• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - సుప్రీంకోర్టు తీర్పులు

        భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం ద్వారా లేదా మరే విధంగానైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఒరిజినల్ అధికార పరిధి లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (కేసును నేరుగా తనే స్వీకరించి, విచారించి, తీర్పు ఇవ్వడం) కిందకు వస్తాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, పార్లమెంటు చేసిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాలు చేస్తూ అనేక వివాదాలు కోర్టుల్లో విచారణకు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి......


I. సమానత్వ హక్కు (నిబంధనలు 14-18)
నిబంధన 14: చిరంజిత్ లాల్ చౌదరి Vs కేంద్ర ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు (హెచ్.జె.కానియా) తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేస్తారని తెలిపింది.
* బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రక్షణ దళాలు, రాయబారులకు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
* సాఘీర్ అహ్మద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కేసు (1955)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా భావించి, తనకు అనుకూలంగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని తెలియజేసింది.
సుభాచంద్ Vs ఢిల్లీ ఎలక్ట్రికల్ సప్త్లె కేసు (1981) లో ప్రభుత్వ సర్వీసుల నియామకంలో వయసు, విద్యార్హతలు, కులం, లింగం మొదలైన అంశాల్లో వివక్ష చూపించడం, సమాన అవకాశాన్ని కల్పించే పరిధిలో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
* అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Vs కేంద్ర ప్రభుత్వ కేసు (1988) లో విధులు, కర్తవ్యాలు ఒకే స్వభావం కలిగి ఉన్నా, బాధ్యతల పరిమాణం వేరుగా ఉన్నప్పుడు సమాన పనికి, సమాన వేతన నియమం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* సమాన పని, సమాన విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఇతర తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులకు కూడా, శాశ్వత ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించాలని పంజాబ్‌లోని తాత్కాలిక ఉద్యోగులు వేసిన రిట్ పిటీషన్ కేసు - 2016 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నిబంధన 15: చంపకందొరై రాజన్ Vs మద్రాసు ప్రభుత్వం కేసు (1951)లో ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చి చెప్పింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 15 (4) క్లాజును చేర్చింది.
* యం.ఆర్.బాలాజీ Vs మైసూరు రాష్ట్ర ప్రభుత్వం (1963) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రిజర్వేషన్లు 50% కి మించరాదు అని స్పష్టం చేసింది.
* అయితే 76 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 ద్వారా తమిళనాడులో కల్పించిన 69% రిజర్వేషన్లు రాజ్యాంగంలోని IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీని ద్వారా న్యాయసమీక్షాధికారానికి వీలు లేకుండా చేసింది. కానీ, 2006 లో సుప్రీంకోర్టు IXవ షెడ్యూల్ లోని అంశాలపై కూడా న్యాయసమీక్షాధికారం వర్తిస్తుందని తెలిపింది.
ఇనాందార్ Vs మహారాష్ట్ర ప్రభుత్వం (2005) కేసులో మైనారిటీ, మైనారిటీయేతర నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 ద్వారా 15 (5) క్లాజును చేర్చింది. దీని ప్రకారం 30 (1) నిబంధనను అనుసరించి ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.

నిబంధన 16: దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1964) లో సుప్రీంకోర్టు క్యారీ ఫార్వర్డ్ రూల్ (రిజర్వేషన్ల విషయంలో) చెల్లదని తెలిపింది.
* ఎ.వి.ఎస్.నరసింహారావు Vs ఆంధ్రప్రదేశ్ (1970) కేసులో ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను రాష్ట్రం మొత్తంలో నివసిస్తున్న అందరికీ రిజర్వ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనల చట్టాన్ని రద్దు చేసింది.
* ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ క్రీమీ లేయర్‌ను గుర్తించాలని పేర్కొంది.
* షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లవని కొట్టివేసింది.
* దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 77 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా 16 (4) క్లాజును చేర్చింది.

నిబంధన 18: బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పురస్కారాలు మాత్రమే అని, బిరుదులు కావని, వీటిని పేరుకు ముందు లేదా తర్వాత వాడటం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.


II. స్వేచ్ఛ-స్వాతంత్య్ర హక్కు (నిబంధనలు 19-22)
నిబంధన 19: బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు (1950)లో సుప్రీంకోర్టు (సయ్యద్ ఫజుల్ అలీ నాయకత్వంలోని బెంచ్) తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని తెలిపింది.
* కానీ కె.ఎ.అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1970)లో సుప్రీంకోర్టు (హిదయతుల్లా) తీర్పునిస్తూ సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తెలిపింది.
* మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోపల, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భావవ్యక్తీకరణకు భౌగోళిక హద్దులు లేవని తెలిపింది.
* బిజయ్ ఎమాన్యూల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో సుప్రీంకోర్టు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలో మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది అని అభిప్రాయపడింది. ఇది జాతీయ గీతం కేసుగా ప్రచారం పొందింది.
* అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో సుప్రీంకోర్టు, ప్రజా సంక్షేమం దృష్ట్యా వాహన డ్రైవర్లు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
* సోదన్ సింగ్ Vsన్యూదిల్లీ మున్సిపల్ కమిటీ (ఎన్‌డీఎంసీ) కేసు (1989) కు సంబంధించి సుప్రీంకోర్టు 1992లో తీర్పునిస్తూ క్రమబద్దీకరించిన రహదార్ల కాలిబాటలపై వ్యాపారం చేసుకునేందుకు (జీవనోపాధి) హాకర్లకు హక్కు ఉందని తెలియజేసింది.
సి.పి.ఐ.(యం) Vs భరత్ కుమార్ (1997) కేసులో సుప్రీంకోర్టు బంద్, హర్తాల్ మధ్య తేడాలను తెలియజేయడంతో పాటు బంద్ అనేది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
* రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (2003) కేసులో సుప్రీంకోర్టు, సమ్మె ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ కార్మికులు లేదా ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది.
* శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66A భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, చెల్లదని స్పష్టం చేసింది. (నేపథ్యం- 2012 లో స్వర్గీయ బాల్ థాకరే మరణం తర్వాత ముంబయి బంద్‌కు పిలుపునివ్వడంపై షహీన్ దాదా, రీను శ్రీనివాసన్ తమ అసంతృప్తిని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. కానీ ప్రజావ్యతిరేకత రావడంతో విడుదల చేశారు).

