ఉనికి
మనరాష్ట్రం భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో 12o.41', 19o.07' ఉత్తర అక్షాంశాలు, 76o.50', 84o.07' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తీర్ణం: 1,62,970 చ.కి.మీ విస్తీర్ణాన్ని కలిగి, మొత్తం దేశంలో 8.87 శాతం భూభాగాన్ని కలిగి, విస్తీర్ణపరంగా దేశంలో 7వ స్థానంలో ఉంది.
* రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 13. వీటిని 26కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2022, జనవరి 25న నోటిఫికేషన్ ఇచ్చింది.
* ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆగ్నేయ దిశలో, తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉంది.
* రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అనంతపురం. రెండో స్థానంలో కర్నూలు ఉంది.
* విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా శ్రీకాకుళం. రెండో స్థానంలో విజయనగరం ఉంది.
సరిహద్దులు:
తూర్పు - బంగాళాఖాతం
పడమర - కర్ణాటక
ఉత్తరం - ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ
దక్షిణం - తమిళనాడు
* 2014, జులై 17న ఖమ్మం జిల్లాకు (తెలంగాణ) చెందిన మొత్తం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్కు చెందిన 4 మండలాలను (చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం - రెవెన్యూ గ్రామం మినహా) తూర్పుగోదావరిలో జిల్లాలో, పాల్వంచ రెవెన్యూ డివిజన్ నుంచి 3 మండలాలను (కుక్కునూరు, వేలేరుపాడు,
బూర్గంపాడు) పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. వీటిని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుతో కలిపారు.
తీరరేఖ:
* రాష్ట్రానికి మొత్తం 974 కి.మీ. పొడవైన తీరరేఖ ఉంది.
* దేశంలో పొడవైన తీరరేఖను కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మొదటిది గుజరాత్.
* రాష్ట్రంలో పొడవైన తీరరేఖను కలిగిన జిల్లా శ్రీకాకుళం కాగా, తక్కువ తీరరేఖ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది.
* భారత ప్రామాణిక రేఖాంశమైన 82o . 30' తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదుగా వెళ్తుంది.
నైసర్గిక స్వరూపం
నైసర్గిక స్వరూపం అనేది ఒక ప్రాంత పద నిర్మాణ శాస్త్రంలో దాని మూలం, పరిణామ సమయం, భౌతిక అమరికతో వ్యవహరిస్తుంది. మనరాష్ట్రాన్ని ప్రధానంగా మూడు సహజ మండలాలుగా విభజిస్తారు. అవి:
1. పడమటి పీఠభూమి
2. తూర్పు కనుమలు
3. తీరమైదానం
పడమటి పీఠభూమి
* ఈ ప్రాంతం ప్రధానంగా గ్రానైట్, క్వార్ట్జ్, అతి పురాతన ఆర్కియన్నీస్, షిష్ట్ శిలలతో ఏర్పడింది.
* ఈ పీఠభూమికి ఉత్తర భాగంలో ఉన్న గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గోండ్వానా శిలలు ఉన్నాయి.
* రాయలసీమలోని అనంతపురం, నంద్యాల ప్రాంతాలు పడమటి పీఠభూమిలో అంతర్భాగంగా ఉన్నాయి.
* అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొంత భాగం మైసూరు పీఠభూమిలో అంతర్భాగంగా ఉన్నాయి.
* పడమటి పీఠభూమికి ఉత్తరాన ఉన్న గోండ్వానా శిలల్లో బొగ్గు లభిస్తుంది
తూర్పు కనుమలు
* తీరమైదానానికి, పడమటి పీఠభూమికి మధ్యలో ఉత్తర, దక్షిణంగా ఈ తూర్పు కనుమలు వ్యాపించి ఉన్నాయి.
* ఈ కనుమలు చార్నోకైట్, ఖొండలైట్ శిలలతో ఏర్పడ్డాయి.
* ఉత్తరాన ఉన్న తూర్పు కనుమలను ‘తూర్పుశ్రేణులు’ అని, దక్షిణాన ఉన్న తూర్పు కనుమలను ‘కడప శ్రేణులు’ అని అంటారు.
* వీటి సగటు ఎత్తు 915 మీటర్లు.
* తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తయిన శిఖరం ‘జిందగడ’ శిఖరం. ఇది విశాఖపట్నంలోని అరకులోయ వద్ద ఉంది. దీని ఎత్తు 1690 మీటర్లు.
* బోండా జాతి గిరిజనులు అరకు ప్రాంతంలోని కొండల్లో, దట్టమైన అడవుల్లో జీవిస్తున్నారు.
* చిత్తూరులోని ‘ఏనుగు ఎల్లమ్మ’ కొండ తూర్పు కనుమల్లోని వేసవి విడిది కేంద్రం. ఈ ప్రాంతాన్నే ‘హార్స్లీ హిల్స్’ అంటారు.
