• facebook
  • whatsapp
  • telegram

ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368)

      ముసునూరి నాయకరాజుల చరిత్రకు ప్రధాన ఆధారాలు... ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం, కాపయనాయకుడి పోలవరం శాసనం, ఛోడ భక్తిరాజు పెంటపాడు శాసనం, అనితల్లి కలువచేరు శాసనం. క్రీ.శ.1325లో ముసునూరి రాజ్యాన్ని ప్రోలయ నాయకుడు స్థాపించాడు. ఇతడు నేటి ఖమ్మం జిల్లాలోని రేకపల్లిని రాజధానిగా చేసుకుని పాలించాడు. వెన్నయ అనే వ్యక్తికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని విలస గ్రామాన్ని దానం చేసి విలస తామ్ర శాసనాన్ని వేయించాడు. ప్రోలయ తర్వాత ముసునూరి కాపయనాయకుడు రాజయ్యాడు. ఇతడు ఓరుగల్లుపై దండెత్తి మాలిక్ మక్బూల్ (గన్నమనాయుడు)ను ఓడించి ఆంధ్రసురత్రాణ, ఆంధ్రదేశాధీశ్వర బిరుదులను పొందాడు. కోరుకొండ దుర్గాన్ని నిర్మించి కూనయ నాయకుడిని రాజ ప్రతినిధిగా నియమించాడు. కానీ కాపయ నాయకుడు బహమనీసుల్తాన్ హసన్‌గంగూ బహమన్ పంపిన సికిందర్‌ఖాన్ చేతిలో ఓడిపోయాడు. దాంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలస్ దుర్గాన్ని, అపార ధనరాశులను సుల్తానుకు సమర్పించుకున్నాడు. కాపయ కుమారుడైన వినాయక దేవుడిని బహమనీ సుల్తాన్ మహ్మద్‌షా వధించాడు. దీంతో కాపయనాయకుడు తన రాజధానిని రేఖపల్లి నుంచి వరంగల్‌కు మార్చాడు. రేచర్ల సింగముని కుమారుడైన అనవోతానీడు భీమవరం యుద్ధంలో కాపయనాయకుడిని వధించి ఓరుగల్లు, భువనగిరి దుర్గాలను ఆక్రమించాడు. కాపయనాయకుడి కాలంలోనే మడికిసింగన సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించాడు.

రేచర్ల పద్మనాయకులు (వెలమ దొరలు క్రీ.శ. 1325-1475)

      రేచర్ల పద్మనాయక వంశ మూలపురుషుడు బేతాళనాయకుడు. కానీ వెలుగోటి వంశావళి ప్రకారం చెవ్విరెడ్డిని మూలపురుషుడిగా చెబుతారు. రుద్రమదేవి కాలంలో పని చేసిన రేచర్ల ప్రసాదిత్యుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులున్నాయి. స్వతంత్ర రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని 1325లో మొదటి సింగమ నాయకుడు/ మొదటి సింగమ స్థాపించాడు. ఇతడు పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించాడు. సర్వజ్ఞ సింగభూపాలుడు అనే బిరుదు ఉంది. శ్రీనాథుడు ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు. వీరి కాలంలో రాజభాష సంస్కృతం. ఉదార రాఘవం, నిరోష్ట్య రామాయణం అనే గ్రంథాలను రచించిన కవి శాకల్యభట్టు ఈయన ఆస్థానంలో ఉన్నాడు. శాకల్యభట్టుకు చతుర్భాష కవితా పితామహుడు అనే బిరుదు ఉంది.
 

అనవోతానాయకుడు / మొదటి అనవోతానాయకుడు (క్రీ.శ.1361 - క్రీ.శ.1384)

      అనవోతా నాయకుడికి సోమకుల పరశురామ, ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదులున్నాయి. ఇతడిని కొండవీటి రెడ్డిరాజు ఓడించి శ్రీశైలం ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనవోతా నాయకుడి కాలంలోనే వెలమ-రెడ్డి సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతడి మంత్రి పేరు తిప్పరాజు.
       అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. దేవరకొండను రాజధానిగా చేసి, సోదరుడు మాదా నాయకుడిని అక్కడ నియమించాడు. తను రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. మాదానాయకుడి మంత్రి పోతరాజు. గురువు వెంకటాచార్యులు. తాడూరు గ్రామాన్ని మాదానాయకుడు శ్రీరంగనాథస్వామి ఆలయానికి దానం చేశాడు. అతడి భార్య నాగాంబిక నాగ సముద్రం అనే తటాకాన్ని తవ్వించింది. రామాయణంపై మాదానాయకుడు రాఘవీయం అనే వ్యాఖ్యానాన్ని రచించాడు.

