయాలి. ఈ సెక్షన్‌ కింద అరెస్ట్‌ అయ్యి, జైళ్లలో ఉన్నవారు వెంటనే బెయిల్‌ పిటిషన్స్‌ సమర్పించుకోవచ్చు’’ అని పేర్కొంది.


సెల్వి Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక: ‘‘నేర విచారణ సందర్భంగా పోలీసు అధికారులు వ్యక్తి అనుమతి లేకుండా నార్కో అనాలసిస్‌ టెస్ట్, లై డిటెక్టర్‌ లాంటి వాటిని వినియోగించకూడదు’’ అని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


ప్రకాష్‌ కదమ్‌ Vs  రామ్‌ ప్రసాద్‌ గుప్తా కేసు: ‘‘పోలీసులు తమ అధికార దుర్వినియోగంతో బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడితే, అది నిజమని తేలితే, సదరు అధికారులకు ఉరిశిక్ష విధించాలి.’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


సతీష్‌చంద్ర Vs ఎం.పి.శర్మ కేసు: ‘‘ఒక వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి, తనపై తానే వ్యతిరేక సాక్ష్యం ఇవ్వాలని అధికారులు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


శోభారం Vs  స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు: ‘‘అరెస్ట్‌ అయిన వ్యక్తి తన గురించి తాను వాదించుకునే అవకాశం కల్పించడం ప్రాథమిక హక్కు. దాన్ని నిరాకరించే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదు’’ అని సుప్రీంకోర్టు ఈ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది.


ప్రజాప్రయోజన వ్యాజ్యం (Public Intrest Litigation-PIL)

* ఎవరైనా వ్యక్తులు అన్యాయానికి గురై, న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆర్థిక స్థోమత, పరిజ్ఞానం లేకపోతే వారి తరపున మరొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. వారికి న్యాయం చేయాలనే ప్రయత్నాన్నే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయొచ్చు. 


* ప్రజల ప్రయోజనార్థం మానవ సమూహానికి చెందిన ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల హక్కులు, సంక్షేమం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమన్యాయపాలన అందించేందుకు, ప్రాథమిక హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా చూడటానికి, న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం తోడ్పడుతుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే భావన మొదటిసారి అమెరికాలో ప్రారంభమైంది. ఇది మన దేశంలో 1980 దశకంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ దీన్ని విస్తృతం చేశారు.

* చట్టం సక్రమంగా అమలయ్యేలా, అందరికీ సమన్యాయం దక్కేలా, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరేలా చేసేదే ప్రజాప్రయోజన వ్యాజ్యం.

న్యాయవ్యవస్థ- క్రియాశీలత


ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చేయడం, రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను సాగించడంలో న్యాయవ్యవస్థ క్రియాశీల పాత్ర పోషిస్తుంది.


ప్రభుత్వంపై దావా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల ఎవరైనా వ్యక్తి నష్టపోతున్నట్లు భావిస్తే, ప్రభుత్వంపై న్యాయస్థానంలో దావా వేయొచ్చు. ప్రభుత్వం పౌరులతో కుదుర్చుకున్న ఒప్పందాల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేయొచ్చు.

* ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించిన విధానాల వల్ల ఇబ్బందులకు గురైనవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. పాలనా నియమాల ఉల్లంఘన జరిగిందనే కారణంతో ఉద్యోగులపై న్యాయస్థానంలో దావా వేయొచ్చు.


 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర కార్యనిర్వాహక శాఖ - అధికారాలు, విధులు (అత్యవసర పరిస్థితులు)

కేంద్ర కార్యనిర్వాహక శాఖ  అధికారాలు, విధులు

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు

సాధారణ సందర్భాల్లో సమాఖ్యగా, అత్యవసర సమయాల్లో ఏకకేంద్రంగా మన పరిపాలన వ్యవస్థ వ్యవహరిస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనపెట్టి కేంద్రం విస్తృత అధికారాలను చెలాయిస్తుంది. రాజ్యాంగబద్ధమైన నియంత్రణలను విధిస్తుంది. అందుకోసం కేంద్ర  కార్య నిర్వాహక అధిపతిగా రాష్ట్రపతి మూడు రకాల అత్యవసర పరిస్థితులను  ప్రకటిస్తారు. వాటి అంతిమ లక్ష్యం దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంక్షేమం. ఆ అత్యవసర పరిస్థితులు, వాటిని ప్రకటించే తీరు,  పాటించాల్సిన నియమ నిబంధనలు, సంబంధిత కోర్టు తీర్పులు, జాతీయ నేతల వ్యాఖ్యలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాష్ట్రపతులుగా  చేసిన వ్యక్తుల విశేషాలు, వారి వ్యక్తిగత, పాలనా విశిష్టతల గురించి తెలుసుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. భారత రాజ్యాంగంలో ‘రాష్ట్రపతి పాలన’ గురించి ఎలా పేర్కొన్నారు?

1) Rule of emergency   2) President Rule

3) Proclamation            4) Dissolved of State Executive


2.    కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.

బి) 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.

సి) 1977లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.

డి) 1980లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి.

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, సి     3) ఎ, బి, డి      4) బి, సి, డి 



3.  రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశం జరగక ముందు కూడా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది?

1) రామేశ్వర్‌ ప్రసాద్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) జతిన్‌ మిశ్రా  Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) దీపక్‌ బెనర్జీ Vs స్టేట్‌ ఆఫ్‌ పశ్చిమ బెంగాల్‌ కేసు

4) అనిల్‌ ఛటర్జీ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు



4.  ఎస్‌.ఆర్‌. బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు సందర్భంగా ఆర్టికల్‌ 356 ప్రయోగానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాన్ని గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలన సహేతుక కారణాలతోనే  ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

బి) రాష్ట్రపతి పాలన న్యాయసమీక్ష పరిధిలోకి రాదు.

సి) కేంద్రంలో నూతన పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టికల్‌ 356ను బలవంతంగా ప్రయోగించరాదు.

డి) రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర శాసన సభను రద్దు చేయాలి.

1) ఎ, బి, సి సరైనవి          2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, సి, డి సరైనవి         4) ఎ, బి, డి సరైనవి



5. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను ‘మృత అధికరణ’ (Dead Article) గా, ‘రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా’ ఎవరు పేర్కొన్నారు?

1) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌       2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌                 4) మొరార్జీ దేశాయ్‌



6.  దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేకపోతే రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ను ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు?