శాఖలు: కృష్ణానదికి దక్షిణంగా తూర్పు కనుమలకు రెండు శాఖలు ఉన్నాయి. అవి:
వెలుపలి శాఖ: ఇందులో నల్లమల కొండలు, వెలికొండలు ఉన్నాయి.
లోపలిశాఖ: ఇందులో ఎర్రమల కొండలు, శేషాచలం కొండలు, పాలకొండలు ఉన్నాయి. తూర్పు కనుమలు ఉత్తరాన 70 కి.మీ. పొడవు, 1200 మీటర్లు ఎత్తులో ఉన్నాయి.
* నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్లో దట్టమైన అడవులు.
* యారాడ కొండలు, డాల్ఫిన్ నోస్లు సముద్ర అలల తాకిడి నుంచి విశాఖ ఓడరేవును రక్షిస్తున్నాయి.
తీరమైదానం
* ఇది తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది.
* ఈ మైదానం చాలా వరకు నదులు తెచ్చిన ఒండ్రుమట్టి వల్ల ఏర్పడింది.
* ఇది ఉత్తరాన శ్రీకాకుళం దగ్గర ఉన్న మహేంద్రగిరి నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు వరకు విస్తరించి ఉంది. దీని పొడవు సుమారు 974 కి.మీ.
* ఈ తీరమైదానం ఉత్తర, దక్షిణ భాగాల్లో సన్నగా ఉంటుంది. మధ్య భాగంలో కృష్ణా - గోదావరి నదులు ఏర్పరచిన డెల్టాల వల్ల సుమారు 160 కి.మీ. వెడల్పుతో ఉంటుంది.
గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
* గోదావరి నదికి ఏడు పాయలు ఉన్నాయి. వాటిలో మొదటి రెండూ గౌతమి, వశిష్ట. వీటి మధ్య ఉన్న ప్రాంతమే ‘కోనసీమ’గా ప్రసిద్ధి చెందింది.
* ఈ ప్రాంతంలో కొబ్బరి, అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. దీన్నే ‘ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం’ (Garden of Andhra Pradesh) అంటారు.
తూర్పు తీరంలోని సరస్సులు
కొల్లేరు సరస్సు:
* కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం ‘కొల్లేరు సరస్సు’గా ఏర్పడింది.
* ఇది పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఏర్పడిన మంచి నీటి సరస్సు.
* దీని వైశాల్యం 245 చ.కి.మీ.
పులికాట్ సరస్సు:
* ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు, తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఉంది. సముద్ర నీరు తీరమైదానంలోకి చొచ్చుకు రావడం వల్ల ‘పులికాట్ సరస్సు’ ఏర్పడింది.
* ఇది ఉప్పు నీటి సరస్సు. దీని విస్తీర్ణం 460 చ.కి.మీ.
* ఈ సరస్సు అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది.
* 1976లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
శిలలు - రకాలు
* ఆంధ్రప్రదేశ్లోని దక్కన్ పీఠభూమిలో ఈ కింది శిలా స్వరూపాలు కనిపిస్తాయి. అవి:
1. దాద్వార్ శిలలు 2. కడప శిలలు 3. కర్నూలు శిలలు
4. గోండ్వానా శిలలు 5. దక్కన్ నాపలు 6. రాజమండ్రి శిలలు
దాద్వార్ శిలలు:
* ఇవి దేశంలోనే అతి ప్రాచీన శిలలు.
* వీటిని మొదట కర్ణాటకలోని దాద్వార్ ప్రాంతంలో కనుక్కున్నారు.
* ఈ శిలలు లావా విస్పోటనం వల్ల ఏర్పడ్డాయి.
* మనరాష్ట్రంలో ఈ రకమైన శిలలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో లభ్యమవుతున్నాయి.
* ఈ శిలల్లో ముడి ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆర్థికపరంగా చాలా ముఖ్యమైనవి.
కడప శిలలు:
* ఇవి దాద్వార్ శిలల అవశేషాల వల్ల ఏర్పడ్డాయి.
* కడప శిలల్లో సిమెంట్ గ్రేడ్, సున్నపురాయి నిల్వలు, రాతినార ఉంటాయి.
గోండ్వానా శిలలు:
* కృష్ణా, గోదావరి నదీ లోయల్లో ఈ శిలలు కనిపిస్తాయి.
*ఇవి ఎర్రటి ఇసుక రాళ్లను కలిగి ఉంటాయి.
*గోదావరి నది దిగువ భాగంలో ఉన్న బొగ్గు గనులు గోండ్వానా శిల రకానికి చెందినవే.
దక్కన్ నాపలు:
* ఇవి ఎక్కువగా ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లభ్యమవుతాయి.
* బసాల్ట్ శిలల రకానికి చెందిన ఇగ్నియస్ రాళ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి.
రాజమండ్రి శిలలు:
* సముద్రం ఉప్పొంగి ఇసుక, సున్నం, మట్టి అవక్షేపంగా మారడం వల్ల ఇవి ఏర్పడ్డాయి.
* ఈ శిలల్లో పెట్రోలియం, సహజ వాయువులు అధికంగా లభిస్తాయి.