కుమార సింగమ నాయకుడు / రెండో సింగముడు (క్రీ.శ.1384-1399)

     యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణ దుర్గాన్ని జయించి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు. మొదటి బుక్కరాయలను ఓడించి పానగల్లును జయించాడు. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందాడు. ఇతడి ఆస్థాన కవి విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి సాహిత్య శిల్పావధి అనే బిరుదు ఉంది.
 

 రెండో అనవోతుడు (క్రీ.శ.1399-1421)

       రెండో అనవోతా నాయకుడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షాకు సహాయం చేసి మొదటి దేవరాయల ఓటమికి కారకుడయ్యాడు. కానీ, బహమనీ సుల్తానులు రెడ్డి రాజులతో స్నేహం చేయడంతో మొదటి దేవరాయలకు సహాయపడి బహమనీలను ఓడించాడు. ఇతడి తర్వాత మాదానాయకుడు క్రీ.శ.1421 నుంచి 1430 వరకు పరిపాలించాడు.
 

సర్వజ్ఞసింగ/ మూడో సింగమ (క్రీ.శ. 1430-1475)

     రేచర్ల పద్మనాయక రాజుల్లో మూడో సింగమ చివరివాడు. కొన్ని ఆధారాల ప్రకారం సర్వజ్ఞసింగముడిని నాలుగో సింగముడిగా ప్రస్తావించారు. ఇతడు రసార్థవ సుధాకరం, సంగీత సుధాకరం అనే గ్రంథాలు; రత్న పాంచాలిక అనే నాటకాన్నీ రచించాడు. ప్రసిద్ధకవి బమ్మెర పోతన ఇతడి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. పోతన భోగినీ దండకం, వీరభద్ర విజయం, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, ఆంధ్ర భాగవతం గ్రంథాలు రచించాడు. 1475లో మూడో సింగమ గజపతులసేనాని తమ్మ భూపాలుడి చేతిలో మరణించాడు.

రెడ్డి రాజులు

కాకతీయుల పతనానంతరం సింహాచలం - విక్రమ సింహపురం (నెల్లూరు) మధ్య ఉండే తీరాంధ్ర దేశాన్ని రెడ్డిరాజులు పాలించారు. వీరిలో కొండవీటి రెడ్డిరాజులు, రాజమండ్రి రెడ్డి రాజులు అనే రెండు వంశాలు ఉన్నాయి. రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. వంశ మూలపురుషుడు మాత్రం కోమటి ప్రోలారెడ్డి.
 

రాజకీయ చరిత్ర

ప్రోలయ వేమారెడ్డి(1325 - 1353): ఇతడు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఒక నాయంకరుడిగా ఉండేవాడు. అనితల్లి అనే రెడ్డి రాణి వేయించిన కలువచేరు శాసనం ప్రకారం వేమారెడ్డి ముసునూరి కాపయ నాయకుడి కొలువులో ఉన్నట్లు తెలుస్తోంది. అద్దంకిని రాజధానిగా చేసుకుని కొండవీటి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. ఇతడి సోదరుడు మల్లయ్య రెడ్డి బహమనీ సుల్తానులను ఓడించి మోటుపల్లి రేవును స్వాధీనం చేసుకున్నాడు. మ్లేచోబ్ధి కుంభోద్భవ, ధర్మ ప్రతిష్టాన గరుడు అనేవి ప్రోలయ వేమారెడ్డి బిరుదులు. ఇతడు శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించాడు. ఎర్రాప్రగడ, శ్రీగిరి ప్రథమ కవులను పోషించాడు. శ్రీగిరి దేవయ్యకు మోగల్లు(పశ్చిమ గోదావరి)లో భూదానం చేశాడు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు, భవ్య చారితుడు బిరుదులు పొందిన ఎర్రన హరివంశం, నృసింహపురాణం గ్రంథాలు రచించాడు. శ్రీగిరి కవి నవనాద చరిత్రము అనే గ్రంథాన్ని రచించాడు. ప్రోలయ వేమారెడ్డి తన అన్న మాచారెడ్డిని చందోలు దుర్గానికి, తమ్ముడు మల్లారెడ్డిని కందుకూరుకు అధిపతులుగా నియమించాడు. మల్లారెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రోలయ వేమారెడ్డి 44 గ్రామాలను దానం చేసినట్లు తెలుస్తోంది. ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలంలో పాతాళగంగకు మెట్లు కట్టించడం 1346లో పూర్తయినట్లు ముట్లూరి శాసనం తెలుపుతోంది.