1) ఆర్టికల్‌ 357       2) ఆర్టికల్‌ 358   

3) ఆర్టికల్‌ 359       4) ఆర్టికల్‌ 360



7. పార్లమెంటు ఆమోదించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి గరిష్ఠంగా ఎంతకాలం వరకు కొనసాగుతుంది?

1) 6 నెలలు                   2) 3 సంవత్సరాలు   

3) 5 సంవత్సరాలు       4) ఎంతకాలమైనా



8.  ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పును గుర్తించండి.

ఎ) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నిలిపేయవచ్చు.

బి) సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల్లో కోత విధించవచ్చు.

సి) రాష్ట్రపతి వేతనంలో కోత విధించవచ్చు.

డి) కేంద్రం కోరితే రాష్ట్రాలు తమ బడ్జెట్‌ కాపీలను తప్పనిసరిగా పంపాలి.

1) ఎ, బి, సి సరైనవి          2) ఎ, బి, సి, డి సరైనవి

3) బి, సి, డి సరైనవి          4) ఎ, బి, డి సరైనవి



9.  ‘అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి శ్మశాన ప్రశాంతతను తలపిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) కె.ఎం.నంబియార్‌                  2) హెచ్‌.వి.కామత్‌

3) టి.టి.కృష్ణమాచారి                  4) కె.టి.షా



10. కేంద్రమంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలని జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ కేసు సందర్భంగా 1974లో తీర్పును వెలువరించింది?

1) షంషేర్‌సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మహర్షి అవధేష్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) శ్యామ్‌నారాయణ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు



11. ‘రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రుడు, మార్గదర్శి, తాత్వికుడిగా వ్యవహరిస్తారు’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌       2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌     4) జవహర్‌లాల్‌ నెహ్రూ



12. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1952లో కె.టి.షాపై గెలిచి, రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

బి) 1957లో ఎన్‌.ఎన్‌.దాస్‌పై గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

సి) రాష్ట్రపతి పదవిని రెండుసార్లు చేపట్టిన ఏకైకవ్యక్తి.

డి) పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి        4) ఎ, బి, డి 



13. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1962లో భారతరత్న పురస్కారం పొందారు.

బి) 'India wins Freedom' అనే గ్రంథాన్ని రాశారు.

సి) హిందీని జాతీయ భాషగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

డి) 1951లో హిందూకోడ్‌ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

1) ఎ, బి, డి           2) ఎ, బి, సి 

3) ఎ, బి, సి, డి         4) ఎ, సి, డి 



14. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

బి) విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

సి) ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

డి) గవర్నర్‌ పదవిని చేపట్టి, రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి.

1) ఎ, బి, సి, డి          2) ఎ, బి, సి

3) ఎ, సి, డి            4) బి, సి, డి 



15. రాష్ట్రపతులు, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ i) నీలం సంజీవరెడ్డి
బి) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ii) సి.హెచ్‌.హరిరామ్‌
సి) వి.వి.గిరి iii) టి.చతుర్వేది
డి) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ iv) జస్టిస్‌ కోకా సుబ్బారావు

1) ఎ-ii, బి-iv, సి-i, డి-iii 2) ఎ-ii, బి-iv, సి-iii, డి-i

3) ఎ-iv, బి-ii, సి-i, డి-iii 4) ఎ-iv, బి-i, సి-ii, డి-iii



16. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) విద్యావేత్త, తత్వవేత్త, దార్శనికుడిగా పేరొందారు

బి) UNESCO ఛైర్మన్‌గా పనిచేశారు.

సి) చైనాతో యుద్ధానంతరం అప్పటి రక్షణమంత్రి వి.కె.కృష్ణమీనన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

డి) అమెరికా నుంచి ‘టెంపుల్‌టన్‌’ అవార్డును పొందిన తొలి భారతీయుడు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి

3) ఎ, బి, డి            4) ఎ, బి, సి, డి 



17. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రచించిన గ్రంథాల్లో లేని దాన్ని గుర్తించండి.

1) Hindu view of life

2) An Ideal View of Life 

3) Indian Theories of History

4) Eastern Religion Westrern thought


18. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 8 దేశాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

బి) ఇతడి జన్మదినమైన సెప్టెంబరు 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

సి) ఆర్టికల్‌ 352ను ప్రయోగించిన తొలి రాష్ట్రపతి.

డి) 1966లో పద్మవిభూషణ్‌ పురస్కారం పొందారు.

1) ఎ, బి, సి          2) ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి        4) బి, సి, డి



19. కింద పేర్కొన్న వారిలో ఎవరు ఉప రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు?

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌           2) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌  

3) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌                4) వరాహగిరి వెంకటగిరి



20. రాష్ట్రపతులు, వారి పదవీ కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ 1) 1962-1967
బి) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 2) 1967-1969
సి) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 3) 1969-1974
డి) వి.వి.గిరి 4) 1974-1977

1) ఎ-2, బి-3, సి-4, డి-1          2) ఎ-2, బి-1, సి-4, డి-3

3) ఎ-1, బి-2, సి-4, డి-3          4) ఎ-4, బి-1, సి-2, డి-3





సమాధానాలు
1-3; 2-3; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-4; 9-2; 10-1; 11-1; 12-3; 13-4; 14-2; 15-1; 16-4; 17-3; 18-1; 19-4; 20-2.

 

అత్యవసరం మూలాలు ఆ చట్టంలోనే!


కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతికి ఉన్న విశేషాధికారాల్లో అత్యవసర పరిస్థితి విధింపు విశిష్టమైనది. దీనిని మూడు సందర్భాల్లో ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు ఆ  అధికారాన్ని వినియోగించిన ప్రభుత్వాలు, అప్పట్లో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు సాధారణ పాలనలో జరిగే మార్పులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై వాటి ప్రభావం తదితర వివరాలను రాజ్యాంగ ఆర్టికల్స్‌ సహా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 



1.    మన దేశంలో ఆర్టికల్‌ 352 ప్రకారం తొలిసారి  విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ఎప్పటివరకు కొనసాగింది?

 1) 1966, జనవరి 10   2) 1967, జనవరి 10

 3) 1968, జనవరి 10   4) 1965, నవంబరు 21



2.   ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలాన్ని గుర్తించండి.

