• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

* ముడి పదార్థాలను ఉపయోగించి, వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు.

* ఆధునిక యుగంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధి పరిశ్రమలపై ఆధారపడి ఉంటాయి.


పరిశ్రమల స్థాపనకు దోహదపడే అంశాలు:

* ఖనిజాల లభ్యత 

* అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు

* మార్కెట్‌ సౌకర్యాలు    

* పెట్టుబడుల లభ్యత    

* తగిన మోతాదులో మంచినీటి లభ్యత    

* తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు    

* నిరంతరాయంగా లభించే విద్యుత్‌ సౌకర్యాలు

* భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దంలో ప్రారంభమైంది.


పరిశ్రమలు - రకాలు

ముడి పదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు

2) అటవీ ఆధారిత పరిశ్రమలు

3) ఖనిజ ఆధారిత పరిశ్రమలు


వ్యవసాయాధారిత పరిశ్రమలు

వస్త్ర/ జౌళి పరిశ్రమ

  జౌళి అనేది విస్తృతమైన పదం. ఇందులో వస్త్ర పరిశ్రమ; జనపనార పరిశ్రమ; ఉన్ని, పట్టు, సింథటిక్‌ వస్త్ర పరిశ్రమలు భాగంగా ఉంటాయి.

* వస్త్ర పరిశ్రమను మనదేశంలో మొదటిసారి 1818లో కలకత్తా సమీపంలోని ఫోర్ట్‌ గ్లాస్టర్‌ వద్ద ఏర్పాటు చేయగా, అది విజయవంతం కాలేదు.

* భారతదేశంలో ఆధునిక వస్త్రపరిశ్రమను 1854లో పార్సీ వ్యాపారవేత్తల ఆర్థిక సహకారంతో బొంబాయిలో ఏర్పాటు చేశారు.

* భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమది ప్రత్యేకస్థానం.

* పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%, విదేశీమారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతంగా ఉంది.

* వ్యవసాయరంగం తర్వాత వస్త్రపరిశ్రమ నుంచే ప్రజలకు అత్యధిక ఉపాధి లభిస్తుంది.

* 1947 నాటికి మనదేశంలో 423 నూలుమిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 

స్వావలంబన (self reliant) సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ.

* ఆఫీస్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం, వస్త్ర పరిశ్రమలు తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేశంలోనే మొట్టమొదటి వస్త్రపరిశ్రమల ప్రత్యేక ఆర్థికమండలిని తిరువూరులో ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ చర్యలు: పారిశ్రామిక విప్లవం మొట్టమొదట వస్త్రరంగంలో ప్రారంభమైంది. ప్రపంచ వస్త్రపరిశ్రమ ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ నగరంలో అభివృద్ధి చెందింది. ఈ నగరాన్ని ‘కాటన్‌ పొలీస్‌’ అంటారు. అంటే వస్త్ర పరిశ్రమ పుట్టిన ప్రాంతం అని అర్థం.

* వస్త్రాలు, దుస్తుల తయారీలో భారత్‌ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది.

* 1963లో బొంబాయిలో టెక్స్‌టైల్‌ కమిటీని ఏర్పాటుచేశారు. యంత్రాలు, వస్త్రాల నాణ్యతను పెంపొందించడం దీని లక్ష్యం.

* 2010లో కలకత్తాలో నేషనల్‌ జూట్‌ బోర్డ్‌ను స్థాపించారు. జనపనార ఉత్పత్తులను పెంపొందించడం దీని లక్ష్యం.

* 1948లో ది సెంట్రల్‌ సిల్క్‌ బోర్డును బెంగళూరు కేంద్రంగా నెలకొల్పారు.

* 1987లో సెంట్రల్‌ ఊల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ను జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు.

* 2002లో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ను కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేశారు.

* భారతదేశంలో వస్త్రపరిశ్రమలు ఎక్కువగా ముంబయి-బొంబాయి, అహ్మదాబాద్‌ నగరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి.


ప్రభుత్వ పథకాలు


స్కీమ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్స్‌: దేశంలోని వస్త్ర పరిశ్రమలకు ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చడానికి భారత ప్రభుత్వం 2005లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ్ర

 దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 40% ప్రభుత్వం గ్రాంట్‌గా ఇస్తుంది.


PM MITRA SCHEME: Farm ti fiber, fiber to factory, factory to fashion, fashion ti foreign స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ పథకాన్ని మొదటిసారి 202021 బడ్జెట్లో ప్రకటించింది.


జనపనార పరిశ్రమ 

* దేశంలో జనపనార పరిశ్రమను 1855లో కలకత్తాలోని ‘రిష్రా’ వద్ద ఏర్పాటు చేశారు.

* జనపనార, దాని ఉత్పత్తుల్లో భారత్‌ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది.

* జనపనార వస్తువుల ఎగుమతుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, మొదటి ర్యాంక్‌లో బంగ్లాదేశ్‌ ఉంది.

* మనదేశంలో సుమారు 70 జనపనార మిల్లులు ఉన్నాయి. 

* పశ్చిమ్‌ బంగాలోని హుగ్లీ నదీ తీరంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వీటికి రాణీగంజ్‌ నుంచి బొగ్గు, దామోదర్‌ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ సౌకర్యాలు ఉండటమే.


రకాలు - ఇతర ముఖ్యాంశాలు:

* బుర్లాప్‌ - అత్యంత నాణ్యమైన జనపనార రకం

* కెనాఫ్‌ - అత్యంత వేగంగా పెరిగే జనపనార రకం. దీన్ని సాధారణ పరిభాషలో ‘మెస్బా’ అంటారు.