అనపోతారెడ్డి (క్రీ.శ. 1353-1364): అనవోతారెడ్డిగా కూడా పిలిచే ఇతడు ద్రాక్షారామ శాసనం వేయించాడు. అందులో ఇతడి బిరుదు ద్వీపజేత. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. అనవోతుడి మంత్రి మల్లయ్యవేమన. ఇతడు బహమనీ సుల్తాన్ దాడిని తిప్పికొట్టి అమరేశ్వర దేవాలయాన్ని పున:ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అనవోతుడి శాసనాలను రచించింది బాలసరస్వతి అనే కవి. ఇతడికి జగనొబ్బగండ అనే బిరుదు కూడా ఉంది. మంత్రి సోమయ్య మోటుపల్లిలో శాసనం వేయించాడు.


అనవేమారెడ్డి (క్రీ.శ.1364-1386): రెడ్డి రాజుల్లో సుప్రసిద్ధుడు అనవేమారెడ్డి. ఇతడి సైనిక విజయాలను శ్రీశైలం శిలాశాసనం తెలుపుతుంది. ఇతడికి దివిదుర్గ విశాల, సకల జలదుర్గసాధన, ఛురికాసహాయ, ప్రజాపరిచిత చతుర్విధోపాయ అనే బిరుదులు ఉన్నాయి. భక్తిరాజు కుమారుడైన ఛోడభీముడిని నిరవధ్యపురం అధిపతిగా నియమించాడు. అనవేముని కళింగ దండయాత్రను నిర్వహించింది అతడి బ్రాహ్మణ సేనాని - చెన్నమ నాయకుడు (సింహాచలం శాసనం). చెన్నమ వడ్డాది పాలకుడు. వీరార్జున దేవుడిని ఓడించి గొట్టివాడ గ్రామాన్ని సింహచలేశునికి దానం చేశాడు. అనవేముడి మంత్రులు - మామిడి పెద్దనామాత్యుడు, ఇమ్మడేంద్రుడు. అనవేముడు శ్రీశైలంలో వీరశిరోమండపాన్ని, సింహాచలంలో అనవేమపురి మండపాన్ని నిర్మించాడు. ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను జరిపి వసంత రాయలు అనే బిరుదు కూడా పొందాడు. విష్ణుపురాణం గ్రంథాన్ని రచించిన వెన్నెలకంటి సూరన ఇతడి సమకాలీకుడు.


కుమారగిరి రెడ్డి (1386-1402): ఇతడు అనపోతారెడ్డి కుమారుడు. రాజ్యం కోసం అనవేమారెడ్డి కుమారుడైన పెదకోమటి వేమారెడ్డితో కలహించాల్సి వచ్చింది. విజయనగర రాజులు శ్రీశైలం, త్రిపురాంతకాలను ఇతడి కాలంలోనే ఆక్రమించారు.