1) 1971, ఏప్రిల్‌ 6 నుంచి 1977, జనవరి 18 వరకు

2) 1971, డిసెంబరు 3 నుంచి 1977, మార్చి 21 వరకు

3) 1971, సెప్టెంబరు 18 నుంచి 1977, నవంబరు 26 వరకు

4) 1971, డిసెంబరు 26 నుంచి 1977, డిసెంబరు 3 వరకు



3.  ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించిన సందర్భంలో వివిధ పదవులు నిర్వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జవాబు?

ఎ) రాష్ట్రపతిగా డా.వి.వి.గిరి

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ

 సి) రక్షణ మంత్రిగా డా. బాబూ జగ్జీవన్‌రాం

డి) విదేశాంగ మంత్రిగా హెచ్‌.సి.ముఖర్జీ

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి    4) బి, సి, డి 



4.   బంగ్లాదేశ్‌ జాతీయ గీతమైన ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ను ఎవరు రచించారు?

1) ముజఫర్‌ రెహ్మాన్‌     2) షేక్‌ సలీం హసీనా

3) సచిన్‌ సన్యాల్‌       4) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌



5.  మన దేశంలో రెండోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి  కారణం?

1) భారత్‌పై పాకిస్థాన్‌ దురాక్రమణ

2) బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం

3) పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ దురాక్రమణ

4) భారత విదేశాంగ విధానంలో చైనా జోక్యం చేసుకోవడం


6.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి కారణం?

1) ఆంతరంగిక అల్లకల్లోలాలు

2) భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం

3) భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య యుద్ధం

4) భారత్‌ - చైనా మధ్య యుద్ధం



7.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలం?

1) 1975, ఫిబ్రవరి 21 నుంచి 1977, జనవరి 16 వరకు

2) 1975, నవంబరు 18 నుంచి 1977, డిసెంబరు 9 వరకు

3) 1975, ఆగస్టు 21 నుంచి 1977, జులై 16 వరకు

4) 1975, జూన్‌ 26 నుంచి 1977, మార్చి 21 వరకు



8.  మన దేశంలో 1975లో ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించారు. ఈ సందర్భంలో ఉన్న ప్రముఖులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ.

సి) రక్షణ శాఖామంత్రిగా ఇందిరా గాంధీ.

డి) హోంశాఖ మంత్రిగా వి.కె.కృష్ణమీనన్‌.

1) ఎ, సి, డి          2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి డి       4) ఎ, బి, సి



9.   మన దేశంలో ఏ కాలంలో బాహ్య, ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగింది?

1) 1975 - 1977      2) 1971 - 1977

 3) 1962 - 1971      4) 1971 - 1977



10. రాయ్‌బరేలి లోక్‌సభ నియోజక వర్గం నుంచి 1971లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని 1975, జూన్‌ 12న ఏ న్యాయస్థానం తీర్పునిచ్చింది?

1) చండీగఢ్‌ హైకోర్టు   2) సుప్రీంకోర్టు 

3) బాంబే హైకోర్టు     4) అలహాబాద్‌ హైకోర్టు



11. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం జరిపిన అక్రమాలపై 1977, మే 28న జె.సి.షా కమిషన్‌ ఏర్పడింది.

బి) కేంద్రంలో 1977, మార్చి 24న జనతా ప్రభుత్వం ఏర్పడింది.

సి) జె.సి.షా కమిషన్‌ తన నివేదికలో ఇందిరా గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

1) ఎ, బి        2) ఎ, బి, సి

3) ఎ, సి         4) బి, సి



12. బాహ్య కారణలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగుతున్న కాలంలో అంతర్గత కారణాలతో కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనను గుర్తించండి.

1) ఆర్టికల్‌ 352 (9)     2) ఆర్టికల్‌ 352 (11)

3) ఆర్టికల్‌ 352 (13)    4) ఆర్టికల్‌ 353 (8)


 

13. ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా గాని, దేశంలో కొన్ని ప్రాంతాల్లో గాని, ఒక రాష్ట్రంలో గాని, ఒక రాష్ట్రంలోని కొంత భాగంలో గాని విధించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

 1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1979



14. ‘హెబియస్‌ కార్పస్‌ కేసు’గా దేన్ని పేర్కొంటారు?

1) అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ జబల్‌పుర్‌ vs శివకాంత్‌ శుక్లా కేసు

2) రంగనాథ్‌ మిశ్రా vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మేనకా గాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ vs  ఎస్‌.ఎన్‌.మిశ్రా కేసు



15. ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణ, అంతర్గత అల్లకల్లోలాల నుంచి రక్షించి, రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 353      2) ఆర్టికల్‌ 354 

3) ఆర్టికల్‌ 355      4) ఆర్టికల్‌ 357



16. ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ‘రాష్ట్రపతి పాలన’ కింది కారణంతో విధిస్తారు?

ఎ) రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం లోపించి, తరచూ ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోవడం

బి) రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావడం

సి) కేంద్రం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రం ధిక్కరించడం

డి) రాష్ట్రపతి పాలన విధించాలని సంబంధిత రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం

1) ఎ, బి, సి           2) ఎ, సి, డి

3) బి, సి, డి          4) ఎ, బి, సి, డి



17. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి జారీ చేస్తారు.

బి) ఆర్టికల్‌ 356 (2) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.

సి) ఆర్టికల్‌ 356 (3) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటనను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది.

డి) ఆర్టికల్‌ 356 (4) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటన ఆమోదం విషయమై పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది.

 1) ఎ, సి, డి సరైనవి   2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి   4) ఎ, బి, సి సరైనవి


18.  ‘రాష్ట్రపతి పాలన’ కాలపరిమితికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదిస్తే 6 నెలల వరకు కొనసాగుతుంది.

బి) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదంతో 6 నెలలకోసారి చొప్పున పొడిగించవచ్చు.

సి) రాష్ట్రపతి పాలనను ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

డి) రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా మూడేళ్లు పొడిగించవచ్చు/ కొనసాగించవచ్చు.

 1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, డి

3) ఎ, బి, సి     4) బి, సి, డి 



19. రాష్ట్రపతి పాలనా కాలంలో ఒక రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి. 

ఎ) రాష్ట్ర మంత్రిమండలి ‘సుప్తచేతనావస్థ’లో ఉంటుంది.

బి) రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలను గవర్నర్‌ నిర్వహిస్తారు.

సి) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర  మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.

డి) రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేస్తారు లేదా సుప్త చేతనావస్థలో ఉంచుతారు.

