ప్రపంచంలో సుమారు పదివేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైందని శాస్త్రజ్ఞుల అంచనా. పూర్వం ఆసియా, యూరప్, మధ్య ఇరాక్ - టర్కీ దేశాల్లో సుమేరియా కాలంలో బార్లీ, గోధుమ పంటలను పండించేవారు. ఇవే మొదటి అటవీ ఉత్పత్తులు. మన దేశంలో 2500 ఏళ్ల కిందట కాంస్యయుగం సింధూలోయ నాగరికత కాలంలో పూర్వపు రాజస్థాన్లోని కాలీబంగన్ ప్రాంతంలో మొదటిసారిగా వ్యవసాయం చేసినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి.
2018 జాతీయ వ్యవసాయ గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 54% ప్రజలు, 50% కిపైగా శ్రామికశక్తి వ్యవసాయ రంగంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రంగం దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో 17% వాటా కలిగి ఉంది. భారత్ 328.73 మిలియన్ హెక్టార్ల భౌగోళిక వైశాల్యంతో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. వ్యవసాయ భూమి పరంగా ప్రపంచంలో 11% వాటాతో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశ వైశాల్యంలో నికర వ్యవసాయ భూమి 198.36 మిలియన్ హెక్టార్లు ఉండగా (60%) 157.82 మిలియన్ హెక్టార్ల (48%) భూమి సాగవుతోంది. దీనిలో స్థూల నీటి పారుదల వైశాల్యం 96.46 మిలియన్ హెక్టార్లు (29%), నికర నీటిపారుదల వైశాల్యం 68.38 మిలియన్ హెక్టార్లు (20%). విస్తార వ్యవసాయ భూమిని కలిగినప్పటికీ భారతదేశం వ్యవసాయంలో వెనుకబడి ఉంది. కరవుకాటకాలు సంభవించడం, నీటిపారుదల వసతులు లేకపోవడం, శాస్త్రీయ విధానంపై అవగాహనలేమి, నిరక్షరాస్యత దీనికి ప్రధాన కారణాలు.
భూకమతాలు
ఒక కుటుంబం సగటున ఎంత భూభాగాన్ని కలిగి ఉందో తెలియజేయడాన్ని భూకమతం అంటారు. మన దేశంలో అయిదేళ్లకోసారి కేంద్ర వ్యవసాయ, పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహణలో వ్యవసాయ భూకమతాల లెక్కలు చేపడతారు. దేశంలో మొదట 1970-71లో భూకమతాల లెక్కలు సేకరించారు. 2015-16 సంవత్సరానికిగానూ కేంద్ర వ్యవసాయ, పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018 అక్టోబరు 1న పదో జాతీయ వ్యవసాయ భూకమతాల గణాంకాలను విడుదల చేసింది.
ఈ గణాంకాల ప్రకారం...
* దేశంలో మొత్తం భూకమతదారులు 2010-11లో 138.35 మిలియన్లు ఉండగా, 2015-16లో 146.45 మిలియన్లకు (5.86%) పెరిగారు.
* దేశ మొత్తం వైశాల్యంలో భూకమతాల సాగు వైశాల్యం 2010-11లో 159.59 మిలియన్ హెక్టార్లు ఉండగా, 2015-16లో 157.82 మిలియన్ హెక్టార్లతో 1.11% తగ్గింది.
* దేశంలో భూకమతదారులు ఉత్తరప్రదేశ్ (23.82 మిలియన్లు)లో అత్యధికంగా ఉన్నారు. తర్వాతి స్థానంలో బిహార్ (16.41 మి.), మహారాష్ట్ర (15.29 మి.) ఉన్నాయి. సిక్కింలో అత్యల్పంగా 72 వేలమంది, గోవాలో 75 వేలమంది, మిజోరాంలో 90 వేల మంది భూకమతదారులు ఉన్నారు.
* భూకమతాల వైశాల్యం అత్యధికంగా రాజస్థాన్ (20.87 మి.హె.), మహారాష్ట్ర (20.51 మి.హె.), ఉత్తరప్రదేశ్ (17.45 మి.హె.) లలో ఉండగా, అత్యల్పంగా గోవా (82 వేల హెక్టార్లు), సిక్కిం (91 వేల హెక్టార్లు), మిజోరాం (112 వేల హెక్టార్లు) లలో ఉంది.