రెండో హరిహరరాయల సహాయంతోనే కుమారగిరి బావ కాటయవేమారెడ్డి రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ విజయనగర పాలకులు, పెదకోమటి వేమారెడ్డిల దండయాత్రల వల్ల కుమారగిరిరెడ్డి 1402లో కొండవీడును వదలి రాజమండ్రికి వచ్చాడు. అతడి మరణానంతరమే కాటయ రాజమండ్రిలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. కుమారగిరిరెడ్డి వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. కర్పూర వసంతరాయల అనే బిరుదు పొందాడు. ఇతడి ఆస్థాన నర్తకి లకుమాదేవి. కుమారగిరి వసంతోత్సవాలను అవచి తిరుమల/తిప్పయశెట్టి నిర్వహించినట్లు శ్రీనాథుని హరవిలాసం గ్రంథం తెలుపుతుంది. 1396లో బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా దండయాత్రను గజపతిరావు తిప్ప అనే కుమారగిరి సామంతుడు తిప్పికొట్టాడు. 1399లో గజపతుల దండయాత్రను దేవయసేనాని తిప్పికొట్టాడు. విజయనగర రాజులు, రెండో హరిహరరాయలు, మొదటి దేవరాయలు కూడా దాడిచేశారు. రెండో హరిహరుడి శాసనం యనమదలలో దేవరాయల శాసనాలు మార్కొండపాడు, పరుచూరులో లభించాయి.
 

పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ.1402-1420): ఇతడు కుమారగిరిరెడ్డిని తరిమివేసి కొండవీడుకు పాలకుడయ్యాడు. కాటయ వేమారెడ్డికి సహాయంగా రెండోహరిహరరాయలు చౌండప సేనాని పంపాడు. కాని పెదకోమటి వేముడి సేనాని గజరావు తిప్పన గుండుగొలను, కోనూరు (కానూరు- పశ్చిమ గోదావరి) యుద్ధాల్లో కాటయ వేముడిని ఓడించాడు. పెదకోమటి వేమారెడ్డి తన తమ్ముడు మాచారెడ్డిని కొండపల్లి పాలకుడిగా నియమించాడు. తర్వాత కాటయవేమారెడ్డి దేవరాయల సైన్యాన్ని అత్తిలి, కాకరపర్రు (పశ్చిమ గోదావరి) యుద్ధాల్లో పెదకోమటి అన్న దేవఛోడుడు (భక్తిరాజు కుమారుడు) కలిసి ఓడించాడు. పెదకోమటి వేమారెడ్డి మంత్రి మామిడి సింగన. ఫిరోజ్‌షా, పెదకోమటి వేమారెడ్డిల సంయుక్త సైన్యాన్ని అల్లాడరెడ్డి రామేశ్వరం (తూర్పు గోదావరి) యుద్ధంలో ఓడించినట్లు శివలీలా విలాసం (శివలెంక కొమ్మన) గ్రంథం తెలుపుతోంది. 1416లో మొదటి దేవరాయలు మోటుపల్లిలో అభయశాసనాన్ని వేయించాడు.

        పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి వామనభట్టబాణుడు. అతడి ఆస్థానంలో విద్యాధికారి శ్రీనాథుడు. ఇతడు శృంగార నైషథం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, పలనాటి వీరచరితం, శివరాత్రి మహాత్మ్యం... గ్రంథాలు రచించాడు. శ్రీనాథుడు తన శృంగార నైషథం గ్రంథాన్ని మామిడి సింగనకు అంకితం ఇచ్చాడు. ఇంకా హరవిలాసం, మరుత్తరాట్ చరిత్ర గ్రంథాలు కూడా రాశాడు. రాజమండ్రి రెడ్డిరాజైన వీరభద్రారెడ్డి శ్రీనాథుడిని ఆదరించాడు. శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థానకవి డిండిమభట్టును తన పాండిత్యంతో ఓడించాడు. రాయలు గండపెండేరం తొడిగి కవిసార్వభౌమ బిరుదు ఇచ్చాడు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సప్తశతి చరితిక అనే గ్రంథాలు రచించి సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు పొందాడు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక ఫిరంగిపురం వద్ద సంతాన సాగరం చెరువు తవ్వించింది. సంతాన సాగరం శాసనం రచయిత - శ్రీనాథుడు. ఇదే కాలంలో వెలమ రాజుల ఆస్థానంలోని పోతన ఆంధ్ర భాగవతాన్ని రచించాడు.
 