 1) ఎ, బి, సి సరైనవి      2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి   4) బి, సి, డి సరైనవి



20. పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగించేందుకు ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు?

1) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

2) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991

3) 1, 2 సరైనవి 

4) 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992


21.  రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి.

ఎ) రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.

బి) హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులుండవు.

సి) ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు.

డి) రాష్ట్రంలో రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్‌ పరిపాలన నిర్వహిస్తారు.

1) ఎ, బి, డి సరైనవి      2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి    4) బి, సి, డి సరైనవి



22. ‘రాష్ట్రపతి పాలన’ మూలాలు ఎక్కడ ఉన్నాయి?

1) 1773, రెగ్యులేటింగ్‌ చట్టంలోని సెక్షన్, 193

2) 1861, ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టంలోని సెక్షన్, 113

3) 1919, మాంటేగ్‌ ఛెెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టంలోని సెక్షన్‌ 101

4) 1935, భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్‌ 93



23.  కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలన విధించిన తొలి రాష్ట్రం - పంజాబ్‌

 బి) ఒకే నెలలో రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం - కర్ణాటక

సి) రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో ‘ఆర్డినెన్స్‌’ జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

డి) ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రం - తెలంగాణ

1) ఎ, బి, సి, డి           2) ఎ, బి, సి 

 3) ఎ, బి, డి            4) ఎ, సి, డి 

సమాధానాలు 

13; 22; 31; 44; 52; 61; 74; 84; 91; 104; 112; 121; 132; 141; 153; 161; 174; 182;  194; 203; 211; 224; 233.  
 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 07-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్ల‌మెంట‌రీ, అధ్య‌క్ష త‌ర‌హా ప్ర‌భుత్వాలు

సుదీర్ఘ ప్రయోజనాలు.. స్వతంత్ర నిర్ణయాలు! 


ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలు అనుసరిస్తున్న పాలనా విధానాల్లో ప్రజాస్వామ్యం అత్యుత్తమంగా నిలుస్తోంది. పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థలు రెండూ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నప్పటికీ వాటి నిర్మాణం, పరిధి వేర్వేరుగా ఉంటాయి. పార్లమెంటరీ విధానంలో నియంతృత్వం కుదరదు. సుదీర్ఘ ప్రయోజనాలు ఉంటాయి. అధ్యక్ష పద్ధతిలో స్వతంత్ర నిర్ణయాలు వేగంగా సాధ్యమవుతాయి. ఈ రెండుపాలనలకు సంబంధించిన మౌలికాంశాలు, ప్రధాన వ్యత్యాసాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా జరుగుతుంది, వాస్తవ కార్యనిర్వహణ ఎవరి చేతిలో ఉంటుందనే వివరాలతోపాటు రెండు విధానాలకు ఉన్న ప్రయోజనాలను, లోపాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


కార్యనిర్వాహక వర్గం, శాసన వ్యవస్థ మధ్య సంబంధాలను ఆధారం చేసుకుని ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక వర్గం అంటే ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి.  అది పార్లమెంటు/శాసన వ్యవస్థ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది. దానిని బాధ్యతాయుత ప్రభుత్వం, కేబినెట్‌ తరహా ప్రభుత్వమని పేర్కొంటారు. ఇలాంటి ప్రభుత్వాలు బ్రిటన్, భారత్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నాయి.


లక్షణాలు:

వాస్తవ, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతులు: పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో వాస్తవ, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. దేశాధినేతలకు నామమాత్రపు అధికారాలు ఉంటే, ప్రధానమంత్రులకు వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.

ఉదా: బ్రిటన్‌ రాణి, జపాన్‌ చక్రవర్తి, భారత రాష్ట్రపతులకు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. ఆ దేశాల్లోని వాస్తవ కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కలిగి ఉంటుంది. 


శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం: పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది. ఈ రెండు వ్యవస్థలకు చెందిన సభ్యులకు ఒకేసారి శాసనసభలో సభ్యత్వం ఉంటుంది. శాసన వ్యవస్థలోని సభ్యులు కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతారు. శాసన వ్యవస్థ ఆమోదించిన సంక్షేమ పథకాలు, విధానాలను అమలుచేస్తారు. అనేక అంశాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. తద్వారా రెండు వ్యవస్థల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది.


సమష్టి బాధ్యత:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధాన మౌలిక లక్షణం ‘సమష్టి బాధ్యత’. దీనిలో ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ సభ్యులందరూ శాసన వ్యవస్థలోని దిగువ సభకు ‘సమష్టి’గా బాధ్యత వహిస్తారు. దిగువ సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రిమండలి మనుగడలో ఉంటుంది. ప్రధాని నేతృత్వంలోని మంత్రులంతా సమష్టిగా విధాన నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్‌ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కానీ అంతిమంగా కేబినెట్‌ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే. ఆ మంత్రి వ్యక్తిగతంగా, సమష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకునే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


ప్రధానమంత్రి నాయకత్వం:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ విధానం’గా పేర్కొనవచ్చు. ఈ విధానంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. ఈయన దిగువ సభలో మెజార్టీ పార్టీ నాయకుడిగా/సంకీర్ణ మంత్రిమండలికి అధిపతిగా ఉంటారు. కేంద్ర కేబినెట్‌కు ‘మూల విరాట్‌’గా నిలబడతారు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. సమావేశాల అజెండాను నిర్ణయిస్తారు. ప్రభుత్వ విధానాలను రూపొందించి, అమలు చేయడం ద్వారా జాతి భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సమష్టి బాధ్యత సూత్రాన్ని మంత్రిమండలి సభ్యులంతా అనుసరించే విధంగా చూస్తారు.   మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రుల ప్రమాణస్వీకారం; అధికార, విధుల నిర్వహణ, రాజకీయ విధేయత ప్రధానమంత్రి మార్గదర్శకంలో జరుగుతాయి.


రాజకీయ సజాతీయత: రాజకీయ సజాతీయత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో కీలక అంశం. దీనిలో సాధారణంగా మంత్రులంతా ఒకే రాజకీయ పార్టీకి చెందినవారై ఉంటారు. సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ రాజకీయ పార్టీకి లభించకపోతే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఏర్పడిన ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

ఉదా: యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (గీశితి), నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (విదీతి) 


పార్టీ క్రమశిక్షణ:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ‘రాజకీయ పార్టీ క్రమశిక్షణ’ ప్రధానమైంది. ప్రతి రాజకీయ పార్టీకి తమ సభ్యులందరిపై నియంత్రణ ఉంటుంది. పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. తద్వారా రాజకీయ పటిష్టత కొనసాగుతుంది.