* అత్యధికంగా భూకమతదారులు పెరిగిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ (12.74%), ఆంధ్రప్రదేశ్ (11.85%), మహారాష్ట్ర (11.58%), రాజస్థాన్ (11.12%). దేశంలో సగటు భూకమతాల పరిమాణం 2010-11లో 1.15 హెక్టార్లు ఉంటే, 2015-16 లో 1.08 హెక్టార్లు ఉంది. సగటు భూకమతాల పరిమాణం మేఘాలయలో అత్యధికంగా ఉండగా, కేరళలో అత్యల్పంగా ఉంది.
భూకమతదారులను అయిదు గ్రూపులుగా వర్గీకరిస్తారు
1) ఉపాంతదారులు (Margined) - 1 హెక్టారు లేదా 2.5 ఎకరాలు
2) చిన్న కమతదారులు (Small) - 2 హెక్టార్లలోపు లేదా 5 ఎకరాలు
3) సన్న/ఉపమధ్యకమతదారులు (Semi - Medium) - 4 హెక్టార్లలోపు లేదా 10 ఎకరాలు
4) మధ్య కమతదారులు (Medium) - 10 హెక్టార్లలోపు లేదా 25 ఎకరాలు
5) పెద్ద కమతదారులు (Large) - 10 హెక్టార్ల కంటే ఎక్కువ లేదా 25 ఎకరాల కంటే ఎక్కువ
2015-16 ప్రకారం సామాజిక వర్గాల వారీగా....
భూకమతదారుల సంఖ్య : షెడ్యూల్డ్ కులాలు 11.84%, షెడ్యూల్డ్ తెగలు 8.65%, సంస్థాగతమైనవి 0.18%, ఇతర వర్గాలు 79.33%.
భూకమతాల వైశాల్యం
షెడ్యూల్డ్ కులాలు 8.54%, షెడ్యూల్డ్ తెగలు 11.27%, సంస్థాగత మైనవి 0.98%, ఇతర వర్గాలు 79.21%.
2015-16 ప్రకారం మొత్తం భూకమతదారుల్లో ఉపాంతదారులు 68.45%, చిన్న కమతదారులు 17.62%, ఉప మధ్యకమత దారులు 9.55%, మధ్యకమతదారులు 3.80%, పెద్ద కమతదారులు 0.57% ఉన్నారు.
********************
వ్యవసాయం రకాలు
ప్రస్తుతం మనదేశంలో రెండు రకాల వ్యవసాయాలు అమల్లో ఉన్నాయి. అవి:
1. జీవనాధార వ్యవసాయం
2. వాణిజ్య వ్యవసాయం
జీవనాధార వ్యవసాయం
ఇందులో రెండు రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి.
1. సాధారణ జీవనాధార వ్యవసాయం (Simple subsistence farming)
2. సాంద్ర జీవనాధార వ్యవసాయం (Intensive subsistence farming)
సాధారణ జీవనాధార వ్యవసాయం:
* ఇది చిన్నకమతాలతో ఉంటుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. పార, గుల్లకర్ర లాంటి పురాతన పనిముట్లనే ఇందులో ఉపయోగిస్తారు.
* దీన్నే పోడు వ్యవసాయం, నరకు-కాల్చు వ్యవసాయం అని కూడా అంటారు.
* ఈ రకమైన వ్యవసాయంలో పంటల పెరుగుదల రుతుపవనాలు, భూమిలోని పోషక పదార్థాలపై ఆధారపడి ఉంటుంది.
సాంద్ర జీవనాధార వ్యవసాయం:
* అధిక జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవసాయం అమల్లో ఉంది.
*ఈ విధానంలో వ్యవసాయ శ్రామికులు, జీవ రసాయనిక ఎరువుల వాడకం, నీటి పారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉండాలి.
వాణిజ్య వ్యవసాయం
ఈ విధానంలో అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
* అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక - తెగులు నివారణ మందులను ఈ వ్యవసాయ విధానంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
* దీని విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది.
ఉదా: హరియాణా, పంజాబ్లలో వరి వాణిజ్య పంట కాగా, ఒడిశాలో జీవనాధార పంట.
భారతదేశం - ప్రధాన పంటలు
మనదేశంలో అనేక రకాలైన మృత్తికలు, శీతోష్ణస్థితులు, వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. దీని వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన ఆహార, ఆహారేతర పంటలు పండిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి:
ఆహార పంటలు
వరి: మనదేశంలో ఎక్కువ మంది తీసుకునే ముఖ్య ఆహారం వరి.
* ప్రపంచంలో చైనా తర్వాత భారత్లోనే వరిని అత్యధికంగా పండిస్తున్నారు.
* భారతదేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్యప్రాంత మైదానాలు, తీరప్రాంతాలు, డెల్టాప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
* IR8, 12RO, 1001, 1010, మసూరి, బాసుమతి, జయ, పద్మ మొదలైనవి భారతదేశంలో పండించే వరి రకాలు.