రాచవేమారెడ్డి (క్రీ.శ.1420 - క్రీ.శ.1424): కొండవీటిరెడ్డి రాజుల్లో చివరి పాలకుడు రాచవేమారెడ్డి. ఇతడు సూరాంబిక, పెదకోమటిల కుమారుడు. సూరాంబిక తవ్వించిన సంతాన సాగరం చెరువుకు జగనొబ్బగండ అనే కాలువను తవ్వించాడని అమీనాబాద్ శాసనం తెలుపుతోంది. పురిటి సుంకాన్ని విధించడంతో కోపోద్రేకుడైన సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేమారెడ్డిని అద్దంకి వీధిలో వధించాడు. ఈ విషయం కొండవీటి కైఫియత్(శాసనం) ద్వారా తెలుస్తోంది.

రాజమండ్రి రెడ్డి రాజులు

కాటయ వేమారెడ్డి (1402-1414)
     కొండవీటి రెడ్డిరాజైన కుమారగిరిరెడ్డి బావ కాటయ వేమారెడ్డి. కుమార‌గిరి రెడ్డి మరణానంతరం రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని కాటయ వేమారెడ్డి స్థాపించాడు. కాని గుండుగొలను యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డి, అన్నదేవచోడుల కూటమి చేతిలో పరాజయంపొంది మరణించాడు. కాటయ వేముడు కుమారగిరి రాజీయం అనే గ్రంథాన్ని రచించాడు.
 

రెండో కుమారగిరిరెడ్డి:
    కాటయవేమారెడ్డి రెండో కుమారుడు. ఇతడు బాలుడు కావడంతో కాటయ సేనాని అల్లాడరెడ్డి అధికారాన్ని చెలాయించేవాడు. ఇతడి కాలంలోనే అన్నదేవఛోడుడు పట్టిసం (పట్టిసీమ - పశ్చిమ గోదావరి) ను ఆక్రమించాడు. రెండో కుమారగిరిరెడ్డి 1416లో మరణించాడు.

 

అల్లాడరెడ్డి:
     రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని పటిష్టం చేశాడు. ఇతడు పలివెల, వేమవరం శాసనాలు వేయించాడు. ఇతడి సేనాని నరహరినీడు 'పాలకొల్లు' శాసనం (1416) వేయించాడు. అల్లాడరెడ్డి ధారానగరధీశుడైన ఆలఫ్‌ఖాన్‌ను ఓడించాడు. రామేశ్వర యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డిని ఓడించాడు. అల్లాడ‌రెడ్డి 1420 ప్రాంతంలో మరణించాడు. తర్వాత మూడో కుమారగిరిరెడ్డి, మూడో అనవోతారెడ్డి పాలించారు. కొమ్ము చిక్కాల శాసనం (1422) ప్రకారం మూడో అనవోతారెడ్డి రాజధాని రాజమండ్రి. 1420లో లాంగూల గజపతి (ఒరిస్సా) రాజమహేంద్రవరాన్ని ఆక్రమించాడు.

వీరభద్రారెడ్డి (1423-1448)
     వీరభద్రారెడ్డి, అతడి అన్న వేమారెడ్డి రాజ్యపాలన చేశారు. రెండో దేవరాయలతో స్నేహం చేసి గజపతుల, పద్మనాయకుల దండయాత్రలను ఎదుర్కొన్నారు. రెండో దేవరాయల సామంతుడైన తెలుంగరాయలు వేయించిన శాసనం సింహాచలంలో ఉంది. రెండోసారి రాయలు తన సేనాని మల్లప ఒడయార్‌ను సహాయంగా పంపాడు. మల్లప వేమారెడ్డి అనుమతితో ద్రాక్షారామంలో దానశాసనం వేయించాడు. కాని రెండో దేవరాయల మరణానంతరం కపిలేశ్వర గజపతి రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేశాడు.

 

దేవరకొండ లింగమనీడు
    వేమారెడ్డి, వీరభద్రారెడ్డిని ఓడించి రాజమహేంద్రాన్ని ఆక్రమించినట్లు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది.

