* 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చెంది, రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.
* ఆంధ్రప్రదేశ్ను ఇలా పునర్వ్యవస్థీకరించడానికి అనేక కారణాలున్నాయి.
* ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉద్యమించారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది.
* కేంద్రం 1953, డిసెంబరు 29న సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్ (ఎస్ఆర్సీ)ను ఏర్పాటు చేసింది. అందులో కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎన్.కుంజ్రూ సభ్యులుగా ఉన్నారు.
* ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారతదేశంలో ఎ, బి, సి, డి రాష్ట్రాలు రద్దయ్యి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
* పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికి హైదరాబాద్ను రాజధానిగా చేశారు. ఇది దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించింది.
* దిల్లీలోని హైదరాబాద్ భవన్ (ప్రస్తుత ఆంధ్రాభవన్)లో కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రా నాయకులు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, సర్దార్ గౌతులచ్చన్నలు సంతకాలు చేయగా; తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, జె.వి.నరసింగరావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి సంతకాలు చేశారు.
* ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణవారికి 14 హామీలు కల్పించారు. అయితే అవి అమలు కాలేదు. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలూ చేపట్టలేదు.
* వీటి కారణంగా 1968, 1969 సంవత్సరాల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతూ ఉద్యమం మొదలైంది.
* 1975 నుంచి తెలంగాణ ప్రజల్లో విభజన ఆకాంక్ష ఉంది.
* 2009లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.
శ్రీకృష్ణ కమిటీ
* ఈ కమిటీ 2010, ఫిబ్రవరి 3న ఏర్పాటైంది.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులను పరిశీలిస్తూ, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్షను సమీక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా కొనసాగించాలా? లేదా? అని నిర్ణయించడం శ్రీకృష్ణ కమిటీ ముఖ్య ఉద్దేశం.
కమిటీ ఛైర్మన్, సభ్యులు:
* ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్మన్గా ఉన్నారు.
* మాజీ ఐఏఎస్ అధికారి వినోద్కుమార్ దుగ్గల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు.
సభ్యులు: ప్రొఫెసర్ రణ్బీర్సింగ్ (జాతీయ న్యాయ కళాశాల - దిల్లీ, వైస్ ఛాన్సలర్); డాక్టర్ అబుసలేషరీఫ్ (సీనియర్ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధన సంస్థ - దిల్లీ); ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ కౌర్ - సాంఘికశాస్త్ర విభాగం - ఐఐటీ దిల్లీ.
* 2010, డిసెంబరు 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కమిటీ నివేదికలోని ముఖ్యమైన సూచనలు:
* కేంద్రం జోక్యం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలను సవాలుగా తీసుకుని వివిధ వర్గాలకు ప్రభుత్వంలో చోటు కల్పిస్తూ, ఉద్యమ తీవ్రతను తగ్గిస్తూ విభజన జరగకుండా యథాతథ స్థితిని కొనసాగించడం.
* రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విడదీసి; హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. విడిపోయిన రెండు రాష్ట్రాలకు సొంత రాజధానులను ఏర్పాటు చేయడం.
* రాష్ట్రాన్ని రాయల - తెలంగాణ, కోస్తాంధ్రగా విడదీయడం. హైదరాబాద్ను రాయల-తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగంగా ఉంచడం.
* రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విడదీయడం. హైదరాబాద్ను తెలంగాణకు రాజధానిగా చేసి, సీమాంధ్రకు మరో కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం.
* రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, అదే సమయంలో తెలంగాణ ప్రాంత సామాజిక ఆర్థికాభివృద్ధికి, మరింత ఉన్నతికి కొన్ని రాజ్యాంగపరమైన/ చట్టబద్ధమైన చర్యలు చేపట్టడం. చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ - ముఖ్యాంశాలు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటన:
* హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలతో తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లు 2013, జులై 30న సీడబ్ల్యూసీ ప్రకటించింది.
ఆంటోని కమిటీ:
* అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని అధ్యక్షుడిగా విభజన కమిటీ ఏర్పడింది. దిగ్విజయ్సింగ్, వీరప్పమొయిలీ, అహ్మద్పటేల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
* ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది.
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం):
* 2013, అక్టోబరు 8న అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎ.కె.ఆంటోని ఛైర్మన్గా, కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే (హోంశాఖ), చిదంబరం (ఆర్థికశాఖ), వీరప్పమొయిలీ (పెట్రోలియంశాఖ), జైరాంరమేష్ (గ్రామీణాభివృద్ధిశాఖ) గులాంనబీ ఆజాద్ (ఆరోగ్యశాఖ); ప్రత్యేక ఆహ్వానితుడిగా వి.నారాయణస్వామి సభ్యులుగా జీవోఎం ఏర్పడింది.
* ఈ కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పార్టీలను కోరింది.
* భాజపా, కాంగ్రెస్, తెరాస, సీపీఐ, ఎంఐఎంలు తమ సూచనలతో కూడిన నివేదికను మంత్రుల బృందానికి అందించాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఎంలు నివేదిక ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునర్విభజన బిల్లు:
* 2013, డిసెంబరు 16న రాష్ట్ర శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు2013’పై చర్చ జరిగింది.
* ఈ బిల్లును తిరస్కరించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన నోటీసు ఆధారంగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
* 2014, జనవరి 30న మూజువాణి ఓటుతో సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
* రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి. తిరస్కరించి వెనక్కి పంపే అధికారం, హక్కు దానికి లేదు. ఓటింగ్కు కూడా అవకాశం లేదు.
* విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ఇచ్చిన గడువు 2014, జనవరి 30న ముగిసింది.
* 2013, డిసెంబరు 16న పునర్విభజన బిల్లును శాసనసభలో చర్చకు పెట్టినట్లు, బిల్లులోని క్లాజులపై 9072 సవరణలు ప్రతిపాదించినట్లు, ఒక అధికారిక రికార్డును సభ అభిప్రాయంగా రాష్ట్రపతికి పంపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బిల్లు:
* పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.
పార్లమెంట్లో పునర్విభజన బిల్లు
* 2014, ఫిబ్రవరి 14న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
* దీనిపై 2014, ఫిబ్రవరి 18న చర్చ జరిగింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు.
* 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ‘బిల్ ఈజ్ పాస్డ్’ అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజన అంకం ముగిసింది.
* 2014, మార్చి 1న ఈ విభజన బిల్లుపై భారత రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2014, జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.