గోధుమ: వరి తర్వాత ఎక్కువగా సాగు చేసే ముఖ్యమైన తృణధాన్యం గోధుమ.
* ఇది రబీకాలపు ప్రధాన పంట. దీన్నే ‘శీతాకాలపు పంట’ అని అంటారు.
* ఇది ఉత్తర, వాయవ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట.
* మనదేశంలో గోధుమ పండే రెండు ముఖ్యమైన ప్రాంతాలు:
1. గంగా-సట్లెజ్ మైదాన ప్రాంతం
2. దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం
మొక్కజొన్న: దీన్ని ఆహారంగా, పశువుల దాణాలో ఉపయోగిస్తారు.
* ఈ పంటకు పురాతన ఒండ్రు (బంగర్) అత్యంత అనుకూలం.
చిరుధాన్యాలు: జొన్న, సజ్జ, రాగులు భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు.
* వీటిని ‘ముతక ధాన్యాలు’ అని కూడా అంటారు.
* వీటిలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి.
* ప్రపంచంలో జొన్న ఉత్పత్తి, విస్తీర్ణంలో భారత్ మూడో స్థానంలో ఉంది.
* భారతదేశంలో హరిత విప్లవాన్ని 1960లో మొదట చిరుధాన్యాలపై ప్రయోగించారు.
పప్పుధాన్యాలు: ప్రపంచవ్యాప్తంగా పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది.
* కందులు, మినుములు, పెసలు, బఠాణి, సెనగలు మొదలైనవి మనదేశంలో పండే ముఖ్యమైన పప్పుధాన్యాలు.
* ఈ మొక్కలన్నీ లెగ్యూమినేసి కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నేలలో ప్రతిష్ఠాపన చేసి భూసారాన్ని పెంచుతాయి.
* సాధారణంగా వీటిని పంటల మధ్యలో మార్పిడి పంటగా సాగు చేస్తారు.
ధాన్యేతర పంటలు: సాధారణంగా ఈ పంటలను అధిక లాభార్జన కోసం పండిస్తారు.
చెరకు: దీన్ని సంవత్సర కాలపు పంట అంటారు.
* బ్రెజిల్ తర్వాత చెరకును అధికంగా పండిస్తున్న దేశం భారత్.
* నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం.
* ఈ పంట ఆయన, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లో పండుతుంది.
* చెరకు నుంచి చక్కెర, బెల్లం, ఖండసారి, మొలాసిస్ మొదలైన ఉత్పత్తులు లభిస్తాయి.
నూనె గింజలు: ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా పండిస్తున్న దేశం భారత్.
* దేశవ్యాప్తంగా పంట విస్తీర్ణంలో నూనెగింజల వాటా 12 శాతంగా ఉంది.
* వీటిని ప్రధానంగా వంటనూనెలుగా ఉపయోగిస్తారు.
* అవిసెలు, ఆవాలు, నువ్వులు, ఆముదాలు, వేరుసెనగ మనదేశంలో పండే ముఖ్యమైన నూనె గింజ పంటలు. ఖరీఫ్లో పెరిగే వేరుసెనగ దేశంలోని మొత్తం నూనెగింజల్లో సగభాగాన్ని ఆక్రమిస్తుంది.
తేయాకు: బ్రిటిష్ వారు దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు.
* తేయాకు పంటకు వెచ్చటి, ఆర్ధ్ర శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం అవసరం.
* తరచుగా పడే వర్షపు జల్లులు నాణ్యమైన తేయాకుకు అనుకూలం.
* శుద్ధి చేసే ప్రక్రియలో తాజాదనాన్ని కోల్పోకుండా ఉండేందుకు తేయాకును తోటలోనే శుభ్రం చేస్తారు.
కాఫీ: ప్రపంచంలో నాణ్యమైన కాఫీ పంటకు భారతదేశం ప్రసిద్ధి.
* ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% ఇక్కడే పండుతోంది.
* ప్రారంభంలో యెమెన్ నుంచి తెచ్చిన ‘అరబికా’ కాఫీ మొక్కనే దేశవ్యాప్తంగా పండిస్తున్నారు.
* కర్ణాటకలోని బాబా బుడాన్ కొండలు, తమిళనాడులోని నీలగిరి పర్వతాలు కాఫీ పంటకు ప్రసిద్ధి.
ఉద్యానవన పంటలు
* పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
* ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% ఇక్కడే పండుతున్నాయి.