• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి - వనరులు

20వ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ సమాజం ప్రజల ఆకాంక్షలు, కోరికలను ప్రతిబింబించే విధంగా నడవాలనుకుంది. దీనికోసం ముఖ్యంగా శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ఎంచుకుంది. అయితే 1950వ దశకంలో అమెరికా వ్యవసాయసాగులో అవలంబించిన విధానాలు ఈ గమ్యానికి ఆటంకాన్ని కలిగించాయి. అగ్రరాజ్యం విరివిగా డీడీటీ (డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ఈథేన్‌) క్రిమిసంహారక మందును వినియోగించడంతో అధిక సంఖ్యలో జీవులు మరణించి పర్యావరణానికి విఘాతం కలిగింది. ఈ వినాశనాన్ని 1962లో రెచెల్‌ కార్సన్‌ (అమెరికా) ‘నిశ్శబ్ద వసంతం (సైలెంట్‌ స్ప్రింగ్‌)’ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ఇందులో ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి మధ్య గల వైరుధ్యాన్ని తెలియజేశాడు. దీంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. పర్యావరణాన్ని నిలకడ గల అభివృద్ధి ద్వారా సాధించాలనే ఉద్దేశంతో సుస్థిరాభివృద్ధి వెలుగులోకి వచ్చింది.

సుస్థిరాభివృద్ధికి మూలం
 

సుస్థిరత్వం అనే పదం మొదట 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఐరోపా అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ఒక ప్రక్రియ. ఆనాటి యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదక శక్తులుగా ఉండేవి. అక్కడ అటవీ సంపద తరిగిపోయినా తిరిగి ఆ ప్రాంతంలో మొక్కలను నాటి అడవులను సంరక్షించేవారు. భావితరాలకు అడవుల క్షీణత ఉండకూడదనే సంకల్పమే సుస్థిరత్వ అభివృద్ధికి దారితీసింది.
 

సుస్థిరాభివృద్ధి అంటే? 


పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణాన్ని విలీనం చేస్తారు. అంటే ప్రజల ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భావితరాల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి కొనసాగించడాన్నే సుస్థిరాభివృద్ధి అంటారు. దీన్నే నిలకడ గల లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తారు.
 

సుస్థిరాభివృద్ధి భావన


* 1972లో జరిగిన స్టాక్‌హోం ప్రపంచ మానవ పర్యావరణ సదస్సులో సుస్థిరత్వం అనే పదాన్ని ఉపయోగించారు. 1980లో ‘ప్రకృతి, సహజ వనరుల రక్షణ అంతర్జాతీయ సంఘం’ (IUCNNR - International Union for the Conservation of Nature and Natural Resources) మొదట సుస్థిరాభివృద్ధి అనే భావనను తెలియజేసింది.
* 1987లో గ్రొహర్లెమ్‌ బ్రుంట్‌లాండ్‌ అధ్యక్షతన జరిగిన ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం (WCED - The World Commisson on Environment and Development) లో ‘మన ఉమ్మడి ప్రణాళిక’ నివేదికలో సుస్థిరత్వం అనే పదానికి అర్థాన్ని తెలియజేశారు.

* సుస్థిరత్వం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అవి: 1) అవసరాలు - వనరుల పంపిణీలో సంబంధాన్ని కలిగి ఉండాలి
     2) అభివృద్ధి - సామాజిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదలను సూచించాలి.
     3) భవిష్యత్తు - రాబోయే తరాలకు స్థిరత్వాన్ని ఇవ్వాలి. 
* 1992 జూన్‌లో రియో - డి - జెనిరో (బ్రెజిల్‌)లో జరిగిన పృథ్వీ సదస్సులో ఐక్యరాజ్య సమితి ‘ఎజెండా - 21’ అనే ప్రపంచ ప్రణాళిక ద్వారా సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి దోహదపడే విధంగా ప్రణాళికలను రూపొందించింది.
* 2002లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌ బర్గ్‌ సదస్సులో మొదటి సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని నిర్వహించి సుస్థిరత్వం అనే భావనను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.
 

సుస్థిరాభివృద్ధి భాగాలు

* కొనసాగించగలిగే అభివృద్ధిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగిన స్వతంత్రమైన అంశాలు. ఇవి ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల మధ్య సమతూకాన్ని సాధించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.

సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యత 


ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. 2005 - 2015 కాలాన్ని సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దంగా ప్రకటించింది.

సుస్థిరత్వం - సహస్రాభివృద్ధి లక్ష్యాలు 


2000 సెప్టెంబరు 20 - 22 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి న్యూయార్క్‌ సాధారణ సభలో మిలీనియం డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో ఎనిమిది లక్ష్యాలు ఉన్నాయి. వీటిని 2015 సెప్టెంబరు 25 నాటికి సాధించాలని నిర్ణయించింది.


1) ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలి
2) ప్రాథమిక విద్యను అందించాలి
3) శిశు మరణాల సంఖ్యను తగ్గించాలి
4) ప్రసూతి ఆరోగ్యాన్ని పెంచాలి
5) వ్యాధులను నివారించాలి
6) పర్యావరణంతో కూడిన సుస్థిరాభివృద్ధి
7) లింగ సమానత్వం, మహిళా సాధికారిత
8) అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతిదేశం భాగస్వామ్యం కావాలి

ఐక్యరాజ్యసమితి - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 


2015 సెప్టెంబరు 25 నుంచి 27 వరకు జరిగిన న్యూయార్క్‌ సర్వ ప్రతినిధుల సభలో ఐక్యరాజ్య సమితి 2015 - 2030 కాలానికిగాను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీర్మానించి ప్రకటించింది. వీటిని ప్రపంచ దేశాలు 2030 వరకు సాధించాలి. వీటిలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి.
 

లక్ష్యాలు


1) పేదరికాన్ని నిర్మూలించడం.
2) ఆకలిని పారద్రోలి, ఆహార భద్రతను సాధించడం.
3) మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడం.
4) సమ్మిళిత, సమానత్వంతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం.
5) లింగపరమైన సమానత్వం, స్త్రీల సాధికారతను సాధించడం.
6) తాగునీరు, పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం.
7) శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.
8) అందరికీ పూర్తిస్థాయి ఉత్పాదక, ఉద్యోగితను కల్పించడం.
9) పారిశ్రామికీకరణ, నవకల్పనను ప్రోత్సహించడం.
10) ప్రపంచ దేశాల మధ్య అసమానతలను తగ్గించడం.
11) పట్టణాలు, మానవ ఆవాసాలు సురక్షితంగా ఉండేలా చేయడం.
12) ఉత్పత్తి నమూనాలు, వినియోగం అందుబాటులోకి తేవడం.
13) వాతావరణ మార్పులను అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టడం.
14) సముద్ర వనరులను పరిరక్షించడం.
15) జీవావరణాన్ని పరిరక్షిస్తూ అడవుల రక్షణ, ఎడారికీకరణ, నేల క్షీణతను అరికట్టడం.
16) అందరికీ న్యాయం, శాంతి అందుబాటులోకి తేవడం.
17) అభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాలను భాగస్వామ్యం చేయడం.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