• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - భౌగోళిక స్వరూపం

చారిత్రక నేపథ్యం 

* భారతదేశాన్ని పురాణాల్లో ‘జంబూద్వీపం’గా పేర్కొన్నారు. ‘భరతుడు’ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించి, అభి వృద్ధికి కారకుడయ్యాడు. ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని ‘భరతుడి దేశం’ (భారతదేశం) అని పిలుస్తున్నారు.

* భారతదేశానికి ఉత్తర, వాయవ్యంలో ప్రవహించే నది సింధునది, ఈ నదిని ఆంగ్లంలో "Indus" (ఇండస్‌) అని అంటారు.

* ఈ నది పేరు మీదుగా మన దేశానికి "ఇండియా"  అనే పేరు వచ్చింది.

* ఇండస్‌ నది పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను గ్రీకు దేశస్తులు ‘ఇండోయీలు’ అని పిలిచారు.

* ఇండోయీలను ఆంగ్లేయులు "ఇండియన్స్‌ అని పిలిచేవారు.

ఉనికి

  భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోనూ, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలోనూ ఉంది.

* భారతదేశం 8o.4'× నుంచి 37o.6' ఉత్తర అక్షాంశాలు, 68o.7' నుంచి 97o.25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

* భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణాన, హిందూ మహాసముద్రానికి ఎగువన (ఉత్తరం) ఉంది.

* భారతదేశం మీదుగా దాదాపు 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు వెళ్తున్నాయి.

విస్తీర్ణం

  భారతదేశ భూభాగ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ. ఉండగా, ప్రపంచంలోని పెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉంది.

* ప్రపంచంలో భూభాగ విస్తీర్ణంలో మనదేశం కంటే పెద్ద దేశాలు వరుసగా రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా.

* భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.42 శాతం విస్తరించి ఉంది.

రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు

  స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశాన్ని 562 సంస్థానాలుగా, 9 బ్రిటిష్‌ ప్రావిన్సులుగా విభజించి పరిపాలించారు.


* స్వాతంత్య్రానంతరం మన దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగింది.

State Reorganisation Act - 1956 (SRC Act):

  దేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కోసం 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎస్‌ఆర్‌సీని ఏర్పాటు చేశారు.

* SRC ని 1956లో పార్లమెంటు ఆమోదించింది.

* దీనిలోని సభ్యులు: ఫజల్‌ అలీ, కె.ఎం.ఫణిక్కర్, హృదయ్‌నాథ్‌ కుంజ్రు. దీనికి ఛైర్మన్‌గా ఫజల్‌ అలీ ఉన్నారు. అందుకే దీన్ని ఫజల్‌ అలీ కమిషన్‌ అని పిలుస్తారు.

* ఈ చట్టం ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

* భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

దేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాలు

* గోవా ఏర్పాటు - మే 30, 1987

* ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటు - నవంబరు 1, 2000

* ఉత్తరాఖండ్‌ ఏర్పాటు - నవంబరు 9, 2000

* ఝార్ఖండ్‌ ఏర్పాటు - నవంబరు 15, 2000

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - జూన్‌ 2, 2014

* ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పు


* జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని భారత పార్లమెంటు 2019, ఆగస్టులో చట్టం చేసింది. ఈ చట్టం ఆధారంగా రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అక్టోబరు 31, 2019న విభజించారు.

* డామన్‌ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాన్ని దాని పొరుగున ఉన్న మరో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీతో విలీనం చేయడానికి 2019లో చట్టం చేశారు. వీటిని విలీనం చేసిన రోజు జనవరి 26, 2020.

* జాతీయ రాజధాని హోదా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దిల్లీ.

* రెండు రాష్ట్రాలకు (పంజాబ్, హరియాణా) ఉమ్మడి రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌. 

భూభాగ విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రాలు

రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్,  తమిళనాడు, తెలంగాణ

భూభాగ విస్తీర్ణంపరంగా చిన్న రాష్ట్రాలు 

గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం

భారతదేశం మధ్యగా వెళ్లే అక్షాంశం


* 23 1/2o ఉత్తర అక్షాంశ రేఖ అయిన కర్కటరేఖ భారతదేశం మధ్యగా వెళ్తుంది.

* కర్కటరేఖ భారతదేశంలో సుమారు 2678 కి.మీ. దూరంతో 8 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. అవి: పడమర నుంచి తూర్పునకు వరుసగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబంగా, త్రిపుర, మిజోరం

* కర్కటరేఖ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్‌.

భారత ప్రామాణిక కాలరేఖ (రేఖాంశం)


* 82 1/2o తూర్పు రేఖాంశం దాదాపుగా భారతదేశం మధ్యగా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంది.

* 82 1/2o తూర్పు రేఖాంశాన్ని దేశ ప్రామాణిక కాలరేఖగా గుర్తించారు.

* భారత కాలమానం గ్రీనిచ్‌ కాలమానం కంటే 5 1/2 గంటలు ముందు ఉంటుంది.

* 82 1/2o తూర్పు రేఖాంశం మన దేశంలో 5 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. 

అవి: 1) ఉత్తర్‌ ప్రదేశ్, 2) మధ్యప్రదేశ్, 3) ఛత్తీస్‌గఢ్,   4) ఒడిశా  5) ఆంధ్రప్రదేశ్‌.

* ఛత్తీస్‌గఢ్‌లోని ‘బైకుంఠాపూర్‌’ వద్ద కర్కటరేఖ, భారత ప్రామాణిక కాలరేఖలు ఖండించుకుంటాయి.

