* ముడి పదార్థాలను ఉపయోగించి, వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు.
* ఆధునిక యుగంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధి పరిశ్రమలపై ఆధారపడి ఉంటాయి.
పరిశ్రమల స్థాపనకు దోహదపడే అంశాలు:
* ఖనిజాల లభ్యత
* అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు
* మార్కెట్ సౌకర్యాలు
* పెట్టుబడుల లభ్యత
* తగిన మోతాదులో మంచినీటి లభ్యత
* తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు
* నిరంతరాయంగా లభించే విద్యుత్ సౌకర్యాలు
* భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దంలో ప్రారంభమైంది.
పరిశ్రమలు - రకాలు
ముడి పదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:
1) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
3) ఖనిజ ఆధారిత పరిశ్రమలు
వ్యవసాయాధారిత పరిశ్రమలు
వస్త్ర/ జౌళి పరిశ్రమ
జౌళి అనేది విస్తృతమైన పదం. ఇందులో వస్త్ర పరిశ్రమ; జనపనార పరిశ్రమ; ఉన్ని, పట్టు, సింథటిక్ వస్త్ర పరిశ్రమలు భాగంగా ఉంటాయి.
* వస్త్ర పరిశ్రమను మనదేశంలో మొదటిసారి 1818లో కలకత్తా సమీపంలోని ఫోర్ట్ గ్లాస్టర్ వద్ద ఏర్పాటు చేయగా, అది విజయవంతం కాలేదు.
* భారతదేశంలో ఆధునిక వస్త్రపరిశ్రమను 1854లో పార్సీ వ్యాపారవేత్తల ఆర్థిక సహకారంతో బొంబాయిలో ఏర్పాటు చేశారు.
* భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమది ప్రత్యేకస్థానం.
* పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%, విదేశీమారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతంగా ఉంది.
* వ్యవసాయరంగం తర్వాత వస్త్రపరిశ్రమ నుంచే ప్రజలకు అత్యధిక ఉపాధి లభిస్తుంది.
* 1947 నాటికి మనదేశంలో 423 నూలుమిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో
స్వావలంబన (self reliant) సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ.
* ఆఫీస్ ఆఫ్ టెక్స్టైల్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రకారం, వస్త్ర పరిశ్రమలు తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేశంలోనే మొట్టమొదటి వస్త్రపరిశ్రమల ప్రత్యేక ఆర్థికమండలిని తిరువూరులో ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ చర్యలు: పారిశ్రామిక విప్లవం మొట్టమొదట వస్త్రరంగంలో ప్రారంభమైంది. ప్రపంచ వస్త్రపరిశ్రమ ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగరంలో అభివృద్ధి చెందింది. ఈ నగరాన్ని ‘కాటన్ పొలీస్’ అంటారు. అంటే వస్త్ర పరిశ్రమ పుట్టిన ప్రాంతం అని అర్థం.
* వస్త్రాలు, దుస్తుల తయారీలో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది.
* 1963లో బొంబాయిలో టెక్స్టైల్ కమిటీని ఏర్పాటుచేశారు. యంత్రాలు, వస్త్రాల నాణ్యతను పెంపొందించడం దీని లక్ష్యం.
* 2010లో కలకత్తాలో నేషనల్ జూట్ బోర్డ్ను స్థాపించారు. జనపనార ఉత్పత్తులను పెంపొందించడం దీని లక్ష్యం.
* 1948లో ది సెంట్రల్ సిల్క్ బోర్డును బెంగళూరు కేంద్రంగా నెలకొల్పారు.
* 1987లో సెంట్రల్ ఊల్ డెవలప్మెంట్ బోర్డ్ను జోధ్పూర్లో ఏర్పాటు చేశారు.
* 2002లో సర్దార్ వల్లభాయ్పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ మేనేజ్మెంట్ను కోయంబత్తూర్లో ఏర్పాటు చేశారు.
* భారతదేశంలో వస్త్రపరిశ్రమలు ఎక్కువగా ముంబయి-బొంబాయి, అహ్మదాబాద్ నగరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలు
స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్: దేశంలోని వస్త్ర పరిశ్రమలకు ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చడానికి భారత ప్రభుత్వం 2005లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ్ర
దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 40% ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది.
PM MITRA SCHEME: Farm ti fiber, fiber to factory, factory to fashion, fashion ti foreign స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ పథకాన్ని మొదటిసారి 202021 బడ్జెట్లో ప్రకటించింది.
జనపనార పరిశ్రమ
* దేశంలో జనపనార పరిశ్రమను 1855లో కలకత్తాలోని ‘రిష్రా’ వద్ద ఏర్పాటు చేశారు.
* జనపనార, దాని ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది.
* జనపనార వస్తువుల ఎగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, మొదటి ర్యాంక్లో బంగ్లాదేశ్ ఉంది.
* మనదేశంలో సుమారు 70 జనపనార మిల్లులు ఉన్నాయి.
* పశ్చిమ్ బంగాలోని హుగ్లీ నదీ తీరంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వీటికి రాణీగంజ్ నుంచి బొగ్గు, దామోదర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ సౌకర్యాలు ఉండటమే.
రకాలు - ఇతర ముఖ్యాంశాలు:
* బుర్లాప్ - అత్యంత నాణ్యమైన జనపనార రకం
* కెనాఫ్ - అత్యంత వేగంగా పెరిగే జనపనార రకం. దీన్ని సాధారణ పరిభాషలో ‘మెస్బా’ అంటారు.