ప్రయోజనాలు: * పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య సమన్వయం, సహకారం ఉంటుంది. దాని వల్ల దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలు సాధ్యమవుతాయి.

* ఈ విధానంలో విభిన్న వర్గాలు, ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రభుత్వంలో భిన్న స్వరాలకు సంబంధించిన వ్యక్తులందరికీ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ప్రాతినిధ్యం ఉంటుంది.

* నియంతృత్వానికి అవకాశం లేదు. అధికార పక్ష విధానాలను ప్రతిపక్షాల సభ్యులు దిగువ సభలో అనేక పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. 

ఉదా: ప్రశ్నలు - అనుబంధ ప్రశ్నలు అడగడం, అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం.

* పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ప్రత్యామ్నాయ మార్పులను సులభంగా అమలుచేయవచ్చు. అధికార పక్షం రాజీనామా చేసినా లేదా అధికారం నుంచి తప్పించినా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

* ఈ విధానంలో ఎన్నికల ప్రక్రియ ఫలితంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం ఏర్పడుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రచారాన్ని బట్టి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంత నిరుపేద, నిరక్షరాస్యులు కూడా ఎన్నికల సమయంలో సరైన రాజకీయ తీర్పును వెలువరిస్తారు.

లోపాలు:  * సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జాతి ప్రయోజనాల కంటే రాజకీయ పార్టీల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.

* అత్యవసర సమయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది.

* ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ ఏకపక్ష విధానాలను అనుసరిస్తూ, మంత్రివర్గ నియంతృత్వం కొనసాగే ప్రమాదం ఉంది.

* మంత్రులు శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గంలో సభ్యులుగా ఉండటం వల్ల తమకు అనుకూలమైన విధానాలను మెజారిటీతో ఆమోదింపజేసుకుని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.

* రాజకీయ స్థిరత్వం లోపించవచ్చు. రాజకీయ అనిశ్చితి కారణంగా తరచూ ప్రభుత్వాలు మారవచ్చు.

అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం:  అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన వ్యవస్థకు ఎలాంటి బాధ్యత వహించదు. ఈ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్నిరకాల కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటాడు. అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ‘ఎన్నికల గణం’ ద్వారా ఎన్నుకుంటారు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటు వాద సిద్ధాంతం’ ఆధారంగా ఆచరణలోకి వచ్చింది.

ఉదా: అమెరికా, మెక్సికో, అర్జెంటీనా, చిలీ దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

లక్షణాలు:  * అధ్యక్షుడే దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ఈయనకు ప్రభుత్వ అధిపతిగా తిరుగులేని అధికారాలు ఉంటాయి. జాతీయ ప్రయోజనాలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు.

* శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య స్పష్టమైన అధికారాల విభజన ఉంటుంది. శాసన సభ్యులు నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతారు. వారిని కాలపరిమితి కంటే ముందుగా తొలగించడానికి వీల్లేదు. అధ్యక్షుడిని సాధారణ పరిస్థితుల్లో శాసన వ్యవస్థ తొలగించలేదు. శాసన వ్యవస్థకు అధ్యక్షుడు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థలో కూడా ఒకసారి నియమించిన న్యాయమూర్తులను పదవీకాలం కంటే ముందే తొలగించడానికి వీల్లేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ అధ్యక్ష ప్రభుత్వంలో పెట్టడంలో ప్రధాన ఉద్దేశం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలను పరిరక్షించడమే.

* అధ్యక్షుడు రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. శాసన వ్యవస్థ అధ్యక్షుడికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే పదవిని కోల్పోతాడు.

* అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు నిరోధ సమతౌల్యాన్ని కలిగి ఉంటాయి. తద్వారా ప్రతి ప్రభుత్వ అంగం మరో అంగం అధికంగా నిర్వహించే అధికారాలను నిరోధించే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:  * ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రంగా ఉండటం వల్ల నియంతృత్వ పోకడలు సాధ్యం కాదు. 

* దేశాధ్యక్షుడు నిర్ణీత కాలపరిమితికి ఎన్నిక కావడం వల్ల సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది.

* కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో ఉండటంతో సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది.

* అత్యవసర పరిస్థితి సమయంలో, అనూహ్య పరిణామాలు సంభవించిన సందర్భంలో అధ్యక్షుడు దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు తీసుకోవచ్చు.

లోపాలు:  * శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం లోపించి, వైరుధ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

* అధ్యక్షుడిపై శాసన వ్యవస్థ నియంత్రణ లేకపోవడం వల్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశం ఉంది.

* సమాజంలోని భిన్న సమూహాలకు సరైన ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అధ్యక్షుడు తన కార్యదర్శులను (మంత్రులు) ఎంపిక చేసే సమయంలో విధేయతకు, వ్యక్తిపూజకు, కపట నాటకదారులకు ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు.

* ఎన్నికల అనంతరం ప్రజాభిప్రాయానికి స్థానం ఉండదు.

* కార్యనిర్వాహక శాఖ అధిక ప్రాధాన్యాన్ని పొందడం వల్ల శాసన వ్యవస్థ ప్రాధాన్యం తగ్గుతుంది.


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ - ప్రత్యేక అధికారాలు

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం! 

ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత ప్రాథమిక శాసనసభ లోక్‌సభ. చట్టాలను చేయడంలో, బడ్జెట్లను ఆమోదించడంలో, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. జాతీయ విధానాలను రూపొందిస్తుంది. ప్రజల అభీష్టాలను ప్రతిబింబిస్తుంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుంది.  కేంద్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఇందుకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ ఆధికరణలు, సంబంధిత తీర్మానాల ఉద్దేశాలను ఉదాహరణలతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన దిగువ సభ కూర్పు, సభ్యుల సంఖ్యలో మార్పుచేర్పులు, రిజర్వేషన్లు, సభ కాలపరిమితి తదితర అంశాలతో పాటు శాసన, ఆర్థిక సంబంధ విషయాల్లో రాజ్యసభపై ఆధిక్యాన్ని ప్రదర్శించే సందర్భాలనూ అర్థం చేసుకోవాలి.