* భారత ప్రామాణిక కాలరేఖ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పట్టణాల మీదుగా వెళ్తుంది.

* భారతదేశంలో మొదటిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌.

* దేశంలో తూర్పు, పడమర చివరి ప్రాంతాల మధ్య సమయ వ్యత్యాసం 2 గంటలు.

భారతదేశపు చివరి ప్రాంతాలు

* తూర్పు చిట్టచివరి ప్రాంతం - అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ద్వీపూ కనుమ.

* పడమర చిట్టచివరి ప్రాంతం - గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌.

* ఉత్తరాన చిట్టచివరి ప్రాంతం - ఇందిరాకాల్‌. ఇది కారాకోరం శ్రేణిలోని కిలికి దావన్‌ కనుమల్లో ఉంది.'

* దక్షిణాన ప్రధాన భూభాగ చిట్టచివరి ప్రాంతం - తమిళనాడులోని కన్యాకుమారి.

* భారతదేశ దక్షిణ చివరికొన - ఇందిరా పాయింట్‌ లేదా పిగ్మేలియన్‌ పాయింట్‌. ఇది గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఉంది.

భూపరివేష్టిత రాష్ట్రాలు (Land Locked States)

  ఇతర దేశాలతో భూభాగం సరిహద్దు, సముద్రతీరం లేని రాష్ట్రాలను ‘‘భూపరివేష్టిత రాష్ట్రాలు’’ అంటారు.

* మనదేశంలో అయిదు భూపరివేష్టిత రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హరియాణా, తెలంగాణ.

కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, చండీగఢ్‌.

కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు

1) లద్దాఖ్‌ - వేసవిలో లేహ్‌ (Leh), శీతాకాలంలో   కార్గిల్‌

2) జమ్మూ-కశ్మీర్‌ - వేసవిలో శ్రీనగర్, శీతాకాలంలో  జమ్మూ

3) అండమాన్‌ నికోబార్‌ దీవులు - పోర్టుబ్లెయిర్‌

4) దిల్లీ - న్యూదిల్లీ

5) దాద్రానగర్‌ హవేలీ & డామన్‌ డయ్యూ - డామన్‌

6) పుదుచ్చేరి - పుదుచ్చేరి

7) చండీగఢ్‌ - చండీగఢ్‌

8) లక్షదీవులు - కవరత్తి

భూభాగ సరిహద్దు - పొరుగు దేశాలు

  భారతదేశానికి మొత్తం 15,200 కి.మీ.ల పొడవైన భూభాగపు సరిహద్దు ఉంది. ఈ సరిహద్దును దేశంలోని 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 7 దేశాలతో కలిసి పంచుకుంటున్నాయి.

* బంగ్లాదేశ్‌: మనదేశంతో పొడవైన భూభాగ సరిహద్దును కలిగిన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ (4096 కి.మీ)

* బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు అయిదు - పశ్చిమ బంగా, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం.

* ఈ దేశంతో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం - పశ్చిమ బంగా.

* చైనా: చైనాతో సుమారు 3916 కి.మీ.సరిహద్దును కలిగి ఉంది. దీనితో సరిహద్దు కలిగి ఉన్న భారత రాష్ట్రాలు నాలుగు. హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌.

* చైనాతో భారత్‌ భూభాగ సరిహద్దును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం - లద్దాఖ్‌

* పాకిస్థాన్‌: బంగ్లాదేశ్, చైనాల తర్వాత పొడవైన సరిహద్దు కలిగిన పొరుగుదేశం పాకిస్థాన్‌.

* పాకిస్థాన్‌ మనదేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి సుమారు 3300 కి.మీ. సరిహద్దు కలిగి ఉంది.

* పాకిస్థాన్‌తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు 

గుజరాత్, రాజస్థాన్‌ (పొడవైన సరిహద్దు), పంజాబ్, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌.

* నేపాల్‌: నేపాల్‌ భారతదేశంతో సుమారు 1752 కి.మీ. దూరం సరిహద్దు కలిగి ఉంది.

* నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న భారత రాష్ట్రాలు అయిదు. అవి: ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బంగా, సిక్కిం.

* నేపాల్‌తో పొడవైన సరిహద్దు కలిగిన భారతదేశ రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌.

* మయన్మార్‌: భారతదేశంతో సుమారు 1458 కి.మీ. భూసరిహద్దు కలిగి ఉంది.

* మయన్మార్‌తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు నాలుగు. అవి: అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం.

* మయన్మార్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌.

* భూటాన్‌: భూటాన్‌ భారతదేశంతో సుమారు 598 కి.మీ. పొడవైన సరిహద్దును కలిగి ఉంది.

* ఈ దేశంతో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు నాలుగు. సిక్కిం, పశ్చిమ బంగా, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌

* భూటాన్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అసోం.

* ఆఫ్ఘనిస్థాన్‌: భారతదేశంతో అతి తక్కువ భూభాగ సరిహద్దును కలిగిన దేశం ఆఫ్ఘనిస్థాన్‌.

* కేవలం 80 కి.మీ. పొడవైన సరిహద్దును కలిగి ఉంది.

* ఈ దేశంతో సరిహద్దును కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌

* మూడువైపులా మూడు దేశాలతో సరిహద్దు కలిగిన భారతదేశపు రాష్ట్రాలు - సిక్కిం, పశ్చిమ బంగా, అరుణాచల్‌ ప్రదేశ్‌.

* సముద్రతీర రేఖను, పొరుగు దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు రెండు. గుజరాత్, పశ్చిమ బంగా.

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