* రాటింగ్ - జనుము పంటను కోసి నీటిలో నానబెట్టే ప్రక్రియ.
* 1971లో కలకత్తాలో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను నెలకొల్పారు.
* జనుము రైతులు, కార్మికులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుతం 2005లో జాతీయ జనపనార విధానాన్ని ప్రకటించింది.
పట్టు పరిశ్రమ
* నాలుగు వేల సంవత్సరాల క్రితం చైనీయులు పట్టు వస్త్రాలను తయారు చేసే విధానాన్ని కనుక్కున్నారు.
* చైనా, యూరప్ మధ్య జరిగే వర్తక మార్గాన్ని పట్టు మార్గం (Silk Route) గా పిలిచేవారు.
* భారతదేశంలో ఆధునిక పట్టు వస్త్ర పరిశ్రమను 1832లో పశ్చిమ్ బంగాలోని హౌరా వద్ద స్థాపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.
* ఈ పరిశ్రమను వస్త్ర పరిశ్రమల రాణి (Queen of Textiles) గా పేర్కొంటారు.
* పట్టు ఉత్పత్తిలో చైనా, భారత్లు వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, వినియోగంలో భారత్ ప్రథమస్థానంలో ఉంది.
* మనదేశంలో పట్టు ఎక్కువగా కర్ణాటక నుంచే ఉత్పత్తి అవుతోంది.
* పట్టు పురుగులు తయారు చేసే ‘కొకూన్’ నుంచి పట్టు దారం లభిస్తుంది.
* మనదేశంలో మాత్రమే 4 రకాల పట్టు ఉత్పత్తి జరుగుతుంది. అవి:
1. మల్బరీ 2. టస్సర్ 3. ఇరి 4. ముగ
* టస్సర్, ఇరి, ముగాలను వన్య పట్టు (Wild Silk) అంటారు. రేయాన్ను కృత్రిమ పట్టు (Artificial Silk) అంటారు.
వివిధ పట్టు రకాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు
మల్బరీ - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
ఇరి - బిహార్, పశ్చిమ్ బంగా
టస్సర్ - ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్
ముగ - అసోం
దేశంలో నూలు పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు
మహారాష్ట్ర - ముంబయి, ఔరంగాబాద్, నాగ్పుర్, పుణె, నాసిక్
గుజరాత్ - అహ్మదాబాద్, బరోడా, సూరత్, వడోదర, రాజ్కోట్
తమిళనాడు - కోయంబత్తూర్, తంజావూరు, మధురై, సేలం, తిరునల్వేలి, ఈరోడ్
ఉత్తర్ ప్రదేశ్ - కాన్పూర్, ఆగ్రా, రాంపూర్, ఇటావ, హత్రాస్, షహరాన్పూర్
పంజాబ్ - అమృత్సర్
కర్ణాటక - బెంగళూరు, బళ్లారి, మైసూర్, హుబ్లీ, ధావనగెరె
ఆంధ్రప్రదేశ్ - ధర్మవరం, వెంకటగిరి, అనంతపురం, గుంటూరు
తెలంగాణ - హైదరాబాద్, వరంగల్
వస్త్ర పరిశ్రమ - పట్టణాలు
అహ్మదాబాద్: గుజరాత్లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. మనదేశంలో (ముంబయి) తర్వాత వస్త్ర పరిశ్రమ ఈ ప్రాంతంలోనే ప్రారంభమైంది.
ముంబయి: మహారాష్ట్రలోని ఈ నగరాన్ని ‘కాటన్ పొలీస్ ఆఫ్ ఇండియా’, ‘మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్’ అంటారు.
కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా’ అని పిలుస్తారు. అధిక జనాభా వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.
కోయంబత్తూర్: తమిళనాడులోని ఈ నగరంలో స్వాతంత్య్రం తర్వాత వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. కోయంబత్తూర్ను ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని అంటారు.
* నూలు, ఉన్ని, పట్టు పరిశ్రమలను ‘భార నష్టం లేని పరిశ్రమలు’ (Non weight loss industries) అంటారు. అంటే 100 కేజీల ముడిపదార్థాలను ఉపయోగిస్తే 100 కేజీల వస్త్రం ఉత్పత్తి అవుతుంది.
* పంచదార పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమలను భారనష్టం ఉన్న పరిశ్రమలు (Weight loss industries)అంటారు. వీటి ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థాలను కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది.
ఉన్ని పరిశ్రమ
* ఆధునికమైన ఉన్ని వస్త్ర పరిశ్రమను 1876లో స్థాపించారు.
* ఉన్ని వస్త్ర పరిశ్రమకు చల్లటి, శుష్క శీతోష్ణ పరిస్థితులు అవసరం.
* భారతదేశంలో జమ్మూకశ్మీర్లోని బేకర్వాల్స్ పాశ్మీనా జాతి మేకల నుంచి; రాజస్థాన్లోని గుజ్జర్స్; హిమాచల్ప్రదేశ్లోని గద్దీస్ తెగకు చెందిన ప్రజలు అంగోరా జాతి గొర్రెల నుంచి శ్రేష్ఠమైన ఉన్నిని సేకరిస్తారు.
* ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.
* ఉన్నిలో మెరీనా రకం నాణ్యమైంది, ప్రత్యేకమైంది.
* సెంట్రల్ ఊల్ డెవలప్మెంట్ బోర్డు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. దీన్ని 1987, జులైలో ఏర్పాటు చేశారు.