భారతదేశ ప్రజలకు లోక్‌సభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సభలోని సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అందుకే ఈ సభ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో శక్తిమంతమైనదిగా, ప్రజాస్వామ్యయుతమైనదిగా, సంపూర్ణ ప్రాతినిధ్యానికి వేదికగా నిలుస్తోంది. దేశాభివృద్ధికి, దేశ ప్రజల శ్రేయస్సుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించడంలో కీలక భూమిక పోషిస్తోంది.


ప్రభుత్వ ఏర్పాటు: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం సగానికన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీకి చెందిన లేదా మద్దతు పొందిన నేత లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.


ఉదా: 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 489 స్థానాలకుగాను 364 స్థానాలను భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) గెలుపొందింది. ఈ పార్టీ నాయకుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే కొన్ని రాజకీయ పక్షాలు ఒక కూటమిగా ఏర్పాటై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.


ఉదా: 1989లో 9వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్, మిగిలిన రాజకీయ పార్టీలతో కలిసి ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి, లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వాన్ని నియంత్రించడం: కేంద్ర ప్రభుత్వ మితిమీరిన పోకడలను లోక్‌సభ వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించి, పరిపాలనను రాజ్యాంగబద్ధంగా కొనసాగే విధంగా చూస్తుంది. 


అవిశ్వాస తీర్మానం: ప్రభుత్వ పనితీరు పట్ల ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి చెందితే లోక్‌సభలో ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెడతాయి. అది నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


ఉదా: 1999లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గం అధికారాన్ని కోల్పోయింది.


* అవిశ్వాస తీర్మాన నోటీసుపై 50 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసిన అనంతరం స్పీకర్‌కు అందజేయాలి. దానిపై సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో సాధారణ మెజార్టీతో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య కనీసం 6 నెలల విరామం ఉండాలి. ‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంటు-1950’’ చట్టాన్ని అనుసరించి అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.


విశ్వాస తీర్మానం: ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది.అవసరమైనప్పుడు లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. ఆ సందర్భంలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో  సాధారణ మెజార్టీతో తీర్మానం ఓడిపోతే ప్రభుత్వం అధికారం కోల్పోతుంది.


ఉదా: 1990లో 9వ లోక్‌సభలో అప్పటి ప్రధాని వి.పి.సింగ్‌ లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం వీగిపోవడంతో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.


కోత తీర్మానాలు: సాధారణంగా లోక్‌సభలో కోత తీర్మానాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. వాటిపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో ఆ తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. ఈ తీర్మానాలు 3 రకాలుగా ఉన్నాయి. 


1) విధానకోత తీర్మానం(Policy cut motion): వివిధ పద్దుల నుంచి కోరిన మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసే తీర్మానాన్ని ‘విధాన కోత తీర్మానం’ అంటారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ప్రభుత్వం ఎంచుకున్న విధానానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా సూచించవచ్చు.


2) ఆర్థిక కోత తీర్మానం(Economy cut motion):  ప్రభుత్వ దుబారాను నియంత్రించే ఉద్దేశంతో వివిధ పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ఆర్థిక కోత తీర్మానం.


3) నామమాత్రపు కోత తీర్మానం (Token cut motion):  పద్దుల నుంచి రూ.100 తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ‘నామమాత్రపు కోత తీర్మానం’. బడ్జెట్‌లో ప్రభుత్వం విస్మరించిన ప్రత్యేక అంశాన్ని ఎత్తిచూపడం దీని ఉద్దేశం.

సమష్టి బాధ్యత: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి. ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తే మంత్రులు పదవులను కోల్పోతారు.


* ఉదా: హిందూ కోడ్‌ బిల్లు విషయమై జవహర్‌లాల్‌ నెహ్రూతో విభేదించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


* చైనాతో యుద్ధం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వి.కె.కృష్ణమీనన్‌


* పాకిస్థాన్‌తో 1966లో లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వం కుదుర్చుకున్న తాష్కెంట్‌ ఒప్పందాన్ని వ్యతిరేకించడం వల్ల మహావీర్‌ త్యాగి.


* 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం రూపొందించిన ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల హక్కుల చట్టం’ను వ్యతిరేకించడం వల్ల అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌.


* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ప్రణాళిక సంఘానికి విశేష ప్రాధాన్యం కల్పించడాన్ని వ్యతిరేకించడం వల్ల వి.వి.గిరి. పదవులు కోల్పోయారు

ఆర్థిక బిల్లులపై - విశేష ఆధిపత్యం: ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా అని ధ్రువీకరించే విశేష అధికారం లోక్‌సభకు ఉంది. దీనిని స్పీకర్‌ నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లులను ముందుగా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. ఆ సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తెలియజేయాలి. లేకపోతే సంబంధిత బిల్లులను ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ఆర్థిక బిల్లుల విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య విభేదాలు వస్తే ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. 

అంచనాల సంఘం: ఇది పార్లమెంటు నుంచి ఏర్పడే కీలకమైన ఆర్థిక కమిటీ. జాన్‌ మత్తాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1950లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని 30 మంది సభ్యులు లోక్‌సభకు చెందినవారే. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు లేదా మితవ్యయం పాటించే పద్ధతులను ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. సభ్యులు లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నికవుతారు.

పార్లమెంటరీ కమిటీలు: పార్లమెంటు నుంచి ఏర్పడిన మొత్తం 24 శాఖాపరమైన పార్లమెంటరీ కమిటీల్లో 16 కమిటీలకు ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు. ప్రభుత్వ ఖాతాల సంఘంలోని 22 మంది సభ్యుల్లో 15 మంది లోక్‌సభ సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను నియమించడం ఒక సంప్రదాయంగా 1967 నుంచి కొనసాగుతోంది. ఇది అతిపురాతనమైన పార్లమెంటరీ కమిటీ.

పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం: సాధారణ బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ బిల్లులను ఆమోదించే క్రమంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా, సవరణలు సూచించినా, 6 నెలల్లోగా ఎలాంటి నిర్ణయం తెలియజేయకపోయినా ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా భావిస్తారు. సంయుక్త సమావేశంలో జరిగే ఓటింగ్‌ను అనుసరించి బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లోక్‌సభ అభిప్రాయమే నెగ్గుతుంది. అలాంటి ఉభయసభల సంయుక్త సమావేశాలు ఇప్పటివరకు మూడు సార్లు నిర్వహించారు.