* రాటింగ్‌ - జనుము పంటను కోసి నీటిలో నానబెట్టే ప్రక్రియ.

* 1971లో కలకత్తాలో జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను నెలకొల్పారు.

* జనుము రైతులు, కార్మికులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుతం 2005లో జాతీయ జనపనార విధానాన్ని   ప్రకటించింది.

పట్టు పరిశ్రమ 

* నాలుగు వేల సంవత్సరాల క్రితం చైనీయులు పట్టు వస్త్రాలను తయారు చేసే విధానాన్ని కనుక్కున్నారు.

* చైనా, యూరప్‌ మధ్య జరిగే వర్తక మార్గాన్ని పట్టు మార్గం (Silk Route) గా పిలిచేవారు.

* భారతదేశంలో ఆధునిక పట్టు వస్త్ర పరిశ్రమను 1832లో పశ్చిమ్‌ బంగాలోని హౌరా వద్ద స్థాపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.

* ఈ పరిశ్రమను వస్త్ర పరిశ్రమల రాణి (Queen of Textiles) గా పేర్కొంటారు.

* పట్టు ఉత్పత్తిలో చైనా, భారత్‌లు వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, వినియోగంలో భారత్‌ ప్రథమస్థానంలో ఉంది. 

* మనదేశంలో పట్టు ఎక్కువగా కర్ణాటక నుంచే ఉత్పత్తి అవుతోంది.

* పట్టు పురుగులు తయారు చేసే ‘కొకూన్‌’ నుంచి పట్టు దారం లభిస్తుంది.

* మనదేశంలో మాత్రమే 4 రకాల పట్టు ఉత్పత్తి జరుగుతుంది. అవి: 

1. మల్బరీ  2. టస్సర్‌  3. ఇరి  4. ముగ

* టస్సర్, ఇరి, ముగాలను వన్య పట్టు (Wild Silk) అంటారు. రేయాన్‌ను కృత్రిమ పట్టు (Artificial Silk) అంటారు.


వివిధ పట్టు రకాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు


మల్బరీ    -   కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

ఇరి      -   బిహార్, పశ్చిమ్‌ బంగా

టస్సర్‌    -   ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌

ముగ    -   అసోం

దేశంలో నూలు పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు

మహారాష్ట్ర - ముంబయి, ఔరంగాబాద్, నాగ్‌పుర్, పుణె, నాసిక్‌

గుజరాత్‌ - అహ్మదాబాద్, బరోడా, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌

తమిళనాడు - కోయంబత్తూర్, తంజావూరు, మధురై, సేలం, తిరునల్వేలి, ఈరోడ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌ - కాన్పూర్, ఆగ్రా, రాంపూర్, ఇటావ, హత్రాస్, షహరాన్‌పూర్‌

పంజాబ్‌ - అమృత్‌సర్‌

కర్ణాటక - బెంగళూరు, బళ్లారి, మైసూర్, హుబ్లీ, ధావనగెరె

ఆంధ్రప్రదేశ్‌ - ధర్మవరం, వెంకటగిరి, అనంతపురం, గుంటూరు

తెలంగాణ - హైదరాబాద్, వరంగల్‌


వస్త్ర పరిశ్రమ - పట్టణాలు


అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. మనదేశంలో (ముంబయి) తర్వాత వస్త్ర పరిశ్రమ ఈ ప్రాంతంలోనే ప్రారంభమైంది.


ముంబయి: మహారాష్ట్రలోని ఈ నగరాన్ని ‘కాటన్‌ పొలీస్‌ ఆఫ్‌ ఇండియా’, ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అంటారు.


కాన్పూర్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఈ నగరాన్ని ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా’ అని పిలుస్తారు. అధిక జనాభా వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.


కోయంబత్తూర్‌: తమిళనాడులోని ఈ నగరంలో స్వాతంత్య్రం తర్వాత వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. కోయంబత్తూర్‌ను ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ అని అంటారు.


* నూలు, ఉన్ని, పట్టు పరిశ్రమలను ‘భార నష్టం లేని పరిశ్రమలు’ (Non weight loss industries) అంటారు. అంటే 100 కేజీల ముడిపదార్థాలను ఉపయోగిస్తే 100 కేజీల వస్త్రం ఉత్పత్తి అవుతుంది.


* పంచదార పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమలను భారనష్టం ఉన్న పరిశ్రమలు (Weight loss industries)అంటారు. వీటి ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థాలను కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది.

ఉన్ని పరిశ్రమ 

* ఆధునికమైన ఉన్ని వస్త్ర పరిశ్రమను 1876లో స్థాపించారు. 

* ఉన్ని వస్త్ర పరిశ్రమకు చల్లటి, శుష్క శీతోష్ణ పరిస్థితులు అవసరం. 

* భారతదేశంలో జమ్మూకశ్మీర్‌లోని బేకర్‌వాల్స్‌ పాశ్మీనా జాతి మేకల నుంచి; రాజస్థాన్‌లోని గుజ్జర్స్‌; హిమాచల్‌ప్రదేశ్‌లోని గద్దీస్‌ తెగకు చెందిన ప్రజలు అంగోరా జాతి గొర్రెల నుంచి శ్రేష్ఠమైన ఉన్నిని సేకరిస్తారు.

* ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

* ఉన్నిలో మెరీనా రకం నాణ్యమైంది, ప్రత్యేకమైంది.

* సెంట్రల్‌ ఊల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. దీన్ని 1987, జులైలో ఏర్పాటు చేశారు.

Posted Date : 30-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