• facebook
  • whatsapp
  • telegram

గుప్త యుగం

  గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.

గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.


శాసనాలు

మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.


సాహిత్యం

మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.


చివరి గుప్త చక్రవర్తులు

  మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.


పాలనా విశేషాలు

  గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.


రెవెన్యూ పాలన

  గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.

  భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.

ఆర్థిక విషయాలు

  గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.

  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.

సాంఘిక, మత పరిస్థితులు

  వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.

రాజకీయ చరిత్ర

గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.

  హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.

  ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.

నాణేలు

  గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