 

కందుకూరు రెడ్డిరాజ్యం
     ప్రోలయ వేమారెడ్డి సోదరుడు ప్రోలయ మల్లారెడ్డి. ఇతడు అద్దంకి రాజ్యానికి (కొండవీడుకు) సర్వసైన్యాధ్యక్షుడు. మోటుపల్లిని జయించాడు. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించాడు. ఫలితంగా ప్రోలయ వేమారెడ్డి ఇతడిని బోయ విహారదేశంపై ప్రతినిధిగా నియమించాడు. కందుకూరు రాజధానిగా అతడి వారసులు రాజ్యపాలన చేశారు. మల్లారెడ్డి మనుమడు శ్రీగిరి కాలంలో రాజ్యం బలపడి విస్తరించింది. శ్రీగిరి వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చెరువులు తవ్వించాడు. తర్వాత ఈ రాజ్యాన్ని రెండో కోమటిరెడ్డి, మూడో కోమటిరెడ్డి (శ్రీగిరి కుమారుడు) పాలించారు. ఆ తర్వాత ఈ రాజ్యం విజయనగర రాజుల సామంత రాజ్యంగా మారిపోయింది.

యుగవిశేషాలు:

    రెడ్డి రాజ్య యుగాన్ని కాకతీయ యుగానికి అనుబంధ యుగంగా చెప్పవచ్చు. సాంప్రదాయక పాలనవిధానం ఉండేది. రాజు సర్వాధికారి. ప్రధాని, సేనాపతి, పురోహితుడు తోడ్పడేవారు. అత‌డికి యంత్రాంగంలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజ్యం సీమలు - నాయంకరాలు - గ్రామాలుగా విభజన చెంది ఉండేది. గ్రామపాలన ఆయగాండ్రు (12 మంది) చేసేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు. తలారినే ఆరెకుడు అనేవారు. న్యాయనిర్వహణలో దివ్యపరీక్షల ద్వారా నేర నిరూపణ జరిగేది. పంటలో 1/6వ‌ వంతు పన్ను వసూలు చేసినట్లు విలస తామ్రశాసనం తెలుపుతోంది. దేవబ్రాహ్మణ మాన్యాలపై పన్ను మినహాయింపు ఉండేది. దశబంధమాన్యాలను అనుభవించేవారు 1/10వ‌ వంతు నీటిసుంకం చెల్లించేవారు.
     రణముకుడుపు అనే ఆచారం పాటించేవారు. అంటే యుద్ధంలో చనిపోయినవారి రక్త, మాంసాలతో అన్నం వండి యుద్ధదేవతలకు నివేదనం చేసేవారు. రాజుల్ మత్తుల్, వారిసేవ నరకప్రాయంబు అన్నది - ధూర్జటి.
ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం ప్రధానవృత్తి. ప్రధాన ఆహారధాన్యం జొన్నలు. రెడ్డిరాజులు సంతాన సాగరం చెరువును తవ్విస్తే, వెలమలు అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగసముద్రం చెరువులను తవ్వించారు. నాటి పరిశ్రమల్లో అగ్రస్థానం వస్త్ర పరిశ్రమది. పలనాడు, వినుకొండ ప్రధాన కేంద్రాలు. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశక అనేక రకాల పట్టుబట్టలను పేర్కొంటుంది. పంచాణం వారు అంటే కమ్మరులు. నిర్మల్ కత్తులు ప్రసిద్ధి చెందినవి. నాడు విదేశీ వాణిజ్యంలో అత్యంత ప్రముఖుడు అవచితిప్పయ్య శెట్టి(కొండవీడు). కప్పలి, జోంగు, వల్లి, వలికా అనేవి నాటి నౌకా రకాలని శ్రీనాథుడి హరవిలాసం పేర్కొంటుంది. జోంగు అనేది చైనా నౌక. ప్రధాన వాణిజ్యపంట ద్రాక్ష. నాణెం - దీనార్.