నిబంధన 20: నందిని సాత్పతి Vs డాని పి.ఎల్. (1978) కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని వివరించింది.
* స్వయంగా నిందను ఆపాదించుకోకూడదు.
* మౌనాన్ని పాటించే హక్కు నిందితుడికి ఉంటుంది.
* శారీరకంగా బెదిరించి, హింసించి పొందిన సాక్ష్యం, మానసిక క్షోభ కలిగించడం, ప్రతికూల పరిసరాలను కల్పించి ఒత్తిడి తేవడం, పదేపదే ప్రశ్నలు అడిగి విసిగించడం, శక్తికి మించిన బరువు, బాధ్యతలు మోపడం, బలవంతంగా నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ఉపయోగించే ప్రత్యక్ష లేదా పరోక్ష, మానసిక లేదా శారీరక క్షోభకు గురిచేయడం బలవంతపు సాక్ష్యం కిందికి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది.
ఎ.ఎ.ముల్లా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1996) కేసులో సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టం కింద విచారించి నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని, తిరిగి కస్టమ్స్ చట్టం, విదేశీమారక క్రమబద్దీకరణ చట్టం కింద రెండో విచారణ నిర్వహించడం 20 వ నిబంధనకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. రెండు విచారణల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని మొదటి, రెండో విచారణల్లోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి రెండో విచారణ నిర్వహించవచ్చని వ్యాఖ్యానించింది.

నిబంధన 21: ఎ.కె.గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు (1950) కేసులో సుప్రీంకోర్టు 19, 21 ప్రకరణలు లేదా నిబంధనల పరిధులు వేరని తెలిపింది. 21 వ నిబంధనను అనుసరించి చేసిన శాసనం ప్రకారం నిర్బంధితులైనప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో చట్టం చేస్తే, అది చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
* నీరజా చౌదరి Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1984) కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ పి.భగవతి) తీర్పునిస్తూ వెట్టిచాకిరీ జీవించే హక్కు (నిబంధన 21)కు భంగకరం కాబట్టి, ప్రభుత్వాలు వెట్టిచాకిరీని  నిర్మూలించే శాసనాలను రూపొందించాలని ఆదేశించింది.
* ఉన్నిక్రిష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, (1993) కేసులో సుప్రీంకోర్టు (ఎల్.ఎం.శర్మ) చరిత్రాత్మక తీర్పునిస్తూ విద్యాహక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, అది లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని తెలియజేసి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అయితే విద్యార్జన హక్కు వయసును 14 సంవత్సరాలకు పరిమితం చేసింది. 14 సంవత్సరాల తర్వాత విద్యార్జన హక్కు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. (దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది)
వీడియోకాన్ Vs మహారాష్ట్ర (2013) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 21వ నిబంధనలోని జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని తెలియజేసింది.

నిబంధన 22: ఎ.కె.గోపాలన్ Vs మద్రాసు ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం అరెస్టు చేసే పోలీసు అధికారి బాధ్యత. ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో తెలియజేయలేకపోతే, కారణాలను కోర్టుకు తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
* అబ్దుల్ సమద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1962) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలు గడిస్తే, ఆ వ్యక్తికి (అరెస్టు అయిన వ్యక్తి) విడుదల కావడానికి హక్కు ఉంటుందని తెలిపింది.
* జోగిందర్ కుమార్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1994) కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, ఆ సమాచారాన్ని, దానికిగల కారణాలను కుటుంబ సభ్యులకు (లేదా) స్నేహితులకు (లేదా) సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పింది.


III. పీడన నిరోధక హక్కు (నిబంధనలు 23-24)
* పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం ప్రాథమిక హక్కుల్లోని 23వ నిబంధన ఉల్లంఘనగా తెలియజేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2001) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైంది. ఆకలి, పోషకాహార లోపాలను అరికట్టడానికి, ఆహార హక్కును చట్టబద్దంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీనివల్ల అనేక రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని (బడిపిల్లలకు) ప్రవేశపెట్టాయి.
* సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కార్మికులు Vss జమ్మూ & కశ్మీర్ (1983) కేసులో సుప్రీంకోర్టు నిర్మాణ రంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లల్లోపు వారిని పనిలో చేర్చుకోకూడదని ఆదేశించింది.
* బందువా ముక్తిమోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని, బాల కార్మికులను పనిలో చేర్చుకునే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించి, ఆ నిధిలోకి జమచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