1) 1961, మే 6న ‘వరకట్న నిషేధ బిల్లు’ను ఆమోదించే విషయంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ అధ్యక్షత వహించారు.


2) 1978, మే 26న బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/రద్దుకు సంబంధించిన సర్వీసు నిబంధనలను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే అధ్యక్షత వహించారు.


3) 2002, మార్చి 26న పోటా (POTA) బిల్లును ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రధాని వాజ్‌పేయీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు. (స్పీకర్‌ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహించారు).

జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్‌సభకు ప్రత్యేక అధికారాన్ని కల్పించారు. దీని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్‌సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభలోని 1/10 వంతు సభ్యులు ఒక తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాష్ట్రపతికి సమర్పించవచ్చు. 14 రోజుల్లోగా లోక్‌సభ ఈ అంశాన్ని చర్చించి సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు.

ప్రభుత్వం - అధికారాన్ని కోల్పోయే సందర్భాలు: లోక్‌సభలో కొన్ని బిల్లుల విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లోక్‌సభలో వీగిపోయినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరించినప్పుడు.


- ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా, ప్రైవేటు సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పబ్లిక్‌ బిల్లు’ తిరస్కరణకు గురైనప్పుడు.

లోక్‌సభ సభ్యుల సంఖ్యలో మార్పులు, చేర్పులు: రాజ్యాంగం లోక్‌సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. కానీ ఆ సంఖ్యను నిర్ధారించే పద్ధతిని మాత్రం పేర్కొంది. ఆర్టికల్‌ 82 ప్రకారం దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రభుత్వం ‘నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌’(Delimitation Commission) ను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్‌ సూచనల మేరకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశిస్తుంది. 1950లో ఒకటో ‘డీలిమిటేషన్‌ కమిషన్‌’ సిఫార్సుల మేరకు 489 స్థానాలు నిర్దేశించారు. 1962లో రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 525 స్థానాలు నిర్దేశించారు. 1972లో మూడో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు, 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 550గా పేర్కొన్నారు. వీటిలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు.


* ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020 ప్రకారం ఈ నామినేషన్‌ విధానాన్ని రద్దు చేశారు.

రిజర్వేషన్లు: లోక్‌సభలో అన్నివర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ వర్గాల వారికి 84 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 47 స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం ఇవే స్థానాలు కొనసాగుతున్నాయి.

లోక్‌సభ కాలం: ఆర్టికల్‌ 83 ప్రకారం సాధారణంగా లోక్‌సభ కాలం 5 సంవత్సరాలు. అయితే కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు లోక్‌సభను ఆ కాలం కంటే ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు.ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ అమలులో ఉన్న సందర్భంలో లోక్‌సభ కాలాన్ని ఒక సంవత్సరం వరకు అదనంగా పొడిగించవచ్చు (5 నుంచి 6 సంవత్సరాల వరకు).

బంగారు సత్యనారాయణ


 

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యసభ - ప్రత్యేక అధికారాలు

సమాఖ్య వ్యవస్థకు సమగ్ర ప్రాతినిధ్యం! 

జాతీయస్థాయి ప్రయోజనాలే ప్రధాన ప్రాతిపదికగా లోక్‌సభ నడుస్తుంది. ఆ సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల  రాజ్యాంగ పరమైన హక్కులకు, అధికారాలకు భంగం కలగకుండా రాజ్యసభ వ్యవహరిస్తుంది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం ఏర్పడకుండా చూస్తుంది. సమగ్ర శాసన ప్రక్రియకు దోహదపడుతుంది. కొత్త చట్టాల రూపకల్పనలో చర్చలను ప్రోత్సహించి, సమతౌల్యత సాధనకు సాయపడుతుంది. శాసనాల సమీక్ష, సవరణలతోపాటు దేశ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందుకు సంబంధించిన అంశాలు, రాజ్యాంగ నిబంధనలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. చట్టాల తయారీలో తొందరపాటుకు, ఏకపక్ష ధోరణికి తావు లేకుండా లోక్‌సభను రాజ్యసభ కట్టడి చేసే విధానాలను ఉదాహరణలతో తెలుసుకోవాలి.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. 1951 నాటి ‘భారత ప్రజాప్రాతినిధ్య చట్టం’ ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం ఆ సభలో సభ్యుల సంఖ్య 245. వీరిలో రాష్ట్రాల నుంచి 225 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్న 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు.


* రాజ్యాంగంలోని IV వ షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల సంఖ్యను పేర్కొన్నారు. వీరిని ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధానసభల సభ్యులు (ఎంఎల్‌ఏలు) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. 


* రాజ్యసభ శాశ్వత సభగా, నిరంతర సభగా కొనసాగుతుంది. దీనికి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్లకోసారి 1/3వ వంతు సభ్యులు పదవీవిరమణ చేస్తారు. ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించి ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. రాజ్యసభ సభ్యులు మొత్తం ఒకేసారి ఎన్నిక అవ్వరు. ఒకేసారి పదవీవిమరణ చేయరు.


* 30 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ‘రాజ్యసభ’కు జరిగే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అభ్యర్థి ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉండాలనే నిబంధన ఉండేది. 2003లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటరుగా ఉన్న వ్యక్తి, ఏ రాష్ట్రం నుంచైనా పోటీచేయవచ్చని నిర్దేశించారు. 2003 నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ‘రహస్య ఓటింగ్‌’ బదులుగా, బహిరంగ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు.


ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి:  ఆర్టికల్‌ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్‌-అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయినప్పటికీ సభకు అధ్యక్షత వహిస్తారు.రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.


రాజ్యసభ ప్రత్యేక అధికారాలు:  లోక్‌సభ అధికారాలతో పోలిస్తే రాజ్యసభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.


ఆర్టికల్‌ 249: జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు శాసనం రూపొందించాలంటే ముందుగా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ తీర్మానం ఆధారంగా పార్లమెంటు రూపొందించే శాసనం ఒక సంవత్సరకాలం పాటు అమలులో ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ మరొక తీర్మానాన్ని ఆమోదిస్తే ఇంకో సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.


ఉదా: రాజ్యసభ చేసిన తీర్మానం ఆధారంగా 1965లో ఆహారధాన్యాల విషయంలో పార్లమెంటు శాసనాన్ని రూపొందించింది.