మత పరిస్థితులు:
రెడ్డిరాజులు మొదట్లో శైవమతాన్ని అనుసరించారు. ప్రోలయ వేమారెడ్డి శైవుడే. కానీ కుమారగిరిరెడ్డి, కాటయవేమారెడ్డి వైష్ణవ మతాభిమానులు. రెడ్డిరాజుల కులదేవత మూలగూరమ్మ. స్మార్తవిధానం అగ్రవర్ణాల్లో ఉండేది. భక్తి ఉద్యమ ప్రభావం కనిపిస్తుంది. రణముకుడుపు ఆచారం ఉంది. తాంత్రికపూజా విధానాలు కూడా ఉండేవి. దైవంపేర ఆత్మార్పణ చేసినవారి గౌరవార్థం వారి ప్రతిమలున్న శిలలు (వీరకల్) నిలిపేవారు. శ్రీశైలంలో భృగుపాతం (కొండపైనుంచి దూకి మరణించడం) జరిపేవారని పండితారాధ్య చరిత్ర గ్రంథం పేర్కొంటుంది. త్రిపురాంతకం కేంద్రంగా ఘోడెరాయవంశం శైవమతాన్ని ప్రచారం చేసేది. వేమభూపాల చరిత్ర గ్రంథంలో వామన భట్టబాణుడు వింధ్యవాసినీ పూజను వివరించాడు. శ్రీరంగం కేంద్రంగా భట్టారు కుటుంబం వైష్ణవాన్ని ప్రచారం చేసేది. కోరుకొండ పాలకుడైన ముమ్మడి నాయకుడు తన గురువైన శ్రీరంగవర్థనుడు (ఏడో పరాశరభట్టు) మరణానంతరం కోరుకొండ నరసింహాలయాన్ని నిర్మించాడు.
  పద్మనాయక రాజైన సర్వజ్ఞసింగముని ఆస్థానంలో నైనాచార్యులు (వరదాచార్యులు) వైష్ణవాన్ని స్థాపించారు. సర్వజ్ఞసింగముని కోరిక మేరకు నైనాచార్యుడి తండ్రి అయిన వేదాంత దేశికుడు సుభాషిత నీతి, తత్త్వసందేశ, రహస్య సందేశ అనే గ్రంథాలు రచించాడు.   వైష్ణవం కూడా ప్రచారమైంది. ఆళ్వారులు నాల్లాయిర ప్రబంధం పేరుతో రచనలు చేశారు. రామానుజాచార్యులు శ్రీవైష్ణవాన్ని రూపొందించి దేవాలయాల్లో పంచముల ప్రవేశానికి అనుమతించాడు. తర్వాత శ్రీ వైష్ణవం తెంగల, వడగల శాఖలుగా చీలిపోయింది. వడగల శాఖకు నాయకుడు వేదాంత దేశికుడు. ఈ శాఖ వారు అహోబిలంలో మఠం నెలకొల్పి తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. పద్మనాయకుల ఆస్థానంలో శాకల్యమల్లు భట్టుకు పరాశర భట్టుకు మధ్య శైవ, వైష్ణవ వివాదం జరిగింది.

సమాజం:
చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యత, వర్ణవ్యవస్థ కఠినం, జూదం సర్వ సాధారణ వినోదం, బ్రాహ్మణుల్లో కూడా వేశ్యాలంపటత్వం మితిమీరినట్లు శివరాత్రి మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. వడ్డీ వ్యాపారులు అధిక మోసాలు చేసేవారు. శకునాలను ఎక్కువగా నమ్మేవారు. పంచాంగం ప్రాధాన్యం, నైతిక విలువలు తగ్గాయి.

 

విద్యా-సారసత్వాలు: సంస్కృతం రాజభాష. లలితకళలను కూడా పోషించారు. వసంతోత్సవాలు నిర్వహించేవారు. నటులు, గాయకులకు ప్రోత్సాహం లభించేది. గొండ్లి, జిక్కిణి, పేరిణి, చిందు లాంటి దేశీ నాట్యరీతులే కాకుండా పారశీక మత్తల్లి అనే విదేశీ నాట్యరీతులు అమల్లో ఉండేవి. పలురకాల వీణల గురించి కూడా పేర్కొన్నారు.
 

సంస్కృత భాష: ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి మహాదేవుడు సంస్కృత విద్వాంసుడు. అనవోత కాలంలో బాలసరస్వతి, అనవేమ కాలంలో త్రిలోచనాచార్యులు గొప్ప పండితులు. కుమారగిరి-వసంతరాజీయం, కాటయ వేమారెడ్డి- కుమారగిరి రాజీయం అనే గ్రంథాలు రచించారు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి రచించారు. పెదకోమటి వేముడి ఆస్థాన కవి వామనభట్ట బాణుడు. ఇతడు ఉషా పరిణయం, పార్వతీ పరిణయం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, వేమ భూపాల చరిత్ర, శబ్ద రత్నాకరం, చంబ్ద చంద్రిక అనే రచనలు చేశారు. కందుకూరు పాలకుడైన శివలింగారెడ్డి తత్వ ప్రకాశిక అనే వ్యాఖ్యానం రాశారు. (గిరీశశృతి సూక్తిమాల గ్రంథం- హరదత్తుడు). సాహిత్య, సంగీత, లక్ష్యలక్ష్మణ భంగీ సర్వజ్ఞుడిగా వీరభద్రారెడ్డి పేరొందాడు.
అనవోతుని ఆస్థానంలో ఉన్న నాగనాథకవి-మదన విలాసబాణం గ్రంథం రచించారు. రెండో సింగభూపాలుడు- రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరం, అనే రచనలు చేశారు.

 సారంగధరుని 'సంగీత రత్నాకరం'పై రాసిన వ్యాఖ్యానమే సంగీత సుధాకరం. సింగభూపాలుడి ఆస్థానంలో ఉన్న విశ్వేశ్వరుడు- చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించగా, మరొక కవి బొమ్మకంటి అప్పయార్యుడు- అమరకోశానికి వ్యాఖ్యానం రచించాడు. రేచర్ల సింగముని ఆస్థానంలో ఉన్న శాకల్యమల్లు భట్టు- నిరోష్ఠ్య రామాయణం, ఉదార రాఘవం, అవ్యయ సంగ్రహ నిఘంటువు అనే రచనలు చేశాడు.
 

తెలుగు భాష: దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన తొలి వ్యక్తి వినుకొండ వల్లభామాత్యుడు (క్రీడాభిరామం గ్రంథంలో). దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది శ్రీకృష్ణదేవరాయలే. కాంచీ మహాత్మ్యం గ్రంథాన్ని దగ్గుపల్లి దుగ్గన్న రచించారు. ఎర్రన- ఉత్తర హరివంశం గ్రంథాన్ని రచించి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రన తన చివరి రచన నృసింహ పురాణంలో ప్రబంధ శైలికి బీజం వేశాడు. శ్రీగిరికవి- నవనాథ చరిత్ర, విన్నకోట పెద్దన- కావ్యాలంకార చూడామణి రచించారు. విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి గ్రంథాన్ని చాళుక్య విశ్వేశ్వరుడికి అంకితం ఇచ్చాడు. శివలీలా విలాసం (విన్నకోట) దొడ్డారెడ్డి (అల్లాడరెడ్డి కుమారుడు)కి అంకితం చేశారు. మడికి సింగన- పద్మపురాణం గ్రంథాన్ని కందయామాత్యుడికి అంకితం ఇచ్చాడు. ఇంకా ఇతను వాశిష్ఠ రామాయణం, 'సకల నీటి సమ్మతం' గ్రంథాలను రచించాడు. కుమారగిరికి సమకాలీనుడైన వినుకొండ వల్లభామాత్యుడు మోపూరి (కడప జిల్లా) గ్రామాధికారి. ఇతడు రావిపాటి త్రిపురాంత కవి సంస్కృత రచన 'ప్రేమాభిరామం'ను తెలుగులో క్రీడాభిరామంగా అనువదించాడు. అనంతామాత్యుడనే కవి 'భోజ రాజీయం' గ్రంథాన్ని రచించారు. శ్రీనాథుడి తాత కమలనాభుడు కూడా 'పద్మపురాణం' గ్రంథాన్ని రచించాడు (ఏ భాషలోనో తెలియదు). దేవరకొండ పద్మనాయకరాజు పెదవేదగిరి ఆస్థానంలో కవి అయ్యలార్యుడు రామాయణ ఆంధ్రీకరణ పూర్తిచేశాడు. 
                      
సరస సాహిత్య లక్షణ చక్రవర్తి బిరుదు పొందిన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, లక్షణ దీపిక లాంటి రచనలు చేశారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించాడు. సర్వజ్ఞ సింగని ఆస్థానంలో ఉన్న పోతన అతడి కోరికపై భోగినీ దండకాన్ని రచించాడు. ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం గ్రంథాలను కూడా పోతన రచించాడు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