ఆర్టికల్‌ 312: మన దేశంలో నూతన ‘అఖిల భారత సర్వీసులు’ ఏర్పాటు చేయాలంటే ముందుగా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. దాని ఆధారంగా పార్లమెంటు నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తూ చట్టం చేస్తుంది.


ఉదా: 1963లో రాజ్యసభ నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు తీర్మానించింది. 


1) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ -- ఇది 1966లో అమల్లోకి వచ్చింది. 


2) ఇండియన్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీస్‌ -- ఇది అమలులోకి రాలేదు. 


3) ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ -- అమలులో ఉంది.         


ఆర్టికల్‌ 67(B) : రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తొలగింపు తీర్మాన నోటీసును రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందు ఇవ్వాలి. తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. దానిని రాజ్యసభ సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. అనంతరం లోక్‌సభలో కూడా చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అక్కడ కూడా సాధారణ మెజార్టీతో ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోతారు.


రాజ్యసభ తన ప్రత్యేక అధికారాలను పలు సందర్భాల్లో వినియోగించింది.


* 1961లో ‘వరకట్న నిషేధ బిల్లు’ను వ్యతిరేకించింది.


* 1970లో ‘మాజీ సంస్థానాధిపతుల హక్కులు, సౌకర్యాల రద్దు’ బిల్లును తిరస్కరించింది.


* 1978లో ‘బ్యాంకింగ్‌ సర్వీస్‌ ఏర్పాటు/రద్దు’కు సంబంధించిన బిల్లును ఆమోదించలేదు.


* 1978లో ‘గుంటూరు’లోని ‘టొబాకో బోర్డు’ను వేరే ప్రాంతానికి తరలించే అంశాన్ని వ్యతిరేకించింది.


* 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో రూపొందించిన 44వ రాజ్యాంగ సవరణ బిల్లులోని 7 అంశాలను తిరస్కరించింది. 


రాజ్యసభ - ప్రాధాన్యం:  లోక్‌సభ తొందరపాటుతో రూపొందించే శాసన ప్రక్రియను రాజ్యసభ సవరిస్తుంది. శాసనపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది. అవసరమైన అదనపు రాజకీయ పదవులను సృష్టిస్తుంది. నాణ్యత ఉన్న, అభిలషణీయమైన శాసనాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే మేధావులను శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేస్తుంది.

లోక్‌సభతో సమానంగా రాజ్యసభకు ఉన్న అధికారాలు: మన దేశంలో సాధారణ చట్టాల రూపకల్పనలో, సాధారణ పరిపాలనాంశాల విషయంలో లోక్‌సభ, రాజ్యసభలకు సమాన అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లును చట్టంగా రూపొందించాలంటే ఉభయసభల ఆమోదం తప్పనిసరి.


రాజ్యాంగ సవరణ ప్రక్రియ: ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది. ఈ ప్రక్రియలో రాజ్యసభ, లోక్‌సభలకు సమాన అధికారాలున్నాయి. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సంబంధిత బిల్లు వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


ఉదా: ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌ సిఫార్సుల మేరకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభ తిరస్కరించడంతో బిల్లు వీగిపోయింది.


* పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే 73వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో, అది రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది 73వ రాజ్యాంగ సవరణ చట్టంగా 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

ఎన్నికల అధికారాలు: రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్‌ కాలేజీ’లో పార్లమెంటు ఉభయసభల సభ్యులకు సమాన అధికారాలు ఉంటాయి.


అత్యవసర పరిస్థితుల ఆమోదం: రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని, ఆర్టికల్‌ 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి/ రాష్ట్రపతి పాలన, ఆర్టికల్‌ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. రాష్ట్రపతి విధించే ఈ అత్యవసర పరిస్థితులు అమలు కావాలంటే పార్లమెంటు ఉభయసభలు తప్పనిసరిగా ఆమోదించాలి. వీటిని ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.


ఉదా: అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు 1999లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి బిహార్‌లోని రబ్రీ దేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దీన్ని లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి రాలేదు.


న్యాయాధికారాలు: రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన ‘మహాభియోగ తీర్మానం’ ను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని ఉభయ సభలు వేర్వేరుగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పదవీచ్యుతులు అవుతారు. తీర్మానం ప్రవేశపెట్టిన సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే, దాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. ఈ తీర్మానంపై ఉభయసభల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


* ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులు, కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన, ఇతర కమిషనర్లపై వచ్చే ఆరోపణలను విచారించి, వారిని పదవి నుంచి తొలగించే సందర్భంలో రాజ్యసభ, లోక్‌సభలకు సమాన అధికారాలున్నాయి. వీరిని తొలగించే తీర్మానాన్ని ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా సంబంధిత తీర్మానం వీగిపోతుంది.


కేంద్ర మంత్రి మండలి: కేంద్ర మంత్రి మండలిలో పదవులు చేపట్టే అవకాశం పార్లమెంటు ఉభయసభల సభ్యులకు ఉంటుంది. ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టాలంటే పార్లమెంటు సభ్యుడిగా ఉండాలి. అయితే పార్లమెంటులో సభ్యత్వం లేని వ్యక్తి ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టినప్పుడు, ఆ పదవి చేపట్టిన తేదీ నుంచి 6 నెలల్లోగా పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. లేకపోతే పదవిని కోల్పోతారు. సాధారణంగా లోక్‌సభలో మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడు ప్రధాని పదవి నిర్వహిస్తారు. అయితే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవులను నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఉదా: హెచ్‌డీ.దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యత్వంతోనే ప్రధాని పదవి నిర్వహించారు.

పార్లమెంటరీ కమిటీల్లో ప్రాతినిధ్యం: ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘం, సభాహక్కుల సంఘం, జీతభత్యాల సంఘం మొదలైన పార్లమెంటరీ కమిటీల్లో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ప్రాతినిధ్యం ఉంటుంది.


రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటు: భారతదేశంలో నూతన రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు ఉభయసభల ఆమోదం తప్పనిసరి. ఉభయ సభలు వేర్వేరుగా 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించిన తర్వాతే కొత్త రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది.

నివేదికలపై చర్చ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), కేంద్ర ఆర్థిక సంఘం, జాతీయ మహిళా కమిషన్, జాతీయ సమాచార కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్‌ మొదలైనవి తమ నివేదికలను రాష్ట్రపతికి సమర్పించిన అనంతరం,  రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు పంపిస్తారు. ఆ నివేదికలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది.


 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 09-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